Sunday, June 22, 2025

తెలుగు జర్నలిస్టుల కోసం... త్వరలో....

 *మనిషికో రూ.16 చందా....కుటుంబానికి అండాదండా...

*Teachers Self-Care Team స్పూర్తితో....  

----------------------------------------------------

కుటుంబాన్ని పోషించే మనిషి మరణిస్తే?

-మిత్రులు, బంధువులు 'రిప్', 'ఓం శాంతి' మెసేజ్ లు పెడతారు.

-ప్రాణ మిత్రులు, సన్నిహిత బంధువులు కడసారి దర్శనం చేసుకుంటారు.

-కుటుంబం కొన్ని నెలలు విషాదంలో ఉంటుంది.

-అయన/ఆమె జీవిత భాగస్వామి కోలుకోవడానికి అందరికన్నా ఎక్కువ సమయం పడుతుంది.

-తన మనుగడ ఇప్పుడు ఒక్కసారిగా ప్రశ్నార్ధకం అయిపోతుంది.

-పోయిన మనిషి అప్పులు చేసి పోతే బతికున్న తనకు కష్టం.

-అండగా నిలిచే కొడుకులు/ కుమారులు లేకపోతే మహాకష్టం.

- పొమ్మనలేక పొగబెట్టే లేదా తన్ని తరిమేసే కోడలు/కొడుకు ఉంటే నరకమే.

-పేద, మధ్యతరగతి జీవితాల్లో ఇది ఒక సంక్షోభం.  

ముందు తరం వారికి పెన్షన్ అనేది ఒక వరప్రసాదం లాగా ఉండేది. 2004 లో దాన్ని కాస్తా పీకిపారేసి సంక్షేమ రాజ్య ప్రభువులు మృతుల కుటుంబాల, ముసలోళ్ల జీవితాలను నరకప్రాయం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలబడడం ఎలా? అన్నది మనసున్న వారికి పెద్ద ప్రశ్న. ఉన్నదాంట్లో ఆ కుటుంబానికి ఏదైనా చేద్దామని ఉన్నా... చేయలేని నిస్సహాయత. వాడు పోయాడు...కుటుంబం ఎటు పోతే మనకేమిటి? అనుకోకుండా ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు చెందిన వివేకానంద ఆర్యా అనే ఒక సాధారణ టీచర్ ఒక చిన్న ప్రయత్నం చేశాడు. కోవిడ్ మహమ్మారి తోటి టీచర్లను పిట్టల్లా రాల్చేస్తుంటే, వారి కుటుంబాలు నిస్సహాయ స్థితిలో, దారిద్య్రంలో పడిపోవడంతో కలత చెందిన అయన 2020 లో చేసిన ఈ చిరు ప్రయత్నం ఒక పెద్ద సంచలనంగా మారింది. 250 కి పైగా టీచర్స్ మృతి చెందాక వారి కుటుంబాలకు ఒక్కొక్కదానికి రూ. 50 లక్షలు సాయంగా అందాయి. ఎవరో ఒక్క మనిషి గానీ, సంస్థ గానీ ఈ పెద్ద సాయం చేయడంలేదు. ఒక్కో టీచర్ కేవలం రూ. 16 తమ వంతుగా అందించడం వల్ల మృతుని కుటుంబానికి ఈ పెద్ద సాయం అందడం ఇందులో గొప్పతనం. ఆ డబ్బు చేతులు మారకుండా... నేరుగా మృతుని భార్య అకౌంట్ లోకి పోవడం ఇంకో అద్భుతం. అయన నిర్మించిన వ్యవస్థ పేరు Teachers' Self-Care Team (TSCT). 

ఈ ఫొటోలో నాతో పాటు ఉన్న ఆయనే వివేకానంద ఆర్యా జీ. నిన్న హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అయన స్పీచ్ విని, కాసేపు ఆయనతో నేను మాట్లాడాను. ముందుగా వాట్సాప్, తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ లను మొదలు పెట్టి అయన టీచర్స్ ను పెద్ద సంఖ్యలో యాడ్ చేసి ఈ అద్భుత పరోపకార కార్యక్రమం చేస్తున్నారు. TSCT లో చేరిన నాలుగు లక్షల మంది టీచర్లు మరణ వార్త తెలియగానే మృతుని భార్య బ్యాంక్ అకౌంట్ కు టంచనుగా రూ.16 రూపాయలు పంపిస్తారు. కొద్ది సమయంలోనే అది యాభై లక్షలు దాటి కుటుంబానికి ఎంతో దన్నుగా నిలుస్తున్నది. నాకైతే ఇది బాగా నచ్చింది. 

జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులతో మరణిస్తుంటే... వారి కుటుంబాలు డబ్బు లేక అవస్థలు పడుతుంటే నేను కుమిలిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో కొందరికి నాకు చేతనైన వరకు చాలా పరిమిత సంఖ్యలో వారికి చాలా స్వల్ప సాయం చేస్తున్నా గానీ అది సరిపోదని అనుకుంటున్న సమయంలో నేను ఆర్యా గారిని కలిశాను. ఆ మోడల్ గురించి తెలుసుకున్నాను.

మనసుంటే... మార్గం ఉంటుందని ఆర్య గారు చెప్పిన మాటల స్పూర్తితో నేను జర్నలిస్టు సోదరుల కోసం ఇలాంటి ప్రయత్నం మొదలుపెట్టాలని గట్టిగా అనుకుంటున్నాను.  

నీతి నిజాయితీలతో, పారదర్శకంగా ఉంటే... ప్రపంచం నీతో ఉంటుందని ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యం. డబ్బు మన ద్వారా పోతే సమస్య. మన మీద తప్పుడు ఆ

రోపణలు చేస్తారు. ఈ మోడల్ తో మన చేతికి మట్టి అంటకుండానే సాయం ఛానలైజ్ చేయవచ్చు. ఇప్పటికే ఇలాంటి ఇనీషియేటివ్ ఉందేమో చెక్ చేసి త్వరలో నేను ఇది మొదలుపెడ్తా.

ఇంత గొప్ప పథకాన్ని మొదలు పెట్టి ఐదేళ్లుగా వందల కోట్లు మృతుల కుటుంబాలకు చేర్చిన/చేరుస్తున్న వివేకానంద ఆర్యా గారికి అభినందలు.

1 comments:

Anonymous said...

Journalists are getting Free plots - Why this fund again? Even Courts rejected the concept of Free Plots for Journalists, which is unfair. Unlike Daily Labor, Journalists earn money in the form of Salary, Bribes etc.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి