Wednesday, November 25, 2009

మీడియా తీరుతెన్నులపై మంచి చర్చలు

"పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రిక ఆ పత్రిక," అని ఒక పెద్దాయన ఒకానొక పత్రికను ఉద్దేశించి గతంలో తెగనాడాడు. ఇప్పుడు ఏ ఛానల్ లో , ఏ పత్రికలో చూసినా...పెట్టుబడుల వ్యవహారం పెద్ద చర్చనీయాంశం అయి కూర్చుంది.  


'ఈనాడు', 'సాక్షి' పత్రికలు ఒక దానిపై మరొకటి మొదటి పేజీలో దుమ్మెత్తి పోసుకుంటున్నాయి...ఈ పెట్టుబడి గురించే. మీకు పెట్టుబడి ఎవరు పెట్టారంటే...మరి మీ సంగతి ఏమిటి అని రెండు పత్రికలు అక్షర యుద్ధానికి దిగాయి.


నిజం చెప్పుకోవాలంటే వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణం తర్వాత 'ఈనాడు' లో ధైర్యం పెరిగింది. ఓబులాపురం విషయంలో జగన్ అనుయాయులు బద్నాం కావడాన్ని ఆ పత్రిక మంచి అవకాశంగా తీసుకుని...సోదర పత్రిక 'ఆంధ్రజ్యోతి' తరహాలో ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఈ లోపు...రామోజీ గారు కష్టాలలో వుంటే...ఆదుకున్నది ఎవరా అని ఆరా తీసి 'సాక్షి' పేపర్, ఛానల్ ఒక కథనాన్ని వెలుగులోకి తెచ్చాయి. చంద్రబాబుకు, రిలయన్స్ కు సంబంధం వుంది కాబట్టి...'ఈనాడు' కు పరోక్షంగా బాబు ఆర్ధిక దన్ను ఇచ్చారని, ఇది అపవిత్రమని ఆ కాంగ్రెస్ ఎం.పీ. పత్రిక, ఛానల్ ఘోషించాయి.

నిజానికి ఇలాంటి కథనాలు రాగానే...రామోజీ గారు మొదటి పేజీలో తన సంతకంతో కూడిన ఎడిటోరియల్ వేస్తారని అనుకున్నాం కానీ...అప్పటికి కిమ్మనని 'ఈనాడు' మూడు రోజులు పోయాక ఒక బ్యానర్ ప్రచురించింది. 'సాక్షి'కి ఎవరు, ఎలా, ఎందుకు పెట్టుబడులు  పెట్టిందీ వివరంగా తెలిపిందీ కథనం. పెట్టుబడులు పెట్టిన వారి గురించి చాలా వార్తలు ప్రచురించింది.

'సాక్షి' ఆగుతుందా? వెంటనే....'ఈనాడు'ను దూది ఏకుతూ "మాది రాచబాట...మాది అద్దాల మేడ" అన్న శీర్షికతో 'ఏది నిజం'గా  'సాక్షి" విరుచుకుపడింది. ఎప్పటిలాగానే అందులో...'ఈనాడు'ను ఇరకాటంలో పెట్టే పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఇలా..పరస్పరం బురదచల్లుకోవడం ద్వారా...రెండు 'మీడియా హౌసులు' జర్నలిజాన్ని బజారుకు ఈడుస్తున్నాయి. 

సత్యం జనానికి తెలియడం మంచిదే కానీ...మరీ ఇలా ఒకళ్ళ బట్టలు మరొకరు ఊదదీసుకుంటే...మీడియా మీద ఉండాల్సిన విశ్వసనీయత గంగలో కలుస్తుంది. ఒక పక్క...నీతీ జాతీ లేని ఛానెల్స్...మరొక పక్క రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్న పత్రికలు...వెరసి...జర్నలిజం ఒక పచ్చి వ్యాపారం...వీటి రాతలు బోగస్..అని జనం అనుకునే పరిస్థితి. పాపం పొట్ట చేతపట్టుకుని సమాజ సేవ పరమార్ధంగా జర్నలిజంలోకి దూకిన  జర్నలిస్టులు ఈ ఎనుబోతుల కుమ్ములాటలో పావులై...ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. విలేఖరులను జనం రాజకీయ కళ్ళ అద్దాలతో చూస్తున్నారు. 

ఈ నేపథ్యంలో...హెచ్.ఎం. టీవీ లో రామచంద్ర మూర్తి గారు రెండు రోజుల కిందట ఒక మంచి కార్యక్రమం నిర్వహించారు. అ చర్చ నేటి మీడియా లో దౌర్భాల్యాలను, కర్తవ్యాన్ని విశదీకరించింది. పొత్తూరి గారు తన సీనియారిటీ తో మంచి విశ్లేషణ చేసారు.


అలాగీ 'గ్రేట్ డిబేట్" పేరిట 'ఏ.బీ.ఎన్.--ఆంధ్ర జ్యోతి" రాధాకృష్ణ గారు కూడా బుధవారం సాయంత్రం ఒక మంచి చర్చ పెట్టారు. కొందరు సో కాల్డ్ జర్నలిస్టు సంఘాల నేతలు ఎలా దారుణంగా తయారయ్యిందీ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ఆర్.కే. నిర్మొహమాటంగా వివరించారు. జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుని నేతలుగా ఎదిగి నీతీ గీతీ లేకుండా తెగ బలిసిన వారికి ఆ వ్యాఖ్యలు చెంప పెట్టులాంటివి. పదవిలోకి వచ్చిన పార్టీ వారిని కాకా పట్టి, సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ...ఆస్తులు, పదవులు సంపాదించుకుంటూ...పైరవీలు చేస్తూ.. అచ్చోసిన ఆంబోతుల మాదిరిగా నేతల ముసుగులో తిరుగుతున్నవారికి ఈ చర్చలు గుణపాఠం కావాలని ఆశిద్దాం. జర్నలిస్టుల సంక్షేమం ఏ మాత్రం పట్టని దగాకోరు నేతలను ఆర్.కే.మాటలు కదిలిస్తాయా అన్నది అనుమానమే.

ఈ చర్చలో సీనియర్ జర్నలిస్టులైన  శ్రీనివాస్ గారు, శ్రీనివాస రెడ్డి గారు, అమర్ గారు పాల్గొని తమ అభిప్రాయాలను అందించి చర్చకు సొగసు తెచ్చారు. నిజానికి ఇటీవలి కాలంలో మీడియా పై జరిగిన మంచి చర్చ ఇది. మరీ మసక బారిన  మీడియా ప్రతిష్టను పెంచాల్సిన బాధ్యత ఇలాంటి జర్నలిస్టుల భుజస్కందాలపైననే వున్నదన్నది అక్షర సత్యం. 
అయితే...ఇలాంటి చర్చలలో...ఆస్థాన విద్వాంసులైన వృద్ధ జర్నలిస్టులకు బాగా అవకాశం ఇస్తున్నారు. వారు చర్విత చర్వణంగా  చెప్పిందే చెబుతున్నారు...కానీ...కొత్త తరం జర్నలిస్టులు  ఏమనుకుంటున్నారో తెలుసుకొనే  ప్రయత్నమే చేయడం లేదు.

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి