Friday, June 28, 2013

జానీ జానీ... ఎస్.. పప్పా: మీడియా సీన్ ఇదిరబ్బా...

Johnny Johnny...Yes Papa!

Job in Media...Yes Papa!

Lot of Tension...Yes Papa!

Family Life...No Papa!

BP, Sugar...Yes Papa!


Yearly Bonus...Joke Papa!

Annual Pay...Low Papa!


Personal Life--Lost Papa!

Compromise with Life...a Lot Papa!


Promotion, Incentive...Ha Ha Ha

(Due thanks to my dear brother G.Ramesh for forwarding this sms)

Wednesday, June 26, 2013

పసుపు పచ్చ ప్రెస్ అంటే ఇదేనేమో....

తెలుగు ప్రెస్ లో ఏ పత్రిక ఎజెండా దానికుంది. సరే... 'సాక్షి' పేపర్, ఛానెల్ పుట్టుకొచ్చిందే  పచ్చ మీడియా విష ప్రచారాన్ని అడ్డుకోవడానికని ఆ సంస్థ సగర్వంగా ప్రకటించింది. పనిలో పనిగా జగన్ కుటుంబ అజెండా మోయడానికి ఆ పత్రిక, ఛానెల్ నిరంతరం కృషి చేస్తున్నాయి. 'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి' పత్రికలు, వారి తాలూకు ఛానెల్స్ కూడా నిరంతరం తెలుగు దేశం   కోసం, చంద్రబాబు కోసం పాటుపడతాయన్న విమర్శ ఉంది. అది అబద్ధం కాదు సుమా...అనడానికి ఉదాహరణలు అనేకం. లేటెస్ట్ ఉదాహరణ చూద్దాం. 

ఈ మధ్యన ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి. వేల మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో... తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ చిక్కుకున్న తెలుగు వారి కోసం నడుం బిగించారు. మొన్న, అంటే సోమవారం నాడు, ఆయన డెహ్రాడూన్ వెళ్లి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి బహుగుణను కలిసి... తెలుగు వారి పట్ల వివక్ష వద్దు... అని చెప్పారు. ఈ మీటింగ్ కు సంబంధించి మంగళవారం మొదటి పేజీ పై భాగం లో ఈనాడు ఒక ఫోటో వేసింది. చంద్రబాబు... ఆ ముఖ్య మంత్రిని చూపుడు వేలు పైకెత్తి నిలదీస్తున్నట్లు ఉన్నదది. ఆ ఫోటో చూసిన తెలుగోళ్ళు... మన బాబు గారు... ఆ సీ ఎం ను ఎకేస్తున్నరహ... అని చంకలు గుద్దుకోవాలన్నది  ఆ పత్రిక తాపత్రయం అని కూడా అనుకోలేము. "తె దే పా ఆధ్వర్యంలో ప్రత్యేక  విమానం"... 'ఇంటికి చేరే దాకా పార్టీ దే బాధ్యత..." అన్న శీర్షికలూ మొదటి పేజీలో వచ్చాయి. ఇక 15 వ పేజీ మొత్తం తెలుగు దేశం యాక్టివిటీ కి కేటాయించారు. అందులో... బాబు గారివి రెండు ఫోటోలు వేసారు. దేశ రాజధానిలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఒకాయన బిజీ గా ఫోన్ లో మాట్లాడుతున్న ఫోటో, పలు స్టోరీలు ప్రచురించారు. 

ఇక ఈ రోజు, అంటే బుధవారం, ఊపు పెరిగింది. తెలుగు యాత్రికుల గోడు వింటున్న బాబు గారి ఫోటోలు 'ఈనాడు' రెండో పేజీలో, మూడో పేజీలో వేసారు. ఆ పనే చేస్తున్న ముఖ్యమంత్రి ఫోటోలు రెండు వేసారని కూడా చెప్పుకోవాలి. "పనికిరాని ప్రభుత్వాలు!" అన్న శీర్షికతో ఒక ఎడిటోరియల్ రాసారు. దానికి ఆశ్చర్యార్ధకం ఎందుకు పెట్టారో తెలియదు. పదో పేజీలో అత్యంత కృతమైన ఒక ఫోటో వేసారు...''బాధితుల చేరవేతకు బాబు చొరవ" అన్న శీర్షికతో. విశాఖ విమానాశ్రయంలో ఆయన ఫొటోకు నమస్కరిస్తున్న బాధితులు అన్న పచ్చి అబద్ధపు కాప్షన్ రాశారు. నిజానికి ఫోటోలో ఉన్న ఇద్దరిలో ఒకరే ఆ ఫొటోకు నమస్కరిస్తున్నారు. హైదరాబాద్ మినీ లో లోకేష్ బాబు ఫోటో కూడా వేసుకున్నారు. 

బుధవారం నాడు... 'ఆంధ్రజ్యోతి' ఒకడుగు ముందుకేసింది. 'దేవుడిలా వచ్చిన బాబు' అన్న శీర్షికతో వచ్చిన వార్తలో... 'తండ్రీ కొడుకులకు జీవితాంతం రుణపడి ఉంటాం.." అన్న డెక్కు కూడా పెట్టి ఒక ఫోటో వేసారు. అదే స్టోరీలో ఇంకొక బాక్స్ కొట్టి... "వాళ్ళు రాక్షసులు... ఈయన దేవుడు" అన్న శీర్షికతో మరొక సారి దడ దడలాడించారు. ఇక హైదరాబాద్ మినీ లో "చంద్రన్నకు జేజేలు" అని ఒక బ్యానర్ స్టోరీ రాసి..."ఆదరించిన మనసుకు అభినందనం" అని పత్రిక తెలియజేసింది. ఇక సెంటర్ స్ప్రెడ్ లో "చంద్రన్నా... నీ మేలు మరువలేమన్నా.." అన్న శీర్షిక పెట్టారు. ఆ శీర్షికకు పసుపు పచ్చ రంగు వేసారు. రెండు పేపర్లకు మొదలు నుంచి చివరి దాకా... పసుపు రంగు పులిమితే పోలా..... అని మా అబ్రకదబ్ర అంటుంటే షటప్...మనిషివా... గొడ్డువా.... శవాల దగ్గర నువ్వూ రాజకీయాలు చేస్తావా? అని ఆయన భార్య కసురుకుంది.   

Friday, June 21, 2013

'దమ్మున్న ఛానల్'....పిచ్చి గోల...

ABN-ఆంధ్రజ్యోతి ఈ మధ్య కాలంలో రెండు అద్భుతమైన పరిశోధనాత్మక కథనాలు ప్రసారం చేసింది. ఆంధ్రా రాడియా పేరిట రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో దందా గురించి ఒక స్టింగ్ ఆపరేషన్ గగ్గోలు రేకెత్తించింది. తెలంగాణా రాష్ట్ర సమితి నేత కే చంద్ర శేఖర్ రావు కుమారుడు కే టీ ఆర్ ప్రమేయం ఉన్నట్లు చెబుతున్న ఒక భూ దందా ను 'గిదేంది రామన్నా?' అని రెండు రోజుల పాటు చూపించారు. నిజంగానే ఇలాంటి సాహసం చేసే దమ్ము ఆ ఛానెల్ కు మాత్రమే ఉంది. ఈ రెండు స్టోరీలు అద్భుతమైనవి కానీ ఈ ఛానెల్ పైత్యం వల్ల కథనాల్లో సీరియస్ నెస్ దెబ్బ తింటున్నది.  కే టీ ఆర్ విషయం చూద్దాం. 

తెలంగాణా ఉద్యమం పేరుతో అటు కొందరు విద్యార్థి నేతల నుంచి సీనియర్ లీడర్ల దాకా దండు కుంటున్నారన్న విమర్శ చాలా రోజుల నుంచి ఉంది. ఉస్మానియా యూనివెర్సిటీ లో విద్యార్థి నేతల విలాసవంతమైన జీవితాల గురించి, వారికి అందుతున్న డబ్బుల గురించి ఇంతుంటే అంత ప్రచారం జరుగుతున్నది. ఒక లాండ్ సెటిల్మెంట్ లో కే టీ ఆర్ బంటు ఒకడు ఒరిస్సా పోలీసులకు చిక్కడాన్ని ABN-ఆంధ్రజ్యోతి పెద్ద స్టోరీ గా మలిచింది. బాధిత కుటుంబాల వాళ్ళు కే టీ ఆర్ ప్రమేయం గురించి చెప్పారు. బాగానే ఉంది. ఛానెల్ కథనం అంతా....  జరిగిన అరెస్టు, ఆరోపణల ఆధారంగా సాగింది తప్ప కే టీ ఆర్ ను ఫిక్స్ చేసే పక్కా ఆధారాలు లేకుండా పోయింది. అలాంటప్పుడు ఇంత సంచలనం చేసే బదులు...ఆ యువ ఎం ఎల్ ఏ వెర్షన్ కూడా తీసుకుని కథనం ప్రసారం చేస్తే బాగుండేది. జర్నలిజం లో మౌలికమైన ఆ పని చేయకపోవడం వల్ల... దురుద్దేశం తో కథనాన్ని ప్రసారం చేసారన్న అపవాదును మోయాల్సివస్తున్నది. 

ABN-ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ మూర్ఖత్వం వల్ల జరుగుతున్నదో లేక అక్కడ బాధ్యతా రహితమైన ఎడిటర్ల వల్ల జరుగుతున్నదో కానీ... విమర్శ ఎదుర్కొంటున్న వ్యక్తి వెర్షన్ లేకుండా రోజంతా సంచలనాత్మక కథనం ప్రసారం చేయడం ఈ ఛానెల్ కు అలవాటు గా మారింది. దీనివల్ల ఏతావాతా జర్నలిజం నవ్వుల పాలవుతున్నది. చంద్రబాబు ఎప్పుడు అధికారం లోకి వస్తారా... అన్నట్లు ABN-ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ జర్నలిజం ఉంటుందన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది.  ఆ  పరిస్థితుల్లో అక్కడి ఎడిటర్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ కథనాల కోసం రాస్తున్న కాపీలు అడ్డగోలుగా ఉంటున్నాయి. 

రచయిత పైత్యాన్ని రంగరించి వీటిని రాస్తున్నారు. అందులో పదాలు దిక్కుమాలిన జర్నలిజాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మాటి మాటికీ 'దమ్మున్న ఛానెల్' అనే ప్లేట్ ఒకటి... ప్రతిదాని చివర 'ఉయ్ రిపోర్ట్... యూ డిసైడ్..' అనే మాట ఇంకొకటి. అయ్యా... కథనం పసను బట్టి జనం డిసైడ్ చేస్తారు... మీకు దమ్ముందో, దగ్గుందో. మాటి మాటికీ మీ చంకలు మీరే గుద్దుకుంటే రోత గా ఉంది. మీరు వార్తల్లో ఎడిటోరియల్ వ్యఖ్యానాలు పెట్టి జనాన్ని పిచ్చోళ్ళను చేయాలనుకుంటే ఎలా? 

ఇక ఈ వార్తలు చదివే మహాతల్లి భయంకరమైన డబ్బింగ్ ఆర్టిస్టును తలపిస్తారు. ఎద్దేవా, ఎత్తి పొడుపు, వ్యంగ్యం, విసుర్లు అన్నీ గొంతులో దట్టించి చదువుతారు. దీనివల్ల పరిశోధన సీరియస్ నెస్ చంకనాకి పోతున్నది. ఇలా రాస్తున్నానంటే దానర్థం.. కే టీ ఆర్ ను సమర్ధిస్తున్నామని కాదు. ఆయన ప్రమేయం ఉంటే ఎక్స్ పోజ్ చేసి బుక్ చేయాల్సిందే కానీ ఒక పధ్ధతి ప్రకారం ఆ పనిచేయాలి. జర్నలిజం మౌలిక సూత్రాలను గాలికి వదలడం మంచిది కాదు. ABN-ఆంధ్రజ్యోతి చేసిన తెలివి తక్కువ జర్నలిజం వల్ల ఇప్పుడు ఇది రాధాకృష్ణ కు టీ ఆర్ ఎస్ కు మధ్య పోరాటం గా మారింది. అది కరెక్ట్ కాదు.  

ఇక అక్కడి ప్రముఖ జర్నలిస్టు మూర్తి గారు రా కృ పంచన చేరి పాడైపోయారని అనిపిస్తున్నది. ఒకప్పుడు సంసార పక్షమైన జర్నలిస్టు అనిపించే వాడాయన. ఇప్పుడు కథనాన్ని రక్తి కట్టించడానికి, కథనంలో పాత్రల మధ్య చిచ్చు పెట్టడానికి, వీలయితే వాళ్ళను స్టూడియో లకు రప్పించడానికి ప్రశ్నలు అడుగుతున్నారు. మిత్రమా... పొలిటికల్, బిజినెస్  ఎజండా తో పనిచేసే యజమానులకు మీ లాంటి సిన్సియర్ జర్నలిస్టులు కనువిప్పు కలిగించాలి తప్ప వారి ఎజండా ను మోయడం, వారిని సంతృప్తి కలిగించేందుకు కార్యక్రమాలు నడపడం జర్నలిజానికి మంచిది కాదు. Report as a journalist and let people decide.   

Wednesday, June 19, 2013

మీడియా కబుర్లు... అవీ... ఇవీ...

"ది హిందూ' బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్ గా శ్రీనివాస రెడ్డి 

'ది హిందూ' పత్రిక కోసం హైదరాబాద్ లో చాలా కాలంగా పనిచేస్తున్న కె.శ్రీనివాస రెడ్డి గారిని ఆ పత్రిక యాజమాన్యం బెంగళూరు కు రెసిడెంట్ ఎడిటర్ గా పంపింది. క్రైమ్ రిపోర్టింగ్ లో దిగ్గజం లాంటి శ్రీనివాస రెడ్డి చాలా కాలంగా హైదరాబాద్ లో సిటీ ఎడిటర్ గా ఉన్నారు. బెంగళూరు ఎడిషన్ ను చక్కబెట్టే బాధ్యతను  ఆయనకు యాజమాన్యం అప్పగించింది. ఎంతో సమర్ధుడు, మృదు స్వభావి అయిన శ్రీనివాస రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఘన విజయం సాధిస్తారని ఆశిద్దాం. అదే సమయంలో హైదరాబాద్ బ్యూరో చీఫ్ నగేష్ కుమార్ కు  కూడా రెసిడెంట్ ఎడిటర్ హోదా ఇచ్చారు. నగేష్ రిటైర్ అయ్యాక మళ్ళీ శ్రీనివాస రెడ్డి గారు హైదరాబాద్ వస్తారా? లేక ఇక్కడ ప్రమోషన్ లైన్ లో ఉన్న వెంకటేశ్వర్లు గారికి పదోన్నతి ఇస్తారా? అన్న అంశాలపై ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. 

'మెట్రో ఇండియా' ఎడిటర్ గా ఎ.శ్రీనివాస రావు

'నమస్తే తెలంగాణా' పత్రిక అధిపతి రాజం గారు ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఒక ఇంగ్లిష్ దిన పత్రిక (మెట్రో ఇండియా) ను తే బోతున్నారు. అందుకు సిబ్బంది నియామకం జరుగుతున్నది. న్యూస్ టైం, డెక్కన్ క్రానికల్, డెక్కన్ పోస్ట్, మెయిల్ టుడే లలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు ఏ. శ్రీనివాస రావు గారు ఎడిటోరియల్ అధిపతి గా నియమించారు. నేను మెయిల్ టుడే లో ఒక ఆరు నెలలు పనిచేసి వదిలేసి అమెరికా వెళ్ళే ముందు శ్రీనివాస రావు గారు ఆ పత్రికలో చేరారు. ఆయన అక్కడ సమర్ధంగా పనిచేసారు. రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత జరిగిన చావులపై ఆయన రాసిన పరిశోధనాత్మక కథనం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈనాడు, న్యూస్ టైం, డెక్కన్ క్రానికల్, ది హిందూ, ది హన్స్ ఇండియా, పోస్ట్ నూన్ లలో పనిచేసి సొంతగా ఒకటి రెండు వెబ్ సైట్స్ నడుపుతున్న కాకలు తీరిన జర్నలిస్టు సాయ శేఖర్ ను, టైమ్స్ ఆఫ్ ఇండియా, టీ వీ నైన్ గ్రూప్, ది  న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లలో పనిచేసిన అద్భుతమైన ఎడిటర్ రామ్ కరణ్ లతో కూడా రాజం గారు చర్చలు జరిపాక... రావు గారిని ఎంచుకున్నారు. 
రావు గారితో పాటు బీ ఎస్ రామకృష్ణ గారు కూడా మెట్రో ఇండియా లో చేరారు. డెక్కన్ పోస్ట్ అనే పత్రికకు మంచి పేరు రావడంలో వీరిద్దరి పాత్ర చెప్పుకోదగినది. స్పోర్ట్స్ ఎడిటర్ పోస్ట్ ఇస్తే వీరితో పనిచేస్తే బాగని గట్టిగా అనుకుని నేను భంగపడ్డాను. మొత్తం మీద మెట్రో టీం కు మేలు జరుగుగాక!

ఐ-న్యూస్ లో చేరిన రామ్ కరణ్ 

హైదరాబాద్ కేంద్రంగా ఇంగ్లిష్ లో పక్కా ఎడిటర్ లక్షణాలు ఉన్నవారు చాలా తక్కువ మంది. తెలుగు చానెల్స్ లో అయితే ఎవ్వడైనా ఎడిటర్ అయిపోవచ్చు....ఇరగదీయవచ్చు. ముక్కు మీద కోపం జాస్తి అన్న అపవాదు ఉన్నా... అద్భుతమైన ఎడిటర్ రామ్ కరణ్ గారు. ఉస్మానియా లో జర్నలిజం విద్య అభ్యసించిన ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. అంతకు ముందు ఏమి చేసారో తెలియదు. తర్వాత టీ వీ నైన్ గ్రూప్ లో, రీసెంట్ గా ది  న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లలో పనిచేసారు. తన సహాధ్యాయి అయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు రామ్ కరణ్ గారు ఐ న్యూస్ లో పెద్ద హోదాలో చేరారు. నేను ఇండియన్ స్కూల్ అఫ్ జర్నలిజం లో పనిచేస్తున్నప్పుడు రామ్ కరణ్ గారిని 'ది హన్స్' కు ఆహ్వానించాలని మా సారు అనుమతితో అడిగాను కూడా. కానీ ఏవో కారణాల వల్ల ఆయన రాలేదు. రామ్ కరణ్ గారి లాంటి మంచి ఎడిటర్ ను ఇంగ్లిష్ జర్నలిజం కోల్పోవడం బాధాకరం. 

'ది హన్స్ ఇండియా' టాబ్లాయిడ్

కపిల్ గ్రూప్ వారి 'ది హన్స్ ఇండియా' ఈ మధ్యన హైదరాబాద్ వార్తలకోసం ఒక టాబ్లాయిడ్ ను ముద్రించడం ఆరంభించింది. 'హైదరాబాద్ హన్స్' అని దీనికి నామకరణం చేసారు. హన్స్ ఎడిటర్ (ఒకప్పటి డీ సీ వీరుడు) పీ ఎన్ వీ నాయర్ స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ది హన్స్ మెయిన్ పేజీలను గల్ఫ్ పేపర్లలో పనిచేసి వచ్చిన మధుసూదన రావు గారు చూస్తున్నారు. నిజానికి ది హన్స్ ఇండియా ను టాబ్లాయిడ్ రూపం లో తేవాలని ముందుగా భావించారు కానీ అది కుదరలేదు. 

కందుల రమేష్ సారధ్యంలో ఇంగ్లిష్ ఛానెల్ 

సీ వీ ఆర్ సంస్థ వారి న్యూస్ ఛానెల్, వైద్యం చానల్ ఇప్పటికే పేరు తెచ్చుకున్నాయి. తెలుగు ఛానెల్స్ విప్లవం ఆరంభమయ్యాక టీ వీ-5, ఐ -న్యూస్, స్టూడియో ఎన్ లలో పనిచేసిన కందుల రమేష్ గారు సీ వీ ఆర్ న్యూస్ లో చేరారు మొదట్లోనే. మొదట్లో ప్రింట్ లో ఉండి, అందరి కన్నా ముందు ఆన్ లైన్ మీడియాలో పనిచేసిన అనుభవం ఉన్న జర్నలిస్టు ఆయన సారధ్యంలో సీ వీ ఆర్ గ్రూపు ఒక ఇంగ్లిష్ ఛానెల్ తేబోతున్నది. దాని బాధ్యతలను యాజమాన్యం కందుల రమేష్ గారికి పూర్తిగా అప్పగించినట్లు సమాచారం. గతంలో ఎన్ డీ టీ వీ, టైమ్స్ నౌ ఆంగ్ల చానెల్స్ కోసం పనిచేసిన సునీల్ పాటిల్ కూడా ఆ పని మీదనే ఉన్నారు. 

Sunday, June 2, 2013

'ఈనాడు' లో ప్రమోషన్ల హడావుడి

'ఈనాడు' పేపర్లో గత నాలుగు రోజులుగా ప్రమోషన్ల హడావుడి నడుస్తున్నది. యాభై మందికి పైగా రిపోర్టర్లు, సబ్బులకు పదోన్నతులు ఇవ్వడంతో ఉద్యోగుల్లో దీనికి సంబంధించిన చర్చే జరుగుతున్నది. ఒక మిత్రుడు చెప్పిన ప్రకారం--72 మందికి పదోన్నతి లభించింది. కంగ్రాట్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 

ఆ అదృష్టం లభించిన వాళ్ళు ఆనంద పడడం, కలగని వారు కుంగిపోవడం మామూలే కానీ... ఉద్యోగుల పని తీరును సరిగా అంచనా వేసే యంత్రాంగం లేకుండానే ఒకరిద్దరు పవర్ సెంటర్ల మాటలు విని ప్రమోషన్లు ఇవ్వడం 'ఈనాడు' లో రివాజు గా మారిందని అంటున్నారు. "ఒక ఐదేళ్లుగా నేనేమి చేస్తున్నానో ఎవ్వరూ చూడలేదు, అడగలేదు. ప్రమోషన్ల లిస్టులో నా పేరు లేదు," అని ఒక జర్నలిస్టు వాపోగా...."డీ ఎన్ గారి మనుషులకు మాత్రమే పెద్ద పీట వేసారు. ఇది దారుణం," అని మరొకరు చెప్పారు. 

గ్రూపిజం, కులం, ప్రాంతం ఆధారంగా 'ఈనాడు' లో ప్రమోషన్లు ఇస్తున్నారని ఒకరిద్దరు నిజమే అనిపించే ఉదాహరణలు ఇచ్చినా వాటిని ఇక్కడ ప్రస్తావించడం భావ్యంగా అనిపించడం లేదు. ప్రమోషన్ల విషయంలో ఒక జర్నలిస్టు ఒకరు తన ఆవేదనను నాతో పంచుకుంటే అక్కడ పనిచేసినప్పటి రోజులు మరొకసారి గుర్తుకు వచ్చాయి. 

'ఈనాడు జర్నలిజం స్కూల్' లో  క్రీం మీరంటూ ఇసికేల ఉదయ్, రెంటాల జయదేవ,  సత్య కుమార్, పమిడికాల్వ మధుసూదన్ లతో పాటు నన్ను అక్కడ సంస్థకు గుండె కాయగా భావించే జనరల్ డెస్క్ లో వేసారు. మేము ఇరగబడి పనిచేశాం. మేమంతా ఒక్కటంటే ఒక్క ప్రమోషన్ తీసుకోకుండా బైటికి వచ్చాం. అందరి కన్నా ఎక్కువగా నేను మాత్రమే ఆ సంస్థలో 9.5 సంవత్సరాలు పనిచేశాను. 'ఈనాడు' మొదటి పేజీలో వార్తలు రాసే వాడిని, మంచి శీర్షికలు కూడా పెట్టేవాడిని, పేజీలు  సక్రమంగా పెట్టించే వాడిని అన్న పేరు నాకుంది. అయినా ఒక్క ప్రమోషనైనా లేకుండా తీవ్ర నిరాశతో బైటికి వచ్చాను. అప్పటికే ఉస్మానియా లో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (ఎం సీ జే) చేశాను, జర్నలిజం లో రెండు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి.  

'వార్త' పేపర్ వచ్చినప్పుడు మాత్రం ఒక లెటర్ ఇచ్చి నాతో పాటు ఒక పది మందికి 300 రూపాయల చొప్పున జీతం పెంచారు. అప్పటి 'న్యూస్ టుడే' ఎం డీ ఇప్పుడు తెలుగు దేశం పార్టీ సేవ చేసి తరిస్తున్న రమేష్ బాబు అనే సారు వల్ల నాకు ప్రమోషన్ రాలేదని చెప్పేవారు సీనియర్లు. ప్రమోషన్ రావాలంటే 'నేను మీ మనిషినే' అని రమేష్ బాబు గారికి  అర్థమయ్యేలా చేయాలి.... అని సీనియర్లు చెబితే... ఆయన ఛాంబర్లోకి వెళ్లి కూర్చొని ఎలా పొగడాలో తెలియక నానా ఇబ్బంది పడి... ఛీ పాడు బతుకు... జీవితానికి ప్రమోషన్ అంత ముఖ్యమా... అని మనసులో అనుకుని బైటికి వచ్చిన సందర్భాలు ఒకటి రెండు ఉన్నాయి. అప్పటికే మాకు బూదరాజు గారి శిష్యులమన్న ముద్ర ఉంది. దానివల్ల కొంత సమస్య ఉండేది... మా ప్రమేయం లేకుండానే. 'ది హిందూ' లో చేరాక...ఏడేళ్ళలో రెండు ప్రమోషన్లు వచ్చి ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అయ్యాను. 'మెయిల్ టుడే' లో స్పెషల్ కరస్పాండెంట్ గా కథ ముగించాను. 

ఇంతకూ చెప్పొచ్చేది ఏమిటంటే... 'ఈనాడు' లో జూనియర్లు చాలా అదృష్ట వంతులని. ఈ రోజుల్లో క్రమం తప్పకుండా ప్రమోషన్లు ఇస్తున్నారు. పనికి గుర్తింపు లేకపోతే ఎలా? 'క్విడ్ ప్రో కో' నో, తాటి మట్టోగానీ 'సాక్షి' పత్రిక రాకపోతే రోజులు ఇంకా మా అప్పటి లాగానే ఉండేవి. లిఫ్టు బాయ్ లతో పత్రిక నడుపుతా అని యాజమాన్యం  కావరంతో విర్రవీగిన పరిస్థితి పోయి, జర్నలిస్టుల బతుకులు బాగు కావడానికి 'సాక్షి' దోహదపడిన వైనం ఒక్క జర్నలిస్టులకు మాత్రమే అర్థమవుతుంది.          

Saturday, June 1, 2013

రమణ ఆ ప్రస్తావన ఎందుకు తెచ్చాడు?

జర్నలిజం లో ఉన్న అరుదైన ఆణిముత్యాలలో ఒకరైన కొమర్రాజు వెంకట రమణ (కె వీ ఆర్) అంత్యక్రియలు నిన్న జరిగాయి. పార్థివ శరీరాన్ని ఉంచిన  ఫిర్జాదిగూడా లోని రమణ నివాసానికి వచ్చి జర్నలిస్టులు శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం గోడ వెంబటి తెల్లని వస్త్రంలో చుట్టి కూర్చోబెట్టిన రమణ దేహాన్ని చూసి మేము దుఃఖం ఆపుకోలేకపోయాము. 

డీ ఎన్ ఏ పత్రికకు ఏకైక ప్రతినిధిగా ఉన్నప్పటికీ రమణ దేహాన్ని తుది వీడ్కోలు పలకడానికి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు వచ్చారు. ఫేస్ బుక్ లో నివాళులు అర్పించారు. ఈనాడు జర్నలిజం స్కూల్ 1992 బ్యాచులో రమణతో పాటు మేము చదువుకున్నాం. విషయం తెలిసి రమణ నివాసానికి చేరుకున్న మా బ్యాచ్ మిత్రుల్లో షేక్ బుడన్, వేణు, సత్యానంద్, మధు ఉన్నారు. నేను, నా భార్య హేమ కూడా కడసారి దర్శనం చేసుకున్నాం. 

"ఇన్ని సంవత్సరాల బిజినెస్ జర్నలిజం లో రమణ ఎన్నడూ ప్రెస్ కాన్ఫరెన్స్ లలో గుఫ్ట్ లు తీసుకోలేదు. విందులకు కూడా దూరంగా ఉండేవాడు," అని ఒక ప్రముఖ సంస్థ లో పీ ఆర్ ఓ గా పనిచేస్తున్న ఒక మిత్రుడు చెప్పారు. ఇప్పటికే ఎల్ ఎల్ ఎం చేసిన రమణ జర్నలిజం వదిలేసి లా ప్రాక్టిస్ చేద్దామని భావించినట్లు తన సన్నిహిత మిత్రుడు సుకుమార్ చెప్పారు. "ఒక ఏడాది అయితే ఈ వృత్తి వదిలేవాడు," అని సుకుమార్ చెప్పగా..."ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాడు. మధ్యలోనే వెళ్ళిపోయాడు," అని రమణ తండ్రి నాతొ అన్నారు.  

జూన్ 20 న రమణ పుట్టిన రోజు. గత సంవత్సరం తన పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు చెప్పిన వారికి థాంక్స్ చెబుతూ రమణ ఫేస్ బుక్ లో రాసిన మాటలను సుకుమార్ గుర్తుకు తెచ్చుకున్నారు. రమణ ఇందులో తన  కుమారుడు (పై ఫోటో లో డాన్స్ చేస్తున్నాడు..సాత్విక్) అనాధ కాకుండా వుండడం గురించి ప్రస్తావన తేవడం, ఆ తర్వాత మరొక పుట్టిన రోజు జరుపుకోకుండానే మనలను విడిచి వెళ్ళడం!!!
ఫేస్ బుక్ లో రమణ రాసిన మాటలివీ....         

I do not want to use any loaded statements but thank you all my friends and well wishers. Some of my old friends including those who were not in good terms with me too called me to wish me. It was amazing. Special thanks to Prof Jyoitirmaya Sharma. Hope all your blessings will help me in keeping my job and earn bread and butter for my family for some more time. My son is just seven years old and I should keep working for at least another 20 years. I am sure your wishes will keep me alive for those many years and would not orphan my child till he settles down in his life. Thank you all.