Saturday, July 27, 2019

రెబ్బవరం స్కూలూ...మరిచిపోలేని అనుభవాలూ...

(ఎస్. రాము)
అభం-శుభం, కల్లా-కపటం, పాపం-పుణ్యం తెలియని బాల్యం ఎవరికైనా మధుర స్మృతే! స్కూల్ రోజులు, అప్పటి మిత్రులు, వారితో అనుభవాలు, అనుబంధాలు మన స్మృతిపథంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఖమ్మం జిల్లా రెబ్బవరం అనే గ్రామంలో ఏడో తరగతి దాకా నేను చదివిన జిల్లా పరిషత్ హై స్కూల్ రోజులు ఇప్పుడు 50 ఏళ్ళు మీదపడినా మనసు పొరల్లో తీపి గుర్తుల్లా ఉండిపోయాయి. పేస్ బుక్, వాట్సప్ పుణ్యాన బాల్య మిత్రుల గురించి తెలుసుకుని వారిలో కొందరితో మాట్లాడే సుమధుర అవకాశం ఈ వారం దక్కింది.

వృత్తిరీత్యా మా నాన్న గారికి రెబ్బవరం బదిలీ అయ్యింది తిరుమలాయపాలెం అనే మరొక చోటు నుంచి. రెబ్బవరానికి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గొల్లపూడి మా పుట్టినూరు. స్కూల్ పక్కనే ఉన్న పశువుల ఆసుపత్రిలో మా నాన్న పనిచేసేవారు. దానికి కుడి వైపున రోడ్డు దాటగానే ఉండే ఇంట్లో బిక్కసాని కుసుమ అనే వారు ట్యూషన్ చెప్పేవారు. మొదట్లో కుసుమ టీచర్ దగ్గరా.. తర్వాత వెంకటేశ్వర రావు గారు అనే సార్ దగ్గర ట్యూషన్ చదివాను.

రెబ్బవరానికి ఆరేడు కిలోమీటర్ల  దూరంలో ఉండే ఖానాపురం, కొండకుడిమ తదితర గ్రామాల నుంచి పిల్లలు చదువుకోవడానికి వచ్చేవారు. వారిలో చాలా మంది పొలాల మీదుగా నడుచుకుంటూ వచ్చి వెళ్లేవారు. ఇప్పటి పిల్లలకు ఇది ఊహకైనా అందని విషయం. మూడు నుంచి ఏడో తరగతి దాకా రెబ్బవరం స్కూల్లో చదివినా అక్కడి అనుభవాలు భలేవి. బాగానే చదువుతాడని పేరున్న నాకు అక్కడి విషయాలు చాలా గుర్తున్నాయి. ఎనిమిది నుంచి ఇంటర్ వరకూ వైరాలో, డిగ్రీ కొత్తగూడెం లో, జర్నలిజం కోర్సులు-డాక్టరేట్ హైదరాబాద్లో చేసినా రెబ్బవరం అనగానే మనసు ఉప్పొంగుతుంది.

పాలబుగ్గల పసివాడినైన నాకు... కల్లు గీసే వృత్తిలో ఉన్న క్లాస్ మెట్ కొండయ్య సహవాసం వల్ల సిగిరెట్లు, బీడీలు తాగే అలవాటయ్యింది--ఆరో తరగతిలో.  స్కూల్ విడిచి పెట్టాక దాదాపు ఆరు నెలల పాటు కొండయ్య తో పాటు పొగ ఊదాను. మదార్ సాహెబ్ అనే పహిల్వాన్ లాగా ఉండే అబ్బాయి ఈ విషయాన్ని అమ్మ చెవిలో వేయడం, జీవితంలో మొదటి-ఆఖరి సారి  అమ్మ నన్ను పిచ్చి కొట్టుడు కొట్టడం, మనం ధూమపాన అధ్యాయానికితెర దించడం జరిగాయి. పాపం... కొండయ్య కాలం చేశారని ఎవరో చెబితే బాధేసింది. మరొక సారి... బట్టతలతో ఉండే కృష్ణయ్య గారనే తెలుగు మాస్టారు టేకు చెట్టు కింద పాఠం చెబుతుంటే ఆయన వెనుక వెళ్లి వేళాకోళంగా డాన్స్ చేస్తూ పక్కనే పశువుల ఆసుపత్రిలో ఉన్న మా నాన్న కంట పడ్డాను. ఆ రోజు మాంఛి బడిత పూజ జరిగింది.

కుసుమ టీచర్ గారి అన్నగారి అమ్మాయి బిక్కసాని కల్యాణి ఆరో తరగతిలో ఎందుకో అక్కడ చేరింది. అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్టు వచ్చి ఆమె నాకు దుఃఖాన్ని మిగిల్చేది. అలాంటి చదువరులు క్లాసులో ఉంటే పోటీ తత్వంతో మనమూ రాణిస్తాం. స్కూల్ గ్రౌండ్ లో తాను నీళ్లు తాగుతుంటే బోరింగ్ కొడుతూ బొటన వేలుకు నేను చేసుకున్న గాయం తాలూకు మచ్చ ఇంకా ఉంది. తానూ, హరిప్రసాద రెడ్డి అనే మరో మంచి మిత్రుడు ఒక ఏడాది మాత్రమే చదివి వెళ్లిపోయారు. ఒక ఏడేళ్ల కిందట కల్యాణి గారు నుంచి నాకు వచ్చిన ఫోన్ ఒక మరిచిపోలేని ఘట్టం. ఉస్మానియాలో ఎం బీ బీ ఎస్ చదివి ఆమె డాక్టర్ కల్యాణి అయ్యారు. ఈ బ్లాగ్ వల్ల ఆమెకు నా ఫోన్ నంబర్ దొరికింది. ఆ తర్వాత కొన్ని సార్లు వారిని కలిసాను. వారి జీవిత భాగస్వామి (తానూ డాక్టరే) ని కూడా కలిశాను. ఇద్దరూ సాత్వికులు, మృదు భాషణ చేస్తారు. ఒక్క ఏడాది మాత్రమే కలిసి చదివినా... తన ఆచూకీ కోసం నేను ఎంత ప్రయత్నం చేసిందీ డాక్టర్ కల్యాణికి వివరించాను.

బాబూ రావు, తన్నీరు వేంకటేశ్వర్లు, తిరుమల రావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, పద్మ, లక్ష్మి, జ్యోతి, రాఘవమ్మ నాకు బాగా గుర్తున్నా... ఖానాపురం నుంచి వచ్చే రాజశేఖర్, కృష్ణా రావు, వెంకటేశ్వర్లు పట్ల నాకు ప్రత్యేక అభిమానం ఉండేది. ఎందుకో గానీ కొండకుడిమ రాంబాబు చేతి రాత నాకు బాగా గుర్తుంది. తాను కుదిరించి రాసేవాడిని నాకు గుర్తు. ఒకసారి రాంబాబు తో నాకు గొడవై క్లాసులో బాహాబాహీకి దిగాం. ఆ భీకర పోరాటంలో... రాంబాబు కాలు మీద వచ్చిన సెగడ్డను నేను కావాలనో, చూసుకోకనో నొక్కాను. తాను విలవిలలాడుతూ ఏడిస్తే.. నేను చాలా రోజులు పశ్చాతాపం తో కుమిలిపోయాను.

ఖానాపురం నుంచి వచ్చే వారిలో ఉంగరాల జుట్టు తో, మెరిసే కళ్ళతో ఉండే రాజశేఖర్  ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు చేసాను. రాజశేఖర్ అనే పేరు ఉన్న వాళ్లకు ఎఫ్బీ లో మెసేజ్ లు పెట్టినా లాభం లేకపోయింది. ఈ రెబ్బవరం గ్రూప్ పుణ్యాన... నిన్న రాత్రి.. దుబాయ్ లో స్థిరపడిన రాజా తో చాలా సేపు మాట్లాడాను. చిన్నప్పటి విషయాలు గుర్తుకు చేసుకుని మేమిద్దరం గతంలోకి వెళ్లిపోయాం. ఇట్లా రాస్తూ పొతే అప్పటి అనుభూతులు బోలెడు.
గన్నుతో పిట్టలు కొట్టే లెక్కల మాస్టర్ సోమనర్సయ్య గారు, క్లాస్ ఎగొట్టి గిన్నెకాయలు కోసుకోవడానికి వెళ్లినా పట్టించుకోని హిందీ టీచర్ అచ్చమాంబ  గారు, అమితాబ్ బచ్చన్ లా ఉండే ఇంగ్లిష్ సార్ రవీంద్రనాథ్ గారు, రాగయుక్తంగా పద్యాలు చెప్పే వెంకటప్పయ్య గారు, మా క్లాసుకొచ్చి మా అన్నయ్యను తిట్టే అబ్బూరి కోటేశ్వర రావు గారు, నా క్రీడా జీవితానికి పునాది వేసిన స్కూల్ మైదానం, స్కూల్ బైట అమ్మే సేమియా ఐసు... అన్నీ తీపి గుర్తులే!

మునుపటి తరంలో మా అమ్మకు కూడా అదే స్కూల్లో పాఠం చెప్పిన వెంకటప్పయ్య గారు నా మదిలోచెరిగిపోని ముద్రలా వేసి, నాకు జీవితంలో ఎంతో స్ఫూర్తినిచ్చిన ఒక పద్యంతో ఇది ముగిస్తా.

కొంపగాలు వేళ, గునపంబు చేబూని
బావి త్రవ్వ నేమి ఫలము గలుగు
ముందుచూపు లేని మూర్ఖుండు చెడిపోవు
లలితసుగుణజాల! తెలుగుబాల!!


Wednesday, June 26, 2019

రమేష్ కందుల, నరేష్ నున్నల మీద దాడి తగదు!

ప్రభుత్వాలు మారినప్పుడు కొందరికి పదవులు పోవడం, కొందరికి కిరీటాలు రావడం సహజం. 'ఆంధ్రప్రదేశ్' మాగజీన్ చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల, ఎడిటర్ నరేష్ నున్న గార్ల మీద ప్రచురిస్తున్న కథనాలు బాధకలిగిస్తున్నాయి. ఒకవేళ ఏదైనా రాయాలనుకున్నా ... వారి వివరణ లేకుండా ఏకపక్ష దాడి చేయడం మంచి పధ్ధతి కాదు.

కావాలని ప్రభుత్వ పత్రికలో కొత్త ముఖ్యమంత్రిని గేలి చేసేవిధంగా వార్తలు లేదా ఫోటోలు ప్రచురించేంత కుసంస్కారులు గానీ బుద్దిహీనులు గానీ వీళ్ళు కాదు. కేవలం జర్నలిజాన్ని నమ్ముకుని ఉన్న వారు వాళ్ళు ఇద్దరూ. వాళ్ళమీద లేనిపోని కథనాలు ప్రచురించడం భావ్యంగాలేదు. భార్య వైద్యురాలైన రమేష్ గారి విషయం పర్వాలేదు కానీ ఉద్యోగం లేకుండా నెలైనా గడవని జర్నలిస్టు నరేష్ గారు. వృత్తిలో ఒక్క రూపాయి అదనంగా సంపాదించలేదు. కేవలం జర్నలిజాన్ని నమ్ముకుని ఆయన సాగించిన, సాగిస్తున్న బతుకు పోరాటం గొప్పది. జర్నలిస్టులకు అన్యాయం చేసిన సంస్థ పై స్థోమతకు, తాహతుకు మించి పోరాటం చేసిన యోధుడు ఆయన. సంస్థలు అన్యాయం చేస్తున్నా బూట్లు నాకుతూ బతికే మెజారిటీ లో చేరి భజన చేసే రకం కాదిది. ఇలాంటి వారికి వృత్తిలో తలవంపులు తెచ్చేలా రాయడం సబబు కాదు. 

కందుల రమేష్ గారికి చంద్రబాబు మీద అభిమానం ఉండవచ్చు. ఆ సంబంధాల కారణంగా ఆయనకు 'ఆంధ్రప్రదేశ్' పత్రిక నిర్వహణ బాధ్యత లభించి ఉండవచ్చు. అదేమన్నా తప్పా? నిజానికి ఆ పదవికి తగినట్లు సరిపోయే సంపత్తి జర్నలిస్టు ఆయన. వెబ్ సైట్లలో అయన గురించి లేనిపోనివి రాస్తున్న వాళ్లకు తెలుసో తెలియదో గానీ... కొందరికి మెయిల్ ఐడీ లు లేనికాలంలోనే అయన వెబ్ జర్నలిస్టు. ఇలాంటి వాళ్లకు కులం ముద్ర వేయడం మంచిది కాదు. అదే సమయంలో, రమేష్ కందుల గారు తన వివరణలో వాడిన పదజాలం అయన స్థాయికి తగినట్లు మాకు అనిపించలేదు.

కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని పొగడాలంటే పొగుడుకోవచ్చు గానీ జర్నలిజం లో సీనియర్లు గా సేవలందించిన ఇలాంటి వాళ్ళ మీద అక్షర దాడి చేయడం పొరపాటు. 30 సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్న ఇలాంటి వారిని  గురించి పిచ్చిపిచ్చి కథనాలు ప్రచురించి బద్నాం చేయాలనుకోవడం మంచిదికాదని భావిస్తున్నాం. దయచేసి ఈ వెబ్ సైట్లు తమ కథనాలను తొలగించడమో, లేదా పూర్తి స్థాయిలో వారి వివరణ ప్రచురించడమో చేయడం ఉచితం. 

Wednesday, June 19, 2019

'ఈనాడు' లో రాహుల్ కుమార్ గారి పరిస్థితి ఏమిటి?

పుష్కరకాలానికి పైగా... అత్యంత కీలమైన 'ఈనాడు' జనరల్ డెస్క్ కు నేతృత్వం వహించిన సీనియర్ జర్నలిస్టు ఎన్ రాహుల్ కుమార్ గారు తెలుగు జర్నలిస్టులు గర్వించదగిన వారిలో ఒకరు. మిత-మృదుభాషి అయిన అయన పుస్తకాల పురుగుగా సమాజం తనను గుర్తించడానికి ఇష్టపడే మనిషి. తనపని తాను చేసుకుపోయే మంచి ప్రొఫెషనల్ అని కొందరు, తాను మాత్రమే జ్ఞానినని భావిస్తూ ఇతరులను కించపరిచే స్వభావం ఉన్న మనిషాయన అని మరికొందరు అంటారు. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి జర్నలిజం ఫీల్డులో. రాహుల్ గారు మాత్రం మిగిలిన చాలా మందిలాగా ప్రమాదకరమైన జర్నలిస్ట్ అయితే కాదు. ఆయన పనిలో ప్రొఫెషనలిజం ఉంటుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం.  

'ఈనాడు' యాజమాన్యం జాగ్రత్తగా పద్ధతి ప్రకారం పెంచిపోషించిన (గ్రూమింగ్) జర్నలిస్టు రాహుల్ గారు.  విశాఖపట్నానికి చెందిన అయన రిపోర్టింగ్ లో ఉండేవారు... నరసింహ రావు, శ్రీనివాసరావు గార్లు బ్యూరో చీఫ్ లుగా ఉన్నకాలంలో. అప్పుడు రాహుల్ గారిని జనరల్ డెస్క్ లోకి మార్చి, అనువాదాలు చేయించి, తెలుగు కాపీలు దిద్దించి... డెస్క్ ఇంచార్జ్ గా చేసి చివరకు మొత్తం పగ్గాలు అప్పగించారు. ఇదంతా రామోజీ రావు గారి కనుసన్నల్లో జరిగిందని చెబుతారు.

కొన్ని నెలల కిందట... రామోజీ గారి కుమారుడు కిరణ్ గారు హడావుడిగా జనరల్ డెస్క్ దగ్గరకు వచ్చి... రాహుల్ గారి స్థానంలో 'ఈనాడు' జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్  మానుకొండ నాగేశ్వర్ రావు గారు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో పడేసారు. అప్పటి నుంచే రాహుల్ గారికి 'ఈనాడు' లో రాహుకాలం ఆరంభమయ్యింది సన్నిహితులు చెప్పారు.

"ఒకప్పుడు రమేష్ బాబు (అప్పటి న్యూస్ టుడే మానేజింగ్ డైరెక్టర్) పరిస్థితి ఇప్పుడు రాహుల్ గారిది. వచ్చి వెళుతున్నారు. నాగేశ్వర్ రావు గారు అమెరికా వెళ్లినా... తాత్కాలికంగానైనా డెస్క్ చూసుకోమని రాహుల్ కు చెప్పలేదు. అయన అంత పెద్ద తప్పు ఏమిచేశారో మాకైతే తెలియదు," అని ఒక జర్నలిస్టు అన్నారు. రాహుల్ గారిని 'ఈనాడు' ట్రీట్ చేస్తున్న విధానం బాధకలిగిస్తున్నదని పత్రిక మారిన మరొక సీనియర్ వ్యాఖ్యానించారు.

(నోట్: ఈ ఫోటో రాహుల్ గారి పేస్ బుక్ పేజీ నుంచి గ్రహించాం. వారికి థాంక్స్) 

Tuesday, June 18, 2019

పుత్రికోత్సాహం పేరెంట్స్ కు...గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు!

(ఎస్. రాము) 
ఏదో ఆసక్తి కలిగించడం కోసం ఆ శీర్షిక కానీ... తల్లిదండ్రులకు పుత్రికలు ఉత్సాహం తెప్పించే సందర్భాలు అనేకం ఉంటాయి. నిన్న (జూన్ 17, 2019) ఉస్మానియా విశ్వవిద్యాలయం 80 వ స్నాతకోత్సవం సందర్భంగా ఠాగోర్ ఆడిటోరియంలో  మా అమ్మాయి మైత్రేయికి గవర్నర్ నరసింహన్ గారు యుధ్వీర్ గోల్డ్ మెడల్ ప్రదానం చేసిన ఘట్టం అలాంటిదే. కాకపోతే, తానూ మాతోపాటు మురిసిపోయిన అపూర్వ ఘట్టం అది. 

ఇరవై ఏళ్ళ కిందట (1998-99 బ్యాచ్) నేను ఆర్ట్స్ కాలేజ్ లో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (ఎం సీ జె) ప్రవేశ పరీక్షలో ఫస్టు రాంకు లో పాసై సీటు సాధించాను. అప్పుడు 'ఈనాడు' లో సాయంత్రం నుంచి రాత్రంతా ఉద్యోగం చేసి వీలున్నప్పుడల్లా క్లాసులకు పోయి చదివాను. అప్పటికే బాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (బీ సీ జె) లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినందున 'షోయబుల్లాఖాన్ గోల్డ్ మెడల్' వచ్చింది.  ఎం సీ జె లో మూడు గోల్డ్ మెడల్స్ (ఓవరాల్ మార్క్స్, ఎడిటింగ్, ప్రాజెక్టు రిపోర్ట్) మనకే దక్కాలన్న పిచ్చి ఆశ ఉండేది. ఎడిటింగ్ లో మూడు మార్కుల తేడాతో వేరే అమ్మాయికి ఆ మెడల్ వచ్చింది. ఓవరాల్ గా కూడా ఆ అమ్మాయికి గోల్డ్ మెడల్ వచ్చింది. నేను మాత్రం అత్యుత్తమమైన ప్రాజెక్టు రిపోర్ట్ కు ఇచ్చే 'ఉర్దూ అకాడమీ గోల్డ్ మెడల్' తో సంతృప్తి పడాల్సి వచ్చింది. జర్నలిస్టుగా, జర్నలిజం బోధకుడిగా పనిచేస్తూ  అదే డిపార్ట్మెంట్ లో పీ హెచ్ డీ పట్టాపొందినా రెండు మెడల్స్ చేజారిన అసంతృప్తి మిగిలిపోయింది. 

విధివశాత్తూ...  నా కూతురు మైత్రేయి కూడా జర్నలిజం కోర్సు చేయాలనుకుని హైదరాబాద్ లోని 'రచన జర్నలిజం కాలేజ్' లో చేరింది. 2016-18 సంవత్సరానికి గానూ ఉన్న ఏకైక యుథ్వీర్ గోల్డ్ మెడల్ సాధించింది. ఇరవై ఏళ్ళ కిందట నేను మిస్ అయిన మెడల్ ఇది కావడంతో నాకు ఆనందం అనిపించింది. ఫాదర్స్ డే మరుసటి రోజున తాను నాకు ఇచ్చిన కానుక అని...గర్వంగా ప్రకటించింది.  ఇది తెలిసిన మిత్రులు... 
 తండ్రిని మించిన కూతురంటూ అభినందనలు పంపారు. అందరికీ థాంక్స్. 
అయితే... మా ఇంట్లో ఉన్న మూడు జర్నలిజం గోల్డ్ మెడల్స్ చెందాల్సింది... హేమ కుమారికి. అప్పట్లో నాకు, ఇప్పట్లో మైత్రేయికి స్ఫూర్తినిచ్చింది తనే. ఎనిమిదేళ్ల పాటు టెలివిజన్ జర్నలిస్టుగా పనిచేసిన హేమకే ఇవి అంకితం. 

Wednesday, June 12, 2019

వార్నీ...జర్నలిస్టుల గుట్టు రట్టు చేస్తివే...పేర్నీ!

నిజానికి  జర్నలిజం ఒక భయకరమైన తీట ఉద్యోగం. ప్రజాసేవకోసమని ఉజ్జోగంలో చేరి...ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా...  బైలైన్స్, సాల్యూట్స్ కు మరిగి... వెనక్కిచూసుకునేలోపు ఏ ఉద్యోగానికీ అర్హులుకారు కలం వీరులు, మీద పడిన వయస్సు వల్ల. ఈ తత్వం బోధపడి నీతిని గోతిలో పాతిపెట్టి అందినంత కుమ్మే బతకనేర్చిన జర్నలిస్టులు కొందరైతే, నీతినియమాలతో మాత్రమే నేసిన బట్టలు వేసుకుని వృత్తిలో మచ్చరాకూడదని అనుకుంటూ నెలసరి జీతం ఆలస్యమైతే వెంపర్లాడుతూ... చేబదుళ్ల మీద బతికే సత్యసంధులు మరికొందరు.  ఏ డబ్బుతో పెట్టారన్నది మనకు ప్రస్తుతం అనవసరం  గానీ, ఆ మహానుభావుడు వై ఎస్ ఆర్ సాక్షి మీడియా అనే ఆలోచన చేసి ఉండకపోతే...చాలా మంది జర్నలిస్టులు చచ్చివూరుకునే వారు.

ఇదిలావుండగా,  వై ఎస్ ఆర్ గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ కాబినెట్ లో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని మంత్రి హోదాలో మొదటి ప్రెస్ మీట్ లో జర్నలిస్టుల గురించి భలే వ్యాఖ్యలు చేశారు. 'విలేకరులతో నేను ఫ్రెండ్లీ గా ఉంటాను. యాజమాన్యాలు మీతో ఎలా ఉంటాయో నాకు తెలుసు. మీరు నాకు కొత్త కాదు. మీ చినిగిపోయిన బనీన్ల గురించి నాకు తెలుసు. చొక్కా బాగుంటే బనీనుండదు. బూటుబాగుంటే లోపల సాక్స్ చినిగిపోయి ఉంటది. మోటార్ సైకిల్ ఉంటది, లోపల ఆయిల్ ఉండదు. పిల్లల ఫీజు కట్టలేదని బాధలు. ఇంట్లో సరుకులు లేవని బాధలు...." అంటూ అయన ఆరంభించారు.

 ఇన్ని బాధలు పడి విలేకరులు ఈ వృత్తిలో ఎందుకు ఉంటున్నారంటే... మర్యాద కోసమే... అని కూడా నాని గారు చెప్పారు. "డబ్బులేకయినా, బాధలున్నా, ఇంట్లో వాళ్ళు మన మీద తిరగబడినా... ఇంట్లోంచి బైటికి రాగానే... ప్రతోడు 'నమస్తే సార్' అంటాడు.. ఆ నమస్కారం కోసమే ఇది ఒదలట్లేదని మీకూ తెలుసు.. నాకూ తెలుసు..." అని అయన నమస్తే చేసి చూపిస్తూ  చెప్పారు (ఫోటో చూడండి). తాను పండితుడిని కాదని, పామరుడ్నని, ఏ టైంలో వచ్చయినా విలేకరులు తనను కలవొచ్చని... ఈ బాధలు తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని నాని హామీ ఇచ్చారు.

అమాయకంగా మనసులో మాట చెప్పినా...నాని గారి అబ్సర్వేషన్ అక్షర సత్యం. జర్నలిస్టులకు ఉద్యోగభద్రత ఏ మాత్రం లేదు లేదు, చాలా వరకు కులం ప్రాతిపదికన నడుస్తున్న  ఈ తెలుగు జర్నలిజంలో. జీతాలు రాక కొందరు, ప్రతిభకు-సీనియారిటీకి తగినట్టు జీతాలు, పదోన్నతులు లేక కొందరు అవస్థలు పడుతున్నారు. నిజంగా చిత్తశుద్ధితో జర్నలిస్టులకు నాని, జగన్ గార్లు మేలు చేస్తారని ఆశిద్దాం.
ఈ లోపు జర్నలిస్టులకు జగనన్న వరాలు ఇచ్చారనీ, త్వరలోనే అమలుకు కార్యాచరణ సిద్ధమయ్యింది... అంటూ ఈ కింది మాటలు ప్రచారంలోకి వచ్చాయి. నిజానిజాలు మనకు తెలియదు.

త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు 
తెలంగాణ తరహాలో డబుల్ బెడ్ రూం ఇళ్లని నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం 
ఏ  పాఠశాలలో చదివించినా జర్నలిస్టుల పిల్లలకు ఫీజు ప్రభుత్వమే చెల్లించాలి అని నిర్ణయం 
స్కూల్ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 50 వేలు ... కాలేజ్ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 70 వేలు 
రాష్ట్రంలో జర్నలిస్టు కుటుంబాలకు బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితం...
వర్కింగ్ జర్నలిస్టులకు మండల స్థాయి జర్నలిస్టులకు 5 వేలు గౌరవ వేతనం నియోజకవర్గం,రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు 10 వేలు గౌరవ వేతనం 
పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు 15 వేల  పెన్షన్ 
చిన్న పత్రికలకు జీవం పోసేలా భారీగా ప్రబుత్వ ప్రకటనలు ఇవ్వాలి అని నిర్ణయం 
-జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు నూతన పథకం 
-20 లక్షల వరకూ  వైద్య సహాయం ఉచితంగా అందించేలా రాజన్న జర్నలిస్ట్ హెల్త్ స్కీం 
-అక్రిడేషన్ల జారీ ప్రక్రియ సులభతరం చెయ్యాలి అని నిర్ణయం 
-సచివాలయం లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా క్యాంటిన్ ఏర్పాటు ఉచిత భోజన సదుపాయం

అప్పుడు అంటకాగి ఇప్పుడు రవిప్రకాశ్‌ గగ్గోలు!

తప్పు జరిగినప్పుడు ఇది తప్పని ఠక్కున చెప్పినవాడే నికార్సైన నీతిమంతుడు, దమ్మున్న మొనగాడు. అట్లాకాకుండా... తప్పులో భాగస్వామి అయి బాగా లాభపడి పట్టుపడ్డాక తప్పుకు వేరే వాళ్ళను బాధ్యులను చేస్తూ తోడు దొంగలపై గగ్గోలు పెట్టేవాడ్ని ఏమనాలి?  

టీవీ 9 ఏర్పాటు సమయంలో మారిషస్‌ నుంచి ఫెమా నిబంధనలకు విరుద్ధంగా రూ. 60 కోట్ల నిధులు వచ్చాయని.. ప్రస్తుతం టీవీ 9లో వాటాను విక్రయించిన సందర్భంలో కూడా హవాలా మార్గాల్లోనే నిధులు తరలించారని ఆ ఛానెల్ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ చేసినట్లు వస్తున్న ఆరోపణలు దిగ్భ్రమ కలిగిస్తున్నాయి.  
దురుద్దేశాలతో ప్రభుత్వం తనను వెంటాడుతోందని వాదిస్తూ... అప్పట్లో  కశ్మీర్‌లో ఉగ్రవాదులకు నిధులను తరలించే మార్గాల్లో ఈ నిధులను తరలించారంటూ అయన చెబుతున్నారట. 
ఈ ఘోరాలపైన దర్యాప్తు చేయాలని  సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లకు తాను ఇటీవల ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం తనను వెంటాడుతోందన్నది అయన అభియోగం. అప్పుడుఅంత ఘోరం జరిగితే...ఇంతపెద్ద తురం ఖాన్ జర్నలిస్టు ఎందుకు కిమ్మనకుండా కూర్చునట్టో బోధపడడంలేదు!  
ఇదంతా పిచ్చి, డొల్ల వాదన. ఇప్పుడు ఈ ప్రకటన చేయడం ద్వారా రవిప్రకాశ్‌ తాను జర్నలిజం మౌలిక సూత్రాన్ని (సత్యాన్ని దాచుకోకుండా అందరికీచెప్పడం) తుంగలో తొక్కినట్లు ప్రపంచానికి చాటినట్లు అయ్యింది. 
నిజంగా రవిప్రకాశ్ ఇట్లా అన్నారో లేదో రూఢి కాలేదు కానీ, ఇదే నిజమైతే ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు! 

Tuesday, June 11, 2019

క్రీడా ప్రోత్సాహం పట్టని ప్రభుత్వాలు!

అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను తయారుచేయాలంటే...ప్లేయర్స్ తో పాటు వారి తల్లిదండ్రులు చాలా కష్టపడాలి. సానియా మీర్జా (టెన్నిస్), సైనా నెహ్వాల్, సింధూ, శ్రీకాంత్ (బాడ్మింటన్), హరికృష్ణ (చెస్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), శ్రీజ (టేబుల్ టెన్నిస్)...వీరిలో ఎవ్వరి కథ తీసుకున్నా.. తల్లిదండ్రుల  కష్టాలు, కుటుంబం చేసే త్యాగాలు ఉంటాయి-వారి కఠోర శ్రమ, దృఢ దీక్షతో పాటు. దేశంలో చాలా రాష్ట్రాలకు క్రీడా విధానాలే లేవు. శ్రమపడి పైకొచ్చే ఆటగాళ్లను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ముఖ్యమంత్రులు దయతలిచి మెడల్స్ విన్నర్స్ కు పారితోషకాలు ఇవ్వడం తప్ప... ఒక పథకం ప్రకారం ఆటగాళ్లను ప్రోత్సహించడం జరగడం లేదు. ఇది దురదృష్టకరమైన పరిస్థితి! 

ఈ విషయంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగడాలో, తెగడాలో తెలియదు. ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నా, ఆటగాడు ముస్లిం అయినా... ఇక్కడ ఎంతో కొంత సహాయం అందుతుంది. మిగిలిన వాళ్ళకు వచ్చేది సున్నా. చచ్చు సన్నాసులు-పనికిరాని చవటలు క్రీడా సంఘాలకు నాయకత్వం వహించడం, చిత్తశుద్దిలేని వయసు మళ్ళిన దద్దమ్మలు అలంకారప్రాయంగా పోస్టులలో కొనసాగడం, అంతేవాసులతో పొగిడించుకోవడం కోసమే వాటిని వాడుకోవడం, మంచి క్రీడా సౌకర్యాలతో పాటు నాణ్యమైన కోచ్ లు లేకపోవడం, స్పోర్ట్స్ అథారిటీ దగ్గర నిధుల లేమి, ఇవన్నీ ప్రభుత్వానికి పట్టకపోవడం... ఈ దుస్థితికి కారణాలు. 

ఈ పోస్టు రాయడానికి కారణం.. ఫణిబాబు గారు 'వడ్డించేవాళ్లుంటేనే' అనే శీర్షికతో రాసిన పోస్టు... అందులో చేసిన 19 సంవత్సరాల స్నేహిత్* ప్రస్తావన. తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకూ ఏ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు సాధించని అనేక విజయాలను సాధించినా... రెండు సార్లు వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్ కు అర్హత సాధించిన తొలి తెలుగు వాడైనా... 15 అంతర్జాతీయ టోర్నమెంట్స్ లో 20 కి పైగా మెడల్స్ సాధించినా, ఒక దశలో వరల్డ్ నెంబర్-23 రాంక్ వచ్చినా తెలంగాణా ప్రభుత్వం కనీసం భేష్ అనలేదు, ఆర్థిక సాయం మాట అలా ఉంచితే. 2017 లో జోర్డాన్ లో జరిగిన పోటీలో ఏకంగా టైటిల్ గెలిచి... ఆ ఘనత సాధించిన తొలి తెలుగు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించిన స్నేహిత్ ఆ టోర్నమెంట్ లోనే మరొక రెండు పతకాలు సాధించాడు (ఫోటో చూడండి). తన తోటి గుజరాత్ ఆటగాళ్లకు ఏడాదికి 40 లక్షలు ప్రభుత్వం అందిస్తుంటే.. ఇంటర్నేషల్ రాంక్ కోసం స్నేహిత్ ప్రభుత్వ దన్నులేక ఇబ్బంది పడ్డాడు. స్నేహిత్ కు ఉత్తమ శిక్షణ కోసం, అంతర్జాతీయ పోటీల కోసం కుటుంబం రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి అమ్మాల్సివచ్చింది. ఇది కొన్ని పేపర్లలో కూడా వచ్చింది. 
  
కొద్దిలో కొద్దిగా కేంద్ర ప్రభుత్వమే నయం. ఖేలో ఇండియా వంటి పథకం పెట్టడం వల్ల  ఎంతోకొంత ఊరట లభిస్తున్నది. మరొక వైపు ప్రభుత్వరంగ సంస్థలు కూడా స్కాలర్ షిప్ లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గుజరాత్, హర్యానా, తమిళనాడు, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలను చూసి నేర్చుకంటే బాగుంటుంది. మన దగ్గర ప్రతిభకు కొదవలేదు. ఇప్పుడు కావలసింది ప్రభుత్వ చేయూత. 

ఒక్క స్నేహితే కాదు. ఇలాంటి యువ క్రీడాకారులు, వారి కుటుంబాలు అనేకం ఎన్నో త్యాగాలు చేస్తూ రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్నారు. ప్రభుత్వాలు యువ ఆటగాళ్లను ఆదుకోకపోవడానికి తప్పు పెట్టాల్సింది... స్పోర్ట్స్ అథారిటీ అధికారులను, క్రీడాసంఘాల పెద్దలను. ఇలాంటి వర్థమాన క్రీడాకారులకు ఆర్థికంగా ఆదుకునేలా ప్రభుత్వానికి  ప్రతిపాదనలు పంపి బాధ్యత నిర్వర్తించాల్సిన ఈ వేస్ట్ బ్యాచులు ఆ పనిచేయకపోవడమే పెద్ద సమస్య. మన క్రీడా వ్యవస్థ ఇలా కునారిల్లడానికి తప్పు పెట్టాల్సింది ఈ  మహానుభావులనే.
ఎవరమైనా ఏం చేస్తాం... మంచి రోజుల కోసం వేచిచూడడం తప్ప. 

* (నోట్: ఈ బ్లాగ్ వ్యవస్థాపకులు రాము-హేమల కుమారుడే 19 ఏళ్ళ స్నేహిత్)   

Friday, June 7, 2019

నాటి 'ఈనాడు' కలం వీరుడు... నేడు ఏపీ కమ్యూనికేషన్స్ సలహాదారు

ప్రముఖ దినపత్రికలు 'ఈనాడు', 'సాక్షి' పాఠకులకు సుపరిచితుడైన సీనియర్ జర్నలిస్టు జీవీడీ కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్)గా నియమితులయ్యారు. మృదు స్వభావి, ఆలోచనాపరుడు, వ్యూహకర్త, పదునైన వాక్యాలు, ఉత్తేజభరితమైన ప్రసంగాలు రాయడంలో దిట్ట, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 'కృష్ణా' అని ప్రేమగా పిలిచే కేఎం కు 'తెలుగు మీడియా కబుర్లు' శుభాకాంక్షలు.   

1994-95లో 'ఈనాడు జర్నలిజం  స్కూల్' లో భాషావేత్త బూదరాజు రాధాకృష్ణ గారి దగ్గర జర్నలిజం ఓనమాలు దిద్దుకున్న కృష్ణమోహన్ నేరుగా ఎంతో కీలకమైన సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులో చేరి వేలాది వ్యాసాలు రాశారు. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా భారత్-అమెరికా సంబంధాలపై, ఆర్ధిక విషయాలపై తాను రాసిన వ్యాసాలూ పాఠకుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఎడిటోరియల్స్ రాసే సామర్ధ్యంసాధించుకున్న కేఎం  కులజాడ్యం, కుహానా మేధావుల కుళ్ళు వల్ల 'ఈనాడు' కోల్పోయిన మంచి జర్నలిస్టు. 
దాదాపు ఒకదశాబ్దం పాటు 'ఈనాడు' సీఈబీ లో పనిచేసిన ఆయన 'సాక్షి' లో చేరి తెలుగు జర్నలిజం లో ఒక కొత్త కౌంటర్ జర్నలిజానికి ఆద్యుడు అయ్యారు. తమకు అనుకూలమైన పార్టీకి అనుకూలంగా ప్రత్యర్దులపై బురదజల్లే 'ఈనాడు' కథనాలకు పదునైన జవాబుగా కృష్ణమోహన్ 'సాక్షి' లో "ఏది నిజం?" పేరిట రాసిన సుదీర్ఘ వ్యాసాలు ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై అక్టోబర్ 2009 లో 'కౌంటర్ జర్నలిజం: మీడియాకు మీడియా చెక్' అని మేము ప్రచురించిన వ్యాసం చదవండి. 'ఈనాడు' తరహా ఎటాకింగ్ జర్నలిజాన్ని దగ్గరి నుంచి చూసిన అనుభవం, లా చదవడంతో వచ్చిన పరిజ్ఞానం, అద్భుతమైన రచనా పటుత్వంతో ఆయన "ఏది నిజం?" ద్వారా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తదితరు నేతల మన్ననలు పొందారు. 
కృష్ణమోహన్ గురించి పాలకపార్టీసమాచార మాధ్యమాల్లో వచ్చిన మాటలివి: 
"శ్రీ జీవీడి కృష్ణ మోహన్ గత 9 ఏళ్ళుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొంతుక అయ్యారు. సాక్షి ఆవిర్భావ సమయంలో ఆ పత్రికలో చేరి.. అనతి కాలంలోనే ఏది నిజం.. ద్వారా వ్యవస్థల్లో వేళ్ళూనుకుపోయిన అవినీతిని చీల్చి చెండాడిన ఏకైక జర్నలిస్టు ఈయన. అప్పటి నుంచే  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిగారికి,  ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారికి దగ్గరై.. అప్పటి నుంచి నేటి వరకూ ప్రతి కష్టంలో.. నష్టంలో వైయస్ఆర్ గారి కుటుంబం వెంట నడిచిన వ్యక్తి, జర్నలిస్టు శ్రీ జీవీడీ. 
2011 మార్చి 12న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచే.. ఈ పార్టీతో, వైయస్ఆర్ కుటుంబంలో ఒకరిగా శ్రీ జీవీడి మమేకమై.. పార్టీకి గొంతుకగా పార్టీని నడిపించారు. మీడియాలో పార్టీ వాణిని సూటిగా, ధైర్యంగా, నిక్కచ్చిగా వినిపించేందుకు ఎందరికో తర్ఫీదు ఇచ్చి ఎన్నో గొంతుకలను పార్టీ కోసం తయారు చేసిన  పొలిటికల్ మాస్టారు శ్రీ జీవీడి. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిగారి రాజకీయ ప్రస్థానంలో ఆయనకు ఎదురైన ప్రతి కష్టంలో.. ప్రతి బాధలో.. జీవీడీ ఆయనకు తోడుగా నిలబడ్డారు.  అందుకే జగన్ గారి గెలుపుతో.. జీవీడీ గారికి ఈ విధంగా విజయం సిద్ధించింది."

Thursday, June 6, 2019

సోషల్ మీడియా యోధులకు జగన్ 'స్పెషల్ థాంక్స్'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వారం రోజుల తర్వాత...  జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో తనకు ప్రచారం చేసిన వారికి ఈ ఉదయం ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. తన  ఘన విజయంలో కీలక భూమిక పోషించిన వీరిని 'సోషల్ మీడియా యోధులు'గా పేర్కొంటూ అయన ట్విట్టర్ లో దీన్ని పోస్ట్ చేశారు. ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా  వీరు పోరాడినట్లు ఆయన పేర్కొన్నారు. 

ట్విట్టర్ లో జగన్ కు 1.01 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉండగా ఆయన ఇంతవరకూ 522 ట్వీట్స్ మాత్రమే చేసారు.. @ysjagan   అకౌంట్ నుంచి. ఈ తాజా ట్వీట్ కు మొదటి అర్థగంట లోనే 3,136 లైక్ లు, 685 రీ ట్వీట్స్, 382 కామెంట్స్ నమోదయ్యాయి. 

Wednesday, June 5, 2019

రవిప్రకాశ్ అంటున్న అమ్రిష్ పురి ఎవరు?

ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ఈ రోజు సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు హీరో లా వచ్చారు. నింపాదిగా కారు దిగి ప్యాంటు జేబులో చెయ్యి దూర్చి ఫోటోలకు ఫోజు ఇచ్చి... మీడియాతో క్లుప్తంగా మాట్లాడి సైబరాబాద్‌ సైబర్‌ క్రైం కార్యాలయం లోపలికి  వెళ్ళారు.  ఇరవై ఏడు రోజుల పాటు పోలీసుల కళ్లుకప్పి తప్పించుకు తిరిగిన ఆయన, అంతకు ముందు మీడియాకు పంపిన వీడియోలో కన్నా, చాలా కూల్ గా ఉన్నారు. పోతూపోతూ వీర విప్లవ యోధుడిలాగా... విప్లవం వర్ధిల్లాలి టైపులో పిడికిలెత్తి 'నేను మీ సహకారం కోరుతున్నా' అని చెప్పారు.   

భూకబ్జా తో పోలుస్తూ... ఇప్పుడు మీడియా కబ్జా జరుగుతున్నదని రవిప్రకాశ్ ఆరోపించారు.  మీడియాకు, మాఫియాకు యుద్ధం జరుగుతోందని, ప్రజలంతా మీడియా వైపు ఉండాలని ఆయన కోరారు. తన మానసపుత్రిక అని ప్రచారం జరుగుతున్న మోజో టీవీ ప్రస్తావన తెచ్చారాయన. ఒక్క రూపాయైనా ఇవ్వకుండా దానిని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన అమ్రిష్ పురి వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. ఉచితంగా తీసుకోవాలని చూస్తున్నారని ఆవేదనతో చెప్పారు. 

పలు మీడియా సంస్థలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఒక భవన నిర్మాణ సంస్థ అధిపతిని ఉద్దేశించి రవిప్రకాశ్ ఈ వ్యాఖ్య చేసినట్లు భావిస్తున్నారు.  ఇవ్వాళ మాత్రం రవిప్రకాశ్ సానుభూతి పొందేలా మాట్లాడారని అనిపించింది.  పాలకులకు దగ్గరగా ఉండే వాళ్ళతో పెట్టుకున్న రవిప్రకాశ్ ను అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తాపీగాప్రకటించే అవకాశం ఉంది.  

Tuesday, June 4, 2019

రవిప్రకాశ్ మీద మీడియాలో సానుభూతి లేకపోవడానికి కారణాలు!?

ఫోర్జరీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ పట్ల మీడియాలో సానుభూతిలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. తెలుగులో టీవీ జర్నలిజాన్ని కొత్తపుంతలు తొక్కించిన అయన జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకున్న సీనియర్ జర్నలిస్టు, సీఈఓ. ఇలాంటిది... తనను వేధిస్తున్నారని ఆయన మొత్తుకుంటున్నా... ఎడిటర్స్ గిల్డ్ గానే,  జర్నలిస్టు సంఘాలు గానీ ఒక్క అనుకూలమైన ప్రకటన చేసినట్లు మా దృష్టికి రాలేదు. 

విజయం-ధనం ఇచ్చిన కిక్కు తలకెక్కి విచ్చలవిడిగా వ్యవహరించడం, తాను మాత్రమే పత్తిత్తు... మిగిలిన జర్నలిస్టులు తనకు సాటిరానివారని భ్రమించడం, జర్నలిజం ముసుగులో తాను ఏదైనా చేయవచ్చని భావించడం వల్ల రవిప్రకాశ్ కు ఈ దుస్థితి కలిగినట్లు ఆయన మాజీ సహచరులు భావిస్తున్నారు. 


రవిప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై  సానుకూలంగా స్పందించని సుప్రీంకోర్టు విచారణ అధికారుల ముందు హాజరుకావాల్సిందేనని సూచించింది. ముందస్తు బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని  స్పష్టం చేసింది. ఒకవేళ ఆయనను అరెస్టు చేయాలనుకుంటే 48 గంటల ముందు నోటీసులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 72 గంటల గడువివ్వాలన్న రవిప్రకాశ్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది. తప్పించుకు తిరుగుతూ... ఇప్పటికే వీడియా విడుదలచేసిన ఆయనను అరెస్టు చేసి సత్తా చాటుకోవాలని పోలీసులు కచ్చితంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో... రవి గురించి మీడియాలో ఎందుకు సానుకూల స్పందన లేదన్న దానిపై 'తెలుగు మీడియా కబుర్లు' వాకబు చేసింది. 


"వృత్తిలో గుత్తాధిపత్య ధోరణితో రవి వ్యవహరించారు. ఇతర జర్నలిస్టులతో కలవకుండా... తానే గొప్ప అన్నట్లు మెలగడం వల్లనే.. 'భలే గా దొరికాడ్రా' అని ఇతరులు అనుకుంటున్నారు," అని తెలుగు ఛానెల్స్ లో విశ్లేషకుడైన ఒకరు చెప్పారు. ఈ సోర్స్ ప్రకారం... రవి లైవ్ లోకి వచ్చి మీడియా లో విశ్వసనీయత లోపించిందని క్లాస్ పీకడం కూడా ఆయన పట్ల అననుకూలత సృష్టించింది. "మన ఎదుగుదల, మన ధోరణి, కండకావరం జనం గమనిస్తారు. ఇది పట్టించుని మెలగాలి," ఈ విశ్లేషకుడి సూత్రీకరణ. 

తెలుగు గడ్డ మీద ఉన్న జర్నలిస్టు సంఘాలు ఈర్ష్యాద్వేషాల కారణంగా కిమ్మనలేదని అనుకున్నా... కనీసం దేశ రాజధాని లోని సీనియర్ ఎడిటర్లు స్పందిస్తారని అనుకున్నాం. కానీ అదీ జరగలేదు. రవి టీమ్ లో పనిచేసి తర్వాత తనకంటూ ఒక పేరుతెచ్చుకున్న సీనియర్ జర్నలిస్టు ఒకరు దీని మీద ఇలా స్పందించారు: "ఢిల్లీ జర్నలిస్టులు కూడా కార్పొరేట్ వాతావరణంలో పనిచేస్తున్నారు. రవి చేసిన అభియోగాలలో ఏ మాత్రం పసలేదని వారికి తేలిగ్గా అర్థమైంది. వర్కింగ్ పార్ట్నర్ కు ఉండే పరిమితులు ఏమిటో వారికి తెలుసు. యజమాని ఎవరుండాలో ఉద్యోగి నిర్ణయిస్తానంటే ఎలా?"

లైవ్ లో కి వచ్చి తానే సీఈవో అని చెప్పుకోవడం, రహస్య ప్రదేశం నుంచి వీడియో పంపించడం, అందులో అనాలోచితంగా మాట్లాడడం... వంటి వాటివల్ల రవి దెబ్బతిన్నారని సీనియర్ జర్నలిస్టులు భావిస్తున్నారు. మొత్తమీద రవిప్రకాశ్ లాంటి జర్నలిస్టులకు ఎదురుకాకూడని   విచిత్ర పరిస్థితులు ఎదురుకావడం పట్ల మేము బాధపడుతున్నాం. 
ఈ పోస్టులో పెట్టిన ఫోటో--రవిప్రకాశ్ గురించి తాను కనిపెంచిన టీవీ-9 లో ఫొటోతో సహా వచ్చిన వార్త స్క్రీన్ షాట్. 

Sunday, June 2, 2019

జగన్ కు ఆంధ్రజ్యోతి వే.రా. కౌంటర్!



ప్రమాణ స్వీకారం రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు మీడియా హోస్ ల ప్రస్తావన తెచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 లు బాబుకు ప్రాధాన్యత ఇస్తున్నాయని అయన చెప్పదలచుకున్నారు. దాని మీద...ఈ మూడు సంస్థల స్పందన ఎలా ఉంటుందోనని ఎదురుచూశాం. 'ఈనాడు' వ్యూహాత్మక మౌనం పాటించినట్లుంది. టీవీ-5 ఏమన్నదో తెలియదు.

మూడు సంస్థల పేర్లు ప్రకటించడం ద్వారా "వీళ్లంతా నా శత్రువులని జగన్ డైరెక్ట్ గా ప్రకటించార"ని సీనియర్ ఎడిటర్ ఐ వెంకట్రావ్ మహా న్యూస్ ఛానెల్ లో వ్యాఖ్యానించారు.

చంద్రబాబు తప్ప మరొకరు కంటికానని ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ గారు తన వారాంతపు కాలమ్ 'కొత్తపలుకు' చివర్లో లో స్పందించారు (ఈ పక్క బాక్స్ చూడండి). కేసులు కొత్తకాదని ఆయన కౌంటర్ ఇస్తూ.. కక్ష సాధింపు ఆలోచనలు మానుకుని ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించి మంచి పేరు తెచ్చుకోవాలని వే.రా. చెప్పారు. 

నిజానికి ఈ బాక్సులో మొదటి లైన్ లోనే రాధాకృష్ణ గారి విషప్రచారపు ధోరణి కనిపిస్తుంది. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసి పత్రికలు, ఛానెళ్ల పై కేసులు పెడతానని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించినట్లు ఇందులో రాసింది అబద్ధం.  జగన్ ఆ నాడు చెప్పిన మాటలు వేరు, దానికి  వే. రా.  భాష్యం వేరు. 

మంచి జర్నలిస్టు రమణ కుటుంబానికి సాయమందించాల్సిన సమయం!

బిజినెస్ జర్నలిజం ఆణిముత్యం, మా మంచి మిత్రుడు కొమర్రాజు వెంకట రమణ మమ్మల్ని వీడి ఆరేళ్ళు అయిపోయింది.  
నవ్వుతూ చెలాకీగా ఉంటూ... అందర్నీ 'అన్నా' అని ప్రేమతో పిలిచే రమణ మే నెల 21 వ తేది 2013 న రాత్రి అకస్మాత్తుగా కోమాలోకి వెళ్ళారు. వెంటనే దగ్గరలోని కామినేని ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఐ సీ యూ లో ఉన్న రమణ వైద్యానికి స్పందించలేదు. మే 30 రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు (అప్పటికే ఎనిమిదేళ్లు) ఉన్నారు. జూన్ 20 న రమణ పుట్టిన రోజు. అంతకు మునుపు సంవత్సరం తన పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు చెప్పిన వారికి థాంక్స్ చెబుతూ రమణ ఫేస్ బుక్ లో రాసిన మాటలు, తన కుమారుడు అనాధ కాకుండా వుండడం గురించి ప్రస్తావన ఎంతో వేదన కలిగిస్తాయి. ఫేస్ బుక్ లో రమణన్న రాసిన మాటలివీ....         

I do not want to use any loaded statements but thank you all my friends and well wishers. Some of my old friends including those who were not in good terms with me too called me to wish me. It was amazing. Special thanks to Prof Jyoitirmaya Sharma. Hope all your blessings will help me in keeping my job and earn bread and butter for my family for some more time. My son is just seven years old and I should keep working for at least another 20 years. I am sure your wishes will keep me alive for those many years and would not orphan my child till he settles down in his life. Thank you all.

రమణ కుటుంబానికి ఏదైనా సహాయం అందించాలని బూదరాజు రాధాకృష్ణ గారి శిష్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు, చిత్తశుద్ధి లేనికారణంగా. రమణకు ప్రియ మిత్రుడైన మరో సీనియర్ జర్నలిస్టు సుకుమార్ గారు ఆ కుటుంబం కోసం చాలా తపన పడ్డారు. ఈ మధ్యన సీనియర్ జర్నలిస్టు కూర్మనాథ్ గారు పేస్ బుక్ లో రమణను తలచుకుంటూ ఒక పోస్టు పెట్టారు. 
"సత్యం స్కాం ను ముందుగా పసిగట్టిన జర్నలిస్టు రమణ. ఆయన లేని లోటు పూడ్చలేనిది," అని కూర్మనాథ్ గారు మాతో అన్నారు. 
కూర్మనాథ్మా గారి పోస్ట్కు, ఆ తర్వాత వచ్చిన వ్యాఖ్యలకు స్పందించి మిత్రులు కొందరు స్పందిస్తున్నారు. రమణన్న సతీమణి ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదట. ఇది మంచి జర్నలిస్టు కోసం స్పందించాల్సిన సమయం.  

Saturday, June 1, 2019

తెలంగాణాలో జగన్ కు సూపర్ అవకాశం!

(సీతారామ శేష తల్పశాయి)
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని నేలమట్టం చేసి రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించేందుకు తెలంగాణా ముఖ్యమంతి కే చంద్రశేఖర్ రావు వెళ్లి వచ్చారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలప్పుడు హైదరాబాద్ వచ్చి నోరుపారేసుకున్న తన మాజీ బాస్ కు 'రిటర్న్ గిఫ్ట్' ఇస్తానని కేసీఆర్ ప్రకటించి ఉండడం, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా జగన్ కు అనుకూలంగా గులాబీ దళం ప్రకటనలు చేయడం, వై ఎస్ ఆర్ సీ పీ అనుకున్న దానికన్నా ఎక్కువగా సీట్లు గెలవడం- నేపథ్యంలో తెలంగాణా ముఖ్యమంత్రి జగన్ ప్రమాణస్వీకారానికి వెళ్లడం ప్రాముఖ్యత సంతరించుకుంది. 

తన సంక్షిప్త ప్రసంగంలో కీసీఆర్.. జగన్ ను ఆశీర్వదించారు. తండ్రి నుంచి వారసత్వంగా  వచ్చిన  నాయకత్వ లక్షణంతో జగన్ ఘనవిజయం సాధించారని, చాలా ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని చెబుతూ నదీ జలాల వినియోగం గురించి సూచనలు చేశారు. ఇచ్చిన వాగ్దానాలపై ప్రకటనలు చేసే హడావుడిలో ఉన్న జగన్, తన ప్రసంగం ఆరంభంలో ఒక్క సారి కేసీఆర్ ప్రస్తావన  చేశారు. కానీ, ఆయన చేసిన సూచనల గురించి సూచన మాత్రంగానైనా మాట్లాడలేదు. కే సీ ఆర్ ను పొగడ్తలతో ముంచెత్తలేదు.  సాయంత్రం జగన్, కే సీ ఆర్ కలిసి దేశ రాజధానిలో మోదీ గారి ప్రమాణ స్వీకారానికి వెళ్లాల్సివున్నా కారణాంతరాల వల్ల పోలేదు.

కేసీఆర్ ను జగన్ కుటుంబం వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి బెజవాడ రావాల్సిందిగా ఆహ్వానించిన రోజే ... సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. జగన్ ను కేసీఆర్, కేటీఆర్ తిడుతున్న వీడియో అది. రాజకీయాల్లో అదొక పెద్ద సీరియస్ విషయం కాదు గానీ, కేసీఆర్ వెంట తిరగడం అటు ఆంధ్రప్రదేశ్ కు గానీ, ఇటు జగన్ కు గానీ మంచిది కాదు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగా... కేసీఆర్  తెలంగాణా వాదాన్ని ముందుకు తీసుకువెళ్ళలేని పరిస్థితి ఉండేది. వై ఎస్ ఆర్ ను సందర్భం దొరికిన ప్రతిసారీ తె రా స విడువలేదు. నిజానికి జగన్ తండ్రి గారు బతికి ఉంటే తెలంగాణా నినాదం సన్నగిల్లి ఉండేది, ప్రత్యేక రాష్ట్రం చాలా ఆలస్యమయ్యేది. 

ఇప్పటికే తెలంగాణాలో కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఊపు అందుకుంటున్నది. మూడునెలల  ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించిన పార్టీ పార్లమెంటరీ ఎన్నికల్లో ఘోరంగా (అనుకున్నది 16, వచ్చింది 9) దెబ్బతిన్నది. ప్రత్యేక రాష్ట్రం వస్తే తాను కాపలా కుక్కలా ఉంటానన్న పెద్దాయన, దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని వందల సార్లు చెప్పి మాట తప్పడం జనం మరిచిపోరు. కేసీఆర్ కుటుంబ పాలన పట్ల నిజామాబాద్ ఓటర్లకు ఉన్న అభిప్రాయమే మేధావులకు, విద్యార్హులకు  ఉంది. ఉద్యమానికి గళం, కలం, బలం అందించిన ముఖ్యులను అవమానించి బైటికి పంపి, సొంత కుమారుడ్ని  వారసుడిగా పోషించుకుంటున్న వైనాన్ని  జనం గమనిస్తున్నారు. తాను దండం పెట్టిన ప్రొఫెసర్  కోదండరాం, ఎంతో ఆశతో కాంగ్రెస్ నుంచి వచ్చి సీటు రాక భంగ పడిన కాకా వెంకట స్వామి కుమారుడు వివేక్, ప్రజా గాయకుడు గద్దర్  వంటి వారితో పాటు ఉద్యోగులు, నిరుద్యోగులు రగులుతున్నారు. విశ్వవిద్యాలయాల విద్యార్థులు రానున్న రోజులల్లో కీలక భూమిక పోషించబోతున్నారు.  

ఇప్పుడు తెలంగాణాలో... ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కోసం జనం చూస్తున్నారు. భూస్థాపితం అయిన కాంగ్రెస్ కు, ఊసే లేని బీజీపీ కి పార్లమెంటరీ ఎన్నికల్లో సీట్లు రావడం అందుకు ఒక సూచిక. ప్రజాబలం ఉన్న కాంగ్రెస్ నేతలను కలుపుకుని, టీ ఆర్ ఎస్ అసంతుష్టులను చేరదీసి తెలంగాణపై ఇప్పటినుంచే  దృష్టిపెడితే జగన్ పార్టీకి ఇక్కడ కూడా మంచి అవకాశం ఉంది. తెలంగాణ లోని వై ఎస్ ఆర్ అభిమానులకు జగన్ విజయం బలాన్ని, ధీమానుఇచ్చింది . ఇది గమనించి ఇక్కడ క్యాడర్ ను ఏర్పాటు చేసుకుని... రాజనీతిజ్ఞతతో  వ్యవహరిస్తే జగన్ కు భవిష్యత్తులో మేలు జరుగుతుంది. 

Friday, May 31, 2019

ఎన్నికలు: మీడియా బాద్షాలు.. బద్మాష్ లు..

నిష్పాక్షికత, సత్యసంధత- ఈ రెండూ జర్నలిజానికి కీలకం. ఈ రెండింటి కోసం ఇప్పటి మీడియాలో హై పవర్ భూతద్దాలు పెట్టుకుని వెతికినా కనిపించవు. కట్టుకథలకు, పెట్టుబడికి పుట్టిన విషపుత్రికలు పత్రికలని మహా కవి అన్న మాట మన పత్రికాధిపతులు, ఎడిటర్లు, జర్నలిస్టులు ప్రతిరోజూ నిరూపిస్తుండబట్టి వృత్తి గౌరవం బొత్తిగా లేని వృత్తుల జాబితాలో జర్నలిజం ఏనాడో చేరిపోయింది.  ఇటీవల జరిగిన ఎన్నికల్లోనైతే మీడియా ఘోరంగా బరితెగించి పరువు ఇంకా పోగొట్టుకుంది.

ప్రధాన పత్రికలు బాహాటంగా ఏదో ఒక పార్టీ కి కొమ్ముకాయడం స్పష్టంగా కనిపించడం ఒక ఎత్తైతే...ఎడిటర్లు, యాంకర్లు నిర్మొహమాటంగా పార్టీ కండువాలు కప్పుకుని 'యాక్టివిస్ట్ జర్నలిజం' నెరపడం మరొక ఎత్తు. ఈ అవాంఛిత ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతున్నది. 

తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ  ఎన్నికలు గానీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ, వివిధ రాష్ట్రాలతో పాటు రెండు రాష్ట్రాల్లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు గానీ తరచి చూస్తే  మీడియా ఏ విధంగా తమకు అనుకూలమైన రాజకీయ పార్టీలకు మేలు జరిగేలా, వ్యతిరేక పార్టీలకు కీడు జరిగేలా కథనాలు గుప్పించాయో తెలుగు జనం చూసారు. ఏ మీడియా హౌస్ ఎటువైపు అన్నదాన్ని గురించి మాట్లాడుకోవడం అనవసరం కానీ,  ఎన్నికల నేపథ్యంలో మీడియా లో రెండు మూడు పరిణామాలను చూద్దాం.

 తెలంగాణా రాకముందు... ఉద్యమ కాలంలో అంతా నిజంగానే... కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రామోజీ ఫిల్మ్ సిటీ ని వెయ్యి నాగళ్లతో దున్నిస్తాడేమో అని అనుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ గారిని రామోజీ గారు  ఆహ్వానించడం, అంతా భేషుగ్గా ఉందని ఇద్దరూ తేల్చేయడం తో కథముగిసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'ఈనాడు' ఒక్క నికార్సైన వ్యతిరేకవార్తను ఇవ్వకపోగా, అమ్మాయి అబ్బాయిలకు మాంఛి కవరేజ్ అందిస్తూ వస్తోంది.  

అనాలోచిత వ్యాఖ్య చేసిన మీడియా ఛానెల్స్ ను కేబుల్ ఆపరేటర్ల ద్వారా ప్రభుత్వం ఒక నొక్కుడు నొక్కడంతో తెలుగు మీడియా అంతా సెట్ అయ్యింది. అడపా దడపా ప్రింట్ జర్నలిజం పోసాని (వేమూరి రాధాకృష్ణ గారు) తన కాలమ్ లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ప్రయత్నం చేసినా అన్ని మీడియా హౌస్ లు కిమ్మనకుండా ప్రభుత్వాన్ని పల్లకిలో మోసాయి. దానికి తోడు ప్రభుత్వ అనుకూల మూడు సంస్థలు-- నమస్తే తెలంగాణా, తెలంగాణా టుడే, టీ న్యూస్--అద్భుతంగా పనిచేసాయి. ఇవి కాక, 10 టీవీ, టీవీ 9, ఎన్ టీవీ లు ప్రభుత్వానికి 'మై హోమ్' అయిపోగా, శక్తివంతమైన సాక్షి ఛానెల్, పేపర్ ఫ్రెండ్లీ మద్దతు అందించాయి. 

కేసీఆర్ గారి విషయంలో తోకముడిచిన పసుపు పత్రికలు...బాబు గారికిప్రమాదంగా మారిన జగన్ విషయంలో విశ్వరూప ప్రదర్శన చేశాయి. అయినా...సాక్షి సంస్థలు విరుగుడు ప్రచారంతో పెద్దగా డామేజ్ కాకుండా చూసుకున్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పుకోవాలి.... జగన్ శిబిరం లో ఉన్న రెండు సామాజిక వర్గాలకు చెందిన జర్నలిస్టులు, నాయకులు నేరుగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా కసికొద్దీ చంద్రబాబు, లోకేష్ లను కుమ్మేసారు. ఒకప్పుడు 'ఈనాడు'లో పనిచేసి రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యాన మంచి స్థితికి చేరుకున్న రెడ్డి జర్నలిస్టులు ఒక ఉద్యమంగా పనిచేసి జగన్ అనుకూల పవనాలు ఉధృతంగా వేయడంలో కీలకపాత్రపోషించారు. చాలా ఏళ్ళు రామోజీ రావు గారి దగ్గర పనిచేసి కారణాంతరాల వల్ల చంద్రబాబు పగకు గురైన కొమ్మినేని శ్రీనివాసరావు గారు కులానికి అతీతంగా తెలుగుదేశం గాలి తీయడంలో పోషించిన పాత్ర మామూలుది కాదు. జర్నలిస్టు నేత దేవులపల్లి అమర్ గారు రాత్రి పూట చేసిన చర్చలు ప్రభుత్వ వ్యతిరేక పవనాలు సృష్టించి కొనసాగించడంలో ప్రధాన భూమిక పోషించాయి. 

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు..చంద్రబాబు, వేమూరి మధ్య స్థూడియోలో జరిగినట్లు చెబుతున్న ప్రయివేట్ సంభాషణ చూస్తే దిమ్మతిరుగుతుందనేది వేరే విషయం. మీడియా సంకుల సమరంలో ఎల్లో లాబీ నేలమట్టమైనా... ప్రమాణ స్వీకార మహోత్సవం నాడు ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు కనీసం ఒక ఏడాది పాటు పనిచేస్తాయోమో వేచిచూడాలి!

ఎన్నికల క్రతువు ముగిసింది కాబట్టి... అటు మీడియా యజమానులు, ఇటు పాలకులు.. ఫోర్త్ ఎస్టేట్ శ్రేయస్సు దృష్ట్యా సంయమనం పాటించి ప్రజలకు మీడియా పట్ల మరింత ఏహ్యభావం కలగకుండా చూడాలని అభ్యర్థిస్తున్నాం. 

Thursday, May 30, 2019

జగన్ వ్యాఖ్యపై ఆంధ్రజ్యోతి 'షాకింగ్' వార్త!

జనం అన్నారని కాదు గానీ, ఆంధ్రజ్యోతికి అత్యుత్సాహం/ మూర్ఖత్వం ఎక్కువ. పదవి పోయిన చంద్రబాబు నాయుడును జర్నలిజం నియమాలను గాలికొదిలేసి భుజాన మోసినట్లు అభియోగం ఎదుర్కుంటున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలతో పాటు టీవీ 5ల గురించి  ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవ ప్రసంగంలో ప్రస్తావన తెచ్చిన విషయం తెలిసిందే. 
తాము చేపట్టే టెండర్ల ప్రక్రియ విషయంలో ఈ మీడియా రచ్చ చేస్తుంది కాబట్టి.. ఒక జుడీషియల్ కమిషన్ సాయం తీసుకుంటామని, అప్పటికీ ఈ పత్రికలు వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేస్తానని జగన్ హెచ్చరించారు.
దీనిపై ఆంధ్రజ్యోతి వెబ్సైట్ లో ఈ ఇంగ్లిష్ వార్త వచ్చింది. నిజానికి ఇందులో షాకింగ్ ఏముంది? మీడియా గురించి ఇట్లా మాట్లాడతారా? అని వార్తలో రాసి ఉంటే ఆ శీర్షికకు కొద్దిగా అర్థం ఉండేది. జగన్ మొత్తం మీడియాను అనకపోయినా.. మీడియా మీద షాకింగ్ కామెంట్ చేసినట్లు రాసిపారేసారు. ఈ విషయంలో.. ఓనర్ రాధాకృష్ణ గారు ఇట్లాచేయండని చెప్పి ఉండకపోవచ్చు. సరైన శిక్షణ లేని జర్నలిస్టుల వల్ల వచ్చే  చిక్కు ఇది.


ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లను ప్రస్తావించిన జగన్

తమ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు నాయుడును జర్నలిజం నియమాలను గాలికొదిలేసి భుజాన మోసినట్లు అభియోగం ఎదుర్కుంటున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలతో పాటు టీవీ 5ల గురించి  ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవ ప్రసంగంలో ప్రస్తావన తెచ్చారు. 
ఎల్లో మీడియా గా విమర్శకులు పిలిచే ఈ సంస్థల కంటికి చంద్రబాబు తప్ప మరొకరు  కానరారని ఆయన స్పష్టంచేశారు. 
తాము చేపట్టే టెండర్ల ప్రక్రియ విషయంలో ఈ మీడియా రచ్చ చేస్తుంది కాబట్టి.. ఒక జుడీషియల్ కమిషన్ సాయం తీసుకుంటామని, అప్పటికీ ఈ పత్రికలు వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేస్తానని జగన్ హెచ్చరించారు. 
ప్రమాణ స్వీకారంలో కొత్త ముఖ్యమంత్రి వ్యతిరేక మీడియా పై ప్రస్తావన చేసిన నేపథ్యంలో ఏపీ లో మీడియా పరంగా పరిణామాలు ఆసక్తి గా వుండే అవకాశం ఉంది. 
చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉండివుంటే కనబడి వుండే ఉత్సాహం, ఊపు లేకుండా ఎల్లో మీడియా జగన్ ప్రమాణస్వీకార ఉత్సవాన్ని బాగానే ప్రసారం చేసాయి. 

Monday, May 27, 2019

యూట్యూబ్ హీరోలు... జర్నలిస్ట్ సాయి, ప్రొ. నాగేశ్వర్

జర్నలిజం వృత్తిగా స్వీకరిస్తే... ''మన అభిప్రాయం ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. సర్వ జన సంక్షేమం కోసం ఇది చాలా ముఖ్యం... " అన్నది కలం వీరులను నడిపిస్తూ, పీడిస్తూ, బాధిస్తూ  ఉంటుంది. పేపర్లు, టీవీ ఛానల్స్, బ్లాగ్స్, పేస్ బుక్ లు అయ్యాక ఇప్పుడు యూట్యూబ్ హవా నడుస్తున్నది. పుణ్యం, పురుషార్థం రెండూ ఇమిడి ఉన్న నూతన జర్నలిజం లో బాగా వృత్తి నిబద్ధతతో పనిచేస్తున్న ఇద్దరి గురించి ఈ పోస్టు. వర్తమాన అంశాలపై వీరిద్దరి కామెంట్స్ కు ప్రజాదరణ పెరుగుతున్నది. అదే సమయంలో వారి శ్రమ వృథా పోకుండా బాగానే డబ్బులు సంపాందించి పెడుతున్నది యూ ట్యూబ్. 

అవకాశాలు అందిపుచ్చుకుని దోసుకుపోవడం ఎలాగో వీరిద్దరూ నిరూపిస్తున్నారు. జర్నలిజమే ప్రాణంగా బతికి, ఫీల్డులో నానా ఢక్కామొక్కీలు తిని రాటుదేలిన సాయి ఇప్పుడు యూ ట్యూబ్ ఛానెల్ లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు.  అలాగే.. ప్రింట్, టీవీ జర్నలిజాల్లో సంచలనం సృష్టించి, టీవీ చర్చల్లో తిరుగులేని మేథావి ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కే నాగేశ్వర్, మాజీ ఎం ఎల్ సీ, కూడా ఆనతి కాలంలోని ప్రజాదరణ పొందారు.
ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే... వృత్తిలో షాక్ తిన్నాక... భావ ప్రకటనకు మనకంటూ ఒక వేదిక ఉండాలని వీరిద్దరూ యూ ట్యూబ్ ను ఎంచుకున్నారు. వివిధ వర్తమాన అంశాలపై వాగ్ధాటి తో ప్రజల మనసులు చూరగొనేలా అర్థవంతమైన విశ్లేషణ చేయడం అంత తేలికైన విషయం కాదు.  తక్కువ ఖర్చుతో చక్కగా నడుస్తున్న జెమిని నుంచి యాజమాన్యం న్యూస్ సెక్షన్ ఎట్టేసాక సాయి ఈ కొత్త మాధ్యమాన్ని ఎంచుకుని ప్రజాదరణ పొందారు. 
అలాగే... తన బ్రాన్డ్ ఇమేజ్ తో  లాభాల బాట పట్టించిన  ''హన్స్ ఇండియా'' పత్రిక నుంచి ఉన్నట్టుండి నిష్క్రమించాల్సి రావడం వల్ల ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ కొత్త వేదికను అందిపుచ్చుకున్నారు. 

సాయి గారితో పోలిస్తే.. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఒక అనుకూలత ఉంది. వివిధ ఛానెల్స్ లో తాను చేసే విశ్లేషణలను ఎడిట్ చేసుకుని ఆయన తన ఛానెల్ లో పెట్టుకుని కుమ్మేస్తున్నారు. వీరిద్దరూ సెలిబ్రిటీ ల స్థాయికి చేరుకున్నారు. వీరికి మరింత ప్రజాదరణ.... తద్వారా ఆదాయం పెరగాలని కోరుకుందాం. 

(నోట్: వివిధ యూ ట్యూబ్ ఛానెల్స్ మీద సమీక్షలు జరిపి వార్తలుగా  ప్రచురించబోతున్నాం. మీకు సొంతగా యూ ట్యూబ్ ఛానెల్ ఉంటే మాకు రాయండి. srsethicalmedia@gmail.com)  

Sunday, May 26, 2019

టీవీ 9 రవిప్రకాష్ కు ఒక ఉచిత సలహా!

తెలుగు మీడియా చరిత్రలో ప్రధాన మైలురాళ్లుగా చెప్పుకోదగ్గవి...రామోజీరావు గారు 'ఈనాడు' ఆరంభించి ప్రింట్ మీడియాను కొత్తపుంతలు తొక్కించడం, రవిప్రకాష్ గారు 'టీవీ -9' ను మొదలుపెట్టి ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఏమిటో చూపించడం. అప్పటిదాకా ఉన్న నియమాలను వీళ్ళు పునర్వచించి చరిత్ర సృష్టించారు.  మీకు నచ్చినా, నచ్చకున్నా.. వాళ్లకు హాట్సాఫ్ అనాల్సిందే. వీరిమూలంగా వేలమంది జర్నలిజాన్ని కెరీర్ గా ఎంచుకుని, స్థిరపడి, జీవితాలు వెళ్లదీస్తున్నారు. 'ఈనాడు', 'టీవీ 9' కథనాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎందరికో వెలుగు చూపాయి. ఇది వాస్తవం.

ఇంత పెద్ద మీడియా వ్యాపార సామ్రాజ్యాలను స్థాపించాక, గొడవలు, వివాదాలు, వ్యవహారాలూ ఉండకుండా ఉండవు. అప్పటిదాకా హీరోలు అని పొగిడిన వాళ్లే వీరిని విలన్లని  తూలనాడడం సహజం. అలాగని వీరు పత్తిత్తులు కాదు. తాము, తమ సంస్థ ఎదిగే క్రమంలో ఎందరినో తొక్కేసి ఉంటారు, బైటికి చెప్పే నీతులను తుంగలో తొక్కివుంటారు. ప్రతిభావంతులైన సహచరులను స్వప్రయోజనం కోసం బైటికి గెంటి వుంటారు.  అక్రమాలకూ పాల్పడి వుంటారు. కానీ పరిస్థితులు అనుకూలించనపుడు విజ్ఞతతో వ్యవహరించడాన్ని బట్టి వీరిలో నాయకత్వ లక్షణాలు బయటపడతాయి.

ఇప్పుడు టీవీ -9 సీఈ ఓ పదవి పోయిన రవిప్రకాష్ ధోరణి చూస్తుంటే... వింతగా అనిపిస్తున్నది. కంపెనీలు చేతులు మారాక.. పదవులు పోయాక ఉండాల్సిన హుందాతనం, పరిణతి  రవిప్రకాష్  కనపర్చలేకపోతున్నారు. ఈయనా...అంత పెద్ద మీడియా సంస్థను నెలకొల్పి విస్తరించింది? అన్న అనుమానం కలుగుతున్నది. నటుడు  శివాజీ తో జరిపిన డీల్, చేసిన పంచాయితీ చీప్ గా ఉన్నాయి. లోగోకు నేనే ఓనర్ను అని వాదించడం... పారిపోయి రికార్డెడ్ స్టేట్మెంట్స్ పంపడం... అవాయిడ్ చేయదగిన విషయాలు. ఇప్పటికే... సముద్రం మధ్య అలల్లో చిక్కుకున్న రవిప్రకాష్ పరువు మరింత పంచనామా కావడం ఖాయం. ఆయన భ్రమిస్తున్నట్లు తన మీద జరుగుతున్న 'దాడి' ని జార్నలిస్టులు పత్రికా స్వేచ్ఛ మీద దాడిగా ఏమీ భావించడం లేదు. ఆ టీవీ -9 లో పనిచేసే ఒక డజను మంది, తన మోజో టీవీ లో కొందరు తప్ప ఇతరులు రవిప్రకాష్ కు అన్యాయం జరిగిందని భావిస్తున్నట్లు కనిపించడం లేదు.

కాబట్టి ఈ పరిస్థితుత్లో... పోలీసులకు లొంగిపోయి, న్యాయస్థానం లో వాదన వినిపించుకుని... ఈ పెంట నుంచి బైటపడి, కొంత రెస్ట్ తీసుకుని మార్కెట్లోకి వస్తే... రవిప్రకాష్ ను చూసి పెట్టుబడి పెట్టేవాళ్ళు బొచ్చడుమంది వుంటారు.  భారతీయ టెలివిజన్ రంగం చరిత్ర సృష్టించిన అర్ణబ్ గోస్వామి కూడా ఇలాంటి సీరియస్ పరిస్థితిని ఎదుర్కొని... తాను స్వశక్తితో కని పెంచిన టైమ్స్ నౌ ను వీడాల్సి వచ్చింది. హుందాగా.. వైదొలిగి రిపబ్లిక్ ఛానల్ పెట్టి తన సత్తా ఏమిటో ఆయన నిరూపించుకున్నారు. దీన్ని రవి ఒక పాఠం గా తీసుకోవడం మంచిది.

బ్రదర్... రవీ! మీరు ఈ ఘనాపాఠీలను ఎదురొడ్డి పోరాడలేరు. పైగా మీ వాదనలో పస ఉన్నట్లు కనిపించడం లేదు. మీ పూర్ పీఆర్ అనండి... మీరు కనబరిచిన తలపొగరు అనండి... కారణం ఏదైనా...  జర్నలిస్టులు మీ కోసం రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి లేదు. అలల ఉదృతి చూసి కొద్దిసేపు తలవంచుకుంటే మళ్ళీ మిమ్మల్ని మీరు నిరూపించుకోవచ్చు.  ఆ అవకాశం మా లాంటి మీడియా విశ్లేషకులకు స్పష్టంగా కనిపిస్తున్నది.

'బాధితుడు రవి ప్రకాష్' అన్న టాగ్ తో గౌరవప్రదంగా బైటికి రండి. మీకు తెలుగు మీడియాలో ఇంకో పాతికేళ్ల భవిష్యత్ వుంది. దీన్ని చెడగొట్టుకుని లోగో కోసం, పోగో కోసం రచ్చ చేసుకుని పలచన కావడం మీకే నష్టం.

Saturday, May 25, 2019

గాడితప్పిన కారుకు ఓటర్ల ఝలక్...ఐదు కారణాలు

అధికారమదం తలకెక్కి ఒళ్ళుబలిసి కొట్టుకుంటే ఓటు మందుతో కాయకల్ప చికిత్స చేసే చతురత మన ఓటర్లది. రాజకీయ చాణక్యం వల్ల ముందస్తు ఎన్నికలకు వెళ్ళబెట్టి కేసీఆర్ సేన బతికిపోయింది. లేకపోతే, ఆంధ్రాలో లాగా అయ్యా కొడుకులు తలమీద తెల్ల కర్చీఫ్ వేసుకుని కూర్చోవాల్సి వచ్చేది మే 23 తర్వాత... అన్న వాదన కొట్టిపారెయ్యలేనిది.  "కారు.. సారు.. పదహారు .. ఢిల్లీ లో సర్కారు..."  అంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్టిన డప్పు మోగలేదు.  ఎగ్జిట్ పోల్స్ బోల్తా కొట్టించడం, సొంత కూతురు కవిత ఘోర పరాజయం పొందడం నుంచి కోలుకోవడానికి సారుకు కొంత కాలం పట్టవచ్చు. ఇప్పటికే ఆయన దులుపుడు కార్యక్రమం మొదలు పెట్టినట్లు సమాచారం. 
అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ డూపర్ హిట్ అయిన గులాబీ దళం పార్లమెంటరీ ఎన్నికల్లో కుదేలు కావడానికి కారణాలు ఉన్నాయి. 
1) పొగరుబోతుతనం: అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక... కేబినెట్ లేకుండా పాలన సాగిస్తే యావత్ దేశం విస్తుపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన కిక్ తో కేసీఆర్ విర్రవీగుతున్నారని జనం బాహాటంగానే అనుకున్నారు. పార్లమెంటరీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే... వ్యూహాత్మకంగా పెద్దాయన ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రయోగాలు బెడిసికొడతాయి. ఇప్పటికీ కేబినెట్ కూర్పు సరిగా జరగలేదు. సగం తెలుగుదేశం నేతలతో కారు యాత్ర సాగుతున్నది. 

2) అడ్డగోలు నిర్ణయాలు: కొడుకును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన కేసీఆర్... వ్యూహాత్మకంగా మేనల్లుడు హరీష్ రావును నొక్కేశారు. ఇది కూడా ప్రజల్లో చర్చకు దారితీసింది. కే టీ ఆర్ అంటే లేని సానుభూతి  మేథావులు, నాయకులు, జర్నలిస్టులలో హరీశ్ పట్ల ఉంది. డబ్బు ప్రభావంతో టికెట్లు ఇచ్చారన్న చర్చ బాహాటంగానే జరిగింది. ఉదాహరణకు: ఎం ఎల్ ఆర్ కాలేజీల అధిపతి కుమారుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి మల్కాజ్ గిరిలో ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారు? పారిశ్రామికవేత్త నామా నాగేశ్వర్ రావు పార్టీలో చేరిన రోజునే టికెట్ ఇచ్చారు. రాజధానిలో తిష్ట వేసే రేణుకా చౌదరి ప్రత్యర్థి కాబట్టి నామా బతికి పోయారు గానీ లేకపోతే ఖమ్మం ఓటర్లు గట్టి బుద్ధే చెప్పేవారు. ఇట్లాంటి పిచ్చపనులు చేసి దెబ్బతిన్నది టీఆర్ఎస్. 
   
3) ఉద్యోగుల మంట: ఈ ప్రభుత్వం పట్ల ఉద్యోగులలో అసంతృప్తి బాగా ఉంది. వేతనాలు, బిల్లుల చెల్లింపులు, ఆర్థిక స్థితిగతుల పట్ల మంచి అవగాహన ఉన్న ఉద్యోగులు బాహాటంగానే టీఆర్ఎస్ భంగపాటును కోరుకున్నారు. కేసీఆర్ మీద కోపంతో బీజేపీ కి ఓట్లు వేసిన వాళ్ళూ ఉన్నారు. 

4) యువతలో నైరాశ్యం: ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన యువతకు ఇప్పుడు భ్రమలు తొలిగాయి. ఉద్యోగాలు అనుకున్న స్థాయిలో లేవు. ఉస్మానియా లాంటి విశ్వ విద్యాలయాలకు నిధులు ఇవ్వకుండా దెబ్బతీస్తున్నారు. మోడీ పట్ల యువతకు ఉన్న సదభిప్రాయం, తండ్రీకొడుకుల మీద పెరుగుతున్న ఏహ్యభావం టీఆర్ఎస్ ను దెబ్బతీయడంలో కీలకపాత్ర పోషించాయి. 
   
5) హస్తినపై  కన్ను: తెలంగాణా ను కొడుక్కు వదిలి కేసీఆర్ కేంద్రంలో సెటిల్ కావాలని భావిస్తున్నారని ఓటర్లకు అర్థమయ్యింది. తెలంగాణా పునర్నిర్మాణానికి చేసింది ఏమీ లేదు గానీ... ఈయనకు అక్కడ పదవి మీద కన్ను పడిందని బాహాటంగా మాట్లాడుకున్నారు. 
ఇది జరగడానికి వీల్లేదని, ఈ ఎన్నికల్లో కారు గాలితీయకపోతే కేసీఆర్ ను పట్టుకోవడం తరంకాదని  ఓటర్లు గట్టిగా భావించారు.

మీడియా విషయంలో ప్రభుత్వ ధోరణి కూడా ఆరో కారణంగా చెప్పుకోవచ్చు గానీ, మీడియా అంటే జనాలకు ఉన్న అసహ్యం మూలంగా దాన్ని ఒక అంశంగా చెప్పుకోనక్కర్లేదు.
మోడీ ప్రభంజనం మూలంగా.... తానూ అనుకున్న 16 బదులు.. కేవలం 9 సీట్లు రావడం వల్ల టీఆర్ఎస్ కు కొంపలు మునిగిపోయింది ఏమీలేదు. కానీ ఇది ముందస్తు హెచ్చరిక అని మాత్రం చెప్పుకోవచ్చు. ఎవరెంత సంపాదిస్తున్నది, ఎవరేమి చేస్తున్నది జనం గమనిస్తారు. మే 23, 2019 కి ముందు ఉన్నట్లు గానే కేసీఆర్, కేటీఆర్ వ్యవహరిస్తే... వచ్చే ఎన్నికల్లో శంకరగిరి మాన్యాలే! 

ఏపీలో నలుగురు జోకర్లు: కేఏపీ, పీకే, ఎన్ఎల్, ఎల్ఆర్!

మండే ఎండల్లో ఓట్ల పండగ చవిచూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆటలో అరటిపండులా మంచి వినోదం పంచిన నలుగురు నేతల గురించి మాట్లాడుకోకపోతే సున్నా సంపూర్ణం కాదు. గెలుపు ఓటములు సహజమని నమ్మడం మన ధర్మం కాబట్టి... ఈ నలుగురి ఫలితాల గురించి కాకుండా వీరి ధోరణుల గురించి మాట్లాడుకోవడం సముచితం. 

ముందుగా, కేఏపీ (మత ప్రచారకుడు కే ఏ పాల్). ఈ మధ్యకాలంలో పాలిటిక్స్ లో ఇంత కామిడీ పండించిన మనిషి మరొకరు లేరు. విధవరాండ్రు, అనాథల కోసం పనిచేస్తూ...అందరు  ప్రపంచ దేశాల అధినేతలతో నిత్యం టచ్ లో ఉంటానని మొహమాటం లేకుండా చెప్పుకునే ప్రజాశాంతి పార్టీ అధినేత అమాయకపు  పాల్ గారిని బాగా బ్రష్ట్రు పట్టించింది... టీవీ -9. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ఆయన  లైవ్ కోసం ఎంత మొత్తుకున్నా... ఒక్కళ్ళూ సరిగా ప్రత్యక్ష ప్రసార యోగం కల్పించకుండా... పాల్ గారిని తొక్కేశారు! పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ కి పోటీపడిన ఆయనకు 281 ఓట్లు రాగా, అదే లోక్ సభ సీటుకు పోటీ పడిన ఆయనకు 2987 ఓట్లు వచ్చి డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. రాజకీయ విషయ పరిజ్ఞానం పెద్దగా లేకుండా, మీడియా మీద, మతం మీద  నమ్మకంతో దూసుకుపోదామని అనుకున్న పాల్ గారికి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి పట్టించారు ఆంధ్రా ఓటర్లు. ఓటేశాక... ఉరుక్కుంటూ కుప్పిగంతులు వేసుకుంటూ వెళ్లి కారెక్కిన పాల్ గారు... మీడియా మెట్లు ఎక్కకుండా... కామిడీ చేయకుండా....ఉండివుంటే ఒకటి రెండు చోట్లయినా పరువు నిలిచేదేమో! ఉత్తరాదిన అంత కామిడీ చేసే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఆ రసాన్ని ఎప్పుడు వాడాలో అప్పుడే మితంగా వాడేవారు. 

ఇక, పీకే (పవర్ స్టార్ పవన్ కళ్యాణ్). చేగువేరా స్పూర్తితో.. వ్యవస్థ మీద కసితో...సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఎన్నికల రణంలో దిగిన ఈయన అసందర్భ ప్రేలాపనలతో పలచనయ్యారు. అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీని, చంద్రబాబు ను కాకుండా... ప్రతిపక్ష నేత మీద దాడి చేస్తుంటే...నమ్మడానికి జనం సినిమా పిచ్చోళ్ళు కాదు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి  మనసులు గెలుచుకోవచ్చని అనుకున్న ఆయన ఒక దశలో తెలంగాణాలో ఆంధ్రా వాళ్ళపై దాడి చేస్తున్నట్లు ప్రచారం చేయడం, దానికి ఆ కుటుంబపు అభిమాన తార శ్రీరెడ్డి వంటి వాళ్ళు సోషల్ మీడియాలో కుమ్మేయడం గణనీయంగా దెబ్బకొట్టి ఉండవచ్చు. ఒక సారి అన్నయ్య, మరొకసారి తమ్మయ్య కాపుల్లో ఆశ కల్పించి నీరుగార్చారు. చిన్న అన్నయ్య  నాగబాబు యూట్యూబ్ ఛానెల్ లో రెచ్చిపోతూ..  'తాట వొలుస్తాం' అన్నదాన్ని జనం తప్పు అర్థం చేసుకుని తాట తీశారు. భీమవరం, గాజువాకల్లో ఈయన ఎనిమిది వేల పైచిలుకు ఓట్ల తేడాతో కంగుతిన్నాడు. తనకన్నా... తన అన్న చిరంజీవే బెటరని పీకే నిరూపించాడు. పాలిటిక్స్ లో ఓపిక, మన టర్న్ కోసం అలసిపోకుండా ఎదురుచూడడం అవసరం. ఆనాడు చిరంజీవి ఠక్కున కాంగ్రెస్ తీర్థం తీసుకోకుండా ఉండి ఉంటే... ఈ రోజు ఒక ప్రబల శక్తిలా ఎదిగి ఉండేవాడు. కాపుల కలను నెరవేర్చేవాడు.  ఇప్పుడు... ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించని పీకే వచ్చే ఎన్నికల దాకా శ్రమకోర్చి  ప్రాక్టికల్ గా వ్యవహరిస్తే కచ్చితంగా ఒక అవకాశం దొరుకుతుంది. కానీ, మనోడికి అంత ఓపిక ఉందా అన్నది పెద్ద ప్రశ్న. 
 ఎన్ ఎల్ (మంత్రి నారా లోకేష్ బాబు). తెలుగు కు పట్టిన గబ్బు మన బుజ్జి  బాబు. మంగళగిరి అనడమే  రాకపోవడానికి నాలుక తిరగకపోవడం కారణం కావచ్చు గానీ, ప్రచారంలో డొక్క శుద్ధి మాత్రమే కాకుండా ఒక వ్యూహం అంటూ ఏదీ లేకుండా...నోటికొచ్చింది వాగి  దూసుకుపోయాడు. సోషల్ మీడియాలో పాల్ గారి తర్వాత.. లోకేష్ మీద, రాహుల్ మీద పంచ్ ల మీద పంచ్ లు ప్రచారమయ్యాయి.  లోకేష్ కు సుస్థిర రాజకీయ జీవితం ఇవ్వడానికి చంద్రబాబు కు ఈ ఎన్నికలు చాలా అవసరం. కానీ, పథకం దెబ్బతిన్నది. చాలా మంది మంత్రులతో పాటు లోకేష్ కు కూడా జనం షాక్ ఇవ్వడం తన తండ్రికి మింగుడుపడని అంశం. ఈ దెబ్బ నుంచి కోలుకుని ఆ విధంగా ముందుకు పోవడానికి లోకేష్ కు చాలా సమయం పడుతుంది. 
 
ఇక చివరాఖరుకు, ఎల్ఆర్ (ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్). ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక రాజకీయ సన్యాసం చేసిన లగడపాటి తన చిలక జోస్యాలతో జనాలకు వింత, వినోదం కొంత పంచారు. మీడియా అటెన్షన్ కోసం మాత్రమే... శాస్త్రీయత లేకుండా... జోస్యం చెప్పి మరొకసారి ఈ పారిశ్రామిక వేత్త బోర్లా పడ్డారు. 

Saturday, April 20, 2019

ప్రజా సంబంధాలపై 'నమస్తే తెలంగాణా' కు నా వ్యాసం

Saturday, March 2, 2019

మితిమీరిన రోషం...కుతితీరిన తెలకపల్లి ద్వేషం!.

'వామపక్షం... ఒక నమ్మకం' అన్న శీర్షికతో 'చెవిలో చిన్నమాట' అన్న కాలమ్ లో ఆంధ్రజ్యోతి లో ఫిబ్రవరి 24 న, ఆదివారం, కృ.తి. (కృష్ణమూర్తి తిగుళ్ల అనుకుంటా) రాసిన వ్యాసం కమ్యూనిస్టుల చెవి మెలేసి, చెంప పగలగొట్టి, గూబ గుయ్యుమనిపించేట్లు కఠినంగా ఉంది. అభిప్రాయాలను వెల్లడించే, వాదించే కాలమ్ అయినా... కమ్యూనిస్టులకు అది మింగుడు పడడం కష్టమే. అందుకే దానికి ముఖాముఖి ఖండనగా  ప్రముఖ ఎడిటర్, రాజకీయ విశ్లేషణా నిపుణుడు తెలకపల్లి రవి గారు 'నవ తెలంగాణా' లో ఒక స్పందన ప్రచురించారు.  దానికి 'కుతి తీరని ద్వేషం... మతిమాలిన హాస్యం!' అని శీర్షిక పెట్టారు.   

నిజానికి కమ్యూనిజం ఒక అద్భుతమైన సిద్ధాంతం. కార్మిక, కర్షక, బడుగు బలహీన, రైతు కూలీల కోసం పోరాటం, సమసమాజం కోసం ఆరాటం దానికి ఆలంబనలు.... సూక్ష్మంగా చెప్పుకోవాలంటే.   ప్రపంచ చరిత్రలో, అంత దాకా ఎందుకు... తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం లో, కమ్యూనిస్టుల పాత్ర మహోన్నతమైనది. ఈ సిద్దాంతం ఎందరినో ఉత్తేజ పరిచి... పెట్టుబడిదారీ వ్యవస్థ విధ్వంసకాండను, ధనిక బూర్జువా స్వామ్యపు నరహంతక దౌర్జన్యకాండలను, పెట్టుబడి దారుల పంచన రాజ్య వ్యవస్థ సాగించే విశృంఖల దమన నీతిని ఎదిరించి... బడుగుల కోసం, సామాన్యుడి కోసం పోరాడేలా చేసింది. కమ్యూనిజం అనేదే లేకపోతే... యావత్ ప్రపంచంలో సామాజిక ఆర్థిక సమతుల్యం దెబ్బతిని హింస పెరిగి యావత్ మానవజాతి కొన్ని శతాబ్దాలు వెనక్కు వెళ్ళేది. క్యూబా వంటి దేశాలు కమ్యూనిజం ఛత్రఛాయలో గణనీయమైన పురోగతినే సాధించాయి. అయితే... మార్కెట్ శక్తుల మహోధృత హోరులో కొట్టుకుపోయే తరం కమ్యూనిజానికి ఛీకొడతారన్నది, కొన్నేళ్ల తర్వాత ఈ వ్యవస్థపై ఈసడింపు, ఏవగింపు పెరిగి మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు పవనాలు వీస్తాయన్నది సిద్ధాంతంలో భాగమైన అవగాహన.    

అయితే... ఎలక్ట్రోరల్ పాలిటిక్స్  విషవలయంలో, కులం కంపులో,  ఇతరేతర జాడ్యాల రొచ్చులో పడి  తెలుగు నేల మీద కమ్యూనిస్టులు అభాసుపాలయ్యారన్నది అక్షరసత్యం. బెంగాల్, కేరళలల్లో ఎర్ర ప్రభుత్వాలు తెలుగు కామ్రేడ్ల ఛాతీ ఉబ్బేట్లు చేశాయి. బెంగాల్ లో చావుదెబ్బ తిన్నదరిమిలా సమాంతరంగా మనదగ్గర కామ్రేడ్స్ ప్రభ తగ్గడం మొదలయ్యింది. కమ్యూనిజం సిద్ధాంతాల కోసం జీవితాలను, ఆస్థులను త్యాగం చేసిన ఎందరో మహానుభావుల వారసులు కూడా మార్కెట్ శక్తుల సుడిలో చిక్కి, సంపద సృష్టి కి పిచ్చిపిచ్చి మార్గాలు ఎంచుకుంటూ  మంచి సిద్ధాంతాన్ని పలచన చేశారు. చట్టసభల్లో నాలుగైదు సీట్ల కోసం ఒక సారి ఒక పార్టీ తో, మరొక సారి మరో పార్టీతో అంటకాగి, జనాల్లో ఓటు కు పెరిగిన రేటు డిమాండ్ తట్టుకోలేక... ఇప్పుడు కమ్యూనిస్టులు చిక్కిశల్యమయ్యారు. ఇక్కడ టీ ఆర్ ఎస్ హవా కు ఎర్ర చొక్కాలు గులాబీ రూపు దాల్చాయి. 

ఈ నేపథ్యంలో అనుకుంటా... కృ.తి. కమ్యూనిస్టులను కడిగేసాడు. శబరిమల పరిణామాలు, పుల్వామా దాడి పై కామ్రేడ్స్ తీరు, సీపీఎమ్ లో వర్గపోరు, మన దగ్గర 10 టీవీ విషయంలో కామ్రేడ్స్ ధోరణి, బత్తిన సోదరుల చేప మందుపై వారి శైలి... వంటి కీలక అంశాలను అందులో ప్రస్తావించి... లెఫ్టిస్టుల గందరగోళాన్ని ఒక జోక్ రూపంలో ఏకేసి ముగించారు. 
దీనిపై తెలకపల్లి రవి గారి లాంటి పుస్తక రచయిత స్పందన తార్కికంగా ఉంటే బాగుండేది. ఆయన భాష మొరటుగా ఉండడం, అక్కసు అక్షరాల రూపంలో బైట పడడం అలా ఉంచితే... 10 టీవీ గురించి ఆయన తప్పులో కాలేసి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. 

"టీవీ పెట్టింది... పాలక వర్గాల కుటిల రాజకీయాలు, కార్పొరేట్ దోపిళ్లపై పోరాడడానికి, ఈ పని ఐదేళ్ల పాటు బాగానే సాగింది. ఎవ్వరికీ తాకట్టు పడి తప్పుడు కథనాలు ఇవ్వలేదు," అని రవి గారు శలవిచ్చారు. రిపోర్టర్స్ కు యాడ్స్ బాధ్యతలు ఇవ్వడం తాకట్టు పడడం కాదా?  ఏ కార్పొరేట్ దోపిడీపై మీరు పోరాడారు సారూ? 

వేరే విషయాలు ఎందుకు గానీ, వందల మంది జర్నలిస్టులను ఈ కార్పొరేట్ మీడియా ఉద్యోగాల నుంచి తొలగిస్తే మీ ఛానెల్ లో, పేపర్లో ఎన్ని వార్తలు ఇచ్చారు స్వామీ? పైగా, కాస్ట్ కటింగ్ పేరిట మీరూ, జర్నలిజం ఓనమాలు తెలియని వేణుగోపాల్ రావు ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించి వీధులపాలు చేశారు? 
పదాల పటాటోపంతో ఇష్టమొచ్చినట్లు చెలరేగడం రవి గారి లాంటి  విజ్ఞులకు తగదు. 

(Note: A piece in muchhata.com prompted us to write this since we missed the development.) 

Friday, March 1, 2019

మీడియా మానియా ను ఉతికి ఆరేసిన అరుంధతీ రాయ్

వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్థాన్ ఆర్మీకి చిక్కగానే...శత్రుదేశం చేతిలో బందీగా ఉన్న ఆయన భద్రతకు భంగం వాటిల్లే కథనాలు ప్రసారం చేయడానికి వీల్లేదని, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు అవాకులు చెవాకులు పేలవద్దని కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రకటించి ఉంటే ఎలా ఉండేది? ఇట్లా అని ఒక ప్రకటన చేసి, టీవీ ఛానెల్స్, న్యూస్ పేపర్స్, సోషల్ మీడియా ఫోరమ్స్ దీన్ని అమలు చేస్తున్నాయా లేదా అని చెక్ చేసి ఉంటే ఎలా ఉండేది?
Photo courtesy: The Hindu 

వాక్, భావప్రకటన స్వాతంత్య్రాలకు దెబ్బతగిలిందని ఛానెల్స్, నెటిజన్స్ గగ్గోలు పెట్టేవారా? లేకపోతే... నిజమేకదా... అని అంతా సంయమనం పాటించే వారా? ఏది ఏమైనా... జర్నలిస్టులను, జనాలను క్రమశిక్షణలో పెట్టేందుకు, అత్యంత కీలక సమయాల్లో వారి స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి  అందివచ్చిన ఒక మంచి అవకాశం కోల్పోయినట్లు అయ్యింది. ఒక పక్కా కమ్యూనికేషన్ వ్యూహం తో ఈ పనిచేస్తే మీడియాలో మహాద్విగ్న ఉన్మత్త పెను పోకడను కొద్దిగానైనా కట్టడి చేసినట్లు అయ్యేదని మేము భావిస్తున్నాం. కానీ, ప్రభుత్వానికి కావలసింది కూడా... ఈ రకమైన హడావుడే, వచ్చే ఎన్నికల దృష్ట్యా అని సీనియర్ ఎడిటర్లు, రచయితలూ పలువురు భావిస్తున్నారు.

ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ ఈ రోజు హఫింగ్టన్ పోస్ట్ లో రాసిన ఒక వ్యాసంలో...రానున్నది కొట్టుకుచచ్చే, తలోవైపు లాగే అస్థిర సంకీర్ణ ప్రభుత్వమైనా పర్వాలేదు... కానీ... బాలాకోట్ మీద దాడితో కాశ్మీర్ ను అంతర్జాతీయ అంశం గా చేసిన ఈ మోడీ ప్రభుత్వం పోవాల్సిందే  గట్టిగా అభిప్రాయపడ్డారు. ఈ వ్యాసంలో ఆమె మీడియాను కుమ్మేసారు.

పుల్వామా దాడి తర్వాత మిన్నకున్న మోడీ బాలాకోట్ మీద బాంబింగ్ తర్వాత...అర్జంటుగా టీవీ తెరపై ప్రత్యక్షమై... తానే స్వయంగా యుద్ధ విమానాలు నడుపుతూ వెళ్లి స్వహస్తాలతో బాంబులు వేసినట్లు బిల్డప్ ఇవ్వగా, ఆ వెంటనే... దాదాపు నాలుగొందల 24/7 ఛానెల్స్ (అందులో చాలా వరకు నిస్సిగ్గుగా ప్రభుత్వ బాకా ఊదేవి) ఆయన (మోడీ) సామర్ద్య ప్రదర్శనను తమ సొంత 'ఇన్పుట్స్' పేరుతో భూతద్దంలో చూపాయని అరుంధతీ రాయ్ అభిప్రాయపడ్డారు.
      
"పాత వీడియోలు, అభూతకల్పనలతో, గొంతు చించుకుంటూ వాళ్ళ యాంకర్స్ ఫ్రంట్ లైన్ కమెండో ల మాదిరిగా పోజు కొడుతూ... ఉన్మత్తమైన, విజయోన్మాద జాతీయవాదాన్ని ప్రదర్శించారు. ఈ వైమానిక దాడుల్లో జైష్-ఏ-మొహమ్మద్ 'టెర్రర్ కర్మాగారం' ధ్వంసం అయ్యిందని, మూడు వందలకు పైగా 'తీవ్రవాదులు' హతమయ్యారని వాళ్ళు చెప్పుకొచ్చారు. చాలా పద్ధతైన జాతీయ వార్తాపత్రికలు హాస్యాస్పదమైన, జుగుప్సాకరమైన శీర్షికలతో వారిని అనుసరించాయి," అని ఆమె రాశారు. ఈ దాడిలో చెట్లు, గుట్టలు ధ్వంసం అయ్యాయని, ఒక గ్రామస్థుడికి మాత్రం గాయాలు అయ్యాయని రాయిటర్స్ వార్తా సంస్థ, దాదాపుగా అలాంటి వార్తనే అసోసియేట్ ప్రెస్ అనే మరో వార్తా సంస్థ నివేదించినా  దాన్ని ఈ మీడియా పట్టించుకోలేదని ఆమె చెప్పారు. 

భారతీయ మీడియాకు పాకిస్థాన్ 'థాంక్స్'

అది.... పాకిస్థాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్. వాతావరణం గంభీరంగా ఉంది. భారతీయ వింగ్ కమాండర్ ను పాక్ మిలిటరీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అప్పటికే భారత్, పాక్ సరిహద్దులో యుధ్ధ మేఘాలు కమ్ముకున్నందున వాతావరణం చాలా వేడిగా ఉంది. పైగా, పాక్ భూభాగంలో కూలిపోయిన విమానం నుంచి పారాచూట్ సహాయంతో ప్రాణాలతో బయటపడిన వింగ్ కమాండర్... తన దగ్గర రహస్యాలు శత్రు దేశం చేతికి చిక్కకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. కొన్ని కీలక పత్రాలు మింగేసి... కొన్ని దగ్గర్లోని నీళ్లలో నాన్చేచి పిప్పి పిప్పి చేశారు. 
ఇంటరాగేషన్ కు రంగం సిద్ధమయ్యింది. 

పాక్  ఆర్మీ అధికారి: నీ పేరేమిటి?
భారత వింగ్ కమాండర్: అభినందన్
పాక్ ఆర్మీ అధికారి: మీది ఏ ప్రాంతం?
భారత వింగ్ కమాండర్: డౌన్ సౌత్

పాక్ ఆర్మీ అధికారి: అంటే ఎక్కడ?  మీ కుటుంబ వివరాలు చెప్పండి?
భారత వింగ్ కమాండర్: నేను ఆ వివరాలు అందించలేను.
(ఇంతలో ఒక సైనిక అధికారి పక్క రూంలోకి వెళ్లి వచ్చి... ఇంటరాగేట్ చేస్తున్న ఆర్మీ అధికారి చెవిలో ఏదో చెప్పాడు)

పాక్ ఆర్మీ అధికారి: మిస్టర్ వర్ధమాన్ అభినందన్. మీది తమిళనాడు. మీ తాత, నాన్న, భార్య అంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు. మీ పితాజీ రిటైర్డ్ ఎయిర్ మార్షల్.... హ్హ హ్హ హ్హా.... 
(పేర్లతో సహా తమ వాళ్ళ గురించి పాక్ అధికారి చెప్పేసరికి ఆశ్చర్య పోవడం అభినందన్ వంతయ్యింది.)    పాక్  ఆర్మీ అధికారి: మీరు నడుపుతున్న విమానం ఏమిటి?  
భారత వింగ్ కమాండర్: సారీ,  ఐ కెన్ నాట్ టెల్ యూ... ఐ యామ్ నాట్ సపోజ్డ్ టు టెల్ యు. 
 (ఇంతలోఇందాక  పక్క రూంలోకి వెళ్లి వచ్చిన ఆయనే మరో సారి ఇప్పుడే వస్తానని బైటికి వెళ్లి వచ్చి... ఇంటరాగేట్ చేస్తున్న ఆర్మీ అధికారి చెవిలో ఏదో చెప్పాడు)
పాక్  ఆర్మీ అధికారి: హ్హ హ్హ హ్హా.... మిగ్ 21 బైసన్ కదా... హై నా... హ్హ హ్హ హ్హా.... 
(కాలిపోయినకాఫ్టర్ గురించి తాను చెప్పకపోయినా వాళ్ళకు తెలిసేసరికి ఆశ్చర్య పోవడం అభినందన్ వంతయ్యింది.)
ఇట్లా ఆ పాకిస్థాన్ ఆర్మీ అధికారి అడగడం, భారతీయ వింగ్ కమాండర్ ప్రాణం పోయినా చెప్పానని మొండికేయడం, పక్క రూంలోకి వెళ్లి వస్తున్న అధికారి అన్ని వివరాలతో రావడం, ఇంటరాగేట్ చేస్తున్న అధికారి...  హ్హా హ్హ హ్హా అని విజయోత్సాహంతో నవ్వుతూ వివరాలు వెల్లడించడం తేలిగ్గా జరిగిపోయాయి. 
ఇంతకూ పక్కరూం లో ఏముందో తెలుసా?
పది భారతీయ టెలివిజన్ ఛానెల్స్ ఆన్ చేసి ఉన్నాయి. అన్నీ లైవ్ లో పోటాపోటీగా అభినందన్ వివరాలు పొల్లుపోకుండా చెబుతున్నాయ్!!!
మేరా మీడియా మహాన్.....సారీ అభినందన్. 

Thursday, February 28, 2019

టీవీ-9 పిచ్చకు పరాకాష్ఠ!

భారత దళాలపై పుల్వామా లో ముష్కరుడి దాడి నేపథ్యంలో మీడియా, ముఖ్యంగా టెలివిజన్ ఛానెల్స్, జర్నలిజం మౌలిక సూత్రాలు గాలికొదిలి యుద్ధోన్మాదాన్ని ఎగదోస్తున్నాయి. ఈ మీడియా ఉన్మాదానికి తిరుగులేని లీడర్ గా అర్ణబ్ గోస్వామి వర్థిల్లుతుంటే... మిగిలిన ఛానెల్స్ వాళ్ళూ రేటింగ్స్ రేసులో వెనుకపడతామన్న భయంతో ఎక్కడలేని వేషాలు వేస్తున్నాయి.

తమ  చెర లో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ ను రేపు విడుదల చేస్తామని పాకిస్థాన్ ప్రధాని  ఇమ్రాన్ ఖాన్ ప్రకటించడం ఎంతో ఆనందం   కలిగిస్తే, దీని మీద ఛానెల్స్ అవాకులు చెవాకులు జుగుప్స కలిగిస్తున్నాయి. పాక్ తలవంచింది అన్నట్లు వీళ్ళు మాట్లాడుతుంటే.. ఇది చూసి ఒళ్ళు మండిన పాక్ సైన్యం అభినందన్ కు ఏమైనా కీడు చేస్తే ఎట్లారా నాయనా? అన్న భయం మమ్మల్ను పీడిస్తోంది.

దీని మీద వివిధ వెబ్ సైట్స్ ఏమి రాసాయో చూద్దామని ఈ సాయంత్రం నెట్ లో  వెతుకుతుంటే... thewire.in లో ఈ కింది ఫోటో ప్రచురించారు. మన టీవీ -9 వాళ్ళు ఏకంగా యాంకర్ కు సైనికుడి వేషం వేసి... బొమ్మ తుపాకీ ఇచ్చి చెలరేగి పొమ్మన్నట్లు సిద్దార్థ్ భాటియా గారు రాసిన ఈ కథనం చెప్పింది. వార్ రూమ్ అనే శీర్షికతో యాంకర్  తుపాకీ చేబూని తన విధిని నిర్వర్తించారు. ఇది చూసి నవ్వాలో  ఏడ్వాలో తెలియలేదు. ఇదేమి సృజనాత్మకత రా నాయనలారా?




మిగిలిన ఛానెల్స్ చేస్తున్న రణ నినాదం గురించి కూడా ఈ వ్యాసం విపులీకరించింది... శృతిమించిన జాతీయవాదానికి భారతీయ టీవీ ఛానెల్స్ వత్తాసుపలకడం సిగ్గుచేటుగా ఉందన్న శీర్షికలో. ఈ వర్తమాన కాలం గురించి చివరకు చరిత్ర రాయాల్సివస్తే...పగా ద్వేషాలను పెంచే వాతావరణం సృష్టిస్తున్న ఈ మీడియా పెనుపోకడల గురించి ప్రత్యేక ప్రస్థావన చేయక తప్పదని ఇందులో రాశారు. ఇది నిజమే కదా!


Tuesday, February 26, 2019

'ఈనాడు' స్పోర్ట్స్ పేజీ లో భారీ బ్లండర్: స్క్వాష్ వార్తకు టేబుల్ టెన్నిస్ స్టార్ ఫోటో

ఈ రోజు 'ఈనాడు' పత్రిక స్పోర్ట్స్ పేజీ లో ఒక పెద్ద తప్పిదం జరిగింది. 'ప్రి క్వార్టర్ లో సౌరభ్' అన్నది ప్రపంచ స్క్వాష్ పోటీలకు సబంధించిన వార్త. దానికి టేబుల్ టెన్నిస్ ఆటగాడు సౌమ్యజీత్ ఘోష్ ఫోటో వాడారు.  పైగా, ఘోష్ ఒక మహిళ (తర్వాత తాను పెళ్లిచేసున్నామె) దాఖలు చేసిన కేసులో ఇరుక్కుని గింజుకుంటున్న స్టార్ టీటీ ఆటగాడు. ఎవ్వరూ చెప్పలేదు ఏమో గానీ ఈ బిట్ ప్రచురించే సమయానికి 'ఈనాడు' ఇంటర్నెట్ ఎడిషన్ లో కూడా ఆ తప్పు అలాగే ఈ కిందివిధంగా కొనసాగింది. 


భారత వైమానిక దాడులపై మీడియా 'ఊహాత్మక జర్నలిజం'!

ప్రభుత్వ బలగాల దాడులు ఎక్కడ, ఎవరిపై జరిగినా...మీడియా, ముఖ్యంగా టెలివిజన్ ఛానెల్స్, 'సోర్సులు', 'విశ్వసనీయ వర్గాలు', 'అత్యంత విశ్వసనీయ అధికార వర్గాలు', 'ఉన్నత స్థాయి వర్గాలు' అంటూ కథనాలు కుమ్మేస్తుంది. ఆ కథనాలన్నీ  నమ్మదగ్గవి గానే ఉంటాయి. ఎవరికి తోచింది వారు ప్రసారం చేసుకునే ఒక భయంకరమైన విచ్చలవిడి జర్నలిజం ఈ సందర్భంగా వర్థిల్లుతుంది. ఈ తెల్లవారుఝామున భారత వైమానిక బలగాలు పాకిస్థాన్లోని ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలపై చేసిన దాడి సందర్భంగా ఈ వాతావరణం మరొకసారి ఏర్పడింది. 

దాడులపై విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ కేశవ్ గోఖలే... రాసుకొచ్చిన ఒక ప్రకటన చదివి... 'ప్రశ్నలు స్వీకరించబడవు' అని తెగేసి చెప్పి హాయిగా వెళ్ళిపోయాడు. దాడులపై అనేకానేక ప్రశ్నలు మదిలో మెదిలే మన జర్నలిస్టులు దీంతో ఒక్కసారిగా బిక్కచచ్చారు. ఎంత మంది ముష్కరులు చచ్చారు? అంతమంది ఖతమై పోయారనడానికి ఆధారం ఏమిటి? అసలు వారు అక్కడే ఉన్నారని అంత కచ్చితంగా ఎలా తెలిసింది? వంటి కీలక ప్రశ్నలకు సమాధానం రాలేదు. 

ఈ క్షణం నుంచి రాత్రి దాకా టీవీ ల్లో ప్రత్యక్ష ప్రసారాల్లో, స్టూడియో చర్చల్లో అంటా 'ఊహాత్మక జర్నలిజం' రాజ్యమేలింది. కొత్తగా వచ్చిపడ్డ కమ్యూనికేషన్ సాధనం ట్విట్టర్ లో జర్నలిస్టులు తమ సోర్సులను ఉటంకిస్తూ సమాచారం ప్రసారం చేసారు. ఒక పక్కన పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ భారత్ దాడులు ఒక కట్టుకథ అని చెబుతుండగానే... మన ఇంగ్లిష్, హిందీటెలివిజన్ ఛానెల్స్ వాళ్ళు దాదాపు 300 మంది ముష్కరులు ఖతమయ్యారని ఊదరకొట్టడం మొదలుపెట్టాయి. సరిహద్దుల దగ్గర భారత విమానాలు చక్కర్లు కొట్టితే తాము వాటిని సమర్థంగా తిప్పి కొట్టామని ఆయన చెప్పుకొచ్చారు, 'ది డాన్' పత్రిక వారి వెబ్ సైట్ కథనం ప్రకారం.  చాలా వరకు ఇంగ్లిష్ ఛానెల్స్ ను మక్కికి మక్కీ కాపీ కొట్టే తెలుగు, తమిళ, కన్నడ భాషా చానెల్స్ కూడా 300 కు పైగా పోయినట్లు ఏకంగా ప్రకటించడం మొదలుపెట్టాయి. 

కొందరు తెలుగు జర్నలిస్టులు సైతం, సంచలన కథనాలతో సంసారం చేసే ఇంగ్లిష్, హిందీ మీడియా మిత్రుల మాదిరిగా, దాడుల గురించి ఇష్టమొచ్చినట్లు లైవ్ లలో మాట్లాడుతన్నారు, వాళ్ళను వీళ్ళను ఉటంకిస్తూ. "సీనియర్ జర్నలిస్టులు సైతం నిష్పాక్షికతను గాలికివదిలి సొంత కథనాలను ప్రసారం చేస్తున్నారు," అని హఫింగ్ టన్ పోస్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ అమన్ సేథీ ఒక కథనంలో పేర్కొన్నారు. 

కొన్ని ఛానెల్స్ దాడులకు సంబంధించిన విజువల్స్ చూపిస్తూనే ఉన్నాయి... రోజంతా. ఇవి నిజమైనవా, లేక పాత క్లిప్పింగులా అన్న మాట ఎవ్వరూ చెప్పలేదు. జర్నలిజం దాడిలో వాస్తవం బుగ్గిబుగ్గి అవుతోంది ప్రభో!

Saturday, February 23, 2019

గొట్టిపాటి సింగారావు 10 టీవీ ని గాడిలో పెట్టగలరా?

ఏదో ఒక 24 బై  7 న్యూస్ ఛానెల్ లో బాగా నలగకుండా... కర్ర పెత్తనం, గడుసుతనం, కరకుతత్త్వం తో న్యూస్ ఛానెల్ ను నడిపేస్తామనుకోవడం వెర్రితనం. రవి ప్రకాష్, రాజశేఖర్, సాయి, వెంకట కృష్ణ, మూర్తి, అంకం రవి, రఘుబాబు, శాస్త్రి గారి లాంటి వాళ్ళు కింది (అంటే న్యూస్ బులెటిన్) స్థాయి నుంచి ఎదిగి వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఈ కోవకు చెందిన జర్నలిస్టులల్లో ఉన్న అతి గొప్ప లక్షణాలు: సృజనాత్మకత (creativity), వినూత్నంగా ఆలోచించే గుణం (innovation), వేగం (speed).

జర్నలిజం, వ్యాపార విశ్లేషణ, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, ఇన్వెస్టర్ రిలేషన్స్ వంటివృత్తి వ్యాపకాల్లో తలపండిన గొట్టిపాటి సింగారావు గారు... కమ్యూనిస్టులు భ్రష్టుపట్టించిన 10 టీవీ ని ఎలా పట్టాల మీదకు తెస్తారో అన్న అనుమానం ఈ పోస్టు రచనకు మూలం. గడిచిన ఆరేళ్లలో మా టీవీ తో సంబంధం ఉన్న ఆయన ఆగస్టు 2018 నుంచి 10 టీవీ సీఈఓ గా కష్టపడుతున్నారు. టాప్ ఫోర్ ఛానెల్స్ లో ఒకటిగా ఉన్న 10 టీవీ ఇప్పుడు పదో, పదకొండో స్థానానికి పడిపోవడం, ఛానెల్ ను ఒంటి చేత్తో అద్భుతంగా నడిపే చావు తెలివి తేటలు ఉన్న సీనియర్ ఎడిటర్లు పంచనలేకపోవడం సింగారావు గారికి మైనస్ పాయింట్. ఇతరులను వేగంగా పరిగెత్తించగల గద్దరితనం ఉన్నా, సృజనాత్మకత, వినూత్నత్వం లేకుండా ఇప్పుడున్న ఛానెల్స్ తో పోటీ పడడం కష్టమే. 

అంతకన్నా ముఖ్యంగా... న్యూస్ ఛానెల్ ను రోజువారీగా పరిగెత్తించేందుకు కావలసిన ముడిసరుకులు, మసాలా దినుసులు, మాయా మర్మాలు ఏమిటో  సింగారావు గారికి అంతగా తెలుసో లేదో అన్న అనుమానంఉన్నది ఫీల్డ్ లో . కారణం, ఆయన గతంలో థిక్ అఫ్ ది యాక్షన్ లో లేకపోవడం. ఛానెల్ బాధ్యతలు చేపట్టగానే, ఈనాడు లో తానున్నప్పుడు తన కన్నా కొద్దిగా సీనియర్ అయిన  ఐ. సత్యనారాయణ గారిని సింగారావు తెచ్చుకున్నారు. కానీ, బహుశా ఒక మాట పట్టింపు కారణం కావచ్చు, ఐ.ఎస్. గారు 'నో' చెప్పి వెళ్లిపోయారు. మంచి లీడర్లు ఎప్పుడూ సీనియర్లను ఇంత తొందరగా వదులుకోకూడదు. ఈ సమయంలో, ఎన్-టీవీ రాజశేఖర్ లాంటి వాళ్ళు గానీ, ఇప్పుడు బీబీసీ తెలుగు లో దేశ రాజధానిలో పనిచేస్తున్న పసునూరి శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు గానీ ఛానెల్ లో ఉంటే సింగారావు గారికి మంచి బలగమున్నట్లు అయ్యేది.

ఛానెల్ చేతులు మారగానే, ఇందులో వందా యాభై పెట్టుబడి పెట్టిన కమ్యూనిస్టు ప్రియులు 10 టీవీ చూడడం చాలావరకు మానేయడం, ఉద్యోగుల జీతాల బిల్లు నెలకు కోటి దాటడం, అదే సమయంలో ఆదాయం 60 లక్షలకు పడిపోవడం సింగారావు గారికి టెన్షన్ పుట్టించే అంశాలే.  అయినా, అనుకున్నది సాధించే తత్త్వం ఉన్న సింగారావు గారు ఈ ఆగస్టు లోగా 10 టీవీ ని ఒక గాడిలో పెట్టే అవకాశం లేకపోలేదు. ఆయనకు శుభాకాంక్షలు.

"ఈ ఛానెల్ విజయవంతం కావడం, కాకపోవడం ఇక్కడ ఒక ఇష్యూ కాదు. కొన్నాళ్ల తర్వాత 10 టీవీ ని గతంలో మా టీవీ లాగా వినోదాత్మక ఛానల్ గా మార్చే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ పని జరగవచ్చు," అని ఒక సీనియర్ జర్నలిస్టు జోస్యం చెప్పారు. 

సింగారావు గారి బయో ఇది:

Singa Rao Gottipati is a Post Graduate in Economics from Andhra University. He has over 25 years of professional experience spread across journalism, business analysis, corporate communications, investor relations, mergers & acquisitions and corporate management services.
With hands on managerial work experience in pharmaceutical, infrastructure and Media & Entertainment sectors for about 15 years, Singa Rao has gained good understanding of corporate governance & compliance matters, and business operations.
In his last assignment, Singa Rao was associated with MAA TV for over six years and actively involved in the transaction process with Star India Private Limited as the Chief Integration Officer and the Head of Operations.
Singa Rao is currently an Executive Director of IQuest Enterprises Private Limited, which has investments spread across media & entertainment, pharma, technology and sports sectors.

(source: https://moschip.com/singa-rao-gottipati/)