Tuesday, February 9, 2010

విలేకరులపై 'యాడ్స్' భారం--ప్రమాదంలో జర్నలిజం

వ్యాపారవేత్తలు ప్రెస్ అధిపతులైతే ముంచుకొచ్చే ప్రమాదాన్ని రెండో ప్రెస్ కమిషన్ ప్రస్తావించింది. బడా వ్యాపారులు మీడియాను గుప్పిట్లో పెట్టుకుంటే ప్రజాస్వామ్యానికి వచ్చే నష్టం ఊహించడం పెద్ద కష్టం కాదు. నల్లదో, తెల్లదో ఏదో ఒక డబ్బున్న మహారాజు అడుగులకు మడుగులొత్తే ఈ వ్యవస్థలో మీడియా చేతిలోఉన్నవాడు ఇప్పుడు కింగ్ ఆఫ్ ది కింగ్స్ అయిపోయాడు.

భూ దందాలు, భవన నిర్మాణాలు, చిట్టీ వ్యాపారాలు చేసుకునే వారు తెలుగు నాట మీడియా ప్రభువులుగా మారిపోయారు. విశాల దృక్పథంతో ఆలోచించి వీరికి ముకుతాడు వేసే యంత్రాంగం, దమ్మున్న జర్నలిస్టులు, మేథావులు, జర్నలిస్టు యూనుయన్లు లేకపోవడంతో...ప్రజాస్వామ్యానికి భయంకరమైన చేటు కలుగుతున్నది.

ప్రజా సేవతో పాటు...ప్రకటనల ద్వారా సంపాదించుకునేందుకు ఛానెల్స్ పెడితే సరే అనుకోవచ్చు. గత ఎన్నికలకు ఒకటి రెండు సంవత్సరాల ముందు పలువురు ధనిక స్వాములు వై.ఎస్.ఆర్. అండ చూసుకోనో, చంద్రబాబు దన్ను చూసుకొనో తెలుగులో ఛానెల్స్ పెట్టారు. మంది ఎక్కువయ్యేసరికి మజ్జిగ పలచన అయ్యింది. దానికి ఆర్ధిక మాంద్యం తోడయ్యింది. వై.ఎస్.ఆర్. మరణం, రాజకీయ పరిణామాలు కూడా తమవంతు ప్రభావం చూపాయి. ఇలా ఈ ఛానెల్స్ అనుకున్నంత గడించలేక గందరగోళంలో పడ్డాయి. దీంతో...ప్రకటనలు తెండని విలేకరుల మీద పెను భారం మోపుతున్నాయి.
విలేకరికి, ప్రకటనకు ముడి పెడితే...జర్నలిజం గోవిందే. ఈ తంతు ఎలా వుంటుందో చూడండి.  

N-TV విషయమే తీసుకుందాం. రియల్ ఎస్టేట్ రంగంలో అడ్డదిడ్డంగా సంపాదించిన నరేంద్రనాథ్ చౌదరి గారు ఈ ఛానల్ పెట్టారు. మీడియా బ్యారెన్ మాదిరిగా ఎన్-టీ.వీ.తో పారు "భక్తి", "వనిత" ఛానెల్స్ పెట్టారాయన. రామోజీ రావు దగ్గర పనిచేసి మీడియా గుట్టుమట్లు, లైసెన్సు కిటుకులు తెలిసిన రామానుజం గారు ఆయనకు సహకరించారు. బాడీలో కాంగ్రెస్ రక్తం ఉన్న చౌదరి గారు వై.ఎస్.ఆర్. మరణంతో చాలా కోల్పోయారు. ఎన్నికలు కాగానే..ఆయన పోగానే...ఆర్ధిక భారం పెరగకుండా చూసుకునేందుకు ఆయన పంచన చేరిన వారు సలహా ఇచ్చారు. అదే...విలేకరులను ప్రకటనల సేకరణకు వాడుకోవడం.

"N-TV ది మరీ దారుణం. భక్తి ఛానల్ పేరిట యాడ్స్ వసూలు చేయమంటున్నారు. విలేకరులకు టార్గేట్స్ నిర్దేశించి...చిత్రహింసకు గురిచేస్తున్నారు," అని ఒక జర్నలిస్టు చెప్పారు. చివరకు మండల స్థాయి విలేకరినైనా వదలడం లేదు. ఇంకా ఘోరం ఏమిటంటే...మంచి స్టోరీలు రాబట్టేందుకు...జిల్లాలలో విలేకరుల కోసం పెట్టే సమావేశంలో ఒక సీనియర్ జర్నలిస్టు హైదరాబాద్ నుంచి వెళ్లి సిగ్గూ ఎగ్గూ లేకుండా..ప్రకటనలపై ప్రసంగించి...ఒత్తిడి తెస్తున్నాడు. 

ఇది ఒక్క చౌదరి గారి ఛానల్ లో మాత్రమే కాదు. 90 శాతం ఛానెల్స్ లో ఇదే తంతు కొనసాగుతున్నది. దీనివల్ల జర్నలిస్టులు ఒత్తిడికి లోనవుతున్నారు, జర్నలిజం ప్రమాదంలో పడింది. ఈ ధోరణిని జర్నలిస్టు సంఘాలు వెంటనే పట్టించుకోవాలి.

ఇలా ప్రకటనలు వసూలు చేయమంటే ఎమిజరుగుతుంది? ప్రకటనల సేకరణ ఒత్తిడి వల్ల విలేకరి రాజకీయ నేతతో లాలూచీ పడతాడు. నేతలపై ఆధారపడ్డ గుండాలు, అవినీతిపరులు కూడా దీని వల్ల తప్పించుకుంటారు. విలేకరులు ఒక్క పరిశోధనాత్మక స్టోరీ అయినా చేయలేరు. విలేకరికి దొరికిన వాడు కూడా..ప్రకటన ఇస్తా...అని తప్పించుకోవచ్చు. ఈ ధోరణి వల్ల...విలేకరి-నేత-అధికారి-వ్యాపారి-పోలీసు-గూండా సభ్యులుగా నయా మాఫియా ఏర్పడుతుంది.  ఇది సమాజానికి మంచిది కాదు.

Monday, February 8, 2010

ముస్లిం కోటాపై 'ఈనాడు' ఓవర్ యాక్షన్

'ముస్లిం కోటా చెల్లదు' అనే వార్తకు ఈరోజు 'ఈనాడు' పత్రిక సముచిత ప్రాధాన్యం ఇస్తూనే..పతాక కథనం (బ్యానర్ స్టోరీ) గా ప్రచురించింది. కానీ..అది వాడిన ఒక ఏడుగురు న్యాయమూర్తుల ఫోటోలు అభ్యంతరకరంగా ఉన్నాయి. 

జడ్జీలు వృత్తిధర్మంలో భాగంగా...కేసును అధ్యయనం చేసి ఒక తీర్పు ఇస్తారు. ఒక బెంచిలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. వార్తకు ప్రాణం...కేసులో అంశాలను ఎవరు సమర్ధించారు, ఎవరు వ్యతిరేకించారు? అన్న పాయింట్ కాదు. తీర్పు సారం ఏమిటన్నది వార్త. అలాంటిది 'ఈనాడు' వారు..."చట్టాన్ని కొట్టివేస్తూ తీర్పునిచ్చిన న్యాయమూర్తులు" అనే శీర్షిక కింద ఒక ఐదుగురు జడ్జిల ఫోటోలు, "సమర్ధించిన న్యాయమూర్తులు' శీర్షిక కింద మరొక ఇద్దరి ఫోటోలు మొదటిపేజీలో ప్రముఖంగా ప్రచురించారు.

ఇది నాకు అభ్యంతరకరంగా తోచింది. ఇంత సున్నిత అంశంపై ఇచ్చిన తీర్పుకు ఇలాంటి డిస్ ప్లే ఇవ్వడం మంచిది కాదు. ఆ ఫోటోలు అంత ప్రముఖంగా ప్రచురించేటంత రిలవన్సు కలిగి వున్నాయని అనిపించడం లేదు. మరే పత్రికా...ఇలాంటి సాహసం చేయలేదు. జడ్జిలూ మానవమాత్రులే...వారి మీదకు ఒక వర్గం వారిని ఉసికొల్పేలా ఫోటోలు వాడడం బాగోలేదు. అది బాధ్యతాయుతమైన పని కాదు.

Sunday, February 7, 2010

అవినీతి డబ్బు వల్ల జబ్బు చేస్తుందా? జీవితంలో గబ్బు లేస్తుందా??

ఈ ఆదివారం రోజు తిండి (వెల్లుల్లి, శనగపప్పు దట్టించిన కాకరకాయలు సైడ్ డిష్ గా తోటకూర, మెంతికూర పప్పు ప్లస్ మజ్జిగ చారు...వగైరా) గురించి రాయడానికి పసందైన దినుసులు ఉన్నా...'ఫర్ గాడ్స్ సేక్..ఇలాంటి రాతలు వద్దు బాబోయ్' అని మొత్తుకుంటున్న రమణన్నకు  భయపడి భుక్తాయసంతో కొత్త టాపిక్ మొదలెట్టాను. అదే..నీతీ నిజాయితీ--అవినీతీ. 


మంత్రులూ...వ్యాపారాలు వద్దు..అని ప్రధాని మన్మోహన్ సింగ్ ఉద్బోధ చేస్తే...నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడంలేదు. ఆదర్శప్రాయమైన పటాటోపం లేని జీవితం గడపండి అంటే..ఆ పార్లమెంట్ లో ఒక పది మంది ఎం.పీ.లైనా మిగలరు. సగం మంది రాజకీయంలోకి వచ్చేది ఒక పది తరాల మందం వెనకేసుకోవడానికి. నాకు అవినీతి విషయంలో ఒక ధర్మ సందేహం ఎప్పుడూ కలుగుతుంది. 'ధర్మో రక్షతి రక్షితః' అన్న మాట ఎందుకో గానీ మనసులో నాటుకుపోయింది. అది అక్షర సత్యం అని నాకు చాలా సార్లు నిరూపితమయ్యింది. 
'ది హిందూ' లో పనిచేస్తున్నప్పుడు...ఈ ధర్మం, అధర్మం మీద ఒక ప్రయోగం చేసి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అది మంచి సంస్థే కానీ...జిల్లాలో రిపోర్టర్ కు ఆఫీసు ఇవ్వరు. మన ఇంట్లో ముందు గదే ఆఫీసు. కరంటు బిల్ ఇవ్వరు. అదొక రాయల్ దోపిడీ. ఇదేంటి సార్...దారుణం...అంటే.."ఒకటి రెండు టూర్ బిల్లులు పెట్టుకో...నేను పాస్ చేస్తాను. దానికి దానికి సరిపోతుంది," అని ఒక బాస్ చెప్పీ చెప్పనట్లు చెప్పారు. 

ఈ దొడ్డిదారి ఏర్పాటులో భాగంగా నేను కొన్ని టూర్ బిల్లులు (అంటే...దొంగ బిల్లులన్న మాట) అప్పుడప్పుడు పెట్టేవాడిని. నన్ను నమ్మండి...దొంగ బిల్లు పెట్టి ఒక రెండు వేలో, మూడు వేలో పోగేస్తే...కచ్చితంగా ఆ మొత్తానికి సరిపోను అదనపు ఖర్చు ఆ నెల వచ్చి తీరేది. ఎప్పుడు ఆ టూర్ బిల్ పెట్టినా...ఏదో ఒక నష్టం వచ్చి...ఆ అదనపు సంపాదన మేర జేబుకు చిల్లు పడేది. ఈ పాట్రన్ ను జాగ్రత్తగా స్టడీ చేసి అలాంటి బిల్స్ పెట్టకుండా...వచ్చిన జీతంతో సరిపుచ్చుకున్నాను, హాప్పీ గా బతికాను.
ముందు నుంచీ.. అబద్ధాలు చెప్పడం మహా దారుణం అన్న స్పృహ ఉంది. 'ది హిందూ' లో అనుభవాలు నేర్పిన పాఠాలతో ధర్మం పై మరింత నమ్మకం కుదిరింది. ఒకడి సొమ్ము ఆశించకుండా...ఎవ్వరినీ మోసం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా..నీతీ నిజాయితీ గా బతకడం వల్ల జీవితం సుఖంగా సాగిపోతుందని...పెద్దగా కష్టాలు దరిచేరవని నిర్ధారణకు వచ్చాను. అందుకే...అబద్ధాలు లేని జీవితం కోసం ఒక సంస్థ స్థాపిస్తే...ఒక్కడంటే ఒక్కడైనా అందులో చేరలేదు. అది వేరే విషయం. 


అయితే...నా పరిశీలనలో తేలింది ఏమిటంటే...అవినీతి మార్గాల ద్వారా సొమ్ము సంపాదించిన వాళ్ళలో చాలా మందికి అనారోగ్యం ఉన్నది. వాళ్లకు బీ.పీ., షుగర్, ఇంట్లో భార్యకు నలత, పిల్లలకు ఏదో లోపం, వారి కుటుంబంలో ఏదో తెలియని దిగులు ఉంటున్నాయి. మీ చుట్టూ ఉన్న అవినీతిపరుల కేసి ఒకసారి చూడండి, నిజం తెలుస్తుంది. నల్గొండ బీ.ఎస్.ఎన్.ఎల్.లో భారీ కుంభకోణానికి పాల్పడిన ఒక సీనియర్ అధికారిని ఒక పరిశీలనలో భాగంగా కలిసాను. వాడికి విచిత్రంగా అర చేతిలో నుంచి చీము వచ్చే ఒక జబ్బు సోకింది.  ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. 
మరి అందరు అవినీతి పరులకు అలా జరుగుతున్నదో లేదో నాకు తెలియదు. ఎందుకంటే...దానికి ఒక శాస్త్రీయ అధ్యయనం అవసరం. అలాగే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు అంతా అవినీతి పరులని అనడమూ తార్కికం కాదు. ఇది కొంత ఆధ్యాత్మిక చింతనగా తోచినా...అవినీతికి ఆరోగ్యానికి ఏదో సహ సంబంధం లేదా కార్యకారం సంబంధం ఉందని నేను గట్టిగా నమ్మే పరిస్థితికి వచ్చాను. హిందూ శాస్త్రాలు, ఇతర మతాలలో పాపం-శిక్ష గురించి చదివాను కానీ..ఇక్కడి పాపానికి ఇక్కడే శిక్ష ఉన్నట్లు నాకు అనిపిస్తున్నది.  ఈ అంశంపై మీ అభిప్రాయలు కూడా తెలియజేయండి. 

ఈ రోజు తేజ ఛానల్ లో వచ్చిన "బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాలో సత్య హరిశ్చంద్రుడు ఒక మాట అంటాడు: "సత్యం పలకడం అనేది పరులకోసం చేసే పని కాదు. ఇది మానవ జీవిత గమనానికి సంబంధించిన అంశం."
గ్రీకు వీరుడు అలగ్జాండర్ మరణ శయ్య పై ఉండి తన మిలిటరీ జనరల్స్ ను ఒక మూడు కోరికలు కోరతాడట. అవి:
1) నా శవ పేటికను నా వైద్యుడు మొయ్యాలి
2) నా శవ యాత్ర జరుగుతున్నప్పుడు...నేను ఇన్నాళ్ళు సంపాదించిన వజ్రాలు, బంగారం, సంపద..రోడ్డు మీద చల్లుతూ పోవాలి 
3) నా రెండు చేతులు శవ పేటిక లోపల కాకుండా..బైట ప్రజలంతా చూసేలా వుంచి ఊరేగించాలి. .
ఎందుకిలా అని జనరల్స్ అడిగితే..."నా వైద్యుడు మోయాలని ఎందుకు అన్నానంటే...మరణాన్ని ఎవ్వరూ తప్పించలేరని జనానికి తెలియజెప్పడానికి. ఇంత సంపద ఉన్నా...నా చావు ఆగలేదని చెప్పేందుకు రెండో కోరిక కోరాను. ఇక మూడో కోరిక అంటారా...ఇన్ని ఘోర యుద్ధాలు చేసి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరిచిన నేను పొయ్యేటప్పుడు...ఒట్టి చేతులతో పోతున్నానని ప్రజలకు తెలియాలి." 
మన ఎం.పీ.లు, రాజకీయ నాయకులు, పేరాశ అధికారులు, జనం మెదళ్ళను బ్రష్టు పట్టిస్తున్న మీడియా జనం...ఇవి గుర్తుపెట్టుకుని...జీవిస్తే...అందరం సుఖంగా ఉండ వచ్చేమో!

Saturday, February 6, 2010

తెలుగు భాషకు 'వాచిపోతున్నది' ఇక్కడ....


భాషకు కూడా శుచి, శుభ్రతలు ఉన్నాయి. పరాయివైనా మంచి పదాలు వచ్చి చేరితే..సమస్య ఉండదు. పిచ్చి పదాలను జనంలో పదేపదే చెలామణీ చేసి భాషను సంకరం చేయడం తప్పు. 
సరైన అర్థమేనా కాదా అన్నదానితో సంబంధం లేకుండా.... కొన్ని సార్లు అర్థం తెలియకుండా మనం కొన్ని పదాలు వాడుతూ ఉంటాం. సినిమాలు, టీ.వీ.లు, పత్రికల పుణ్యాన అవి జనం వాడుకలోకి వచ్చి స్థిరపడతాయి. తీరా అవి స్థిరపడి జనం నోళ్ళల్లో నానాక...అరె..ఇందులో బూతు ధ్వనిస్తుందే...అని అనుకున్నా లాభం ఉండదు.

చూడక...చూడక...మళ్ళీ ఆదివారం ముందు రాత్రి తెలుగు ఛానళ్ళు చూశాక ఈ పోస్ట్ రాయాలనిపించింది. ఈ పద్నాలుగు ఛానెల్స్ లో ఎందులోనో కానీ...ఒక లేడి యాంకర్...వార్తలు చదువుతూ..."అలా చేయకపోతే...వాచిపోతుంది" అని చదివారు. ఆ పదం ఆమె చదివిన వాక్యంలో అతికినట్లు అనిపించకపోగా....భలే ఎబ్బెట్టుగా తోచింది. కనీసం బూతు మాటలైనా సరిగా రాని లేటెస్టు తరానికి అర్థం కాదు కానీ...ఇలాంటి మాటలు ఎందుకో సంసార పక్షంగా అనిపించవు. 

ఇక్కడ 'వాచిపోతుంది' అంటే...'అలా చేయకపోతే...ఇబ్బంది/ ప్రమాదం తప్పదు,' లేక 'శిక్ష పడుతుంది' అని అర్థం. "అబ్బ..డాడీ...నాకసలే వాచిపోయే హోం వర్క్ ఉంటే...వేరే పనులు చెబుతారేం?' అని ఒక స్కూలు విద్యార్థిని అనడం విన్నాను. ఇలాంటి పదాలను విరివిగా వాడి వాటిని వ్యవస్థీకృతం చేసే సినిమాలను అని తీరాలి. 

"ఆ సుత్తి (ఈ పదమూ సినిమా ప్రసాదమే) విని వినీ నా తల వాచిపోయింది," అంటే ఓకే. ఏమి వాచిందో చెప్పకపోతేనే చిక్కు వస్తుంది. "నువ్వు అన్నీ మూసుకో" అనడం వేరు..."నువ్వు నోరు మూసుకో," అనడం వేరు.
అలాగే...అద్దరకొట్టడం లేదా అదుర్స్. నిజానికి నాకు తెలిసినంత వరకు..."నువ్వు అదరకొట్టకురా...." అంటే.."నేను చెప్పేది కాదు అని తోసిపుచ్చి మాట్లాడకు" అని అర్థం. కన్ను అదరడం అంటే...అది అనుకోకుండా...జర్క్ ఇవ్వడం."అద్దిరిపోయింది" అంటే...చాలా బాగుందని అన్నమాట.

"ఆ మాట వినే సరికి ఆయనకు ఎక్కడో కాలింది," అన్న ద్వంద్వార్ధపు మాట చాలా చోట్ల తగులుతున్నదీ మధ్య. సినిమాలలో బ్రహ్మానందం బ్యాచ్ ఈ మాటకు విపరీతమైన ప్రాచుర్యం కల్పించింది. "దొబ్బమాకు లేదా దొబ్బకు" అనే పదం చిన్నప్పుడు ఒక బూతు అర్థంలో వాడే వాళ్ళం...ఇప్పుడది నిత్యజీవనంలో క్షణక్షణానికి పునరావృతమయ్యే మాటై కూర్చుంది. నూకడం/ దొబ్బడం అంటే 'నెట్టడం' అన్న అర్థం కొన్ని చోట్ల ఉంది.

"ఎంట్రా...వాడు పిలవగానే ఏంటీ అబ్బో తెగ ఎగేసుకుని పోతున్నావ్?" అన్న డైలాగు చాలా సార్లు వినివుంటాం. ఈ "ఎగేసుకు పోవడం" ఏమిటి? అలాగే..."ఏంటమ్మా...తెగ ఊపుకుంటూ వస్తున్నావ్?" అన్న మాట కూడా తరచూ వినేదే. ఈ 'ప'కారం పక్కన 'క'కారం పెడితే...మా గురువు గారు బూదరాజు రాధాకృష్ణ గారు మాటల తూటాలతో శిష్యహత్య చేసే వారు. దాన్ని పలికినప్పుడు బూతు మాట ధ్వనిస్తుంది కాబట్టి ఆ రూలు. 

(ఆయన దగ్గర అక్షరాలు నేర్చుకుంటున్నప్పుడు..'హీరో పుక్' అనే బండి మార్కెట్ లోకి వచ్చింది. ఇందులో 'ప'పక్కన 'క' వచ్చింది కాబట్టి...గురువు గారి రూలు కు అనుగుణంగా రెండు అక్షరాలను బ్రేక్ చేసి 'హీరో పునక్' అని పిలిచే వాళ్ళం.)

ఇలా బూత్వర్థంతోనో...బూతుకు సమాన అర్థంతోనో...కొన్ని పదాలు/ పదబంధాలు ఈ తియ్యని తెలుగుని సంకరం చేస్తున్నాయి. డొక్క శుద్ధి, సరైన శిక్షణ లేకపోయినా....సీ.ఈ.ఓ.ల బూట్లు నాకి...యజమానుల మెప్పు పొందిన పలువురు నయా మేధావులు మీడియాను దున్నేస్తున్నారు కాబట్టి...ఇలాంటి పదాలకు చాలా ప్రచారం లభిస్తున్నది. దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఇదేంట్రా....ఈ యాంకర్ పిల్ల....చాలా ఆలవోకగా...వాచిపోతుందని...వార్న్ చేస్తున్నదని...అనుకుని...ఛానల్ మార్చి zee-24 gantalu దగ్గర స్థిరపడితిని కదా...అక్కడొక వింత తప్పు దొరికింది. 
తెలుగులో...."చెవి కోసుకుంటాడు" అంటే...ఏదైనా ఆసక్తి కలిగించే అంశం అంటే సదరు మనిషికి చాలా ఆశక్తి/ శ్రద్ధ అని అర్థం. మన జీ-టీ.వీ.మిత్రుడు..సీ.పీ.ఐ.నారాయణ గారికి చికెన్ మీద ఉన్న ప్రీతిపై ఒక ఆఫ్-బీట్ స్టోరీ ప్రసారం చేస్తూ...."నారాయణ చికెన్ అంటే...చేవికోసుకుంటారు," అని చదివారు. కానివ్వండి బాబూ....తెలుగు భాషను కైమా కింద కొట్టి పారెయ్యండి.      

ఎన్-టీ.వీ. అరుణా? కాంగ్రెస్ స్పోక్స్ ఉమనా?

ఎన్-టీ.వీ.కి దేశ రాజధానిలో ప్రతినిధి గా ఉన్న అరుణ గారు పలు సందర్భాలలో ఫక్తు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. కొద్ది నిమిషాల కిందట పరకాల ప్రభాకర్ గారి "నమస్తే ఆంధ్రప్రదేశ్" షో లో ఢిల్లీ నుంచి లైవ్ లో ఆమె ఇచ్చిన విశ్లేషణ ఈ అనుమానానికి మరింత ఊతం ఇచ్చేదిగా ఉంది. 
కాంగ్రెస్ కమిటీ లో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన తండ్రి నమ్మిన బంటు కే.వీ.పీ.రామ చంద్ర రావుకూ ఎందుకు చోటు కల్పించినట్లు అని ప్రభాకర్ గారు అడిగితే...ఆమె విశ్లేషణను అందిస్తూ...."జగన్ క్రౌడ్ పుల్లర్. ఈ ప్రాంతంలో అయినా...ఆయన జనాలను ఆకర్షించగలరు," అని అరుణ గారు తేల్చేసారు. 
"మనం అలా చూడడం కరక్ట్ కాదు ప్రభాకర్ గారు.." అని ఒక దశలో ఆమె చెప్పారు. ఏ.ఐ.సీ.సీ.కి సొంత లాభాల దృష్ట్యా...భవిషత్తులో వీరిద్దరి వల్ల కలిగే మేలు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. అదేదో...తాను భావిస్తున్నట్లో...అలా అని సోర్సులు చెప్పాయనో...ఎవరో అనుకుంటూ ఉన్నారనో చెబితే...సరే అనుకోవచ్చు. అలా కాకుండా...రిపోర్టర్ ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడితే ఎలా?
అరుణ గారే కాదు...ఏ రిపోర్టర్ అయినా..ఈ విశ్లేషణల పేరిట నోటికొచ్చింది చెప్పడం బాగుండదు. జనం నవ్వుకుంటారు. లైవ్ లో ఏదో హడావుడిగా నోటికి ఏది వస్తే అది...బాస్ కు నచ్చే నాలుగు మాటలు చెప్పడం...ఢిల్లీ రిపోర్టర్ లకు ఎక్కువయ్యిందని ఆరోపణలు ఉన్నాయి. వారు మరోలా అనుకోకుండా...కాస్త డొక్క శుద్ధి పెంచుకుని, వృత్తిలో రాణించాలని మనవి.

ఈ మధ్య ఎన్-టీ.వీ. ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న డిబేట్లు కూడా సమంగా లేవనిపిస్తున్నది. ఒక ప్రాంతం నేతను ఒక ప్రశ్న అడగడం...ఆయన అది చెప్పగానే..."మరి ఆయన అలా అంటున్నారు..మరి మీరు ఏమనుకుంటున్నారు" అని వేరే ప్రాంత నేతను అనడం...మాటిమాటికీ ఈ ప్రక్రియ సాగడం చూపరులకు ఇబ్బందిగా ఉంటుంది. ఒక మహిళా రిపోర్టర్ దేశ రాజధానిలో వివిధ ఛానెల్స్ లో పనిచేసిన అనుభవంతో దూసుకుపోవడం గర్వకారణమే. అయినా...మన మిత్రులు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి...స్కిల్ల్స్ పెంచుకోవడానికి....పని తీరు మెరుగు పరుచుకోవడానికి...యాజమాన్యాలు కూడా సహకరిస్తే...బాగుంటుంది.

Friday, February 5, 2010

గిల్లి కజ్జం పెట్టిన 'ఆంధ్రజ్యోతి'--పిచ్చి ఫోటోతో 'ది హిందూ'

ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సమైక్యంగానే ఉంది. ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణా ప్రజలు, వద్దు..సమైక్యతే ముద్దు...అని ఇతర రెండు ప్రాంతాల వారు కోరుకుంటున్నారు. రెండు పక్కలా వాతావరణం ఉద్విగ్నంగా ఉన్న సమయంలో మీడియా చాలా బాధ్యతగా వ్యవహరించాలి. కానీ...ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో "వేమన వర్సిటీకి తెలంగాణా వీ.సీ." అనే స్టోరీ ప్రచురించి...ఆ నిర్ణయం ఏదో భయంకరమైన తప్పు అన్న కలర్ ఇచ్చింది. 

కడపలో ఉన్న యోగి వేమన విశ్వ విద్యాలయం వీ.సీ.గా ఇంతకు ముందు  ప్రొఫెసర్ అర్జుల రామచంద్ర రెడ్డి ఉన్నారు. ఆయన మంత్రి పొన్నాల గారికి దగ్గర. ఆ విశ్వ విద్యాలయం కొత్తగా ఏర్పడినప్పుడు ఉన్న సమస్యలను ఆయన చాకచక్యంగా సరిచేసారు. రాజకీయ ఒత్తిళ్ళు ఉన్న జిల్లా అయినా...చేతనైనంత బాగానే వ్యవహారం నడిపారు. 
అలాంటి వ్యక్తిని మళ్ళీ వీ.సీ.ని చేయాలని గవర్నర్ గారు నిర్ణయించినట్లు ఆ పత్రిక కథనం. ఎందువల్ల గవర్నర్ ఆ నిర్ణయానికి వచ్చారో రాస్తే బాగుంటుంది కానీ...గిల్లి కజ్జం పెట్టినట్లు...."తెలంగాణా వ్యక్తికి అక్కడి పదవి ఇవ్వటమా!" అనే రీతిలో రాయడం తప్పు. పైగా...రెడ్డిగారు ఎక్కడ పుట్టింది...వంటి సూక్ష్మ వివరాలు ఇస్తే ఏమిటన్నట్లు? "ఒరేయ్ బాబు...రాయలసీమలో ఉన్న విశ్వ విద్యాలయానికి తెలంగాణా వాడు వస్తున్నాడు...మరి చూసుకోండి," అని అక్కడి జనాలను రెచ్చగొట్టినట్లు కాదా? 

"రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన వ్యక్తిని కడప కేంద్రంగా ఉన్న వర్సిటీకి వీ.సీ.గా నియమించడంలో...." అన్న వాక్యం కూడా ఈ వార్తలో ఉంది.
 "ది హిందూ' ఫోటో కౌశలం

జర్నలిజంలో ఫోటోల ప్రచురుణలో ఎడిటర్లు తప్పనిసరిగా కొన్ని నైతిక విలువలు పాటించాలి. ఒక రాజకీయ నాయకుడో, అధికారో వేదికపై తన పక్క సీట్లో కూర్చున్న మరొక ప్రముఖురాలిని చూస్తున్నప్పుడు ఒక కోణంలో ఫోటో తీసి..."వేదికపై ఉన్న స్త్రీని ఓరకంట చూస్తున్న ప్రముఖుడు" అని కాప్షన్ రాయవచ్చు. అలాగే...దీర్ఘాలోచనలో ఉన్న ప్రముఖుడి ఫోటో మరొక యాంగిల్ లో తీసి....ఆయన మీటింగ్ లో ఒక కునుకు తీస్తున్నట్లు కాప్షన్ రాయవచ్చు. ఇవన్నీ...ఫోటోగ్రాఫర్ ప్రతిభ, అతితెలివి మీద ఆధారపడే అంశాలు. 

ఈ రోజు మన 'ది హిందూ' ప్రొఫెసర్ కోదండ రామ్ గారు ఎక్కడో రోడ్డు మీద సహపంక్తి భోజనం చేస్తున్న ఫోటో ప్రచురించింది. కోదండ రామ్ గారు ముద్ద నోట్లో పెట్టుకుంటూ ఉండగా ఫోటో గ్రాఫర్ నగర గోపాల్ కింది నుంచి (లో యాంగిల్) ఈ ఫోటో తీసారు. ప్రచురితమైన ఫోటో చూస్తే ఎలా ఉంది అంటే...కోదండ రామ్ గారు పిచ్చి ఆకలితో చాలా ఆబగా తింటున్నట్లు ఉంది. ఇలాంటి ఫోటోలు ప్రచురించేటప్పుడు పేజి ఎడిటర్లు జాగ్రత్త పడాలి. 

Thursday, February 4, 2010

తెలుగు టీ వీ చానెళ్లకు బ్యాక్ గ్రౌండ్ పాటల పిచ్చి

సాధారణంగా ఇంట్లో ఎవరైనా తనువు చాలిస్తే...కుటుంబ సభ్యులకు దుఃఖం కలుగుతుంది. అదే కుటుంబ పెద్ద అకాల మరణం చెందితే ఆ ఫ్యామిలీ కి  కలిగే బాధ అంతా ఇంతా కాదు. అయితే...మంచికైనా..చెడుకైనా...గరిష్ట స్థాయిలో ప్రభావం (మాక్జిమం ఇంపాక్ట్) ఉండేలా కార్యక్రమాలు రూపొందించాలని...అది..ప్రేక్షకుల మనసులు దోచుకుంటుందని తెలుగు టీ.వీ.ఛానెల్స్ నమ్మకం.
మొన్నకు మొన్న విజయవాడలో ఒక పసిపాప నాగ వైష్ణవిని మామ వరస అయ్యే వ్యక్తి ఒక హంతక ముఠాతో కిడ్నాప్ చేయించి అత్యంత కిరాతకంగా చంపించి...మృత దేహాన్ని ఒక కొలిమిలో పడేసి సంచలనం సృష్టించాడు. ఈ వార్త విన్న మనిషి ఎవరికైనా గుండె బరువు ఎక్కుతుంది. బెజవాడలో ఇలాంటి నికృష్ట పనులు చేసే బ్యాచులు ఉన్నట్లు అందరికీ తెలుసు కానీ...మరీ ఒక చిన్నారిని ఇంత కిరాతకంగా చేస్తారని ఎవరు మాత్రం అనుకుంటారు?

సినిమా..క్రైం వార్తలు దొరికితే పండగ చేసుకునే తెలుగు మీడియా...కారు డ్రైవర్ హత్యను, ఆ పాప హత్యను, ఆ తర్వాత పాప తండ్రి ప్రభాకర్ మరణాన్ని చాలా ప్రభావశీలంగా ప్రజలకు అందించాయి. ఈ ఉదంతం మానవత్వానికి మచ్చ తెచ్చేది కాబట్టి....ఇందులో  ఒక పెద్ద డ్రామా ఉంది  కాబట్టి...సహజంగానే టీ.వీక్షకులు ఈ కార్యక్రమాన్ని తిలకించారు. ఇక...ఈ వార్తను, సంబంధిత స్టోరీ లను అత్యంత ప్రభావశీలంగా అందించేందుకు అన్ని తెలుగు ఛానెల్స్ పోటీ పడ్డాయి.

ఈ పోటీ నుంచి పుట్టిందే...బాక్ గ్రౌండ్ పాటల పిచ్చి.  తెర నిండా...నవ్వులు చిందిస్తున్న వైష్ణవి ఫోటో...తను పుట్టినరోజు నాడు తండ్రికి ముద్దు ఇస్తున్న వీడియో క్లిప్పింగ్...జనం వారి ఇంటి దగ్గర భారీగా గుమి కూడిన దృశ్యం చూపిస్తూ....కొన్ని ఛానెల్స్ విషాదం వర్షంలా కురిసే తెలుగు సినిమా పాటలు వేసాయి. zee-Telugu మిత్రులు ఇంకాస్త ఎక్కువ స్పందించారు.

ప్రత్యేకంగా...ఈ దారుణం పైనే ఒక పాట రాయించినట్లు ఉన్నారు వీరు. "ఏ పాపం ఎరుగని చిన్నతల్లీ..చిరునవ్వులే మాయం చేసారా తల్లీ..." అని డప్పు కొట్టుకుంటూ ఒక తెలంగాణా గాయకుడు పాడుతుంటే....అప్పటికే ఈ ఘోరంతో గుండె పగిలిన జనం తల్లడిల్లిపొయ్యారు. అది గుండె, మెదడు, నరాల మీద చాలా ప్రభావం చూపేదిగా ఉంది. అసలు డప్పు పాట అంటేనే గుండె కదిలించే సాధనం. 
రిపోర్టింగ్ లో ఎన్నో మరణాలు చూసిన నాకే...ఈ పాట..ఆ దృశ్యాలు గుండె మీద పని చేసాయి. ఒక్క క్షణం గుండె కలుక్కు మంటే....లేనిపోనిది...మనం కూడా పోతామేమో అని...ఒక ఆటల ఛానల్ పెట్టుకుని విషాదాన్ని దిగమింగుకున్నా. "బాల్యమందే నిన్ను చంపిందా...ఈ పాపిష్టి లోకం తల్లీ," "కొలిమిలో వేసి నను చంపారా తల్లీ.." వంటి విషాదకర చరణాలు ఆ సాంగ్ లో ఉన్నాయి.
సాక్షి, TV-1 వంటి ఛానెల్స్ కూడా బాక్గ్రౌండ్ పాటలు ధాటిగా వచ్చాయి. ఆ పాటలు నోట్ చేసుకున్న పేపర్ పోబట్టి అవి ఇక్కడ రాయలేక పోతున్నాను. ఇలా పాటలు వేయడంలో N-TV, TV-5, i-news కూడా చాలా ముందు ఉంటాయి. బోరు బావిలో పడి బాలుడు మరణించినప్పుడు, వై.ఎస్.ఆర్.మరణం తర్వాత కూడా ఛానెల్స్ ఇలాంటి పాటలే వేసాయి. 
నిజంగా ఒక విషయాన్ని ఇంత ప్రభావశీలంగా చూపించాల్సిన అవసరం ఉందా? ఒక మంచి స్క్రిప్టుతో వాస్తవాన్ని వాస్తవంగా చూపితే జనం చూడరా? ఏమో!
కాస్త సంసార పక్షంగా నడిచే ఇంగ్లీష్ ఛానెల్స్ లో ఇలా సినిమా పాటల మీద ఆధారపడి టీ.వీ.లు కార్యక్రమాలు చేయడం అరుదు. ఇదే విషయం ఒక సీనియర్ జర్నలిజం టీచెర్ తో నేను ప్రస్తావిస్తే....ఆయన భలే మాట చెప్పారు. దీన్ని 'wailing widow syndrome' (భర్త చనిపోతే భార్య పడే  అలవిగాని బాధ) అంటారనీ,  ఇది తెలుగు ఛానెల్స్ లో పతాక స్థాయికి చేరిందని ఆయన చక్కగా చెప్పారు. 
------------------------------------------
నోట్: పీహెచ్.డీ. పని ఒత్తిడి, ఉజ్జోగం, డెస్క్ టాప్ దెబ్బతినడం, మొన్నటి వరకూ టీ.వీ.కనెక్షన్ లేకపోవడం... వల్ల కొత్త పోస్టులు పెట్టలేదు.అంతే తప్ప కొందరు భావించినట్లు బెదిరింపులు...హెచ్చరికలు కారణం కాదు. మనం కూడా సై అంతే సై రకమే. ఇక క్రమం తప్పకుండా పోస్టులు ఉంటాయి. థాంక్స్