వెంటాడి..
వేటాడి...
కాల్చి..
హతమార్చి...
కాయాన్ని కుళ్ళబెట్టి..
కుటుంబాన్ని ఏమార్చి...
అడవి మధ్యలో..
పుల్లలు అడ్డగోలుగా పేర్చి...
కాల్చిపారేస్తే..
బూడిద చేస్తే...
ఏంటీ, దీంతో అయిపోతుందా?
ఆ మహోజ్వల జ్వాల ఆరిపోతుందా?
కగార్ బుల్లెట్లకు ఇంకా ఎన్ని ప్రాణాలు ఒరగాలి?
2026 మార్చి తర్వాత అరుణ తారలు ఇక ఉండవా?
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆ రోజుతో ఆపేయవచ్చా?
అన్నలు అమాయకంగా నేలవిడిచి సాముచేస్తున్నారా?
ఇవీ నక్సలిజం బలం, బలహీనతలు; రాజ్యం స్వరూపం, స్వభావాలు; జనం రుచులు, ధోరణులు బాగా తెలిసిన వాళ్లను పీడిస్తున్న సంశయాలు. ఏప్రిల్ 22 నాడు పహల్గాంలో ఉగవాదులు 26 మందిని పొట్టనపెట్టుకున్నప్పడు యావత్ దేశం గుండెలవిసేలా ఆగ్రహంతో కుమిలిపోతే, మే 21 నాడు ఛత్తీస్గఢ్ అడవిలో భద్రతా దళాల చేతిలో 27 మంది మావోయిస్టులు నేలకొరిగినప్పుడు సామాజిక స్పృహ ఉన్నవారు నిస్సహాయంగా మౌనంగా రోదించారు. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ కగార్ రెండూ పోలిక లేని ఆపరేషన్స్ అయినా...ఒకదాని తర్వాత ఒకటి భారతావనిలో ప్రకంపనలు సృష్టించాయి.
మావోయిస్టులు, ప్రభుత్వం... ఇందులో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అన్నది...మన సామాజిక, ఆర్థిక అవగాహన బట్టి, వర్గ దృక్పథాన్ని బట్టి ఉంటుంది. అదొక ఎడతెగని చర్చ. రణరక్త ప్రవాహసిక్తమైన అడవుల సాక్షిగా...ఏళ్ల తరబడి సాగుతోంది. కానీ, సభ్యతా సంస్కారం లేకుండా జరిగిన దహన సంస్కారం మాత్రం వేధిస్తోంది. 40 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉండి తాను నమ్మిన సిద్ధాంతం కోసం, బీదా బిక్కీ కోసం నిస్వార్థంగా పనిచేసిన సిక్కోలు బిడ్డ, విగతుడైన వరంగల్ ఆర్ఈసీ విద్యార్థి వెంటాడుతున్నాడు. ఆయన పంథా, ఆయన పనులు, ఆయన ఆలోచనలు అన్నీ పెర్ఫెక్ట్, వంద శాతం కరెక్ట్ అని అనడం లేదు. ఆయన లాంటి మావోల మందుతో మొత్తం వ్యవస్థ మారిపోయి పీడన, దోపిడీ చప్పున ఆగిపోతాయన్న ఆశా లేదు. కానీ, మేలైన పరిస్థితిని స్వప్నించి తాను నమ్మిన ఒక సిద్ధాంతం కోసం కట్టుబడి నేలకొరిగిన స్పూర్తి మామూలిది కాదు.
కుళ్ళిన ఈ వ్యవస్థ పట్ల అసహనం, ఆక్రోశం మనకు మాత్రంలేవా? నిత్యం దోపిడీ, దుర్మార్గాలు చూస్తూ మనదేమి పోయిందని చాలా మంది, రాజీ పడి అనేక మంది, గళం వినిపిస్తూ కొంతమంది బతికేస్తున్నాం. అడవుల బైట కాంక్రీట్ జంగిల్స్ లో చస్తూ బతుకుతూ బతుకీడుస్తున్నాం.
మేడి పండు ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయం ఇంకేదో వాళ్ళకు కనిపించింది. ఆ మార్గంలో 40 ఏళ్లు తిండీ, నిద్రా లేకుండా వాగుల్లో, వంకల్లో, చెట్లల్లో, పుట్లల్లో బిక్కు బిక్కున తన సిద్ధాంతం కోసం బతికిన మనిషి మరణిస్తే...ఇవ్వాల్సిన గౌరవం ఇది కాదు.
ఏ చట్టాన్ని చేతిలోకి తీసుకుని రక్తపుటేరులు పారిస్తూ డెడ్ బాడీల చుట్టూ ఆనందహేల చేస్తున్నారో...అదే చట్టంలో రాసిన కనీస మానవ హక్కులు పాటించకపోతే ఎలా?
ఇది శాంతి భద్రతల సమస్య అని ఏ పార్టీ పవర్లో ఉన్నా ఆ ప్రభుత్వాలు భావిస్తాయి. కాదు..కాదు..అది ఆర్థిక, సామాజిక సమస్య అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీలకు, కొందరు ఆలోచనాపరులకు అనిపిస్తుంది. అధికారం గుప్పిట్లో ఉంచుకున్న రాజ్యాన్ని మావోయిస్టులు ఎదిరించినట్లే,
సాయుధులైన మావోయిస్టులను రాజ్య ప్రముఖులు వివిధ కారణాల రీత్యా ద్వేషిస్తారు. ఎవరు గద్దె మీద ఉన్నా...వారిని ఆదరించి అక్కున చేర్చుకోలేరు. ఖతం చేయడానికే చూస్తారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా ఈ రెండు పక్షాల మధ్య పోరు సాగుతూనే ఉంటుంది.
ఛత్తీస్గఢ్లోని అబూజ్ మాడ్ అటవీ ప్రాంతం సాక్షిగా పోలీసులు, సైన్యం అడ్డదిడ్డంగా పేర్చి వెలిగించిన చితి బూడిద అయి ఉండవచ్చు. కానీ ఆ మంటలకు ఆహుతైన ఆయన, అట్లాంటి వాళ్ళు ఇన్నాళ్లూ పడిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అవుతుందో లేదో కాలమే తేల్చాలి. అడవిబాట పట్టిన మేధావులు పిట్టల్లా రాలిపోతుంటే బాధిస్తోంది.
ఇది విప్లవాల యుగం కాదని సాయుధ పోరాటం చేసే అందరూ గుర్తించాల్సిన తరుణమిది. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం ఎట్టిపరిస్థితుల్లో రాదు. అదొక దురాశ, పిచ్చి లెక్క. అన్నా,
జనహితం కోసం మీరు అడవుల్లో కుక్కచావు చచ్చినా అయ్యో పాపం అని కదిలిపోయి పిడికిలి బిగించి గాల్లోకి ఎత్తి లాల్ సలాం అనే వాతావరణం బయట లేదు. అధునాతన ఆయుధ సంపత్తి, కమ్యునికేషన్ వ్యవస్థను, కలుషిత మనసులను మీరు తట్టుకుని నిలవలేరు, బతకలేరు.
మా చేతులు సంపాదించే పనిలో, సోషల్ మీడియాలో వచ్చే వాటిని ఆస్వాదించడంలో యమ బిజీ అయ్యాయి. నాయనా, మీరు అడవులు పట్టుకుపోతే, బైట ప్రశ్నించే గొంతులు కరువై పెద్ద నష్టం జరుగుతోంది. జనజీవన స్రవంతిలో ఉంటూనే ప్రజాస్వామ్య పోరాటాలను బలోపేతం చేయండి.
అట్లానే, నిత్యం రక్తపాతం అజెండాగా ఉన్న పాకిస్థాన్ తో చర్చలకు సిద్ధమయ్యే మనం...మన భూమి కన్న మన బిడ్డలపై మారణకాండ ఆపి చిత్తశుద్ధితో చర్చలకు పిలిచి ప్రాణ నష్టం తగ్గించలేమా? ఆలోచించాలి.