Saturday, December 25, 2021

బన్నీ యాచ్చన్ తప్ప 'పుష్ప'విలాపమే గదా సామీ!

 కుటుంబ సమేతంగా చూడాలని ఇన్ని రోజులు ఆగి నలుగురం కలిసి నిన్న రాత్రి ఏడు గంటల షో కు కూకట్ పల్లి లోని సుజనా మాల్ లో 'పుష్ప' కు వెళ్లాం. హౌస్ ఫుల్లయ్యింది. 'వూ అంటావా, వుఊ అంటావా.. ' అని పక్క సీట్లో యువకుడు హమ్ చేస్తూ కూర్చున్నాడు. సినిమా విడుదలకు ముందే మొత్తం పాట జనాల నోటికి వచ్చేట్టు మార్కెట్టింగ్ బాగా చేస్తున్నారీ మధ్య కాలంలో.   

సూపర్ గా ఉన్న అల్లు అర్జున్ (పుష్పరాజ్) యాక్షన్ కు ఫుల్లు మార్క్స్ ఇచ్చి తీరాల్సిందే. కొత్త గెటప్ లో చూట్టానికి బాగున్న బన్నీ చాలా బాగా నటించాడు. ప్రతి ఫ్రేమ్ లో అబ్బాయి కళ్ళు భలే షార్ప్ గా చూపించారు. మహేష్ బాబుకు ఇచ్చినా ఇంత పవర్ఫుల్ గా చేయగలిగే వారు కాదేమో! మాజీ లెక్కల సార్ సుకుమార్ మంచి దర్శకత్వం, కెమెరా వర్క్, కమెడియన్-కం-హీరో సునీల్ (మంగళం శీను) కొత్త గెటప్ మినహా మిగిలినదంతా పుష్పలో ఉత్తతీతే. సాగపీకాలన్న ఆలోచన ఆలస్యంగా వచ్చి ఆ గుండు ఐ పీ ఎస్ ఫహాద్ ఫాజిల్ (భన్వర్సింగ్ షెకావత్) తో రంగప్రవేశం చేయించి కామిడీ పండించాలని విఫల ప్రయత్నం చేసిన పార్ట్ -1 ను గబ్బుపట్టించారు. 

పుష్ప కు భీకరమైన హైప్ ఇచ్చింది.. బన్నీ-సుకుమార్ కాంబినేషన్ తోపాటు నిస్సందేహంగా అక్కినేని ఇంటివారి మాజీ కోడలు, తెలుగువారి 'నెక్స్ట్ డోర్ గాళ్' సమంత చేసిన ఐటం సాంగ్. తనను తొక్కిపెట్టిన వారి మీద కసితో ఆమె మగబుద్ధిని ఎత్తిపొడిచే ఈ సాంగ్ చేశారని జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఏది ఏమైనా, ఈ మధ్య వస్తున్న తెలుగు సినిమాల్లో వస్తున్న బూతుతో పోల్చుకుంటే ఇందులో బూతు తక్కువన్నట్టే. పాటలో పదాలు పవర్ఫుల్ గా ఉన్నాయ్. మంగ్లీ చెల్లి కి బ్రేక్ వచ్చింది. రష్మిక ఒంపు సొంపులను మాటిమాటికీ చూపించి విసిగించారు. మేక-పీక పాట తో పాటు ఇతర పాటలు ఓకే ఓకే. కథ కోసం 'పుష్ప- ది రైజ్' మీద వచ్చిన సమీక్ష చదవండి. 

నాకు ఈ సినిమాతో రెండు సమస్యలున్నాయి. 

ఒకటి, నేరమైన ఎర్ర చందనం స్మగ్లింగ్ ను బాగా గ్లామరైజ్ చేయడం. ముంబాయ్ డాన్ భాయ్ ల మీద కూడా సినిమాలు వచ్చాయి కానీ ఆ నేరాలను ఇంతగా గ్లామరైజ్ చేసి చూపలేదు. సమస్య కోణాలను చూపడం వేరు, సమస్య కారకులను ఘనంగా చూపడం వేరు. కేవలం స్మగ్లింగ్  గ్యాంగ్ లను, సిండికేట్ లను, అందులో ముదిరిపోయిన ఒకడ్ని కేంద్రంగా చేసుకుని పుష్ప ను మండించారు. ఈ సినిమా విడుదలకు మూడు రోజుల ముందు ఎర్ర చందనం నేర సామ్రాజ్యం మీద పరిశోధనాత్మక జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి (ఈనాడు, డెక్కన్ క్రానికల్ పత్రికల్లో మంచి పేరు సాధించిన అయన ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఎడిటర్- ఇన్వెస్టిగేషన్స్ గా ఉన్నారు) రాసిన పుస్తకాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్ వీ రమణ విడుదల చేశారు. ఎన్డీ టీవీ సీనియర్ మోస్ట్ రిపోర్టర్ ఉమా సుధీర్ ప్రయోక్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. ఎంతో అమూల్యమైన ఈ వృక్ష సంపదను కొల్ల గొడుతూ కోట్లు గడిస్తున్న జాతీయ, అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ ల గురించి ఉడుముల వివరిస్తే అవాక్కయ్యాను. శేషాచలం అడవుల నుంచి వేల కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనం ఎందరో చేతులు తడుపుతూ విదేశాలకు తరలిపోతున్నదని సాక్ష్యాలతో సహా ఈ పుస్తకంలో విశదీకరించారు. ఈ ఘోరమైన నేరం పట్ల చీఫ్ జస్టిస్ కూడా ఆందోళన వ్యక్తంచేస్తూ స్థానికుల భాగస్వామ్యంతో దీన్ని నివారించాలని కూడా సూచించారు. ఇలాంటి నేరానికి పాల్పడుతున్న పుష్ప లాంటి వాళ్ళ ఘోర కృత్యాలను అద్భుతమైన ఘన కార్యక్రమంగా చూపడం బాధ్యతాయుతమైన పనిగా అనిపించుకోదని నా అభిప్రాయం. పార్ట్-2 లో పుష్ప ను మారిన జనం నేతగానో గానో, ఎర్రచందనం చెట్లను కాపాడే వాడిగానో చూపవచ్చు గానీ ప్రస్తుతానికి మాత్రం క్రిమినల్ గ్లామరైజేషన్ అస్సలు బాగోలేదు. 

రెండు, పోలీసులను మరీ లంచగొండ్లుగా చిత్రీకరించడం. సినిమా స్టార్టింగ్ లోనే పుష్ప తనను పట్టుకున్న పోలీసులకు బేరం పెడుతూనే  చావచితక కొడతాడు. మనిషికో లక్ష ఇచ్చేసరికి ఖాకీలు ఖుషీ అయి వదిలేస్తారు. డీఎస్పీ గోవిందప్ప (హరీష్ ఉత్తమన్) బృందాన్ని ఎర్రిపప్పలుగా చూపించారు. చివర్లో వచ్చిన ఐ పీ ఎస్ షేఖావట్ ను పచ్చి లంచగొండిగా చూపించారు. పుష్ప లాంటి కరుడుకట్టిన క్రిమినల్ తో మిలాఖత్ కావడం, తనతో ఒంటరిగా కూర్చుని అయన మందుకొట్టడం, వాడు ఇప్పమంటే చొక్కా-ప్యాంట్ ఇప్పి వెళ్లిపోవడం చాలా కృతకంగా బోరింగ్ గా అనిపించాయి. పాఠాలు చెప్పే టీచర్లను, శాంతి భద్రతలను కాపాడే పోలీసులను మరీ చులకన చేయడం అత్యంత ప్రభావశీలమైన సినిమా మాధ్యమాన్ని డీల్ చేస్తున్నవారికి తగని పని. 

చివరగా, రెండు చిన్న పరిశీలనలు. సుక్కు గారూ... అప్పుడే నీళ్ల నుంచి బైటికి తీసిన డబ్బు బ్యాగ్ నుంచి కొన్నైనా నీటి బొట్లు రాలతాయి గదా సార్! అట్లానే, బుల్లెట్ దిగిన అరచేయి నుంచి రక్తం ఒక్క క్షణం మాత్రమే కారి ఆరిపోతుందా? 

ఎందుకు సామీ... జనాల చెవిలో ఇట్లా పుస్పాలు పెట్టేసినారు? 

Tuesday, December 21, 2021

36 ఏళ్ళ తర్వాత ఒక సుమధుర ఆత్మీయ సమ్మేళనం!

 కనుచూపుమేర విస్తరించి కనువిందు కలిగించే పెద్ద చెరువు. 

దాన్ని ఆనుకుని విశాలమైన క్రీడా మైదానం.  

ఆ మైదానానికి ఇటువైపు పచ్చని చెట్ల మధ్యన తాటాకు పాకలతో పాఠశాల. 

ప్రజ్ఞావంతులైన టీచర్లు.. హుషారైన మిత్రులు.

ఆటలు...పాటలు... ఎస్ ఎఫ్ ఐ - పీ డీ ఎస్ యు రాజకీయాలు.

ఏడాదిలో రెండు సార్లు కాలేజ్ ఫంక్షన్లు, అందుకోసం పోటీలు, బహుమతులు, నాటికలు.  

 'జీజేసీ వైరా' అనగానే మది పొరల్లో పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తూ చిన్ననాటి మధురానుభూతులకు తెరతీసే తీపి జ్ఞాపకాలివీ.

1984-85 విద్యా సంవత్సరంలో ఈ స్కూల్ పదో తరగతి చదివిన విద్యార్థులం డిసెంబర్ 19, 2021 నాడు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కలుసుకున్నాం. 36 ఏళ్ల తర్వాత నిక్కర్ బ్యాచ్ బాల్యమిత్రులను చూడడం, మాట్లాడడం, చిన్నప్పటి విషయాలు గుర్తుకుతెచ్చుకోవడం, ఇక కాంటాక్ట్ లో ఉండి తీరాలని అనుకోవడం, కలిసి అక్కడే తిని వచ్చేయడం మంచి అనుభూతి మిగిల్చాయి. 

Group photo of 1984-85 tenth class students of GJC Wyra

నాకు చిన్నప్పుడు ఈ విశాలమైన క్రీడా మైదానమే ఒక సువిశాల విశ్వం. అక్కడ చదివిన నాలుగేళ్లు అదే నా వేదిక. అక్కడి బాడ్మింటన్ కోర్టు, నాటికలు వేయడానికి ఉన్న వేదిక నా ప్రపంచం. ప్రతి సంవత్సరం జరిగే బాడ్మింటన్, వ్యాస రచన, వక్తృత్వం, నాటికల పోటీల్లో కచ్చితంగా ఏదో ఒక బహుమతి వచ్చేది. వైరాలో స్కూల్ లో బాల్ బాడ్మింటన్ తో పాటు ఇంటి దగ్గర ఒక బాల్ బాడ్మింటన్, ఇంకో షటిల్ బాడ్మింటన్ కోర్టు వేసి ఆడేవాళ్ళం. మా నాన్నగారు, అన్నయ్య, తమ్ముడు కూడా ఆడేవారు. అదొక అద్భుతమైన మజా. కొత్తగూడెం రామచంద్ర కాలేజీలో చదివేటప్పుడు ఇండోర్ షటిల్ బాడ్మింటన్ ఆడి ఇంటర్ కాలేజియేట్ ఛాంపియన్స్ అయ్యామంటే, యూనివర్సిటీ జట్టుకు ఎంపిక అయ్యామంటే దానికి పునాది పడింది వైరా మైదానంలో. అందుకే వైరా గ్రౌండ్ కు గుండె లోతుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం. 'ఆటలను నమ్ముకుంటే జీవితం కష్టం. మంచి ఉద్యోగం రావాలంటే చదవాలి....' అని వైరా పీ ఈ టీ మల్లయ్య గారు దివ్యోపదేశం చేయడం బాగానే ఉపకరించింది. జీవితంలో జర్నలిస్టుగా ఈనాడు, ది హిందూ పత్రికల్లో రాటుదేలి, జర్నలిజంలో డాక్టోరల్ డిగ్రీ తో టీచింగ్ లో ఉన్న నాకు అయన మాటలు ఎప్పుడూ గుర్తు ఉంటాయి. ఇప్పటికే టేబుల్ టెన్నిస్ లో అంతర్జాతీయ స్థాయికి చేరుకొని ఒలింపిక్స్ ధ్యేయంగా కృషి చేస్తున్న నా పుత్రరత్నం స్నేహిత్ తో చేస్తున్న ప్రయోగం మల్లయ్య సార్ కు చెప్పాలని ఉండేది. వారి గురించి తెలియదు. స్కూల్ లో రామస్వామి గారనే ఫిజికల్ డైరెక్టర్ బాల్ బాడ్మింటన్ లో స్పిన్ షాట్ కొడితే బంతి కోర్టు బైటి నుంచి కోర్టులోకి షేన్ వార్న్ స్పిన్ మాయాజాలాన్ని తలపించేలా సుడులు తిరుగుతూ వెళ్ళేది. 

తెలుగు సార్ కొంపెల్ల కృష్ణమూర్తి గారు, ఇంగ్లిష్ సార్ డీ పీ రంగారావు గారు, సోషల్ స్టడీస్ సార్ హరినాథ్ గారు నాకు గుర్తు. బాగా సనాతన సంప్రదాయవాది అయిన కృష్ణమూర్తి గారు తనను తాకనిచ్చేవారు కాదు. పొరపాటున ఆయన్ను ఎవరైనా తగిలితే బాగా కోప్పడేవారు. అయితే అయన బోధనా సామర్ధ్యం అద్భుతమైనది. ఇక డీపీ రంగారావు గారు మా సొంత ఊరు గొల్లపూడి వాస్తవ్యులు. అయన ఎందుకో క్లాసులో మా తాత ప్రస్తావన తెచ్చి ఈపును గుభికీ గుభికీ మనిపించేవారు. ఈయన పీడ విరగడ కావాలని నేను బాగా కోరుకునేవాడిని. నేను నయం, అయన ఆగ్రహానికి, పిడిగుద్దులకు బలైనప్పటికీ అనేక మంది ఆయన్ను ప్రేమగానే గుర్తుకుతెచ్చుకున్నారు మొన్న కలిసినప్పుడు. హరినాథ్ గారు నన్ను 'చదువరి' అని పిలిచే వారు. సెక్షన్-ఏ లో చెప్పిన సోషల్ నోట్స్ ను సెక్షన్-బీ లో నాచేత చదివించేవారు. కానీ ముగ్గురూ కాలం చేసారు. మా ఇంట్లో ఉండి నాతో పాటు వైరాలో టెన్త్ చదివిన ఇంగువ మురళి ఒక పదేళ్ల కిందట కన్నుమూశాడు. మా బ్యాచ్ మిత్రుడు ఎస్ శ్రీను కూడా చనిపోయాడని తెలిసి బాధేసింది. వారి ఆత్మకు శాంతి కలుగుగాక! రాధాకృష్ణ మూర్తిగారు అనే సార్ కూడా ఉండేవారు.  

I have taken a selfie with Ramesh, Govardhan and Jani Basha in front of the then school

ముగ్గురు సార్లకు (Suri garu, Pulla Rao garu, Satyanarayana garu)ఈ సందర్భంగా సన్మానం చేశారు. నేను పేర్కొన్న ముగ్గురు తప్ప మిగిలిన టీచర్స్ నాకు పెద్దగా గుర్తులేరు. కానీ అప్పటి మిత్రులు మాత్రం బాగా గుర్తు. బాగా సౌమ్యుడైన జానీ బాషా, ఆల్ రౌండర్ అయిన డీ రమేష్, మంచి మిత్రుడు రాజశేఖర్, సమాజం పట్ల అవగాహన-బాధ్యతతో ఉన్న సంగమేశ్వర్ రావు, నా బాడ్మింటన్ దోస్తు గోవర్ధన్, నాతో నాటికలు వేసిన ఎస్ శ్రీను, ప్రత్యేకించి తీసుకున్న రూమ్ లో వయసుకు మించిన విషయాలు బోధించిన బాలస్వామి, చలాకీగా ఉండిన రాం మోహన్, నర్సింహారావు, బీ వీ నాకు గుర్తు. మేము కొందరం పీ డీ ఎస్ యూ లో పనిచేసేవారం. మా నాయకుడు ఆనందరావు అనే మంచి యువకుడు. మాకు సమ సమాజ స్థాపన కోసం ఎన్నో మాటలు చెప్పిన ఆయన పిరికివాడిలాగా తాను ఆత్మహత్య చేసుకోవడంతో నాకు ఈ ఉద్యమం మీదనే విరక్తి వచ్చి వదిలేశాను. 

Rajasekhar with Sangameswar and Malla Reddy

మా ఊరు అబ్బాయి, మొదటినుంచీ కష్ట జీవి అయిన నూకల వాసు నాకు రెబ్బవరం స్కూల్ లోనే తెలుసు. మొన్నటి రీ యూనియన్ సందర్భంగా తన ఇంటికి ఆహ్వానించి పెసరట్టు, ఉప్మా పెట్టాడు. ఇప్పుడు టీచింగ్ వృత్తిలో ఉన్న రాం మోహన్, శ్రీధర్ సూర్యదేవర తదితర మిత్రుల మూలంగా ఈ పూర్వ విద్యార్థుల కలయిక  సాధ్యమయ్యింది. స్థానికంగా ఉన్న వారంతా చాలా కష్టపడ్డారు. మాతో కలిసి చదివిన స్థానికుల్లో ఒకరైన బొర్రా రాజశేఖర్ రాజకీయాల్లో ఉండడం విశేషం. అయన ఇప్పుడు మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. మంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన రాజాకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని అనిపించింది.  

Rammohan with our batchmates

నేను ఎలాగైనా కలవాలని కష్టపడి కాంటాక్ట్ చేసిన వారిలో ముఖ్యులు జానీబాషా, రాజశేఖర్, సంగమేశ్వర్, రమేష్. దాదాపు 13 ఏళ్లపాటు ప్రజల చైతన్యం కోసం పూర్తి స్థాయిలో పనిచేసి, ప్రస్తుతం గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్న జానీబాషాను నేను ఒక నాలుగేళ్ల కిందటనే కలిసాను హైదరాబాద్ లో. జీవితాతం కలిసి నడవాల్సిన మంచి సన్మిత్రుడు జానీ. మేకప్ పాండు గారి కుమారుడు రాజశేఖర్, నేను కలిసి స్కూల్ కు వెళ్లే వాళ్ళం. సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న ఆయన రోజుకొక మొక్క నాటుతూ 'ప్రకృతి ప్రేమికుడు' అన్న మాటను నిజం చేసుకుంటున్నాడు. రెండేళ్ల కిందట టచ్ లోకి వచ్చాం. స్థానికంగా జర్నలిజంలో చేరిన సంగమేశ్వర్ ను కూడా మూడేళ్ళ కిందట కలిసాను మధిరలో. అద్భుతమైన ప్రతిభాపాటవాలు ఉన్న తను కొన్ని కారణాల రీత్యా అక్కడే ఉండిపోవడ, నాకు బాధ కలిగించింది. క్రమశిక్షణ కు మారు పేరైన రమేష్ ఇప్పుడు కాప్ జెమిని లో డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు. ఈ రీ యూనియన్ సందర్భంగా రాజశేఖర్ తన నంబర్ ఇస్తే... నేను చాలా సేపు మాట్లాడాను. రమేష్, జానీ, నేను హైదరాబాద్ నుంచి వైరా పోతూ, మళ్ళీ వస్తూ కారులో చేసిన ప్రయాణం, మాట్లాడుకున్న మాటలు మమ్మల్ను టెన్త్ రోజులకు తీసుకుపోయాయి.      

కరోనా వల్ల ఎందరో మంచి మిత్రులను, సన్నిహితులను కోల్పోయిన మాకు ఏడాది చివరిలో జరిగిన ఈ 'ఆత్మీయ సమ్మేళనం' నూతనోత్తేజాన్ని ఇచ్చిందనడంలో సందేహం లేదు. అప్పట్లో కలిసి ఉన్న కాలేజ్, స్కూల్ ఇప్పుడు అదే కాంపస్ లో రెండుగా అయ్యాయి. దాంతో, విశాల ప్రాంగణం అనిపించకుండా పోయింది. దీన్ని సుందరీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెలలో ఒకసారైనా అక్కడకు వెళ్లి పిల్లలకు ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంశాల్లో పాఠాలు చెప్పాలని ఉంది. 

Monday, October 25, 2021

మావోయిస్టు ఆర్కే హీరోనా? విలనా?

తమ్ముడు ముని సురేష్ పిళ్లే సంపాదకత్వంలో చక్కగా రూపుదిద్దుకుంటున్న 'ఆదర్శిని' వెబ్సైట్ కోసం నేను రాసిన వ్యాసమిది. 

'విప్లవం' స్వరూపస్వభావాలు, సాధకబాధకాలు, అర్థపరమార్థాలు అవగాహన చేసుకోవాలంటే 'క్యూబన్ విప్లవం' సరిగ్గా సరిపోతుంది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాకనే, 1953-59 మధ్య కాలంలో యువ న్యాయవాది ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలో రెండు విడతలుగా జరిగిన సాయుధ గెరిల్లా పోరాటం సామ్రాజ్యవాదుల తొత్తు, సైనిక నియంత బటిస్టాను గద్దె దింపింది. కమ్యూనిస్టులు అధికారం  చేజిక్కించుకున్నారు. అమెరికా దాష్టీకాలను, ఆర్ధిక ఆంక్షలను, హత్యా ప్రయత్నాలను, కుట్రలను తట్టుకుని చాలా దేశాల కన్నా మెరుగైన పాలనను కాస్ట్రో అందించారు. అదొక ఉక్కుపాదపు ప్రభుత్వమన్న విమర్శలు, కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వంటి ప్రతికూలాంశాలు కూడా ఈ క్రమంలో కనిపిస్తాయి. కాస్ట్రో సోదరుల శకం ఈ మధ్యనే ముగిసినా ఈ విప్లవం ఆరంభం నుంచి ఇప్పటివరకూ జరిగిన పరిణామాలు ఆసక్తి కలిగిస్తూ అబ్బురపరుస్తాయి.

రక్తపాతం నడుమ మొదటి సారి సాయుధ పోరాటం విఫలమైనప్పుడు  కాస్ట్రో బందీ అయ్యాడు. దేశం కోసం, ప్రజల కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం న్యాయస్థానంలో కాస్ట్రో చేసిన నాలుగు గంటల వాదన ('హిస్టరీ విల్ అబ్సాల్వ్ మీ') చరిత్రలో నిలిచిపోతుంది. 'మీరు నా గొంతు నొక్కలేరు. క్యూబన్ గా బతకడం అంటే అది ఒక విద్యుక్త ధర్మం. ఆ ధర్మాన్ని నెరవేర్చకపోవడం ఒక నేరం, దేశ ద్రోహం... పాలకుడు ఒక నేరగాడో, ఒక దొంగో అయిన దేశంలో నిజాయితీపరులు చావనైనా చావాలి లేదా జైళ్లలో నైనా మగ్గాలి. అది అర్థంచేసుకోదగ్గదే... నన్ను శిక్షించండి, పర్వాలేదు. చరిత్ర మాత్రం నన్ను దోష విముక్తుడినని నిరూపిస్తుంది," అని అయన చేసిన ప్రసంగం ఉత్తేజపూరితంగా సాగి పౌరులలో కదనోత్సాహాన్ని నింపుతుంది. విప్లవ మహా యోధుడు కాస్ట్రో ఆ ప్రసంగం చేసింది అక్టోబర్ 16, 1953న. ఒకటి రెండు రోజుల తేడాతో సరిగ్గా 68 సంవత్సరాల తర్వాత మనందరం దసరా సంబరాల్లో ఉండగా, భారత దేశంలో సాయుధ పోరాటానికి పెద్ద సంఖ్యలో యువతను సన్నద్ధం చేసేలా కదనోత్సాహం నింపిన మావోయిస్టు అగ్రనేత  అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) అడవితల్లి ఒడిలో 63 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి- హోం మంత్రి జానారెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వచ్చి మొదటిసారి బహిరంగంగా ప్రజలకు కనిపించిన సరిగ్గా 17 ఏళ్లకు ఈ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కన్నుమూశారు. ఇంతకూ ఆర్కే హీరోనా? విలనా?

పీడిత తాడితుల పక్షాన తాను ప్రగాఢంగా నమ్మిన సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడి, నాలుగు దశాబ్దాల పాటు భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం నిర్బంధాల నడుమ నానా కష్టనష్టాలు చవిచూసి, తన దారినే ఎంచుకున్న కొడుకు కళ్ల ముందు బుల్లెట్టు దెబ్బకు నేలకొరిగినా చలించకుండా, నిత్యం నిఘా నేత్రాల మధ్యన దినమొక గండంగా అలుపెరగని పోరాటం చేసి, వైద్యం అందక అనారోగ్యంతో కన్నుమూసిన ఆయన్ను హీరో అందామా?

అగమ్యగోచరమైన విప్లవ పంథాను ఎంచుకుని, సమాంతర సాయుధ వ్యవస్థతో, హింస-రక్తపాతంతో బీభత్సం సృష్టించి... రాజ్య ప్రతినిధుల పేరిట, ఇన్ఫార్మర్ల  నెపంతో ప్రాణాలు హరించి... ఆదివాసులను, గిరిజనులను, అణగారిన వర్గాల పిల్లలను ఆకర్షించి సాయుధ ఉద్యమంలో సమిధలను చేసినందుకు విలన్ అందమా?


ఈ సంగతి ఇలా ఉంచితే.... ఇంతకూ-

జనాల్లో వస్తు వినియోగ సంస్కృతి విచ్చలవిడిగా పెచ్చరిల్లిన ఈ కాలంలో...

స్వలాభం, స్వకుటుంబ సంక్షేమం, స్వార్థం జడలు విప్పిన ఈ  రోజుల్లో...

సాంకేతిక పరిజ్ఞాన ప్రేరక సమాచార సాధనాలు పంచుతున్న పిచ్చి వినోదానికి జనాలు బానిసలుగా మారిన ఈ పరిస్థితుల్లో...

ప్రలోభాల ప్రభావంతో అధికారంలోకి వచ్చి ఆనక పదింతలు దండుకోవచ్చన్న నవీన ప్రజాస్వామిక సూత్రానికి ఓటర్లు ఆమోదముద్ర వేస్తున్న ఈ తరుణంలో...

నిలకడైన అభివృద్ధికి ఉపకరించని జోకొట్టే పథకాల వలలో, తాయిలాల లంపటంలో కుడుమిస్తే పండగనుకునే జనాలు సుఖప్రస్థానం చేస్తున్న ఈ వాతావరణంలో...

నిర్బంధకాండతో నోళ్లు మూయించవచ్చని పాలకులు దిగ్విజయంగా నిరూపిస్తున్న సమయంలో...

మనకెందుకొచ్చిన గొడవని టీచర్లు, మేధావులు, బుద్ధి జీవులు; రాజీపడితే పోలా! అని విద్యార్థులు స్థిరపడిన ఈ ఘడియల్లో...

'విప్లవం' అన్నది ఒక కాలం చెల్లిన సిద్ధాంతం కాదా?

ఆర్కే మరణం నేపథ్యంలో చర్చకు వచ్చిన అంశాలివి.

సిద్ధాంత రాద్ధాంతాలను పక్కనపెట్టి చూస్తే- 'శాంతి'లో ఒక ప్రశాంతత, నిదానం, గంభీరత  ఉన్నట్లే... 'విప్లవం' లో ఒక పోరాటం, ఆరాటం, త్యాగ నిరతి ఇమిడి ఉంటాయి. ప్రతి మనిషి లో ఒక శాంతి కాముకుడు, ఒక విప్లవ యోధుడు ఉంటాడు.

అన్నీ అమరుతూ కడుపులో చల్ల కదలకుండా సాగిపోతున్నపుడు ఎవడెటుపోయినా మనసు 'శాంతి' వైపే నిలకడగా ఉంటుంది. కడుపుకాలే వాడు, పీడనకు-దోపిడీకి నిరంతరం గురయ్యేవాడు రెండో వైపు చూస్తాడు. భారత స్వాతంత్య్ర పోరాటం గానీ, క్యూబన్ విప్లవం కానీ, ఆ మాటకొస్తే చరిత్రలో అన్ని ప్రజా ఉద్యమాలు సూచించేది- శాంతి కావాలంటే విప్లవం (లేదా, దాని లైటర్ వెర్షన్ 'పోరాటం') ఉండాల్సిందేనని. ఇది చారిత్రక సత్యం. మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది అట్లనే కదా! అత్యద్భుతమని మనం గట్టిగా భావించే ప్రజాస్వామ్య వ్యవస్థలు ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపెడితే రాలేదు. ప్రజాకంటకుల చెంపలు పగలగొడితే గానీ అవి ఏర్పడలేదు. అందరి కోసం ఏ కొందరో రక్తతర్పణం చేస్తేగానీ మనం ఈ స్థితికి చేరుకోలేదు.

అట్లాగని హింసే పరమ ఔషధం అని కూడా వాదించలేం.

 'ది హిందూ' ఆంగ్ల పత్రిక నల్గొండ ప్రతినిధిగా నేను ఎదుర్కున్న ఒక సంఘటన ఇది. అప్పట్లో ఒక అధికార పార్టీ ప్రతినిధి (తెలుగు దేశం మనిషి)ని- పది మంది సాయుధ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా- కృష్ణపట్టి దళం దారుణంగా కాల్చిచంపింది. ఆ ప్రతినిధి ఒక  పలుకుబడిగల మనిషని తెలుసు గానీ, ఈ హత్యకు అసలు కారణాలు ఎవ్వరూ చెప్పలేదు. లొంగిపోయిన తర్వాత మాజీ నక్సలైట్ కోనపురి రాములును నేను ఈ హత్య గురించి లోతుగా కొన్ని ప్రశ్నలు అడిగాను. తమపై ఆ ప్రజా ప్రతినిధి చేస్తున్న అఘాయిత్యాలపై, లైంగిక అకృత్యాలపై ఆ ఊరి మహిళలు చేసిన ఫిర్యాదు మేరకు, ఒకటి రెండు సార్లు హెచ్చరిక జారీ చేశాకనే తానే ఈ మర్డర్ చేశానని చెప్పాడు. 'పోలీసులతో కుమ్మక్కై ఆ నాయకుడు చేసిన ఘోరాలు అన్నీ అన్నీ కావు. అందుకే పై స్థాయిలో చర్చించే ఆ చర్య తీసుకున్నాం. ఆ ప్రజాకంటకుణ్ణి హత్య చేసిన తర్వాత మహిళలు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. వారి జీవన్మరణ సమస్యను తీర్చినందుకు అంత కూంబింగ్ మధ్యన ఆ ఊర్లోనే మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు,' అని రాములు చెప్పాడు. అధికారం చేతిలో ఉన్నవారి అడుగులకు ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ మడుగులొత్తుతుంటే  నిస్సహాయులైన అదే ప్రజలు సాయం కోసం మీ దగ్గరకు వస్తే ఏమి చేస్తారన్నా? అని రాములు అడిగితే నా దగ్గర ఠక్కున చెప్పే సమాధానం లేదు. మనింటి మహిళను అదే ప్రజాప్రతినిధి చెరిస్తే కర్మ ప్రారబ్దమని వదిలేస్తామా?

అట్లాగని మావోయిస్టులు చేసిన హత్యలన్నీ ఇంతలా సమర్ధనీయం కాదు. అందులో కొన్ని మతిమాలినవి కూడా లేకపోలేదు. కాకతీయ ఫాస్ట్ పాసింజర్ కు మంటలు పెట్టినట్లు వచ్చిన ఆరోపణ చిన్నదేమీ కాదు. ఎదుగుతున్న గిరిజన నాయకుడు రాగ్యానాయక్ ను చంపి సారీ చెప్పారు. ఖాకీ డ్రస్సులో ఉన్న పాపానికి పోలీసులను కేవలం భయోత్పాతం సృష్టించడానికో, ఉనికి చాటుకోవడానికో కాల్చిపారేయడం ఏమి న్యాయం? ఇట్లాటివన్నీ పోలీసులు జరిపే బూటకపు ఎన్ కౌంటర్ల అంతటి తప్పుడు పనులే. ఆ తరవాతి కాలంలో నయీమ్ అనే భూ భోక్త, హంతకుడిని పోలీసు వ్యవస్థ ఎలా వాడుకున్నదీ, మేధావులైన పౌర హక్కుల నేతలను ఎంత దారుణంగా హత్య చేసిందీ చూస్తే గుండె తరుక్కుపోయేది. వ్యూహ ప్రతివ్యూహాల్లో చట్టం, న్యాయం నవ్వుల పాలయ్యాయి. మానవత్వం మంట కలిసింది. అదే సమయంలో, కొందరు పోలీసు బాసులు లొంగుబాట్లకు, లొంగిన వారి ప్రశాంత జీవనానికి సహకరించిన తీరు కూడా ప్రశంసనీయం. అందుకే- నక్సల్స్, సర్కార్ లలో ఎవరు రైట్, ఎవరు రాంగ్ ? అనే దానికి సమాధానం దొరకడం అంత తేలిక కాదు.

 ఒకరి దృష్టిలో 'టెర్రరిస్టు' మరొక దృష్టిలో 'స్వాతంత్య్ర పోరాట యోధుడు' అన్నది ఎంత నిజం! నక్సల్స్ ఉద్యమం ఊపులో ఉన్నప్పుడు గ్రామాల్లో విచ్చలవిడితనం, అఘాయిత్యాలు, అక్రమాలు, అవినీతి, మతోన్మాదం అంతగా ఉండేవి కావు. ఈ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండను చూస్తే... నక్సలైట్లు ఉంటే ఎంతబాగుందని అనిపిస్తున్నది ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. మావోయిజాన్ని భూతంగా, రాక్షస కృత్యంగా చూడనక్కరలేదని 2004 లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం చర్చలకు పిలిచి నిరూపించింది. చర్చలు విఫలమైనా... పీడితులు బాధితులు బారులుతీరి మరీ నక్సల్ నాయకులకు వినతి పత్రాలు సమర్పించిన తీరు చూస్తే ఆ వ్యవస్థ పట్ల వారికున్న నమ్మకం, భరోసా కనిపించాయి. నిజానికి, విప్లవ పార్టీల ప్రధాన డిమాండ్... భూ సంస్కరణలు. 1967 లో బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం పుట్టుకొచ్చింది కూడా భూమి గురించే. చారు మజుందార్ లిఖిత 'చారిత్రక ఎనిమిది ప్రతుల్లో' దిశానిర్దేశం ఉన్నప్పటికీ వాటికి ప్రాతిపదిక భూమి, రైతాంగం.  

దున్నేవాడికి భూమి, పేదలకు భూమి నినాదాలతోనే అనేకమంది అడవిబాట పట్టారు. 2004 శాంతి చర్చల సమయంలో ఆర్కే బృందం ఈ సమస్యను ప్రధానంగా ప్రస్తావిస్తే సరైన రికార్డులు లేవంటూ  మళ్ళీ మాట్లాడుకుందామని ప్రభుత్వం చెప్పి పంపింది. దళితులకు మూడేసి ఎకరాలు అన్న మాట (అది మాటగా ఇచ్చినా, ఇచ్చి తప్పుకున్నా) కచ్చితంగా మావోయిస్టుల డిమాండ్ నుంచి పుట్టుకొచ్చిందే. స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్ళు దాటుతున్నా దారిద్య్రంతో కునారిల్లుతున్న వారు అట్టడుగున అట్లనే పడి కొట్టుకుంటున్నారు. పేదలు దరిద్రులుగా, ధనికులు కుబేరులుగా తయారయ్యే అసమతుల్య వ్యవస్థ వేళ్లూనుకుంది. భూమితో పాటు, విద్య, వైద్యం, ఉపాధి లాంటి మౌలిక సమస్యలు ఇంకా అపరిష్కృతం గానే ఉన్నాయి.  

ప్రజల్లో నిస్సహాయత పెచ్చరిల్లితేనే సమస్య. మహమ్మారి కరోనా సృష్టించిన బీభత్సం ఇప్పట్లో మరవగలమా? కొత్త వైరస్ విజృభించిన క్లిష్ట సమయంలో వ్యవస్థపై పట్టులేక ప్రభుత్వాలు ప్రజలను గాలికి వదిలేశాయి. మందులేని రోగానికి కార్పొరేట్ వైద్యరంగం లక్షలకు లక్షల బిల్లులు వేస్తే జనాలు దాచుకున్న సొమ్ము ఏ మాత్రం సరిపోకపోగా అసహాయంగా ఆస్తులు అమ్ముకున్నారు. ఇలాంటి దయనీయ స్థితులే జనాలను గళమెత్తేలా, వేరే దారిపట్టేలా చేస్తాయి.

ఆర్కే మరణంతో రాజ్యంపై సాయుధ పోరాటం లేదా ప్రజా యుద్ధం అనే పద్ధతి అంతం అయినట్లేనా? ఇక ఈ మావోయిస్టుల పంచాయితీ, రక్తపాతం ఉండవా? అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. అసలెలాంటి హింసకు తావులేని సుఖప్రదమైన జీవితాలు ఉండాలని సమాజ హితైషులమైన మనం కోరుకుంటాం. అట్లాగని రాజ్య హింస లేకుండా పోవాల్సిందిపోయి.... అది మన నాగరికతలో పాటు వివిధ రూపాల్లో కొత్తపుంతలు తొక్కుతున్నదే! చట్టాలు కలవారి చుట్టాలై పోయాయి. కర్ర ఉన్నవాడిదే బర్రె అయ్యింది. అందరి మేలు కోసం మనం రాసుకున్న మాటలు, చేసుకున్న బాసలు ధనికులకు ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయం చేస్తున్నాయి. ఆధునికతతో పాటు దోపిడీ పెరుగుతున్నది. వర్గ దోపిడీకి తోడు పాలి-కార్పొ జమిలి దోపిడీ (పాలిటిక్స్-కార్పొరేట్స్) శృతిమించుతున్నది.

దోపిడీ ఉన్న చోట తిరుగుబాటు తప్పకుండా ఉంటుందని చెప్పడానికి పెద్ద సిద్ధాంతాలు అక్కర్లేదు. అదొక సహజ సూత్రం. పీడితులను చైతన్య పరిచి, సమీకరించి, సంఘటితం చేసి తిరుగుబాట పట్టించే బలీయమైన శక్తులు ప్రతి తరంలో ఉంటాయి. అది కూడా సహజ సూత్రమే. విప్లవాలు అట్లానే పుట్టుకొస్తాయి. తుఫాను సృష్టిస్తాయి.

ఈ పరిస్థితిని నిలువరించే, నివారించే శక్తి నిజానికి ప్రభుత్వాల్లో ఉంది. నక్సల్స్, మావోయిస్టులు వంటి వామపక్ష సాయుధులు లేకుండా, పుట్టకుండా చేయాలంటే చేయాల్సిన పనులు స్పష్టం. పేదలకు భూమి పంపిణీ, రైతు సమస్యల పరిష్కారం, కార్మికులకు న్యాయమైన జీతాలు,  యువతకు ఉద్యోగాలు, ప్రజలకు నాణ్యమైన-మెరుగైన-ఉచితమైన విద్య, వైద్య సౌకర్యాలు, సహజ సంపదల దోపిడీ నివారణ, అణగారిన వర్గాలకు గౌరవం వంటి పనులు చేస్తే చాలు. నక్సలైట్లే నిజమైన దేశభక్తులని అన్న ఆయన గానీ, నక్సల్స్ అజెండానే మా అజెండా అని అన్న పెద్ద మనిషి గానీ అధికారం చేతిలో ఉండగా చిత్తశుద్ధితో పనిచేయకుండా ఇతరేతర అజెండాలను భుజాలకు ఎత్తుకోవడం వల్ల ఈ దీర్ఘ కాల సమస్యలు ఎక్కడివక్కడే ఉండి పోయాయి. అధికారంలో కొనసాగడం ఎలా? అన్నది మాత్రమే ఏకైక అజెండాగా  పాలకులు నానా గడ్డికరుస్తుంటే ఈ సమస్యలు ఇట్లానే ఉంటాయి.

తప్పో, ఒప్పో... ఒక మహోన్నతమైన ఆశయ సాధన కోసం అహరహం కృషిచేసి కన్నుమూసిన కమిటెడ్ విప్లవకారుడి కోసం సమాజం రెండు కన్నీటి బొట్లు విడవడంలో తప్పులేదు. ప్రజల పక్షపాతులు, విప్లవ భావావేశపరులు, ప్రజాస్వామ్య హితైషులు, కమ్యూనిస్టులు అనేక మంది ప్రయివేటు సంభాషణల్లో ఆర్కే సేవలను కొనియాడారు. ఆయుధం చేబూనడం, ఎన్నికలకు దూరంగా ఉండడం తప్ప మిగిలినవన్నీ ఆయనదీ అన్ని రాజకీయ పార్టీల అజెండానే అయినప్పటికీ పొలిటీషియన్స్ బైటకు పెద్దగా ప్రకటనలు చేసినట్లు కనిపించలేదు. 'కామ్రేడ్ ఆర్కే జోహార్... లాల్ సలామ్'... అని బహిరంగంగా అన్న పొలిటికల్ గొంతు సీపీఐ నారాయణ గారిదొక్కటే ప్రముఖంగా వినిపించింది. దక్షిణ అమెరికా ఖండపు విప్లవ వీరుడు చే గువేరా బొమ్మ తో  రాజకీయం చేసుకోవాలనుకునే భావోద్వేగపు బాపతు నయా నాయకులూ మిన్నకున్నారు. కాకి అరిచినా ట్వీట్ చేసే వాళ్లు ఆర్కే మరణాన్ని ప్రస్తావించి ఆ సిద్ధాంతంలో తప్పొప్పులను మాట్లాడవచ్చు. గణనీయంగా మారిన సామాజిక, ఆర్థిక, సాంకేతిక పరిస్థితుల్లో మావోయిజం రిలవెన్సు గురించి మాట్లాడుకోవడం తప్పు కాదు గదా! వైరుధ్యాల ప్రపంచంలో అన్నీ బ్లాక్ అండ్ వైట్ గా ఉంటాయనుకోవడం తప్పే కదా.

ఆర్కేని ఆదర్శంగా తీసుకుని ఆయుధాలు చేబట్టి ఉన్నపళంగా బస్తర్ అడవుల వైపు వెర్రిగా పరిగెడుతూ పోవాల్సిన పనిలేదు. రాజ్య ప్రతినిధులను శత్రువులుగా చూడాల్సిన, కాల్చాల్సిన, వర్గ శత్రు నిర్మూలన చేయాల్సిన పనిలేదు. ఎవరి వృత్తుల్లో వారు ఉంటూనే, ఎవరి స్థాయిలో వారు దోపిడీని నిలువరించాలి. ప్రతి మనిషికి, ప్రతి శ్రమకు గౌరవం దక్కేందుకు కృషిచేయాలి. గళమెత్తే కలాలకు దన్నుగా ఉండాలి. ప్రశ్నించే గొంతులను బలోపేతం చేయాలి. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాలి. బాధ్యతతో ప్రజాచైతన్యం కల్గించడం ప్రతి ఇండియన్ విద్యుక్తధర్మమని వ్యవస్థలో అందరూ అహరహం భావించాలి. మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇది చాలా కీలకం. 

ఇంతకూ ఆర్కే హీరోనా? విలనా? అన్న దానికి 'ఎస్' లేదా 'నో' అన్న సమాధానం ఇవ్వడం ఏ మాత్రం కుదరదు. ఇది ఎవరికి వారు పరిస్థితులను అధ్యయనం చేసిన, వాస్తవాలు క్రోడీకరించి, విషయాలు అవగాహన చేసుకుని ఒక నిర్ణయానికి రావలసిన అంశం. 

Monday, August 30, 2021

'ఈనాడు' కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా-ఆమోదం


'ఈనాడు'  కార్టూనిస్టుగా సుదీర్ఘంగా 43 సంవత్సరాలు పనిచేసిన శ్రీధర్ గారికి ఆ పత్రికతో బంధం తెగిపోయింది. తాను రాజీనామా చేసినట్లు ఆయన ఫేసు బుక్ లో చేసిన ప్రకటన తెలుగు పాఠకులను కుదిపివేసి పెద్ద సంచలనం సృష్టించింది.  ఈ ప్రస్థానంలో అయన దాదాపు లక్ష కార్టూన్లు వేసినట్లు ఒక అంచనా. 

స్పార్క్ ను గుర్తించి రామోజీ రావు గారు ప్రోత్సహించిన శ్రీధర్ గారు ఒక సంచలనం. మృదుస్వభావి, పక్కా ప్రొఫెషనల్ అయిన ఆయన ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. 

శ్రీధర్ గారికి మేలు జరగాలని కోరుకుంటున్నాం.      

Wednesday, August 4, 2021

తీన్మార్ మల్లన్నపై కక్షపూరిత వైఖరి తగదు!

ప్రశ్నించే గొంతులను నొక్కేయడం అప్రజాస్వామిక పాలకుల ప్రథమ కర్తవ్యం. ప్రశ్నించే తత్త్వం నుంచి, ఒక మహోన్నత ఉద్యమం ద్వారా పాలనాధికారం పొందిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రజాదరణ కలిగిన ' క్యూ న్యూస్'  యూ ట్యూబ్ ఛానెల్ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు అయిన  తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పట్ల ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించడంలేదు. ఇది దారుణం, అన్యాయం. 

ప్రభుత్వ విధానాలకు,  అవినీతికి పాల్పడిన మంత్రులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, పత్రికలు, టెలివిజన్ చానళ్ల కన్నా ఘాటుగా స్పందిస్తూ ప్రజాదరణ పొందిన మల్లన్న ఆఫీసులో నిన్న (ఆగస్టు 3, 2021) రాత్రి మూడు గంటలకు పైగా  హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ పనిచేసినట్లు పోలీసులు తెలిపినా, ఇది ఒక పద్ధతి ప్రకారం కక్ష సాధింపుతో చేసినట్లు కనిపించింది. ఆఫీసు బైట మల్లన్న అభిమానులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. పలు రాజకీయ పార్టీలు కూడా మల్లన్నకు బాసటగా నిలిచాయి. పోలీసుల సోదాలను మల్లన్న టీమ్, అయన అభిమానులు సామాజిక మాధ్యమాల్లో  లైవ్ చేసారు. మొత్తం మీద పోలీసులు తనను అక్రమంగా కదలకుండా చేశారని, కొన్ని కంప్యూటర్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు మల్లన్న చెప్పారు.  

ఇటీవల ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధికి ముచ్చెమటలు పట్టించి మల్లన్న రెండో స్థానం పొందారు. ఆ తర్వాత ప్రభుత్వంపై దాడిని మరింత పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా టీమ్ లను ఏర్పాటు చేసి అక్రమార్కులపై కథనాలు పెంచి, తనను కలిసిన బాధితులకు బాసటగా ఉంటున్నారు.  సాధారణ జర్నలిజానికి భిన్నంగా పరుష పదాలతో.... ముఖ్యమంత్రిని, ఆయన పరివారాన్ని నేరుగా దూషిస్తూ, పలు ఆరోపణలు చేస్తూ మల్లన్న రోజూ చేసే చర్చలకు ప్రజాదరణ ఉంది. ఈ ప్రభుత్వ పాలనలో తెలంగాణలో అవినీతి పెరిగిందిగానీ, అభివృద్ధి జరగడం లేదన్న అక్కసు, ఆవేదన మల్లన్న మాటల్లో కనిపిస్తుంది. 

తనను అరెస్టు చేసేందుకు ముఖ్యమంత్రి కుట్ర పన్నుతున్నారని మల్లన్న చెబుతూ వస్తున్నారు. గత కొన్ని రోజులుగా మల్లన్న కు వ్యతిరేకంగా కొన్ని పరిణామాలు జరిగాయి. వాటికి, పోలీసుల చర్యకు ఎంత సంబంధం ఉన్నదీ తెలియదు గానీ, ప్రభుత్వం పరిధికి మించి ఒక జర్నలిస్టును వేధించడం మంచిది కాదు. ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నించిన యువ జర్నలిస్టు రఘు ను పోలీసులు గూండాల్లా అరెస్టు చేసి అభాసు పాలైన కొన్ని రోజులకే మరో జర్నలిస్టు ఆఫీసులో పోలీసు సోదాలు జరగడం గమనార్హం. 

మల్లన్న పై ప్రభుత్వ పత్రికగా ముద్ర ఉన్న 'నమస్తే తెలంగాణ' ప్రచురించిన వార్త ఈ కింది విధంగా ఉంది. ముఖ్యమంత్రిని మాటిమాటికీ అనుచితంగా మల్లన్న తిట్టడం ఎంత తప్పో, ఈ కింది కార్టూన్ లో 420 గా తనను పేర్కొనడం అంతే తప్పు. జర్నలిజం ముసుగులో దొంగదెబ్బలు తీయడం వృత్తికి ప్రమాదం. 


   

Saturday, July 17, 2021

'ది హన్స్ ఇండియా' పదేళ్ల పండగ!

హైదరాబాద్ కేంద్రంగా వెలువడుతున్న 'ది హన్స్ ఇండియా' ఆంగ్ల దినపత్రిక  జులై 16, 2021 నాడు పదేళ్ల జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందదాయకం. రోజురోజుకూ నాణ్యత పరంగా వృద్ధిచెందుతున్న ఈ పత్రికకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుందాం. సీఎల్ రాజాం గారి నేతృత్వంలో, అప్పరసు శ్రీనివాస రావుగారి సంపాదకత్వంలో హైదరాబాద్ కేంద్రంగా 'మెట్రో ఇండియా' అనే పత్రిక వచ్చింది కానీ మూడు ఏళ్లకే మూతపడింది. ఎదుకంటే... దినపత్రిక నిర్వహణ అంత తేలికైన వ్యవహారం కాదు. అయినా.... మొక్కవోని దీక్షతో నాణ్యతకు పెద్దపీట వేస్తూ, ఆర్ధిక సమస్యలను అధిగమిస్తూ పదేళ్లు పూర్తిచేసుకోవడం మామూలు విషయం కాదు. 

కపిల్ చిట్స్ అధిపతి వామనరావు గారి పెట్టుబడిలో సీనియర్ జర్నలిస్టు కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి మానస పుత్రికగా "ది హన్స్ ఇండియా' పత్రిక పురుడుపోసుకున్నప్పుడు నేను ఆ సంస్థ వారి 'ఇండియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం' వ్యవహారాలు చూసేవాడిని. దీన్ని మంచి టాబ్లాయిడ్ గా తేవాలని భావించినా ప్రింటింగ్ కు సంబంధించి వచ్చిన సాంకేతిక సమస్య వల్ల బ్రాడ్ షీట్ గా తెచ్చారు. ఎడిటర్ గా, డెక్కన్ క్రానికల్ మాజీ ఎడిటర్ నాయర్ ఉండేవారు. సీనియర్ జర్నలిస్టు, ది హిందూ లో ఒక వెలుగు వెలిగిన సాయశేఖర్ రిపోర్టింగ్ కు నేతృత్వం వహించారు. భాస్కర్, పెన్నా శ్రీధర్, మంజులతా కళానిధి తదితర మంచి జర్నలిస్టులు ఉన్న ఈ బృందం చాలా కష్టపడి దీన్ని ఆరంభించింది. వృత్తి విలువలు, నైతిక నిబద్ధత వంటి అంశాలలో 'ది హిందూ' కు దీటుగా ఉండాలని సంకల్పం చెప్పుకున్నారు. లోకల్ వార్తలకు పెద్దపీట వేయడం ఇందులో కనిపిస్తుంది. అలాగే ప్రత్యేకించి బిజినెస్ ఎడిషన్ ఉండడం ఒక ప్రత్యేకత. 
అప్పటికే జర్నలిజం పటుత్వం తగ్గిపోయిన నాయర్ గారికి పూర్ణకుంభ స్వాగతం పలికి బాధ్యతలు మొదట్లో ఎడిటర్ బాధ్యతలు అప్పగించారు గానీ, అది వర్కవుట్ అయినట్లు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి హయాంలో పత్రిక ఒక ఊపు అందుకుంది. వారు వెళ్ళిపోయాక సీనియర్ జర్నలిస్టు రామూ శర్మ గారి నేతృత్వంలో కొత్తపుంతలు తొక్కుతున్నది. పత్రిక రెండో రోజు బ్యానర్ స్టోరీగా నేను నల్గొండ లో ఫ్లోరైడ్ సమస్య మీద రాస్తే వేశారు. మే 2021 నుంచి ప్రతి బుధవారం 'Moot Point' అనే కాలమ్ రాసే అవకాశం ఇచ్చిన ప్రస్తుత ఎడిటర్ రామూ శర్మగారికి ధన్యవాదాలు. 

పది వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రామూ శర్మ గారి సైన్డ్ ఎడిట్ ఇదీ: 

Crossing the decade milestone is a moment of pride for The Hans India. The 10-year-old journey began with an intention to serve the Telugus with wholesome, pure and unbiased news. This made the Hyderabad Media House Limited launch The Hans India simultaneously from Hyderabad, Visakhapatnam, Vijayawada, Warangal and Tirupati on July 16, 2011. The launch took off under the leadership of veteran journalist K Ramachandra Murthy, who took the newspaper from the pre-Telangana movement to separate Statehood. Since then The Hans India was driven by the credible Editors PNV Nair and Prof K Nageshwar bringing the unbiased reportage to the readers.
The Team Hans promises to continue its journey in the new decade upholding the core values and remain connected with the readers by taking up issues that matter to them the most. The Hans India has seven editions in the two Telugu States and one edition in the National Capital to reach Telugus, policymakers and opinion leaders. With Hyderabad, Warangal and Khammam editions in Telangana and Amaravati, Visakhapatnam, Tirupati and Kurnool edtions in Andhra Pradesh, The Hans India has a unique distinction of having readers in the age group of 18 to 45 years. It has started attracting readers from Mumbai, Delhi, Bengaluru and Chennai.

With growing readership over a broad spectrum, The Hans India has launched two e-Papers riding the digital trends. A full-fledged edition has a special focus on Bengaluru. The second one on the young entrepreneurs with Bizz Buzz and the business sections explore all aspects from start-ups, macroeconomy to information for small investors. The core of the newspaper is its unbiased content serving various sections of society, especially the marginalised society and rural regions, not ignoring the urban happenings. The urban content is amply covered in City Hans pages, which is the source of strength in reaching the readers. Besides national news with a special focus on diaspora from abroad, in-depth articles from experienced experts in the field is the hallmark of The Hans India. An exclusive section Womenia covers various aspects of women. Young Hans provides the space for GenNext to give utility news from education to opportunities. Illustrated Sports pages give priority to the local news as important as popular games in the arena of sports.

As part of social responsibility, The Hans India has initiated awareness programmes among citizens like Jagore, Freedom from Plastic, Half Marathon and Retail Ratna Awards etc. With the focused coverage, The Hans India has created an impact on the administration by taking up action on civic issues. These responsive actions from the administration are covered under the brand: The Hans Impact.

Giving platforms to women and young aspirants to showcase their talents by organising contests like Ghar Ki Biryani, focus on the gourmets of Deccani cuisine with the Hans Haleem, where visitors to the Haleem centres gave ratings to the ever-popular dish and Draw A Dream – “Swecha Bharath.” Hans India will always be your best News Partner.


Wednesday, June 30, 2021

దళితుల అంశాల కవరేజ్ కోసం డీసీలో ప్రత్యేక రిపోర్టర్

దళితులకు సంబంధించిన అంశాలను, పరిణామాలను నిశితంగా పరిశీలించి వార్తలు రాసేందుకు డెక్కన్ క్రానికల్ (డీసీ) ఆంగ్ల పత్రిక ప్రత్యేకంగా ఒక రిపోర్టర్ ను నియమించబోతున్నది.  

డీసీ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ శ్రీరామ్ కర్రి బుధవారం మొట్టమొదటి 'ప్రొఫెసర్ బి. బాలస్వామి స్మారకోపాన్యాసం'  చేస్తూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కరోనా మహమ్మారికి మే నెల ఏడున బలైన మానవతావాది, ప్రేమమూర్తి, విద్యార్థుల ఆత్మీయ ప్రొఫెసర్ బండి బాలస్వామి జయంతి సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం డిపార్టుమెంటు ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ జూమ్ లో ఈ స్మారకోపన్యాసం నిర్వహించింది. 

Mr.Sriram Karri delivering "Prof B.Balaswamy Memorial Lecture" on June 30, 2021


"Virus in the Newsroom: Which Mask to Wear?' అనే అంశంపై డీసీ రెసిడెంట్ ఎడిటర్ మాట్లాడారు. కఠిన సామాజిక పరిస్థితులకు వెరవకుండా ప్రొఫెసర్ బాలస్వామి ఉన్నత ఎత్తుకు ఎదిగారని, అయన మరణానంతరం సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన నివాళులు దివంగత ప్రేమమూర్తి ఔన్నత్యానికి అద్దం పడతాయని అయన అన్నారు. ఈ సందర్భంగా, మాజీ ఎం ఎల్ సీ, ప్రొఫెసర్ బాలస్వామి సహోద్యోగి అయిన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ న్యూస్ రూమ్ లలో దళితులకు దక్కని ప్రాతినిధ్యం గురించి ప్రస్తావించినపుడు శ్రీరామ్ కర్రి స్పందిస్తూ... దళితుల సమస్యల నివేదన కోసం ఒక జర్నలిస్టును నియమిస్తామని అక్కడికక్కడ ప్రకటించారు.

దళిత జర్నలిస్టులను యాజమాన్యాలు నియమించకపోవడం ఒక లోపమేనని శ్రీరామ్ అభిప్రాయపడ్డారు.  అలాగే, పత్రికల విశ్వసనీయత బాగా దిగజారిందని స్పష్టంచేశారు. భిన్న అభిప్రాయాలకు ఆలవాలమైన సోషల్ మీడియా విస్తరణ ఆహ్వానించదగిన పరిణామమే అయినా  తప్పుడు సమాచారం 'ఫేక్ న్యూస్' రూపంలో చేస్తున్న నష్టం అపారమైనది చెప్పారు. 

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రజలంతా కలిసికట్టుగా పనిచేసినట్టే, తప్పుడు సమాచారాన్ని నిలువరించేందుకు మూకుమ్మడిగా ప్రయత్నాలు చేయాలని రెసిడెంట్ ఎడిటర్ చెప్పారు. జర్నలిజంలో నాణ్యత ప్రమాణాలు దిగజారాయని చెబుతూ శ్రీరామ్ ఒక గమ్మత్తైన వ్యాఖ్య చేశారు. తన సుదీర్ఘ జర్నలిజం జీవితంలో తిరుగులేని అద్భుతమైన లీడ్ (వార్తలో మొదటి పేరా) రాసే వారిని ఇంతవరకూ చూడలేదని చెప్పారు. 

ఓయూ జర్నలిజం శాఖ అధిపతి ప్రొఫెసర్ స్టీవెన్ సన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్ బాలస్వామి గారిని ఆసుపత్రిలో చేర్పించి దగ్గరుండి చూసుకున్న డిపార్ట్మెంట్ పూర్వ విద్యార్థి రమేష్ మాట్లాడుతూ వారి మృతి తీరనిలోటని చెప్పారు. 

నిజంగానే డీసీ పత్రిక దళిత్ బీట్ ఏర్పాటు చేసి, కేవలం దానికోసమే ప్రత్యేకించి ఒక రిపోర్టర్ ను నియమిస్తే అది భారతదేశ జర్నలిజం చరిత్రలో ఒక కొత్త ఒరవడికి నాంది పలికినట్లు అవుతుంది. కరోనా కారణంగా జర్నలిస్టుల ఉద్యోగాలు పీకేస్తున్న సమయంలో ఈ చర్య ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది. ఈ పని సత్వరమే జరగాలని ఈ బ్లాగు కోరుకుంటోంది. 

ఎడిటోరియల్ మూర్తి గారికి 'ఈనాడు' లో చివరి రోజు!

సంపాదకీయాలు రాయడం (ఎడిటోరియల్ రైటింగ్) అనేది ఒక కళ. విశ్లేషణ, వ్యాఖ్య, విమర్శ, మార్గనిర్దేశం అన్నీ పాఠకుల మనసును ఆకట్టుకునేలా, ప్రభావశీలంగా కొన్ని పదాల్లోనే చేయాల్సి ఉంటుంది. ఇది అత్యంత కీలకమైన...వాక్యాలను చిత్రికపట్టే కార్యక్రమం కాబట్టే.. కొందరు కొమ్ములుతిరిగిన పూర్వ ఎడిటర్లు తాము ఎడిట్ రాస్తున్నప్పుడు గది బైట ఎర్ర బల్బు వెలిగే ఏర్పాటు చేసుకునేవారు. ఎడిట్స్ రాసేవారిని 'లీడర్  రైటర్స్' అంటారు. పత్రిక లీడర్ తరఫున రాసేది కాబట్టి అది రాసేవారిలో 'డర్' సహజంగానే ఉంటుంది. లీడర్ రైటర్స్ అన్నా పత్రికలో మిగిలిన ఉద్యోగులకు డర్ ఉంటుంది... వారి మేధోశక్తి, భాషా పటిమ, ముఖ్యంగా లీడర్ (అధిపతి)తో నిత్యం టచ్ లో ఉంటారనే సత్యం కారణంగా.  

'ఈనాడు' దినపత్రిక మొత్తం గుండుగుత్తగా తనదే అయినా... సంపాదకీయపు పేజీ (ఎడిట్ పేజ్) అనేది ఆ పత్రిక అధిపతి రామోజీరావు గారి గుండెకు దగ్గరగా ఉంటుంది. పత్రిక దృష్టికోణాన్ని, అభిప్రాయాన్ని  చెప్పే సంపాదకీయం ఆ రోజున దీనిమీద రాయాలి? ఆయా పరిణామాలపై పత్రిక యాంగిల్ ఏమిటి? వంటివి అంత వయసు మీదపడినా ఇప్పటికీ రోజూ రామోజీరావు గారు ప్రత్యేక శ్రద్ధపెట్టి నిర్ణయిస్తారు.ఈ కసరత్తులో ఆయనకు తృప్తి అమితంగా ఉన్నట్లు చెబుతారు. 

ఫొటోలో కుడివైపున మూర్తి గారు, ఎడమవైపున బాలు గారు... రామోజీ రావు గారితో....
(Photo courtesy: Mr.Balu's FaceBook wall)

 'ఈనాడు' ఎడిట్ పేజీ (సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డు- సీఈబీ) లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న ఇద్దరు- మూర్తి, బాలు గార్లు- నిత్యం రామోజీ గారితో అనుసంధానమై ఉంటారు... ఈ పేజీ పని నిమిత్తం.పెద్దాయన మనసెరిగి, అంటే రాయాల్సిన అంశం ఎంపిక జరిగాక, ఈ ఇద్దరిలో ఒకరు ఆ రోజు సంపాదకీయాన్ని రాస్తారు. ఆ రాయడానికి, అద్భుతంగా ఏర్పాటుచేసుకున్న సంస్థాగత గ్రంథాలయం నుంచి వచ్చే ఫైల్స్ ఎంతగానో ఉపకరిస్తాయి. అందులో పాత క్లిప్పింగ్స్ ఉంటాయి. కొత్త పరిణామాలకు అనుగుణంగా, అదనంగా... పదేళ్ల కిందటి ఎడిటోరియల్ లో నుంచి ఒక పేరా, అదే టాపిక్ పై ఐదేళ్ల కిందట ప్రచురించిన దాన్నుంచి ఒక పేరా, అలా తెలివిగా అమర్చుకుంటూ పోతే  చాలు.... గంటలో ఎడిట్ సిద్ధమవుతుందని అనుకునే చుప్పనాతులు కూడా ఉంటారు. అది నిజమే అనిచెప్పడం మరీ అన్యాయం. 

సరే, ఏదో ఒకలా తయారయిన సంపాదకీయాన్ని... పరస్పరం చదువుకుని పెద్దాయనకు ఆమోదముద్ర కోసం పంపేవారు... వీరిద్దరూ, అప్పట్లోనైతే.  రామోజీ గారు దాన్ని ఒకసారి చూసి, సరే కానివ్వండి...అన్నాక అది సంపాదకీయ స్థలం (ఎడమవైపు బారుగా ఉంటుంది) లోకి పోయి కూచుంటుంది. ఈ ఎడిట్ పేజీలో పెద్దా, చిన్నా కొన్ని వ్యాసాలు తెప్పించుకుని, అవసరమైతే అనువాదం చేయించుకుని, తప్పులురాకుండా చూసుకుని ప్రచురించే ప్లానింగ్ బాధ్యత మూర్తి, బాలు గార్లు సమష్టిగా చూస్తారు. తెర ముందు మూర్తి గారు, తెర వెనుక బాలు గారు కథ నడుపుతుండగా, వారికి సహకరించే సబ్ ఎడిటర్లు ఒక ముగ్గురు నలుగురు ఎడిట్ పేజ్ డెస్క్ లో ఉంటారు. 

రామోజీ గారి కనుసన్నల్లో ఉన్న సీఈబీ లో దాదాపు రెండేళ్లు పనిచేసే మంచి అవకాశం కలిగినపుడు నా బాసుగా మూర్తి గారు ఉండేవారు. అయన ఇంటిపేరు పర్వతం అనుకుంటా, మరిచిపోయాను. అయన మాత్రం బక్క పలచగా, బారుగా, నగుమోముతో ఉంటారు. పరమ సాత్వికుడు, మృదుభాషి, హాస్య ప్రియుడు. అందరితో చాలా ప్రేమగా ఉండేవారు. మేము ఆ వారం ప్రచురించాల్సిన వ్యాసాల పై మేధోమదనం చేసేటప్పుడు అయన ఆధ్వర్యంలో చర్చలు చాలా బాగుండేవి. "అది కాదు రా... నాన్నా...." అంటూ తన వాదన చెప్పేవారు. ఆ డెస్కులోనే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ గారు, సమాజం గురించి విధిగా బాధపడే మా జీవీ అన్న (ఇప్పుడు నమస్తే తెలంగాణా ఎడిట్ పేజీ), మంచి సైన్స్ వ్యాసాలు రాసే ఉడుముల సుధాకర్ రెడ్డి గారు (ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా పరిశోధనల ఎడిటర్) కూడా పనిచేసేవారు. ఈ ముగ్గురూ మంచి మిత్రులుగా మిగిలిపోయారు.     

బాలు గారి గుండ్రటి అక్షరాలు మాత్రమే ఆయనకు సంబంధించి నాకు బాగా గుర్తున్నది. కళ్ళతోనే ఎక్కువగా మాట్లాడే ఆయనకు నేను దూరంగా మెలిగేవాడిని. అలాగని అమర్యాదకరమైన మనిషి కారాయన. ఆయన తీరు అదీ. మెంటారింగ్ అనే కళ మూర్తి గారికి తెలిసినట్లు బాలు గారికి తెలియదు. తన పనేదో తాను చేసుకుపోయేవారు... ఆర్ ఆర్ జీ ఫైల్స్ లో మునిగితేలుతూ. పని విభజనలో భాగంగా కావచ్చు మూర్తి గారే మాతో డీల్ చేసేవారు.  వారిద్దరి మధ్యన సమన్వయం నిజంగా అద్భుతం. (నేను 'ఈనాడు' ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న జనరల్ డెస్క్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్న సీఈబీ లో పడిన విధం గురించి చివర్లో విడిగా రాశాను, వీలుంటే చదవండి). 

దాదాపు 30 సంవత్సరాల పాటు 'ఈనాడు' లో పనిచేసిన మూర్తి గారికి అక్కడ ఈ రోజు ఆఖరి రోజు అని తెలిసి ఇవన్నీ రాస్తున్నాను. మూర్తి గారు ఇచ్చిన స్ఫూర్తి తో, చేసిన దిశానిర్దేశంతో...అనేక వ్యాసాలు నేను రాశాను. అందులో, సర్వమత సమ్మేళనం సందర్భంగా, 2000 ఒలింపిక్స్ అప్ప్పుడూ రాసిన వ్యాసాలు నాకు చాలా తృప్తినిచ్చాయి. నిత్యం ఎడిట్ పేజ్ పనిలో మాత్రమే ఉంచకుండా, కొంత ప్రపంచం చూసే, మంచి సెమినార్లలో పాల్గొనే, అధ్యయనం చేసే అవకాశం ఉంటే మూర్తి గారు ఇంకా బాగా ఎడిట్స్ రాయగలిగేవారని నాకుఅనిపించేది. మేధో వికాసానికి ప్రయత్నాలు చేయకుండా ఎడిట్స్ రాయకూడదు, రాసినా పండవు. ఎవరు ఎడిట్స్ రాసినా రోజూ అద్భుతంగా ఎలా ఉంటాయి? మూర్తి గారు తనదైన శైలి, పదజాలంతో వేలాది సంపాదకీయాలు రాసి మన్ననలు పొందారు. 

సహచరులను, కింది ఉద్యోగులను ఉన్మాదంతో పీక్కుతిని, రాచిరంపానపెట్టి, రాక్షసానందం పొందే వారికి భిన్నంగా, తనకున్న శక్తిమేరకు సలహాలు ఇస్తూ, నవ్వుతూ పనిచేస్తూ, సాధ్యమైన మేర నిష్పాక్షికంగా వ్యవహరించే మూర్తి గారిలాంటి ప్రొఫెషనల్స్ సంఖ్య మరీ తగ్గిపోతున్నది. ఇది బాధాకరం. అన్నేళ్ల పాటు ఎడిట్ పేజీకి అకింతమై సేవలు అందించి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా మూర్తి గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. అవిరళ సేవతో అలిసిపోయిన ఆయనకు కాస్త విశ్రాంతి అవసరం. 
All the best...Murthy jee.   

(POST SCRIPT: మూర్తి గారి పూర్తిపేరు 'పర్వతం శ్రీరామచంద్ర మూర్తి (పీ ఎస్ ఆర్ సీ మూర్తి)'. పదవీవిరమణ అయ్యాక కూడా కొనసాగాలని రామోజీ కోరినా... అయన వద్దనుకున్నారట. ఇద్దరు పిల్లలు సెటిల్ అయ్యారు. బాదరబందీలు లేనపుడు 1986 నుంచీ చేస్తున్న అదే పని చేయడం కన్నా కాస్త సేద తీరదామని మూర్తి గారు నిశ్చితాభిప్రాయంతో ఉన్నారట).  

ఇంక మన సొంత సొద...నేను ఎడిట్ పేజీలో చేరిన వైనం... 

చెప్పానుకదా, ఇరవై ఏళ్లకు పూర్వం నేను 'ఈనాడు'లో దాదాపు పదేళ్లు పనిచేశాను. అంతకుముందు డిగ్రీ చదువుతూ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో కంట్రి బ్యూటర్ గా మూడేళ్లు కలుపుకుంటే ఒక పుష్కర కాలం పాటు అక్కడఉన్నట్టు లెక్క. ఒక ఎనిమిదిన్నరేళ్ళు నేను పనిచేసిన జనరల్ డెస్క్ లో నేర్చుకోవడానికి చాలా అవకాశం ఏర్పడింది. ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అది మంచి వేదిక. ఎందుకోగానీ, 'ఈనాడు' లో మంచి మంచి సంపాదకీయాలు, సరళభాషలో రాయాలన్న కుతూహలం నాకు అప్పుడు జాస్తిగా ఉండేది. డ్యూటీ సాయంత్రం అయితే ఉదయాన్నే వచ్చి లైబ్రరీలో కూర్చొని శాంపిల్ ఎడిట్స్ రాసి గప్ చిప్ గా రామోజీ గారికి కవర్లో పంపాను రెండు మూడు సార్లు. ఎవరైనా ఆయనకు లేఖలు పంపే వెసులుబాటు ఉండేది. మన ఉత్సాహం గమనించి ఒకసారి పిలిచి... "ఇంకా కృషిచేయి... నీకు అవకాశం ఇస్తా"నని అయన అన్న రోజు, ఆ తర్వాత రెండు రోజులు నేను నిద్రపోలేదు. నేనేదో ఒక వార్త రాస్తే 'తెలుగంటే ఇలా ఉండాలి' అని అయన అంతకు ముందు ఎర్ర స్కెచ్ తో చేసిన వ్యాఖ్యతో ఉత్తేజం పొంది నేను ఎడిట్స్ సాహసం చేసాను. 

ఈ లోపు నేను రామకృష్ణా మఠ్ కు ఇంగ్లిష్ నేర్చుకోవడానికి, ఉస్మానియాలో జర్నలిజం చేయడానికి నాదైన సమయంలో పోతుంటే 'న్యూస్ టుడే ' ఎండీ గా పనిచేసి ఒక ఏడెనిమిదేళ్ళ కిందట కాలం చేసిన రమేష్ బాబు కుమ్మేయడం ఆరంభించాడు. ఆయన చల్లనిచూపుల్లో ఎందుకోగానీ నేను పడలేక ఇమడలేక ఇబ్బందిపడ్డాను. కుంగతీసేలా మాటలు అనేవాడు. మనిషిలో ఉన్న మానసిక స్థైర్యాన్ని కరకు మాటలతో, అబద్ధాలతో చివరిచుక్కతో సహా ఎలా తొలగించాలో తెలిసిన ఒకరిద్దరు మానసిక వికలాంగులు అక్కడ ఇన్ ఛార్జ్ లుగా ఉండేవారు... ఆ మహానుభావుడికి తానతందానగా. ఒక సారి జ్వరం వచ్చి సెలవు పెడితే... నన్ను ఇబ్బంది పెట్టారు. సెలవునుంచి వచ్చాక రమేష్ బాబు నన్ను నేను ఉద్యోగం చేసే స్థలంలో కాకుండా... సెక్యూరిటీలో కూర్చోపెట్టాడు. ఈ విషయాన్ని ఒక లేఖ రూపంలో తెలియజేయగానే రామోజీ గారు, అపుడపుడే బాధ్యతలు చేపట్టిన కిరణ్ గారు నాతో చాలా ఉదారంగా వ్యవహరించి ఈ ఎడిట్ పేజీలో వేశారు. అద్గదీ.... అలా నేను మూర్తి గారి దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. ఐక్యరాజ్యసమితి మీద నేనుప్రచురించిన రెండో వ్యాసం నచ్చి, పిలిపించి... 'నువ్వు నా మూడో కొడుకువీ రోజు నుంచి..' అని రామోజీగారు అన్న రోజు కూడా  నిద్రపట్టి చావలేదు. అయన అలా ప్రేమగా పలువురిని కొడుకుల్ని చేసుకున్నట్లు ఈ మధ్యన తెలిసింది. అయినా.... అది గొప్పే కదా! అయన అంటే నాకు గౌరవభావం ఇప్పటికీ ఉండడానికి పలు స్వీయ అనుభవాలు కారణం. 

అప్పటికే ఉస్మానియా జర్నలిజంలో రెండు గోల్డ్ మెడల్స్ వచ్చిన ఊపుతో ఇంగ్లిష్ జర్నలిజంలోకి పోవాలని అనుకోవడం మూలంగా 2000 లో ఈనాడు వదిలి బైటికొచ్చి ఏషియన్ స్కూల్ అఫ్ జర్నలిజం లో చేరి తర్వాత 'ది హిందూ' లో చేరడం జరిగింది. నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న రామోజీ గారికి నేను ఏసీజే నుంచి రాగానే ఒక లేఖ రాశాను... 'అయ్యా, ఇప్పుడు నేను మరింత బాగా ఉపయోగపడగలను. మీరు పనిస్తే చేస్తా,' అని. రమేష్ బాబు తదితరుల పుణ్యాన అనుకుంటా నాకు తిరుగు టపా రాలేదు. ఎదురుచూసి నేను 'ది హిందూ' లో చేరాను. అక్కడ పన్నెండేళ్ళు పనిచేసినా ఒక్క ప్రమోషనైనా రాకుండా, చివరకు గ్రాట్యుటీ కూడా రాకుండా చేశారే అనే బాధ ఉన్నా.... 'ఈనాడు' చదవకపోతే రోజు గడవని వారిలో నేనూ ఒకడ్ని. జర్నలిస్టుగా నిలదొక్కుకునేలా పునాది వేసిన 'ఈనాడు' ఒక తీపి గుర్తే. 

విచిత్రమేమిటంటే, నన్ను, నాలాంటి ప్రొఫెషనల్ జర్నలిస్టులను ఇబ్బంది పెట్టి అబద్ధాలతో కెరీర్ లు ఖూనీ చేసిన రమేష్ బాబు నిజ స్వరూపం తెలిసి యాజమాన్యం వదిలించుకుంది. అయన తరువాత తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చేరి, పాపం అకాల మరణం పొందారు. వాడో నరరూప రాక్షసుడని జర్నలిస్టులు ముక్తకంఠతో చెప్పే ఆ ఇన్ ఛార్జ్ కూడా పంపబడ్డాడు. 

మొత్తంమీద ఇప్పటికీ 'ఈనాడు' ఎడిట్స్ చూసినా.. అయ్యో అనిపిస్తుంది. సరళంగా చెప్పేదాన్ని పలుగురాళ్లతో నలుగుపెట్టి తమదైన శైలిలో చెబుతారు. ఎంత కీలకమైన స్పేస్ అది! ఒక స్టయిల్ ఏర్పడిన తర్వాత మార్చడం కష్టమే కదా!

--ది ఎండ్--

Friday, June 25, 2021

సమీక్ష-దిద్దుబాటు కేసీఆర్ కు శ్రీరామరక్ష!

(An edited version of this political analysis was published in Andhra Jyothi newspaper on June 23, 2021. 
https://epaper.andhrajyothy.com/c/F1058F142811AF62454FA5476C87A005) 

(డాక్టర్ ఎస్. రాము)

పోరాట కాలం, పదవీ కాలం, పోకదల కాలం--అనే మూడు ముఖ్య మజిలీలు నాయకుల జీవితాల్లో ఉంటాయి. పదవీభాగ్యం దక్కే స్థాయికి చేరాలంటే నానా తంటాలు పడాల్సి ఉంటుంది. కష్టనష్టాలకోర్చినా ఆశించిన ఫలితం రాక కనుమరుగయ్యేవారే తొంభై ఐదు శాతం మంది ఉంటారీ రాజకీయ వైకుంఠపాళిలో. మిగిలిన ఐదు శాతంలో నాలుగున్నర శాతం మంది  పదవిపొందాక... కళ్ళు నెత్తికెక్కి పవర్ కిక్కులో తిక్కతిక్క నిర్ణయాలు తీసుకుంటూ, కూడబెడుతూ అధికారాన్ని అజరామరం చేసుకోవడమే పాలనకన్నా ముఖ్యమైన పనని నమ్మి కాలగర్భంలో కలిసిపోతారు. ఆ చివరి అర శాతం మంది, విశేష ప్రజాభిమానంతో పదవి పొందాక కూడా... సింహాసనం అశాశ్వతమైనదని అనుక్షణం గుర్తెరిగి ఒళ్ళు దగ్గరపెట్టుకుని ప్రజారంజకంగా పాలించి చరిత్రలో నిలిచిపోతారు.
 
పోకదల కాలాన్నే పిదపకాలం అని నాజూగ్గా, పోయేకాలం అని మొరటుగా అంటారు. నేతల జీవితాల్లో చివరిదైన ఈ ఘట్టంలో మరో ఐదు దశలు ఉంటాయి. పోకదల కాలం దాపురిస్తున్న మొదటి దశలో- అందలం ఎక్కించిన ప్రజాబలాన్ని నాయకుడు తప్పుగా అవగాహన  చేసుకుంటాడు. రెండో దశలో- అంతవరకూ చోదక శక్తిగా నడిపిన సిద్ధాంతాన్ని త్యజిస్తాడు. మూడో దశలో- కొత్త భజనపరులు చుట్టూ చేరి రంజింపజేస్తుండగా అనుయాయులపై అపనమ్మకం పెరిగి శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రువులుగా అనిపిస్తారు. నాలుగో దశలో-సంస్ధాగతమైన వ్యవస్థలు పనికిమాలినవిగా తోచి, తన మాటే శాసనమన్న విశ్వాసం దృఢపడుతుంది. శాశ్వతంగా అధికారంలో ఉండడానికి అడ్డు అనుకున్నవారిని వ్యవస్థను వాడుకుని తొక్కిపారేసే ఉన్మాదం ఆవరిస్తుంది. ఇక, ఐదో దశలో- ఒకవైపు అంతఃశక్తి తాను మామూలు మనిషినికాననీ, ఒక అద్భుత అతీంద్రియ శక్తినని క్షణక్షణం బోధిస్తుండగా, మరోపక్క చుట్టూ అప్పటికే బలపడిన కోటరీ వలయం వినిపించే బాజాభజంత్రీల ఆస్వాదనలో మునిగితేలుతూ నాయకుడు తప్పుల మీద తప్పులు చేస్తూ పతనమై పోతాడు.


ఈ పోకదల కాలం ప్రజాభిమానిని ప్రజాకంటకుడిగా మార్చి, హీరోను జీరో చేసి చరిత్ర హీనుడిగా నిలబెట్టిపోతుందని ప్రపంచ చరిత్రలో ఏ మహానేత ప్రస్థానాన్ని సునిశితంగా అధ్యయనం చేసినా తెలుస్తుంది. రాజకీయాల్లో ఉండేది కేవలం ఆత్మహత్యలు మాత్రమే అన్న మాట అందుకే వచ్చింది. ఇక్కడ ఇంకో గమ్మత్తైన ముచ్చటుంది. అధికారమదంతో సిద్ధాంతానికి తిలోదకాలిచ్చి, స్వపక్ష-విపక్షాలను కుమ్మేసి, వ్యవస్థలను నాశనం చేస్తూ గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలతో సొంత సామ్రాజ్యం నిర్మించుకుంటూ అత్యాశకు పోయే నేతలను పైన చెప్పుకున్న నాలుగో దశలోకి ప్రవేశించీ ప్రవేశించగానే ప్రకృతి ఒక కుట్రచేసి కథ సమాప్తం చేస్తుంది. ఒక వెలుగు వెలిగిన అలెగ్జాండర్ (అనారోగ్యం), హిట్లర్ (ఆత్మహత్య), ఇందిర (హత్య)లు కొన్ని ఉదాహరణలు. ప్రత్యర్థులను వణికించి, ప్రత్యేక రాష్ట్ర వాదులను ఇళ్లకు పరిమితం చేసిన రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయినప్పుడు కుట్ర, ప్రకృతి కుట్ర గురించి ఎందరు మాట్లాడలేదు!        

అద్భుతమైన నాయకత్వం, వాక్ చాతుర్యం, రాజకీయ వ్యూహాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రిగా రెండోసారి పాలిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి వ్యవహార శైలి, పాలనా ధోరణి , నిర్ణయాలు చూస్తుంటే పైన పేర్కొన్న నాలుగో దశలోకి వాయువేగంతో ప్రవేశిస్తున్నట్లు అనిపిస్తున్నది. ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయడంలో అయన చేసిన జాప్యం మొదటి దశకు పెద్ద సూచిక. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనుమరుగుకావడం రెండో దశలో కనిపిస్తే, తనకన్నా ఒకింత ఎక్కువగానే తెలంగాణ వాదాన్ని వినిపించి, జనసమీకరణలో కీలక భూమిక పోషించిన వారిని పక్కనపెట్టి, ఉద్యమ వ్యతిరేకులను ఆదరించి అందలాలు ఎక్కించడం, స్వేచ్ఛగా ఉండాల్సిన మీడియాపై పకడ్బందీగా పట్టుబిగించడం వంటి పనులు మూడో దశలో భాగంగా కనిపిస్తాయి.  

రాజకీయ దురంధరుడైన కేసీఆర్ ప్రజా సంక్షేమాన్నేమీ మరువలేదు. రైతుల ఖాతాల్లో ఎప్పుడూ లేనివిధంగా డబ్బులు జమవుతున్నాయి. అన్ని వర్గాల వారికీ జీవాలు, చేప పిల్లలు, ఇతరత్రా సాయాలు అందే ఏర్పాటు జరిగింది. జనాలను చేపలిచ్చి ఖుషీగా ఉంచాలా? చేపలు పట్టే శక్తి, పరిస్థితులు కల్పించాలా? అన్న 'అభివృద్ధి చర్చ' మొదలయ్యేలోపే భారీగా సాగునీరు అందించే బృహత్ ప్రాజెక్టులు మొదలయ్యాయి. ఉద్యోగాలూ బాగానే ఇచ్చామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పింది. కొవిడ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసినా ఉద్యోగులకు జీతాలూ పెంచారు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ప్రాణావసర మందుల కోసం జనాలు హాహాకారాలు చేయాల్సిరాగా, ఇదే అదనుగా కొన్ని ప్రయివేటు-కార్పొరేటు ఆసుపత్రుల వైద్యం లక్షల కుటుంబాలను పేదరికంలోకి నెట్టింది. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం అప్పుల్జేసి ఆస్తులు అమ్ముకుని బికార్లవుతుంటే, ఖజానా ఖాళీ అయి రుణభారంతో ప్రభుత్వం భూములను అమ్మకానికి పెట్టాల్సిన దుస్థితి దాపురించింది.

కొవిడ్ రెండో తరంగం సమాంతరంగా జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే- కేసీఆర్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని అర్థమవుతుంది. తన దీర్ఘకాల సహచరుడు ఈటల రాజేందర్ ను సమయం సందర్భం చూసుకోకుండా ఆరోగ్య మంత్రి పదవి నుంచి తీసిపారెయ్యడం ఆ తప్పుడు నిర్ణయాల్లో చిన్నది మాత్రమే. సీనియర్ మంత్రివర్గ సహచరుడిపై భూ కుంభకోణాన్ని తెరమీదకు తెచ్చి, ముందుగా సొంత మీడియాలో రచ్చరచ్చ చేయించి గెంటేయడం బాగోలేదు. భారీ అవినీతి, భూ ఆక్రమణల ఆరోపణలు దాదాపుగా అందరిమీదా ఉన్నా ఒక్కడ్ని టార్గెట్ చేయడమే అభ్యంతరకరమే. మంత్రి మండలిలో ఒక సభ్యుడిని వద్దనుకునో అధికారం పూర్తిగా ముఖ్యమంత్రిది కాబట్టి దానిమీద రాద్ధాంతం అవసరం. నమ్మినోళ్ళను నట్టేట్లో నిండా ముంచడం ఆయన అలవాటని, రాత్రి పొద్దుపోయేదాకా మస్తు ఖుషీగా కలిసుండేవాళ్ళం...చివర్లో కనీసం అపాయింట్మెంటైనా ఇవ్వలేదని యూ-ట్యూబ్ ఛానెల్స్ లో గుండెలు బాదుకుంటూ చెబుతున్నవారి సంఖ్య పెద్దదే. ఇది కూడా కాల మహిమనే.    

నిజానికి, ఈటల ఉదంతంకన్నా ప్రభుత్వానికి పెద్ద నష్టం కలిగించిన పరిణామాలు రెండున్నాయి. దుబ్బాకలో దెబ్బ, గ్రేటర్ హైదరాబాద్ లో కమల వికాసం కన్నా కూడా ఈ రెండు పరిణామాలు ముంచుకొస్తున్న ఆ నాలుగో దశను బలంగా సూచిస్తున్నాయి. ఈ పరిణామాల్లో ఇద్దరు సాహసవంతులైన నవతరం జర్నలిస్టులు ఉండడం విశేషం. వారిద్దరూ ప్రభుత్వ  ఇనుప పిడికిలికి దూరంగా సోషల్ మీడియాను ప్రధానాస్త్రంగా చేసుకున్నారు. ఇందుకు ఆద్యుడు- తీన్మార్ మల్లన్న అనే నవీన్. పోలీసు కేసులకు జంకకుండా, ధైర్యంతో అవినీతి బాగోతాలను మల్లన్న రోజువారీ ప్రజల ముందుంచే పనిలో ఉన్నాడు. దూషణ మోతాదు ఎక్కువని అనిపించినా మల్లన్న తీన్మార్ పల్లెపల్లెకూ చేరి విశేష ప్రభావం చూపింది. ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధికి ముచ్చెమటలు పట్టించి మల్లన్న నైతిక విజయం సాధించాడు.
సర్కార్ చేసుకున్న 'సెల్ఫ్ గోల్'...యువ జర్నలిస్టు గంజి రఘు అరెస్టు. కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణాలను వెలికితీస్తున్న రఘును పట్టపగలు రాష్ట్ర రాజధానిలో మఫ్టీ పోలీసులు చేసిన దౌర్జన్యపూరిత అరెస్టు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. జైలు నుంచి వీరుడిగా తిరిగి వచ్చిన రఘుకు లభిస్తున్న విశేష స్పందన ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. పోలీసు జులుం ఢిల్లీ స్థాయిలోనే కాదు, విశ్వవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పరువు తీసింది-సోషల్ మీడియా సాక్షిగా.

మీడియా సంస్థలను నియంత్రించి.. సొంత పత్రిక, టీవీ ఛానెళ్లలో స్వర్గం సృష్టించి.. వాస్తవాలకు మసిపూసి ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలుచుకుందామంటే కుదిరే కాలం కాదిది. కారణం, అత్యంత ప్రభావశీలమైన సోషల్ మీడియా అనూహ్య విస్తరణ. దేన్నైనా క్షణాల్లో వైరల్ చేసే సామాజిక మాధ్యమాలు ఒకపక్క, కొత్త ప్రజాస్వామ్య గళాలు-క్రియాశీలంగా ఉన్న న్యాయవ్యవస్థ మరొక పక్క 'అణచివేతతో ఏదైనా సాధ్యం' అన్న నిరంకుశ సిద్ధాంతాన్ని నమ్ముకున్న ప్రభుత్వాల తిక్క కుదురుస్తున్నాయిప్పుడు. చేతిలో ఉన్న మొబైల్ ను బ్రహ్మాస్త్రంగా ఎలా వాడుకోవచ్చో, దురహంకార ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జన శ్రేణులను సమీకరించి ఎలా బుద్ధిచెప్పవచ్చో 'అరబ్ స్ప్రింగ్' పదేళ్ల కిందటే నేర్పింది. ఈ విద్య మన బిడ్డలకూ బాగా అబ్బింది. దొంగ కేసులు-దౌర్జన్యపూరిత అరెస్టులతో ప్రపంచవ్యాప్తంగా బద్నామ్ అవుతామని పైవారికి నచ్చజెప్పి, నెటిజన్స్ ను సాకుగా చూపి తప్పించుకోవడం పోలీస్ అధికారులకు ఇపుడు శ్రేయస్కరం.
 
రాష్ట్రం విషయంలో అకున్నదొక్కటి... అయ్యిందొక్కటని ప్రొఫెసర్లు, టీచర్లు, ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఇతర బుద్ధిజీవులు ఆవేదన చెందుతున్నారు. ఇంతటి అణచివేత, క్రూరత్వం లేని ఆ కలిసున్న రోజులే బాగుండెననిపిస్తున్నదని చెప్పుకోవడం ఈ మధ్యన ఎక్కువయ్యింది. ప్రభుత్వ సేవలో ఉన్న తెలంగాణ ప్రముఖులు కలివిడిగానో, విడివిడిగానో, కలిసో, లేఖల ద్వారానో  క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని పెద్దాయనకు తెలియజేయడం తక్షణావసరం. ఈ ప్రముఖుల మౌనం (కాన్సిపిరేసీ ఆఫ్ సైలెన్స్) రాష్ట్రానికే కాదు, ఆయనకూ ప్రమాదకరం.  

బలిదానాల వల్ల ఏర్పడిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే బాధ్యత కేసీఆర్ ఒక్కరిదే అనుకోరాదు. కనీసం వచ్చే రెండేళ్లు రాజకీయాలకు అతీతంగా, తెలంగాణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయడం ఒక్కటే అమరవీరులకు నిజమైన నివాళి. నిరంకుశత్వంతో ప్రభుత్వం, అధికారకాంక్షతో బీజేపీ, పట్టుకోసం కాంగ్రెస్ పరిస్థితులను దారుణంగా దిగజారుస్తున్నాయి. కమలం కన్నా గులాబీనే మిన్న అని భావించే బుద్ధిజీవుల్లో నిరాశ, నిస్పృహ, ఆగ్రహం పెరగక ముందే మేల్కొంటే సర్కార్ కు మంచిది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 'వొడువని ముచ్చట'లో ఒకచోట అన్నట్టు- 'తప్పులు రిపీట్జేస్తూ పోతావా? సవరించుకుంట పోతావా? సవరించుకోవడానికి మ్యూచువల్ కాన్ఫిడెన్స్ గావాలె." పాలనలో సర్వం తానై వ్యవహరిస్తున్న కేసీఆర్ కుటుంబ బాంధవ్యాలను పక్కనపెట్టి  పెద్దరికంతో తప్పొప్పుల మీద చిత్తశుద్ధితో మధ్యంతర సమీక్ష జరిపి సవరణలు చేసుకోవాలి. ఈ కసరత్తును ఎవరూ నామోషీగా భావించాల్సిన అవసరం లేదు. సకాలంలో  దిద్దుబాటుకు ఉపక్రమిస్తే నిజంగానే పీకేవాళ్ళు ఎవ్వరూ ఉండరు, పీకే (ప్రశాంత్ కిషోర్) అవసరమూ ఉండదు. ఆరంభంలో పేర్కొన్న అర శాతం మహానేతల జాబితాలో చేరే సువర్ణావకాశాన్ని కేసీఆర్ వదులుకోకూడదు.
పిదపకాలంలో వచ్చే పిదపబుద్ధులకు విరుగుడు మందు ఒక్కటే: ప్రజాస్వామ్యాన్ని మనసావాచాకర్మణః నమ్మడం, ప్రజాస్వామ్య స్పూర్తితో మెలగడం.
(The End) 

Tuesday, June 15, 2021

జైలు నుంచి జర్నలిస్టు రఘు విడుదల: పోరాటం సాగుతుందని ఉద్ఘాటన

సినిమాల్లో విలన్ల మాదిరిగా మఫ్టీ పోలీసులు కారులోకి బలవంతంగా ఎక్కించి బంధించి తీసుకుపోయి తరువాట్స్ అరెస్టుగా చూపిన సాహసోపేత 'తొలి వెలుగు' యూ ట్యూబ్ ఛానల్ జర్నలిస్టు గంజి రఘు 13 రోజుల జైలు నిర్బంధం నుంచి బెయిలుపై ఈ రోజు (జూన్ 15, 2021) విడుదలయ్యారు.  అక్రమ అరెస్టు ద్వారా తనకు ప్రజలపై బాధ్యతను మరింత పెంచిన "కుటుంబ సపరివారానికి" కృతజ్ఞలు చెబుతూ.... గొంతులో ప్రాణం ఉన్నంతవరకూ జర్నలిస్టుగా తనపై ఉన్న బాధ్యతను నిర్వర్తిస్తానని అయన ప్రకటించారు. నిర్బంధించిన కారులో వెళుతుండగా తన భార్య ఫోన్ కాల్ ను  పోలీసులు తీసుకోనివ్వలేదని, తన గురించి ఒక మెసేజ్ పెట్టాలని కోరినా అవహేళనగా నవ్వారని రఘు చెప్పారు. 

హైదరాబాద్ లోని మల్కాజిగిరిలో ఈ నెల మూడో తేదీ ఉదయం  9.46 నిమిషాలకు రోడ్డు పక్కన మామిడిపళ్ళు కొనుక్కుంటున్న రఘును ఇద్దరు దృఢకాయులు కారు దాకా రెక్కలు పట్టుకుని తోసుకుపోగా మరొక ఇద్దరు కలిసి ఆయన్ను తెల్ల కారులోకి బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారు. గుర్రంపోడు తండా భూముల కేసులో ర‌ఘును 12.45నిమిషాల‌కు అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు ర‌ఘు కుటుంబ స‌భ్యుల‌కు మ‌ధ్యాహ్నం 1.30గంట‌ల‌కు స‌మాచారం ఇచ్చారు. 

ఈ లోగా రఘును బలవంతంగా మఫ్టీ పోలీసులు కారులో తీసుకుపోయిన సీసీ టీవీ విజువల్స్ సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి. అధికార పార్టీ నేతల భూ ఆక్రమణలను వెలుగులోకి తెస్తున్నందుకే, జర్నలిస్టుకు ఒక హెచ్చరికలా ఉండేందుకు పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు జర్నలిస్టులు ఆరోపించారు. రఘు అరెస్టు కు వ్యతిరేకంగా జర్నలిస్టులు, మేధావులు నిరసన కూడా చేపట్టారు. రఘు శ్రీమతి ప్రధాన మంత్రికి లేఖ కూడా రాశారు. 

రఘు అరెస్టు చంద్రశేఖర్ రావు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. 

Sunday, June 6, 2021

'నమస్తే తెలంగాణ'కు పదేళ్ళు- మన సురేంద్ర కు 'ది హిందూ' లో పాతికేళ్ళు

(డాక్టర్ ఎస్. రాము)

'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి' పత్రికలకు దీటుగా 'సాక్షి' పుట్టుకొస్తే...ప్రత్యేక తెలంగాణకు గొంతుకగా నిలవాలని 'నమస్తే తెలంగాణా' ఆవిర్భవించింది. ఈ రోజు పదేళ్ల పుట్టినరోజు జరుపుకుంటున్న 'నమస్తే తెలంగాణా' యాజమాన్యానికి, అన్ని విభాగాల సిబ్బందికి శుభాకాంక్షలు. ఈ పత్రిక తెలంగాణా హృదయ స్పందనై వందేళ్లు పయనించాలని, ప్రజలకు మెరుగైన జీవనం ఇవ్వడంలో తోడ్పడాలని కోరుకుందాం. 

రాజకీయ రాగద్వేషాలు అనేవి  మీడియా యాజమాన్యాల విధానంలో భాగమైనందున, ఈ పత్రిక అధికార పార్టీ మౌత్ పీస్ అని మొత్తుకోవడం కన్నా పత్రికకు అభినందనలు చెప్పడం ఉత్తమం. అన్ని పత్రికలకు ఉన్నట్లే ఈ పత్రిక యానంలోనూ మెరుపులు, మరకలు ఉన్నాయి. అల్లం నారాయణ గారు, కట్టా శేఖర్ రెడ్డి గార్ల తర్వాత యువకుడైన తిగుళ్ల కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఎడిటర్ గా ఉన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో బాగా నలిగిన కృ.తి. సంపాదకత్వంలో మరింత పురోభివృద్ధి సాధిస్తుందని ఆశిద్దాం. 

పదేళ్ల సందర్భంగా ఈ రోజు నమస్తే తెలంగాణా మొదటి పేజీలో వచ్చిన ఈ కింది శ్లోకం బాగుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని సంకల్పంగా చెప్పుకోవడం మంచి విషయం. దీన్ని తు.చ. తప్పకుండా  జర్నలిజంలో చేయకూడని పనులు చేయకుండా ఉండడం అందరు జర్నలిస్టుల పరమావధి కావాలని ఆశించడంలో మంచిది.  



గర్వించదగిన కార్టూనిస్టు సురేంద్ర గారు 

తెలుగు జాతి గర్వించదగిన కార్టూనిస్టు సురేంద్ర గారు ప్రసిద్ధ ఆంగ్ల దినపత్రిక 'ది హిందూ' కు సేవలందించడం ఈ రోజుతో పాతికేళ్ళు అయ్యింది. వారికి శుభాకాంక్షలు. ఒక తెలుగు కార్టూనిస్టును కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి మెరుగైన కార్టూనిస్టుగా తీర్చిదిద్దిన యాజమాన్యానికి అభినందనలు. ఒక వెబ్ సైట్ కోసం నేను 2016లో సురేంద్ర గారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. ఆ వివారాలు ఇక్కడ చూడవచ్చు. 

https://www.telugu360.com/interview-hindus-surendra-self-made-gifted-cartoonist/

ఈ రోజే సురేంద్ర గారి జన్మదినోత్సవమని తెలిసింది. వారికి బర్త్ డే గ్రీటింగ్స్. 

Thursday, June 3, 2021

విధ్వంసం రేకెత్తించకుండా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రజలకుంది: జర్నలిస్టు వినోద్ దువా కేసులో సుప్రీంకోర్టు

ప్రభుత్వం, దాని విభాగాలు తీసుకున్న చర్యలపై వ్యాఖ్య చేసే లేదా వాటిని విమర్శించే హక్కు ప్రజలకు ఉందని భారత దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. అయితే ఆ వాఖ్యలు లేదా విమర్శలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విధ్వంసం రేకెత్తేలా రెచ్చకొట్టకుండా, సమాజంలో అస్తవ్యస్థ పరిస్థితి సృష్టించకుండా ఉండాలని చెప్పింది. 

సీనియర్ జర్నలిస్టు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వినోద్ దువా పై ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ లో మే, 2020 లో పెట్టిన దేశద్రోహం (సెక్షన్ 124 ఏ)తదితర అభియోగాలు చెల్లవని చెబుతూ గురువారం (జూన్ 3, 2021) జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ వినీత్ శరణ్ లతో కూడిన బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది. 

ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వినోద్ దువా యూ ట్యూబ్ ఛానెల్ లో చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయని, ఆయన్ను అరెస్టు చేయాలని ఒక బీజేపీ నాయకుడు పెట్టిన కేసుపై సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు చెప్పింది. 1962 లో కేదార్నాథ్ సింగ్ కేసులో పేర్కొన్నట్లు ప్రతి జర్నలిస్టు రక్షణ పొందడానికి అర్హుడని కూడా స్పష్టంచేసింది. అయితే, మీడియాలో పదేళ్ల అనుభవం ఉన్నవారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయకుండా చూడాలన్న విన్నపాన్ని కోర్టు తోసిపుచ్చింది.  

కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, తీర్పు కాపీ LiveLaw.in లో ఇక్కడ చూడవచ్చు. 

https://www.facebook.com/421878521234688/posts/4131063860316117/?sfnsn=wiwspwa


Friday, May 21, 2021

ఆనందయ్య గారి వైద్యం ఆపడం ఎందుకయ్యా!

(పర్వతాల శరభయ్య) 

ప్రత్యామ్నాయ వైద్య విధానాలు భారత దేశ ప్రత్యేకతల్లో ఒకటి. దేవుడి మహిమలు ఆయన్ను నమ్మేవారికి మాత్రమే తెలిసినట్లు, ఈ వైద్యం ప్రభావం దాన్ని అనుసరించి అనుభవించే వారికే తెలుస్తుంది... శాస్త్రీయతా, హేతుబద్ధతా.. భంగు...భోషాణం అనే వారి ఏడుపులు ఎట్లావున్నా. శాస్త్రీయ దృక్పథం పెంచాలని రాజ్యాంగంలో రాసుకున్నా... మానవ జీవితంలో చాలా విషయాలు సైన్స్ కు అందకుండానే ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కొన్నిటికి లాజిక్ ఉండదని చాలా మందికి అనుభవాలు నేర్పిన పాఠం. దీని మీద సిద్ధాంత రాద్ధాంతాలు నిష్ఫలం.   

మారణహోమం సృష్టిస్తున్న కొవిడ్ కట్టడికి మందు కనిపెట్టే బృహత్ పనిలో ఆధునిక వైద్యం, అవకాశాన్ని అందిపుచ్చుకుని చచ్చేలా లాభాలు ఆర్జిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు, వైద్య సౌకర్యాలు లేక ప్రభుత్వాలు, ఏ మందు సరిగా పనిచేస్తుందో తెలిచ్చావక కొందరు డాక్టర్లు, మిడిమిడి జ్ఞానంతో మరికొందరు వైద్యులు జనాలను చంపేస్తుంటే....చావుకబుర్లను ఆపేలా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి ఒక శుభవార్త  వచ్చింది. బొనిగే ఆనందయ్య గారు వివిధ దినుసులతో ఉడికించి తయారుచేసిన మూడు రకాల మందులు పనిచేస్తున్నట్లు వచ్చిన వార్తలు హనుమాన్ వెళ్లి లక్ష్మణుడికోసం సంజీవినిని తెచ్చినట్లయ్యింది.  

సాదాసీదాగా ఉన్న ఆ పెద్దాయన పెద్దమనసుతో సొంత డబ్బులు పెట్టి అయన పనేదో ఆయన చేసుకున్నాడు... నిన్నటిదాకా. ఊళ్ళో వాళ్లకు గురి కుదిరింది. అక్కడ కేసులు లేవట. చావులు కూడా నిల్లని అంటున్నారు. కొవిడ్ తగ్గిన వాళ్ళు సోషల్ మీడియాలో ఆనందం, ఆశ్చర్యం వ్యక్తంచేయడంతో పాటు స్థానిక రాజకీయులు రంగప్రవేశం చేయడంలో మొత్తం వ్యవహారం కంపై కూర్చుంది. స్థానిక అధికారపార్టీ ఎం ఎల్ ఏ గారు అనవసరంగా... ఈ రోజు (శుక్రవారం) నుంచి పంపిణీ చేసేస్తామని గొప్పగా ప్రకటించడంతో రద్దీ పెరిగింది. ఒక ప్రభుత్వ కమిటీ దాని మీద ఒక నివేదిక కూడా మందుకు చాలావరకు అనుకూలంగా ఇవ్వడంతో ఇక కొవిడ్, కార్పొరేట్ బాధితుల్లో ప్రాణం లేచివచ్చింది.  హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో నరకయాతన పడుతున్న వాళ్ళు అంబులెన్స్ లలో  కృష్ణపట్నం దారిపట్టారు. నెల్లూరు జిల్లాలో కిక్కిరిసిన ఆసుపత్రులలో రద్దీ తగ్గడం, నిన్నటిదాకా దొరకని బెడ్లు క్రమంగా ఖాళీ కావడం మొదలయ్యిందట.  

పాపం... ఆనందయ్య గారు ఏదీ దాచుకోకుండా... ఏ ఏ దినుసులతో మందు తయారుచేస్తున్నదీ చెప్పారు. ప్రభుత్వానికి చేరిన నివేదికలో ఇది స్పష్టంగా ఉంది. అయినా.... ఈ రోజు ఒక మూడు నాలుగు వేల మందికి మందిచ్చే అవకాశం ఉన్నా ఆపడం, ఆయన్ను పోలీస్టేషన్ కు తీసుకుపోవడం అస్సలు బాగోలేదు. చాలా మంది చావుబతుకుల మధ్య అక్కడ చిక్కుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అక్కడికి చేరిన వారికైనా మందు ఇవ్వనివ్వాలి. ప్రతిదాన్నీ సైన్స్ కు ముడిపెట్టి చూసే సైన్టిఫిక్ మూర్ఖుల అభ్యంతరాలు చూసి, ఎవరో వచ్చి ఏదో చేసి సర్టిఫికెట్ ఇచ్చేదాకా ఆగుదామంటే కుదరదు. ప్రభుత్వం వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలి. 

అయ్యా...ఆనందయ్య గారు జనాలను మంటల్లో వేస్తున్నాడో, చెంపలు వాయిస్తున్నాడో, అశుద్ధం తినమంటున్నాడో అంటే మనకు అర్జంటుగా అభ్యంతరం ఉండాలి. దినుసులేంటో చెప్పినాక కూడా వైద్యం ఆపడం ఎందుకు? సైన్స్ బాబాలు చెబుతున్న మందులు, స్టెరాయిడ్లు వంద శాతం పనిచేస్తున్నాయని మీ దగ్గర ఒక సాక్ష్యం ఉంటే అది వేరే సంగతి. అపుడు కృష్ణపట్నం పోనివ్వద్దు. ఇక్కడ సరైన వైద్యం తెలియక పిట్టల్లా జనాలు రాలుతున్నారు. భయంతో జనం గుండెలు మిగులుతున్నాయి. ఆధునిక వైద్యుల చేతిలో రోగులు గినియా పిగ్స్ అయి...నరాల్లో స్టెరాయిడ్స్ ఏరులై...చివరకు రోగులు ఒక్క పూటలోనే శవాలై... అనాధల్లా దహనమై పోతున్నారు. డబ్బుకు డబ్బు వదులుతున్నది. ప్రాణాలకు ప్రాణాలు పోతున్నాయి. ఏంట్రా బాబూ ఇదని అడిగితే... మ్యూటేషన్, గిటేషన్ అని సొల్లు చెబుతున్నారు. ఒక్కళ్ళ దగ్గరా ఒక్క చావు గురించీ సైన్టిఫిక్ వెర్షన్ లేదు. హార్ట్ ఫెయిల్ అన్నది కామన్ సానుగుడయ్యింది. అడిగేవాడే లేని హత్యాకాండ అయ్యింది. 

టీకాలు వేసుకున్నాక కూడా కొవిడ్ సోకుతుంది. పోయేవాళ్లు పోతున్నారు. టీకాలు వేయకముందు బాగుండి ... వేశాక గుటుక్కుమన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది టీకాను తప్పుబట్టడం కాదు. భయంకరమైన అనిశ్చితి గురించి చెప్పడం మాత్రమే. తీవ్రమైన అనిశ్చితి  సృష్టిస్తున్న వైరస్ మూలంగా మనం తీవ్రాతితీవ్రమైన గందరగోళంలో ఉన్నాం. తరచిచూస్తే ఇప్పుడు ట్రయిల్ అండ్ ఎర్రర్ యవ్వారం నడుస్తోంది. ఇవ్వాళ్ళ ప్రాణ ప్రదాత అనే ఇంజెక్షన్ రేపు 'నో నో' అయిపోతున్నది. క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరైడ్, రెండిసీవిర్... అన్నింటి గురించి రోజుకో మాట చెప్పారే. ఖండితంగా వర్కవుట్ అయిన ఒక్క ప్రోటోకాల్ అయినా తయారు కాలేదే! మందు లేని జబ్బుకు... లక్షలు గుంజుతున్నారే! ఈ స్థితిలో కృష్ణపట్నం స్వామిని కట్టేయడం ఏమి భావ్యం? 

ఇంకో మాట... ఆనందయ్య గారి వైద్యం పనికిరాని చెత్తే అనుకుందాం. అది తేలనివ్వండి. అప్పుడు చూద్దాం. అయినా సరే నమ్మకంతో జనం ఉన్నారు కాబట్టి... చాలా మందికి తగ్గిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి.... ప్రస్తుతానికి కానివ్వండి. శాస్త్రీయులు నమ్మే ప్లాసిబో ప్రభావం అనే పరమ శాస్త్రీయ సిద్ధాంతానికి కట్టుబడైనా సరే  అయన పని ఆయన్ను చేయనివ్వండి. తర్వాత సంగతి తర్వాత!

Tuesday, May 11, 2021

అమ్మలారా...అయ్యలారా.... పది రోజులు పదిలంగా ఉండరా...

కొవిడ్-1 అపుడు ఉన్న ఊపు ఇప్పుడు ఏ ప్రభుత్వంలో కనిపించడంలేదు... వైరస్ సృష్టించిన పెను ఉత్పాతం కారణంగా. రెండో తరంగం ప్రతి ఇంటినీ పట్టికుదుపుతూ మరణ మృదంగం వినిపిస్తుంటే ప్రజలు భయంతో బెంబేలెత్తుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ సిలిండర్లు లభించక, మందులు సకాలంలో దొరక్క,  మన దగ్గర తయారైన టీకాలు మనకే అందుబాటులో లేక అగమ్యగోచరమై... యావత్ భారతం వణికిపోతుంటే....పాలకులు పాలిటిక్స్ మీద దృష్టిపెట్టి పరిస్థితిని భ్రష్టుపట్టించారు. బతికుంటే చాల్రా నాయనా... అని సామాన్యులు బిక్కుబిక్కున బతుకుతున్నారు.  

భారత్ లో బాధితుల ఆక్రందనలు విని చలించి... 'లాక్ డౌన్ విధించండి... తాత్కాలిక ప్రాతిపదికన ఆసుపత్రులు తెరవండి... సైన్యం సాయం తీసుకోండ'ని విదేశీ నిపుణులు సైతం మొత్తుకుంటున్నా కేంద్రప్రభుత్వం స్పందించకుండా రాష్ట్రాలకే నిర్ణయం అప్పగించింది. పరిస్థితి విషమించడంతో కోర్టులు సైతం బెత్తం పట్టుకోవాల్సివచ్చింది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు ముందే స్పందించగా.. మొత్తమ్మీద తెలంగాణా ప్రభుత్వం ఈ రోజు భోజనాలయ్యాక లాక్ డౌన్ పై నిర్ణయం ప్రకటించింది. 

తెలంగాణ వ్యాప్తంగా బుధవారం (మే 12, 2021) ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం ఉంటుందని పేర్కొంది. లాక్‌డౌన్‌ కొనసాగింపుపైమళ్ళీ 20న కేబినెట్‌ సమావేశమై పరిస్థితి సమీక్షించి  నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో నడవనున్నాయి. లాక్‌డౌన్‌ నుంచి వ్యవసాయరంగానికి మినహాయింపునిచ్చారు. రాష్ట్రంలో యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి హామీ పనులు కొనసాగనున్నాయి. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

లాక్ డౌన్ ప్రకటన వచ్చిందో లేదో జనం రోడ్ల మీద పడ్డారు. పెట్రోల్ బంకులు సర్లే గానీ... మందుషాపుల ముందు బారులు తీరి ఉన్నారు. అక్కడ భౌతిక దూరం గట్రా ఏమీ లేకుండా... స్కైలాబ్ పడుతుందన్నట్లు... ఈ మందు లేకపోతె చస్తామన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇది దారుణం. ఒరేయ్ నాయనా....చస్తార్రా బాబూ... కొద్దిగా సోయిలోకి రండి. 

ఇది ప్రజలు బాధ్యతతో మెలగాల్సిన సమయం. వచ్చే పది రోజులు కాస్త కఠినంగా క్రమశిక్షణతో ఉంటే పరిస్థితులు చక్కబడేలా ఉన్నాయి. ఈ లోపు ఏ పొడులో, మాత్రలో వస్తాయి మనల్ను ఆదుకోవడానికి.  ప్రతి ఒక్కరూ పెద్ద యుద్ధం చేస్తున్న సైనికుల్లా వ్యవహరించకపోతే మరిన్ని మరణాలు చూడాల్సివస్తుంది. బీ కేర్ఫుల్. 

Monday, May 10, 2021

ఇదేమి ఖర్మరా నాయనా.... ఇవేమి రోజులురా దేవుడా....

పొద్దున్నేఆరు గంటల లోపు ఫ్రెష్ గా  లేవడం...
ఊళ్ళో ఉన్న అమ్మతో ఫోన్ లో మాట్లాడడం.... 
గోడ ఆసరా గట్రా లేకుండా శీర్షాసనం వేయడం.... 
ఆయనెవరో కరోనా-1 టైం లో చెప్పిన చప్పట్ల కసరత్తు చేయడం... 
టీనో, తేనే నిమ్మరసమో తాగడం... 
భార్యతో కలిసి కబుర్లాడుతూ పార్కులో ఒక ఐదు రౌండ్లు నడవడం... 
మరో ఐదు రౌండ్లు స్లో రన్నింగ్, తర్వాత శ్వాస సంబంధ ఎక్సర్సైజ్లు చేయడం...
వచ్చాక పేపర్ చూస్తూ ఒక కప్పు కాఫీనో, టీనో తాగి కూరలు లేదా సరుకులు తేవడం...  
స్నానానంతరం టిఫిన్ బిగించి జర్నలిజం పిల్లలకు ఆన్లైన్ క్లాసు ఆనందంగా చెప్పడం...  
భార్యతో కలిసి కూర్చుని మాట్లాడుతూ మంచి భోజనం చేయడం.... 
ఫోనులో వీడియోలు చూస్తూ నిద్రలోకి జారి ఒక గంటకు పైగా కునుకు తీయడం...
సాయంత్రం ఒక టీ తాగి రేపటి క్లాసుకో, రాయాల్సిన వ్యాసం కోసమో చదవడం... 
మధ్యలో ఆర్కే కు ఫోన్ చేసి ఒక అర్థగంటకు పైగా కబుర్లాడడం... 
ఎనిమిది గంటలకల్లా డిన్నర్ తినడం....
నాన్నతో ఫోన్ లో మాట్టాడడం...  
భార్యా పిల్లలతో కలిసి కాసేపు సినిమా చూడడం....
తొమ్మిది, పది గంటలకల్లా నిద్రలోకి వెళ్లిపోవడం...
గుర్రుకొట్టి నిద్రపోవడం.... 

-కరోనా కుమ్మేయకముందు రోజులు అటూ ఇటుగా ఇట్లానే గడిచాయి. ఇప్పుడు కథ మారింది, వ్యధ మిగిలింది. 

ఏడు గంటలకు బద్ధకంగా లేవడం... అమ్మ ఫోన్ తో... 
బైటికి పోతే గాల్లో తేలే కరోనా కళ్ళగుండా వస్తుందని గుర్తుచేసుకోవడం...
కళ్ళు మండుతుండగా... బ్రష్ చేసి... 
మూడుంటే శీర్షాసనం వేసి... ఎక్సర్ సైజ్ మ్యాట్ మీద కాళ్ళూ చేతులూ కదల్చడం.... 
బైట పడి ఉన్న పేపర్ల కట్ట మీద కరోనా ఉందన్న భయంతో చూస్తూ టీ తాగడం .... 
టిఫినీ తినడం.... తెల్లారగట్టా పీడకల వచ్చినందువల్ల మరో కునుకు తీయడం.... 
జర్నలిజం క్లాసు చెప్పడం... 
ఏ దుర్వార్తా లేకపోతే పొట్టనిండా లంచ్ చేయడం.... (మే 5 నుంచి రోజూ ఒక మిత్రుడు పోయారు). 
పేస్ బుక్కు లో వార్తలు లేదా నివాళులు చూస్తూ నిద్రపోవడం... 
లేచి ఎవరితో మాట్లాడాలా (ఆర్కే ని కబళించింది) అని చూసి ఎవ్వరితో మాట్లాడకపోవడం... 
లెస్సన్ ప్రిపేర్ కావడం, లేదా వ్యాసం రాయడం... 
ఈ రోజు పోయిన మిత్రుడి గురించి మనసు స్పందిస్తే బ్లాగడం.... 
ఈ లోపు ఇంట్లో ఎవరికీ తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా... ఉలిక్కిపడడం.... 
తొమ్మిది గంటలకు రెండు మెతుకులు తినడం.... 
కాసేపు టీవీ (వార్తలు కాదు) చూడడం... 
మళ్ళీ ఫోన్ చూస్తూ కూర్చోవడం....
ఆ రోజు పోయిన మనిషి గురించి మాట్లాడుకోవడం....
మారిన కరోనా ఉత్పరివర్తనంపై కథనాలు చూడడం.... 
స్పెయిన్ లో ఉన్న కుమారుడితో మాట్లాడడం...  
భారంగా 12 గంటల ప్రాంతంలో నిద్రపోవడం...   

ఇట్లానే ఒకటి రెండు నెలలు అయితే... లంగ్స్ లోకి దూరి కరోనానే చెప్పక్కర్లేదు రాజా.... 
బైటికి కదలకుండా, స్వేచ్ఛగా గాలిపీల్చకుండా కొంపలోనే మగ్గుతూ ఛస్తే...చచ్చి ఊరుకుంటాం. 
మొదటి ఫేసు లో ఇంతలా చావులు లేవుకాబట్టి... ఇంటికి పరిమితం కావడం కొత్తకాబట్టి బాగానే గడిచింది. ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. మన అనుకున్న ఎందరినో పట్టుకుని పీడించింది... పీడిస్తోంది. 

ఇదేమి ఖర్మరా నాయనా.... ఇవేమి రోజులురా దేవుడా.... 
చాలు స్వామీ... ఇక ఆపేయ్! 

Wednesday, May 5, 2021

సూపర్ జర్నలిస్టు భళ్ళమూడి రామకృష్ణ (ఆర్కే)కు అశ్రు నివాళి!

తెలుగు జర్నలిజంలో బాగా రాసేవారు (only writing-committed to the profession)... బాగా మేసేవారు (only corruption-as much as possible), బాగా కూసేవారు (Only talking-in studios)...బాగా చేసేవారు (Only recommendations-for everything)...  బాగా నాకే వారు (Only praising-the government) ఉన్నారు. ఇందులో మొదటి రకం పక్కా ప్రొఫెషనల్స్ కొరత ఎంతో ఉంది. ఇది కాక... నాణ్యత పెంచడానికి వృత్తినిబద్ధతతో ప్రయత్నంచేసే వారు బహు అరుదు. 

వృత్తి సంబంధ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే... తాను నేర్చిన విద్యను నలుగురికి పంచడం బాధ్యతగా భావిస్తూ... అందులో తృప్తిని వెతుక్కున్న జర్నలిస్టు భళ్ళమూడి రామకృష్ణ (ఆర్కే). కరోనా పై పోరాడుతూ అయన ఈ ఉదయం గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. అయన వయస్సు 54 సంవత్సరాలు. భార్య వందన, కూతురు శ్రీలాస్య ఉన్నారు. 

విజయనగరం జిల్లా బొబ్బిలిలో 29-08-1967న  విద్యాధికుల కుటుంబంలో జన్మించిన ఆర్కే (పాలొలికే బుగ్గలతో ఉంటాడు కాబట్టి 'పాలబాబు' అని ఇంట్లో ముద్దుగా పిలుస్తారు) ఎం ఎస్సీ-ఫిజిక్స్ చదివాడు. ఆంగ్ల బోధకుడైన తండ్రి నుంచి వారసత్వంగా సాహిత్యాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన జర్నలిజంపై మక్కువతో 1991-92 లో "ఈనాడు" కంట్రిబ్యూటర్ గా చేరాడు. "ఈనాడు జర్నలిజం స్కూల్" లో 1993లో చేరి బ్యాచ్ ఫస్టు వచ్చారు. సంస్థ గుండెకాయగా భావించే జనరల్ డెస్క్ లో చేరి తెలుగు, ఇంగ్లిష్ భాషా సామర్ధ్యం మెండుగా ఉండడం వల్ల మంచి పేరు తెచ్చుకున్నాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడే జర్నలిజం స్కూల్ పిల్లలకు క్లాసులు తీసుకునేవాడు. డెస్కులో చేరిన కొత్త వారికి నిలదొక్కుకోవడానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. 



'సార్... ఎన్టీఆర్ ను కాదని మనం చంద్రబాబును ఎందుకు సమర్ధించాలి?' అని ఒక సంస్థాగత మీటింగులో ఈనాడు ఛైర్మన్ రామోజీ రావు గారిని ఆనాడు అమాయకంగానైనా సూటిగా అడిగి ఒక 30 నిమిషాల పాటు పెద్దాయన వివరణ ఇచ్చేలా చేసిన మొనగాడు... ఆర్కే. పదవులు రావనో... తొక్కేస్తారనో తను ఎన్నడూ భయపడలేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో, రాయడంలో  భయమెందుకు? అన్నదే ఏకైన సూత్రం. ఇది చేసిన నష్టం భారీగానే ఉన్నా... రాజీ పడకుండా ఇబ్బందిపడుతూనైనా బండి నడిపాడు. 

ఆర్కే ప్రతిభను గమనించి ఈనాడు యాజమాన్యం... అప్పుడే కొత్తగా వస్తున్న మాధ్యమం ఈ-టీవీ కి పంపింది. అక్కడా తనదైన ముద్రవేశాడు. ఎందరో మెరికలను తయారుచేశాడు. తర్వాత ఎన్-టీవీ, ఐ-న్యూస్ ఛానల్స్ లో పనిచేసి ప్రింట్ జర్నలిజం వైపు మారాడు. డెక్కన్ క్రానికల్, హన్స్ ఇండియా లలో పనిచేసిన ఆర్కే చివరకు ఆంధ్రజ్యోతిలో చేరాడు. "నాణ్యత కోసం నేను పడిన తాపత్రయాన్ని పొగరుగానో మారేదనో అనుకున్న వాళ్ళు ఉన్నారు. కొందరు ఛానెల్స్ లో నాకు మంచి అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు," అని ఆర్కే అన్నాడు. వ్యాస రచయిత రాము, రామకృష్ణ ఈనాడు రోజుల్లో దిగిన ఫోటో ఈ పైన ఉంది. 
 
ఆర్కే శివైక్యం చెందిన సందర్భంగా ఈ రోజు రాసిన లేఖ ఇదీ:::::


పాలబాబూ.... 
రెండు రోజుల్లో కోలుకుంటావని అందరం అనుకుంటే... ఏంటి బ్రదర్ 54 ఏళ్లకే ఇలా వెళ్లిపోయావ్? 
మూడు నాలుగు నెల్లుగా దాదాపు రోజూ గంట చొప్పున మాట్లాడుకున్నాం. ఎన్నోటి విషయాలు చర్చించుకున్నాం! జర్నలిజం, ప్రపంచ విశేషాలు, లోకల్ రాజకీయాలు, భోజనాలు, జనాలు...ఎన్నని విశ్లేషించాం! అవే నాకు మధురానుభూతిగా మిగిల్చి పోయావ్. నిజానికి, నీతో ఈనాడు లో జనరల్ డెస్క్ లో పోటీపడి రాసిన బ్యానర్లు, నువ్వు పడిపడినవ్విన బోలెడన్ని హెడ్డింగులు ఎప్పటికీ గుర్తుంటాయి. వీటితో పాటు, చింతల్ బస్తీ మెస్ లో మనం తిన్న ములంగ కాడలు, వస్తూ వస్తూ వేసుకున్న స్వీట్ పాన్లు, పండిన నోటితో చిద్విలాసంగా నువ్వు  నడిచి వస్తుంటే... 'అయ్యా.... ఆర్కే..' అని ఒక డెస్క్ ఇంచార్జ్ చేసిన వ్యాఖ్యలు.... ఎప్పుడూ మరచిపోను. డ్యూటీ అయ్యాక నిమ్స్ ప్రాంగణంలో తాగిన టీలు, తిన్న మిర్చి బజ్జీలు.... 
దీంతో పాటు నా 'సావిర్జినిటి', నీ ' వర్జీనియా వూల్ఫ్'  నా మదిలో ఆనందంగా నిలిచిపోతాయి. ఎంత బనాయించావురా... 'రాజకీయ ఆర్తి-భంగపడ్డ మూర్తి' శీర్షికను! నీ హాస్య ప్రియత్వం, సంభాషణా చతురత, సునిశిత విశ్లేషణా సామర్థ్యం ఎల్లకాలం గుర్తుండి పోతాయి. 

నేను ఏప్రిల్ లో రెండు రోజులు వరసగా థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసి వస్తే... కొవిడ్ ను పట్టించుకోకుండా ఏంటిదని మందలించావే! ఎన్ని జాగ్రత్తలు చెప్పావ్! చూడరా అన్నా... ఈ పాడు కోవిడ్ కనీసం నిన్ను కలవకుండా...చేసింది. నీకో దండ వేసి దండం పెడదామని నేను, హేమ సిద్ధమవుతుంటే...ఆ జీ హెచ్ ఎం సీ వాళ్ళు అంబర్ పేట కు ఆల్రెడీ తీసుకుపోతున్నారని చెప్పారు. పంచభూతాల్లో నీవు లీనమయ్యే లోపే ఇది రాయాలనుకున్నా. దుఃఖం ఆగడం లేదురా అన్నా. నువ్వు ఆసుపత్రిలో చేరాక... మాట్లాడాల్సింది. నీకు అది డిస్ట్రబెన్స్ అవుతుందనుకున్నారా అన్నా. ఘోరమైన తప్పు జరిగిపోయిందే!
 
ఎందుకురా.... నువ్వు నీ మరణం గురించి నాతో అంత లోతుగా చర్చించావ్? ఈ మధ్యనే రెండు మూడు సార్లు ఇదే ప్రస్తావించావ్.  ఇప్పుడు అర్థమయ్యింది ఆర్కే. 'నాకు ఏదైనా అయితే వీళ్లకు (వందన గారికి, లాస్యకు) అండగా ఉండాలి," అని నువ్వు మాటిమాటికీ చెబితే నేను నిన్ను తిట్టా... పిచ్చివాగుడు ఆపాలని. నువ్వు మాట ఇవ్వాలని పట్టుపట్టినప్పుడు నాకు అర్థంకాలేదు అన్నా. బహుశా నువ్వు ఊహించినట్లే దాటిపోయావ్ మా అందరినీ వదిలేసి. నేను మాటకు కట్టుబడి ఉంటారా... అన్నా. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ వాళ్ళిద్దరికీ నేను, నా కుటుంబం బాసటగా ఉంటాం. ఈ రోజు నేను చేస్తున్న పునరుద్ఘాటనరా ఇది. 
  
అన్నా... నువ్వు.. అద్భుతమైన ప్రతిభావంతుడివి. నిన్ను నిన్నుగా నేచురల్గా ఎదగనివ్వని, అవకాశాలకు అడ్డంపడిన వెధవ ఎవ్వడూ నీలా ఒక్క పేరా అయినా రాయలేడు. కొన్ని లెక్కలు కలిసొచ్చాయి వారికంతే. నిన్ను ఇంగ్లిష్ జర్నలిజంలో చేర్చాలని... మనం ఈనాడు లో ఉండగానే నిన్ను ఒక ది హిందూ జర్నలిస్టు దగ్గరికి తీసుకుపోయాం. కానీ ఈ లోపు ఈ-టీవీ లో వచ్చి దేశ రాజధానికి వెళ్లిపోయావ్. తర్వాత మనం దూరమైనా... హేమ ఎన్-టీవీ లో చేరాక వారానికి ఒక సారి మాట్లాడుకున్నాం. అవన్నీ మధుర అనుభూతులే. మధ్యలో చాలా అంతరం వచ్చినా.... గత ఏప్రిల్  ఇబ్బంది నుంచి నువ్వు బైటపడ్డాక... నేను రోజూ మాట్లాడాలని పెట్టుకుని మాట్లాడాను...  నువ్వు వేగంగా కోలుకుని హాయిగా ఉండాలని. ఈ నెల్లో అహోబిలం సహా కొన్ని ప్రాంతాలకు, మా ఊరికి వెళ్లాలని అనుకుంటే... అకస్మాత్తుగా వెళ్లిపోయావ్ మిత్రమా. 
నీ జీవితంలో, మరణంలో రెంటిలోనూ వ్యవస్థ వైఫల్యం, యాజమాన్యాల కర్కశత్వం, అపోహలతో కక్షగా మెలిగిన కొందరి రాక్షసత్వం ఉన్నాయి. మనం వాటిని కూలంకషంగా మాట్లాడుకున్నాం... నాకు అవన్నీ గుర్తు ఉంటాయి. వదిలేద్దాం. 
ఏడాదికి పైగా నువ్వు ఇంటి నుంచే పనిచేయడానికి సహకరించిన ఆంధ్ర జ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ గారికి, ఎడిటర్ శ్రీనివాస్ గారికి, సీనియర్ మిత్రుడు వక్కలంక రమణకు నీ తరఫున ఈ రోజున ధన్యవాదాలు. నిన్ను మామూలు మనిషిగా చూడాలని గట్టిగా అనుకున్న ఈనాడు ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్ మానుకొండ నాగేశ్వర రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కోవిడ్ పాజిటివ్ అని తెలిసినా గత వారం అయన మీ ఇంటికి వచ్చి మందులిచ్చి, అర్థగంట ఉండడమే కాదు... నీ ప్రాణాలు కాపాడేందుకు కొన్ని గంటల పాటు ఫోన్లో ఆయన అందుబాటులో ఉన్నారు. రేగళ్ల సంతోష్ నీ గురించి ఎంతో తపన పడ్డాడు. పాపం ఎన్ని ఫోన్ కాల్స్ టంచనుగా తీసుకుని తనకు చేతనైన సాయం చేశాడో! ఇతర మిత్రుల ప్రయత్నాలు, ప్రేయర్స్ వర్కవుట్ కాలేదు. మేము దురదృష్టవంతులం...అన్నా. 

నీతో పనిచేసిన, నీ నుంచి వృత్తిపరమైన నైపుణ్యాన్ని పొందిన అనేక మంది నాతో మాట్లాడారు. ఏమ్వోయ్, బ్రదర్, సోదరా... అని నువ్వు పిలిచిన వారూ కుమిలిపోతున్నారు. 
ఆర్కే... మేమంతా నీ ఆత్మకు శాంతి, స్వర్గలోక ప్రాప్తి కలగాలని ప్రార్థిస్తాం. అంతకు మించి మేమేమి చేయగలం. 

పాలబాబూ.... ఇక సెలవ్... 
నీ 'బోసమ్' ఫ్రెండ్'
రాము

Tuesday, May 4, 2021

మరో 'ఈనాడు' జర్నలిస్టుకు జగన్ సర్కార్ పదవి

'ఈనాడు' సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి ని ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ గా నియమించింది. ఆయనతో పాటు కాకర్ల చెన్నారెడ్డి కి కూడా పోస్టు దక్కింది.  

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ పేర్లను ఖరారు చేసి గవర్నర్‌ ఆమోదానికి పంపినట్లు ఒక ప్రకటన వెలువడింది. 

హరిప్రసాద్‌ రెడ్డి కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌నుంచి చరిత్రలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. రెండు దశాబ్దాలుగా పత్రికా రంగంలో ఉన్నారు. అయన భారత రాజ్యాంగ, సామాజిక, ఆర్థిక విషయాలపై ఈనాడు సంపాదకీయపు పేజీలో వేలాది వ్యాసాలు ప్రచురించారు. తన పూర్తి పేరుతోనే కాకుండా, ఇందిరా గోపాల్, శ్రీదీప్తి వంటి కలం పేర్లతో కూడా ఆయన ఆసక్తికరమైన వ్యాసాలు అందించారు. హోదాలతో సంబంధం లేకుండా అందరితో మర్యాదగా మాట్లాడే మృదుభాషిగా హరి ప్రసాద్ పేరు పొందారు. 


ఉత్తమ పాత్రికేయుడిగా నారద సమ్మాన్ అవార్డు, సృజన ఎక్సలెన్స్ అవార్డు వంటి పలు పురస్కారాలు అయన పొందారు. సమాచారాన్ని పారదర్శకంగా సామాన్యునికి చేరువ చేయడంలో, ప్రజలకు ప్రభుత్వ విభాగాలను మరింత జవాబుదారీగా ఉంచే విషయంలో సమాచార శాఖ కమిషనర్ గా తనదైన ముద్రవేసే సత్తా ఉన్న జర్నలిస్టు ఆయన. 

అయితే.... ఈనాడు సీఈబీ లో పనిచేసిన లేదా పనిచేస్తున్న వారికి జగన్ ప్రభుత్వంలో పదవి లభించడం ఇది రెండో సారి. ఇక్కడే పనిచేసిన జీవీడీ కృష్ణ మోహన్ 'సాక్షి' పెట్టిన కొత్తల్లోనే అందులో చేరారు. సాక్షిపై 'ఈనాడు' దాడిని పాయింట్ బై పాయింట్ తిప్పికొడుతూ 'ఏది నిజం' పేరుతో రాసిన అయన వ్యాసాలు సంచలనం సృష్టించాయి. తర్వాత జగన్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వానికి కమ్యూనికేషన్ సలహాదారుగా నియమితులై అద్భుతమైన సేవలు అందిస్తున్నారాయన.  

కృష్ణ మోహన్ తో కలిసి పనిచేసిన హరిప్రసాద్ కు ఇప్పుడు పదవి లభించింది. నిజానికి, పాఠకులకు సరిగా అర్థంకాని భాషలో సంపాదకీయాలు రాస్తున్నారన్న విమర్శ ఎదుర్కుంటున్న సీఈబీ ని సంస్కరించేలా సూచనలు ఇచ్ఛే బాధ్యతను రామోజీ రావు గారు ఈ ద్వయానికి అప్పట్లో అప్పగించారు. చాలా శ్రమించి వారిచ్చిన నివేదిక పూర్తిగా కార్యరూపం ధరించినట్లు లేదు!

Sunday, May 2, 2021

చెప్పి మరీ కొట్టిన ప్రశాంత్ కిషోర్... నిజ్జంగా మగాడ్రా బుజ్జీ

చేతిలో యావత్ కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం, జేబులో దండిగా వనరులు, పుష్కలంగా రాజకీయ రచనా దురంధరులు, క్రమశిక్షణ కలిగిన క్యాడర్ ఉన్నా... పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ అధినేత్రి  మమతా బెనర్జీ చేతిలో కమలనాథులు, ముఖ్యంగా నరేంద్ర మోదీ-అమిత్ షా ద్వయం- దెబ్బతినడానికి ముఖ్య కారణం... ఆమె సాహసోపేత రాజకీయ పోరాటంతో పాటు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పకడ్బందీ వ్యూహరచన, శాస్త్రీయ సాంకేతిక ప్రచార భేరి. 

దాదాపు ఒక ఏడాది నుంచీ వందల మంది సైనికుల లాంటి యువతీ యువకులతో కూడిన ఐ-పాక్ బృందం పీకే నేతృత్వంలో బీజేపీని ఆఫ్ లైన్, ఆన్ లైన్ దీటుగా ఎదుర్కొని నిలబడి విజయహాసం చేసింది. మోదీ, షా తో పాటు కేంద్ర మంత్రులు పెద్ద సంఖ్యలో ర్యాలీల్లో, సభల్లో పాల్గొని మమత ఖేల్ ఖతం అని చెప్పినా... బీజేపీ కి రెండంకెలను మించి సీట్లు రాబోవని పీకే ధీమాగా చెబుతూ వచ్చారు. ఆయన ట్వీట్స్ గానీ, టీవీ ఇంటర్వ్యూలు గానీ అర్థవంతంగా, ఆకట్టుకొనేవిగా ఉన్నాయి. 

డిసెంబర్ 21. 2020 నాడు పీకే ఎక్కడలేని ధీమతో చేసిన ఈ కింది ట్వీట్ ఇప్పటిదాకా పెద్ద చర్చనీయాంశం అయ్యింది. సమకాలీన భారతీయ ఎన్నికల చరిత్రలో ఇది ఒక మరిచిపోలేని అంశంగా నిలిచిపోతుంది. బీజేపీ ఎంత హడావుడి చేసినా వచ్చేవి వంద లోపేననీ, అంతకు మించి వస్తే తానుచేసే ఈ పని (స్పేస్) నుంచి వైదొలుగుతానని, మరిచిపోకుండా ఉండడానికి ఈ ట్వీట్ ను దాచుకోండని కూడా తను చెప్పాడు. కమలనాథుల కనుసన్నల్లో ఉన్న నేషనల్ మీడియా గుచ్చినా, కుళ్ళ బొడిచినా తను ఈ విషయంలో ఆయన వెనక్కుపోలేదు. నిజానికి ఇంత ధైర్యంగా ఈ ప్రకటన దేశ ముదుర్లయిన బీజేపీ నేతలకు బహిరంగ సవాల్. అయినా... పీకే తప్పని నిరూపించకపోయిన నాయకమణ్యులు ఆయన్ను లోలోపలైనా అభినందించకుండా ఉండలేరు. 


సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకుని, మమతను ఒక్కదాన్ని ఒంటరి చేసి ఆమెనే లక్ష్యంగా చేసుకుని పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు విమర్శలు సంధించడం, ఎన్నికల సంఘం వీరికి అనుకూలంగా ఎనిమిది దఫాలుగా ఎన్నికలు నిర్వహించడం, తమ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరో ప్రకటించకపోవడం, నందిగ్రామ్ లో మమతపై దాడి జరగడం, రెండు రోజుల పాటు ఆమె ప్రచారం చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇప్పించడం... వంటి తప్పులకు కమలనాథులు మూల్యం చెల్లించాల్సివచ్చింది. బెంగాల్ లో ముఖ్యమైన విజయాన్ని సాధించలేక మోదీ-షా బృందం చతికిల పడింది. అయినా... అలనాటి కమ్యూనిస్టుల కోటలో, మేథావులు గడ్డపైన బీజేపీ ఇప్పుడు సాధించిన ప్రతిపక్ష హోదా తక్కువేమీ కాదు. కాకపోతే.... దశాబ్దాల తరబడి బెంగాల్ ను ఏలిన కామ్రేడ్లు పూర్తిగా జీరోలు కావడం ఒక విషాదం!

అనుకున్నట్లు తృణమూల్ ను గెలిపించినా... తాను ఈ స్పేస్ నుంచివైదొలుగుతున్నానని, ఐ ప్యాక్ నాయకత్వం ఇకపై ఈ బాధ్యతలు చూసుకుంటుందని పీకే తృణమూల్ విజయోత్సవాల మధ్యన  ప్రకటించడం కొసమెరుపు. కొద్దికాలం పాటు భార్యా బిడ్డలతో గడిపి... తర్వాత సంగతి తర్వాత చూస్తానన్న అభిప్రాయం ఆయన మాటల్లో ధ్వనించింది. పదవీభాగ్యం కలిగించే ఇలాంటి రాజకీయ మాంత్రికుడిని వదులుకోవడానికి మన భారత నాయకులు అమాయకులు కాదు, పేదలూ కాదు. 

Saturday, May 1, 2021

రోహిత్ సర్దానా మృతి: 'ఆజ్ తక్' ఓవర్ యాక్షన్

ప్రసిద్ధ హిందీ టెలివిజన్ జర్నలిస్టు రోహిత్ సర్దానా (41) శుక్రవారం నాడు ఏప్రిల్ 30, 2021 న కోవిడ్ పై పోరాడుతూ తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూశారు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన ఆయనకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. 

వర్తమాన రాజకీయ, సామాజిక వ్యవహారాలపై ఆయన 'ఆజ్ తక్' ఛానల్ లో నిర్వహించే 'దంగల్' అనే కార్యక్రమానికి విశేషమైన ఆదరణ ఉంది. 2017 లో ఆజ్ తక్ లో చేరడానికి ముందు జీ న్యూస్ లో పనిచేశారు. అక్కడ రోహిత్ నిర్వహించిన చర్చా కార్యక్రమం "తాల్ థోక్  కే" కూడా విశేష ఆదరణ ఉండేది. 1979 సెప్టెంబర్ 22న జన్మించిన రోహిత్ బీ ఏ సైకాలజీ చదివాక... గురు జంభేశ్వర్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశారు. 2003లో సహారా సమయ్ లో పనిచేసిన ఆయన 2004లో జీ న్యూస్ లో చేరి యాంకర్ గా, న్యూస్ ప్రజెంటర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. 


రోహిత్ ఈ-టీవీ నెట్ వర్క్ లో కూడా పనిచేశారని అంటున్నారు. భారత రాష్ట్రపతి ఇచ్చే గణేష్ విద్యార్థి పురస్కార్ ను 2018 లో రోహిత్ కు ప్రదానం చేసారు. ప్రధాన మంత్రి, హోమ్ మంత్రి తో పాటు అనేక మంది ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. 

అయితే...రోహిత్ మృతి వార్తను ఆజ్ తక్ రోతగా టెలికాస్ట్ చేసింది. రోహిత్ సహచరులైన మహిళా యాంకర్లు బాధాతప్త హృదయంతో ఏడుస్తూ ఆ వార్తను, రోహిత్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పంచుకోవడాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ పై ఫోటో చూడండి వార్తలు చదివే ఆ అమ్మాయి ఎంత బాధతో ఏడుస్తున్నదో! చుట్టూ మరణాలతో, అసహాయతతో దేశం అంతా విషాదంలో ఉండగా ఎంతో ప్రజాదరణ ఉన్న ఈ ఛానెల్ ఇలా యాంకర్లను స్టూడియోలో   ఏడిపించి జనాల గుండెలు పిండేయడం అస్సలు బాగోలేదు. ప్రజల మానసిక ఆరోగ్యంపై ప్రభావం ఉండేలా చేయడం మంచిది కాదు. 

టీ ఆర్ పీ ని దృష్టిలో ఉంచుకుని ఈ పనిచేసి ఉంటే మాత్రం ఇది దారుణం.