Saturday, September 30, 2017

దసరా శుభాకాంక్షలతో... మళ్ళా మీ ముందుకు...

ప్రియమైన మిత్రులారా...
నమస్తే.
మీ అందరికీ దసరా శుభాకాంక్షలు.
2009 లో దసరా రోజున మేము ఆరంభించిన ఈ బ్లాగులో రాయడానికి చాలా విషయాలు ఉంటాయని ముందుగా భావించాం. నిజంగానే ఉండేవి కూడా. మీడియా పరిణామాలు ఎవ్వరూ రాయనివి ఉత్సాహంగా, నిష్పాక్షికంగా రాశాం. చాలా మంది దీనికి అభిమానులు అయ్యారు. రాయడం ఆపేసి చాలా రోజులవుతున్నా....  'మీ బ్లాగ్ ఫాలో అయ్యే వాడిని. బాగుండేది. ఎందుకు ఇప్పుడు రాయడం లేదు?" అని మిత్రులు అడుగుతుంటే ఏమీ చెప్పలేక మిన్నకుండాల్సి వస్తోంది.

ఏముంది రాయడానికి, చెప్పండి? ఒకటే కథ. తెలుగు పత్రికలు, ఛానల్స్ పూర్తి స్థాయిలో గబ్బుపట్టి పోయాయి. లాభాపేక్ష. కుల గజ్జి. రాజకీయ ఎజెండా. జర్నలిస్టులను దోచుకోవడం. నికార్సైన వారిని కాకుండా... తిమ్మిని బమ్మిని చేసే జర్నలిస్టులను అందలం ఎక్కించి డబ్బు చేసుకోవడం. వృత్తిలో ఉన్న వారిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తొలగించడం. ఇవేవీ పట్టనట్లు జర్నలిస్టు సంఘాల నేతలు చల్లగా మీడియా విశ్లేషకుల అవతారం ఎత్తి కోటు వేసుకుని యాజమాన్యాల భజన పరులుగా మారడం, ఈ క్రమంలో 80 శాతం జర్నలిస్టుల బ్రోకర్లు గా, ప్రకటనల సేకర్తలుగా మారడం. ఇదే కథ. పైగా తెలుగు టీవీ ఛానెల్స్ జర్నలిజం ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చాయి. జర్నలిస్టులకు పిల్లలను ఇవ్వడం లేదు. ఆడపిల్లలు వృత్తిలోకి రావడానికి భయపడే పరిస్థితి! 

అన్ని చోట్లా యథా క్రమంగా ఇది జరుగుతుంటే... వ్యవస్థ మారాలని రెచ్చిపోయి రాయడం... విలువలు కాపాడాలని మొత్తుకోవడం... శతృవర్గాన్ని పెంచుకుని టెన్షన్ పడడం...  ఎందుకొచ్చిన లంపటం? అని రాయడం ఆపాం.

కానీ, రాయకుండా ఉంటే.. కొన్ని విషయాలు బైటికి రాకుండా పోతున్నాయి. మీడియాలో సమాచారం బైటికి రావడం లేదు. పైగా.. ఉన్న కలుషిత వాతావరణం లో నైనా.. నీతి నిజాయితీ గా ఉండే వారి గొంతు వినిపించకపోవడం బాగోలేదని అనిపిస్తున్నది.

పైగా... మా బ్లాగు బృందం మీడియా, సామాజిక, క్రీడారంగాల్లో చేసే కొన్ని మంచి పనులు మిత్రులతో పంచుకోవడానికి బ్లాగు ఉపకరిస్తుంటే ఎందుకు వాడుకో కూడదని మాకు అనిపించింది. రాజకీయ చర్చలకు కూడా వాడుకోకుండా మూసుకుని కూర్చోవడం ఏమీ బాగోలేదని అనిపించింది.
అందుకే.. తోచినప్పుడల్లా మళ్ళీ రాద్దామని నిర్ణయించాం.
సాధ్యమైనన్ని మంచి పోస్టులతో తరచూ  కలుద్దాం.
మరో సారి... విజయ దశమి శుభాకాంక్షలు.