Friday, May 31, 2019

ఎన్నికలు: మీడియా బాద్షాలు.. బద్మాష్ లు..

నిష్పాక్షికత, సత్యసంధత- ఈ రెండూ జర్నలిజానికి కీలకం. ఈ రెండింటి కోసం ఇప్పటి మీడియాలో హై పవర్ భూతద్దాలు పెట్టుకుని వెతికినా కనిపించవు. కట్టుకథలకు, పెట్టుబడికి పుట్టిన విషపుత్రికలు పత్రికలని మహా కవి అన్న మాట మన పత్రికాధిపతులు, ఎడిటర్లు, జర్నలిస్టులు ప్రతిరోజూ నిరూపిస్తుండబట్టి వృత్తి గౌరవం బొత్తిగా లేని వృత్తుల జాబితాలో జర్నలిజం ఏనాడో చేరిపోయింది.  ఇటీవల జరిగిన ఎన్నికల్లోనైతే మీడియా ఘోరంగా బరితెగించి పరువు ఇంకా పోగొట్టుకుంది.

ప్రధాన పత్రికలు బాహాటంగా ఏదో ఒక పార్టీ కి కొమ్ముకాయడం స్పష్టంగా కనిపించడం ఒక ఎత్తైతే...ఎడిటర్లు, యాంకర్లు నిర్మొహమాటంగా పార్టీ కండువాలు కప్పుకుని 'యాక్టివిస్ట్ జర్నలిజం' నెరపడం మరొక ఎత్తు. ఈ అవాంఛిత ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతున్నది. 

తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ  ఎన్నికలు గానీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ, వివిధ రాష్ట్రాలతో పాటు రెండు రాష్ట్రాల్లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు గానీ తరచి చూస్తే  మీడియా ఏ విధంగా తమకు అనుకూలమైన రాజకీయ పార్టీలకు మేలు జరిగేలా, వ్యతిరేక పార్టీలకు కీడు జరిగేలా కథనాలు గుప్పించాయో తెలుగు జనం చూసారు. ఏ మీడియా హౌస్ ఎటువైపు అన్నదాన్ని గురించి మాట్లాడుకోవడం అనవసరం కానీ,  ఎన్నికల నేపథ్యంలో మీడియా లో రెండు మూడు పరిణామాలను చూద్దాం.

 తెలంగాణా రాకముందు... ఉద్యమ కాలంలో అంతా నిజంగానే... కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రామోజీ ఫిల్మ్ సిటీ ని వెయ్యి నాగళ్లతో దున్నిస్తాడేమో అని అనుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ గారిని రామోజీ గారు  ఆహ్వానించడం, అంతా భేషుగ్గా ఉందని ఇద్దరూ తేల్చేయడం తో కథముగిసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'ఈనాడు' ఒక్క నికార్సైన వ్యతిరేకవార్తను ఇవ్వకపోగా, అమ్మాయి అబ్బాయిలకు మాంఛి కవరేజ్ అందిస్తూ వస్తోంది.  

అనాలోచిత వ్యాఖ్య చేసిన మీడియా ఛానెల్స్ ను కేబుల్ ఆపరేటర్ల ద్వారా ప్రభుత్వం ఒక నొక్కుడు నొక్కడంతో తెలుగు మీడియా అంతా సెట్ అయ్యింది. అడపా దడపా ప్రింట్ జర్నలిజం పోసాని (వేమూరి రాధాకృష్ణ గారు) తన కాలమ్ లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ప్రయత్నం చేసినా అన్ని మీడియా హౌస్ లు కిమ్మనకుండా ప్రభుత్వాన్ని పల్లకిలో మోసాయి. దానికి తోడు ప్రభుత్వ అనుకూల మూడు సంస్థలు-- నమస్తే తెలంగాణా, తెలంగాణా టుడే, టీ న్యూస్--అద్భుతంగా పనిచేసాయి. ఇవి కాక, 10 టీవీ, టీవీ 9, ఎన్ టీవీ లు ప్రభుత్వానికి 'మై హోమ్' అయిపోగా, శక్తివంతమైన సాక్షి ఛానెల్, పేపర్ ఫ్రెండ్లీ మద్దతు అందించాయి. 

కేసీఆర్ గారి విషయంలో తోకముడిచిన పసుపు పత్రికలు...బాబు గారికిప్రమాదంగా మారిన జగన్ విషయంలో విశ్వరూప ప్రదర్శన చేశాయి. అయినా...సాక్షి సంస్థలు విరుగుడు ప్రచారంతో పెద్దగా డామేజ్ కాకుండా చూసుకున్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పుకోవాలి.... జగన్ శిబిరం లో ఉన్న రెండు సామాజిక వర్గాలకు చెందిన జర్నలిస్టులు, నాయకులు నేరుగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా కసికొద్దీ చంద్రబాబు, లోకేష్ లను కుమ్మేసారు. ఒకప్పుడు 'ఈనాడు'లో పనిచేసి రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యాన మంచి స్థితికి చేరుకున్న రెడ్డి జర్నలిస్టులు ఒక ఉద్యమంగా పనిచేసి జగన్ అనుకూల పవనాలు ఉధృతంగా వేయడంలో కీలకపాత్రపోషించారు. చాలా ఏళ్ళు రామోజీ రావు గారి దగ్గర పనిచేసి కారణాంతరాల వల్ల చంద్రబాబు పగకు గురైన కొమ్మినేని శ్రీనివాసరావు గారు కులానికి అతీతంగా తెలుగుదేశం గాలి తీయడంలో పోషించిన పాత్ర మామూలుది కాదు. జర్నలిస్టు నేత దేవులపల్లి అమర్ గారు రాత్రి పూట చేసిన చర్చలు ప్రభుత్వ వ్యతిరేక పవనాలు సృష్టించి కొనసాగించడంలో ప్రధాన భూమిక పోషించాయి. 

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు..చంద్రబాబు, వేమూరి మధ్య స్థూడియోలో జరిగినట్లు చెబుతున్న ప్రయివేట్ సంభాషణ చూస్తే దిమ్మతిరుగుతుందనేది వేరే విషయం. మీడియా సంకుల సమరంలో ఎల్లో లాబీ నేలమట్టమైనా... ప్రమాణ స్వీకార మహోత్సవం నాడు ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు కనీసం ఒక ఏడాది పాటు పనిచేస్తాయోమో వేచిచూడాలి!

ఎన్నికల క్రతువు ముగిసింది కాబట్టి... అటు మీడియా యజమానులు, ఇటు పాలకులు.. ఫోర్త్ ఎస్టేట్ శ్రేయస్సు దృష్ట్యా సంయమనం పాటించి ప్రజలకు మీడియా పట్ల మరింత ఏహ్యభావం కలగకుండా చూడాలని అభ్యర్థిస్తున్నాం. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి