Tuesday, October 15, 2024

ప్రొ. సాయిబాబా నిరూపించిన సత్యాలు!

నక్సల్ ఉద్యమంలో సుదీర్ఘకాలం పాటు పనిచేసి 2007 జూన్ లో లొంగిపోయిన కోనపురి రాములు ఇంట్లో మాజీ నక్సల్, పోలీసుల దన్నుతో బీభత్సం సృష్టించిన నయీముద్దీన్ రెండు పెద్ద నాగుపాములను వదిలాడు ఒక సారి. నల్గొండ జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం లో రాములు వాళ్ళ పూరింటి మధ్యలో ఆ పాములు పడగ విప్పి బుస కొట్టడం చూస్తే ఎవరికైనా గుండెలదురుతాయి. 

లొంగిపోయిన రాములును తన దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో నయీమ్ తన స్టైల్ లో ఈ పని చేశాడు. రాములు లొంగుబాటుకు ముందు 'ది హిందూ' జర్నలిస్టుగా, నల్గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న నాకు ఫోన్ చేసి ఏమి మాట్లాడిందీ, నేను ఒక బాధ్యత గల పౌరుడిగా రాగద్వేషాలకు అతీతంగా ఏమి సలహా ఇచ్చిందీ  ఇక్కడ అప్రస్తుతం. జర్నలిస్టులు ఇజాల చట్రంలో ఇరుక్కోకుండా వంద శాతం నిష్పాక్షికంగా మానవత్వంతో మాత్రమే వ్యవహరించాలన్న నా సిద్ధాంతం, ఆ క్రమంలో  ఎదురయ్యే నానా ఇబ్బందులు,  అన్ని పక్షాల అపార్ధాలకు గురికావడం గురించి తర్వాత చెప్పుకుందాం. ఈ పోస్టు విషయం--57 ఏళ్ల వయస్సులో వ్యవస్థ కసాయితనానికి బలై మరణించిన సాయిబాబా గారి ఉదంతం నేర్పే పాఠాలు. 


90 శాతం అంగవైకల్యంతో, వీల్ ఛైర్ లో మాత్రమే తిరగగలిగే ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీ ఎన్ సాయిబాబా ను పదేళ్ల పాటు అమానుష పరిస్థితుల మధ్య జైల్లో నిర్బంధించడం వెనుక ప్రభుత్వానికున్న ఆలోచన, ఆ నయీమ్ ఆలోచనా ఒక్కటే! భయపెట్టడం. నరాలు పగిలే అనిశ్చితి సృష్టించడం. ప్రాథమిక టార్గెట్ (నయీమ్ కు రాములు, సర్కారుకు సాయిబాబా) ను భయభ్రాంతులకు  గురిచేస్తూనే ఇతరులకు గట్టి సందేశం ఇవ్వడం. ఇంతకన్నా పిచ్చి ఆలోచన ఇంకోటి ఉండదని ఎప్పుడూ నిరూపితమవుతూనే ఉంది. ప్రొ. సాయిబాబా ఉదంతం నేర్పే ఐదు ముఖ్యమైన పాఠాలు ఇవీ. 

1) పీడిత తాడిత ప్రజల కోసం కష్ట నష్టాలోర్చే, జీవితాలు తృణప్రాయంగా త్యాగం చేసే మొండి మనుషులు ఈ సమాజంలో ఉన్నారు/ ఎప్పటికీ ఉంటారు.  

2) ఇలాంటి గట్టి సైద్ధాంతిక నిబద్ధత కలిగిన వారిపై అధికారంలో ఉన్న వారు కక్షగట్టి హింసించగలరు కానీ వారు ఎంచుకున్న మార్గం నుంచి కోబ్రాలు, అండా సెల్ ల ద్వారా తప్పించగలగడం దుర్లభం. 

3) ఇలాంటి నిరసన గళాల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ, బీ ఆర్ ఎస్, టీ డీ పీ, జనసేన) ఒకే రకంగా వ్యవహరిస్తాయి. మొహబ్బత్ కా దుకాణ్ కావాలనుకున్న రాహుల్ గాంధీ గానీ, అంతేవాసి రేవంత్ గానీ కాంగ్రెస్ పక్షాన తెలుగు మేధావి కి అనుకూలంగా మాట్లాడారా? పోనీ, వీరవిప్లవ యోధుడు చేగువరా బ్రాండ్ అంబాసిడర్ గా హడావుడి చేసిన వారు పీకింది ఏమైనా ఉందా? అది పవర్ మహిమ.  

4) సాయిబాబా గారిపై అంతలా కక్షగట్టి, హింసించి రాజ్యం వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడింది. ఆ తప్పు ప్రజాస్వామ్యం మీద చులకనభావాన్ని మరింత పెంచి కనిపించని నష్టం చేసింది. ఆయన పోతూపోతూ...  లక్షల సాధారణ ప్రజలలో ప్రభుత్వాల మీద, నాయకుల మీద, పోలీసు-న్యాయ వ్యవస్థ మీద అసహ్యాన్ని, ఏహ్య భావాన్ని ఎన్నో రెట్లు పెంచారు. అందులో కొందరి మీద కాండ్రించి ఉమ్మెయ్యాలన్న కసి పెంచారు.  

5) ఆఖర్లో దారి తప్పినట్లు కనిపించిన వారికన్నా సమున్నత స్థాయిలో సాయిబాబా మేధావులు, విద్యావంతులు, స్పందించే గుణమున్న ఉద్యోగులు, విద్యార్థుల గుండెల్లో కలకాలం నిలిచిపోతారు. 

అబద్ధాలు చెప్పి, డబ్బు పెట్టి, నేరాలకు పాల్పడి అధికారంలోకి వచ్చే నాయకులు మన గొప్ప దేశాన్ని ఎలా దోచుకుంటున్నదీ, వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేస్తున్నదీ పోలీసు శాఖలో అధికారులు, సాధారణ పోలీసులు, అన్ని స్థాయిల్లో న్యాయమూర్తులు గమనిస్తున్నారు. అలాంటి పాలకుల అడుగులకు మడుగులొత్తి దిద్దుకోలేని తప్పు చేయడం కన్నా దేశం కోసం, జనం కోసం పరితపించే నిరసన గళాలకు దన్నుగా ఉండడం మంచిది. తప్పును తప్పు అనకపోవడం వ్యక్తిగత వైఫల్యమని, సాయిబాబా గారి లాంటి  పోరాట యోధులే పాపాత్మపు పాలకులకు నిజమైన విరుగుడని  గుర్తెరగాలి.  

నిజమైన దేశభక్తులు ఎవరో, అసలైన దేశద్రోహులు ఎవరో ఆలోచించడం అందరి కర్తవ్యం కావాలి. 

1 comments:

Anonymous said...

నిజమైన దేశభక్తులు ఎవరో, అసలైన దేశద్రోహులు ఎవరో ఆలోచించడం ముందు ఫేక్ జర్నలిస్టులు తెలుసుకోవాలి. మార్క్సిస్టు దేశద్రోహులను పోరాట యోధుల్ లాగా చిత్రించే నీచ బుద్ధి , ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం పనిచెయ్యనివ్వకుండా చేసే జర్నలిజం ముసుగులో ఉన్న నికృష్టలు సిగ్గుపడాలి.

నరాలు పగిలే అనిశ్చితి ఏమిటి నాయనా?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి