Sunday, March 29, 2020

జర్నలిస్టుల ఉద్యోగాలపై కోవిడ్ దుష్ప్రభావం!

తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటివి జర్నలిస్టుల ఉద్యోగాలు. ప్రపంచవ్యాపంగా ఇట్లానే ఏడ్చినా... భారత్ లో అందునా... తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువ.

కోవిడ్-19 ప్రభావంతో పురుగుతున్న మరణాల సంఖ్యతో, వైరస్ వ్యాప్తిలో యావత్ ప్రపంచం స్తంభించగా, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ఒక పక్షం రోజుల్లోనే అన్ని రంగాలూ తలకిందులై అగమ్యగోచరమైన భవిష్యత్తుతో బిక్కుబిక్కుమంటున్నాయి.

 కోవిడ్-19 సంబంధ లాక్ డౌన్ వల్ల ప్రజల జీవనశైలి, అభిరుచులు ఊహించని రీతిలో మారిపోయాయి. కాఫీనో టీ నో తాగుతూ పేపర్ చేతిలోకి తీసుకుని చదివి ఆనందించే ప్రజలు... దాని ద్వారా వైరస్ సోకుతుందన్న భయంతో గడగడలాడుతున్నారు. అదే సమయంలో వార్తాపత్రికల పంపిణీ వ్యవస్థ ఒక్కసారిగా నిలిచిపోయింది. దీంతో, పత్రికల యజమానులు తమ ఆలోచనా ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

వెంటనే అన్ని పేపర్లు పీడీఎఫ్ రూపంలో మన మొబైల్ లోకి రావడం మొదలుపెట్టాయి. కొనుక్కున్నప్పుడు ఒకటి రెండు పేపర్లు ఇంటికొచ్చేవి. ఇప్పుడు సుఖంగా... అరడజనుకు పైగా పేపర్లు మొబైల్ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతున్నాయి. అవసరమైన వార్తలు ఎంచుకుని, అక్షరాలు పెంచుకుని చదువుకునే సౌలభ్యంతో పాటు నచ్చిన వార్తను లేదా వ్యాసాన్ని చక్కగా కట్ చేసుకుని దాచుకునే సూపర్ సౌలభ్యం ఇందులో ఉంది. ఒక నెల రోజుల పాటు ఇట్లా అలవాటు పడ్డ పాఠకుడు మళ్ళీ పేపర్ జోలికిపోతాడా అన్నది అనుమానమే.

పెరిగిన ఖర్చులు,బాగా రాని  వాణిజ్య ప్రకటనల కారణంగా... ఆన్ లైన్ ఎడిషన్లకు మారిపోవాలని అనుకుంటున్న ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ వంటి వార్తాపత్రికాలకు ఇది ఒక మంచి అవకాశమైంది. మిగిలిన పత్రికలూ ఈ ప్రయోగం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు నేల మీద జర్నలిజం రూపురేఖావిలాసాలు మారే అవకాశం కనిపిస్తున్నది. ఇందులో మొట్టమొదట బలయ్యేది సీనియర్ జర్నలిస్టులు. ది హిందూ లాంటి పత్రికలూ ఆదా లో భాగంగా జర్నలిస్టులను తగ్గించుకునే ప్రయత్నాలు కరోనా గత్తరకు ముందునుంచే మొదలెట్టింది. రాజకీయ పార్టీల ప్రాపకంతో నడిచే పత్రికల్లో పనిచేసే వారికి పర్వాలేదనుకుంటా. మొట్టమొదటి సారిగా జర్నలిస్టులు ఇళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఇదొక వింత అనుభవం.

మరి ఎలక్ట్రానిక్ మీడియాఈ పరిస్థితిని డీల్ చేస్తుందో అర్థంకావడం లేదు. చాలామంది బలిసినోళ్లు ఏదో పొలిటికల్ ప్రయోజనం ఉండకపోతుందా! అని ఛానెల్స్ పెట్టారు. శిక్షణ ఉన్నా లేకపోయినా జర్నలిస్టులను తీసుకున్నారు. చాలా సార్లు వారిని తీసిపారేస్తున్నారు. ఈ కొత్త పరిస్థితిని యజమానులు ఎట్లా డీల్ చేస్తారో వేచి చూడాలి. జర్నలిస్టు మిత్రులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ప్రార్థిద్దాం.