Saturday, May 25, 2019

గాడితప్పిన కారుకు ఓటర్ల ఝలక్...ఐదు కారణాలు

అధికారమదం తలకెక్కి ఒళ్ళుబలిసి కొట్టుకుంటే ఓటు మందుతో కాయకల్ప చికిత్స చేసే చతురత మన ఓటర్లది. రాజకీయ చాణక్యం వల్ల ముందస్తు ఎన్నికలకు వెళ్ళబెట్టి కేసీఆర్ సేన బతికిపోయింది. లేకపోతే, ఆంధ్రాలో లాగా అయ్యా కొడుకులు తలమీద తెల్ల కర్చీఫ్ వేసుకుని కూర్చోవాల్సి వచ్చేది మే 23 తర్వాత... అన్న వాదన కొట్టిపారెయ్యలేనిది.  "కారు.. సారు.. పదహారు .. ఢిల్లీ లో సర్కారు..."  అంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్టిన డప్పు మోగలేదు.  ఎగ్జిట్ పోల్స్ బోల్తా కొట్టించడం, సొంత కూతురు కవిత ఘోర పరాజయం పొందడం నుంచి కోలుకోవడానికి సారుకు కొంత కాలం పట్టవచ్చు. ఇప్పటికే ఆయన దులుపుడు కార్యక్రమం మొదలు పెట్టినట్లు సమాచారం. 
అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ డూపర్ హిట్ అయిన గులాబీ దళం పార్లమెంటరీ ఎన్నికల్లో కుదేలు కావడానికి కారణాలు ఉన్నాయి. 
1) పొగరుబోతుతనం: అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక... కేబినెట్ లేకుండా పాలన సాగిస్తే యావత్ దేశం విస్తుపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన కిక్ తో కేసీఆర్ విర్రవీగుతున్నారని జనం బాహాటంగానే అనుకున్నారు. పార్లమెంటరీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే... వ్యూహాత్మకంగా పెద్దాయన ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రయోగాలు బెడిసికొడతాయి. ఇప్పటికీ కేబినెట్ కూర్పు సరిగా జరగలేదు. సగం తెలుగుదేశం నేతలతో కారు యాత్ర సాగుతున్నది. 

2) అడ్డగోలు నిర్ణయాలు: కొడుకును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన కేసీఆర్... వ్యూహాత్మకంగా మేనల్లుడు హరీష్ రావును నొక్కేశారు. ఇది కూడా ప్రజల్లో చర్చకు దారితీసింది. కే టీ ఆర్ అంటే లేని సానుభూతి  మేథావులు, నాయకులు, జర్నలిస్టులలో హరీశ్ పట్ల ఉంది. డబ్బు ప్రభావంతో టికెట్లు ఇచ్చారన్న చర్చ బాహాటంగానే జరిగింది. ఉదాహరణకు: ఎం ఎల్ ఆర్ కాలేజీల అధిపతి కుమారుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి మల్కాజ్ గిరిలో ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారు? పారిశ్రామికవేత్త నామా నాగేశ్వర్ రావు పార్టీలో చేరిన రోజునే టికెట్ ఇచ్చారు. రాజధానిలో తిష్ట వేసే రేణుకా చౌదరి ప్రత్యర్థి కాబట్టి నామా బతికి పోయారు గానీ లేకపోతే ఖమ్మం ఓటర్లు గట్టి బుద్ధే చెప్పేవారు. ఇట్లాంటి పిచ్చపనులు చేసి దెబ్బతిన్నది టీఆర్ఎస్. 
   
3) ఉద్యోగుల మంట: ఈ ప్రభుత్వం పట్ల ఉద్యోగులలో అసంతృప్తి బాగా ఉంది. వేతనాలు, బిల్లుల చెల్లింపులు, ఆర్థిక స్థితిగతుల పట్ల మంచి అవగాహన ఉన్న ఉద్యోగులు బాహాటంగానే టీఆర్ఎస్ భంగపాటును కోరుకున్నారు. కేసీఆర్ మీద కోపంతో బీజేపీ కి ఓట్లు వేసిన వాళ్ళూ ఉన్నారు. 

4) యువతలో నైరాశ్యం: ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన యువతకు ఇప్పుడు భ్రమలు తొలిగాయి. ఉద్యోగాలు అనుకున్న స్థాయిలో లేవు. ఉస్మానియా లాంటి విశ్వ విద్యాలయాలకు నిధులు ఇవ్వకుండా దెబ్బతీస్తున్నారు. మోడీ పట్ల యువతకు ఉన్న సదభిప్రాయం, తండ్రీకొడుకుల మీద పెరుగుతున్న ఏహ్యభావం టీఆర్ఎస్ ను దెబ్బతీయడంలో కీలకపాత్ర పోషించాయి. 
   
5) హస్తినపై  కన్ను: తెలంగాణా ను కొడుక్కు వదిలి కేసీఆర్ కేంద్రంలో సెటిల్ కావాలని భావిస్తున్నారని ఓటర్లకు అర్థమయ్యింది. తెలంగాణా పునర్నిర్మాణానికి చేసింది ఏమీ లేదు గానీ... ఈయనకు అక్కడ పదవి మీద కన్ను పడిందని బాహాటంగా మాట్లాడుకున్నారు. 
ఇది జరగడానికి వీల్లేదని, ఈ ఎన్నికల్లో కారు గాలితీయకపోతే కేసీఆర్ ను పట్టుకోవడం తరంకాదని  ఓటర్లు గట్టిగా భావించారు.

మీడియా విషయంలో ప్రభుత్వ ధోరణి కూడా ఆరో కారణంగా చెప్పుకోవచ్చు గానీ, మీడియా అంటే జనాలకు ఉన్న అసహ్యం మూలంగా దాన్ని ఒక అంశంగా చెప్పుకోనక్కర్లేదు.
మోడీ ప్రభంజనం మూలంగా.... తానూ అనుకున్న 16 బదులు.. కేవలం 9 సీట్లు రావడం వల్ల టీఆర్ఎస్ కు కొంపలు మునిగిపోయింది ఏమీలేదు. కానీ ఇది ముందస్తు హెచ్చరిక అని మాత్రం చెప్పుకోవచ్చు. ఎవరెంత సంపాదిస్తున్నది, ఎవరేమి చేస్తున్నది జనం గమనిస్తారు. మే 23, 2019 కి ముందు ఉన్నట్లు గానే కేసీఆర్, కేటీఆర్ వ్యవహరిస్తే... వచ్చే ఎన్నికల్లో శంకరగిరి మాన్యాలే! 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి