Monday, September 22, 2014

జర్నలిస్టుల దుస్థితిపై ఒక మిత్రుడి లేఖ

సర్... 
"తెలుగు మీడియా కబుర్లు" బ్లాగ్ ద్వారా....యాజమాన్యాల చేతిలో నలిగిపోతున్న జర్నలిస్టుల బాధలను బైటి ప్రపంచానికి తెలియజేస్తూ...  అండగా నిలుస్తున్న మీకు ధన్యవాదాలు. మీ పోస్టులను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాము. 


జర్నలిస్టులు మరియు ఇతర ఉద్యోగులను తొలగించడం, ఉద్యోగులను మానసికంగా హింసించడం కేవలం 'ఈనాడు'లోనే కాదు.. ఈ-టీవీలోనూ పరాకాష్ఠకు చేరింది. ప్రతి చిన్న విషయానికీ...  "ఉంటే ఉండండి లేకుండే వెళ్లిపోండి"... అంటూ యాజమాన్యాలు ఉద్యోగుల నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. చీటికి మాటికి సూటిపోటి మాటలు, జీతభత్యాల్లో తేడాలు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం, ప్రతిభ ఆధారంగా కాకుండా కులం ఆధారంగా గుర్తింపు ఇవ్వడం, నచ్చనివారికి కనీసం సెలవులు ఇవ్వకుండా మానసికంగా హింసించడం... ఈటీవీలో రోజూ జరిగే తంతు. 

ఇందుకు మంచి ఉదాహరణ ఇటీవల ఎన్నికలకు ముందు జరిగిన ఓ బాధాకరమైన సంఘటనను మీ ముందుకు తెస్తున్నాను. నిజామాబాద్ జిల్లాకు చెందిన మా సాటి జర్నలిస్టు యాజమాన్య హింసలకు తట్టుకోలేక.. మానసికంగా ఒత్తిడికి గురై రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈ-టీవీ ఛానల్ ఆఫీసులో చనిపోయాడు. కొడుకు మొదటి పుట్టినరోజు కోసం బంగారపు రింగ్, బట్టలు కొనుక్కొని, డ్యూటీ పూర్తి చేసుకొని అటు నుంచి అటే ఇంటికి వెళ్దామని వచ్చిన ఆయన.. మానసికంగా క్షోభకు గురై ఆఫీసులోనే కుప్పకూలాడు. ఈ విషయాన్ని బైటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్న యాజమాన్యం, అవుట్ పుట్, ఇన్ పుట్ ఎడిటర్లను రంగంలోకి దింపింది. ఆయన వ్యక్తిగత కారణాలతోనే చనిపోయినట్లు పోలీసులను నమ్మించారు అవుట్ పుట్, ఇన్ పుట్ ఎడిటర్లు. ఆయన మరణానికి దారితీసిన కారణాలను తెలుసుకోవడానికి హయత్ నగర్ పోలీసులు ప్రయత్నించినప్పటికీ.. పెద్దలు వారిని ఉద్యోగులతో మాట్లాడనివ్వలేదు. తోటి ఉద్యోగి చనిపోయి గంట కూడా కాకముందే ఏమీ జరగనట్లు కడుపునిండిన కొంత మంది జర్నలిస్టులు పనిచేసుకుంటూ పోయారు. 

మిగతా వారు బాధను కడుపులో దిగమింగుకొని కుటుంబ పోషణ కోసం ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. ఈ సంఘటన తర్వాత కొంత మంది ఉద్యోగులు... చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఆర్థికంగా కాస్తయినా సాయపడటానికి ఒక్కరోజు జీతం ఇవ్వడానికి ముందుకు వస్తే సీనియర్లు, యాజమాన్యం అవసరం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ ఉద్యోగి చనిపోవడానికి ఆరోగ్య సమస్యల ఏమైనా ఉన్నాయో లేదో తెలీదు కానీ, మాకు తెలిసినంత వరకూ ఆయన ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నారు. అందరితో కలిసి సరదాగా ఉండేవారు. కానీ ఆయనది ఒకరికి గులాంగిరీ చేసే మనస్తత్వం కాదు. అందుకే ఆయనపై ఛానల్ లో పనిచేస్తున్న పై స్థాయి ఉద్యోగులు చిన్నచూపు చూపించ సాగారు. ఇంక్రిమెంట్లలోనూ తక్కువ వేశారు. కనీసం కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలకు సెలవులు అడిగితే వెంటనే మంజూరు చేయకుండా మానసికంగా వేధించారు. పరోక్షంగా పనిభారంతో ఇబ్బంది పెట్టారు. ఆయన చనిపోయిన తర్వాత సంతాపం ప్రకటిస్తూ ఓ తోటి ఉద్యోగి నోటీసు బోర్డుపై పేపర్ అంటిస్తే... ఇది అవసరమా అంటూ సదరు ఉద్యోగిపై మండిపడ్డారు. 

ఇదంతా ఎన్నికలకు పది రోజుల మందు ఈ-టీవీ ఆఫీసులో జరిగిన సంఘటన. ఇక ఇప్పుడు కూడా వారి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నచ్చిన వారికి సెలవులు ఇవ్వడం, నచ్చని వారికి అత్యవసర అవసరాలకు కూడా సెలవులు ఇవ్వకుండా హింసించడం ఈ-టీవీలో రోజూ సర్వసాధారణం అయ్యాయి. అన్ని అవకాశాలు చేజారిపోయి ఇప్పుడు ఏ దారి వెతుక్కోలేక పాపం ఎంతో మంది జర్నలిస్టులు కుటుంబ పోషణ కోసం తప్పని పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరిలోనూ చాలా మందిని పీకేయడానికి యాజమాన్యం కుట్రలు పన్నుతోంది. ఓ సామాజిక వర్గానికి చెందిన వారిని అందలం ఎక్కిస్తూ... మిగతా వారిని పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు. నిజాలను నిర్భయంగా మాట్లాడిన వారిపై అతివాదులను ముద్రవేసి తొక్కిపడేస్తున్నారు. ఇలా చెప్పాలంటే ఈ-టీవీలో పనిచేస్తున్న జర్నలిస్టుల బాధలు చాంతాడంత ఉన్నాయి. 

ఈ విషయంతో పాటు వేలాది మంది పనిచేస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యవసర చికిత్సకు అవసరమైన అంబులెన్సు, పరికరాలు, వైద్య సిబ్బంది అందుబాటులో లేని విషయాన్ని మీరు మీ బ్లాగు ద్వారా ప్రభుత్వం, ప్రజల దృష్టికి తేగలరని నా మనవి. 
తోటి జర్నలిస్టు.... 
(Note: This is a letter from a journalist and the veracity of it is being verified. We wish to encourage views in support of it or against to it.)

Friday, September 19, 2014

ఉసురు తీసిన బలవంతపు రాజీనామా?


Thursday, September 18, 2014

'ఈనాడు' యాజమాన్యానికి లేబర్ కమిషన్ తాఖీదు

ఉద్యోగుల నుంచి బలవంతానా రాజీనామాలు చేయిస్తే పారిశ్రామిక వివాదాల చట్టం-1947 తదితర చట్టాల కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని 'ఈనాడు' పత్రిక వ్యవస్థాపకుడు సీ హెచ్ రామోజీరావు కుమారుడు, మానేజింగ్ డైరెక్టర్ సీ హెచ్ కిరణ్ ను తెలంగాణ కార్మిక శాఖ హెచ్చరించింది. ఈ మేరకు మూడు పేజీల లేఖను లేబర్ కమిషనర్ డాక్టర్ ఏ అశోక్ గారు కిరణ్ కు పంపించారు. 

ఈ నెల పన్నెండో తేదీన బాధిత ఉద్యోగులు-యాజమాన్య ప్రతినిధులతో జరిగిన కీలకమైన మీటింగ్ ను ప్రస్తావిస్తూ..."సుదీర్ఘ చర్చల్లో... ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేసారన్న దాన్ని స్పష్టంచేయలేకపోయింది. అదే సమయంలో సమస్య కు సంబంధించిన ఏ ప్రశ్నకూ సరైన సమాధానం చెప్పలేక పోయింది,"  అని కమిషనర్ గారు స్పష్టం చేసారు. 
ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేసిఉంటారన్న దాన్ని నమ్మే పరిస్థితి లేదని కూడా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో... ఈనాడు ప్రచురుణ సంస్థలో "పారిశ్రామిక శాంతి" ఉత్తమ ప్రయోజనాల దృష్ట్యా డాక్టర్ అశోక్ గారు ఒక ఐదు పాయింట్లు "అడ్వైజ్" పేరిటనే యాజమాన్యానికి స్పష్టం చేసారు.

కొత్త వేతన సంఘం సిఫార్సులను కూడా అమలు చేయాలని ఇందులో సూచించారు కానీ దానికి కాలపరిమితి విధించలేదు. బహుశా ఇప్పటికే...  'ఈనాడు' కోర్టు ధిక్కారానికి పాల్పడిందని, ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకుపోయే దమ్మున్న మనిషులకే వదిలేసినట్లు ఉంది.    

1)To treat all the resignations of all your non-journalist employees, submitted during the past 30 days (particularly all those dated 30-8-2014) as null, void, invalid and non-existent, as the employees  themselves have openly declared that the said resignations were coerced but not their voluntary acts. Consequently not to act upon any such resignation. 

2) In case the management intends to offer any Voluntary Retirement Scheme to its employees, it is at full liberty to do so, by adhering to prescribed procedure which requires, first communicating in writing the each and every detail of the proposed Scheme to each and every employee supposed to be covered by the Scheme, followed by extensive open discussions about the pros and cons therein, so as to give sufficient opportunity to the employees to freely think and act, if opting for the Scheme would really benefit him. Any element of force against the employees, to opt for VRS, would render the Scheme as expression of unfair labour practice;

3) To maintain all the postings of the employees as they exist as on 12-9-2014 and any sort of transfers or physical movements from the existing placement, at this juncture, would be liable to be treated as victimization of the employees;

4) To implement the Majathia Wage Board Award to all the eligible employees of the establishment, strictly adhering to the schedule fixed by the Hon'ble Supreme Court through its orders dated 7-2-201,

5) To note that any deviation from the above will render the management liable for action under the Industrial Disputes Act, 1947 and other laws, as many applicable.  
ఈ పై అంశాలు తెలుగులో సంక్షిప్తంగా... 

1) గత నెలరోజుల్లోని అన్ని రాజీనామాలు చెల్లవు. అవి స్వచ్ఛందం కావు.
2) స్వచ్ఛంద పదవీ విరమణపై అందరికీ ముందస్తు సమాచారం ఇవ్వాలి.
3) 12.9.2014 తరువాత జరిగే బదిలీలన్నింటినీ ఉద్యోగులపై కక్షసాధింపుగా పరిగణించాల్సి ఉంటుంది.
4) 7.2.2014 సుప్రీం తీర్పు ప్రకారం మజీతియా వేజ్ బోర్డు అవార్డు అమలు చేయాలి.
5) వీటిల్లో ఏది ఉల్లంఘించినా పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడును. 

(నోట్: ఒక సీనియర్ మోస్ట్ ఎడిటర్ గారు ఆ మూడు పేజీలు  పంపబట్టి ఈ పోస్టు రాయడానికి వీలు ఏర్పడింది. 'ఈనాడు' ఉద్యోగులు ఇప్పటికైనా బైటి ప్రపంచానికి సమాచారం ఇస్తే బాగుంటుంది.) 

Friday, September 12, 2014

'ఈనాడు'కు గట్టి షాక్-ఉద్యోగులకు పెద్ద ఊరట

*రంగంలోకి దిగిన తెలంగాణ లేబర్ కమిషన్ 
*బలవంతపు రాజీనామాలు చెల్లవని స్పష్టీకరణ
*వేజ్ బోర్డ్ సిఫార్సులు అమలు చేయాల్సిందేనని ఆదేశం

*బలవంతపు రాజీనామాలు నేరమని హెచ్చరిక
*70 మంది బాధిత ఉద్యోగుల సాక్ష్యం  
*"రామోజీ చేయమంటే ఇలా చేస్తున్నారా?" అని ప్రశ్న 

మీడియా చేతిలో ఉంది కదాని ఇష్టమొచ్చినట్లు ఉద్యోగులను పీకిపారేయవచ్చని అనుకున్న 'ఈనాడు' యాజమాన్యానికి తెలంగాణా ప్రభుత్వం పరోక్షంగా గట్టి షాక్ ఇచ్చింది. తమను ఉద్యోగాల నుంచి నిర్దాక్షిణ్యంగా బలవంతంగా పీకేసారని హోం మంత్రి నాయని నరసింహా రెడ్డి గారికి ప్రాసెస్ సెక్షన్ ఉద్యోగులు చేసిన ఫిర్యాదుకు స్పందిస్తూ లేబర్ కమిషనర్ శుక్రవారం నిర్వహించిన కీలక సమావేశంలో 'ఈనాడు' కు చుక్కెదురు అయ్యింది.

'ఈనాడు' చరిత్రలోనే మొట్టమొదట సారిగా... దాదాపు 70 మంది పదవీచ్యుత ఉద్యోగులు లేబర్ కమిషనర్ ముందు హాజరై తమ గోడు వెళ్లబోసుకున్నారు. అప్పారావు గారు సహా ఐదుగురు యాజమాన్య ప్రతినిధుల సమక్షంలో ఈ పంచాయితీ జరిగింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరున్నర వరకు ఈ సమావేశం ఆసక్తికరంగా జరిగింది. పిచ్చ పిచ్చ కారణాలతో యాజమాన్యం ఉద్యోగం నుంచి పీకేస్తే దద్దమ్మల్లాగా ఏడుస్తూ ఇంకో ఉద్యోగం చేసుకోవడం, చస్తూ బతకడం అలవాటైన తెలుగు జర్నలిస్టులకు ఈ శ్రామిక జీవులు ఎంతో స్ఫూర్తినిచ్చారు.    

"జనాలకు నీతులు చెప్పే వాళ్ళే ఇలా బెదిరించి రాజీనామాలు తీసుకుంటారా?" అని కమిషనర్ మానేజ్మెంట్ ప్రతినిధులను ప్రశ్నించినట్లు సమాచారం. వివిధ జిల్లా నుంచి వచ్చిన ఉద్యోగులు తమను ఎలా వుద్యోగం నుంచి తొలగించినదీ చెప్పారు. ఈ బలవంతపు రాజీనామాలు చెల్లవని ఆయన స్పష్టం చేసారు. ఒక ప్రశ్నకు సమాధానంగా... "ఇలా రాజీనామాలు తీసుకోవాలని మాకు మానేజ్ మెంట్ చెప్పింది," అని అప్పారావు బృందం చెప్పినట్లు తెలుస్తోంది. 'మానేజ్ మెంట్ అంటే రామోజీ రావు గారా? అని కూడా అడిగారు. "దానికి సమాధానంగా... మానేజ్ మెంట్ అని మాత్రమే చెప్పి తప్పించుకున్నారు," అని సాక్షుల్లో ఒకరు ఈ బ్లాగుకు చెప్పారు.

'ఈ రాజీనామాలు చెల్లవు. ఇలా హెరాస్ చేస్తే మాకు ఫిర్యాదు చేయవచ్చు," అని కూడా కమిషనర్ చెప్పారట. సాధ్యమైనంత త్వరగా వేజ్ బోర్డ్ సిఫార్సులు అమలు చేయాలని, ఆ తర్వాతనే 'గోల్డెన్ హ్యాండ్ షేక్' (స్వచ్ఛంద పదవీ విరమణ గురించి ప్రతిపాదించాలని కూడా హితవు పలికారు.
ఉద్యోగులు ఎక్కువైనందునే తొలగించాల్సి వస్తుందని అప్పారావు బృందం చెప్పినపుడు... అలాంటప్పుడు డిప్యుటేషన్ కింద వివిధ ప్రాంతాల నుంచి ఎందుకు తెచ్చారన్న ప్రశ్న కూడా ఎదురయ్యిందట. మెషిన్, ప్రాసెస్, పాకింగ్, సెక్యూరిటీ విభాగాల నుంచి దాదాపు ఏడువందల మందిని బలవంతంగా తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'ఈనాడు' లో శ్మశాన వైరాగ్యం నెలకొంది. సీనియర్లు తీరని మనోవేదన అనుభవిస్తూ పనిచేస్తున్నారు... గత నెలన్నరగా.  
"ఇది ఒక అద్భుత విజయం. ఇప్పుడు జర్నలిస్టులను, ముఖ్యంగా సీనియర్లను, పెద్ద ఎత్తున ఇళ్ళకు పంపాలన్న యాజమాన్యం ప్లాన్ కు గండి పడినట్లే. అయితే... చట్టాలను ధిక్కరించే వారి ఎత్తుగడలు ఎలాగైనా ఉండవచ్చు, ఎవరినైనా మానేజ్ చేసే సత్తా వారికి ఉంది" అని ఒక బాధిత ఉద్యోగి అన్నారు. అది నిజమే. 
ఉద్యోగాలు పోతాయని, పోతే ఎలా? ఇదేమి దారుణం? అని ఇంటా బైటా ఏడ్చిమొత్తుకునే ఉద్యోగులు... ఎవరో తోడు వస్తారని... ఏదో మేలు చేస్తారని... భ్రమలు పెట్టుకోకుండా... అర్జెంటుగా ఏకం కావాలి. హక్కులు తెలుసుకోవడం, వాటికోసం పోరాడటం తక్షణావసరమని గ్రహించాలి. ఈ కార్మికుల ఐక్యతకు ఇంతకు మించిన అవకాశం రాదని 'ఈనాడు' ఉద్యోగులు గ్రహించి సంఘటితం అయితే వాళ్ళకే మంచిది.

చేసింది చాలు-నిషేధం ఎత్తేస్తే మేలు

మీడియా అంటే స్టూడియోలో కూర్చొని నోటికొచ్చింది వాగడం అనుకునే అర్ణబ్ గోస్వామి అరిచి గీపెడుతున్నారని, ప్రతి దానికీ ప్రత్రికా స్వేచ్చకీ ముడిపెట్టే వేమూరి రాధాకృష్ణ గొంతు చించుకుంటున్నారని కాదుగానీ, టీవీ 9, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానెల్స్ మీద ఇకనైనా నిషేధం ఎత్తివేయడం తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వానికి మంచిది. తెగేదాకా లాగడం సభ్యత కాదని తెలుగు మీడియా కబుర్లు భావిస్తోంది.    

ఈ రెండు ఛానెల్స్ ను బ్లాక్ చేసినందుకు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదనేది నమ్మాల్సిన సత్యం. ఆ మాటకొస్తే...ఏ ఛానెల్ ను, పత్రికను మూసినా జనంలో విప్లవం వస్తుందని అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే, జనం జర్నలిజాన్ని అసహ్యించుకుంటున్నారు. జనమే కాదు... నికార్సైన జర్నలిస్టులూ ఛీ కొడుతున్నారు. ఏ సామాజిక వర్గమైతే.... తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించి, మీడియా పవర్ ను జనాలకు రుచి చూపిందో... అదే సామాజిక వర్గం కుల-రాజకీయ-వ్యాపార విస్తరణ కోసం మరీ హద్దుమీరి బరితెగించి విష సంస్కృతిని (ఒక ఫ్రెండ్ అన్నట్లు డిజిటల్ టెర్రరిజాన్ని) ప్రేరేపించి... జర్నలిజం అంటే జనాల్లో అసహ్య భావన కలిగేలా చేసింది. జర్నలిస్టులను రాళ్ళతో కొట్టే రోజు వచ్చింది.... ఈ మహానుభావుల పుణ్యాన. నిర్దయతో యాజమాన్యాలు జర్నలిస్టుల ఉద్యోగాలు పీకుతుంటే... పట్టని గోస్వాములు, వేరాలకు పత్రికా స్వేఛ్చ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? పత్రికా స్వేఛ్చ అంటే... యజమానుల స్వేఛ్చ కాదు. జర్నలిస్టుల స్వేఛ్చ, స్వాత్రంత్రాలు సార్. ఇవి ఇప్పుడు ఎవ్వడికీ పట్టని అంశాలు.  
తెలంగాణా ఉద్యమం స్వరూప స్వభావాలు, కష్టనష్టాలు తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు... మీడియా నిర్వర్తించిన భూమిక ఏమిటో. 
రెండు ఛానెల్స్ మీద కేబుల్ ఆపరేటర్ల సహాయంతో నిషేధం విధించడం ఈ కాలమాన పరిస్థితులు, ముఖ్యమంత్రి మొండితనం నేపథ్యంలో ఒక భయంకరమైన విషయమేమీ కాదు. ఛానెల్స్ కు ఒక ఝలక్ అవసరమైన సమయంలోనే ఇది జరిగింది. ఈ నిషేధం తర్వాత న్యూస్ రూం లలో తెపరితనం గణనీయంగా తగ్గింది. సెటైర్ పేరు మీద చౌకబారు చెత్త ప్రోగ్రాంలు చేసే జర్నలిస్టులు పదాలు రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. కొన్ని ఛానెల్స్ వాళ్ళు (అప)హాస్యపు ప్రోగ్రాం లకు బ్రేక్ ఇచ్చారు. తెలుగు ఛానెల్స్ వాళ్లకి ఇలా ముకుతాడు పడుతుందని ఎవరూ ఊహించలేదు. ఇది ఒక రకంగా మంచి పరిణామం. 

ముఖ్యమంత్రి గారూ...ఇక ఇది చాలు. వందల మంది జర్నలిస్టుల జీవితాలతో ముడి పడి ఉన్న సమస్య ఇది. ఇంకా కొనసాగించడం భావ్యం కాదు. ఈ అంశం మీద కవిత, వినోద్ వెళ్లి డిస్కషన్స్ లో పాల్గొనడమే పెద్ద తప్పు. పోయిపోయి రొచ్చులో దూకినట్లుంది. కచ్చితంగా ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ట్రాప్ లోనే పడి జర్నలిస్టులపై నోరు పారేసుకుని బద్నాం అయ్యారు. 

తెలంగాణలో పుట్టిన పాపానికి అనేక మంది ప్రతిభావంతులైన జర్నలిస్టుల జీవితాలు నాశనం అయ్యాయి. వాళ్ళను ఎదగనివ్వలేదు. ఆ లెక్కకొస్తే... ఇప్పుడు వీధిన పడిన జర్నలిస్టులలో అధిక శాతం ఈ ప్రాంతం వాళ్ళే. మనోళ్ళను పట్టుకుని మనమే పది కిలోమీటర్ల లోతులో బొంద పెడతామనడం కరెక్టుగా లేదు. సాల్యూట్ కొట్టాలని అనడం అభ్యంతరకరంగా ఉంది. ఇక్కడి జర్నలిస్టుల కోసమైనా....ఇక నిషేధాలు ఎత్తివేయాలి. పత్రికా స్వేచ్ఛకు తాను ఏకైక పెద్ద ప్రతినిధినని చేరా విశ్వవ్యాప్తంగా చాటుకోవడాన్ని అర్జెంటుగా అడ్డుకట్ట వేయడం ప్రభుత్వానికి అవసరం. 

కేబుల్ ఆపరేటర్లతో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి... తమ నిర్ణయంతో తెలంగాణా ప్రభుత్వానికి మచ్చ వచ్చేలా ఉంది కాబట్టి ఈ ఛానెల్స్ కార్యక్రమాలు పునరుద్ధరిస్తున్నామని ప్రకటింపజేయాలి. అదే సమయంలో ఒక నిపుణుల కమిటీ (మళ్ళీ అదే అన్ ప్రొఫెషనల్ గ్యాంగ్ కాకుండా) వేసి..... మీడియా కోసం ఒక ప్రవర్తనా నియమావళి అర్జెంటుగా రూపొందించాలి. జర్నలిజం అంటే ఒక దగుల్బాజీ వృత్తి కాదని, సామాజిక గురుతర బాధ్యత అన్న మెసేజ్ వెళ్ళేలా చేయాలి. 
నోట్: నోట్: ముందుగా పెట్టిన "సీఎం కే సీ ఆర్ గారూ.... ఇంక చాలు నిషేధం ఎత్తేయరూ..." అన్న నాసిరకం శీర్షికను మిత్రుల అమూల్య అభిప్రాయం మేరకు మార్చాం. వారి సూచనే కరెక్టు. వారికి థాంక్స్. 

Friday, September 5, 2014

టీచర్స్ డే శుభాకాంక్షలు...

మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ... అని మనవాళ్ళు గురువుగారికి సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇప్పుడు మన స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్శిటీలలో పరిణామాలు చూస్తే... ఇలాంటి సన్నాసి రకాలకా... మనం ప్రాముఖ్యం ఇవ్వాల్సింది... అన్న బాధ కలుగుతుంది చాలాసార్లు. బహు తక్కువ మంది తప్ప టీచర్లు, ప్రొఫెసర్లు అంతా ఈ కేటగిరీ వాళ్ళే! దేశంలో క్రమశిక్షణ లేకపోవడానికి, నేరాలు పెరగడానికి, మానవీయ సంబంధాలు సవ్యంగా లేకపోవడానికి పరోక్ష బాధ్యత గురువులది కూడా ఉంటుందని వీళ్ళు గుర్తెరగకపోవడం బాధాకరం. 

భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నామన్న గురుతర ఫీలింగ్ లేకపోవడం, ఇళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ పిల్లల మీద చూపించడం, దండన పేరుతో గూండాల్లా దాడి చేయడం, అమానుష-పైశాచిక ప్రవర్తన, చదువుకోడానికి వచ్చిన ఆడపిల్లల మీద కన్నేసి పవిత్రమైన వృత్తికే మచ్చ తెచ్చే పిచ్చిపనులు చేయడం... టీచర్ల గురించి రోజూ పేపర్లలో వస్తున్నవే. అంతా అలా చేస్తారని కాకపోయినా... కొందరు చేసినా మొత్తం వృత్తికి చుట్టుకుంటుంది. ఈ వార్తలు చాలా బాధ కలిగిస్తాయి. గతంలో ప్రభుత్వ టీచర్లు... కొంత రహస్యంగా ఇళ్ళలో ట్యూషన్స్ నడిపి అదనపు ఆదాయం (అ ఆ) గడించేవారు. ఇప్పుడు చాలా మంది... అ ఆ కోసం చిట్టీ వ్యాపారాల్లో తలదూర్చారు. ఇది తప్పేలా అవుతుందని అంటే దానికి సమాధానం లేదు. పిల్లలు తమను అనుకరిస్తారనీ, తమ ప్రవర్తన, చర్యల ప్రభావం పసి హృదయాలపై కచ్చితంగా ఉంటుందని  అర్థం చేసుకోవాలి. 

యూనివర్శిటీలలో స్థితిగతులు దగ్గరి నుంచి చూశాక అర్థమయ్యింది ఏమిటంటే... చాలా మంది ప్రొఫెసర్లు (అసిస్టెంట్ ప్రొ  కావచ్చు, అసోసియేట్ ప్రొ కావచ్చు) పైరవీల మీద ఎంపికై విశ్వవిద్యాలయాల్లో దూరుతున్నారు. అక్కడి ఎంపికలు ఒక ఫార్సు వ్యవహారం, నిస్సందేహంగా. "ఆమె ఒక రోజు వంకాయలు కొనుక్కుంటూ మార్కెట్ లో కనిపించింది. ఏంటమ్మా... పీజీ తో ఆపావు.. పీ హెచ్ డీ చెయ్యి అని నేనే చెప్పి చేయించాను. ఏదో అవకాశం వచ్చి ఒక యూనివెర్సిటీ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా వేయించా," అని ఒక పెద్ద సారు ఒకసారి పబ్లిగ్గా చెబితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇలా ఎంపికైన మహాతల్లి...వృత్తిలో ప్రొఫెషనల్ గా ఉంటుందా? నో వే. తన చర్మాన్ని రక్షించుకునేందుకు నానా డ్రామాలు చేస్తుంది, నానా గడ్డి కరుస్తుంది. ఒక మహిళను ప్రోత్సహించి పీ హెచ్ డీ చేయించవచ్చు గానీ...పైరవీ తో నియామకాలు జరిపితే? ఇలాంటి వాటివల్ల కనిపించకుండా దారుణంగా దెబ్బతినేది భావితరాల విద్యార్ధులు. 

ఇక స్కూళ్ళలో, యూనివర్శిటీ లలో ఘోరంగా కులగజ్జి పెరుగింది. ఇది చాలా ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. అగ్ర కులాలు, ముఖ్యంగా సో కాల్డ్ బ్రాహ్మణులు, ఎస్సీల మధ్య ఘోరమైన ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నది. చాలా ఏళ్ళ కిందట విశ్వవిద్యాలయాల్లో చేరిన బ్రాహ్మణులు డీన్ లుగా, వీసీ లుగా ఎదిగారు. ఇందులో పలువురు నిజంగానే కులం ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుని అంతేవాసులకు ఆశ్రయం (లక్షలు తెచ్చే ఉద్యోగాలు) ఇచ్చి, కులపు పిల్లలకు చేయూతనిస్తూ వచ్చారన్నది ప్రధాన ఆరోపణ. సొంత ప్రతిభతో గానీ, రిజర్వేషన్ల మూలంగా గానీ ఈ సంస్థల్లో పెద్ద సంఖ్యలో  చేరిన సో కాల్డ్ అణగారిన వర్గాల వారు, ముఖ్యంగా ఎస్సీ లు, ఈ అన్యాయాన్ని ఎదిరించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో జట్టు కట్టారు. ఇది అనేక విశ్వవిద్యాలయాల్లో, డిపార్ట్మెంట్ లలో ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. వాడు చేసాడని వీడు, వీడు చేయట్లేదా.. అని వాడు! బలయ్యేది పిల్లలు, దేశం. 

నాణ్యత కాకుండా.... ఇతరేతర సమీకరణాలను పరిగణలోకి తీసుకునే ఏ నిర్ణయమైనా... అది ఎవరు తీసుకున్నా తప్పే. ఏ కులాల వాళ్ళు ఆ కులపు బోధకులతో జట్టు కట్టడం, కుట్రలు చేయడం, అ కులపు విద్యార్ధులను మాత్రమే వారంతా ప్రోత్సహించడం...దారుణం, దేశద్రోహం. గురువులారా...మీది ఏ కులమైనా కావచ్చు. దాన్ని ఇంట్లో చక్కగా పాటించుకోండి, వ్యాపింపజేసుకోండి. ఈ పిచ్చి రాజకీయాలు, కుల పిచ్చి పక్కనబెట్టి అద్భుతమైన ఈ భారత దేశాన్ని అగ్రరాజ్యంగా మలచడంలో మీ భూమిక ఏమిటో తెలుసుకోండి. వ్యవస్థలను పటిష్ట పరిచే పనులు చేయండి, దేశ దిశానిర్దేశానికి మీ కార్తవ్యం ఏమిటో ఆలోచించండి. ఈ దేశ నిర్మాణంలో నిజమైన పాత్రధారులు, సూత్రధారులు కండి. గురువు... దేముడని మనసావాచా కర్మణా నమ్మే ఈ దేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి సార్.. ప్లీజ్. 

(నోట్: ఈ వ్యాసంలో వాక్యాలను బ్లాంకెట్ స్టేట్మెంట్ గా తీసుకోకండి. స్కూళ్ళలో, కాలేజీల్లో, యూనివర్శిటీ లలో మనం పైన చూసిన చెత్త అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా... అత్యుత్తమ బోధనే ధ్యేయంగా భావి తరానికి స్ఫూర్తినిచ్చే మహనీయులు ఎందరో ఉన్నారు. వారందరికీ పాదాభివందనాలు, శుభాకాంక్షలు).    

Wednesday, September 3, 2014

'సాక్షి' లో చేరనున్న కొండుభట్ల రామచంద్ర మూర్తి గారు

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెంటిలో తనదైన ముద్రవేసిన సీనియర్ మోస్ట్ సంపాదకుడు కొండుభట్ల రామచంద్ర మూర్తి గారు 'సాక్షి' పత్రికలో చేరబోతున్నారు. దీన్ని ఆయన 'తెలుగు మీడియా కబుర్లు' కు దృవీకరించారు... బుధవారం.  ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఆయన 'సాక్షి' లో గురువారం చేరతారు. 

నిజానికి 'సాక్షి' పత్రిక ఆరంభించాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు... అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆహ్వానించినప్పటికీ మూర్తి గారు ఎడిటర్ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత పతంజలి గారు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. ఆయన మరణానంతరం వర్ధెల్లి మురళి గారు ఎడిటర్ అయ్యారు. సజ్జల రామ కృష్ణా రెడ్డిగారు మానేజింగ్ ఎడిటర్ గా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించడంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ విఫలం కావడం, ఈ లోపు అనూహ్య పరిణామాల మధ్య మూర్తి గారు 'ద హన్స్ ఇండియా', హెచ్ ఎం టీవీ ల నుంచి బైటికి రావడం తెలిసిందే. 
'సాక్షి' పాత్రపై కూడా ఆ సంస్థలో అంతర్మథనం జరుగుతున్న నేపథ్యంలో... యాజమాన్యం ఒక పెద్ద దిక్కు కోసం ఎదురుచూస్తూ... మూర్తి గారిని ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రింట్ జర్నలిజం లో అద్భుతమైన ఎడిటర్ మూర్తి గారు అనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. వార్త, ఆంధ్ర జ్యోతి ఎదుగుదలలో మూర్తి గారి పాత్ర ఎక్కువే. 

ఆయన అంధ్ర జ్యోతిలో సంపాదక బాధ్యతలు స్వీకరిస్తుండగా.. కపిల్ గ్రూప్ యాజమాన్యం ఏరికోరి మూర్తి గారికి కొత్త ఛానల్ ఏర్పాటు బాధ్యతలు అప్పగించింది. 'దశ-దిశ' వంటి చారిత్రక ప్రోగ్రామ్స్, అంబుడ్స్మన్ నియామకం  వంటి వినూత్న చొరవ తీసుకుంటూ నైతిక జర్నలిజం అనే మాటను బహిరంగంగా అనగలిగే అరుదైన ఎడిటర్ గా పేరు తెచ్చుకున్నారు. హంస టీవీ సూపర్ గా నడుస్తున్నప్పుడు... 'ద హన్స్ ఇండియా' అనే ఆంగ్ల పత్రిక ఆరంభించి...ఎక్కడో తెరమరుగైన నాయర్ అనే సీనియర్ ఎడిటర్ ను పట్టుకొచ్చి... తనూ ధారాళంగా రాసారు. దీనివల్ల మూర్తి గారు చేతులు కాల్చుకున్నారని చెప్పకతప్పదు. కాలమానపరిస్థితులు, సుడి బాగోలేక అనూహ్య పరిస్థితుల మధ్య ఇటీవలనే బైటికి వచ్చారాయన. ఆయన ను నమ్ముకున్న 20-30 మంది సీనియర్ జర్నలిస్టులను హెచ్ ఎం టీవీ కొత్త యాజమాన్యం పీకిపారేసిన నేపథ్యంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్న మూర్తి గారికి... అల్ ద బెస్ట్. 
Photo courtesy: The Hindu 

Monday, September 1, 2014

బాపు గారి పై భమిడిపాటి ఫణిబాబు గారి వ్యాసం

తెలుగు భాష మీద అమితమైన గౌరవంతో, సాహిత్యాభిమానంతో, మానవత్వంతో, నైతికతతో, మనస్ఫూర్తిగా రచనలు చేసే బ్లాగర్లలో భమిడిపాటి ఫణిబాబు గారు (harephala.wordpress.com) ముఖ్యులు. బాపు గారు మనకిక లేరు... అన్న వార్త తెలియగానే... నాకీ పెద్దాయన గుర్తుకు వచ్చారు. పాపం... ఈయన ఎంతగా నొచ్చుకుని ఉంటారో కదా! అనిపించింది. బాపు గారి మీద ఫణిబాబు గారు ఏమి రాస్తారో చూడాలని అనుకున్నాను. ఆ నిజమైన నివాళి కోసం ఎదురుచూస్తున్నాను. బాపు గారితో సహా తేట తెలుగు ప్రముఖులను కలిసి భాష, సంస్కృతుల తియ్యందనాలను ఆస్వాదించి, బ్లాగులో మనకు పంచడమనే మంచి పనిని పూణే లో నివసిస్తున్న ఫణిబాబు గారు చేస్తూ స్పూర్తినిస్తారు. 

బాపు గారు ఎనభై వసంతాలు పూర్తిచేసుకున్న రోజున-- గత ఏడాది డిసెంబర్ 14 న--ఫణిబాబు గారు బాపు గారి గురించి రాసిన సింపుల్ వ్యాసం నాకు నచ్చిన వ్యాసాల్లో ఒకటి.   "తెలుగువారు ప్రస్థుత వాతావరణం లో కూడా సిగ్గూ ఎగ్గూ వదిలిపెట్టేసి పరిసరాలు కూడా మర్చిపోయి మనసారా నవ్వుకోగలుగుతున్నారంటే దానికి ఒకేఒక్క కారణం మన బాపు గారే అనడంలో సందేహమేమీ లేదు..." అనే ఒక బోల్డ్ స్టేట్మెంట్ తో ఆ వ్యాసం ఆరంభమవుతుంది. 
"ఇలాటి జన్మదినాలు ఎన్నో...ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్ధిస్తూ…శ్రీ బాపు గారికి.. హృదయపూర్వక శుభాకాంక్షలు"  అని ఫణిబాబు ముగించారు. కానీ విధివశాత్తూ శ్రీ బాపు మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. 

ఈ సందర్భంగా ఫణిబాబు గారు రాసిన వ్యాసం ('బాపు'రే... ఎక్కణ్ణించి వస్తాయో ఆ ఆలోచనలు)  మీ కోసం దిగువన ఇస్తున్నాను. బాపు గారి గురించి అంత అద్భుతంగా మనసుకు హతుకునేలా రాసే శక్తి సామర్ధ్యాలు, అర్హతలు మాకు లేక... ఫణిబాబు గారి వ్యాసం తస్కరించి ఇస్తున్నాం తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాం.  ఫణిబాబు గారికి కృతఙ్ఞతలు. 

తెలుగువారు ప్రస్థుత వాతావరణం లో కూడా సిగ్గూ ఎగ్గూ వదిలిపెట్టేసి పరిసరాలు కూడా మర్చిపోయి మనసారా నవ్వుకోగలుగుతున్నారంటే దానికి ఒకేఒక్క కారణం మన బాపు గారే అనడంలో సందేహమేమీ లేదు. అసలు ఆయన వేసే కార్టూన్లు చూడ్డంతోటే నవ్వొచ్చేస్తుంది. ఇంక వాటికి వ్రాసిన కాప్షన్లైతే మరీనూ. ఆ బుర్రలోకి అలాటి ఆలోచనలు ఎలా వచ్చికూర్చుంటాయో తెలియదు. ఈ టపాలో పెట్టిన ఫొటో ఎప్పుడో “హంస” పత్రిక కి ముఖచిత్రంగా వేశారు. మరి దానికి సంబంధించిన వ్యాసం కూడా చదివేయండి..మన బాపు
    తెలుగు ఆడబడుచుకి నిర్వచనం చెప్పి, తెలుగమ్మాయి ఎలాఉండాలో చూపించిన ఘనత ఆయనదే. ఓ అమ్మాయి అంటే ఓ benchmark సృష్టించి అమ్మాయంటే ఇలాగుండాలీ అని ఓ ఆర్డరు పాస్ చేసేశారు.తెలుగు ఆడబడుచుకి ముగ్ధమనోహరరూపం సృష్టించింది “ఆంధ్రసచిత్రవారపత్రిక” కి ” ముఖపత్రచిత్రం వెనక కథ ఏమిటో కూడా చదివి ఆనందించండి.
ముఖపత్ర చిత్రం
    ఆరోజుల్లో శ్రీబాపు గారు “తెలుగువెలుగు” శీర్షికతో పాటు కొన్ని కథలు చిన్నపిల్లలకోసం వ్రాసేవారు. మచ్చుకి ఓ జపనీస్ కథ ఆధారంగా వ్రాసిన కథ కూడా చదవొద్దూ మరి..అమ్మ బొమ్మ– శ్రీ బాపు
    అసలు తాము తీసిన సినిమాలమీద వ్యంగ్యాస్త్రాలు వేయడం ఎప్పుడైనా విన్నామా? మరి అదే శ్రీ బాపు గారి ఖలేజా..మా సినిమాలు-బాపు( This link may take some time to open.. please bear with me. Be patient..its worth the delay)
    అసలు ఎన్నో ఎన్నెన్నో వ్రాయాలనుకున్నాను. కానీ ఆయన గురించి వ్రాయడానికి మనకి ఓ అర్హత కూడా ఉండాలిగా. అది లేకే ఇంకెవరెవరో వ్రాసినవి మీ అందరితోనూ పంచుకుంటున్నాను.ఈ సందర్భంలోనే , శ్రీ బాపు గారి “గొప్ప మనసు” గురించి, తన అనుభవాన్ని, మా మిత్రులు శ్రీ కృష్ణమోహన్ గారి అక్షరరూపంలో ఉంచారు. చదవండి.satamanam
    అఛ్ఛా Also ran.. అని ఎప్పుడంటారో విన్నారా? ఇదిగో ఇలాటప్పుడు– ప్రముఖులకి సంబంధించిన విషయాలలో ఇంకో అర్భకుడి గురించి చెప్పాల్సొస్తే, ఇలా Also ran.. అని అంటూంటారు.ఇక్కడ ఆ అర్భకుడికి ఎటువంటి ప్రాముఖ్యతా ఉండదు ఏదో ఓ ఒక్క విషయంలో తప్పించి..అదిగో అలాటి సందర్భంలోనే నేను కూడా Also ran. గురువుగారు డిశంబరు 15 న ఎనభైయ్యో సంవత్సరం పూర్తి చేసికుంటూంటే నేను డెభైయ్యో పడిలోకి అడుగెడుతున్నాను, అది నేను చేసికున్న అదృష్టం.
    ఇలాటి జన్మదినాలు ఎన్నో..ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్ధిస్తూ…
     శ్రీ బాపు గారికి
     హృదయపూర్వక శుభాకాంక్షలు