Monday, April 27, 2020

జర్నలిస్టుల ఉద్యోగాల వేటుపై పిల్ అనుమతించిన సుప్రీం కోర్టు

కోవిడ్ వైరస్ సృష్టించిన లాక్ డౌన్ మిషతో అనేక మీడియా సంస్థలు జర్నలిస్టులు, మీడియాలోని ఇతర సిబ్బంది జీవితాలతో ఆడుకోవడం ఆరంభించాయి. కొన్ని సంస్థలు ఉద్యోగాలపై నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తుండగా, మరికొన్ని జీతాల్లో ఇష్టమొచ్చినట్లు కోత విధిస్తున్నాయి, ఇంకొన్ని జీతం ఇవ్వకుండా సెలవుల మీద వెళ్లాలని కోరుతున్నాయి. ఈ అమానుష, చట్ట వ్యతిరేక చర్యలు జర్నలిస్టులను మానసిక హింసకు గురిచేస్తున్నాయి. వారి కుటుంబాలలో అనిశ్చితి సృష్టిస్తున్నాయి. 

ఇలాంటి దారుణాన్ని నిలువరించి, జర్నలిస్టులను ఆదుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు సోమవారం (ఏప్రిల్ 27, 2020) విచారణకు స్వీకరించింది. ఈ పిల్ పై రెండు వారాల్లోగా జవాబు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 

మూడు జర్నలిస్టు సంఘాలు (National Alliance of Journalists (NAJ), the Delhi Union of Journalists (DUJ) and the Brihanmumbai Union of Journalists (BUJ)) దాఖలు చేసిన రిట్ పై జస్టిస్ ఎం వీ రమణ, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బీ ఆర్ గవాయ్ లతో కూడిన బెంచ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు స్వీకరించి కేంద్ర ప్రభుత్వానికి, ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ, ది న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ కు నోటీసులు జారీ చేసింది.

జర్నలిస్టుల పక్షాన సీనియర్ న్యాయవాది Colin Gonsalves వాదిస్తున్నారు.

ఏప్రిల్ 16 న దాఖలైన పిటిషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి:

The journalists’ bodies have asked the apex court to “direct or order persons publishing newspapers or engaged with media work including digital media and employing journalists and non-journalists for this purpose to treat all termination of service notices issued, resignation from services received from employees pursuant to a request from the employers whether oral or in writing, all wage reductions, all directions to go on leave without pay, taking place after the announcement of the lockdown as suspended with immediate effect until further orders”.
“Several newspapers, magazines, online media outlets and other employers in the media sector have reportedly taken steps after the announcement of the nationwide lockdown in March 2020 to retrench workers and employees, impose wage cuts, etc, in spite of advisories issued by the Ministry of Labour and Employment, Government of India and even appeals by the Prime Minister to not terminate the services or reduce the wages of their employees,” the petition said.
It said these measures are “an affront to the rights of journalists and also impede their ability to perform their duties and provide independent journalism as a pillar of democracy”. (ది హిందూ సౌజన్యంతో) 

Thursday, April 23, 2020

అర్ణబ్ దంపతులపై దాడికి విఫలయత్నం- ఫిర్యాదు కాపీ ఇదీ!

భారతీయ టెలివిజన్ జర్నలిజానికి కొత్త గొంతుకైన సంచలన జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి, ఆయన భార్య, ఛానల్ ఎడిటర్  సౌమ్యబ్రత రాయ్ పై ఈ తెల్లవారుఝామున 12.15 ప్రాంతంలో ముంబయిలో దాడికి విఫలయత్నం జరిగింది. దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అర్ణబ్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.  
  
దాడి అనంతరం నివాస భవనం సెల్లార్ లో షూట్ చేసిన ఒక వీడియాలో (ఫోటో) అర్ణబ్ మాట్లాడుతూ--గురువారం (ఏప్రిల్ 23. 2020) తెల్లవారుఝామున తాము వార్లిలోని రిపబ్లిక్ స్థూడియో నుంచి వస్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తన కారును వెంబడించి దాడికి దిగారని, కారును ఆపే ప్రయత్నం చేశారని, పెద్దగా తిడుతూ కారుపైకి ఒక ద్రావణం చల్లారని తెలిపారు. భద్రతా సిబ్బంది వారిని పట్టుకున్నారని, వారిద్దరూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలని తేలిందన్నారు. తనపై దాడికి పైవాళ్ళు (హయ్యర్ అప్స్) పంపారని వారు వెల్లడించారని తెలిపారు.  తనకు గుణపాఠం నేర్పడం కోసం వారిని పంపారని చెప్పారు.  వారి దగ్గర ఆయుధాలు ఉన్నట్లు అర్ణబ్ పోలీసులకు ఇచ్చిన మూడు పేజీల ఫిర్యాదు (పోస్టు చివర్లో చదవవచ్చు)  లో పేర్కొన్నారు. 

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనే ఈ దాడి చేయించారని అర్ణబ్ ఘాటుగా ఆరోపించారు. తనకు ఏమైనా జరిగితే సోనియానే పూర్తి బాధ్యత వహించాలని చెప్పారు. అంతకుముందు షో లో సోనియాపై తాను లేవనెత్తిన ప్రశ్నలను ఎదుర్కునే ధైర్యంలేక పిరికితనం తో ఈ దాడికి ఉసిగొల్పారని అర్ణబ్ అన్నారు. మున్ముందు ఈ ప్రశ్నల పరంపర పెరుగుతుందని స్పష్టంచేశారు. సోనియా, వాద్రా కుటుంబం తానడుగుతున్న సరైన ప్రశ్నలను జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. వారు ప్రసారం చేసిన ప్రతి తప్పుడు వార్తను తాను తప్పని తేల్చానని చెప్పారు. గుజరాత్ లో హిందూ ముస్లింలు రెండుగా విడిపోయారని ప్రియాంక వాద్రా తప్పుడు కథనాన్ని సృష్టిస్తే దాన్ని తాను తప్పని నిరూపించానని అన్నారు.  
"మీరు మీ యంత్రాంగాన్ని వాడుకోండి, గూండాలను వాడుకోండి.  ఇంకెవరిని వాడుకుంటారో వారిని వాడుకోండి.  ఏమి చేస్తారో చేసుకోండి. మాకు భారత ప్రజల మద్దతు ఉంది. మీరు ఏమి చేస్తారో నేనూ చూస్తా," అని అయన చెప్పారు. తానూ, తన ఛానెల్ వాస్తవాల బాటలోనే కొనసాగుతామని అర్ణబ్ ప్రకటించారు. 
అనంతరం అర్ణబ్ పోలీస్ స్టేషన్ లో స్వయంగా ఫిర్యాదు చేశారు.  
మహారాష్ట్రలోని గదక్  చించేల్ అనే గ్రామం దగ్గర ఇద్దరు సాధువులఫై జరిగిన అమానుష మూక దాడి విషయంలో సోనియా గాంధీ పై టీవీ చర్చలో చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ అర్ణబ్ పై మధ్యప్రదేశ్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదైన మరుసటి రోజునే ఈ దాడి జరిగింది.  


Tuesday, April 21, 2020

ఈ టీవీ సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ దుర్మరణం

చెన్నైలో ఈ-టీవీ వాయిస్ ఓవర్లు చదివే స్థాయి నుంచి సీనియర్ రిపోర్టర్ స్థాయికి ఎదిగి మంచి జర్నలిస్టుగా, అత్యంత సౌమ్యుడిగా పేరుతెచ్చుకున్న శ్రీనివాస్ అనారోగ్యంతో నిన్న (ఏప్రిల్ 20, 2020) హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయనకు 47 సంవత్సరాలు. ఆయనకు భార్య, పదో తరగతి అభ్యసిస్తున్న కుమారుడు ఉన్నారు.

కుక్కకాటును సీరియస్ గా తీసుకోకపోవడంతో రాబిస్ వల్ల శ్రీనివాస్ మరణించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంత్యక్రియలు ఈ రోజు ముగిసాయి.

ప్రకాశం జిల్లా కొండపి మండలం అనకర్లపూడి గ్రామానికి చెందిన శ్రీనివాస్ కుటుంబం ఉద్యోగరీత్యా చెన్నైలో స్థిరపడింది. తిరువత్తియూరులో ఉండి ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆయన విశాఖపట్నంలో డిగ్రీ చదివి మళ్ళీ చెన్నైకి వెళ్లారు. ప్రఖ్యాత అన్నా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తిచేశారు.

జర్నలిజం మీద మక్కువతో అక్కడ కష్టపడి మాస్ కమ్యూనికేషన్ లో సీటు సాధించారు. అప్పటికే ఈ-టీవీ 1, ఈ-టీవీ 2 లలో న్యూస్ బులెటిన్స్ కు వాయిస్ ఓవర్ లు చదివేవారు. ఈనాడు కంట్రిబ్యూటర్ గా కూడా పనిచేశారని తెలుస్తోంది. పీజీ అయ్యాక 2005 లో ఈ టీవీ పూర్తిస్థాయి విలేకరిగా చేరి సేవలందించారు. రెండు నెలల కిందటనే ఈ టీవీ భారత్ కు బదిలీ మీద వచ్చి హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. అంతకుముందు ఈనాడు ఎడిట్ పేజీకి కూడా ఆర్టికల్స్ రాసారు.
"శ్రీనివాస్ చాలా మంచి జర్నలిస్టు. వృత్తి పట్ల ఎంతో నిబద్ధత ఉండేది. విధి నిర్వహణలో ఎంతో చలాకీగా ఉండేవారు. వార్తలు, విశ్లేషణలతో మేధావిగా మనం చెప్పుకోవచ్చు. అవినీతి రహితుడిగా ఆయనకు మంచి పేరుంది. చెన్నై సినీ పరిశ్రమ, రాజకీయ రంగాలపై ఆయనకు అమోఘమైన పట్టువుంది," అని తనతో కలిసి పనిచేసిన ఒక చెన్నై జర్నలిస్టు చెప్పారు. 

ఏ. కిశోర్ బాబు అనే జర్నలిస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాచారం ప్రకారం--శ్రీనివాస్ ఎప్పుడూ చిక్కటి చిరునవ్వుతో కనిపించేవాడు. మంచి భాషా సౌందర్యం కూడా ఉన్నవాడు.  తెలివైన వాడు. ఫిబ్రవరిలో ఇంట్లో ఓరోజు ఉదయం శ్రీనివాస్ చేతిని కుక్క కరిచింది. కుక్క కాటును పట్టించుకోకపోవడం వల్ల ప్రాణాల మీదికి వచ్చింది. చెన్నైలో తనకు సన్నిహితుడైన ఒక వైద్యుడు ఫోన్ లో ఇచ్చిన సలహా మేరకు శ్రీనివాస్ హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో చేరాడు.
కానీ అప్పటికే సమయం మించిపోయింది. రేబిస్ బ్రెయిన్ కు పాకి ప్రాణాలను హరించింది.

ఆరంభంలో శ్రీనివాస్ స్వరం పీలగా ఉండడంతో వాయిస్ ఓవర్ కు అవకాశమివ్వకపోతే సాధన చేసి మరీ సాధించాడని అప్పట్లో ఈ టీవీ కి పనిచేసిన మరొక సీనియర్ జర్నలిస్టు చెప్పారు.

"గొంతు సూట్ కాని కారణంగా దాదాపు ఇతణ్ణి తిరస్కరించేశాము. కానీ, పట్టుదల విషయంలో శ్రీనివాస్ ని ప్రశంసించి తీరాల్సిందే. చెన్నైలో ఆఫీసుకి చాలా దూరంలో ఉండేవాడు. అతను రోజూ రాత్రిళ్లు వాయిస్ ఓవర్ చెప్పేందుకు కొద్దికాలం ఉచితంగానే (ప్రాక్టీస్ అన్న వంకతో) పనిచేశాడు. అతడి చిత్తశుద్ధిని చూసి.. అవకాశం ఇచ్చారు. తను ఎంచుకున్న రంగంలోొ మెళకువలు తెలుసుకునేందుకు ఎప్పుడూ ఆసక్తిని కనబరిచేవాడు. అప్పట్లో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి సోదరి వసంతలక్ష్మి గారు కూాడా ఈటీవీలో న్యూస్ యాంకరింగ్ చేసేవారు. ఆమె దగ్గర కూడా స్వరజ్ఞానానికి సంబంధించి కిటుకులు తెలుసుకుంటుండేవాడు. తను పలుకరించే ప్రతి ఒక్కరినీ ఆత్మీయులుగా భావించేవాడు," అని అయన గుర్తుచేసుకున్నారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు శ్రీనివాస్ మృతి పట్ల విచారం వ్యక్తంచేశారు. "వృత్తి పట్ల నిబద్ధత, కష్టపడి పనిచేసే తత్వం, విలువలకు కట్టుబడిన వ్యక్తిత్వం వారిని ఆదర్శ పాత్రికేయుడిగా నిలిపాయి. ఆయన  వ్యక్తిగతంగా నాతో చాలా అభిమానంగా ఉండేవారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను," అని ఆయన పేర్కొన్నారు. 

Monday, April 20, 2020

జర్నలిస్టులకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలి....

మహారాష్ట్రలో పరీక్ష చేసిన 170 జర్నలిస్టులలో 50 మందికి కోవిడ్ వైరస్ పాజిటివ్ గా రావడం కలవరం కలిగిస్తోంది. పైగా, వీరెవ్వరికీ వ్యాధి లక్షణాలు ఏమీలేవట. పాజిటివ్ గా తేలిన వారిని, వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, దేశ వ్యాప్తంగా జర్నలిస్టులు జాగ్రత్త వహించాలి. తెలుగు వార్తా చానెల్స్ లలో, పత్రికల్లో  పనిచేసే జర్నలిస్టులు వార్తల కోసం రోడ్లమీదనే ఉంటున్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, మునిసిపల్ సిబ్బందికి ఏ మాత్రం తీసిపోకుండా మీడియా మిత్రులు బాగా కష్టపడుతున్నారు. ప్రజలకు సమాచారం చేరవేయడంలో, వారిని చైతన్యపరచడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉంది.

దేశవ్యాప్తంగా పత్రికలు, ఛానెళ్ల యాజమాన్యాలు ఈ కీలక తరుణంలో జర్నలిస్టుల ఉద్యోగాలపై నిర్దాక్షిణ్యంగా కోత విధిస్తూ పనిభారం పెంచుతున్నాయి. ఉద్యోగాలు కాపాడుకోవాలంటే జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి పనిచేసి వృత్తినిబద్ధతను చాటుకోకతప్పని పరిస్థితిని కల్పిస్తున్నారు. కనీస రక్షణ సౌకర్యాలు, బీమా సౌకర్యమైనా లేకుండా మీడియా మిత్రులు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా లో పనిచేసేవారు, రోడ్ల మీద, ఆసుపత్రుల్లో వార్తల కోసం పిచ్చిపిచ్చిగా తిరగక తప్పని పరిస్థితి.

ఈ మాయదారి వైరస్ బారిన పడకుండా జర్నలిస్టులు తమంతట తాము ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అటు యాజమాన్యాల నిరాదరణకు, ఇటు ప్రభుత్వాల ఈసడింపులకు గురవుతున్న జర్నలిస్టుల గురించి సభ్య సమాజం, మేథావులు మాట్లాడడం మొదలెట్టాలి. కొన్ని మీడియా సంస్థల మీద ఉన్న కోపంతో జర్నలిస్టులను పట్టించుకోకుండా ఉండకపోవడం దారుణం. మెజారిటీ జర్నలిస్టులు మౌనంగా రోదిస్తూ, నిరాశామయ భవిషత్తును వీక్షిస్తూ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. అధికారం పంచనజేరి ఖుషీగా ఉన్న జర్నలిస్టు సంఘాల నేతలు ప్రభుత్వాలు కనికరించేలా తమ పలుకుబడిని ఉపయోగించి జర్నలిస్టులను ఆదుకోవాలి. కోవిడ్ సోకి కలం వీరులు, వీడియో గ్రాఫర్లు రేపు ప్రాణాల మీదికి తెచ్చుకున్నా పట్టించుకునే వారు లేని దౌర్భాగ్య పరిస్థితి నేడుంది. 

ఈ నేపథ్యంలో... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల బతుకుకు భరోసా ఇస్తూ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని  ఈ బ్లాగు అభ్యర్ధిస్తున్నది. సరైన జీతాలు లేక, సేవింగ్స్ లేక, బతుకుకు గ్యారెంటీ లేక జర్నలిస్టులు, వారి కుటుంబ  సభ్యులు కుమిలిపోతున్నారు. జర్నలిస్టుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. అందుకే, తెలంగాణా ప్రభుత్వ పెద్దలు జర్నలిస్టులకు పెద్ద మనసుతో భరోసా ఇచ్చే ప్యాకేజ్ వెంటనే ప్రకటించి దేశంలో వివిధ రాష్ట్రాలకు  మార్గదర్శకం కావాలి. అంతకన్నా ముందు... ఇంతటి విషాద సమయంలో జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల ఉద్యోగాలపై వేటు వేసే పత్రికల, ఛానెళ్ల గుర్తింపు రద్దుచేస్తామని, ఐదేళ్ల పాటు ప్రకటనలు ఇవ్వబోమని సత్వరమే హెచ్చరిక జారీ చేయాలి. 

జర్నలిస్టు మిత్రులారా.... ఈ పోస్టు చదివి వదిలేయకండి. ఈ లింకును రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాధినేతలకు, మంత్రులకు, పలుకుబడి కలిగిన వారికి పంపి విషయాన్ని వారి దృష్టికి తెండి. కార్యాచరణకు ఉపక్రమించాలి కోరండి. అద్భుతంగా పనిచేస్తూ... పవిత్ర కర్తవ్యాన్ని నెరవేరుస్తూనే... కరివేపాకు అయిపోతున్న మీ కోసం మీరే గళం విప్పాలి. ఈ పని ఈ క్షణమే చేయాలి.

Sunday, April 12, 2020

1994-95 'ఈనాడు' బ్యాచ్: ఇద్దరు కేఎంలూ...ఇతర కలం వీరులూ...

తెలుగు జర్నలిజం చరిత్రలో ఏప్రిల్ 13, 2020 ఒక విశేషమైన రోజుగా మిగులుతుంది.
'ఈనాడు' అధినేత రామోజీ రావు గారు, ప్రముఖ భాషావేత్త డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారు మేథోమథనంతో ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చిన ఈనాడు జర్నలిజం స్కూల్ 1994-95 బ్యాచ్ విద్యార్థులు వృత్తిబాధ్యతలు స్వీకరించి నేటికి పాతికేళ్ళు పూర్తి అవుతుంది.

తెలుగు జర్నలిజంలో ఎందరో ఆణిముత్యాలను తయారుచేసే జర్నలిస్టుల కర్మాగారం 'ఈనాడు జర్నలిజం స్కూల్' ఎన్నో బ్యాచులను ఉత్పత్తి చేసింది. కానీ ఈ బృందానికి ఒక ప్రత్యేకత ఉంది. ఖైరాతాబాద్ లో ఈనాడు లో జర్నలిజం అక్షరాభ్యాసం చేసి, ఈనాడుకు ఇప్పటికీ అద్భుతమైన సేవలందిస్తున్న వారు కొందరైతే, నిత్య సంచలనశీలురైన కొందరు ఎవరూ చేయని ప్రయోగాలు చేసి సాధారణ జర్నలిస్టు ఊహించడానికైనా సాధ్యపడని ఎత్తులకు ఎదిగారు. వారిలో ఒకరు కృష్ణ మోహన్ కాగా, మరొకరు కృష్ణ మూర్తి (ఇద్దరూ కేఎం లే). మిగిలిన వారూ అద్భుతంగా రాణిస్తూ తామెంచుకున్న వృత్తిలో తమదైన ముద్రవేస్తూ మట్టిలో మాణిక్యాలను వెలికితీయడంలో దిట్టలైన రామోజీ-రాధాకృష్ణ ద్వయానికి ఎంతో పేరుతెస్తున్నారు.   



ఈనాడు సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులో వందలాది వ్యాసాలు రాసి తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న జీవీడీ కృష్ణమోహన్ వివిధ కారణాల రీత్యా దాదాపు దశాబ్దం కిందట సాక్షి పత్రికలో చేరి... అక్కడి యాజమాన్యానికి వ్యతిరేకంగా ఈనాడు ప్రచురించే వ్యాసాలకు దీటుగా 'ఏది నిజం?' అనే కాలమ్ నిర్వహించి ఒక చరిత్ర సృష్టించాడు. కేవలం నాణ్యమైన ఆలోచనలు, సమయస్ఫూర్తి, నికార్సైన జర్నలిజం విలువలతో అప్పుడు రాజశేఖర్ రెడ్డిగారిని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిగారిని ఆకర్షించారు. సమర్థంగా బాధ్యతలు నిర్వహించినందుకు గానూ కృష్ణమోహన్... జగన్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాక ప్రభుత్వానికి కమ్యూనికేషన్ సలహాదారుగా క్యాబినెట్ ర్యాంకులో నియమితులయ్యారు. రాజకీయ వైకుంఠపాళిలో కేవలం జర్నలిజం బుద్ధిబలంతో ఎదిగిన కలం వీరుడు కేఎం. 

ఈ మధ్యనే నమస్తే తెలంగాణా పత్రిక ఎడిటర్ గా బాధ్యతలు స్వీకరించిన టి కృష్ణమూర్తి గారిదీ ఈ బాచే, ఇలాంటి కథే. ఈనాడు జనరల్ డెస్క్ లో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన కృష్ణమూర్తి కూడా ఒక దశాబ్దం కిందట ఆంధ్రజ్యోతిలో చేరి ఆ పత్రిక పురోగతిలో కీలకభూమిక పోషించారు. అక్కడ జనరల్ పేజీల బాధ్యతలు చూస్తూనే  కృ తి పేరుతో ఆయన రాసిన కాలమ్ విశేష ప్రజాదరణ పొందింది. తన రాతల నాణ్యతే... తనను ఒక పత్రిక ఎడిటర్ ను చేసింది. గాడ్ ఫాదర్లు లేకుండా కలాన్ని, కాలాన్ని నమ్ముకుని అతి పిన్నవయస్కుడైన ఎడిటర్ గా చరిత్ర సృష్టించిన కృష్ణమూర్తి సైతం తెలుగు జర్నలిజంలో తనకంటూ ఒక అధ్యాయాన్ని ఏర్పరుచుకున్నారు.

ఈనాడు లోనే ఉండి సృజనాత్మకతతో ఫీచర్స్ ఎడిటర్ గా రాణిస్తున్న ఆర్. సంతోష్, ఆంధ్రజ్యోతి లో నాణ్యతా ప్రమాణాలు చూస్తూ కృష్ణమూర్తి నిష్క్రమణ తర్వాత పేజీల బాధ్యతలు సమర్ధంగా నిర్వహిస్తున్న వి. రమణ, ఎంతో ముందుచూపుతో ఇంగ్లిష్ జర్నలిజంలో చేరి ఈ మధ్యనే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో డాక్టరేట్ పొందిన డా. మహేష్, స్వశక్తితో ఎదిగి ఈనాడులోనే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వై తిమ్మప్ప, వెంకూ, తామెంచుకున్న రంగాల్లో రాణిస్తున్న విశేష్ (మనో విజ్ఞానం), జిలానీ (ఫిలిం ప్రొడక్షన్) కూడా ఈ బ్యాచ్ విద్యార్థులే, స్ఫూర్తి ప్రదాతలే. 

ప్రస్తుతం ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఎం. నాగేశ్వర రావు గారి దగ్గర క్వాలిటీ సెల్ లో పనిచేసి వృత్తి నైపుణ్యం పొందిన శ్రీనివాస్, బిజినెస్ జర్నలిజంలో ఒక వెలుగు వెలిగిన మూర్తి, కంప్యూటర్ ల గురించి ఎన్నడో పుస్తకం రాసిన సృజనశీలి వి. కిషోర్... ఇలా మిగిలిన ఈ బ్యాచ్ జర్నలిస్టులంతా ఈనాడు గర్వపడే జర్నలిస్టులే.

ఈ బ్యాచుకు బూదరాజు రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో అధ్యాపక బృందం (శ్రీ రామచంద్ర రావు, శ్రీ నాగేశ్వర రావు, శ్రీ  దక్షిణామూర్తి, శ్రీ సత్యనారాయణ మూర్తి) చదువు విజ్ఞానం పంచి తీర్చిదిద్దింది. గురువులను సత్కరించుకునే సంస్కారమున్న వీరంతా కరోనా గొడవ లేకపోతె రేపు కాసేపు కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకుని ఉండేవారు. వీరందరీ... పావు శతాబ్దపు జర్నలిజం జీవితం పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు.