Sunday, June 22, 2025

తెలుగు జర్నలిస్టుల కోసం... త్వరలో....

 *మనిషికో రూ.16 చందా....కుటుంబానికి అండాదండా...

*Teachers Self-Care Team స్పూర్తితో....  

----------------------------------------------------

కుటుంబాన్ని పోషించే మనిషి మరణిస్తే?

-మిత్రులు, బంధువులు 'రిప్', 'ఓం శాంతి' మెసేజ్ లు పెడతారు.

-ప్రాణ మిత్రులు, సన్నిహిత బంధువులు కడసారి దర్శనం చేసుకుంటారు.

-కుటుంబం కొన్ని నెలలు విషాదంలో ఉంటుంది.

-అయన/ఆమె జీవిత భాగస్వామి కోలుకోవడానికి అందరికన్నా ఎక్కువ సమయం పడుతుంది.

-తన మనుగడ ఇప్పుడు ఒక్కసారిగా ప్రశ్నార్ధకం అయిపోతుంది.

-పోయిన మనిషి అప్పులు చేసి పోతే బతికున్న తనకు కష్టం.

-అండగా నిలిచే కొడుకులు/ కుమారులు లేకపోతే మహాకష్టం.

- పొమ్మనలేక పొగబెట్టే లేదా తన్ని తరిమేసే కోడలు/కొడుకు ఉంటే నరకమే.

-పేద, మధ్యతరగతి జీవితాల్లో ఇది ఒక సంక్షోభం.  

ముందు తరం వారికి పెన్షన్ అనేది ఒక వరప్రసాదం లాగా ఉండేది. 2004 లో దాన్ని కాస్తా పీకిపారేసి సంక్షేమ రాజ్య ప్రభువులు మృతుల కుటుంబాల, ముసలోళ్ల జీవితాలను నరకప్రాయం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలబడడం ఎలా? అన్నది మనసున్న వారికి పెద్ద ప్రశ్న. ఉన్నదాంట్లో ఆ కుటుంబానికి ఏదైనా చేద్దామని ఉన్నా... చేయలేని నిస్సహాయత. వాడు పోయాడు...కుటుంబం ఎటు పోతే మనకేమిటి? అనుకోకుండా ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు చెందిన వివేకానంద ఆర్యా అనే ఒక సాధారణ టీచర్ ఒక చిన్న ప్రయత్నం చేశాడు. కోవిడ్ మహమ్మారి తోటి టీచర్లను పిట్టల్లా రాల్చేస్తుంటే, వారి కుటుంబాలు నిస్సహాయ స్థితిలో, దారిద్య్రంలో పడిపోవడంతో కలత చెందిన అయన 2020 లో చేసిన ఈ చిరు ప్రయత్నం ఒక పెద్ద సంచలనంగా మారింది. 250 కి పైగా టీచర్స్ మృతి చెందాక వారి కుటుంబాలకు ఒక్కొక్కదానికి రూ. 50 లక్షలు సాయంగా అందాయి. ఎవరో ఒక్క మనిషి గానీ, సంస్థ గానీ ఈ పెద్ద సాయం చేయడంలేదు. ఒక్కో టీచర్ కేవలం రూ. 16 తమ వంతుగా అందించడం వల్ల మృతుని కుటుంబానికి ఈ పెద్ద సాయం అందడం ఇందులో గొప్పతనం. ఆ డబ్బు చేతులు మారకుండా... నేరుగా మృతుని భార్య అకౌంట్ లోకి పోవడం ఇంకో అద్భుతం. అయన నిర్మించిన వ్యవస్థ పేరు Teachers' Self-Care Team (TSCT). 

ఈ ఫొటోలో నాతో పాటు ఉన్న ఆయనే వివేకానంద ఆర్యా జీ. నిన్న హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అయన స్పీచ్ విని, కాసేపు ఆయనతో నేను మాట్లాడాను. ముందుగా వాట్సాప్, తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ లను మొదలు పెట్టి అయన టీచర్స్ ను పెద్ద సంఖ్యలో యాడ్ చేసి ఈ అద్భుత పరోపకార కార్యక్రమం చేస్తున్నారు. TSCT లో చేరిన నాలుగు లక్షల మంది టీచర్లు మరణ వార్త తెలియగానే మృతుని భార్య బ్యాంక్ అకౌంట్ కు టంచనుగా రూ.16 రూపాయలు పంపిస్తారు. కొద్ది సమయంలోనే అది యాభై లక్షలు దాటి కుటుంబానికి ఎంతో దన్నుగా నిలుస్తున్నది. నాకైతే ఇది బాగా నచ్చింది. 

జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులతో మరణిస్తుంటే... వారి కుటుంబాలు డబ్బు లేక అవస్థలు పడుతుంటే నేను కుమిలిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో కొందరికి నాకు చేతనైన వరకు చాలా పరిమిత సంఖ్యలో వారికి చాలా స్వల్ప సాయం చేస్తున్నా గానీ అది సరిపోదని అనుకుంటున్న సమయంలో నేను ఆర్యా గారిని కలిశాను. ఆ మోడల్ గురించి తెలుసుకున్నాను.

మనసుంటే... మార్గం ఉంటుందని ఆర్య గారు చెప్పిన మాటల స్పూర్తితో నేను జర్నలిస్టు సోదరుల కోసం ఇలాంటి ప్రయత్నం మొదలుపెట్టాలని గట్టిగా అనుకుంటున్నాను.  

నీతి నిజాయితీలతో, పారదర్శకంగా ఉంటే... ప్రపంచం నీతో ఉంటుందని ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యం. డబ్బు మన ద్వారా పోతే సమస్య. మన మీద తప్పుడు ఆ

రోపణలు చేస్తారు. ఈ మోడల్ తో మన చేతికి మట్టి అంటకుండానే సాయం ఛానలైజ్ చేయవచ్చు. ఇప్పటికే ఇలాంటి ఇనీషియేటివ్ ఉందేమో చెక్ చేసి త్వరలో నేను ఇది మొదలుపెడ్తా.

ఇంత గొప్ప పథకాన్ని మొదలు పెట్టి ఐదేళ్లుగా వందల కోట్లు మృతుల కుటుంబాలకు చేర్చిన/చేరుస్తున్న వివేకానంద ఆర్యా గారికి అభినందలు.

Sunday, June 15, 2025

టీవీ చర్చా? పిచ్చి పిచ్చి రచ్చా?

తిట్టుకోవడం...జుట్టు పట్టుకోవడం...చెప్పులు చూపించుకోవడం....మీదిమీదికి పోవడం...కొట్టుకోవడం...సవాల్ విసురుకోవడం... అంతుచూస్తానని బెదిరించుకోవడం... 

టెలివిజన్ ఛానల్స్ మారుస్తూ కూర్చుంటే...ఇవన్నీ గానీ, వీటిలో కొన్నిగానీ కచ్చితంగా ఉచితంగా లభిస్తాయి. దిగజారిన టీవీ డిబేట్లు బాధ కలిగిస్తున్నాయి. 

జర్నలిజం పరువు ప్రతిష్ఠలు మరీ దిగజారడానికి కారణమైన పలు అంశాల్లో టెలివిజన్ లైవ్ డిబేట్లు అన్నది కీలకమైనది. ఒక్కోసారి ఈ చర్చలు రోత, జుగుప్స, ఆగ్రహం, నిస్సహాయత కలిసిన ఒక విధమైన మనోవికారాన్ని కలిగిస్తున్నాయి. సభ్యత, సంస్కారం, గౌరవం వంటివి చాలావరకు ఇందులో ఉండవు. ఇది చూసే వారు ఒక పధ్ధతి ప్రకారం నాగరికంగా ఉండాలనుకునేవారైతే వారికి రోత పుడుతుంది... అందులో వాడే భాష, వాదప్రతివాదాలు చూస్తే లేదా వింటే. సాక్షి టీవీ లో యాంకర్, మాజీ ఈనాడు జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు, విడుదల నేపథ్యంలో 'టీవీ గెస్టులు' అనే అంశం మీద విస్తృత చర్చ జరగాలి.

'ఈనాడు' లో వచ్చే ప్రతిధ్వని అనే ప్రోగ్రాం చప్పగా ఉంటుందనడానికి కారణం...అందులో పెద్దగా ధ్వనులు లేకపోవడం. లైవ్ షోలో ఎంత సౌండ్ ఉంటే, ఎంత డ్రామా ఉంటే అంతగా జనాలకు అంత నచ్చుతున్నట్లు యాజమాన్యాలు పసిగట్టాయి. అందుకే కొన్ని ఛానెల్స్ వాళ్ళు నన్ను ఈ లైవ్ షో లకు పిలిచినా నేను రాను మహాప్రభో... అని చెబుతాను. నన్ను వ్యక్తిగతంగా గానీ, నేను చెప్పే మాటను ఆధారాలు లేకుండా అడ్డగోలుగా గానీ ఖండించినాగానీ, గంటకు రూ. 5,000 ఇవ్వకపోతేగానీ నేను రానని ఒకరిద్దరికి మొహమాటం లేకుండా చెప్పాను. అప్పటినుంచి టీవీ డిబేట్లకు పిలవడం మానేశారు. నేను హ్యాపీ. డబ్బులు ఇవ్వకుండా స్టూడియోలకు పిలిస్తే ఎగేసుకుపోయే ఒక వర్గం ఉండబట్టి చర్చలు నాసిరకంగా ఏడ్చాయని నేను గట్టిగా నమ్ముతాను.

 ఇప్పుడు టీవీ చర్చల్లో వస్తున్న వారు ఈ కింది కేటగిరీ లలో ఏదో ఒక దానికి చెందిన వారై ఉంటున్నారు.

1) ఆస్థాన విద్వాంసులు

2) పార్టీల అధికార ప్రతినిధులు

3) యాంకర్ భజన బృందం

4) నిపుణులు (అప్పుడప్పుడూ).

అన్ని పార్టీల వాళ్ళను స్టూడియోలకు పిలవడం, వాళ్లలో వాళ్ళు బండబూతులు దోక్కుంటూ ఉంటే యాంకర్ అర్ధగంటో, గంటో కాలక్షేపం చేసి రెండు మూడు కామెంట్లు చేసి ముగించడం. ఇదే తంతు. మళ్ళీ రేపు కూడా ఈ చర్చకు పిలవాలి కాబట్టి వచ్చిన గెస్టు హోస్టు ను ఆకాశానికి ఎత్తడం సర్వసాధారణమైంది. పొగడని వాడు పాపాత్ముడు అయిపోయాడు. లైవ్ షో కావడం వల్ల ఎడిటింగ్ కు ఆస్కారం లేదు. అందుకే బూతులు తిట్టుకున్నా, చెప్పులతో కొట్టుకున్నా, పళ్ళు కొరుకుతూ నీ అంతు చూస్తానని బెదిరించినా యథాతథంగా నేరుగా జనాలకు చేరిపోతోంది. వెర్రి జనాలకు అది నచ్చుతోంది.  

అధికార ప్రతినిధుల యావంతా.... ఈ షో చూసే పార్టీ నాయకత్వాన్ని ఖుషీ చేసేలా నోటికొచ్చింది వాగడం మీదనే. యాంకర్లయితే నిష్పాక్షికతను గాలికి వదిలేసి ఎడిటోరియల్ కామెంట్స్ తో పిచ్చెక్కిస్తున్నారు. టీవీ డిబేట్ల వల్ల ప్రొ.కే నాగేశ్వర్ గారు పాపులర్ అయ్యారు. రెండు సార్లు ఎం ఎల్ సీ అయ్యారు. సొంతగా ఛానెల్ పెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన స్థాయిలో వాదన వాదనలాగా వినిపించే వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఏమాటకామాటే, టీవీ డిబేట్లు వల్ల ఒక ఆరేడుగురు జర్నలిస్టులు సెలబ్రిటీ హోదా పొందారు. నిజానికి వారు ప్రతిభావంతులు, సమర్థత కలవారు. కొమ్మినేని గారికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. 

నేషనల్ టీవీ లో పుట్టుకొచ్చి నోటితో బతికేస్తున్న ఒక మహానుభావుడు ఆదర్శంగా మన తెలుగు టీవీ షో లు సాగుతున్నాయని నాకు అనిపిస్తున్నది. ఆయన మోడల్ ప్రాంతీయ యాంకర్లకు విజయవంతమైన, ఆదర్శప్రాయమైన నమూనాగా సాగుతోంది. పెద్ద గొంతుతో అరవడం, గెస్టుల మధ్య మంటబెట్టి షో నడపడం, పూర్తిగా ఒక సైడ్ తీసుకుని చర్చ చేయడం, జనం నోరెళ్ళబెట్టుకుని చూసేలా, వినేలా పదాలు వాడడం, సెంటిమెంట్ రెచ్చగొట్టడం... ఈ నమూనాలో భాగం. ఆయన ఎవరో గెస్ చేసి, టీవీ చర్చల మీద మీ అభిప్రాయలు రాయండి. 

Friday, June 13, 2025

కొమ్మినేని గారి విడుదల హర్షణీయం...

నేను అనుకున్నట్లుగానే అయ్యింది. కొమ్మినేని శ్రీనివాసరావు గారి విడుదలకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. 

సాక్షి టీవీ ఛానల్ లైవ్ షో లో గెస్టు చేసిన పిచ్చి వ్యాఖ్య ప్రభావాన్ని అంచనా వేయడంలో 70 ఏళ్ల కొమ్మినేని గారు విఫలమై ఇరుకున పడ్డారు. ఆయన చేసినది తప్పే కానీ అది ఆయన్ను అర్జెంటుగా అరెస్టు చేయాల్సినంత తీవ్ర ఘోరమైనది కాదని అనిపించి...నేను ఈ వేదిక మీద పోస్టు పెట్టాను...అరెస్టుకు వ్యతిరేకంగా. అది చాలా మందికి నచ్చలేదు. కానీ, నేను వారి వాదనలకు కన్వీన్స్ కాలేదు. చంద్రబాబు గారి మీద కొమ్మినేని గారు తీవ్రమైన ద్వేషం తో ఉండి...ఆ బుర్రలేని "ఎడిటర్" ను షో కి పిలిచి దెబ్బతిన్నారు. 

మీరు కాస్త నిదానంగా, నిష్పాక్షికంగా ఆలోచించండి. ఈ పరిస్థితికి కారణం పొలిటికల్ పార్టీలు మీడియాను గబ్బు పట్టించడమే కదా! యాజమాన్యాలు పొలిటికల్ బురద గుంటలో దొర్లుతుంటే...పొట్టకూటి కోసం జర్నలిజాన్ని నమ్ముకున్న జర్నలిస్టులు ఏమి చేస్తారు? ఆ బురద అంటకుండా ఎట్లా ఉంటారు? 

ఎలాగూ బురద అంటింది కదా...పోయేది ఏముందని...స్వామి కార్యం, స్వకార్యం తీరడం కోసం ఓనర్ ను తృప్తి పరిచేలా రెచ్చిపోయే వాళ్ళు ఒకరకం. ఇప్పుడు వీళ్లదే హవా. వీళ్లు బతకనేర్చిన జర్నలిస్టులు. ఇంకో బాపతు జర్నలిస్టులు...రోజూ బురద దుపులుకుంటూ, దీనికి కారణమైన ఓనర్ కు శాపనార్థాలు పెడుతూ పొట్ట కూటి కోసం బతికేస్తున్నారు. బురద అంటకుండా ఉండేవాళ్ళు చాలా అరుదు. వాళ్ళు అద్దె కొంపల్లో ఉంటూ, అప్పులు చేసి పిల్లలను చదివిస్తూ, ఒక్క రోగం వస్తే...అప్పుల పాలై నవుస్తూ బతుకు బండి ఈడుస్తున్నారు. ఇవి వాస్తవాలు. 

"మీరు ఎలాంటి జర్నలిజాన్ని కోరుకుంటున్నారు?" అని నేను నా పీ హెచ్ డీ లో భాగంగా...జర్నలిస్టులను ఒక ప్రశ్న వేశాను. దాదాపు అంతా...విలువలతో కూడిన నిష్పాక్షిక జర్నలిజాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. స్వేచ్ఛగా బతకనిస్తే...జర్నలిస్టు సంఘాల పేరిట బతికేస్తున్న కొందరు తప్ప నా సోదర సోదరీమణులంతా అన్యాయాన్ని ఎదిరిస్తూ, స్వచ్ఛమైన వార్తలు అందిస్తూ ప్రజల గొంతుకలై వృత్తి నిబద్ధతతో ఉంటారు. ఇక్కడ బెస్ట్ బ్రైన్స్ ఉన్నాయి. మంచి జర్నలిజం చేసే అవకాశం లేక...వేరే పనులు చేయలేక బురదతో అడ్జెస్ట్ కాక తప్పని పరిస్థితి. ప్రాక్టికల్ అయిన ఈ వ్యవస్థీకృత సమస్యని అర్థం చేసుకోకుండా...జర్నలిస్టులను తిట్టడం బాగోలేదు. ఫ్రీ మీడియా నిర్వహిస్తా...డబ్బు లిస్తారా? నేను కేసుల్లో ఇరుక్కుంటే వస్తారా? అంటే....ఒక్కటంటే ఒక్కడైనా ముందుకు రాడు. కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది. 

ఈ ఉదంతం నుంచి కొమ్మినేని గారితో పాటు అంతా గుణపాఠం నేర్చుకుంటారని ఆశిస్తున్నా. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఆయనకు ఒక్కరికే కాక... టీవీ షోలలో, సోషల్ మీడియాలలో ప్రభుభక్తితో బురద గుంటలో పీకల్లోతు మునిగి అది...నయాగరా జలపాతం అన్న ఫీలింగ్ తో బతికే వాళ్ళకు ఒక కనువిప్పు అయితే బాగుంటుంది. 

#savejournalism

Tuesday, June 10, 2025

కొమ్మినేని గారి ఉదంతం నేర్పే పాఠాలు!

జర్నలిజంలో 45 ఏళ్లకు పైగా పనిచేసిన పొలిటికల్ అనలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు గారి అరెస్టు మీద నేను నిన్న రాసిన పోస్టు సీనియర్ మిత్రులు కొందరికి నచ్చలేదు. నేను ఆయన ధోరణిని, శైలిని ఇసుమంతైనా సమర్ధించకపోయినా...అయనను దగ్గరి నుంచి చూసిన సీనియర్ జర్నలిస్టులు అయన మీద తమకున్న అభిప్రాయాలను పర్సనల్ మెసేజ్ ల రూపంలో పంపారు. జర్నలిస్టులనైనా, ఏ మనిషినైనా పూర్తిగా మంచి అనిగానీ, పూర్తిగా చెడ్డ అని గానీ చెప్పలేము కదా! ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్టు కింద అరెస్టు చేయడం తప్ప ఆయన్ను శిక్షించే వేరే మార్గం లేదా? అన్నది నా భావన. 


తను యాంకర్ గా ఉన్న ఆ పిచ్చి లైవ్ షో లో కొమ్మినేని గారు అనుభవానికి తగిన పరిణతి లేకుండా వ్యవహరించారన్నది నేను పునరుద్ఘాటించాల్సిన అంశం. ఆ చర్చను జర్నలిజం అనలేము. జర్నలిజం ఓనమాలైనా తెలియని ఒక చిల్లర యూట్యూబర్ మాదిరిగా మాట్లాడారు వాళ్ళు. ఇందులో సందేహం లేదు. ఎలాగూ నా అభిప్రాయం నేను చెప్పాను. అరెస్ట్ ఎలాగూ జరిగింది కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది.

అయితే ఈ ఎపిసోడ్ నుంచి జర్నలిస్టులు పరిగణలోకి తీసుకోవాల్సిన లేదా నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి.

1) జనాన్ని ఉద్ధరిద్దామని సంకల్పించి జర్నలిజంలోకి వచ్చిన జర్నలిస్టులు పొలిటికల్ యాక్టివిస్టులుగా మారనే మారకూడదు.

2) ఈ కేటగిరీ వారైనా, పొట్టకూటి కోసం జర్నలిజంలోకి వచ్చిన వారైనా, దండుకుందామని ప్లాన్డ్ గా జర్నలిజంలోకి చొరబడిన వారైనా పొలిటికల్ బాసుల మెప్పు కోసం రెచ్చిపోయి నోటికొచ్చింది వాగితే ఇవ్వాళ కాకపోతే రేపైనా పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి.  

3) జర్నలిజం ముసుగులో పొలిటికల్ గేమ్ ఆడితే అరెస్టు తప్పదన్న స్పృహ కలిగి ఉండాలి.  

4) అరెస్టు సమయంలో జరిగే తంతు గురించి ఒక అవగాహనతో ఉండాలి. సంబంధిత చట్టాల పట్ల కనీస పరిజ్ఞానం పొంది ఉండాలి.

5) బొక్కలో పడ్డాక యాజమాన్యం ఒక ఆస్థాన లాయర్ ను పంపడం, ఆ లీగల్ ఖర్చులు కొద్దో గొప్పో భరించడం తప్ప చేసే సాయం పెద్దగా ఏమీ ఉండదని, చిప్పకూడు తినాల్సింది మనమేనని గుర్తెరగాలి.

6) మనం బురదలో మునిగాం కాబట్టి, ఇంట్లో వాళ్ళను ములాఖత్ లకు, కోర్టుల చుట్టూ తిరగడానికి మానసికంగా సిద్ధం చేయాలి.

7) అరెస్టు అయ్యాక, మనం ప్రాణ మిత్రులు అనుకున్న ఒక్కడూ మనకెందుకువచ్చిన గొడవని స్పందించడనీ, వృత్తిలో ఉన్న అధిక భాగం మంది బాగా అయ్యిందని చంకలు గుద్దుకుంటారని ముందే మెంటల్ గా ప్రిపేర్ కావాలి.

8) జైల్లో జీవన విధానం (చదవాల్సిన పుస్తకాలు, రాయాల్సిన విషయాలు, అక్కడ తిండీ తిప్పలు, ఆరోగ్య సంరక్షణ చర్యలు) గురించి కొద్దిగా ముందుచూపుతో ప్లాన్ చేసుకోవాలి.  

9) మీడియా ఎథిక్స్ గురించి కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లేదా, దాని మీద ఏడేళ్లు కష్టపడి పీ హెచ్ డీ చేసిన నాలాంటి వాళ్ళతో అపుడప్పుడు మాట్లాడుతుండాలి!

మీడియా యాజమాన్యాలు రాజకీయ తీర్థంపుచ్చుకున్నా, ఆ పాపపంకిలం అంటకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ పైన చెప్పిన తొమ్మిది పాయింట్ల గొడవ ఉండదు. ఫక్తు పొలిటికల్ న్యూస్ పేపర్స్, ఛానెల్స్ లో చేస్తున్న ఎంతమంది జర్నలిజంలో చేరిన పాపానికి లోప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ బతుకు వెళ్లదీయడం లేదు? కొద్దిగా లౌక్యంతో ఉంటే సమస్య ఉండదేమో.

Monday, June 9, 2025

కొమ్మినేని గారు నిష్పాక్షిక జర్నలిస్టు కాదు... అయినా, ఇవ్వాళ్టి అరెస్ట్ సమంజసం కాదు...

పక్షపాతం ఉండకూడదు. 
సత్యమే పరమావధిగా పనిచేయాలి.
విమర్శ సహేతుకంగా చేయాలి. 
కక్షతో కూడిన పరుష వ్యాఖ్యలు చేయకూడదు. 

ఇవన్నీ చేయకపోబట్టి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని సీనియర్ జర్నలిస్టు అని రాయలేకపోతున్నా. కానీ ఆయన తెలుగు జర్నలిజంలో ఒక అధ్యాయం అన్నది వాస్తవం. 
సాక్షి టీవీలో వార్తల మీద విశ్లేషణ చేసే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న 70 ఏళ్ల కొమ్మినేని గారిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం బాధ కలిగించింది. ఈనాడు లో నాకు సీనియర్ కలీగ్ అయిన ఆయన్ను నేను చాలా దగ్గరి నుంచి చూశాను. వారి వార్తలు ఎన్నో ఎడిట్ చేశాను. రామోజీ రావు గారు ప్రేమగా గ్రూమ్ చేసిన ఆయన అంటే నాకు గౌరవం ఉంది.

ఆంధ్రుల అభిమాన అన్న ఎన్టీఆర్ నుంచి నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబు గారి చేతికి పవర్ వస్తున్నప్పుడు కొమ్మినేని గారు దగ్గరి నుంచి రిపోర్ట్ చేశారు. ఈనాడు బ్యూరో చీఫ్ గా ఎన్నో కథనాలు రాసారు.
ఆ కథనాలు అన్నీ నిజమా? వండి వార్చినవా? అన్నవి శేష ప్రశ్నలు. వాటికి రామోజీ గారు లేదా చంద్రబాబు గారు లేదా కొమ్మినేని గారు మాత్రమే సమాధానం చెప్పగలరు. చాలా మంది మాత్రం ఆ వార్తలు చంద్రబాబు గారికి మేలు చేసేలా ఒక పద్ధతి ప్రకారం రాశారని అంటారు. వాటి మీద కూయడం, రాయడం ఇప్పుడు అనవసరం.

కొన్ని పరిణామాల మధ్య రామోజీ గారికి కొమ్మినేని గారు దూరమయ్యారు. అది నాలాంటి వాళ్ళకు చాలా ఆశ్చర్యం కలిగించింది. రామోజీ గారు పరమపదించినపుడు కొమ్మినేని గారు వాడిన భాష, చేసిన వ్యాఖ్యలు విన్నాక అనిపించింది...ఇద్దరి మధ్య ఏదో పెద్ద విషయంలోనే తేడా వచ్చిందని. 

జగన్ మోహన్ రెడ్డి గారి సాక్షి లో కొమ్మినేని గారి షో చూశాక ఆయన మీద గౌరవం తగ్గింది. అయినా తెలుగు నేల మీద నిష్పాక్షిక జర్నలిజం ఒక పెద్ద భ్రమ అని తెలిసినవాడిగా ఆయన ను దూరం నుంచే గమనిస్తూ ఆయనకు మంచి జరగాలని కోరుకున్నాను. బ్యూరో చీఫ్ గా ఉన్నపుడు ఆయన రెండు బాక్సులు తెచ్చుకుని అందరితో కలివిడిగా ఉంటూ క్యాంటీన్ లో తినేవారు. చాలా సింపుల్ మనిషి. రామోజీ దూరమయ్యాక, చంద్రబాబుతో చెడ్డాక, జగన్ కు దగ్గరయ్యాక కొమ్మినేని గారి జర్నలిజం మరింత దిగజారిందన్న విమర్శ ఉంది. 

అయితే, ఎడిటర్ల సంఘానికి హెడ్డుగా చెప్పుకునే ఒకాయన టీవీ షో లో చేసిన సొల్లు వాగుడు మిషతో ఇవ్వాళ కొమ్మినేని గారి అరెస్టు అయ్యింది. కొమ్మినేని గారు ఆ వ్యాఖ్యను ఖండించకుండా...వెకిలిగా డీల్ చేశారన్నది స్పష్టం. ఆ వ్యాఖ్య కొమ్మినేని గారు నేరుగా చేయలేదు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయడం సమంజసం కాదు. పైగా అట్రాసిటీస్ కేసు పెట్టడం భావ్యం కాదు. లైవ్ షోలలో బూతులు మాట్లాడే వారిని ఆయన నిలువరించడం నేను చూసాను. జర్నలిస్టు సంఘాలను, రాజకీయ పార్టీలను రెంటినీ జాగ్రత్తగా డీల్ చేసే వారిలో మాదిరి లౌక్యం కొమ్మినేని గారికి లోపించింది అనిపిస్తుంది. 

పొలిటికల్ భావాలు ఎట్లా ఉన్నా...ఆయన సుదీర్ఘ కాలం పాటు జర్నలిస్టుగా ఉన్నారు. మొదట్లో చంద్రబాబు పక్షాన, ఇప్పుడు జగన్ వైపు ఉన్నారు. దానికి దానికి చెల్లు అయ్యింది. ఈ వయస్సులో ఆయన మీద కక్ష సాధింపు మంచిది కాదు. ఆయన్ని వెంటనే విడుదల చేయాలి. 

పొలిటికల్ వైకుంఠపాళి లో చిక్కుకుని..ఆరంభంలో ఉన్న నిష్పాక్షికతని పోగొట్టుకుని చరిత్రలో మంచి స్థానం పోగొట్టుకున్న జర్నలిస్టులు రెండు రాష్ట్రాల్లో ఎందరో ఉన్నారు. రాజకీయుడి చేతిలో బలవుతున్న ఇలాంటి సీనియర్లను, టీవీ డిబేట్లలో చెలరేగిపోతున్న జూనియర్లను చూస్తే జాలేస్తుంది. తెలిసీ తెలియక...పరమ పవిత్రమైన జర్నలిజానికి వీళ్ళు సమాధి కడుతున్నారు.

Sunday, June 1, 2025

సాయుధ పోరు కాలమా ఇది?

నేను: బాబూ, మొన్నటి ఎన్కౌంటర్ మీద నీ అభిప్రాయం ఏమిటి?

యువకుడు (27 ఏళ్ళు): ఎక్కడ జరిగింది? 

నేను: అదే...ఛత్తీస్గఢ్ అడవుల్లో మే 22 న జరిగిన ఎన్కౌంటర్. అగ్రనేత తో సహా 27 మంది మరణించారు.
యువకుడు: అవునా? నేను ఫాలో కాలేదు. ఆఫీసు పనిలో పడి ఫాలో కాలేదు. ఇవ్వాళ సండే. చూస్తా. 

నేను: ఈ మావోయిస్టులు, ఎన్కౌంటర్లు వంటి వార్తలు శ్రద్ధగా చదువుతావా? 
యువకుడు: ఊహూ...పైపైన చూసి వదిలేస్తా. బ్లడ్ షెడ్.

నేను: 45 ఏళ్ళు జనం కోసం అడవుల్లో ఉన్న ఆర్ ఈ సీ వరంగల్ పూర్వ విద్యార్థి, మావోయిస్టు టాప్ లీడర్ చనిపోయాడట. 
యువకుడు: 45 ఏళ్ళు అడవుల్లో ఉండడం పెద్ద విషయం. 

నేను: అలాంటి ఆయన్ను చంపడం భావ్యమా? 
యువకుడు: అరెస్ట్ చేయాల్సింది. టాప్ లీడర్ ను ఎప్పుడూ చంపకూడదు. పట్టుకుంటే వాళ్ళ వ్యూ పాయింట్ తెలుస్తుంది.

నేను: ఒక్క దెబ్బకు 72 మంది సీ ఆర్ పీ ఎఫ్ జవాన్లను, ఇన్ఫర్మర్ల పేరుతో ఎంతమందినో చంపిన ఆయన్ని కాల్చిపారేయవచ్చా? 
యువకుడు: ఆయన అంత దారుణాలు చేస్తే చంపవచ్చు, తప్పులేదు.

నేను: ఖనిజ సంపద ప్రభుత్వం, దాని సంబంధీకులు దోచుకోకుండా ఆయన నాయకత్వంలో మావోయిస్టులు ట్రై చేశారట.
యువకుడు: డెవలప్మెంట్ దృష్టిలో చూడాలి. యువకులకు ఉద్యోగాలు వచ్చే పనైతే, పరిశ్రమలో పెట్టేట్లయితే...తప్పదు.

నేను: అదంతా కాదు గానీ, నాకు ఒక్కటే చెప్పు. గిరిజనుల కోసం అష్టకష్టాలు పడుతూ
తన యావత్ జీవితాన్ని అంకితం చేసిన ఆ ఆర్ ఈ సీ పూర్వ విద్యార్థి దేశ ద్రోహా? దేశ భక్తుడా? 
యువకుడు: దేశ ద్రోహి. 

అయ్యో, అడవిదారి పట్టిన వాళ్ళు పిట్టల్లా రాలిపోతున్నారే...?
2026 మార్చి లోపు ఇంకెన్ని చావు వార్తలు వినాలి...?
సాయుధ పోరాటం పేరుతో ఒట్టి పుణ్యానికి ప్రాణాలు పోతున్నాయే...?
 జనసేవ కోసం కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఇట్లా సర్కార్ బుల్లెట్లకి ఎదురుపోయి నేలకొరుగుతున్నారే...?
వీరు ప్రాక్టికల్ ఆలోచన ఎందుకు చేయడం లేదు...?
దయాదాక్షిణ్యాలు లేని రాజ్యంతో ఈ ఆధునిక కాలంలో వీళ్ళు ఎట్లా తట్టుకుని బతికి బట్టగలరు...?
ఈ పరిస్థితికి పరిష్కారం ఏమిటి..? 
...వంటి అనేక ప్రశ్నలతో నేను నిద్రపట్టక చస్తుంటే...ఈ మహా నగరంలో ఒక ఎంఎన్ సీ లో ఉద్యోగం చేస్తున్న యువకుడు ఆ పై మాటలు చెప్పాడు. ఈ జన్ జీ పిల్లలు దాదాపు అంతా ఇట్లానే అనుకుంటున్నారేమో, నాకు తెలియదు? అవగాహన కోసం....మీకు అందుబాటులో ఉన్న పోరగాళ్లను ఈ మావోయిస్ట్ ఉద్యమం గురించి, ఈ ఎన్కౌంటర్లు, ఆపరేషన్ కగార్ వంటి వాటి గురించి అడిగి చూడండి.
1980 తర్వాత పుట్టిన పిల్లలు బతుకు పోరాటాల్లో బిజీ గా ఉన్నారు. మొబైల్ స్క్రీన్ ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. వాళ్ళకు ఈ ప్రపంచ పరిణామాలు పట్టించుకుని, స్పందించే తీరిక లేదు. మే 22 ఘటనకు వ్యతిరేకంగా ఏదైనా యూనివర్సిటీలో ప్రదర్శనలు, నిరసనలు జరిగాయా? కగార్ కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు రోడ్డు మీదకు వచ్చాయా? నా దృష్టికి రాలేదు. 

వ్యవస్థలో కుళ్ళు పట్ల రగిలి పోతున్నవారు, ప్రభుత్వాల ధోరణితో వేదన పడుతున్న వారు,
జనం కోసం పనిచేయాలని గట్టిగా అనుకునేవారు...తుపాకులు పట్టి అడవుల్లోకి పోకండి. ఇప్పుడది వర్కవుట్ కాదు. మీ అవసరం ఇక్కడే ఎక్కువ ఉంది. సాయుధ విప్లవ పోరాటాల గతిని సునిశితంగా చూస్తున్న మనిషిగా, 
పలు ఎన్కౌంటర్లు కవర్ చేసిన అనుభవంతో, అడవిబాట పట్టిన వారితో లోతైన చర్చ చేశాక ఇప్పటి కాలమాన పరిస్థితులను బట్టి ఒక ఆరు సూచనలు: 

1) సామాజిక స్పృహ, స్పందించే గుణం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకండి
2) కులం, గోత్రం, మతం, గితం ఊబిలో పడకుండా సమానత్వం కోసం పరితపించండి
3) బాగా అధ్యయనం చేయండి. సొంతగా స్టడీ చేయకుండా సైడ్స్ తీసుకోకండి. అన్ని రకాల సభలు, సమావేశాలు, సదస్సులకి వెళ్ళి అవగాహన పెంచుకోండి
4) ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా గళం ఎత్తండి. అద్భుతమైన సామాజిక మాధ్యమాలు వాడుకొని మీ సత్తా చాటండి
5) కేవలం దేశం లో సమస్యలు ఎత్తిచూపడం, 
దానికి బాధ్యులు వీళ్ళని తుక్కు రాజకీయ నాయకులను తిడుతూ కూర్చోవడం మాత్రమే విప్లవం అన్న పిచ్చి లెక్క మాని మీరు మీ వంతు పరిష్కారాలు వెతకండి
6) ఈ సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేస్తున్న మీడియా మీద, సృజనాత్మకత పేరుతో అశ్లీలం, హింస మీద బతికే సినిమా వాళ్ల మీద ఒక కన్నేసి ఉంచండి.

Friday, May 30, 2025

అన్నల అంతం ఆగాలి....ఆ పంథా మారాలి!

 వెంటాడి..

వేటాడి...

కాల్చి..

హతమార్చి...

కాయాన్ని కుళ్ళబెట్టి..

కుటుంబాన్ని ఏమార్చి...

అడవి మధ్యలో..

పుల్లలు అడ్డగోలుగా పేర్చి...

కాల్చిపారేస్తే..

బూడిద చేస్తే...

ఏంటీ, దీంతో అయిపోతుందా?

ఆ మహోజ్వల జ్వాల ఆరిపోతుందా? 

కగార్ బుల్లెట్లకు ఇంకా ఎన్ని ప్రాణాలు ఒరగాలి? 

2026 మార్చి తర్వాత అరుణ తారలు ఇక ఉండవా?

అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆ రోజుతో ఆపేయవచ్చా? 

అన్నలు అమాయకంగా నేలవిడిచి సాముచేస్తున్నారా? 

ఇవీ నక్సలిజం బలం, బలహీనతలు; రాజ్యం స్వరూపం, స్వభావాలు; జనం రుచులు, ధోరణులు బాగా తెలిసిన వాళ్లను పీడిస్తున్న సంశయాలు. ఏప్రిల్ 22 నాడు పహల్గాంలో ఉగవాదులు 26 మందిని పొట్టనపెట్టుకున్నప్పడు యావత్ దేశం గుండెలవిసేలా ఆగ్రహంతో కుమిలిపోతే, మే 21 నాడు ఛత్తీస్గఢ్ అడవిలో భద్రతా దళాల చేతిలో 27 మంది మావోయిస్టులు నేలకొరిగినప్పుడు సామాజిక స్పృహ ఉన్నవారు నిస్సహాయంగా మౌనంగా రోదించారు. ఆపరేషన్ సింధూర్,  ఆపరేషన్ కగార్ రెండూ పోలిక లేని ఆపరేషన్స్ అయినా...ఒకదాని తర్వాత ఒకటి భారతావనిలో ప్రకంపనలు సృష్టించాయి.  

మావోయిస్టులు, ప్రభుత్వం... ఇందులో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అన్నది...మన సామాజిక, ఆర్థిక అవగాహన బట్టి, వర్గ దృక్పథాన్ని బట్టి ఉంటుంది. అదొక ఎడతెగని చర్చ. రణరక్త ప్రవాహసిక్తమైన అడవుల సాక్షిగా...ఏళ్ల తరబడి సాగుతోంది. కానీ, సభ్యతా సంస్కారం లేకుండా జరిగిన దహన సంస్కారం మాత్రం వేధిస్తోంది. 40 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉండి తాను నమ్మిన సిద్ధాంతం కోసం, బీదా బిక్కీ కోసం  నిస్వార్థంగా  పనిచేసిన సిక్కోలు బిడ్డ, విగతుడైన వరంగల్ ఆర్ఈసీ విద్యార్థి వెంటాడుతున్నాడు. ఆయన పంథా, ఆయన పనులు, ఆయన ఆలోచనలు అన్నీ పెర్ఫెక్ట్, వంద శాతం కరెక్ట్ అని అనడం లేదు. ఆయన లాంటి మావోల మందుతో మొత్తం వ్యవస్థ మారిపోయి పీడన, దోపిడీ చప్పున ఆగిపోతాయన్న ఆశా లేదు. కానీ, మేలైన పరిస్థితిని స్వప్నించి తాను నమ్మిన ఒక సిద్ధాంతం కోసం కట్టుబడి నేలకొరిగిన స్పూర్తి మామూలిది కాదు. 

కుళ్ళిన ఈ వ్యవస్థ పట్ల అసహనం, ఆక్రోశం మనకు మాత్రంలేవా? నిత్యం దోపిడీ, దుర్మార్గాలు చూస్తూ మనదేమి పోయిందని చాలా మంది, రాజీ పడి అనేక మంది, గళం వినిపిస్తూ కొంతమంది బతికేస్తున్నాం. అడవుల బైట కాంక్రీట్ జంగిల్స్ లో చస్తూ బతుకుతూ బతుకీడుస్తున్నాం.  

మేడి పండు ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయం ఇంకేదో వాళ్ళకు కనిపించింది. ఆ మార్గంలో 40 ఏళ్లు తిండీ, నిద్రా లేకుండా వాగుల్లో, వంకల్లో, చెట్లల్లో, పుట్లల్లో బిక్కు బిక్కున తన సిద్ధాంతం కోసం బతికిన మనిషి మరణిస్తే...ఇవ్వాల్సిన గౌరవం ఇది కాదు.

 ఏ చట్టాన్ని చేతిలోకి తీసుకుని రక్తపుటేరులు పారిస్తూ డెడ్ బాడీల చుట్టూ ఆనందహేల చేస్తున్నారో...అదే చట్టంలో రాసిన కనీస మానవ హక్కులు పాటించకపోతే ఎలా? 

 ఇది శాంతి భద్రతల సమస్య అని ఏ పార్టీ పవర్లో ఉన్నా ఆ  ప్రభుత్వాలు భావిస్తాయి. కాదు..కాదు..అది ఆర్థిక, సామాజిక సమస్య అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీలకు, కొందరు ఆలోచనాపరులకు అనిపిస్తుంది. అధికారం గుప్పిట్లో ఉంచుకున్న రాజ్యాన్ని మావోయిస్టులు ఎదిరించినట్లే, 

సాయుధులైన మావోయిస్టులను రాజ్య ప్రముఖులు వివిధ కారణాల రీత్యా ద్వేషిస్తారు. ఎవరు గద్దె మీద ఉన్నా...వారిని ఆదరించి అక్కున చేర్చుకోలేరు. ఖతం చేయడానికే చూస్తారు.  ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా ఈ రెండు పక్షాల మధ్య పోరు సాగుతూనే ఉంటుంది. 

ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్ మాడ్ అటవీ ప్రాంతం సాక్షిగా పోలీసులు, సైన్యం అడ్డదిడ్డంగా పేర్చి వెలిగించిన చితి బూడిద అయి ఉండవచ్చు. కానీ ఆ మంటలకు ఆహుతైన ఆయన, అట్లాంటి వాళ్ళు ఇన్నాళ్లూ పడిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అవుతుందో లేదో కాలమే తేల్చాలి. అడవిబాట పట్టిన మేధావులు పిట్టల్లా రాలిపోతుంటే బాధిస్తోంది. 

ఇది విప్లవాల యుగం కాదని సాయుధ పోరాటం చేసే అందరూ గుర్తించాల్సిన తరుణమిది. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం ఎట్టిపరిస్థితుల్లో రాదు. అదొక దురాశ, పిచ్చి లెక్క. అన్నా,

జనహితం కోసం మీరు అడవుల్లో కుక్కచావు చచ్చినా అయ్యో పాపం అని కదిలిపోయి పిడికిలి బిగించి గాల్లోకి ఎత్తి లాల్ సలాం అనే వాతావరణం బయట లేదు. అధునాతన ఆయుధ సంపత్తి, కమ్యునికేషన్ వ్యవస్థను, కలుషిత మనసులను మీరు తట్టుకుని నిలవలేరు, బతకలేరు. 

మా చేతులు సంపాదించే పనిలో, సోషల్ మీడియాలో వచ్చే వాటిని  ఆస్వాదించడంలో యమ బిజీ అయ్యాయి.  నాయనా, మీరు అడవులు పట్టుకుపోతే, బైట ప్రశ్నించే గొంతులు కరువై పెద్ద నష్టం జరుగుతోంది. జనజీవన స్రవంతిలో ఉంటూనే ప్రజాస్వామ్య పోరాటాలను బలోపేతం చేయండి. 

అట్లానే, నిత్యం రక్తపాతం అజెండాగా ఉన్న పాకిస్థాన్ తో చర్చలకు సిద్ధమయ్యే మనం...మన భూమి కన్న మన బిడ్డలపై మారణకాండ ఆపి చిత్తశుద్ధితో చర్చలకు పిలిచి ప్రాణ నష్టం తగ్గించలేమా? ఆలోచించాలి.

Tuesday, May 27, 2025

జర్నలిజం విలువ దిగజారింది ఎందుకిలా?

'పాలమ్మిన... పూలమ్మిన...' ఫేమ్ మల్లారెడ్డి గారు.

కోట్లకు పడగలెత్తారు. మాజీ మంత్రి కూడా.

పవర్ కిక్కులో రేవంత్ రెడ్డి గారిని తొడగొట్టి సవాల్జేసిన మనిషి.  అలాంటి ఇలాంటోడు కాడు..మనసులో ఏదుంటే ఫిల్టర్ లేకుండా అదే చెప్తాడు. అట్లాంటి అయన మాటలు పెద్దగా పట్టించుకోనక్కర్లేదు.

కానీ, ఒక ఇంటర్వ్యూ లో జర్నలిజం మీద అయన చేసిన వ్యాఖ్యలు వింటే కాలిపోయింది, బాధేసింది, జాలేసింది. 

"జర్నలిజంలో ఏముందల్ల...

జర్నలిజం ఒక సబిజెక్టా?...  

అదొక బీఏనా, ఎంఏనా, ఎంబీఏ నా?...

ఏముందల్ల?...

ఏమి జర్నలిజమయ్యా అది?

జర్నలిజం పెద్ద కోర్సు కాదు...

పెద్ద ప్రొఫెషనల్ కాదు... డిగ్రీ కాదు...," అన్నాడు మల్లారెడ్డి సారు.

జర్నలిజం కోర్సు చేసిన వాళ్ళు, నికార్సైన జర్నలిస్టులు తప్ప... మిగిలిన అంతా మల్లన్న చెప్పిన దాంట్లో తప్పేముందంటారు. సగటు జనమై తే బాగయ్యింది...అని చంకలు కొట్టుకుంటారు. జర్నలిస్టు సంఘాలైనా మల్లారెడ్డి గారిని ఏమీ అనలేదు. అనలేని పరిస్థితి. ఈ దుస్థితికి కారణం ఎవరల్లా?

జర్నలిజం అంటే... సమాచార స్రవంతి... ప్రజల గొంతుక.... అన్యాయంపై పోరాటం...అక్రమార్కుల పాలిటి సింహస్వప్నం... మంచికి పెద్ద దిక్కు...సమాజానికి ఒక దిక్సూచి... ప్రజాస్వామ్య సౌధాన్ని నిలిపే నాలుగు స్తంభాల్లో ఒకటి.... ఒక కాపలా కుక్క. ప్రజాస్వామ్యానికి కీలకమైన ప్రజాభిప్రాయం ఏర్పడడానికి ప్రజలకు అవసరమయ్యే సమాచారాన్ని సరఫరా చేసే ఒక మెకానిజం.

మల్లారెడ్డి గారు తెలిసీ తెలియక కొంత, కావాలని కొంత అట్లా మాట్లాడుతుంటే నాకు 'ఈనాడు' వ్యవస్థాపకుడు రామోజీ రావు గారు గుర్తుకు వచ్చారు. ఆధునిక తెలుగు జర్నలిజం పితామహుడు ఆయన. పత్రికా భాష, తెలుగు జర్నలింలో ఇన్నోవేషన్, టెక్నాలజీ విషయంలో ఆయన పాత్ర ప్రశంసనీయమైనది.

అయితే, 1989 లో (నేను జర్నలిజంలో అడుగుపెట్టిన సంవత్సరం) గ్రామీణ వార్తల కోసం ఆయన మినీ ఎడిషన్స్ పెట్టకుండా ఉంటే జర్నలిజం విలువ మెరుగ్గా ఉండేదేమో? అనిపించింది. అప్పట్లో జిల్లాకు ఒకరిద్దరు జర్నలిస్టులు ఉండేవారు. వారికి మంచి విలువ ఉండేది. తర్వాత పరిస్థితి మారింది. 

రామోజీ గారి నిర్ణయం అప్పట్లో 'అత్యద్భుత వినూత్న వ్యాపార విస్తరణ ఆలోచన' గా ప్రశంసలు అందుకుంది. ఆ సూపర్బ్ ప్లాన్ లో భాగంగా.... జిల్లాల వారీగా మినీ ఎడిషన్స్ మొదలు పెట్టి... ఆ పేజీలు నింపడానికి ముందుగా మండలానికి, ఆ తరవాత గల్లీకో విలేకరిని నియమించారు. సంస్థ పే రోల్స్ లో లేకుండా పార్ట్ టైం ప్రాతిపదికన, రాసిన సెంటీమీటర్ కు ఇంతని పొందే కంట్రిబ్యూటర్/ స్ట్రింగర్ వ్యవస్థ ఏర్పాటు చేసారు. 

ఈ క్రమంలో చిక్కటి పాలు పలచపడ్డాయి. రామోజీ గారిని చూసి అన్ని తెలుగు పత్రికలూ గల్లీకో రిపోర్టర్ బృహత్ పథకాన్ని అమలు చేయక తప్పలేదు. విద్యార్హతలతో సంబంధం లేకుండా ఎడాపెడా విలేకర్లును నియమించి, వారికి సరైన శిక్షణా గట్రా ఏమీ లేకుండా, వారికి డబ్బులు సరిగా ఇవ్వకుండా, వ్యాపార ప్రకటనల బాధ్యత (టార్గెట్) పెట్టి కంపు కంపు చేశారు. కంట్రిబ్యూటర్ లలో కొందరు మెరికలు ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో విలేకరులను నియమించడం బాగా చేటు చేసింది. సమాజంలో విలువ ఉండీ, జీతాలు సరిగా లేని స్ట్రింగర్లు ఉన్నతంగా బతికేందుకు ఉన్న అన్ని మార్గాలూ చూసుకున్నారు. దీనివల్ల జరిగిన నష్టాలు ముఖ్యంగా రెండు.

ఒకటి- జర్నలిజం విలువలు అధఃపాతాళానికి.

రెండు-అవినీతి అక్రమాలు పతాక స్థాయికి.

నాలుగు వాక్యాలు రాసే ప్రభుత్వ టీచర్లు అనేకమంది కూడా పార్ట్ టైం విలేకరులు గా అవతారమెత్తారు. ప్రభుత్వ అధికారులు వారిని చూసి భయపడే వారు. ఇట్లాంటి జాడ్యాలు చొరబడ్డాయి. ఈనాడు లో టైం కి పారితోషికం ఇచ్చేవారు. కొన్ని పత్రికలు ఈ స్ట్రింగర్స్ ను వాణిజ్య ప్రకటనలు సేకరించి అందులో కొంత జీతం కింద ఉంచుకుని పెద్ద భాగం తమ కేంద్ర కార్యాలయానికి పంపాలని స్పష్టంగా హుకుం జారీ చేశాయి. పాపం వాళ్ళకి యాడ్ టార్గెట్స్ పెట్టిన యాజమాన్యాలు అనేకం. బాగా వార్త రాయడం కాదు, బాగా కలెక్ట్ చేయడం ప్రతిభకు, నిబద్ధతకు కొలబద్ద కావడంతో విలేకర్లు యాడ్స్ కోసం రాజీపడడమో, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడడం చేయకతప్పలేదు. 

తెలుగు మీడియా పరిస్థితి మరీ ఇంత ఘోరంగా అవుతుందని ఊహించి ఉంటే... రామోజీ గారు ఈ వ్యవస్థకు జన్మనిచ్చేవారు కాదేమో? 

కాలక్రమేణా టెక్నాలజీ ప్రభావం జర్నలిజం మీద బాగా పడింది. ఇప్పుడు జర్నలిజం లేదు, గిర్నలిజం లేదు.  ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర ప్రయోజనాల  కోసం అంటూ దాదాపు అన్ని పత్రికలు, టీవీ చానళ్లు ఏదో ఒక పొలిటికల్ పార్టీ కి కొమ్ముకాస్తున్నాయి. బాగా బాకా ఊదుతున్నాయి.  మీడియా హౌజ్ లు వివిధ వ్యాపారాల్లో పడి విలువల వలువలు ఊడబీకి పారేస్తున్నాయి. క్విడ్ ప్రోకో అనేక రూపాల్లో జర్నలిజాన్ని ముగిసింది. రాజశేఖర్ రెడ్డి గారు ఈనాడు కు పోటీగా తెచ్చిన సాక్షి తో విలేకర్ల జీవితాల్లో కొద్దిగా వెలుగులు వచ్చాయి కానీ ఒక పత్రిక, ఇంకో పత్రిక యాజమాన్యం "అక్రమాల" ను ఫ్రంట్ పేజీలో రాయడం, అందులో వచ్చే వ్యాసాలకు కౌంటర్ రాయడం మొదలయ్యాక... ఓనర్లు అందరూ అందరే అన్న అభిప్రాయం సామాన్య జనాల్లో కూడా కలిగింది. 


అంతే కాదు, సెల్లు ఫోను ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టే. ఇప్పుడు యూ ట్యూబ్ పెట్టిన ప్రతి మనిషీ ఎడిటరే. అందరిదీ  భావ ప్రకటన స్వేచ్ఛే.

అందుకే... పాలమ్మిన మల్లారెడ్డి గారు విషం చిమ్మినా, పూలమ్మిన మల్లారెడ్డి గారు బండలేసినా చేసేదేమీ లేదు. 

#SaveJournalism 

Photo: Bhala Media