Sunday, October 13, 2024

ప్రొ. సాయిబాబా అమర్ హై!

విస్తృత అధ్యయనం అవసరం లేకుండానే, లోతైన పరిశీలన చేయకుండానే మనకు ఈ సమాజంలో ఉన్న వైరుధ్యాలు, అసమానతలు, కుళ్ళూ కుతంత్రాలూ 18-20 ఏళ్ల వయస్సునాటికే బాగా అనుభవంలోకి వస్తాయి. వ్యవస్థలో లోపాలు, అధికారంలో ఉన్నవాళ్ళ అకృత్యాలు, డబ్బున్న వాళ్ల పెనుపోకడలు, కాసులు-నోరులేనివాళ్ళకు జరిగే దారుణ అన్యాయాలు అవగతమైనా... జీవితంలో 'సెటిల్' కావాలన్న బలమైన ఒత్తిడి, కోరికలతో ఇవన్నీ మనసుకు పట్టించుకోలేము. ఏదో ఒక ఉద్యోగం దొరగ్గానే అందులో నిలదొక్కుకుని 'ఎలివేషన్' కోసం సమయమంతా వెచ్చిస్తాం. ఈ లోపు పెళ్లీ, పిల్లలూ, చదువులూ, మందులూ, మాకులూ, ఖర్చులూ!

ఈ క్రమంలో- సమాజం గురించి పట్టించుకునే తీరికా, ధ్యాసా ఉండవు. అయినా సరే, విశాల హితం కోసం మనవంతుగా మనమేమైనా చేయాలని అనుకుంటే ముందుగా ఇంట్లో వాళ్ళు, మిత్రులు, ఉద్యోగాల్లో సహచరులు వెనక్కులాగుతారు. అయినా ముందుకువెళదామంటే రాజ్యం లాఠీలు, తుపాకులు పట్టుకుని గుడ్లురిమి భయపెడుతుంది. అప్పుడప్పుడూ చదివిన పుస్తకాలు, ఉద్యమ పాటలు రక్తాన్ని మరిగించి వేడెక్కించగా... అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు...అని ఇంకాస్త ముందుకు వెళ్లి బడుగు, బలహీన, పీడిత, తాడిత ప్రజల కోసం పోరాడదామంటే చెరసాలలు, ఉరికొయ్యలు ఆవురావురుమని ఎదురు చూస్తాయి. అధికారం చెలాయించే వాళ్ళు (కానిస్టేబుల్ నుంచి ప్రధాని వరకూ) ఇలాంటి సమాజ హితైషులను, బాధా సర్ప ద్రష్టులను పరమ భయంకరమైన దుష్టులుగా, చిదిమేయాల్సిన శత్రువులుగా, సమాజానికి పట్టిన చీడగా, పీడగా భావించి కర్కశంగా వ్యవహరిస్తారు. 

ఇంత సంక్లిష్టత మధ్య... ఓర్నాయనో.... ఇదంతా అవసరమా? మనకెందుకొచ్చిన గొడవ... ఊరుకున్నంత ఉత్తమం లేదని అనుకుని గమ్మున తమ పని తాము చేసుకుంటూ భార్యా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ... ఈ ఎం ఐ లు కట్టుకోవడమే జీవిత పరమావధిగా బతికేస్తూ.. సమయం చిక్కితే వ్యవస్థను తిట్టుకుంటూ, ఇది మారదని తీర్మానించుకుంటూ బతుకు బండి వెళ్లదీస్తారు మెజారిటీ ప్రజలు

ఇట్లాంటి సమాజంలో అమలాపురం నుంచి 80 శాతం అంగవైకల్యంతో వచ్చి మంచి విద్యనభ్యసించి పీడిత, తాడిత, ఆదివాసీ ప్రజల కోసం గళం వినిపించి రాజ్య హింస బలవంతంగా తాగించిన గరళానికి బలైన విద్యావేత్త, మేధావి, రచయిత, మానవ హక్కుల ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబా (1967-2024). ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఆంగ్లంలో పోస్టు గ్రాడ్యుయేషన్, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డాక్టోరల్ డిగ్రీ పొంది, అక్కడే విద్యార్థులకు బోధించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో ఆయనపై ప్రభుత్వం కత్తికట్టింది. అమానుషమైన పరిస్థితుల్లో పదేళ్లు దుర్భర జైలు శిక్ష అనుభవించి ఈ మార్చి లోనే విడుదలయిన ప్రొఫెసర్ సాయిబాబా వివిధ రకాల అనారోగ్యాలతో దసరా రోజు నిన్న హైదరాబాద్ లోని నిమ్స్ లో మరణించారన్న వార్త బాధించింది. 

ప్రొ. సాయిబాబా గారి అలుపెరుగని పోరాటాన్ని, జైలు జీవితాన్ని, తనకు వెన్నంటి ఉన్న వారి శ్రీమతి వసంత కుమారి గారి మనో నిబ్బరాన్ని నేను జర్నలిస్టుగా నిశితంగా గమనిస్తూ వస్తున్నాను. ఇలాంటి అమానుష పరిస్థితుల్లో 84 ఏళ్ల వయస్సున్న ఫాదర్ స్టాన్ స్వామి కస్టడీలో 2021 జులై లో మరణించినప్పుడు ఒక వ్యాసం రాశాను. ప్రభుత్వాలు ఇంతలా ఎలా కక్ష గట్టి రాచి రంపాన పెడతాయో, ప్రజాస్వామ్యంలో ఉండే వివిధ సిద్ధాంతాలను, నిరసన గళాల ప్రాధాన్యతను పాలకులు ఎందుకు ఇంత తప్పుగా అర్థం చేసుకుంటున్నారో అర్థంకాదు.    

ప్రొ. సాయిబాబా మరణంతో తెలుగు నేల ఒక పోరాట పటిమ కలిగిన మేధావిని కోల్పోయింది. భార్యా బిడ్డలతో కలిసి పండగ నాటి పులిహోర, పరమాన్నం మెక్కి అయన మరణం వార్తకు 'రిప్' అని 'ఓం శాంతి' అని పెట్టడం చాలా ఈజీ. కానీ, ప్రొ. సాయిబాబా గారు ప్రజా సేవ కోసం ఎంచుకున్న మార్గం అత్యంత కష్టమైనది. ముళ్లబాట మీదనే అయన, వసంత గారు, వారి కుటుంబం పది పన్నెండేళ్లుగా ప్రయాణం చేస్తోంది. వారంతా నరకం చూశారు. సమాజ విశాల హితం కోసం తాను నమ్మిన సిద్ధాంతం కోసం అయన తుది శ్వాస వరకూ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నది సత్యం. ఆయన ధైర్యం ఎందరికో ప్రేరణ ఇస్తుంది. మానవత్వం మరిచి... అవిటి వాడైన మేధావిని హింసించి పైకిపంపిన చచ్చుపుచ్చు వ్యవస్థ ప్రతినిధులు సిగ్గుతో తలవంచుకోవాల్సిన తరుణమిది.

3 comments:

Anonymous said...

End of the leftists will get same treatment in our country

Anonymous said...

Day

Anonymous said...

నువ్వు కూడా అర్బన్ నక్సల్స్ ను సమర్థించే ఫేక్ జర్నలిస్టువే నన్నమాట.

థూ మీ బతుకులు చెడ.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి