Saturday, December 25, 2021

బన్నీ యాచ్చన్ తప్ప 'పుష్ప'విలాపమే గదా సామీ!

 కుటుంబ సమేతంగా చూడాలని ఇన్ని రోజులు ఆగి నలుగురం కలిసి నిన్న రాత్రి ఏడు గంటల షో కు కూకట్ పల్లి లోని సుజనా మాల్ లో 'పుష్ప' కు వెళ్లాం. హౌస్ ఫుల్లయ్యింది. 'వూ అంటావా, వుఊ అంటావా.. ' అని పక్క సీట్లో యువకుడు హమ్ చేస్తూ కూర్చున్నాడు. సినిమా విడుదలకు ముందే మొత్తం పాట జనాల నోటికి వచ్చేట్టు మార్కెట్టింగ్ బాగా చేస్తున్నారీ మధ్య కాలంలో.   

సూపర్ గా ఉన్న అల్లు అర్జున్ (పుష్పరాజ్) యాక్షన్ కు ఫుల్లు మార్క్స్ ఇచ్చి తీరాల్సిందే. కొత్త గెటప్ లో చూట్టానికి బాగున్న బన్నీ చాలా బాగా నటించాడు. ప్రతి ఫ్రేమ్ లో అబ్బాయి కళ్ళు భలే షార్ప్ గా చూపించారు. మహేష్ బాబుకు ఇచ్చినా ఇంత పవర్ఫుల్ గా చేయగలిగే వారు కాదేమో! మాజీ లెక్కల సార్ సుకుమార్ మంచి దర్శకత్వం, కెమెరా వర్క్, కమెడియన్-కం-హీరో సునీల్ (మంగళం శీను) కొత్త గెటప్ మినహా మిగిలినదంతా పుష్పలో ఉత్తతీతే. సాగపీకాలన్న ఆలోచన ఆలస్యంగా వచ్చి ఆ గుండు ఐ పీ ఎస్ ఫహాద్ ఫాజిల్ (భన్వర్సింగ్ షెకావత్) తో రంగప్రవేశం చేయించి కామిడీ పండించాలని విఫల ప్రయత్నం చేసిన పార్ట్ -1 ను గబ్బుపట్టించారు. 

పుష్ప కు భీకరమైన హైప్ ఇచ్చింది.. బన్నీ-సుకుమార్ కాంబినేషన్ తోపాటు నిస్సందేహంగా అక్కినేని ఇంటివారి మాజీ కోడలు, తెలుగువారి 'నెక్స్ట్ డోర్ గాళ్' సమంత చేసిన ఐటం సాంగ్. తనను తొక్కిపెట్టిన వారి మీద కసితో ఆమె మగబుద్ధిని ఎత్తిపొడిచే ఈ సాంగ్ చేశారని జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఏది ఏమైనా, ఈ మధ్య వస్తున్న తెలుగు సినిమాల్లో వస్తున్న బూతుతో పోల్చుకుంటే ఇందులో బూతు తక్కువన్నట్టే. పాటలో పదాలు పవర్ఫుల్ గా ఉన్నాయ్. మంగ్లీ చెల్లి కి బ్రేక్ వచ్చింది. రష్మిక ఒంపు సొంపులను మాటిమాటికీ చూపించి విసిగించారు. మేక-పీక పాట తో పాటు ఇతర పాటలు ఓకే ఓకే. కథ కోసం 'పుష్ప- ది రైజ్' మీద వచ్చిన సమీక్ష చదవండి. 

నాకు ఈ సినిమాతో రెండు సమస్యలున్నాయి. 

ఒకటి, నేరమైన ఎర్ర చందనం స్మగ్లింగ్ ను బాగా గ్లామరైజ్ చేయడం. ముంబాయ్ డాన్ భాయ్ ల మీద కూడా సినిమాలు వచ్చాయి కానీ ఆ నేరాలను ఇంతగా గ్లామరైజ్ చేసి చూపలేదు. సమస్య కోణాలను చూపడం వేరు, సమస్య కారకులను ఘనంగా చూపడం వేరు. కేవలం స్మగ్లింగ్  గ్యాంగ్ లను, సిండికేట్ లను, అందులో ముదిరిపోయిన ఒకడ్ని కేంద్రంగా చేసుకుని పుష్ప ను మండించారు. ఈ సినిమా విడుదలకు మూడు రోజుల ముందు ఎర్ర చందనం నేర సామ్రాజ్యం మీద పరిశోధనాత్మక జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి (ఈనాడు, డెక్కన్ క్రానికల్ పత్రికల్లో మంచి పేరు సాధించిన అయన ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఎడిటర్- ఇన్వెస్టిగేషన్స్ గా ఉన్నారు) రాసిన పుస్తకాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్ వీ రమణ విడుదల చేశారు. ఎన్డీ టీవీ సీనియర్ మోస్ట్ రిపోర్టర్ ఉమా సుధీర్ ప్రయోక్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. ఎంతో అమూల్యమైన ఈ వృక్ష సంపదను కొల్ల గొడుతూ కోట్లు గడిస్తున్న జాతీయ, అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ ల గురించి ఉడుముల వివరిస్తే అవాక్కయ్యాను. శేషాచలం అడవుల నుంచి వేల కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనం ఎందరో చేతులు తడుపుతూ విదేశాలకు తరలిపోతున్నదని సాక్ష్యాలతో సహా ఈ పుస్తకంలో విశదీకరించారు. ఈ ఘోరమైన నేరం పట్ల చీఫ్ జస్టిస్ కూడా ఆందోళన వ్యక్తంచేస్తూ స్థానికుల భాగస్వామ్యంతో దీన్ని నివారించాలని కూడా సూచించారు. ఇలాంటి నేరానికి పాల్పడుతున్న పుష్ప లాంటి వాళ్ళ ఘోర కృత్యాలను అద్భుతమైన ఘన కార్యక్రమంగా చూపడం బాధ్యతాయుతమైన పనిగా అనిపించుకోదని నా అభిప్రాయం. పార్ట్-2 లో పుష్ప ను మారిన జనం నేతగానో గానో, ఎర్రచందనం చెట్లను కాపాడే వాడిగానో చూపవచ్చు గానీ ప్రస్తుతానికి మాత్రం క్రిమినల్ గ్లామరైజేషన్ అస్సలు బాగోలేదు. 

రెండు, పోలీసులను మరీ లంచగొండ్లుగా చిత్రీకరించడం. సినిమా స్టార్టింగ్ లోనే పుష్ప తనను పట్టుకున్న పోలీసులకు బేరం పెడుతూనే  చావచితక కొడతాడు. మనిషికో లక్ష ఇచ్చేసరికి ఖాకీలు ఖుషీ అయి వదిలేస్తారు. డీఎస్పీ గోవిందప్ప (హరీష్ ఉత్తమన్) బృందాన్ని ఎర్రిపప్పలుగా చూపించారు. చివర్లో వచ్చిన ఐ పీ ఎస్ షేఖావట్ ను పచ్చి లంచగొండిగా చూపించారు. పుష్ప లాంటి కరుడుకట్టిన క్రిమినల్ తో మిలాఖత్ కావడం, తనతో ఒంటరిగా కూర్చుని అయన మందుకొట్టడం, వాడు ఇప్పమంటే చొక్కా-ప్యాంట్ ఇప్పి వెళ్లిపోవడం చాలా కృతకంగా బోరింగ్ గా అనిపించాయి. పాఠాలు చెప్పే టీచర్లను, శాంతి భద్రతలను కాపాడే పోలీసులను మరీ చులకన చేయడం అత్యంత ప్రభావశీలమైన సినిమా మాధ్యమాన్ని డీల్ చేస్తున్నవారికి తగని పని. 

చివరగా, రెండు చిన్న పరిశీలనలు. సుక్కు గారూ... అప్పుడే నీళ్ల నుంచి బైటికి తీసిన డబ్బు బ్యాగ్ నుంచి కొన్నైనా నీటి బొట్లు రాలతాయి గదా సార్! అట్లానే, బుల్లెట్ దిగిన అరచేయి నుంచి రక్తం ఒక్క క్షణం మాత్రమే కారి ఆరిపోతుందా? 

ఎందుకు సామీ... జనాల చెవిలో ఇట్లా పుస్పాలు పెట్టేసినారు? 

Tuesday, December 21, 2021

36 ఏళ్ళ తర్వాత ఒక సుమధుర ఆత్మీయ సమ్మేళనం!

 కనుచూపుమేర విస్తరించి కనువిందు కలిగించే పెద్ద చెరువు. 

దాన్ని ఆనుకుని విశాలమైన క్రీడా మైదానం.  

ఆ మైదానానికి ఇటువైపు పచ్చని చెట్ల మధ్యన తాటాకు పాకలతో పాఠశాల. 

ప్రజ్ఞావంతులైన టీచర్లు.. హుషారైన మిత్రులు.

ఆటలు...పాటలు... ఎస్ ఎఫ్ ఐ - పీ డీ ఎస్ యు రాజకీయాలు.

ఏడాదిలో రెండు సార్లు కాలేజ్ ఫంక్షన్లు, అందుకోసం పోటీలు, బహుమతులు, నాటికలు.  

 'జీజేసీ వైరా' అనగానే మది పొరల్లో పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తూ చిన్ననాటి మధురానుభూతులకు తెరతీసే తీపి జ్ఞాపకాలివీ.

1984-85 విద్యా సంవత్సరంలో ఈ స్కూల్ పదో తరగతి చదివిన విద్యార్థులం డిసెంబర్ 19, 2021 నాడు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కలుసుకున్నాం. 36 ఏళ్ల తర్వాత నిక్కర్ బ్యాచ్ బాల్యమిత్రులను చూడడం, మాట్లాడడం, చిన్నప్పటి విషయాలు గుర్తుకుతెచ్చుకోవడం, ఇక కాంటాక్ట్ లో ఉండి తీరాలని అనుకోవడం, కలిసి అక్కడే తిని వచ్చేయడం మంచి అనుభూతి మిగిల్చాయి. 

Group photo of 1984-85 tenth class students of GJC Wyra

నాకు చిన్నప్పుడు ఈ విశాలమైన క్రీడా మైదానమే ఒక సువిశాల విశ్వం. అక్కడ చదివిన నాలుగేళ్లు అదే నా వేదిక. అక్కడి బాడ్మింటన్ కోర్టు, నాటికలు వేయడానికి ఉన్న వేదిక నా ప్రపంచం. ప్రతి సంవత్సరం జరిగే బాడ్మింటన్, వ్యాస రచన, వక్తృత్వం, నాటికల పోటీల్లో కచ్చితంగా ఏదో ఒక బహుమతి వచ్చేది. వైరాలో స్కూల్ లో బాల్ బాడ్మింటన్ తో పాటు ఇంటి దగ్గర ఒక బాల్ బాడ్మింటన్, ఇంకో షటిల్ బాడ్మింటన్ కోర్టు వేసి ఆడేవాళ్ళం. మా నాన్నగారు, అన్నయ్య, తమ్ముడు కూడా ఆడేవారు. అదొక అద్భుతమైన మజా. కొత్తగూడెం రామచంద్ర కాలేజీలో చదివేటప్పుడు ఇండోర్ షటిల్ బాడ్మింటన్ ఆడి ఇంటర్ కాలేజియేట్ ఛాంపియన్స్ అయ్యామంటే, యూనివర్సిటీ జట్టుకు ఎంపిక అయ్యామంటే దానికి పునాది పడింది వైరా మైదానంలో. అందుకే వైరా గ్రౌండ్ కు గుండె లోతుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం. 'ఆటలను నమ్ముకుంటే జీవితం కష్టం. మంచి ఉద్యోగం రావాలంటే చదవాలి....' అని వైరా పీ ఈ టీ మల్లయ్య గారు దివ్యోపదేశం చేయడం బాగానే ఉపకరించింది. జీవితంలో జర్నలిస్టుగా ఈనాడు, ది హిందూ పత్రికల్లో రాటుదేలి, జర్నలిజంలో డాక్టోరల్ డిగ్రీ తో టీచింగ్ లో ఉన్న నాకు అయన మాటలు ఎప్పుడూ గుర్తు ఉంటాయి. ఇప్పటికే టేబుల్ టెన్నిస్ లో అంతర్జాతీయ స్థాయికి చేరుకొని ఒలింపిక్స్ ధ్యేయంగా కృషి చేస్తున్న నా పుత్రరత్నం స్నేహిత్ తో చేస్తున్న ప్రయోగం మల్లయ్య సార్ కు చెప్పాలని ఉండేది. వారి గురించి తెలియదు. స్కూల్ లో రామస్వామి గారనే ఫిజికల్ డైరెక్టర్ బాల్ బాడ్మింటన్ లో స్పిన్ షాట్ కొడితే బంతి కోర్టు బైటి నుంచి కోర్టులోకి షేన్ వార్న్ స్పిన్ మాయాజాలాన్ని తలపించేలా సుడులు తిరుగుతూ వెళ్ళేది. 

తెలుగు సార్ కొంపెల్ల కృష్ణమూర్తి గారు, ఇంగ్లిష్ సార్ డీ పీ రంగారావు గారు, సోషల్ స్టడీస్ సార్ హరినాథ్ గారు నాకు గుర్తు. బాగా సనాతన సంప్రదాయవాది అయిన కృష్ణమూర్తి గారు తనను తాకనిచ్చేవారు కాదు. పొరపాటున ఆయన్ను ఎవరైనా తగిలితే బాగా కోప్పడేవారు. అయితే అయన బోధనా సామర్ధ్యం అద్భుతమైనది. ఇక డీపీ రంగారావు గారు మా సొంత ఊరు గొల్లపూడి వాస్తవ్యులు. అయన ఎందుకో క్లాసులో మా తాత ప్రస్తావన తెచ్చి ఈపును గుభికీ గుభికీ మనిపించేవారు. ఈయన పీడ విరగడ కావాలని నేను బాగా కోరుకునేవాడిని. నేను నయం, అయన ఆగ్రహానికి, పిడిగుద్దులకు బలైనప్పటికీ అనేక మంది ఆయన్ను ప్రేమగానే గుర్తుకుతెచ్చుకున్నారు మొన్న కలిసినప్పుడు. హరినాథ్ గారు నన్ను 'చదువరి' అని పిలిచే వారు. సెక్షన్-ఏ లో చెప్పిన సోషల్ నోట్స్ ను సెక్షన్-బీ లో నాచేత చదివించేవారు. కానీ ముగ్గురూ కాలం చేసారు. మా ఇంట్లో ఉండి నాతో పాటు వైరాలో టెన్త్ చదివిన ఇంగువ మురళి ఒక పదేళ్ల కిందట కన్నుమూశాడు. మా బ్యాచ్ మిత్రుడు ఎస్ శ్రీను కూడా చనిపోయాడని తెలిసి బాధేసింది. వారి ఆత్మకు శాంతి కలుగుగాక! రాధాకృష్ణ మూర్తిగారు అనే సార్ కూడా ఉండేవారు.  

I have taken a selfie with Ramesh, Govardhan and Jani Basha in front of the then school

ముగ్గురు సార్లకు (Suri garu, Pulla Rao garu, Satyanarayana garu)ఈ సందర్భంగా సన్మానం చేశారు. నేను పేర్కొన్న ముగ్గురు తప్ప మిగిలిన టీచర్స్ నాకు పెద్దగా గుర్తులేరు. కానీ అప్పటి మిత్రులు మాత్రం బాగా గుర్తు. బాగా సౌమ్యుడైన జానీ బాషా, ఆల్ రౌండర్ అయిన డీ రమేష్, మంచి మిత్రుడు రాజశేఖర్, సమాజం పట్ల అవగాహన-బాధ్యతతో ఉన్న సంగమేశ్వర్ రావు, నా బాడ్మింటన్ దోస్తు గోవర్ధన్, నాతో నాటికలు వేసిన ఎస్ శ్రీను, ప్రత్యేకించి తీసుకున్న రూమ్ లో వయసుకు మించిన విషయాలు బోధించిన బాలస్వామి, చలాకీగా ఉండిన రాం మోహన్, నర్సింహారావు, బీ వీ నాకు గుర్తు. మేము కొందరం పీ డీ ఎస్ యూ లో పనిచేసేవారం. మా నాయకుడు ఆనందరావు అనే మంచి యువకుడు. మాకు సమ సమాజ స్థాపన కోసం ఎన్నో మాటలు చెప్పిన ఆయన పిరికివాడిలాగా తాను ఆత్మహత్య చేసుకోవడంతో నాకు ఈ ఉద్యమం మీదనే విరక్తి వచ్చి వదిలేశాను. 

Rajasekhar with Sangameswar and Malla Reddy

మా ఊరు అబ్బాయి, మొదటినుంచీ కష్ట జీవి అయిన నూకల వాసు నాకు రెబ్బవరం స్కూల్ లోనే తెలుసు. మొన్నటి రీ యూనియన్ సందర్భంగా తన ఇంటికి ఆహ్వానించి పెసరట్టు, ఉప్మా పెట్టాడు. ఇప్పుడు టీచింగ్ వృత్తిలో ఉన్న రాం మోహన్, శ్రీధర్ సూర్యదేవర తదితర మిత్రుల మూలంగా ఈ పూర్వ విద్యార్థుల కలయిక  సాధ్యమయ్యింది. స్థానికంగా ఉన్న వారంతా చాలా కష్టపడ్డారు. మాతో కలిసి చదివిన స్థానికుల్లో ఒకరైన బొర్రా రాజశేఖర్ రాజకీయాల్లో ఉండడం విశేషం. అయన ఇప్పుడు మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. మంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన రాజాకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని అనిపించింది.  

Rammohan with our batchmates

నేను ఎలాగైనా కలవాలని కష్టపడి కాంటాక్ట్ చేసిన వారిలో ముఖ్యులు జానీబాషా, రాజశేఖర్, సంగమేశ్వర్, రమేష్. దాదాపు 13 ఏళ్లపాటు ప్రజల చైతన్యం కోసం పూర్తి స్థాయిలో పనిచేసి, ప్రస్తుతం గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్న జానీబాషాను నేను ఒక నాలుగేళ్ల కిందటనే కలిసాను హైదరాబాద్ లో. జీవితాతం కలిసి నడవాల్సిన మంచి సన్మిత్రుడు జానీ. మేకప్ పాండు గారి కుమారుడు రాజశేఖర్, నేను కలిసి స్కూల్ కు వెళ్లే వాళ్ళం. సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న ఆయన రోజుకొక మొక్క నాటుతూ 'ప్రకృతి ప్రేమికుడు' అన్న మాటను నిజం చేసుకుంటున్నాడు. రెండేళ్ల కిందట టచ్ లోకి వచ్చాం. స్థానికంగా జర్నలిజంలో చేరిన సంగమేశ్వర్ ను కూడా మూడేళ్ళ కిందట కలిసాను మధిరలో. అద్భుతమైన ప్రతిభాపాటవాలు ఉన్న తను కొన్ని కారణాల రీత్యా అక్కడే ఉండిపోవడ, నాకు బాధ కలిగించింది. క్రమశిక్షణ కు మారు పేరైన రమేష్ ఇప్పుడు కాప్ జెమిని లో డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు. ఈ రీ యూనియన్ సందర్భంగా రాజశేఖర్ తన నంబర్ ఇస్తే... నేను చాలా సేపు మాట్లాడాను. రమేష్, జానీ, నేను హైదరాబాద్ నుంచి వైరా పోతూ, మళ్ళీ వస్తూ కారులో చేసిన ప్రయాణం, మాట్లాడుకున్న మాటలు మమ్మల్ను టెన్త్ రోజులకు తీసుకుపోయాయి.      

కరోనా వల్ల ఎందరో మంచి మిత్రులను, సన్నిహితులను కోల్పోయిన మాకు ఏడాది చివరిలో జరిగిన ఈ 'ఆత్మీయ సమ్మేళనం' నూతనోత్తేజాన్ని ఇచ్చిందనడంలో సందేహం లేదు. అప్పట్లో కలిసి ఉన్న కాలేజ్, స్కూల్ ఇప్పుడు అదే కాంపస్ లో రెండుగా అయ్యాయి. దాంతో, విశాల ప్రాంగణం అనిపించకుండా పోయింది. దీన్ని సుందరీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెలలో ఒకసారైనా అక్కడకు వెళ్లి పిల్లలకు ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంశాల్లో పాఠాలు చెప్పాలని ఉంది.