Sunday, November 9, 2014

మీడియా కబుర్లు... అవీ-ఇవీ-అన్నీ

"జై తెలంగాణ": టీవీ-9 వస్తోంది.....  
* కోర్టుల చొరవతోనో, బ్యాక్ గ్రౌండ్ వర్క్ సఫలం కావడం వల్లనో... మొత్తం మీద మూడు, నాలుగు నెలల తర్వాత టీవీ-9 కార్యక్రమాలు పునఃప్రసారం అవుతున్నాయి. ఇది మంచి పరిణామం. తెలుగు జర్నలిజంలో వింత, వినూత్న పోకడలకు శ్రీకారం చుట్టిన ఈ ఛానల్ చూడకపోతే... అదోలా అనిపించిన జీవులు కోకొల్లలు. ఈ బ్యాన్ సమయంలో దీన్ని సాకుగా తీసుకుని ఈ ఛానల్ యాజమాన్యం ఉద్యోగుల జీతాలపై కోత పెట్టినట్లు సమాచారం. 
బాగా వింతగా అనిపించిన విషయం ఏమిటంటే... టీవీ-1 వాళ్ళు పేరుమార్చుకుని ముందుకు రావడం. పైగా "జై తెలంగాణా" అని పేరుపెట్టుకుని మరీ...చేసిన తప్పుకు 'ప్రాయశ్చిత్తం' చేసుకున్నారా... అనిపించారు. ప్రభుత్వం ఒత్తిడి వల్ల ఈ పనిచేశారా? అని వాకబు చేశాం... కానీ సరైన సమాచారం దొరకలేదు. టీవీ-9 జర్నలిస్టులు కొందరు... కొత్త రూపు సంతరించుకున్న ఈ ఛానెల్ లో ప్రత్యక్షం కావడం కూడా...కొందరికి చివుక్కు మనిపించి ఉంటుంది. దీన్నిబట్టి మరొకసారి నిరూపితం అయ్యింది ఏమిటయా అంటే...మీడియా కింగులు పరిస్థితులను బట్టి వంగమన్నా వంగుతారు. ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే క్రమంలో ఇవన్నీ తప్పవండీ!

ఎన్నాళ్ళు వేమూరి గారికి సంకెళ్ళు? 
*మరి తెలుగు జర్నలిజంలో నీతి-నిజాయితీ, ధైర్యం-సాహసం తనకెక్కువ అని ప్రకటించుకునే వేమూరి రాధాకృష్ణ గారు వంగలేదేమిటి? అన్న ప్రశ్న తలెత్తడం సహజం. ప్రసారాల పునరుద్ధరణ కోసం పోరాడడంకన్నా... "ఎన్నాళ్ళీ సంకెళ్ళు" అని రోజూ పత్రికలో ప్రచురించడం ద్వారా పొందే సానుభూతి నిజానికి ఎక్కువ. దీనివల్ల జర్నలిజంలో నిజంగానే దమ్మున్న మొనగాడు అని తెలీనోళ్ళకు తెలియజెప్పవచ్చు. 
అటు పక్క ఉన్న మన ప్రభుత్వం దృష్టిలో, ప్రజల దృష్టిలో చెరగని ముద్ర వేయవచ్చు. ఎందుకంటే... బుష్ గారు అన్నట్లు ఒకరి దృష్టిలో తీవ్రవాది మరొకరి దృష్టిలో సమరయోధుడు (one man's terrorist is another man's freedom fighter). సరే... ఈ కాలిక్యులేషన్స్ పట్టించుకోకుండా ఏబీఎన్ ప్రసారాలు కూడా పునరుద్ధరించి పత్రికా స్వాతంత్ర్యాన్ని గౌరవిచాల్సిన బాధ్యత తెలంగాణా ప్రభుత్వం మీద... ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఉంది. 

 హెచ్ ఎం: రాజశేఖర్ వర్సెస్ వెంకటకృష్ణ!!!
*ఈ నిషేధాలు-భేషజాలు ఇలా ఉండగా... కపిల్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న హెచ్ ఎం టీవీ లో పరిణామాలు ఆసక్తి గా ఉన్నాయి. సినిమాల్లో మల్లికా షరావత్, దీపికా పదుకొనెల మాదిరిగా తెలుగు ఛానెల్స్ లో ఒక వెలుగులాంటి రాజశేఖర్ ప్రభ అక్కడ తగ్గిందన్న ప్రచారం ఆయన వ్యతిరేకులు/బాధితులు ప్రచారం చేస్తున్నారు. "రాజశేఖర్ ను ఛానెల్ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించి... పీ ఎన్ వీ నాయర్ తో కలిసి ఒక్క హన్స్ ఇండియా ను చూసుకోమన్నారట.
వెంకటకృష్ణ (పెద్దబొమ్మ)... రాజశేఖర్ (చిన్న బొమ్మ) 
 డిసెంబర్ లో రాజశేఖర్ అక్కడి నుంచి చెక్కెస్తాడట..." అని ఆయన ఆగమనంతో ఉద్యోగాలు కోల్పోయిన నలుగురు ఒక 20 రోజులుగా చెబుతున్నారు ఈ బ్లాగు బృందానికి. కానీ మేము నమ్మడం లేదు. రాజశేఖర్ వెన్నుచూపి పారిపోయే రకం కాదు. అయితే...ఈనాడు లో జర్నలిజం మొదలెట్టి... ఈ టీవీ లో అద్భుతంగా రాణించి... టీవీ 5 అభ్యున్నతిలో కీలకపాత్ర పోషించి.. 6టీవీకి జీవం ఇచ్చిన వెంకట కృష్ణ  హంస టెలివిజన్ కు రావడం గురించి మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్నది. రాజశేఖర్ ఆశీస్సులతో వచ్చాడని కొందరు... కపిల్ యజమాని వామన రావు గారి చాయిస్ అదని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే వీకే యమ వీజీ గా చర్చలు జరుపుతూ దుమ్ములేపుతున్నాడు. రాజశేఖర్ కు లేనిది...వీకే కు ఉన్నది అదే. రాజశేఖర్ తెర వెనుక ఇరగదీయగలడు, వీకే తెర మీద చింపగలడు. నిజానికి... రాజశేఖర్ ను ఛానెల్ బాధ్యతలు చూపవద్దని అనడం...మల్లికా షారావత్ ను డాన్స్ చేయవద్దని ఆంక్ష పెట్టడం తో సమానం. అది కుదరని పని. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. 

'ఈనాడు' ఓనర్లకు తిట్లు... శాపనార్థాలు   
*'ఈనాడు' లో ఇప్పుడు అంతా యాజమాన్యాన్ని బండ బూతులు తిడుతున్నారు. బూతులంటే... మామూలు బూతులు కాదు. ఒకొక్క మిత్రుడు అదనంగా నాలుగు గంటలపాటు ప్రయాణం చేసి ఫిల్మ్ సిటీ కి వెళ్లి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి వస్తున్నారు. "నడుములు పోతున్నాయి సార్. వీళ్ళకు ఇదేమి పోయే కాలమో! రామోజీ ని ఆయన కొడుకును తిట్టని ఉద్యోగి లేడంటే నమ్మండి. ఇంకా ఎక్కడా ఉద్యోగాలు లేక మూసుకుని పనిచేస్తున్నాం..." అని జర్నలిస్టులు మొత్తుకుంటున్నారు. కుటుంబ సభ్యులైతే శాపనార్థాలు పెడుతున్నారు. నగరం జడిబొడ్డున ఖైరతాబాద్ లో ఆఫీసును ఊరిబైట ఉన్న ఫిల్మ్ సిటీ కి తరలించడంతో 100 నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోందని, మనసు పెట్టి ఉద్యోగాలు చేయలేకపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. 

యు... టూ... 'ది హిందూ' 
*ఎప్పుడూ ఉద్యోగులకు దసరా నాటికి దళసరి బోనస్ ఇచ్చే 'ది హిందూ' ఈ సారి ఉద్యోగులకు మొండి చేయి చూపింది. ఇవ్వాలని రూల్ లేకున్నా ఇన్నీళ్ళు ఇస్తూ వచ్చామని, ఆర్ధిక ఇబ్బందుల రీత్యా ఈ ఏడాది ఇవ్వలేకపోవదాన్ని ఉద్యోగులు అర్థం చేసుకుంటారని ఒక లేఖ కూడా పంపింది యాజమాన్యం. అంతే కాకుండా... ఇక మీదట పర్మినెంట్ ఉద్యోగాలు కాకుండా కాంట్రాక్ట్ బేసిస్ లో తీసుకోవాలని నిర్ణయించారు. ఇకప్పుడు... ఉద్యోగ భద్రతకు మారు పేరైన 'ది హిందూ' లో ఈ దుస్థితి రావడం తో ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. 

నరేంద్ర చౌదరీ... నమో నమః 
*అసలు మాన్ ఆఫ్ ది మీడియా.... ఎన్-టీవీ నరేంద్ర నాథ్ చౌదరి గారు. భక్తి ఛానెల్ ఒకటి పెట్టి, ఆథ్యాత్మిక సేవ చేసుకుంటూ ఏదో తరిస్తున్న ఆయన... కార్తీక మాసం సందర్భంగా ఎన్ టీ ఆర్ స్టేడియం లో గత పద్నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న "కోటి దీపోత్సవం" సూపర్ గా క్లిక్ అయ్యింది. ఏమి జనం... ఏమి ప్రవచనాలు!!! కాషాయ స్వాములు, రాజకీయ వేత్తలు, సాధారణ జనం, భక్తులు అంతా సాయంత్రం కాగానే ఆ ప్రోగ్రాం కు వెళ్లడమో, ఇళ్ళళ్ళో కూర్చుని టీవీ లో చూడడమో చేస్తున్నారు. వత్తులు, నూనె, కొవ్వొత్తి, ప్రమిదలు, అగ్గిపెట్టె కూడా చౌదరి గారే సమకూరుస్తూ భక్తులను పరవశులను చేస్తున్నారు. స్వామి కార్యం... స్వ కార్యం అంటే ఇదే మరి. నువ్వు ఛానెల్ ఎలా పెట్టవన్నది కాదు బ్రదర్... ఎలా మార్కెట్ చేస్తున్నవన్నది ముఖ్యం. 

1 comments:

jaya said...

సార్ ! వెంకటకృష్ణ గారి చర్చలు బాగుంటాయి . దయచేసి ప్రస్తుతం వారు ఎ చానెల్ లో పనిచేస్తున్నారో తెలుపగలరు

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి