Thursday, March 24, 2016

'ది హిందూ' ఎడిటర్ ముకుంద్; సాక్షికి ఎనిమిదేళ్ళు...

కుటుంబ కలహాలతో జనాలకు పిచ్చెక్కిస్తూ... జర్నలిజాన్ని పలచన చేస్తున్న 'ది హిందూ' లో మరొక ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. ఇప్పటి వరకూ 'బిజినెస్ లైన్' ఎడిటర్ గా ఉన్న ముకుంద్ పద్మనాభన్ ను 'ది హిందూ' ఎడిటర్ గా నియమిస్తూ కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్ బోర్డు మార్చి 23 న నిర్ణయం తీసుకుంది.  అదే సమయంలో 'బిజినెస్ లైన్' బాధ్యతలు రాఘవన్ శ్రీనివాసన్ కు అప్పగించింది.  అదే పత్రికలో ఇప్పటివరకూ రాఘవన్ అసోసియేట్ ఎడిటర్ గా ఉన్నారు. 
గోల్ఫ్ ఆట పట్ల మక్కువ చూపే పద్మనాభన్ (పక్కన ఫోటో) 'ది హిందూ' లో 15 సంవత్సరాల కిందట చేరి పత్రికలో పలు మార్పులు చేర్పుల కారణంగా ఇప్పుడు ఈ ఉన్నత పదవికి ఎంపికయ్యారు.  ఫిలాసఫీ లో ఎం ఫిల్ చేసిన పద్మనాభన్ చెన్నై, డిల్లీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లలో విద్యాభ్యాసం చేశారు. డిల్లీ యూనివెర్సిటీ లో లెక్చరర్ గా కొద్ది రోజులు పనిచేసి జర్నలిజంవైపు మళ్ళారు. అమృత్ బజార్ పత్రిక వారి 'సండే' లో, ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో అంతకు ముందు ఆయన పనిచేసారు.  ఎన్ రామ్, మాలినీ పార్థసారథి, ఎన్ రవి లతో పాటు పదకొండు మంది ఆ కుటుంబ సభ్యులే కాక ముగ్గురు బైటి వాళ్ళతో (రాజీవ్ లోచన్, వినిత బాలి, మహాలింగం) కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్ బోర్డు ఏర్పడింది. కుటుంబ కలహాల వల్ల కావచ్చు... జనవరి లో ఎడిటర్ పదవికి  మాలినీ పార్థసారథి రాజీనామా చేశాక.. నేషనల్ పేజీల ఎడిటర్ సురేశ్ నంబత్ పత్రిక ఎడిటోరియల్ వ్యవహారాలూ చూస్తూ వచ్చారు. 

ఇదిలా ఉండగా, ప్రముఖ తెలుగు దినపత్రిక  'సాక్షి' కి ఎనిమిదేళ్ళు నిండాయి. ఈ సందర్భంగా.. పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారు 'మీ ఆదరణే ఊపిరిగా...' అంటూ మొదటి పేజీలో ఒక సంతకంతో కూడిన ఎడిటోరియల్ ప్రచురించారు. ఎందుకో గానీ... అది అంత రుచికరంగా లేదు. పొగరుబోతు ఆంబోతులా 'ఈనాడు' తెగ రెచ్చిపోతున్న సమయంలో పుట్టిన 'సాక్షి' జర్నలిజం లో నాణ్యతా ప్రమాణాలు పాటించిందా? లేదా? అన్న ప్రశ్నను పక్కన పెడితే... డబ్బులున్న ఈ పత్రిక మూలంగా జర్నలిస్టుల జీవితాల్లో పెను మార్పులు వచ్చాయి. ముఖ్యంగా, అప్పటిదాకా... పెద్దగా ఆదరణకు నోచుకోని రెడ్డి జర్నలిస్టులు... పెద్ద పదవులు తద్వారా నాలుగు పైసలు సంపాదించడానికి ఇది ఎంతో దోహదపడింది. ఇది మామూలు విషయం కాదు. 'సాక్షి' మరిన్ని రోజులు... మరింత ఉత్తేజంతో ఉరకలు వేయాలని... 'ఈనాడు' దూకుడుకు కళ్ళెం వేస్తూనే జర్నలిస్టులకు మంచి మేళ్ళు చేయాలని కోరుకుందాం.