Friday, February 28, 2014

వైజాగ్ కేంద్రంగా 'వై టీవీ'-ఉద్యోగార్ధులు ఇది చదవండి....

తెలంగాణా బిల్లుకు ఆమోద ముద్ర పడిన తర్వాత... మీడియా మిత్రులకు సుభవార్త. వైజాగ్ కేంద్రంగా యలమంచిలి వారి ఆధ్వర్యంలో ఒక న్యూస్ కమ్ ఎంటర్ టైన్మెంట్ ఛానెల్ రాబోతున్నది. 

ఇన్నాళ్ళూ హెచ్ ఎమ్ టీవీ లో ఫీచర్స్ చూసిన ఎమ్. రాజగోపాల్ గారు దాని చీఫ్ ఎడిటర్ గా చేరుతున్నారు. ఈ ఉదయం ఆయన ఈ విషయాన్ని దృవీకరించారు. బ్యాంకర్, రియల్టర్, యలమంచిలి చిట్స్ ఓనర్ యలమంచలి వెంకటేశ్వర రావు గారు దీని ఓనర్ అట. "సీమాంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్న మొట్ట మొదటి తెలుగు ఛానెల్ ఇది," అని రాజగోపాల్ గారు చెప్పారు. 
ఇంకొక మంచి విషయం ఏమిటంటే... వైజాగ్ లో స్థిరంగా ఉండి ఉద్యోగం చేసుకోవాలనుకునే వారు... ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

మీ దరఖాస్తులు పంపవలసిన మెయిల్ ఐడి:
mangurajagopal@gmail.com


"Besides talent, preference will be given to those who were mercilessly dismissed by managements," అని కూడా రాజగోపాల్ గారు నాకు పంపిన ఒక సందేశంలో పేర్కొన్నారు...చాలా కసిగా. ఆయనను కలిసి చాలా రోజులయ్యింది. 2012 ఫిబ్రవరి లో ఆయన పుస్తక ఆవిష్కరణ  సందర్భంగా కలిసాను. 

Thursday, February 27, 2014

పొద్దటి పూ దొంగలు... రెడ్ రోజ్ టీ.. లుక్మీ

హైదరాబాద్ నగరంలో పొద్దున్నే లేచి బైటికి వెళ్లి... చూసే మనసు ఉండాలి గానీ... వింత అనుభవాలు ఎన్నో ఎదురు అవుతాయి. ఇవ్వాళ ఉదయం...మా వాడు ఫిజికల్ ఫిట్నెస్ కోసం వెళ్దామని 5.30 కు లేపితే కలత నిద్రలో లేచి... మగత నిద్రతో కారు బైటికి తీశాను. 

కారు వెనక... చేతిలో ప్లాస్టిక్ సంచీతో ఒక వ్యక్తీ నిలబడి ఉన్నారు మసక చీకట్లో. తలకు మంకీ క్యాపు... స్వట్టరు ధరించిన ముదుసలి. అపార్టు మెంటు లోకి ఇంత పొద్దున్నే ఎలా వచ్చారా? అని అనుకున్నాను. బహుశా మా అపార్ట్ మెంట్ లో ఉండే వ్యక్తే అనుకుంటా. లేకపోతే.. అంత ధైర్యంగా ఎలా లోపలి వస్తారు? నన్ను చూసి ఒక క్షణం ఆగి... మళ్ళీ తన పని తాను కానిస్తున్నారాయన. ఇంతకూ ఆయన చేస్తున్న పని... పూలు కోయడం.  సర్లే.. మనకెందుకు వచ్చిన గొడవని మా మానాన మేము లాల్ బహదూర్ స్టేడియం కు వెళ్ళాం. 

వాళ్ళకేమి రోగమో గానీ... స్టేడియం ఉన్నట్టుండి మూస్తారు. నాకు మండుతుంది... కానీ ఏమి చేస్తాం? మూసుకుని ఇందిరా పార్క్ కు పోనిచ్చాను. అక్కడ పిల్లలు శాండ్ రన్నింగ్ చేస్తారు. వారంలో రెండు మూడు సార్లు అది చేయడం మంచిదని కోచ్ చెబుతారు. ఇందిరా పార్క్ లో పూలు, యోగాసనాలు చేసేవాళ్ళు, నాకన్నా ఉత్సాహంగా ఉల్లాసంగా నడిచే వృద్ధులు...మంచిగా అనిపిస్తారు. కాకపొతే... ఇందిరా పార్కు లోకి పోగానే నా బీ పీ నాకు తెలియకుండానే పెరుగుతుంది. కారణం.. సుసర్ల నగేష్. మొన్నీ మధ్యన ది హిందూ నుంచి దాదాపు గెంటివేతకు గురైన నగేష్.. వైద్యురాలైన భార్యతో కలిసి వాకింగ్ కు వస్తారు. 2007 డిసెంబర్ 25 న నా మీద అవినీతి ఆరోపణలు చేసిన ఆయన అంటే నాకు పరమ చికాకు, అసహ్యం. పొద్దు పొద్దున్నే పూలను, నగేష్ ను ఒకే కళ్ళతో చూడడం ప్రారబ్ధం. నగేష్ ఎక్కడ కనిపిస్తారా? అని సంశయపడ్డాను...ఈ రోజుకు ఆయన రాకపోవడమో, ఆలస్యం కావడమో అయి నాకు ఆయన కనిపించలేదు. 

సరే... మా వాడి బాగు మోస్తుండగా... గతంలో నేను ఈనాడు లో పనిచేసినప్పుడు ఉన్న ఒక సీనియర్ కనిపించారు. బాగానే పలకరించాడు. ఆ పక్కనున్న ఒక లాయర్ కు నన్ను పరిచయం చేస్తూ... "మీ సూరావజ్జుల రాము. మీ ఖమ్మం జిల్లా వాడే," అని చెప్పాడు. ఇదేమి పరిచయమో నాకు అర్థం కాలేదు. సరే కొద్దిగా మాటా మంచీ అయ్యాక.. 'ఏమి చేస్తున్నారు?' అని అడిగాను. ఎక్కడా పనిచేయకుండా... సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నాననీ, అన్ని రకాల అభివృద్ధి నమూనాలను... విడవకుండా విమర్శిస్తానని... వారు చెప్పారు. ఇంత పెద్ద విషయాలు మనకెందుకని... వారి నించి సెలవు తీసుకుని... నేను ఒక మూలాన వాకింగ్ చేసాను. 

కొద్ది సేపు ఆగిన తర్వాత... ఒంటి నిండా చెమటతో ఫిదెల్ వచ్చాడు. ఎందుకో తనకు నా మనసులో మాట చెప్పాలని అనిపించింది. "నాన్నా...ఈ పార్కు కు వస్తే... నా మనసు కకావికలం అవుతుంది," అని ఆరంభించాను. ఎందుకని తను ఆసక్తిగా అడిగితే... జర్నలిస్టుగా నేను ఎంత స్వచ్ఛంగా, నీతిగా బతికిందీ... అప్పటి నా బాస్ హోదాలో నగేష్ నా మీద చేసిన అవినీతి ఆరోపణలు.... వాటి వల్ల నేను పడిన మానసిక వేదన...'ది హిందూ' వదలడం ఉత్తమమని నేను అనుకోవడం... చివరకు అవమానకర పరిణామాల మధ్య నగేష్ ఆ పత్రిక నుంచి వెళ్లి పోవడం... వివరంగా చెప్పాను. కొద్దిగా మనసు తేలికై పార్కు నుంచి బైటికి వస్తుండగా..."ఇలాంటి వాళ్ళ గురించి బ్లాగులో రాయకు డాడీ.." అని 14 ఏళ్ళ కొడుకు హితవు చెప్పాడు. 

తర్వాత... ఈ రోజు ఫిదెల్ కు ఇరానీ చాయ్ తాగించాలని అనిపించింది. నా ప్రతిపాదనకు తనూ ఉత్సాహం చూపించాడు. ఒకటి నీలోఫర్ ఆసుపత్రి దగ్గర ఉంటుంది కానీ.. నిమ్స్ దగ్గర ఉన్న రెడ్ రోజ్ కు తీసుకు పోయాను. అక్కడ బైట కారు పార్క్ చేసి లోపలికి వెళ్ళాను. అక్కడ ప్లేట్ల లో లుక్మీ చూస్తే ప్రాణం లేచివచ్చింది. 1992 లో నేను 'ఈనాడు' లో పనిచేసిన రోజులు గుర్తుకు వచ్చాయి. అప్పట్లో ఈ లుక్మీ లేదా బ్రెడ్ టీ తో కలిపి తిని బ్రేక్ ఫాస్ట్ అయ్యిందని అనిపించే వాళ్ళం. అది ఖర్చు తక్కువ తిండి. మా వాడి కోసం లుక్మీ, టై బిస్కెట్, ఇరానీ చాయ్ ఆర్డర్ ఇచ్చాను. తను వాటిని ఆస్వాదిస్తే... మజా అనిపించింది. పూరీ ప్రియుడైన తనకు లుక్మీ నచ్చడం నాకు ఆనందాన్ని ఇచ్చింది.

ఆ తర్వాత కొద్ది దూరం వెళ్ళాక...ఊదా రంగు పూలు కనిపించాయి. నేను వాటిని చూస్తూ ఉండగానే.... గోడ మీద నుంచి వాటిని కోస్తూ.. ఒక పండు ముదుసలి కనిపించారు. ఆయన ఒక పకడ్బందీ కవర్ లో ఆ వీధిలో రక రకాల పూలు కోస్తున్నారు. అది దొంగతనం అనలేం గానీ... పెద్ద మనుషులు వాకింగ్ చేస్తూ... పూలు లేపెయ్యడం... సరదాగా అనిపించింది. అది వారిని ఆనంద పరిచే అంశాల్లో ఒకటి. ప్రకృతి మనలను వివిధ రకాల రంగు రంగుల పూలతో, వివిధ రకాలుగా ఆనందింప చేస్తుంది కదా!           

Thursday, February 20, 2014

హమ్మయ్య... ఒక పెద్ద గొడవ తీరింది...

తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిన సుదినం. 
వందల మంది వెర్రి ఆవేశంతో జీవితాలు నుదిమేసుకున్న త్యాగానికి నిజమైన నివాళి.
దోపిడీ, అది నిత్యం జరుగుతుందన్న ఫీలింగ్ నిజంగానే అంతం అవుతుందా? అన్న సంశయం.
తెలంగాణా సుసంపన్నం అవుతుందా? అన్న అనుమానమ్.  
తెలుగు జాతి మన కళ్ళ ముందే రెండు గా అయిపోయిందే...అన్న కించిత్ బాధ.
ఇప్పటికే జరగాల్సింది ఈ రోజైనా జరిగిందన్న తృప్తి. 
మా నీళ్ళు మాకు... మా ఉద్యోగాలు మాకు... నిజంగా నిజం కావాలన్న సంకల్పమ్.  

ఇదొక అనిర్వచనీయమైన ఉద్విగ్న క్షణం. 

రాజకీయ నేతల చదరంగంలో ఇన్నాళ్ళూ పావుగా మారి... ప్రజల్లో ఆవేశకావేషాలు పెంచి... వందల మంది యువకులు బలిదానాలు చేసుకోవడానికి కారణమైన తెలంగాణా సమస్య ఒక కొలిక్కి రావడం ఆనందాన్ని ఇచ్చింది. లోక్ సభ బిల్లు ను ఆమోదించిన రోజు అనుకోకుండా కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి. 

'జై తెలంగాణా' అంటూ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకున్న అనేక మంది యువకులు గుర్తుకు వచ్చారు. నిత్య అగ్ని గుండంగా మారిన మా ఉస్మానియా క్యాంపస్ స్ఫురణకు వచ్చింది.
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భాషా పటిమ... ఉద్యమ స్ఫూర్తి రగిల్చే తత్త్వం, మంత్రాంగం నిర్వహణా సామర్ధ్యం లేకపోతే ఈ ఉద్యమం ఇంత స్థాయికి వచ్చేది కాదు.   
29 వ రాష్ట్రంగా తెలంగాణా ఏర్పడినాక...నిన్నటి దాకా జరిగిన పోరాటాలు, వాదాలు పక్కన పెట్టి... అందరం కలిసుందాం.... అంటూ ఆయన చేసిన ప్రసంగం నాకు నచ్చింది. 

"మీ ఖమ్మం జల్లా వాళ్ళకు మెదడు మోకాల్లో కాదయ్యా.. అరికాల్లో ఉంటుంది," అని పదే పదే అంటూ అవమానించిన అప్పటి ఈనాడు ఎమ్ డీ రమేష్ బాబు, "ఉస్మానియా వాళ్ళు... ఉద్యోగాలు ఇవ్వకూడదు..." అని నాతో ఏకంగా అన్న  నాగయ్య చౌదరి కూడా ఇవ్వాళ గుర్తుకు వచ్చారు. 

మీడియా ఈ ప్రాంతీయ వాదుల చేతిలో ఉండబట్టి... జర్నలిజం లో తెలంగాణా జర్నలిస్టులు ఒక స్థాయి వరకే ఎదిగారు. అలాంటి బాధితుల్లో నా లాంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఇలాంటి... ప్రాంత గజ్జి గాళ్ళను, కుల గజ్జి గాళ్ళను, బట్టేబాజ్ గాళ్ళను తన్ని నేషనల్ హైవే నంబర్ నైన్ మీదుగా పొలిమేరలు దాటిస్తే తప్పేమిటన్న  కసిని గుండెల్లో అంతం చేసి... ముగిస్తాను. 
జై తెలంగాణా... 
జై తేట తెనుగు జాతి....  

Tuesday, February 11, 2014

"ది హిందూ" నుంచి అర్ధంతరంగా నగేష్ నిష్క్రమణ

వివాదాస్పద సీనియర్ జర్నలిస్టు సుసర్ల నగేష్ కుమార్ నాటకీయ పరిణామాల మధ్య 'ది హిందూ' నుంచి నిన్న సాయంత్రం అర్థంతరంగా నిష్క్రమించారు. అత్యంత ప్రతిభాశాలి అయిన జర్నలిస్టు కె. శ్రీనివాస రెడ్డి ని తన స్థానంలో హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ గా నియమించడం, తనకు వేరే పొజిషన్ (కన్సల్టింగ్ ఎడిటర్ అట) ఇవ్వడం పట్ల అలిగి ఆయన రాజీనామా చేసినట్లు ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి. 

"సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో ఆయన రాజీనామా లెటర్ పంపారు. అనూహ్య రీతిలో ఒక అర్ధగంటలో యాజమాన్యం దాన్ని ఆమోదించింది. మా సంస్థలో ఆ స్థాయి వ్యక్తిని ఇంత తొందరగా సాగనంపడం చాలా అరుదు," అని ది హిందూ లో పనిచేసే ఒక జర్నలిస్టు చెప్పారు. పై ఫోటో లోమధ్యలో...కాస్త పొట్టతో ప్యాంటు జాబుల్లో చేతులు పెట్టి తెల్ల చొక్కా ధరించిన మాస్టారే సుసర్ల  నగేష్ కుమార్ గారు.  

దాసు కేశవరావు గారు అనే మంచి మనసున్న జర్నలిస్టు తర్వాత సుసర్ల నగేష్ కుమార్ చీఫ్ ఆఫ్ బ్యూరో గా నియమితులయ్యారు ఒక ఏడు ఎనిమిదేళ్ళ కిందట. ఆయన మంచి టీం లీడర్ కాదని, నిష్కారణంగా నా మీద డిసెంబర్ 25, 2007 న అవినీతి ఆరోపణలు చేసాడని నేను గతంలో చాలా సార్లు రాశాను. మరి కొందరు జర్నలిస్టులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. 

డీ జీ పీ దినేష్ రెడ్డి విషయంలో నగేష్ క్లియర్ చేసిన ఒక బ్యానర్ వార్త 'ది హిందూ' పరువును పంచనామా చేసింది. తాను చేసిన ఘోర తప్పిదాన్ని జర్నలిజం పై దాడిగా నగేష్ అభివర్ణించి ఒక సెక్షన్ జర్నలిస్టుల మద్దతు పొందడంలో విజయం పొందారు. అప్పట్లో నగేష్ కు మొండి వాదనలతో మద్దతు ఇచ్చిన 'ది హిందూ' ఎడిటర్ సిద్దార్థ్ వరదరాజన్ కూడా యాజమాన్యం మీద అలిగి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

శ్రీనివాస రెడ్డి గారి లాంటి అద్భుతమైన జర్నలిస్టుకు పదోన్నతి వస్తే హర్షించి సహకరించాల్సిన నగేష్... యాజమాన్యం పై అలగడం పట్ల ఆ సంస్థ జర్నలిస్టులు ముగ్గురు నలుగురు అసహ్యం వ్యక్తం చేశారు. నగేష్ ఈ స్థాయికి ఎలా ఎదిగాడా? అని ఎప్పుడూ అనిపించే నాకు కూడా ఇది ఇబ్బంది అనిపించింది. నగేష్ గారికి పదోన్నతి ఇచ్చినప్పుడు దాసు కేశవరావు గారు కూడా ఇలానే అలిగి రాజీనామా చేయలేదు. కామ్ గా యాజమాన్యం ఇచ్చిన పని చేసి అందరి మెప్పు పొందారు. అది మరి మంచి కి, మూర్ఖత్వానికి తేడా!, అని అబ్రకదబ్ర అన్న మాటలో తప్పు లేదు.   

పొలిటికల్ రిపోర్టింగ్ లో దిట్టగా పేరున్న నగేష్ కుమార్ నిజానికి గత నవంబర్ లోనే రిటైర్ అయ్యారని, యాజమాన్యం ఆయనకు ఈ ఏడాది నవంబర్ వరకు పొడగింపు ఇచ్చిందని సంస్థ ఉద్యోగులు చెప్పారు. క్రైమ్ జర్నలిజం లో తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్న శ్రీనివాస రెడ్డి గారు గత జూన్ నుంచి బెంగళూరు 'ది హిందూ' రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్నారు. 

Nagesh ji, have a nice post-retirement life.
Sreenivasa Reddi Sir, Wish you all the best. 

Friday, February 7, 2014

జర్నలిస్టు మిత్రులారా...మీకొక ఖుషీ కబురు...

జర్నలిస్టుల శ్రమ దోచుకుంటూ... అక్రమంగా, సక్రమంగా ఆస్తులు సంపాదించే మీడియా యాజమాన్యాలు... వారికి జీతాలు ఇవ్వడం దగ్గరకు వచ్చే సరికి ఏడుస్తుంటాయి. అప్పట్లో మజిథియ వేజ్ బోర్డ్ ను నియమిస్తే... పత్రికల యాజమాన్యాలు కొర్టుకెక్కాయి. ఈ విషయంలో మానేజ్మెంట్ల వాదనను సుప్రీం కోర్టు ఈ రోజు కొట్టివేసింది. 
ఈ విషయంపై... బిజినెస్ స్టాండర్డ్ సైట్ లో వచ్చిన లేటెస్టు వార్తను మీకు ఇక్కడ అందిస్తున్నాము. పండగ చేసుకోండి.    


The  today dismissed all writ petitions moved by  newspaper managements against the Majithia wage board for journalists and non- employees of newspaper establishments.
 
It ordered the owners to pay their employees the wages as revised/determined by the wage board payable from 11.11.2011 when the Government of India notified the recommendations of the Majithia Wage Boards.  All the arrears up to March, 2014 shall be paid to all eligible persons in four equal instalments within a period of one year. The revised wages will become payable from April, 2014.
 
The judgment written by Chief Justice  on behalf of  a three-member bench said that the concept of ‘variable pay’ contained in the recommendations of the Sixth Central Pay Commission has been incorporated into the Wage Board recommendations to ensure that the wages of the newspaper employees are at par with those employees working in other Government sectors. Such incorporation was made by the Majithia Wage Board after careful consideration, in order to ensure equitable treatment to employees of newspaper establishments, and it was well within its rights to do so.
 
The unanimous judgment further stated that the Wage Board has recommended grant of 100% neutralisation of dearness allowance. The Fifth Pay Commission granted the same in 1996. Since then, public sector undertakings, banks and even the private sector are all granting  100%  neutralisation  of  dearness  allowance.

ఇంతలోనే...ఒక ఏడాది పూర్తయ్యిందే...

రోజులు చాలా వేగంగా పరిగెడుతున్నాయి. ఇంతలోనే ఒక ఏడాది పూర్తి అయ్యింది. ఏడాది కిందట ఇదే రోజు పీ హెచ్డీ పట్టా తీసుకున్నాను. అయినా పెద్దగా ఒరగబెట్టింది ఏమీ లేదు. వచ్చే ఏడాది లోపు  ఈ  పరిశోధన కు ఒక పుస్తక రూపం ఇచ్చి తీరతానని హామీ ఇస్తూ... లాస్ట్ ఇయర్ రాసిన పోస్టు మీ మళ్ళీ పంచుకుంటాను.... మీలో కొంతమంది తిట్టుకుంటారని తెలిసినా... 
------------------------------------------------------------ 
బ్లాగ్ మిత్రులారా...ప్రియమైన పాఠకులారా...ఆత్మ బంధువుల్లారా....

ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ రోజు... 2013 ఫిబ్రవరి ఏడో తేది...ఎప్పుడూ తియ్యగా, తడి ఆరని కలలా గుర్తుండిపోతుంది. ఏడేళ్ళ కిందట 'ది హిందూ' పత్రిక రిపోర్టర్ గా ఉండగా చరిత్రాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం డిపార్టుమెంటు లో PhD రిజిస్టర్ చేసుకున్నాను...ఎన్.రామ్ గారి లిఖితపూర్వక అనుమతితో. 'జర్నలిస్టులు-నైతిక విలువలు' అన్న అంశంపై పరిశోధన అనుకున్నంత సులువు కాలేదు. అప్పటి నుంచి కష్టపడి, కలతపడి, దుఃఖపడి, మదనపడి, బాధపడి, బద్ధకం వల్ల కిందపడి మీదపడి  ఎలాగోలా పరిశోధన పూర్తయి ఈ రోజున డిగ్రీ ప్రధానం జరిగింది. ఈ పరిశోధన పని ఒత్తిడి కారణంగా బ్లాగింగ్ కు కొద్దిగా దూరం కూడా అయ్యాను. 


ఒక పన్నెండేళ్ళ కిందట జర్నలిజం లో నేను రెండు గోల్డ్ మెడల్స్ తీసుకున్నటాగోర్ ఆడిటోరియం లో జరిగిన ఉస్మానియా 79 వ స్నాతకోత్సవం లో ఇద్దరు ప్రొఫెసర్లు ఎస్.సత్యనారాయణ (వైస్ చాన్సలర్), గోవర్ధన్ మెహతా (ప్రముఖ రసాయన శాస్త్ర నిపుణుడు) చేతుల మీదుగా కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం లో PhD పట్టా అందుకున్న ఇద్దరిలో నేను ఒకడిని. మొత్తం 279 మందికి ఈ పట్టాలు అందించారు. ఇంతవరకూ ఉస్మానియా నుంచి ఒక అరడజను మందిమి మాత్రమే పట్టాలు పొందగలిగాము. 
బాధ కలిగిన విషయం ఏమిటంటే...విశ్వవిద్యాలయం చాన్సలర్ అయిన గవర్నర్ నరసింహన్ ఈ కార్యక్రమానికి రాకపోవడం. తెలంగాణా కు వ్యతిరేకిగా ముద్ర పడిన ఆయన రావడానికి వీల్లేదని విద్యార్ధి సంఘాలు హెచ్చరించడం, హడావుడి చేయడంతో ఆయన రాలేదని చెప్పారు. ఇది డిగ్రీలు పొందిన వారికి  సమంజసంగా తోచలేదు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి పట్ల వ్యతిరేకత ఉండవచ్చుగానీ...ఎందరో తెలంగాణా విద్యార్థులకు కలలాంటి స్నాతకోత్సవానికి, ఆయన అభిప్రాయాలకు సంబంధం ఏముందని పలువురు ప్రశ్నించారు. తెలంగాణా ఇవ్వడం ఇవ్వకపోవడం సోనియా, మన్మోహన్, రాహుల్ చేతిలో ఉంది, ఈ గవర్నర్ మాట విని తెలంగాణా ఇవ్వడం లేదనుకోవడం సమంజసంగా తోచడం లేదు. 

కాస్త అనారోగ్యం తో ఉన్న మా అమ్మ, పిల్లలను తీసుకు రావద్దని యూనివర్సిటీ ప్రత్యేకించి చెప్పడం వల్ల నా పుత్రుడు ఫిడేల్ ఆర్ స్నేహిత్ ఈ స్నాతకోత్సవానికి రాలేదు. మా నాన్న ప్రత్యేకించి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని..."I am proud of you..." అని నాతో గర్వంగా చెప్పారు. మా కుటుంబం లో ఇది మొట్టమొదటి PhD. పరిశోధనకు అడుగడుగునా ప్రోత్సాహం అందించిన నా జీవిత భాగస్వామి హేమ రిపోర్టింగ్ గొడవలో పడి కాస్త లేట్ గా వచ్చింది స్నాతకోత్సవానికి. 

మొత్తం మీద మా అమ్మకు చిన్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం డాక్టర్ అయినందుకు ఆమె, నేను ఆనందించాము. నా గైడ్ ప్రొఫెసర్ పద్మజా షా, ఈ టాపిక్ కు ఒక రూపం ఇచ్చిన నా మొదటి గైడ్ ప్రొఫెసర్ స్టీవెన్ సన్, నేను నిస్పృహకు గురైనప్పుడు ఓదార్చిన ప్రొఫెసర్ బాలస్వామి-ప్రొఫెసర్ నరేందర్ లకు కృతఙ్ఞతలు. నా వెన్నంటి ఉండి సాంకేతిక సహకారం అందించిన నా కూతురు మైత్రేయి, నా ఆప్త మిత్రుడు బలుసూరి శంకర్ లకు థీసిస్ లో విధిగా థాంక్స్ తెలిపాను. వివిధ భంగిమల్లో ఫోటోలు తీసిచ్చిన నా మాజీ సహచరుడు, మాకు ఇంకో కొడుకు లాంటి గోపాల్ కు థాంక్స్. 

ఈ డిగ్రీ ఇచ్చిన అదనపు బాధ్యతతో సమాజ హితం కోసం మరింత పాటుపడతానని గట్టిగా హామీ ఇస్తూ...ఈ ఇకిలించే ఫోటో తో సెలవు తీసుకుంటాను.