Tuesday, May 27, 2025

జర్నలిజం విలువ దిగజారింది ఎందుకిలా?

'పాలమ్మిన... పూలమ్మిన...' ఫేమ్ మల్లారెడ్డి గారు.

కోట్లకు పడగలెత్తారు. మాజీ మంత్రి కూడా.

పవర్ కిక్కులో రేవంత్ రెడ్డి గారిని తొడగొట్టి సవాల్జేసిన మనిషి.  అలాంటి ఇలాంటోడు కాడు..మనసులో ఏదుంటే ఫిల్టర్ లేకుండా అదే చెప్తాడు. అట్లాంటి అయన మాటలు పెద్దగా పట్టించుకోనక్కర్లేదు.

కానీ, ఒక ఇంటర్వ్యూ లో జర్నలిజం మీద అయన చేసిన వ్యాఖ్యలు వింటే కాలిపోయింది, బాధేసింది, జాలేసింది. 

"జర్నలిజంలో ఏముందల్ల...

జర్నలిజం ఒక సబిజెక్టా?...  

అదొక బీఏనా, ఎంఏనా, ఎంబీఏ నా?...

ఏముందల్ల?...

ఏమి జర్నలిజమయ్యా అది?

జర్నలిజం పెద్ద కోర్సు కాదు...

పెద్ద ప్రొఫెషనల్ కాదు... డిగ్రీ కాదు...," అన్నాడు మల్లారెడ్డి సారు.

జర్నలిజం కోర్సు చేసిన వాళ్ళు, నికార్సైన జర్నలిస్టులు తప్ప... మిగిలిన అంతా మల్లన్న చెప్పిన దాంట్లో తప్పేముందంటారు. సగటు జనమై తే బాగయ్యింది...అని చంకలు కొట్టుకుంటారు. జర్నలిస్టు సంఘాలైనా మల్లారెడ్డి గారిని ఏమీ అనలేదు. అనలేని పరిస్థితి. ఈ దుస్థితికి కారణం ఎవరల్లా?

జర్నలిజం అంటే... సమాచార స్రవంతి... ప్రజల గొంతుక.... అన్యాయంపై పోరాటం...అక్రమార్కుల పాలిటి సింహస్వప్నం... మంచికి పెద్ద దిక్కు...సమాజానికి ఒక దిక్సూచి... ప్రజాస్వామ్య సౌధాన్ని నిలిపే నాలుగు స్తంభాల్లో ఒకటి.... ఒక కాపలా కుక్క. ప్రజాస్వామ్యానికి కీలకమైన ప్రజాభిప్రాయం ఏర్పడడానికి ప్రజలకు అవసరమయ్యే సమాచారాన్ని సరఫరా చేసే ఒక మెకానిజం.

మల్లారెడ్డి గారు తెలిసీ తెలియక కొంత, కావాలని కొంత అట్లా మాట్లాడుతుంటే నాకు 'ఈనాడు' వ్యవస్థాపకుడు రామోజీ రావు గారు గుర్తుకు వచ్చారు. ఆధునిక తెలుగు జర్నలిజం పితామహుడు ఆయన. పత్రికా భాష, తెలుగు జర్నలింలో ఇన్నోవేషన్, టెక్నాలజీ విషయంలో ఆయన పాత్ర ప్రశంసనీయమైనది.

అయితే, 1989 లో (నేను జర్నలిజంలో అడుగుపెట్టిన సంవత్సరం) గ్రామీణ వార్తల కోసం ఆయన మినీ ఎడిషన్స్ పెట్టకుండా ఉంటే జర్నలిజం విలువ మెరుగ్గా ఉండేదేమో? అనిపించింది. అప్పట్లో జిల్లాకు ఒకరిద్దరు జర్నలిస్టులు ఉండేవారు. వారికి మంచి విలువ ఉండేది. తర్వాత పరిస్థితి మారింది. 

రామోజీ గారి నిర్ణయం అప్పట్లో 'అత్యద్భుత వినూత్న వ్యాపార విస్తరణ ఆలోచన' గా ప్రశంసలు అందుకుంది. ఆ సూపర్బ్ ప్లాన్ లో భాగంగా.... జిల్లాల వారీగా మినీ ఎడిషన్స్ మొదలు పెట్టి... ఆ పేజీలు నింపడానికి ముందుగా మండలానికి, ఆ తరవాత గల్లీకో విలేకరిని నియమించారు. సంస్థ పే రోల్స్ లో లేకుండా పార్ట్ టైం ప్రాతిపదికన, రాసిన సెంటీమీటర్ కు ఇంతని పొందే కంట్రిబ్యూటర్/ స్ట్రింగర్ వ్యవస్థ ఏర్పాటు చేసారు. 

ఈ క్రమంలో చిక్కటి పాలు పలచపడ్డాయి. రామోజీ గారిని చూసి అన్ని తెలుగు పత్రికలూ గల్లీకో రిపోర్టర్ బృహత్ పథకాన్ని అమలు చేయక తప్పలేదు. విద్యార్హతలతో సంబంధం లేకుండా ఎడాపెడా విలేకర్లును నియమించి, వారికి సరైన శిక్షణా గట్రా ఏమీ లేకుండా, వారికి డబ్బులు సరిగా ఇవ్వకుండా, వ్యాపార ప్రకటనల బాధ్యత (టార్గెట్) పెట్టి కంపు కంపు చేశారు. కంట్రిబ్యూటర్ లలో కొందరు మెరికలు ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో విలేకరులను నియమించడం బాగా చేటు చేసింది. సమాజంలో విలువ ఉండీ, జీతాలు సరిగా లేని స్ట్రింగర్లు ఉన్నతంగా బతికేందుకు ఉన్న అన్ని మార్గాలూ చూసుకున్నారు. దీనివల్ల జరిగిన నష్టాలు ముఖ్యంగా రెండు.

ఒకటి- జర్నలిజం విలువలు అధఃపాతాళానికి.

రెండు-అవినీతి అక్రమాలు పతాక స్థాయికి.

నాలుగు వాక్యాలు రాసే ప్రభుత్వ టీచర్లు అనేకమంది కూడా పార్ట్ టైం విలేకరులు గా అవతారమెత్తారు. ప్రభుత్వ అధికారులు వారిని చూసి భయపడే వారు. ఇట్లాంటి జాడ్యాలు చొరబడ్డాయి. ఈనాడు లో టైం కి పారితోషికం ఇచ్చేవారు. కొన్ని పత్రికలు ఈ స్ట్రింగర్స్ ను వాణిజ్య ప్రకటనలు సేకరించి అందులో కొంత జీతం కింద ఉంచుకుని పెద్ద భాగం తమ కేంద్ర కార్యాలయానికి పంపాలని స్పష్టంగా హుకుం జారీ చేశాయి. పాపం వాళ్ళకి యాడ్ టార్గెట్స్ పెట్టిన యాజమాన్యాలు అనేకం. బాగా వార్త రాయడం కాదు, బాగా కలెక్ట్ చేయడం ప్రతిభకు, నిబద్ధతకు కొలబద్ద కావడంతో విలేకర్లు యాడ్స్ కోసం రాజీపడడమో, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడడం చేయకతప్పలేదు. 

తెలుగు మీడియా పరిస్థితి మరీ ఇంత ఘోరంగా అవుతుందని ఊహించి ఉంటే... రామోజీ గారు ఈ వ్యవస్థకు జన్మనిచ్చేవారు కాదేమో? 

కాలక్రమేణా టెక్నాలజీ ప్రభావం జర్నలిజం మీద బాగా పడింది. ఇప్పుడు జర్నలిజం లేదు, గిర్నలిజం లేదు.  ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర ప్రయోజనాల  కోసం అంటూ దాదాపు అన్ని పత్రికలు, టీవీ చానళ్లు ఏదో ఒక పొలిటికల్ పార్టీ కి కొమ్ముకాస్తున్నాయి. బాగా బాకా ఊదుతున్నాయి.  మీడియా హౌజ్ లు వివిధ వ్యాపారాల్లో పడి విలువల వలువలు ఊడబీకి పారేస్తున్నాయి. క్విడ్ ప్రోకో అనేక రూపాల్లో జర్నలిజాన్ని ముగిసింది. రాజశేఖర్ రెడ్డి గారు ఈనాడు కు పోటీగా తెచ్చిన సాక్షి తో విలేకర్ల జీవితాల్లో కొద్దిగా వెలుగులు వచ్చాయి కానీ ఒక పత్రిక, ఇంకో పత్రిక యాజమాన్యం "అక్రమాల" ను ఫ్రంట్ పేజీలో రాయడం, అందులో వచ్చే వ్యాసాలకు కౌంటర్ రాయడం మొదలయ్యాక... ఓనర్లు అందరూ అందరే అన్న అభిప్రాయం సామాన్య జనాల్లో కూడా కలిగింది. 


అంతే కాదు, సెల్లు ఫోను ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టే. ఇప్పుడు యూ ట్యూబ్ పెట్టిన ప్రతి మనిషీ ఎడిటరే. అందరిదీ  భావ ప్రకటన స్వేచ్ఛే.

అందుకే... పాలమ్మిన మల్లారెడ్డి గారు విషం చిమ్మినా, పూలమ్మిన మల్లారెడ్డి గారు బండలేసినా చేసేదేమీ లేదు. 

#SaveJournalism 

Photo: Bhala Media

1 comments:

Anonymous said...

What Wire, scroll, NYT, WP, BBC and most of our Indian media do is not journalism. Anti Hindu and India pro Papistan propaganda.
The word presstitutes was not coined without a reason.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి