Saturday, November 22, 2025

సోషల్ మీడియా జర్నలిస్టులు - రకాలు

సత్యనిష్ఠ, నిష్పాక్షికత, నిజాయితీ అనేవి జర్నలిస్టుకు ఉండాల్సిన మౌలిక లక్షణాలు.  వార్త లేదా వ్యాసం రాసినా, వ్యాఖ్య చేసినా  వీటిని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఇవి పాటించని వారు జర్నలిస్టులే కాదన్న రూల్ పెడితే దాదాపు అందరూ ఎగిరిపోతారు. మొబైల్ ఫోన్ లో నాలుగు ముక్కలు రాయడం, నాలుగు మాటలు చెప్పడం వచ్చిన ప్రతి మనిషీ జర్నలిస్ట్ గా చలామణీ అవుతున్న ఈ కాలంలో దీని మీద చర్చ అనవసరం. దానికి తోడు, అన్ని పొలిటికల్ పార్టీలూ బాగా ఖర్చు పెట్టి కొందరు జర్నలిస్టుల నాయకత్వంలో తమ డిజిటల్ సైన్యాన్ని పెరట్లో సిద్ధం చేసుకుని స్వైర విహారం చేస్తున్నాయ్.

ప్రతీ మీడియా హౌస్ ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం సహజమైన విషయం అయినందున మౌలిక సూత్రాలు గాల్లో కలిసి పోయాయి. సమాజ సేవ కోసం, విస్తృత జన ప్రయోజనం దృష్ట్యా... ఒక సైడ్ తీసుకోవడం తప్పుకాదని ఓనర్లు డిసైడ్ కావడంతో జర్నలిస్టిక్ ఎథిక్స్ అనేవి లేకుండా పోయాయి. దీనిమీద ఏడుపులు, పెడబొబ్బలు అరణ్యరోదనే. 

సోషల్ మీడియా వ్యాప్తి పెరిగాక ఈ స్పేస్ లోకి ప్రవేశించిన జర్నలిస్టులు దాదాపు అందరూ బద్నాం కావడానికి, వారికి శత్రువులు తయారుకావడానికి కారణం ఈ మూడు సూత్రాలకు కట్టుబడి ఉండకపోవడం. మంచీ చెడూ తెలియకుండా చటుక్కున ఒక అభిప్రాయానికి వచ్చి బూతులు దోకే రీడర్స్, వ్యువర్స్ తప్పు కూడా ఉంది. 

జర్నలిజం బేసిక్స్ కు కట్టుబడి మడికట్టుకుని కూర్చుంటే జనం ఆ కంటెంట్ చూడరు. యూ ట్యూబ్ డబ్బులు రావు. అందుకే, మొహమాటం లేకుండా ఒక సైడ్ తీసుకుని కంటెంట్ సృష్టిస్తున్నారు... మా వాళ్ళు. దరిమిలా అసభ్య కామెంట్స్, బెదిరింపులు, ట్రోలింగ్ కు గురవుతారు. ఇక్కడ గమ్మత్తైన పరిస్థితి. నికార్సైన జర్నలిజం చేస్తే మీరు చూడరు. కొమ్ముకాసే జర్నలిజం చేస్తే వైరి వర్గం విమర్శలు, ట్రోల్స్. ఇట్లా జర్నలిజం పలచనై, జర్నలిస్టు అంటే చులకనై పోయారు. 

ఇది ఎలా ఉన్నా, ఈ స్పేస్ లో  నాకు కనిపిస్తున్న జర్నలిస్టులు ఐదు రకాలుగా ఉన్నారు. 

1) నిష్పాక్షిక జర్నలిస్టులు: ఏదైనా అంశం మీద కంటెంట్ చేస్తున్నప్పుడు దానికున్న అన్ని కోణాలు చూపించి, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ జనాలకు ఇచ్చే సత్తెకాలపు టైపు. స్టోరీలో యాంగిల్స్ ప్రజెంట్ చేస్తూనే ఫలానా కారణాల వల్ల తాను ఇది అనుకుంటున్నానని చెప్పే రకం. ఇది అరుదైన, దాదాపు అంతరించిపోయిన జాతి. అంత నిబద్ధత, ఓపిక, తీరికా ఎవ్వరికీ లేవు. 

2) జాతీయవాద జర్నలిస్టులు: హిందూ మతం దాడికి గురవుతున్నదని గట్టిగా నమ్మే జర్నలిస్టులు. ఇస్లాం, క్రైస్తవ మతాల నుంచి భారత దేశానికి పొంచి ఉన్న ముప్పు గురించి విస్తృత చర్చ జరిపి, పరుషైన పదజాలంతో  వాదన చేసే రకం. వీరు ఆర్ ఎస్ ఎస్, బీజేపీ అనుకూలురుగా, మోదీ భక్తులుగా ఉంటారు చాలా వరకు. విద్యార్థి దశలో ఏ బీ వీ పీ లో పనిచేసిన లేదా ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ లుగా ఉన్న జర్నలిస్టులు  ఎక్కువగా ఉన్నారు ఇందులో. 

3) యాంటీ సంఘ్ జర్నలిస్టులు: హిందూ మతానికి ఏకైక ప్రతినిధిగా అయిపోయిన సంఘ్ పరివార్, దాని పొలిటికల్ వింగ్ బీజేపీ మీద అనుక్షణం విషం చిమ్మే జర్నలిస్టులు. మోదీ మీద కోపంతో ఒకోసారి భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి వీరు మొహమాటపడరు. బ్రాహ్మలనూ, వేదాలు, మనుస్మృతినీ, సనాతన ధర్మాన్ని కుమ్మేస్తారు. 

ఇస్లాం ఫండమెంటలిజాన్ని, క్రైస్తవ వ్యాప్తి టెక్నిక్స్ ను తప్పుపట్టకుండా, కొండకచో కొమ్ముకాస్తూ కాషాయ వ్యతిరేకతే లక్ష్యంగా ఉంటారు. చిన్నప్పుడు ఏ స్టూడెంట్ యూనియన్ లో లేకపోయినా కారణాంతరాల వల్ల కాషాయ వ్యతిరేకతతో ఉంటే వీరికి ఎక్కువ ప్రయోజనం. దళిత కార్డు, మహిళా కార్డు వాడుకుని జబర్దస్తీ చేసే వారు కూడా ఈ కేటగిరీ లో ఉన్నారు. 

4) ఎర్ర కామ్రేడ్ జర్నలిస్టులు: స్టూడెంట్ డేస్ లో ఎస్ ఎఫ్ ఐ, పీ డీ ఎస్ యూ, ఆర్ ఎస్ యూ లో సభ్యులుగా ఉండి, సర్వ సమస్యలకు ఏకైక పరిష్కారం కమ్యునిజం అని త్రికరణ శుద్ధిగా నమ్మే జర్నలిస్టులు. తమది లౌకిక వాయిస్ అని వారి నమ్ముతారు.  ఇందులో... మావోయిస్టుల యిస్టులు ఉన్నారు. పై కేటగిరీ (యాంటీ సంఘ్) కి, వీరికి పెద్దగా తేడా ఉండదు. 

5) పెయిడ్ జర్నలిస్టులు: ఎవరు డబ్బు ఇస్తే వారిని మోసే జర్నలిస్టులు వీరు. జర్నలిజం విలువలు అనేది వీరికి బూతు మాట. పొలిటికల్ పార్టీలు తయారుచేసుకున్న సైన్యం నడిపే సిద్ధహస్తులు.  సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఎవడు డబ్బు ఇస్తే వాడికి జై కొట్టే బ్యాచ్. ఇవ్వాళ బీ ఆర్ ఎస్, రేపు కాంగ్రెస్... అయినా అంతే డెడికేషన్ తో సేవలు అందించే రకం. 

పరిస్థితి ఈ రకంగా ఉంటే... ఇదేమి జర్నలిజం రా... నాయనా...అని ఏడ్వడం, మొత్తుకోవడం అనవసరం కాదా! జర్నలిస్టిక్ ఎథిక్స్ మీద ఏడేళ్ళు కష్టపడి పీ హెచ్ డీ చేసి, సమాజాన్ని అధ్యయనం చేసిన నేను ఫస్ట్ కాటగిరి (నిష్పాక్షిక) జర్నలిస్ట్ గా బతకాలని అనుకుంటాను. కానీ, ఎన్నికల్లో మోదీ వేవ్ ఉందని గ్రౌండ్ సర్వే ద్వారా చెబితే నన్ను రెండో కేటగిరీ (జాతీయ వాద) లోకి నెట్టారు. నా బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా, నా కులం ఆధారంగా నన్ను అదే బాపతుగా చూసి ఆనందించే లేదా ద్వేషించే వారు ఉంటారు. ఫలానా విషయంలో మోదీ మాటలు తప్పు...అనగానే మూడు లేదా నాలుగో కేటగిరీ లోకి నెడతారు. ఎవ్వడితో తిట్లు, శాపనార్థాలు పడకుండా జర్నలిజం చేయడం దాదాపు దుర్లభం. 

ఏదేమైనా, నిష్పాక్షికంగా ఉండడం చాలా కష్టమైన విషయం. దాదాపు అసాధ్యం. జనం ఆదరించని కార్యక్రమం. వృధా ప్రయాస అనిపించే పని. 

మనం చెప్పేదానికి, చూపే దానికి నాలుగు డబ్బులు ఎట్లా వస్తాయా? అని తపించే ఈ రోజుల్లో ఇది అసంభవమైన విషయం. జర్నలిస్టుల మీద పిచ్చి కామెంట్స్ చేసే జనాలు (రీడర్స్, వ్యువర్స్) నిష్పాక్షిక జర్నలిజాన్ని ఆదరించి అక్కున చేర్చుకునే పరిస్థితిలో లేరు కాబట్టి గొంగట్లో తింటూ బొచ్చు వస్తున్నదని తిట్టుకోవడం ఫూలిష్ నెస్.

Tuesday, November 18, 2025

భలే స్ఫూర్తి- బొల్లినేని వెంకట్


(జర్నలిస్టు మిత్రులతో లంచ్ -1)

చేరిన ఉద్యోగంలో బుద్ధిగా పనిచేసి అక్కడే రిటైర్ కావడం ఒక పద్ధతి. ఒకే ఉద్యోగంలో డక్కామొక్కీలు తిని ఎదగడం ఒక మంచి విషయం. అట్లా కాకుండా...

"వాట్ నెక్స్ట్"... అని తపించి కొత్త అవకాశం సృష్టించుకుని, అందిపుచ్చుకుని ముందుకు సాగిపోవడం ఇంకో పద్ధతి. కొత్త అవకాశం అంటే... కొత్త స్కిల్ సెట్, కొత్త అడుగు, కొత్త వాతావరణం, కొత్త మనుషులు. అందుకు ఎంతో శ్రమ, ధైర్యం, త్యాగం కావాలి. 

ఈ రెండో కేటగిరీకి చెందిన ప్రియ మిత్రుడు బొల్లినేని వెంకట్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. 1992 బ్యాచ్ మాదైతే, ఆ తర్వాత ఆరు నెలలకు మొదలైన బ్యాచ్ లో వెంకట్ ఉన్నాడు. మా రూమ్మేట్. తను సిటీ డెస్క్ లో చేసేవాడు. సివిల్స్ కు ప్రయత్నం చేసినట్లు గుర్తు. 

నిత్య సంచలన శీలి. తన ఆప్యాయత, ఓపిక, డ్రస్ సెన్స్, చెరగని చిరునవ్వు నాకు బాగా నచ్చేవి. 

తను రాసిన వ్యాసం లేదా వార్త, దానికి  చీఫ్ ఆఫ్ బ్యూరో స్పందన, డెస్క్ ఇంచార్జ్ ధోరణి... లాంటివి మేము మాట్లాడుకునేవారం. అప్పుడు మావి పసి హృదయాలు. బాగా కష్టపడి నాణ్యత పెంచుకుని, సామర్థ్యం నిరూపించుకోవాలని తపించే కాలం. ఆ ప్రయత్నంలో భుజం తట్టే వారికన్నా...మనసు గాయపరిచేవారు ఎక్కువగా ఉండేవారు. అలాంటి అనుభవాల వల్ల రూంకు వచ్చి ఏడవడం తప్ప మనము చేయగలిగింది ఏమీ లేదు. అట్లా మేము ఆ రోజు బాగా హర్ట్ అయితే...జరిగింది చెప్పుకుని... మనది తప్పా? ఆ వెధవలది తప్పా? అని తర్కించుకుని మనసు భారం తీర్చుకుని నిద్రపోయే వాళ్ళం. సీనియర్లు ఐడియాలను ప్రోత్సహించకుండా, మాటలతో కించపరిచిన సందర్భంలో ఒకరికొకరం ఓదార్చుకుని ఊరట పొందేవారం. 

వెంకట్, సత్య కుమార్, నేను కాస్త డబ్బు లోటు ఉన్నప్పుడు అన్నంలో గొడ్డుకారం, నిమ్మకాయనో, మజ్జిగ, పచ్చి మిరపకాయ, ఉల్లిగడ్డనో నంజుకునో తిన్న రోజులు బాగా గుర్తు. ఇంటి దగ్గరి నుంచి డబ్బు తెప్పించుకోకూడదని, ఎవ్వరినీ అప్పు అడగకూడదని మా  పట్టుదల. 

ఎప్పుడో తెల్లవారుఝామున వచ్చి...మా రివ్యూ సెషన్ అయ్యాక పడుకునే వెంకట్ ఉదయం 6 గంటలకల్లా మాయమయ్యేవాడు. ఎవరో ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి పోతున్నానని చెప్పే వాడు. తర్వాత తెలిసింది... తన సీక్రెట్ ఆపరేషన్. 

తన వివాహం అయ్యాక కూడా మేము నవీన్ నగర్ లో ఉండేవాళ్ళం. నాకూ అప్పటికే పెళ్ళి అయ్యింది. మేము కలుసుకునే వాళ్ళం. వెంకట్ శ్రీమతి గారు బాగా మాట్లాడేవారు. 

పెళ్లి అయ్యాక...నవీన్ నగర్ టెలిఫోన్ బూత్ లో ఒక నోట్ బుక్ పెట్టుకుని ఎక్కువ సేపు ఎవరితోనే వెంకట్ మాట్లాడడం నేను చాలా సార్లు చూసాను. నిజానికి నాకు అది వింతగా అనిపించేది. అంత సేపు ఫారిన్ కాల్స్ లో ఉంటే డబ్బు ఆవిరి అవుతుందని నా భయం. తను అబ్రాడ్ లో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడేవాడు.

 వెంకట్ ఒక ఫైన్ మార్నింగ్ ఈనాడు వదిలి బహ్రెయిన్ లోనో, దుబాయ్ లోనో తేలాడు. ఒక కామర్స్ స్టూడెంట్... కంప్యూటర్ కోర్సులు చేసి ఐ టీ లోకి వెళ్ళడం, పైగా ఫారిన్ జాబ్ కొట్టడం 

నాకైతే వావ్ అనిపించింది. ఒంగోలు లో సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వెంకట్ స్వయంకృషితో మంచి స్థాయికి చేరుకోవడం గర్వకారణం. 

ఇప్పుడు ఒక 22 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డాడు.  తను సింగపూర్ లో ఉండగా నా తమ్ముడు కూడా అక్కడ పనిచేసేవాడు. వాళ్ళు అక్కడ కలిశారు. నేనా సమయంలో చెన్నై లో ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో చదువుతున్నా. అప్పుడు టచ్ లోకి వచ్చిన గుర్తు. 

మధ్యలో రెండు, మూడు సార్లు ఫోన్ లో మాట్లాడుకున్నాం. వెంకట్ కు ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి ఇండియాలోనే మెడిసిన్ చేస్తోంది. రెండో అమ్మాయి... యూ ఎస్ లో కాలేజీ లో ఉంది. 

తను ఇండియా వచ్చిన సందర్భంగా ముందుగా ఫోన్ లో మాట్లాడుకుని  గత శుక్రవారం (నవంబర్ 14, 2025) లంచ్ కు కలవాలని గట్టిగా అనుకున్నాం. కలిశాం. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ కు పోయాం.. తను వెజ్ ప్రిఫర్ చేసాడు కాబట్టి. తింటూ, తిన్నాక... ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కొన్ని ఐడియాలు పంచుకున్నాం. కుళ్ళు, కుతంత్రాలు లేని వెంకట్ చిరునవ్వు అప్పటి లాగానే స్వచ్ఛంగా ఉంది. అది అట్లానే ఉండాలని, ఆయన, ఆయన కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. 

ఆత్మీయ జర్నలిస్ట్ మిత్రులతో లంచ్ కార్యక్రమం వెంకట్ తో మొదలయ్యింది. త్వరలో ఇంకో మిత్రుడిని కలిసి, తిని, ఆ అనుభవాలు పంచుకుంటా. అప్పటిదాకా సెలవ్. 

-S Ramu

Sunday, November 16, 2025

విద్యావంతులారా... చూశారా??? దేశం మట్టి కొట్టుకు పోతోంది!!!

మనకెందుకొచ్చిన గొడవని ముడుచుకుని కూర్చుంటున్నాం గానీ, దేశం పెద్ద ప్రమాదంలో ఉంది. సంక్షోభం, ప్రమాదం...అనే పదాల్లో రెండో దాని తీవ్రతే ఎక్కువని భావించి ఆ పదం వాడుతున్నా గానీ, ప్రమాదం, పెను ప్రమాదం, ఘోర ప్రమాదంలో దేశముంది ఇప్పుడు. ఏ పార్టీకీ, ఏ ఇజానికీ చెందని నిష్పాక్షిక, నైతిక జర్నలిస్టుగా...ఇది చెప్పాలని ఉంది. 

బీహార్లో ఎవరు గెలిచారు? ఎవరు గెలవాల్సింది? అన్నది ముఖ్యం కాదు. కానీ, ఎన్నికలకు వారం ముందు ప్రతి మహిళకు పదేసి వేల రూపాయలు ఇవ్వడమేమిటి? గెలిచాక, ఇంకో 1.9 లక్షలు (అంటే మహిళకు రూ 2 లక్షలు) ఇస్తామని వాగ్దానం చేయడం ఏమిటి? భీకరమైన సమస్యలతో నవిసి ఉన్న బీహార్ ఇంత పెద్ద భారాన్ని ఎట్లా మోస్తుంది? 

ఎన్నికల్లో గెలవాలంటే... ఉచితంగా ఏవేవో ఇచ్చి ఓటర్లను బుట్టలో వేసుకుంటున్నారు.   ఫ్యాన్లు, టీవీలు ఇవ్వడంతో మొదలై, వేలకు వేలు మనీ ట్రాన్స్ఫర్ దాకా వచ్చింది.  

రెండు రూపాయలకు కిలో బియ్యం ఒక రకంగా నయం. ఆ తర్వాత రకరకాల రూపాల్లో ఫ్రీ గా పంచడం మొదలయ్యింది. రైతు బంధు అని రైతులకు సాలుకు రెండు విడతల్లో ఎకరాకు ఐదేసి వేలు, దళిత బంధు అని ఒకొక్కరికి 10 లక్షలు ఒకరు, నవ రత్నాలని ఇంకొకరు కుమ్మేశారు. అంత బాగా చదువుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఉచిత రబ్డీ లతో ఓటర్లను ఆకట్టుకుంటే దాని మీద చర్చ జరగాలన్న వాళ్ళు... అంతకు మించి లడ్డూలు, మిఠాయిలు ఇచ్చి జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. 

మహిళలకు ఫ్రీ గా ఇస్తే ఫలితాలు బాగున్నాయని అర్ధమై వారికి ఉచిత బస్సు ద్వారా కాంగ్రెస్, ఫ్రీ గా డబ్బు ఇచ్చి బీజేపీ దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే వినూత్న రీతిలో ఫ్రీ గా ఏదో ఒకటి ఇవ్వాలి, తప్పదు.   

కష్టపడి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి సంపాదిస్తున్న వారి మీద పన్నులు వేసి, తాగుడు మీద సంపాదించి అనుచితంగా ఉచిత పధకాల మీద పోస్తున్నారు. ఒరేయ్ నాయనా, రైతుకు కావాల్సింది... కల్తీ లేని విత్తనాలు, ఎరువులు, స్టోరేజ్, మార్కెట్ వసతులు. జనాలకి కావలసింది... మంచి విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఇంటి వసతి, కల్తీలేని వస్తువులు, శాంతి భద్రతలు. కుక్క బిస్కెట్స్ వేసి బంగారు బిస్కెట్స్ కాజేస్తున్నారు గదా! 

ప్రజాస్వామ్యాన్ని బీరు, బిర్యానీ స్థాయికి దిగజార్చిన పొలిటీషియన్స్ పార్టీలు మారుతూ అధికారం లో కులుకుతుంటే... వివిధ సమస్యలతో జనాలు ఎవరి చావు వారు  ఛస్తున్నారు. తమకు కావలసింది ఏమిటో, భవిష్యత్ ఏమిటో తెలియని నిరక్షర కుక్షులు ఒక పక్కా...మతం, కులం బురదగుంటలో పొర్లుతున్న విద్యావంతులు మరో పక్కా! మేధావులు, కళాకారులు, కవులు, రచయితలు నిమ్మకు  నీరెత్తినట్లు ఉంటే, జన్ జీ పిల్లలు వర్చువల్ ప్రపంచంలో సుఖం ఆస్వాదిస్తూ నిమ్మళంగా ఉన్నారు. లేని ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం ఇంకో సెక్షన్ ఏక సూత్ర అజెండాతో నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తూ.. జనాల అసలు సమస్యల గురించి మాట్లాడడం లేదు. కుల హక్కులతో పాటు... ఈ సామాజిక ప్రమాదాల గురించి కూడా చెప్పి జనాలని చైతన్యపరచండి, మహరాజ్! 

ఈ ఫ్రీ బీ ల వల్ల విపరిణామాలు.అనేకం. ఆర్థిక సమస్య పెరుగుతుంది. అవినీతి విస్తరిస్తుంది. అది నేరాలకు దారితీస్తుంది.

ఇప్పటికే కొంప కొల్లేరు అయ్యింది. టాక్స్ పేయర్స్, విద్యావంతులు, మేధావులు మేల్కొనాలి. వీలున్న ప్రతి వేదిక మీదా... ఈ ఉచిత మాయాజాలం గురించి నిర్మొహమాటంగా మాట్లాడాలి. ఇదొక సామాజిక  ఉద్యమం కాకపోతే మనం,.మన బిడ్డలు సేఫ్ గా బతికే పరిస్థితి లేదు. ఆలోచించండి.