Friday, January 29, 2021

రైతుల ప్రదర్శన-రాజదీప్ పై చర్య-ఎడిటర్స్ గిల్డ్ ప్రకటన

భారత గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో రైతుల నిరసన ప్రదర్శన నేపథ్యంలో ప్రభుత్వానికి మీడియాకు మధ్య మరొకమారు ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. 

జనవరి 26 న ప్రదర్శనలో పాల్గొన్న ఒక రైతు మరణిస్తే... ఆయన పోలీసు కాల్పుల్లో బులెట్ కు బలయ్యారని ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజదీప్ సర్దేశాయ్ సహా కొందరు జర్నలిస్టులు ట్విట్టర్లలో, వార్తల్లో ప్రసారం చేయగా... ఇందుకు సంబంధించి ట్రాక్టర్ బోల్తా పడడం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వాదించారు. ఒక వీడియోను కూడా పోలీసులు విడుదల చేశారు. 

ఈ లోపు ఇండియా టుడే యాజమాన్యం రాజదీప్ ను ఒక రెండు వారాల పాటు తెరమీద కనిపించకుండా చేయడంతో పాటు గా ఒక నెల జీతం కోత విధించినట్లు ప్రకటించింది. దీంతో ఈ సీనియర్ ఎడిటర్ తప్పు చేసినట్లు యాజమాన్యం నిర్ధారణకు వచ్చినట్లు అనిపించింది. అయితే దీని మీద సర్దేశాయ్ స్పందించినట్లు లేదు. తెరవెనుక ఒత్తిడి వల్లనే  ఇండియా టుడే యాజమాన్యం ఈ ప్రకటన చేసిందన్న వాదన ఉంది. 

ఈ లోపు కాంగ్రెస్ ఎంపీ శశి  థరూర్ తో పాటు ఆరుగురు జర్నలిస్టులపై (వారు: మృణాల్ పాండే, రాజదీప్ సర్దేశాయ్, వినోద్ జోస్, జాఫర్ అఘా, పరేష్ నాథ్, అనంత్ నాథ్) లపై పోలీసులు దేశద్రోహం వంటి సీరియస్ అభియోగాలతో కేసులు నమోదుచేశారనే సమాచారం సంచలనం సృష్టించింది . రైతుల ర్యాలీ సందర్భంగా  విధ్వంసం జరగడానికి కారణం వీళ్ళ డిజిటల్ బ్రాడ్ కాస్ట్ లు, సోషల్ మీడియా పోస్టులంటూ ఒక స్థానికుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులుస్పందించి ఈ చర్య తీసుకున్నారట!. 

ఈ చర్యను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. జర్నలిస్టులపై కక్ష గట్టి ఇలా వెంటాడుతున్నారని, ఒక ఉద్విగ్న వాతావరణం ఏర్పడిన గందరగోళ వాతావరణంలో పలు వైపులా నుంచి వచ్చే అన్ని  వివరాలను రిపోర్ట్ చేయడం జర్నలిజంలో సంప్రదాయంగా వస్తున్న విషయమేనని స్పష్టంచేసింది. ఎడిటర్స్ గిల్డ్ ఈ రోజు విడుదల చేసిన ప్రకటన ఇది:





Monday, January 4, 2021

మీడియా మీద పోస్టులు పునః ప్రారంభం....

మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అనుకున్న పని ఏదైనా క్రమంతప్పకుండా చేస్తూ ఉంటే బాగుంటుంది. కానీ వృత్తిపరమైన ఏవేవో కాలిక్యులేషన్స్ మధ్యలో దూరి అట్లా కాకుండా చేస్తాయి. రెండు దశాబ్దాల పాటు పత్రికారంగంలో ఉన్నాక... ఏడేళ్లు కుస్తీపడి జర్నలిజంలో పీ హెచ్ డీ చేసింది బోధనా రంగంలోకి వెళ్లాలని. ఫీల్డులో మనం నేర్చుకున్నది పిల్లలకు నేర్పితే ప్రయోజనకరంగా ఉంటుందని. మీడియా వీడి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఐదేళ్లు తాత్కాలిక ప్రాతిపదికన విజిటింగ్ ప్రొఫెసర్ హోదాలో పనిచేస్తూ అక్కడ ప్రింట్ జర్నలిజం ఆరంభించాక దక్కిన ఆదరాభిమానాలు చూసి అక్కడే శాశ్వతమైన ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాను. 'ఈ ఉద్యోగం నీదే' అని ఘంటా పదంగా చెప్పిన పెద్దలు పేద్ద హాండ్ ఇచ్చారు... ఉస్మానియా యూనివర్సిటీ లో పనిచేసిన నీ అభిమాన ప్రొఫెసర్ ముందుగా ఊహించి హెచ్చరించినట్లే. విధివశాత్తూ... అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) లో అదే సమయంలో 'ఎడిటర్ అండ్ పీ ఆర్ ఓ' అనే పోస్టు పడితే ఆలిండియా కామిటీషన్ లో వచ్చింది. 2014 ఏప్రిల్ రెండు నుంచి కరోనామొన్నమొన్నటిదాకా అక్కడ పనిచేసాను.  ఆగస్టులో  ఒకసారి తప్పిన ఒక రోడ్డు ప్రమాదం నాటి సాయంత్రం ఆలోచిస్తే అర్థమయ్యింది... ఆ రోజు పొరపాటున ప్రాణాలు పోతే ఆన్ ఫినిష్డ్ అజెండా (టీచింగ్) తోనే పోయి ఉండేవాడినని. అందుకే 2020 నవంబరు 30 తో ఆస్కీ నుంచి సెలవు తీసుకుని బైటపడ్డా.వెంటనే బోధన సంబంధ పని దొరికింది... నాకు అనువైన సమయాన్ని బట్టి చేసేలా. ఈనాడు నుంచి ది హిందూ కు, అక్కడి నుంచి యూ ఓ హెచ్ కు, తరవాత ఆస్కీ కి వెళ్లిన ప్రతిసారీ దైవకృప కారణంగా మెరుగైన పనులే దొరికాయి. పూర్తిస్థాయిలో ఏదో ఒక యూనివర్సిటీలో టీచింగ్ ఉద్యోగం దొరికేదాకా నేను కొన్ని ప్రయోగాలు చేయాలని పెట్టుకున్నాను. 
ఈ సొద ఎందుకంటే... వెబ్ సైట్లు, యూ ట్యూబ్ ఛానెల్స్ గురించి జనాలకు తెలియక ముందునుంచే ఈ బ్లాగు మొదలై మీ ఆదరణ పొందింది. 
ఆస్కీ లో పబ్లిక్ రిలేషన్స్ అనే పని ఎక్కువగా చేయడం వల్ల మీడియా గురించి రాయడం బాగోదని ఆగాను. ఇప్పుడా మొహమాటాల అవసరం లేదు కాబట్టి... మీడియా సంబంధ విషయాల మీద మళ్ళీ క్రమం తప్పకుండా రాయాలని నిర్ణియించాం. 
మా నుంచి త్వరలోనే ఒక యూ ట్యూబ్ చానెల్ కూడా రాబోతున్నది. భిన్నమైన జర్నలిజం, నీతి నియమాలకు లోబడి రాయడం పునః ప్రారంభం చేద్దాం. మీకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.