Tuesday, February 24, 2015

'ది న్యూస్ అవర్' లో బీజేపీ కి ఖాళీ కుర్చీ వేసిన అర్ణబ్

గోల గోల గందరగోళపు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకుపోయి తన గద్దరితనంతో 'ది న్యూస్ అవర్' అనే కార్యక్రమంతో గగ్గోలు పుట్టించే 'టైమ్స్ నౌ' ఎడిటర్ అర్ణబ్ గోస్వామికి ఒక దుర్లక్షణం ఉంది. తన వాదనతో ఏకీభవించని వారిని పరుష పదజాలంతో నోటికొచ్చింది తిట్టి.. నిప్పులు చెరిగి అవమాన పరిచి పరిశుద్ధ జర్నలిజానికి తానే ఏకైక ప్రతినిధినని మనసా వాచా కర్మణా నమ్మే అర్ణబ్ తన షో కు రానివారిని భయకరంగా ఎద్దేవా చేస్తారు. ఈ క్రమంలో తక్కువలో తక్కువ ఐదారుగురితో ఆయన చేసే రోజూ రాత్రి పూట చేసే న్యూస్ అవర్ కు భయకరమైన జనాదరణ ఉందట. 'టు నైట్ ది నేషన్ వాంట్ టు నో... యూ మస్ట్ అపాలజైజ్..." అని గద్దించి అడిగే అర్ణబ్ ను చూస్తే... ఒకోసారి భయమేస్తుంది.   

అదలా ఉండగా... ఈ రోజు (ఫిబ్రవరి 24, మంగళవారం) రాత్రి షో లో అర్ణబ్ ఒక ఖాళీ కుర్చీ వేసి ఇది బీజేపీ కి ఉద్దేశించిందని ప్రకటించి తన షో ఆరంభించారు. కరుణామయి మదర్ థెరిస్సా ఉద్దేశం మత మార్పిడని ఆర్ ఎస్ ఎస్ అధినేత భగవత్ చేసిన ప్రకటనను ఖండిస్తూ ఈ ప్రోగ్రాం ఆరంభమయ్యింది. అంతవరకూ బాగానే ఉంది కానీ... తన షో కు రాని బీజేపీ కి దమ్ములు లేవని...ఆర్ ఎస్ ఎస్ ఆదేశాలు లేకుండా పనిచేసే బీజేపీ నేత ఎవ్వరైనా వస్తే లైవ్ లోకి తీసుకుంటానని అర్ణబ్ ప్రకటించారు. 

మదర్ థెరిస్సా అన్నట్లు చెబుతున్న రెండు కోట్స్ తో అర్ణబ్ తన వాదన ఆరంభించారు. తర్వాత... భగవత్ వాదన సమర్ధించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు దుమ్ము దులుపుకున్నారు. గందరగోళం మధ్యన అపుడప్పుడూ అర్ణబ్ ఆజ్యం పోస్తూ మంటలు సృష్టిస్తూ కార్యక్రమం నడిపారు. "మాట్లాడే అవకాశం ఇవ్వవయ్యా.... మహా ప్రభో..." అని గెస్టులు ప్రాధేయపడడం, ఆవేశపడడంతో చాల సమయం ఆవిరయ్యింది. ఒక షో లో ఏడు, ఎనిమిది మందితో అర్ణబ్ సృష్టించే బీభత్స కాండకు మంచి టీ ఆర్ పీ రేటింగ్, ప్రకటనలు రావడం విశేషం. ఆర్ ఎస్ ఎస్ ప్రకటన కరెక్టని చెప్పడం మా ఉద్దేశం కాదు గానీ, ఈ గందరగోళపు చర్చల వల్ల ఫలితం ఏమి ఉంటున్నదన్నదే అనుమానం.  

మీడియా నియంత్రణ మంచికా?...చెడుకా...?

పెన్ను/మైకు చేతిలో ఉన్నదని మీడియా, అధికారంలో ఉన్నామని ప్రభుత్వం మిడిసిపడడం మంచిది కాదు. ప్రభుత్వం అంతుచూస్తామని జర్నలిస్టులు, మీడియా సంగతి చూస్తానని ప్రభుత్వం అనుకోవడం ఈ సమయంలో అస్సలు మంచిది కాదు. కష్టపడి, త్యాగాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణా నవ నిర్మాణం జరగాలంటే ఈ రెండు వ్యవస్థలు బాధ్యతాయుతంగా పనిచేయాలి.  బాధ్యతాయుతంగా పనిచేయడం అంటే... ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు కప్పిపుచ్చి జనాలను మోసం చేయమని కాదు, ఎవరి విధిని వారు సమర్థంగా నిర్వర్తించే వాతావరణానికి సహకరించడం. ఆ పరిస్థితి కనిపించడం లేదు. 

సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న బ్లాక్ లోకి విలేకరులు రావడానికి వీల్లేదని మౌఖిక ఉత్తర్వులు ఇచ్చి... పోలీసులతో ఖాళీ చేయించడం... దాన్ని మొన్నటి దాకా తెలంగాణా జర్నలిస్టుల సంఘం నేత... ప్రస్తుతం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు... మధ్యేమార్గమైన వివరణ ఇవ్వడం... మీడియాలో బాగా చర్చనియాంశం అయ్యింది. ఇప్పటికే రెండు ఛానెల్స్ ను పరోక్షంగా నిషేధించినట్లు విమర్శ ఎదుర్కుంటున్న ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని సరిగా డీల్ చేస్తున్నట్లు కనిపించడం లేదు.... నిజానికి తన అభిప్రాయంలో పస ఉన్నా. 

ఇప్పుడు పాతిక దాకా ఛానెల్స్ తెలుగులో ఉన్నాయి. ఒక కెమెరా మ్యాన్, రిపోర్టర్ వీటికోసం సచివాలయంలో కాచుకుని ఉంటారు. చిన్నా పెద్దా పేపర్లు, ఫ్రీ లాన్సర్లు అంతా కలిపి...భారీగానే జర్నలిస్టులు అక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా మకాం వేస్తారు. ఇదికాక, జర్నలిజం కార్డు అడ్డం పెట్టుకుని నాయకులు-అధికార్ల బూట్లు నాకుతూ పైరవీలు చేసుకుని బతికే పిశాచ వర్గం, వ్యాపార వృద్ధి ధ్యేయంగా ఉన్న ఛానెల్స్ కొమ్ముకాసే ప్రతినిధులు, తెలంగాణా ప్రభుత్వం మీద డేగకన్ను వేసే వైరి ప్రభుత్వ తాబేదార్లు... సరే సరి. మీడియా హౌజ్  ల మధ్య పోటీ దారుణంగా ఉంది కాబట్టి...'ఈ రోజు స్పెషల్ ఏమిటి?' అని బాసులు వేధిస్తారు కాబట్టి... ఈ జర్నలిస్టులు ఏదో ఒకటి వండివార్చాలి. అందుకోసం ఎవరినో ఒకరిని గెలకాలి, లేనిది ఉన్నట్లు సృష్టించాలి.  ఒక పక్క తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్న ఉద్యోగాలను రక్షించుకునేందుకు ఈ క్రమంలో నిజమైన జర్నలిస్టులు నానా అవస్థలు పడాల్సివస్తుంది.  ఇది ఒక కోణం. 

ఇప్పుడు తెలుగు నేల మీద గొట్టాలు (ఛానెల్స్) ఎక్కువయ్యాక...ప్రభుత్వానికి తలనొప్పి పెరిగిందనేది వాస్తవం. కనిపించిన ప్రతి అధికారిని, నేతను కలిసిన చోటల్లా ఈ జర్నలిస్టులు (అందులో తాలు సరుకే ఎక్కువని సీనియర్లే గొణుగుతున్నారు) విసిగిస్తున్నారు. అడిగేవాడికి చెప్పే వాడు లోకువ. నోటి దగ్గర గొట్టం పెట్టడం... వివరణ ఇవ్వమనడం... సహజమయ్యింది. అది టెలికాస్ట్ అవుతుందా... కాదా... అన్నది వేరే విషయం. లేనిది సృష్టించి అభూతకల్పనలు ప్రసారం చేయడం కూడా జరుగుతున్నదన్నది ప్రభుత్వం వాదన. "నిజమే... మీడియా లొల్లి... ఓవర్ యాక్షన్ ఎక్కువయ్యింది. ఎలక ఇంట్లో ఉందని కొంప అంతా తగలపెడ్డడం భావ్యమా?" అని సచివాలయం వ్యవహారాలు చూస్తున్న ఒక జర్నలిస్టు అన్నారు. 

ముందుగా, ప్రభుత్వం ఒక కమిటీ (ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులతో కానీ, ఆస్కీ లాంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలతో గానీ) వేసి... ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ జరిపి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. బీట్ జర్నలిస్టులను కూడా పరిగణన లోకి తీసుకోవాలి. అటు సర్కార్ కు, ఇటు మీడియాకు ఇబ్బంది కలగని పధ్ధతి కోసం ప్రయత్నం జరగాలి. 

అట్లా కాకుండా... మీడియా ప్రతినిధులను బలవంతంగా అక్కడి నుంచి పంపడం సరైనది కాదు. మీడియాను సవరించాలని సీ పీ ఆర్ ఓ ఆఫీసునే వివాదానికి కేంద్రం చేయడం విచారకరం. ఈ విషయంలో... ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఆచితూచి వ్యవహరించకపోతే... మీడియా వ్యతిరేకి అన్న విమర్శకు మరింత ఊతం ఇచ్చినట్లు అవుతుంది. 

ఉద్యోగాలు పోతున్న 'ఈనాడు' ఉద్యోగులను ఆదుకోకపోవడం, రామోజీ ఫిల్మ్ సిటీ ని-రామోజీ నిఆకాశానికి ఎత్తడం, ఆంధ్రజ్యోతి ఛానెల్ మీద ఇంకా నిషేధం కొనసాగించడం...తో ప్రభుత్వం పై గుర్రుగా ఉన్న జర్నలిస్టులు ప్రభుత్వ తాజా చర్యతో... చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వం మీద చాపకింద నీరులా విష ప్రచారం మొదలు పెట్టారు. నిన్న మొన్నటి దాకా ఈ ప్రభుత్వం తమదని అనుకున్న తెలంగాణా జర్నలిస్టులు కూడా ఇప్పుడు భ్రమలు తొలిగిన ఫీలింగ్ లో ఉన్నారు. 'గిసంటివి యెన్నో జూసినం... గిదో లెక్కా? బాజాప్త... మా ఇష్టమొచ్చినట్లు జేస్తం...' అని అనుకోవడం కచ్చితంగా చేటు కలిగిస్తుంది. తెలంగాణా పునర్ నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన ఈ సమయంలో... ప్రభుత్వం మీడియా తో పెట్టుకుని బద్నాం కావడం అనవసరం. 

Friday, February 20, 2015

ఆ పవిత్ర ప్రేమకు....ఈ నాటికి 23 ఏళ్ళు

ఫిబ్రవరి 20, 1992 
కొత్తగూడెం, ఖమ్మం జిల్లా
రామచంద్రా డిగ్రీ కాలేజ్ (సైన్స్), రామవరం
సరిగ్గా ఈ పోస్టు రాస్తున్న సమయానికి ఒక మూడేళ్ళ మూగ ప్రేమ ఒక ఫేర్ వెల్ పార్టీలో సమాధి అయ్యింది. కారణం: మతం. వాడు ముస్లిం. 

ఎందుకు కలిసామో, ఎలా కలిసామో కానీ... మేము బీ ఎస్సీ (బీ జెడ్ సీ) లో చేరి ఒక అద్భుతమైన గ్రూపుగా తయారయ్యాం.  ఆ రోజుకు ఒక పది రోజుల కిందనే ఆ ప్రేమ వ్యవహారం మాకు తెలిసింది. ఇదే సమయానికి ఫేర్ వెల్ పార్టీ లో.... "నిన్ను తలచీ... మైమరచా చిత్రమే అది చిత్రమే..." అని పాట (1989 లో వచ్చిన 'విచిత్ర సోదరులు' లోది) వాడుపాడుతున్నాడు. అది అక్కడి ప్రేక్షకులకు... బైటివాళ్లకు మిత్రులు విడిపోయే రోజున ఒక మజా పెంచే సూపర్ హిట్ పాట. కానీ వాళ్ళిద్దరితో పాటు మాలో కొందరికి తెలుసు... అందులో ప్రతి పదం వాడి ప్రేమ జీవితానికి సంబంధించిందే. హీ మెంట్ ఎవ్రీ వర్డ్.  
సినిమా లో కమల్ హాసన్ పడ్డ గుండె వేదనే వాడూ పడుతున్నాడు. ఒక పెను విషాదాన్ని ఆపలేక పోతున్నానన్న కసి, ఓడిపోతున్నానన్న ఆక్రోశం.. అన్నిటికీ మించి మంచి ప్రేమికురాలిని కోల్పోతున్నానన్న దుఃఖం. అయినా... సింగర్ గా తననుంచి మంచి పాట కోసం తోటి విద్యార్థులు చేస్తున్న డిమాండ్ తీర్చాలన్న తపనతో...ప్రాణం పెట్టి పాడుతుంటే...డొక్కలో నొప్పి. తెల్లటి జేబురుమాల పొట్ట చుట్టూ కట్టుకుని తీవ్రంగా లీనమై పాడాడు. ఆ పాట ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతోంది.  
అప్పటికే మా మనసులు అన్నీ ఎంతో ఉద్విగ్నంగా ఉన్నాయి. ఇక అదే చివరి కలయిక అని అర్థమై ఆమె కళ్ళ నిండా నీళ్ళు సుళ్ళు తిరిగాయి. 
తెలిసీ తెలియని వయసు. అంతా అయోమయం. అది నికార్సైన నిండు ప్రేమ. నిజానికి నేను అనుకుంటే...ఎవరు అడ్డువచ్చినా వాళ్ళను కలిపే వాళ్ళం. కానీ... ఈ ప్రేమకు మనం సహకరిస్తే... ఆమె కుటుంబం ఆత్మహత్య తథ్యమని ఆమె స్నేహితురాళ్ళు చెప్పారు. 'పైగా వాడిది.. చంచల స్వభావం. ఉద్యోగం సాధించి... ఈమెను పోషించి జీవితాంతం పోషిస్తాడన్న నమ్మకం నీకుందా...?" అని వాళ్ళు నన్ను అడిగారు. అవునని నేను చెప్పలేక పోయాను. దానికి కారణాలు ఉన్నాయి. 

వేరే జిల్లా నుంచి వచ్చి... పాలిటెక్నిక్ మధ్యలో ఆపి, డిగ్రీ లో చేరి... సరిగా చదవకుండా... ఎప్పుడూ సమాజం గురించి ఆలోచిస్తూనో, తనకు ఇష్టమైన పాటలు పాడుతూనో ఊరిబైట ఒక పూరింట్లో గడిపేవాడు. 'వీడు డిగ్రీ పాసై... ఉద్యోగం తెచ్చుకుని... సెటిల్ అయ్యేది ఎన్నడు? ప్రేమే పరమావధి... దానికి పెళ్ళే పర్ఫెక్ట్ ముగింపు అనుకుని కలిపితే... ఒకరిద్దరు పిల్లలు పుట్టాక.... తన్ని తగలేస్తే...? అంతకన్నా ముందు.. నీళ్ళను కూడా నిప్పులతో కడిగి శుభ్రం చేసుకున్నాకే తాకాలనుకునే ఆమె ఇంట్లో పరిస్థితి ఏమిటి?"--ఇలాంటి ప్రశ్నలు నా చిన్న బుర్రను ఉక్కిరిబిక్కిరి చేశాయి. 'నో... నువ్వు ఎంకరేజ్ చేయకు. ఈ రోజుతో వదిలేద్దాం," అని అంతా నాకు చెప్పారు. నేనూ విత్ డ్రా అయ్యాను. మనో వేదనతో మతి కోల్పోయి శూన్యంలోకి చూస్తున్న ఒక మంచి మిత్రుడ్ని ఎండ మావైనా లేని ఎడారిలో ఒంటరిగా ఒదిలి వెళ్ళాం. ఆమె ఎంతగా బాధపడిందో!
"ఏమీ అనుకోకు.. నీ చంచల స్వభావంపై నాకు నమ్మకం లేదు. ముందు... పాలిటెక్నిక్ పూర్తి చేయి. తర్వాత చూద్దాం..." అని చెప్పి ఒక మిత్రుడి రూం కు తెచ్చి పెట్టాం. ఒక భయంకరమైన తప్పు చేసిన భావన లోలోపల వెంటాడింది... ఆ హామీ ఇస్తున్నప్పుడు. నాది ఒట్టి సాంత్వన వచనం. అట్లా చెబితే ప్రస్తుతానికి ఒక గండాన్ని గట్టు ఎక్కించవచ్చన్న ఒక పథకం. ఒక మిత్రద్రోహం. 

ఆ మాటను సీరియస్ గా తీసుకుని... ప్రేమ నెగ్గించుకునేందుకు ఒక  రెండు మూడు నెలల్లో వాడు పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. 'ఉద్యోగం దొరకడం పెద్ద కష్టం కాదు.. నీ మాట నిలుపుకో...,' అని వాడు అన్నప్పటికే నాకు తెలుసు... ఆక్కడ ఆమెకు వేరే సంబంధాలు చూస్తున్నారని. అదే సంగతి వివరించి చెప్పి... ఈ విషయం మరిచిపొమ్మని సలహా ఇచ్చాను... తీవ్రమైన పశ్చాతాపం తో. ఇంత పెద్ద మాట తప్పడం జీవితంలో అదే మొదలు. 

కాలక్రమేణా...  అందరం ఉద్యోగాల్లో సెటిల్ అయ్యాం. నేను వాడిని కలిసాను, ఆమెనూ కలిసాను.... విడివిడిగా. ఒకరి సమాచారం ఒకరికి పెద్దగా తెలియనివ్వలేదు... కావాలనే. జీవిత భాగస్వామితో, పిల్లలతో... సెటిల్ అయిన వారిని గతం గాయపరచకూడదన్న ఒకే ఒక్క ఆలోచన నాది. "ఆమె ఎలా ఉంది?" అని వాడు... "ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు?" అని ఆమె అడుగుతున్నప్పుడు ఆ గొంతుల్లో తప్పే శృతి నాకు తెలుసు. అదే ఊర్లో పరిచయం అయిన కాలేజ్ జూనియర్ అయిన అమ్మాయి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నా మనసును వారి ఆర్ధ్రత చేసే గాయం, ఆ చిన్న ప్రశ్న నన్ను దోషిగా నిలబెట్టడం... భరింపశక్యం కానివి. 

ఈ రోజు మధ్యాహ్నం అనుకోకుండా... అప్రయత్నంగా నేను వాడికి ఫోన్ చేశాను. "ఈ రోజుకో ప్రాముఖ్యత ఉంది... తెలుసా?" అని అడిగాడు. 
నేను: ఏమిటా ప్రాముఖ్యత?
వాడు: 1992 ఫిబ్రవరి 20 న మన ఫేర్ వెల్ పార్టీ, నేను పాడిన పాట, మేము విడిపోయిన ఆఖరి రోజు... 

నేను: ఓహ్ గాడ్... నీకు ఇంకా గుర్తుందా?
వాడు: ఈ ఏడాది ఆ స్పాట్ (రామవరం లోని కాలేజ్) కు వెళ్ళడం కుదరలేదు. ఇదే రోజు అక్కడికి వెళ్లి వస్తాను
నేను: నిజంగా ఆమెను అంత ఇదిగా ప్రేమించావా? 
వాడు: అంత అన్నదానికి కొలమానం ఉంటుందా? సముద్రమంత అంటే ఎంతో చెప్పగలమా?
నేను: బాధగా ఉందా?
వాడు: నొప్పితో బాధపడుతున్న ఒక హార్ట్ పేషంట్ దగ్గరకు వెళ్లి నొప్పిగా ఉందా? అని అడిగినట్లు ఉంది.  
నేను: ఇప్పటికీ మరిచిపోలేదా?   
వాడు: అది కుదరనిది. మొదటి పదేళ్ళు అనుక్షణం గుర్తుకు వచ్చేది. జీవితం హడావుడిలో పడినా... అది మరిచిపోలేని విషయం. కొన్ని అంశాలు మరణించేవరకూ మధుర జ్ఞాపకాలుగానే ఉంటాయి. 
నేను: మూడేళ్ళ డిగ్రీ కాలం మొత్తం సాగిందా ప్రేమ?
వాడు: ఫిబ్రవరి 10 న తను ప్రపోజ్ చేసింది. 20 న ముగిసింది. అంతకు ముందే... మా ఇద్దరి మధ్యా ఒక బాండ్ ఉండేది. అంతే 
నేను: పది రోజుల ప్రేమ ఇన్ని రోజులు...?
వాడు: ప్రేమను రోజుల్లో కొలవడం సాధ్యమా?
నేను: ఈ విషయంలో నన్ను అపరాధిగా భావిస్తున్నావా? 
వాడు: లేదు, నన్ను తాగుబోతునని కొందరు అనుకున్నారు. మతం పునాదుల మీద ప్రేమ బీజం నాటవచ్చా? అని ఒక రోజు అడిగింది. మతమే అడ్డమైతే... మారదామని నిర్ణయించుకున్నాను. 
నేను: మరి మీ ప్రేమలో విలన్ ఎవరు?
వాడు: విధి
నేను: కారణం?
వాడు: మా మతాలు వేరు.  
నేను: నీ భార్యకు చెప్పావా?
వాడు: మొత్తం చెప్పాను... పెళ్ళికి ముందే. డైరీ కూడా చూపించా. 
నేను: మరి ఇప్పుడు ఏమంటావ్?
వాడు: జీవితంలో... పోయేలోపు... అవకాశం వస్తే.. ఆమెను ఒక్కసారి చూడాలని ఉంది. 
సారీ మిత్రమా! అమరమైన నీ ప్రేమకు జోహార్లు.  

డెస్క్ జర్నలిస్టులను ఆదుకోండి సార్లూ...

జర్నలిజం అంటే రిపోర్టింగ్ మాత్రమే కాదు. రిపోర్టర్లు రాసిన చెత్తాచెదారానికి 

ఒక రూపు ఇచ్చి సంస్కరించి రీడర్స్, వ్యూయర్స్ కోసం ప్రజెంట్ చేసే 

నిపుణులు డెస్క్ లో ఉంటారు. వీళ్ళను సబ్ ఎడిటర్లు లేదా సబ్బులు 

అంటారు. ఆయా బురదగుంటల్లో చేపలు పట్టే వాళ్ళు రిపోర్టర్లు 

అయితే...చేపలను శుభ్రం చేసి, పధ్ధతి ప్రకారం కోసి మసాలా వేసి వండి 

వార్చే వాళ్ళు సబ్ ఎడిటర్లు. వీరి గురించి పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు.  

డెస్క్ లలో పనిచేసే తమకు కనీసం హెల్త్ కార్డులు ఇవ్వండని వాళ్ళు 

సర్కారుకు పెట్టుకున్న మొరకు ఎంతో ఆశతో అక్షర రూపం 

ఇచ్చారు...జర్నలిస్టు మిత్రులు క్రాంతి దేవ్ మిత్రా, శ్రీచమన్ మధు

వారికి థాంక్స్ 



(క్రాంతి దేవ్ మిత్రా)  

రాష్ట్ర విభజన కారణంగా ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే జర్నలిస్టులే.. అందునా డెస్క్ జర్నలిస్టులు.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు జరుగుతున్న మేళ్లు ఏమిటని అడిగితే వెంటనే చెప్పడానికి హెల్త్ కార్డులు అనేవి ఉండేవి.. జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు ఆరోగ్య సమస్యలు వస్తే తక్షణం ఆదుకున్నవి ఈ కార్డులే.. అదీ ఉదారంగా ఇచ్చినవేం కాదు.. ప్రీమియంలో సగం కంట్రిబ్యూషన్ జర్నలిస్టులే భరించేవారు..
రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన జర్నలిస్ట్ ఆరోగ్య బీమా పథకం కిరణ్ కుమార్ కాలానికి పలుచబడింది. అడ్డగోలుగా ఇన్స్యూరెన్స్ సంస్థలను మార్చేశారు.. రాష్ట్ర విభజన కాలంలో జర్నలిస్టులు ప్రీమియమ్ కట్టినా ప్రభుత్వం పాలసీలను రెన్యూ చేయలేదు.. దీంతో ఏడాదిన్నర కాలంగా జర్నలిస్టుల కుటుంబాలు ఆరోగ్యపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి..
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గత తొమ్మిది మాసాలుగా జర్నలిస్టుల జీవితాలతో దోబూచులాడుతున్నాయి.. తమ ఉద్యోగులకు ఆరోగ్య బీమా, జీత భత్యాల పెంపు, ఇతరత్రా సౌకర్యాల విషయంలో పోటీలు పడి నిర్ణయాలు తీసుకుంటున్న రెండు ప్రభుత్వాలు జర్నలిస్టులను మాత్రం త్రిశంకు స్వర్గంలో పెట్టాయి. అక్రిడిటేషన్లు, హెల్త్ ఇన్స్యూరెన్స్ విషయంలో తేల్చకుండా జాప్యం చేస్తున్నాయి. జర్నలిస్టుల్లో ఎవడు ఏ ప్రాంతం వాడో నిర్ధారించడం కష్టమైనందున, అవతలి ప్రభుత్వం ఇచ్చాక, తాము చూద్దాం అనే విధానం కొనసాగుతోంది. చివరకు ఏపీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఆరోగ్య బీమా విషయంలో మొదటి అడుగు వేసింది.. కానీ అవి అక్రిడిటేషన్లు ఉన్నవారికేనట.. మీడియాలో దాదాపు 70 శాతం జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు లేవు, ఇందులో ఎందరో సీనియర్లూ ఉన్నారు.
కొత్త నిబంధన వల్ల ఎక్కువగా నష్టపోతున్నది డెస్క్ జర్నలిస్టులే.. రిపోర్టళ్లు తెచ్చిన వార్తలను వండీ వార్చీ ఒక రూపానికి తెచ్చేది వారే.. రాత్రింబవళ్లు షిప్టుల్లో పని చేయడం కారణంగా అత్యధికంగా ఆరోగ్య సమస్యలు వారికే ఉంటాయి.. దురదృష్టవశాత్తు అక్రిడిటేషన్ల విషయంలో మొదటి నుండి వీరికి మొండి చేయే.. అక్రిటిడేషన్లు ఇవ్వాల్సిన ప్రభుత్వమే డెస్క్ జర్నలిస్టులకు అవి లేవనే కారణంతో ఆరోగ్య బీమా నిరాకరిస్తోంది. సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో వివక్ష లేకుండా అందరికీ హెల్త్ కార్డులు ఇచ్చినప్పుడు, రాష్ట్ర విభజన తర్వాత ఎందుకు ఈ పనికి మాలిన నిబంధన పెట్టిందో ఏపీ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ప్రభుత్వాన్ని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా అనే అనుమానాలు ఉన్నాయి..
ఇప్పడు బుగులంతా మా తెలంగాణ జర్నలిస్టులకే.. బాబు ప్రభుత్వ స్పూర్తితో కేసీఆర్ సర్కారు కూడా డెస్క్ జర్నలిస్టులను వీధినా పడేస్తుందా అనే భయం పుట్టుకుంది. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డుల విషయంలో సానుకూలంగా ఉన్నామని గత తొమ్మిది నెలలుగా చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏ నిర్ణయాన్ని ప్రకటించలేదు.. మమ్మల్ని రోడ్లెమ్మట తిప్పి నాయకులై కూచ్చున్న జర్నలిస్టు సంఘాల పెద్దలు కూడా నోరు మెదపడం లేదు.. చూడాలి ఏమౌతుందో ఏమో.. గుర్రమూ ఎగరవచ్చనే ఆశలైతే సజీవంగా ఉన్నాయి..



(ఎస్. మధు చల్లా) 
ఏపీ(ఆంధ్రప్రదేశ్ అనుకునేరు.. ఏ ఫర్ ఎవరికీ, పీ ఫర్ పట్టని) డెస్క్ జర్నలిస్ట్ మిత్రులకు ఒక విన్నపం. హెల్త్ కార్డ్ ల విషయంలో డెస్క్ జర్నలిస్ట్ ల తరపున ఓ వినతి పత్రం తీసుకుని ఏపీ సమాచారశాఖ మంత్రి దగ్గరకు కొందరు మిత్రులతో కలిసి వెళ్లాను. ఆయన కమిషనర్ రమణారెడ్డిని కలవమని చెప్పారు. ఈ రోజు రమణారెడ్డితో పాటు పరకాల ప్రభాకర్ (ఏపీ సలహాదారు)ని కలిశాం. వినతి పత్రం ఇచ్చాం. డెస్క్ జర్నలిస్ట్ లకు హెల్త్ కార్డులు ఇవ్వాలనే ఆలోచన తమకు ఉందని అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని వారు చెప్పారు. రెండో విడతలో ఇచ్చేందుకు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టిన వెంకయ్య, ఇస్తామన్న మౌన మోహన్ సింగ్ హామీ మాదిరే ఇది అనిపిస్తోంది. కావున ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా డెస్క్ మిత్రులకు ప్రత్యామ్నాయ(ప్రైవేటు ఆర్ గ్రూప్ ఇన్సూరెన్స్ ) ప్రయత్నాల్లో ఉండండి.
రాష్ట్ర విభజన కొన్ని కుటుంబాలకు రాజకీయ నిరుద్యోగాన్ని దూరం చేసింది. మరికొందరు కొంగు చాటు పైరవీలతో పదవులు పొందారు. ఇంతమందికి ఇన్ని ఉపయోగాలు కల్పించిన రాష్ట్ర విభజన మూడు షిఫ్ట్ లలో పని చేసి సోడా బుడ్డీ కళ్ళద్దాలు తెచ్చుకున్న డెస్క్ జర్నలిస్ట్ లకు మాత్రం ఆరోగ్య భద్రతను దూరం చేసింది. అందరూ నిద్రపోయేటప్పుడు మేలుకుని, అందరూ మేలుకుని ఉన్నప్పుడు పని చేస్తూ.. ఇంట్లో చక్కెర నిండుకున్నా ..వంటి నిండా చక్కెర(డయాబెటిక్) నిల్వలు పేరుకు పోయి మూడు పదుల వయస్సులోనే ముసలాడైపోయిన డెస్క్ జర్నలిస్ట్ లకు ఇది పెద్ద దెబ్బ. మహానగరానికి వచ్చి దూరదృష్టి లోపించి "సైట్"కొని తెచ్చుకున్న మిత్రులారా.. ఆరోగ్యం జాగ్రత్త.. ఆదుకునేవాడు లేడు మనల్ని.

(శ్రీశ్రీ )
ఎవరి పనులలో వాళ్ళు :
ఎవరి తొందరలో వాళ్ళు:
ఎవరికి కావాలి, నేస్తం:
ఏమైపోతేనేం నువ్వు:
ఎవరూ నిన్ను స్మరించడంలేదులే :
ఎవరికి కావాలి, నేస్తం :నువ్వు
కాగితం మీద ఒక మాటకు బలి అయితే ,
కనబడని ఉహ నిన్ను కబళిస్తే:
అందని రెక్క నిన్ను మంత్రిస్తే: నిమంత్రిస్తే:
ఎవరికి కావాలి నీవు నేస్తం ?
ఏమైపోతేనేం నువ్వు?
మా బురద రోజు హాజరు :
మా బురఖా మేము తగిలించుకున్నాం:
మా కాళ్ళకు డెక్కలు మొలిచాయి,
మా నెత్తికి కొమ్ములలాగే:
మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు.....

Wednesday, February 18, 2015

ఎన్డీ టీవీ కి బర్ఖాదత్ ఇప్పుడు 'కన్సల్టింగ్ ఎడిటర్'!

భారత  దేశ టెలివిజన్ జర్నలిజం చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని నిర్మించుకున్న ఎన్డీ టీవీ గ్రూపు ఎడిటర్ పద్మ శ్రీ బర్ఖాదత్ ఇరవై ఏళ్ళ పాటు పని చేసిన ఆ ఉద్యోగం నుంచి వైదొలిగారు. ఆ సంస్థ కోసం 'కన్సల్టింగ్ ఎడిటర్' గా పనిచేస్తూనే... ఒక మల్టీ మీడియా కంపెనీ ని, ఒక పాలసీ గ్రూప్ ను సొంతగా నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు. 

ఈ  మేరకు ఎన్డీ టీవీ వ్యవస్థాపకులు ప్రనొయ్ రాయ్, రాధికా రాయ్ సంస్థ ఉద్యోగులకు ఈ కింది మెయిల్ రాసారు. 
"Barkha Dutt was only 23 when she joined NDTV as a young reporter cum producer. NDTV was the first place she ever worked in and for two decades we have seen her evolve into one of our most prolific reporters. She has been a key member of the NDTV family and a big part of our memorable journey from a production house that created a nightly news bulletin for doordarshan to what we are today. She has worn many hats for NDTV: journalist, anchor, editor and NDTV has been both her learning ground and her second home.
Now twenty years later we wish her all the very best as she embarks on yet another role with us. Barkha will be moving to the role of Consulting Editor. She will remain as closely associated with NDTV as she has all these years as the anchor for Buck Stops Here on weeknights and We The People on weekends. She will also be available as always for analysis and inputs on big news events and stories. While her TV relationship with NDTV remains unchanged, in her new role she will be setting up her own multi media content company and policy group. We have literally seen barkha grow from a child to an adult professional and look forward to our close bonds only strengthening further as she embarks on this new venture.
I know you will join us in wishing Barkha the very very best."

'బక్ స్టాప్స్', 'వుయ్... ద పీపుల్' కార్యక్రమాలకు బర్ఖా యాంకర్ గా వ్యవహరిస్తూనే ఉంటారని ప్రనొయ్ దంపతులు తెలిపారు. దేశ రాజధానిలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ చేసాక, న్యూ యార్క్ లోని ప్రపంచ ప్రఖ్యాత కొలంబియా యూనివెర్సిటీ లో జర్నలిజం అభ్యసించిన చేసిన బర్ఖాదత్ గ్రౌండ్ రిపోర్టింగ్ ను కొత్త పుంతలు తొక్కించారు, ఎందరో యువ జర్నలిస్టులకు స్ఫూర్తి ప్రదాత అయ్యారు. 1999 లో కార్గిల్ పోరాటం కవరేజ్, 2002 లో గుజరాత్ అల్లర్ల కవరేజ్ బర్ఖా కు మంచి పేరు తెచ్చాయి కానీ 2010 లో రాడియా టేపుల్లో చిక్కుకోవడం ఈ అద్భుతమైన జర్నలిస్టు ప్రతిష్టను దెబ్బ తీసింది. ఎన్డీ టీవీ కి పేరు రావడంలో రాజ్దీప్ సర్ దేశాయ్, అర్నబ్ గోస్వామి, శ్రీనివాసన్ లతో పాటు బర్ఖా ముఖ్యపాత్ర పోషించారు.  
బర్ఖా మాతృమూర్తి ప్రభా దత్ 1965 లో భారత్-పాక్ యుద్ధాన్ని హిందూస్తాన్ టైమ్స్ పత్రిక కోసం కవర్ చేశారు.

Sunday, February 15, 2015

అరవింద్ కేజ్రీవాల్ vs జయప్రకాశ్ నారాయణ్:ఆరు తేడాలు

అన్ని రంగాల్లో అవినీతి మితిమీరి, రాజకీయాలు అక్రమార్కుల అడ్డాగా మారి... ప్రజాస్వామ్యం అడుగడుగునా అపహాస్యమవుతున్న ఈ రోజుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల అవసరం ఎంతైనా ఉంది. సగటు ఓటరు ప్రధాన రాజకీయ పార్టీల పట్ల నమ్మకం కోల్పోయి విధిలేని పరిస్థితుల్లో ఒక సారి ఒక పార్టీకి, తర్వాత మోసపోయిన కసితో మరొక పార్టీకి పట్టం కట్టి రాజకీయ వ్యవస్థను తిట్టుకుంటూ నైరాశ్యంతో ఉన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మార్కెట్ ప్రభావిత సమాజంలో అసమానతలు పెరిగి మానవ సంబంధాలు మరీ బలహీనమై ఒక కనిపించని సంక్షోభ స్థితిలో ఉన్న సందర్భంలో కమ్యూనిస్టు పార్టీలైనా ఆదుకుంటాయని అనుకుంటే... తెలుగు నేల మీద కామ్రేడ్లు నిస్సిగ్గుగా నైతికంగా దిగజారి కమ్మ-రెడ్డి కులాల కింద కింద చీలిపోయి చెప్పరాని నష్టం చేశారు. కొద్దోగొప్పో నమ్మదగిన సీపీఎం నికార్సైన కమ్యూనిస్టుల చేజారి చాలాకాలమయ్యింది. తమ్మినేని వీరభద్రం లాంటి కరుడుగట్టిన కమ్మ నాయకులు మీడియాలో కూడా చేరి కుల వ్యవస్థ వేళ్ళూనుకునే ఏర్పాటు చేస్తున్నారు... రాయల్ గా. మాజీ సినీ స్టార్ చిరంజీవి నేతృత్వంలో వచ్చిన ప్రజా రాజ్యం బడుగు అణగారిన వర్గాలలో ఎక్కడలేని ఆశలు లేపి... అనతికాలంలోనే అవినీతి ఆరోపణలతో కుప్పకూలింది. అధికారమే పరమావధిగా చిరంజీవి మంచి ముహూర్తం చూసుకుని శుభ్రంగా కాంగ్రెస్ లో చేరి... లక్షల మంది బీసీ నాయకులను నట్టేట్లో ముంచారు. 


ఈ దారుణ పరిస్థితులకు ఇంకాస్త ముందుగానే తెలుగునేల మీద మాజీ 
ఐ ఏ ఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్ గారి నేతృత్వంలో ఆరంభమైన లోక్ సత్తా ఉద్యమం ఆశాజీవులకు ఎంతో ఊరట ఇచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా... 'ప్రజలే ప్రభువులు' అన్న నినాదంతో అతి తక్కువ కాలంలో ప్రజల నమ్మకాన్ని చూరగొన్న లోక్ సత్తా నిజంగానే అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఎదిగి... ప్రధాన రాజకీయ పార్టీల నేతల గుండెల్లో గుబులు పుట్టించింది. ఉద్యమం నుంచి రాజకీయ పార్టీ గా మారిన తర్వాత లోక్ సత్తా ప్రజాభిమానాన్ని ఓట్లుగా మార్చుకోలేకపోయింది. 
దాదాపుగా లోక్ సత్తా లాంటి లక్ష్యాలతో... అవినీతిపై సమర శంఖం మోగిస్తూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ )... దేశ రాజధానిలో ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ ఒక ఏడాదిలో రెండు సార్లు అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో... సహజంగానే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, జయప్రకాశ్ నారాయణ్ ల వ్యవహార శైలి మధ్య సారూప్యాలపై చర్చ జరుగుతున్నది. మా విశ్లేషణ ప్రకారం... ఇద్దరి మధ్య, ఈ మాజీ సివిల్ సర్వీస్ అధికారుల నేతృత్వంలోని పార్టీల మధ్య ఈ కింది తేడాలు ఉన్నాయి. 
ఒకటి) క్షేత్ర స్థాయి యంత్రాంగం: ఉద్యమ కాలంలో... అవినీతిపై యమ కసితో ఉన్న ప్రజల మనసులను చూరగొన్న లోక్ సత్తా ఒక ప్రభావశీలమైన క్షేత్ర స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యింది. ఉద్యమ సమయంలో చిత్తశుద్ధి తో పనిచేసిన కార్యకర్తలను ఎన్నికల సమయానికి కాపాడుకోలేకపోవడం ఒక పెద్ద తప్పిదం. దాని మీద విశ్లేషణ లేకపోవడం కూడా నష్టం చేసింది. దీనికి భిన్నంగా ఆప్ నాయకులు గ్రౌండ్ లెవల్ కార్యకర్తలను సమకూర్చుకున్నారు... సందర్భానుసార విశ్లేషణలు, దిద్దిబాటు చర్యలతో. పార్లమెంట్ ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తిన్నా... అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్ర స్థాయి యంత్రాంగం ఏర్పడి ఆప్ కు అండగా నిలిచింది. 
రెండు) విద్యాధికుల మద్దతు: ఆప్ కార్యకర్తల్లో ప్రధానంగా విద్యాధికులు (లాయర్లు, జర్నలిస్టులు, టీచర్లు వగైరా) ఉన్నారు. వారు చిత్తశుద్ధి తో పార్టీని సొంతంగా భావించి పనిచేసారు. ఇలాంటి ప్రభంజనాన్ని లోక్ సత్తా సృష్టించలేక పోయింది. దీనికి కారణం... కొందరు నేతల దురహంకార ధోరణి అన్న విమర్శ ఉంది. విద్యాధికులు 'ఒపీనియన్ లీడర్స్' అని, వారి ప్రభావం సాధారణ  ఓటర్ల పై  ఉంటుందన్న కనీస పరిజ్ఞానం లేని  మనిషి  కాదు జేపీ గారు. మనల్ను చూసి జనం వస్తార్లే  అనుకుంటే కుదరదు. 
మూడు) నేతల ధోరణి: ఆప్ నేత ఏకే, లోక్ సత్తా నేత జేపీ ల వస్త్ర ధారణ,పదాల పొందిక, హావ భావాలు విశ్లేషించి చూడండి. ఏ మాత్రం నలగని ఇస్త్రీ బట్టలతో, శుభ్రంగా టక్ చేసి జేపీ దొరబాబు లాగా కనిపిస్తారు. అదేమీ తప్పు కాదు. కానీ, సార్, భారత రాజకీయ వ్యవస్థలో బట్టలు, హావభావాలు ఎంతో కీలక భూమిక పోషిస్తాయి. మహాత్మా గాంధీనే కాక లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి నేతలు ఇందుకు మంచి ఉదాహరణలు. పేద, మధ్య తరగతి వర్గాలకు దగ్గరిగా ఉండేలా... నేతల ధోరణి, శైలి ఉండాలి. ఒక మఫ్లర్ చుట్టుకుని...తన గురించి తాను పట్టించుకోని నేతగా అరవింద్ కలర్ ఇవ్వగలిగారు. అలాగే.. జేపీ గారు రెండో వాక్యంలో ఏమి చెబుతారో ఊహించడం కష్టం కాదు. ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఆయన హావభావాలు ఏ మాత్రం ఉత్తేజం ఇవ్వవు.       
నాలుగు) సమాచార ప్రసారం: ఏకే మాట్లాడుతుంటే... మన అన్నయ్యో, తమ్ముడో ఒక విషయం గురించి విపులీకరిస్తున్నట్లు ఉంటుంది. సామాన్యుల భాషలో ఆయన భావ ప్రసారం ఉంటుంది. అదే జేపీ మాట్లాడుతుంటే... సుద్దులు వల్లిస్తున్నట్లు, ప్రబోధలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. 'ప్రజలారా... మీరు మూర్ఖపు వెధవలు, తెలివి లేని సన్నాసులు. మిమ్మల్ని రక్షించడానికి ఎంతో విజ్ఞానవంతుడినైన నేను వచ్చాను. నేను చెప్పేది విని తెలివి తెచ్చుకుని నాకు ఓటువేస్తే మీకే మంచిది..." అన్నట్లు ఉంటుంది జేపీ ధోరణి. జేపీ పదాల ఎంపిక, భాష, హావభావాలు... ప్రజలను ఆకట్టుకొనేలా అస్సలు ఉండవు. అదే విషయాన్ని సరళంగా చెప్పడం ఎలాగో నేర్చుకోకపోవడం ఒక  లోపం. 
ఐదు) మీడియా డీలింగ్: మీడియా ఒక భస్మాసుర హస్తం లాంటిది. దాన్ని ఎలా వాడుకోవాలో కేజ్రీవాల్ కు బాగా తెలుసు. జేపీ గారికి అస్సలు తెలియదు. ఒక దశలో.. 'టైమ్స్ నౌ' ఛానెల్  తీవ్రవాద జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి అరిచి గీపెట్టినా అరవింద్ ఆ ఛానెల్ షోలకు వెళ్ళలేదు. అది ఒక మంచి నిర్ణయం. అదే... మన జేపీ, వారి అనుచరుడు కటారి శ్రీనివాస రావు గారు...రోజూ మీడియాలో కనిపించడం, నాసిరకం చర్చల్లో పాల్గొనడం కనిపిస్తారు. పాతిక చానెల్స్ లో ఏదో ఒక దాంట్లో రోజూ కనిపించడం ఒక చెత్త ప్లాన్. నిజానికి... జేపీ గారిని చూడగానే మీడియా పక్షి అనిపిస్తుంది.  మీడియా విషయంలో లోక్ సత్తా ప్లానింగ్ ఒక ఫ్లాప్.     
ఆరు) కుల వలయం: జేపీ గారు కులాభిమానానికి అతీతం అని ఎవ్వరూ చెప్పలేరు. కమ్మ పార్టీల పట్ల మెతక వైఖరి తో పాటు, అదే కులానికి చెందిన వాళ్ళను దగ్గర పెట్టుకున్నారన్న అపప్రద వచ్చింది. అది పూర్తిగా నిజం కాకపోయినా... ఈ విషయంలో ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తే జేపీ గారికి బాగుండేది. దేశ రాజధానిలో అరవింద్... ఈ విషయంలో చాలా జాగ్రత్త పడ్డారు. అయితే... కులాన్ని తీసుకునే విషయంలో దేశ రాజధాని ఓటర్లు తెసుకునే దానికి, మన ఓటర్లు చూసే దానికి తేడా ఉంది. అయినా... ఈ కీలక విషయంలో జేపీ జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది.  

అంతేకాక, ప్రతి ప్రసంగంలో సారాయి... డబ్బు కట్టలు... అంటూ పదేపదే లోక్ సత్తా ఊదర కొట్టింది. వివిధ కీలక అంశాల్లో విధాన నిర్ణయాలను అది విస్పష్టంగా ప్రకటించలేదని అనడం తప్పు కానీ...ఎప్పుడూ ఓటర్ చేసే పాపాల గురించి మాట్లాడడం తెలివితక్కువ తనం. 'నీ బతుకు చెడ... తాగి, తిని ఓట్లు వేస్తార్రా... చవటల్లారా..." అన్నట్లు ఉండకూడదు మాటల ధోరణి.  అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రపంచ బ్యాంకు, నూతన ఆర్ధిక వ్యవస్థ, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చేయాల్సిన మార్పులు వంటి అంశాల గురించి చెప్పడం కాదు... స్థానికంగా ఏమి చేస్తామో స్థానికుల భాషలో చెప్పాలి. ఒక పక్కన అన్ని పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చి.. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా తెలివిగా వ్యవహరించడంలో జేపీ బృందం విఫలమయ్యిందని చెప్పక తప్పదు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే... తన కోసం పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేయాలని అయన ఆశగా ఎదురుచూసే దుస్థితి రావడం అత్యంత జుగుప్స కలిగించే విషయం.    

నిజానికి జేపీ గారి కృషి వృధా పోకూడదు. అలాంటి మేధావుల వైఫల్యం ఏ సమాజానికీ మంచిది కాదన్న ఉద్దేశ్యంతో, ఏదో ఒక రోజు ఆయన ముఖ్య మంత్రి పదవి చేపట్టే అవకాశం రావాలన్న సంకల్పంతో ఇది రాస్తున్నాం. పైన పేర్కొన్న విషయాల విషయాలను నెగిటివ్ గా చూడకుండా, వాదనలకు దిగకుండా ఉంటే కమ్యూనికేషన్స్ నిపుణుల బృందంగా లోక్ సత్తాకు సహకరించడానికి ఈ బ్లాగ్ బృందం సిద్ధంగా  ఉంది.

Thursday, February 12, 2015

మూతపడుతున్న 'ఇండియా టుడే' తెలుగు

సీరియస్ తెలుగు రీడర్స్ ను ఇరవై ఏళ్ళ కు పైగా ప్రత్యేక కథనాలతో, వినూత్న కవర్ స్టోరీ లతో, మసాలా సర్వేలతో,  అద్భుతమైన సినీ సమీక్షలు, కార్టూన్లతో అలరించిన 'ఇండియా టుడే' తెలుగు పత్రిక ఈ నెలలో మూతపడబోతున్నది. దీంతో పాటు తమిళ, మలయాళ ఎడిషన్స్ కూడా నిలిచిపోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 'ఫిబ్రవరి 16 వ తేదీ మీకు ఆఖరి పనిదినం," అని యాజమాన్యం  ఉద్యోగులకు సమాచారం ఇచ్చి అకౌంట్లు సెటిల్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

నాణ్యమైన జర్నలిస్టులు, ఎడిటర్లు ఇంగ్లిష్ లో రాసే వార్తలను అనువదించి, స్థానికంగా ముఖ్యమైన కథనాలతో లోకల్ ఫ్లేవర్ తెచ్చి 'ఇండియా టుడే' ఒక పక్ష పత్రికగా తెలుగు రీడర్స్  పై చెరగని ముద్ర వేసింది. 1990-91 ప్రాంతంలో మొదలైన ఆ పత్రిక... తెలుగులో మంచి మాగజీన్ లేని లోటును తీర్చింది. 2004-05 లో అది వార పత్రికగా మారింది. పత్రిక  ప్రాంతీయ భాషల ఎడిషన్లు చెన్నై కేంద్రంగా పనిచేస్తున్నాయి. అక్కడి నుంచే మంచి చాకుల్లాంటి తెలుగు జర్నలిస్టులు రాజసుఖ, ప్రసాద్, పసునూరి శ్రీధర్ బాబు, రెంటాల జయదేవ,  కార్టూనిస్ట్ నర్సింగ్ తదితరులు పనిచేసే వారు. 

పత్రికలో ముసలం మొదలు కాక ముందు టెలివిజన్ జర్నలిజం మీద మక్కువతో శ్రీధర్ బాబు, మొదలయ్యాక పై జర్నలిస్టులు అందరూ హైదరాబాద్  చేరుకొని స్థిరపడ్డారు. రాజసుఖ, ప్రసాద్ ల ఎడిటర్ షిప్ తర్వాత ఎం కిషోర్ అక్కడ చేరారు. ఆయన ఇప్పుడు అక్కడే ఉన్నారో, ఎక్కడ ఉన్నారో తెలియదు.  

'ఈనాడు' జనరల్ డెస్క్ లో పనిచేసిన మిత్రులు ఇండియా టుడే ఇంగ్లిష్, తెలుగు ఎడిషన్లు రెండూ దగ్గర పెట్టుకుని పోల్చుకుంటూ అనువాదం అభ్యాసం చేసే వారు. ఉద్యోగులను ప్రత్యేకించి బైటికి పంపి ప్రత్యేక కథనాలు తెప్పించి ప్రచురించే సంస్థ అది. అలాంటి పత్రిక మూత పడడం బాధాకరం. 

"ఖర్చులు పెరిగాయని... కాస్ట్ కటింగ్ అని మొదలు పెట్టారు. చాలా రోజులుగా మూత వేసే విషయం మాట్లాడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు మూతేస్తున్నారు," అని ఒక మాజీ జర్నలిస్టు చెప్పారు. ప్రాంతీయ భాషా ఎడిషన్లు మూయడం వల్ల యాభై కి పైగా మంచి జర్నలిస్టులు వీధిన పడేట్లు కనిపిస్తున్నది. వారందరికీ మంచి జాబులు దొరకాలని ఈ బ్లాగు కోరుకుంటున్నది.  

Wednesday, February 11, 2015

ఆప్ విజయంపై వివిధ పత్రికల శీర్షికలు

దేశ రాజధానిలో 'ఆమ్ ఆద్మీ పార్టీ' ఎవ్వరూ ఊహించని విధంగా విజయభేరి మోగించింది. మోడీ-అమిత్ బృందం ఎత్తులను చిత్తు చేస్తూ... ఆ పార్టీ చేసిన తప్పును క్షమిస్తూ ఓటర్లు బంపర్ మెజారిటీ అందించారు. ముఖ్యమంత్రి పదవి అభ్యర్ధులు (కిరణ్ బేడీ: బీ జే పీ, మకన్: కాంగ్రెస్) కనీసం గెలవలేకపోయారు. సర్వేలన్నీ కేజ్రీవాల్ వైపే మొగ్గు చూపినా... ఆప్ అధికారంలోకి రావడం అసంభవం అని మేమూ అనుకున్నాం. కానీ, చేసిన తప్పుకు మనస్ఫూర్తిగా సారీ చెప్పిన పార్టీ ని జనం ఆదరిస్తారని రుజువయ్యింది.    

దేశ రాజధానిలో అరవింద్ కేజ్రీవాల్ బృందం చేసిన పనిని మన లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ చేయలేకపోయారే! అయినా... అంత మంచి ఉద్యమం నడిపిన జే పీ గారు తెలుగు ప్రజల మనసులు ఎందుకు చూరగొనలేకపోతున్నారు? అన్న ప్రశ్నలపై త్వరలో ఒక విశ్లేషణాత్మక కథనం మీకు అందిస్తాం.  ఈ కీలకాంశంపై మీ అభిప్రాయలు కూడా ప్రచురిస్తాం. 
ఈ లోపు... ఆప్ విజయం పై ఈ రోజు వివిధ పత్రికలు ఇచ్చిన శీర్షికలు చూసి ఆనందించండి. 
ఈనాడు: స్వచ్ఛంగా ఊడ్చేసిన ఆప్ 
సాక్షి: సామాన్యుడి 'కేక': డిల్లీ ని ఊడ్చేసిన 'ఏ కే-67'
అంధ్రజ్యోతి: వీడు సామాన్యుడు కాడు 
అంధ్రభూమి: బాప్ రే... ఆప్ 
ది హిందూ: AAP ki sarkar : KEJRIWAL RULES DELHI 
 బిజినెస్ లైన్: Aam Aadmi Party's Capital show 
డీ సీ:AAPSOLUTE WIN
ఇండియన్ ఎక్స్ ప్రెస్:"AAP"OCALYPSE!!
మింట్: AK-67 
టైమ్స్ ఆఫ్ ఇండియా: Wall to Wall Kejriwal
ఎకనామిక్ టైమ్స్: AAP Ki Delhi  
హిందుస్తాన్ టైమ్స్:   KEJRIWAL SWEEPS IT ALL AAP 
డెక్కన్ హెరాల్డ్: AAP wave drowns BJP
ది హన్స్ ఇండియా:AAP tsunami wreaks BJP 
మెట్రో ఇండియా: AAP sweeps Delhi 
మెయిల్ టుడే: BROOM...VROOM..VROOM!
న్యూయార్క్ టైమ్స్: India's Aam Aadmi Party Sweeps Elections in Delhi 
వాషింగ్టన్ పోస్ట్: Stunning defeat 
(Photo courtesy: http://www.universityexpress.co.in/)

Monday, February 2, 2015

తెలుగు జర్నలిస్టు లారా!...దమ్మున్న...వాళ్ళను చూడండి...

తెలుగు జర్నలిస్టులు, మీడియా టెక్నీషియన్ల అంతటి చేతగాని చచ్చు దద్దమ్మలు ఈ భూప్రపంచంలో ఉండరు. పొద్దున్న లేచిన దగ్గరి నుంచి... వాళ్ళ హక్కులు... వీళ్ళ హక్కులు... అంటూ రకరకాల కథనాలు వండివార్చే వీళ్ళు... తమ ఉద్యోగాలను యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా పీకేస్తే.... ఏడుస్తూ ఇళ్ళకు వెళ్తారు తప్ప "నీ యబ్బ... ఇదేమి అన్యాయం..." అని గొంతుఎత్తరు. పోరాటం అనేది రక్తంలో లేని పిరికి సన్నాసుల బ్యాచ్ ఇది.  ప్చ్. 

అందుకే...యాజమాన్యాల అడుగులకు మాడుగులొత్తుతూ దయా దాక్షిణ్యాలు లేకుండా... ఈ చిన్ని నా బొజ్జ శ్రీ రామ రక్ష అనికునే ఫాల్తు సీ ఈ ఓ లు, ఎడిటర్లు దాదాపు నాలుగు వేల మంది జర్నలిస్టులు, టెక్నీషియన్ల ఉద్యోగాలు పీకేశారు గత మూడేళ్ళలో. అయినా బాధితులు నోరు మెదపలేదు, జర్నలిస్టు సంఘాలు ఏమీ చేయలేదు. 

ఇలాంటి చేవచచ్చిన జనాలకు... కనువిప్పు/స్ఫూర్తి "టీవీ న్యూ" అనే ఛానెల్ లో చేరి వంచనకు గురైన కేరళ జర్నలిస్టులు. ది న్యూస్ మినిట్ కథనం ప్రకారం....కేరళ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గత ఏడాది జనవరిలో  అట్టహాసంగా ఈ ఛానెల్  ను ఆరంభించింది. అన్ని చోట్ల మాదిరిగానే... మంచి పాకేజ్ లకు ఆశపడి జర్నలిస్టులు, టెక్నీషియన్లు అందులో పొలోమంటూ చేరారు. ఒక్క ఏడాది లోనే అది మూతపడే పరిస్థితి దాపురించింది. 
నాలుగు నెలలుగా ఉద్యోగులకు జీతాలు లేవు. 
ఇదే పరిస్థితి ఎదురైతే మన తెలుగు వీర జర్నలిస్టులు, టెక్నీషియన్లు ఏమి చేస్తారు? అది ఊహించడం పెద్ద కష్టం కాదు. కనిపించిన ప్రతి ఒక్కడికీ... తమ దుస్థితి గురించి చెప్పుకుని కన్నీరు కారుస్తారు కొందరు. మరి కొందరు... "ప్లీస్... కనీసం ఒక నెల జీతం ఇప్పించండి..." అని బతిమాలి అది తీసుకుని ఐ డీ కార్డు, ఫోన్ చిప్పు గప్ చిప్పుగా అప్పగించి ఇళ్ళకు పోతారు. మరి కొందరు కార్యశూరులు ప్రెస్ క్లబ్ కు వెళ్లి రెండు రోజులు మందు కొట్టి... మరుసటి వారం ఎవడివో కాళ్ళు పట్టుకుని మరొక ఛానెల్ లో తక్కువ జీతానికి చేరి ప్రజా సేవ మొదలు పెడతారు. 
దీనికి భిన్నంగా కేరళ జర్నలిస్టులు యజమానుల పరువు పంచనామా చేసి కొమ్ములు వంచే పనికి శ్రీకారం చుట్టారు. జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకు ఆ ఛానెల్ ఉద్యోగులు కొందరు నిరసనగా... తమ మకాంను ఆఫీసుకే మార్చారు... ఇళ్ళకు జీతాలు చెల్లించే స్థోమత లేక. స్టూడియో లోనే వంటా వార్పూ చేస్తున్నారు. 
అయ్యా తెలుగు జర్నలిస్టులూ...మీరు కూడా మనుషులే. మీకూ కొన్ని హక్కులనేవి ఏడుస్తాయి. పోరాడాలంటే కొన్ని పరిమితులు ఉంటాయని అందరికీ తెలుసు. అన్యాయాలకు వ్యతిరేకంగా కనీసం గొంతెత్తక పొతే మనం ఈ వృత్తికి పనికిరామని అర్థం. మరి మీ ఇష్టం.