Saturday, May 25, 2019

ఏపీలో నలుగురు జోకర్లు: కేఏపీ, పీకే, ఎన్ఎల్, ఎల్ఆర్!

మండే ఎండల్లో ఓట్ల పండగ చవిచూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆటలో అరటిపండులా మంచి వినోదం పంచిన నలుగురు నేతల గురించి మాట్లాడుకోకపోతే సున్నా సంపూర్ణం కాదు. గెలుపు ఓటములు సహజమని నమ్మడం మన ధర్మం కాబట్టి... ఈ నలుగురి ఫలితాల గురించి కాకుండా వీరి ధోరణుల గురించి మాట్లాడుకోవడం సముచితం. 

ముందుగా, కేఏపీ (మత ప్రచారకుడు కే ఏ పాల్). ఈ మధ్యకాలంలో పాలిటిక్స్ లో ఇంత కామిడీ పండించిన మనిషి మరొకరు లేరు. విధవరాండ్రు, అనాథల కోసం పనిచేస్తూ...అందరు  ప్రపంచ దేశాల అధినేతలతో నిత్యం టచ్ లో ఉంటానని మొహమాటం లేకుండా చెప్పుకునే ప్రజాశాంతి పార్టీ అధినేత అమాయకపు  పాల్ గారిని బాగా బ్రష్ట్రు పట్టించింది... టీవీ -9. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ఆయన  లైవ్ కోసం ఎంత మొత్తుకున్నా... ఒక్కళ్ళూ సరిగా ప్రత్యక్ష ప్రసార యోగం కల్పించకుండా... పాల్ గారిని తొక్కేశారు! పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ కి పోటీపడిన ఆయనకు 281 ఓట్లు రాగా, అదే లోక్ సభ సీటుకు పోటీ పడిన ఆయనకు 2987 ఓట్లు వచ్చి డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. రాజకీయ విషయ పరిజ్ఞానం పెద్దగా లేకుండా, మీడియా మీద, మతం మీద  నమ్మకంతో దూసుకుపోదామని అనుకున్న పాల్ గారికి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి పట్టించారు ఆంధ్రా ఓటర్లు. ఓటేశాక... ఉరుక్కుంటూ కుప్పిగంతులు వేసుకుంటూ వెళ్లి కారెక్కిన పాల్ గారు... మీడియా మెట్లు ఎక్కకుండా... కామిడీ చేయకుండా....ఉండివుంటే ఒకటి రెండు చోట్లయినా పరువు నిలిచేదేమో! ఉత్తరాదిన అంత కామిడీ చేసే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఆ రసాన్ని ఎప్పుడు వాడాలో అప్పుడే మితంగా వాడేవారు. 

ఇక, పీకే (పవర్ స్టార్ పవన్ కళ్యాణ్). చేగువేరా స్పూర్తితో.. వ్యవస్థ మీద కసితో...సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఎన్నికల రణంలో దిగిన ఈయన అసందర్భ ప్రేలాపనలతో పలచనయ్యారు. అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీని, చంద్రబాబు ను కాకుండా... ప్రతిపక్ష నేత మీద దాడి చేస్తుంటే...నమ్మడానికి జనం సినిమా పిచ్చోళ్ళు కాదు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి  మనసులు గెలుచుకోవచ్చని అనుకున్న ఆయన ఒక దశలో తెలంగాణాలో ఆంధ్రా వాళ్ళపై దాడి చేస్తున్నట్లు ప్రచారం చేయడం, దానికి ఆ కుటుంబపు అభిమాన తార శ్రీరెడ్డి వంటి వాళ్ళు సోషల్ మీడియాలో కుమ్మేయడం గణనీయంగా దెబ్బకొట్టి ఉండవచ్చు. ఒక సారి అన్నయ్య, మరొకసారి తమ్మయ్య కాపుల్లో ఆశ కల్పించి నీరుగార్చారు. చిన్న అన్నయ్య  నాగబాబు యూట్యూబ్ ఛానెల్ లో రెచ్చిపోతూ..  'తాట వొలుస్తాం' అన్నదాన్ని జనం తప్పు అర్థం చేసుకుని తాట తీశారు. భీమవరం, గాజువాకల్లో ఈయన ఎనిమిది వేల పైచిలుకు ఓట్ల తేడాతో కంగుతిన్నాడు. తనకన్నా... తన అన్న చిరంజీవే బెటరని పీకే నిరూపించాడు. పాలిటిక్స్ లో ఓపిక, మన టర్న్ కోసం అలసిపోకుండా ఎదురుచూడడం అవసరం. ఆనాడు చిరంజీవి ఠక్కున కాంగ్రెస్ తీర్థం తీసుకోకుండా ఉండి ఉంటే... ఈ రోజు ఒక ప్రబల శక్తిలా ఎదిగి ఉండేవాడు. కాపుల కలను నెరవేర్చేవాడు.  ఇప్పుడు... ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించని పీకే వచ్చే ఎన్నికల దాకా శ్రమకోర్చి  ప్రాక్టికల్ గా వ్యవహరిస్తే కచ్చితంగా ఒక అవకాశం దొరుకుతుంది. కానీ, మనోడికి అంత ఓపిక ఉందా అన్నది పెద్ద ప్రశ్న. 
 ఎన్ ఎల్ (మంత్రి నారా లోకేష్ బాబు). తెలుగు కు పట్టిన గబ్బు మన బుజ్జి  బాబు. మంగళగిరి అనడమే  రాకపోవడానికి నాలుక తిరగకపోవడం కారణం కావచ్చు గానీ, ప్రచారంలో డొక్క శుద్ధి మాత్రమే కాకుండా ఒక వ్యూహం అంటూ ఏదీ లేకుండా...నోటికొచ్చింది వాగి  దూసుకుపోయాడు. సోషల్ మీడియాలో పాల్ గారి తర్వాత.. లోకేష్ మీద, రాహుల్ మీద పంచ్ ల మీద పంచ్ లు ప్రచారమయ్యాయి.  లోకేష్ కు సుస్థిర రాజకీయ జీవితం ఇవ్వడానికి చంద్రబాబు కు ఈ ఎన్నికలు చాలా అవసరం. కానీ, పథకం దెబ్బతిన్నది. చాలా మంది మంత్రులతో పాటు లోకేష్ కు కూడా జనం షాక్ ఇవ్వడం తన తండ్రికి మింగుడుపడని అంశం. ఈ దెబ్బ నుంచి కోలుకుని ఆ విధంగా ముందుకు పోవడానికి లోకేష్ కు చాలా సమయం పడుతుంది. 
 
ఇక చివరాఖరుకు, ఎల్ఆర్ (ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్). ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక రాజకీయ సన్యాసం చేసిన లగడపాటి తన చిలక జోస్యాలతో జనాలకు వింత, వినోదం కొంత పంచారు. మీడియా అటెన్షన్ కోసం మాత్రమే... శాస్త్రీయత లేకుండా... జోస్యం చెప్పి మరొకసారి ఈ పారిశ్రామిక వేత్త బోర్లా పడ్డారు. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి