Thursday, February 25, 2021

జర్నలిజానికి ఏమిటీ దురవస్థ?

జర్నలిజాన్ని ఆసరాగా చేసుకుని...వృత్తి పరమైన నైతిక నిబంధనలను తుంగలో తొక్కి నానా గడ్డికరుస్తూ వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న మీడియా అధిపతులు ఒక పక్క, తమకు బాకా ఊదని మీడియా సంస్థలను బాహాటంగా బ్యాన్ చేస్తున్న రాజకీయ నాయకులు ఒక పక్క... నడుమ పవిత్రమైన పాత్రికేయ వృత్తి సత్తురోలు అవుతోంది. 

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తభం లాంటి మీడియా మున్నెన్నడూ లేనంతగా అపఖ్యాతిని మూట గట్టుకుంటున్నది. ఏ వ్యవస్థ చేయాల్సిన పని ఆ వ్యవస్థ చిత్తశుద్ధితో చేయకుండా... ధనార్జనే ధ్యేయంగా పత్రికాధిపతులు రెచ్చిపోవడంతో నికార్సైన జర్నలిస్టులు తలపట్టుకోవాల్సిన దుస్థితి దాపురించింది. మీడియా-రాజకీయ సంగమం కొత్త విషయం కాకపోయినా... తెలుగు వారి ఆత్మగౌరవం అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ ను సామాజిక బాధ్యత పేరుతో భుజానికిఎత్తుకుని 'ఈనాడు' విజయం సాధించింది 1980ల్లో. యావత్ పత్రికారంగానికి ఆ విధంగా అది ఒక 'సక్సెస్ ఫార్ములా' ను అందించింది. సుమధురమైన, సుతేలికైన  ఈ మార్గాన్ని వ్యాపార దిగ్గజాలు, సినిమా ప్రముఖులు  అనుసరించి తడాఖా నిరూపించారు. గత నలభై ఏళ్లలో ఈ ప్రయోగం మరింత వికసించి వర్ధిల్లుతోంది.  

ఎన్టీఆర్ తదనంతర నాయకత్వం ఈ ఫార్ములా కు కొత్తదనం జోడించి... రెండు పెద్ద పత్రికలను జేబు సంస్థలుగా  మలుచుకోగా... దానికి విరుగుడుగా సాక్షి వచ్చింది. క్విడ్ ప్రో కో సొమ్ము మహిమదని ఎన్ని విమర్శలు వచ్చినా.. ఆ మీడియా సంస్థ జర్నలిస్టులకు మంచి జీతాలు అందించి  కొత్త తరహా జర్నలిజానికి తెరలేపింది. ఈనాడులో కులం, కుట్రల ధాటికి తట్టుకోలేక విసిగిపోయి... సాక్షిలో చేరిన జర్నలిస్టులు తమ మాజీ సంస్థ రాసిన సో కాల్డ్ పరిశోధనాత్మక వ్యాసాలతూర్పారబడుతూ ప్రత్యేక కథనాలు వండి వార్చడంతో జర్నలిజం గబ్బు జనాలకు అర్థమయ్యింది. 

ఈ లోపు ప్రాంతీయ వాదం అజెండాగా వచ్చిన నమస్తే తెలంగాణా మొదట్లో ఉద్యమానికి అండగా నిలిచి, ఇప్పుడు అధికార పార్టీ, ముఖ్యంగా తెలంగాణా గాంధీ గారి భజన కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమైంది. బద్ధవైరి పత్రిక ఆంధ్రజ్యోతిలో ఉన్న ఈనాడు మాజీ జర్నలిస్టు ను న. తె. ఎడిటర్ గా చేసింది. కొంగొత్త భజన పద్ధతులు అలరిస్తున్నాయి. 

అవి పచ్చ (పసుపు) మీడియా అని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికను, ఛానళ్లను ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కే సీ ఆర్ ప్రభుత్వం విమర్శిస్తాయి. తనకు అధికారం ఉన్నా, లేకపోయినా సాక్షి జర్నలిస్టులను వెలివేస్తున్నట్లు బాబు గారు మాట్లాడడం చూశాం.  న.తె. ను అనే దమ్ము ఎవ్వరికీ లేదు... ఒక భాజపా నాయకుడి నేతృత్వంలోని వెలుగు పత్రిక, వీ సిక్స్ ఛానెల్ కు తప్ప. 

జాతీయ స్థాయిలో మీడియా ను గుండుగుత్తగా మడిచి జేబులో పెట్టుకున్నదని విమర్శలు ఎదుర్కుంటున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇక్కడ కూడా ఓపెన్ అప్ అవుతున్నది. 

పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్ నైతిక విలువలు గాలికొదిలేసి తెలుగుదేశం పార్టీ కరపత్రిక, ప్రసార సాధనంలా పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నట్లు భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ పేరిట ఒక బహిరంగ ప్రకటన వెలువడింది . 

"భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారిని చర్చా కార్యక్రమానికి ఆహ్వానించి, చర్చ జరుగుతున్న సందర్భంలో టిడిపి ప్రయోజనాల కోసం దాడికి పాల్పడిన వ్యక్తి మీద కేసు నమోదు చేయించకుండా తిరిగి ఈ రోజు చర్చకు ఆహ్వానించి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రయత్నించడం సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా మీడియా ముసుగులో పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానల్ ను మరియు ఆంధ్రజ్యోతి పత్రికను నేటి నుంచి భారతీయ జనతా పార్టీ పత్రికా విలేకరుల సమావేశాలకు ఆహ్వానించరాదని, ఆ టీవీ చానల్ చర్చా కార్యక్రమాలలో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని పార్టీ నిర్ణయించింది," అని తెలిపింది. 

ఆంధ్రజ్యోతి యాజమాన్యం బేషరతుగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు క్షమాపణ చెప్పేవరకు ఈ బహిష్కరణ కొనసాగుతుందని వుల్లూరి గంగాధర్, మీడియా ఇంచార్జి, భాజపా, ఆంధ్రప్రదేశ్, చెప్పారు. ఇప్పుడే ఇలా ఉంది. ఎన్నికలు సమీపించే కొద్దీ పరిస్థితి ఎట్లా మారుతుందో! 

1 comments:

శ్యామలీయం said...

ఉదాత్తంగా రాజకీయదుర్వాసనల నుండి డియారంగపవిత్రతను కాపాడటం కోసం తాపత్రయపడుతున్నట్లు చక్కగా తయారుచేయబడిన ఈవ్యాసం కూడా అవే రాజకీయదుర్వాసనలను పులుముకొని ఉన్నది. ఏదో అలవాటులో పొరపాటున కాదు, జనాన్ని మభ్యపెట్టటం అనే సమకాలీన మీడియాధోరణిలో భాగంగానే ఈవ్యాసం ఉన్నది అంతే.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి