Thursday, January 22, 2026

సీనియర్ మోస్ట్ జర్నలిస్టు దాసు కృష్ణమూర్తి (99) గారి నిర్యాణం

దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు, ఇంగ్లీష్ జర్నలిజం రెంటిలో డెస్క్, రిపోర్టింగ్ లో నలిగాక నాకు ఎదురైన బాసుల్లో 'దుష్ట రాక్షస నీచ నికృష్ట దగుల్బాజీ మిడి మిడి జ్ఞానపు అవినీతి ధనాంధ దురహంకారు'లే ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత నేను చేసిన లోతైన పరిశోధనలో తేలింది ఏమిటంటే... నాకున్న అనుభవమే, అభిప్రాయమే చాలా మంది సీనియర్ జర్నలిస్టులదని. వావ్...జర్నలిస్టు అంటే, అందునా బాసు అంటే... ఇంత మంచిగా కూడా ఉంటారా? అని నేను అవాక్కయిన వారిలో అగ్రగణ్యుడు దాసు కేశవ రావు గారు. 

నేను 'ఈనాడు' లో ఒక పుష్కర కాలం పాటు నలిగి, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్లో,  ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో చదివాక టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఇంటర్నెషిప్ చేశాను. 'ది హిందూ' నిర్వహించిన టెస్ట్ లో పాసైన నన్ను టఫ్ ఎడిటర్ గా పేరున్న మాలినీ పార్థసారధి గారు ఇంటర్వ్యూ చేసి విశాఖపట్నం డెస్క్ కు సబ్ ఎడిటర్ గా ఎంపిక చేశారు. నాకు తెలంగాణ లో రూరల్ రిపోర్టర్ గా పనిచేసే అవకాశం ఇవ్వాలని వారిని అర్థించాను. ముందుగా కుదరదని చెప్పిన ఆమె నన్ను బైట వైట్ చేయమని చెప్పి ఆ తర్వాత మళ్ళీ పిలిచి నల్గొండకు ది హిందూ రిపోర్టర్ గా నియమించారు. నా కెరీర్ లో అదొక ఘనమైన విషయం. ఆ రోజు ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న దాసు కేశవరావు గారు అప్పటి హైదరాబాద్ బ్యూరో చీఫ్. తెలుగు నుంచి ఇంగ్లిష్ మీడియాలోకి నా ట్రాన్సిషన్ ఫేజ్ లో ఆయన ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. అందరితో కలుపుగోలుగా మాట్లాడే విద్యావంతుడు, నిరహంకారి, నిగర్వి, మృదు భాషకుడు అయిన ఆయన గొప్ప మనిషి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఎట్లాగో వారిని చూస్తే తెలుస్తుంది. ఆయన రిటైర్ అయ్యాక తదనంతరం వచ్చిన వాడి బుద్ధి, జ్ఞానం, ప్రవర్తన కారణంగా దాసు కేశవరావు గారి ప్రతిష్ఠ, గొప్పతనం అందరికీ ఇంకా బాగా తెలిసి వచ్చాయనేది అప్రస్తుత విషయం.

అలాంటి దాసు కేశవ రావు గారు తన ఫేస్బుక్ పోస్టులలో తన అన్న గారైన దాసు కృష్ణమూర్తి గారి గురించి రాస్తూ ఉంటారు. ఒక తమ్ముడు తన అన్న గారిని స్మరిస్తూ, శ్లాఘిస్తూ రాయడం ఈ రోజుల్లో ఒక అబ్బురమే. కృష్ణమూర్తి గారిని ప్రత్యక్షంగా కలవకపోయినా జర్నలిజానికి, జర్నలిజం ఎడ్యుకేషన్ కు వారి సేవల గురించి తెలుసుకునే అవకాశం చిక్కింది నాలాంటి వాళ్ళకు.


దేశంలో పేరెన్నిక గన్న ఉస్మానియా జర్నలిజం డిపార్ట్మెంట్ మొదటి బ్యాచ్ విద్యార్థి అయిన కృష్ణమూర్తి గారు 70 ఏళ్ల పాటు జర్నలిజం లో ఉన్నారు. జర్నలిస్టుగా ప్రాక్టీస్ చేసిన ఆయన టీచింగ్ కూడా చేసి ఎందరికో స్ఫూర్తి ఇచ్చారు. మీడియాలో పనిచేసి టీచింగ్ లోకి వెళ్తే మంచి జర్నలిస్టులను తీర్చిదిద్దవచ్చు.

సుదీర్ఘ అనుభవం ఉన్న దాసు కృష్ణమూర్తి గారు కొన్ని నెలల్లో వందేళ్లు పూర్తి చేసుకోవాల్సి ఉండగా అమెరికాలో పరమ పదించారని కేశవరావు గారి ద్వారా తెలిసింది. 

కృష్ణమూర్తి గారికి నా నివాళి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఇద్దరు అన్నదమ్ములు జర్నలిజంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం అరుదైన విషయం. కృష్ణమూర్తి గారి సేవలు స్మరించుకునేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం, ప్రెస్ క్లబ్ సభలు వెంటనే నిర్వహిస్తే బాగుంటుంది. 

కృష్ణమూర్తి గారి ప్రొఫైల్ Somasekhar Mulugu గారి వాల్ నుంచి...

Dasu Krishnamoorthy, 1st batch Osmania Journalism Student & renowned Journalist passes at 99:  

Months before he was to complete a well lived 100, Dasu Krishnamoorty, died this morning in New Jersey after a brief illness. 

Always bubbling with enthusiasm, ready to mentor and writing till the very last months of his illustrious life Krishnamoorthy contributed to Journalism for over 7 decades.

  He began his career in the mid 1950’s with stints in the Sentinel, Deccan Chronicle, the Indian Express in Vijayawada. His career took him to Times of India in Ahmedabad and The Patriot in New Delhi.

  It was during his tenure in Patriot that I got to know about Dasu Krishnamoorthy. I was a student of the Osmania University department of Communication and Journalism with Prof S Bashiruddin as the Head.

  We were always proud of our alumni as Prof Bashiruddin would narrate stories about their success, some globally too, which was motivating. Krishnamoorthy was one example.

   Most importantly, he belonged to the first batch of the journalism course of Osmania University 1954-55. The department is the oldest journalism school in formal universities in the country.

  Post retirement, Krishnamoorthy worked as associate professor of The Institute of Mass Communication IIMC Delhi and on the guest faculty of OU, AP Open University, the University of Hyderabad. 

   In 2001, he moved to the US to stay with his daughter. 

  It was sometime in 2010 that I had the privilege of sharing the dais with Krishnamoorthy garu at a panel discussion on Media Issues organised by the Academic Staff College of the University of Hyderabad (UoH), whose head was Prof. I Ramabrahmam, who later became Vice Chancellor of the Central University in Koraput, Odisha. 

  The eloquence and depth of understanding in the challenges faced by the media as presented by Krishnamoorthy was a master class. Interestingly, Prof P L Vishveswar Rao, my teacher at the department and later Principal Arts College was the co-panellist.

  Krishnamoorthy hails from a distinguished family of academics and journalists. His younger brother, Dasu Kesava Rao, who lives in Hyderabad now, is a former Resident Editor of The Hindu, Hyderabad and a long term senior colleague of mine in the profession.

   After migrating to the US, he turned to literature and has brought out Anthology of Telugu short stories, the latest of which was published, released and sold out in 2023, said Kesava Rao.

Saturday, January 17, 2026

పొట్టి బట్టలు... అసలు అవస్థలు!

 ఈ సృష్టిలో ప్రతి మనిషీ ఒక అద్భుతమే అయినా... అందులో స్త్రీ మూర్తులు ప్రత్యేకం. అందం, సౌకుమార్యం, సున్నితత్వం, అమ్మతనం, ఓర్పు, నేర్పు... కారణంగా అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు, కూతుళ్ళు... మొత్తంగా మహిళలు గౌరవించదగిన, పూజింపదగిన వారు. ఇంట్లో అయినా, బైట అయినా మహిళలను కించపరిచేవాడు లేదా హింసించేవాడు మానసిక రోగి లేదా ఉన్మాది అని నేను భావిస్తాను. ఎంత సాధించినవాడైనా మహిళలను గౌరవించకపోతే ఎందుకూ కొరగానివాడే. ఇందులో అనుమానం లేదు. 

పొట్టి బట్టల వివాదంలో కొంత కమ్యూనికేషన్ సమస్య ఉన్నది. చెప్పుకోలేని ఒక పెద్ద భౌతిక, రసాయన సమస్య ఉంది. ఇది చెప్పడం రాక... ఇబ్బంది పడుతున్నారనిపిస్తోంది. నిజానికి ఇది స్త్రీ స్వేచ్ఛ కు సంబంధించిన అంశం కాదేమో! పురుషుల మానసిన దౌర్భల్యానికి సంబంధించిన సంగతి అనుకుంటా. 

ముందుగా అంతా ఒప్పుకుని తీరాల్సిన విషయం ఏమిటంటే... సెక్స్ కక్కుర్తి తో మెజారిటీ పురుషులు ఛస్తున్నారన్న సత్యాన్ని. Sexually starved జనమే ఎక్కువగా ఉన్నారు సమాజంలో. ఈ టాపిక్ సామాజికపరంగా టబూ (నిషిద్ధం) కాబట్టి  దీని మీద ఎవ్వరూ మాట్లాడరు. నా దగ్గర శాస్త్రీయ డేటా కూడా ఏమీ లేదు. ఇది నా పరిశీలన, అభిప్రాయం మాత్రమే. ఇది తప్పయితే నాకు నిర్మొహమాటంగా తెలియజేయండి. 

సినిమా వాళ్ళు పొట్టి బట్టలతో జ్యోతి లక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత వంటి వాళ్ళతో డాన్స్ చేయించి, బూతు డైలాగ్స్ రాసి ఈ బాపతు జనాల దాహార్తి లేదా కామార్తి తీర్చారు. బూతు సినిమాలు చూసి ఈ ఆర్తి ఎట్లా తీరుతుందని అమాయకంగా అడిగితే బాత్ రూమ్ లలో చాలా సేపు గడిపే ఫోక్స్ సాక్షిగా బయటికి రాయలేము/ చెప్పలేము. 

సరే... ఆ సినిమాలు చూసి, స్వాతి పత్రిక అక్షరం పొల్లు పోకుండా చదివి కుతి తీర్చుకున్న కాలం చెల్లిపోయింది. బ్లూ ఫిల్మ్స్ వచ్చాయి. ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పి బ్లూ ఫిల్మ్స్ చూడని మా తరం (50 ప్లస్) మగ పురుషులు దాదాపు కరువే. వివిధ ప్రేరేపిత కారణాల మూలంగా పెరిగే సెక్స్ కోరికలకు తగినట్లు ఇంట్లో అనుకూల పరిస్థితి లేకపోవడం వల్ల జనం (పెద్ద సంఖ్యలో మగ, కొద్ది మంది ఆడ) ఇబ్బంది పడ్డారు. అక్రమ సంబంధాలకు ఇదొక కారణమని ఇది రాయడానికి ముందు నేను మాట్లాడిన మిత్రులు కూడా అభిప్రాయపడ్డారు. 

కాలక్రమేణా, టెక్నాలజీ పెరిగి చేతిలో ఉన్న సెల్ ఫోన్ లో బూతు క్లిప్స్ దొరకడంతో పురుషుల ఔట్ లుక్ మారింది. ఆ క్లిప్స్ చూసి స్వీయ సంతృప్తి మార్గాలు అనుసరించే వారితో పాటు, ఆ క్లిప్స్ లో అమ్మాయిల్లా గా భార్య కూడా వ్యవహరించి తమను సుఖపెట్టాలని కోరుకుని వేధించే వారు కూడా తయారయ్యారు. ఈ రీజన్ తో విడాకులు తీసుకున్న వారూ ఉన్నారు. ఇది కనిపించని సంక్షోభానికి దారితీసింది కానీ మన కుటుంబ వ్యవస్థలో ఉన్న దళసరితత్వం కారణంగా బైట పడకుండా ఉంది. 

అటు సినిమాల్లో బరితెగింపు, ఇటు సెల్లు ఫోన్ లలో అశ్లీలం వల్ల పురుషులు సెక్స్ పట్ల ఒక ఉన్మాద స్థితిలో ఉన్నారు. పొద్దున్నే లేవగానే బ్లూ ఫిలిం క్లిప్స్ చూస్తానని ఆ తిక్క డైరెక్టర్ చెప్పాడు. ఇతరులు బయటికి చెప్పరు. రోజూ అదే పనిగా కోరికలు రెచ్చగొట్టే క్లిప్స్, సీన్స్ కనిపిస్తున్నా... చలనం లేకుండా ఉండాలంటే చాలా సాధన కావాలి. ఊ అంటావా, మామ... ఊహూ అంటావా? అని ఆమె అట్లా వయ్యారం ఒలకబోస్తూ ఊపుతుంటే లేచి ఆడని మగపుంగవులు ఉంటారనికోవడం ఒట్టి భ్రమ. ఇలాంటివి చూసి తమాయించుకోలేక నానా తంటాలు పడే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ ఊపుడు ను క్యాజువల్ గా, వినోదంగా తీసుకుని ప్రవరాఖ్యుడిలా వదిలయ్యాలంటే కూడా ఎంతో సాధన కావాలి. 

పూర్తి సంసార పక్షమైన వారు కూడా స్క్రీన్ మీద వద్దనుకున్నా కనిపించే నీలి సీన్లు  చూసి కాసేపు సొల్లు కార్చుకోవడం నిజం. ఛీ... సిల్లీ గా నేను కూడా తన్మయత్వంతో వాటిని చూసానేమిటి? అన్న అపరాధభావం తర్వాత దహించినా ఆ క్షణంలో కలిగే ఆనందం వేరే. అది మన చేతిలో లేని సంగతి. ఇది ఈ వెధవ దేహంలో రసాయన మార్పుల ఫలితం. ప్రకృతి సహజం. 

ఇట్లాంటి సీన్ల వల్ల ప్రేరేపితులైన వారు నిగ్రహించుకొని బతకడం వాంఛనీయం. కానీ, కామ ప్రేరణ తీట తీరే దాకా మనిషిని మనిషిగా ఉంచదు గదా! ఆ స్థితి మనిషిని ఉన్మాదిని చేస్తుంది. కామా తురాణం... నా భయం, న లజ్జ. సెక్స్ పరమైన ఉన్మాదం మనిషిలో లేస్తే దాని వల్ల వాడిలో వచ్చే పిచ్చిపిచ్చి ఆలోచనలు ఎన్నో. సమాజంలో అఘాయిత్యాలకు కారణం...ఒకపక్క కవ్వించే సీన్లు, మరోపక్క తీరని కోరికలు.

బట్టలు మరీ పొదుపుగా వాడి, కవ్వించే రీల్స్ పెట్టి... నా బట్టలు ఎట్లా ఉన్నా... జీవిత భాగస్వామి తప్ప ఎవ్వరూ స్పందించకూడదని అనడం అన్యాయం. అది చూపరుల చేతిలో లేనిపని. కవ్వించే దృశ్యం చూడగానే, గుండె లోతుల్లో ఒక అలజడి మొదలై, బుర్ర ఖరబై ఆగమాగమై పోతారు. చేసే పని (ఉద్యోగం, సద్యోగం) మీద ఫోకస్ పోయి, ఎంత తొందరగా ఇంటికి చేరాలా? అని మదనపడి చస్తుంటారు.  తీట తీరే మార్గాంతరాల కోసం అన్వేషిస్తారు. 

కనిపించిన ప్రతి ఒక్క మహిళ నూ ఏదో చేయాలన్న పిచ్చి ఉండేవారి సంఖ్య చాలా తక్కువ. వివిధ మాధ్యమాల ద్వారా అప్రయత్నంగా ప్రేరేపితులై... ఆ బలహీన క్షణంలో... చిట్టి పొట్టి బట్టల మాటున ఉన్న వాటిని చూసి కుతి తీర్చుకొనే వారే అధికం. 

ఇది ఒట్టి రక్త మాంసాల ముద్ద...అన్న సంగతిని ఆ క్షణం మరిచిపోతున్నారు. మహిళను కసిగా, అదోలా చూసే పర్వర్టేడ్ ఫెలోస్ పెరగడానికి హేతువు ఇదే. 

అమ్మా, మీ మీద పూర్తి గౌరవంతో చెబుతున్నా. నాకు అర్థమైనంత వరకూ, నేను ఇతరులతో మాట్లాడి తెలుసుకున్న దాన్ని బట్టి  ఇది మీ స్వేచ్ఛ కు సంబంధించిన అంశం కాదు. అవకాశాల ప్రపంచంలో మహిళల స్వేచ్ఛను ఎవ్వరూ హరించలేరు. ఆ పని చేయాలనుకోవడం వెర్రితనం. మన దేశ అభివృద్ధి మహిళా ప్రపంచం చేతిలోనే ఉంది. మితిమీరిన నీలి వాతావరణంలో కవ్వించే బొమ్మ బాడీలో రసాయన చర్యలు జరిపి చేయిస్తున్న  తైతిక్కలాట ఇది.  

మన ఇష్టమైన రకరకాల దుస్తులు వేసుకోవడం లో తప్పు లేదు గానీ... ఈ బలహీన కుసంస్కారులను దృష్టిలో ఉంచుకుని కొద్దిగా డ్రస్ సెన్స్ తో ఉంటే బాగుంటుందేమో, కదా! అందాల ఆరబోతను తట్టుకోలేక ఆగమాగమైపోతున్న ఉన్మాదులు ఎక్కువగా ఉన్న ఈ సమాజాన్ని, వక్ర బుద్ధుల వికృత ఆలోచనలు, చర్యలు దృష్టిలో పెట్టుకుని  ఒక సారి ఆలోచిస్తే బాగుంటుందేమో, కదా!

Saturday, November 22, 2025

సోషల్ మీడియా జర్నలిస్టులు - రకాలు

సత్యనిష్ఠ, నిష్పాక్షికత, నిజాయితీ అనేవి జర్నలిస్టుకు ఉండాల్సిన మౌలిక లక్షణాలు.  వార్త లేదా వ్యాసం రాసినా, వ్యాఖ్య చేసినా  వీటిని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఇవి పాటించని వారు జర్నలిస్టులే కాదన్న రూల్ పెడితే దాదాపు అందరూ ఎగిరిపోతారు. మొబైల్ ఫోన్ లో నాలుగు ముక్కలు రాయడం, నాలుగు మాటలు చెప్పడం వచ్చిన ప్రతి మనిషీ జర్నలిస్ట్ గా చలామణీ అవుతున్న ఈ కాలంలో దీని మీద చర్చ అనవసరం. దానికి తోడు, అన్ని పొలిటికల్ పార్టీలూ బాగా ఖర్చు పెట్టి కొందరు జర్నలిస్టుల నాయకత్వంలో తమ డిజిటల్ సైన్యాన్ని పెరట్లో సిద్ధం చేసుకుని స్వైర విహారం చేస్తున్నాయ్.

ప్రతీ మీడియా హౌస్ ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం సహజమైన విషయం అయినందున మౌలిక సూత్రాలు గాల్లో కలిసి పోయాయి. సమాజ సేవ కోసం, విస్తృత జన ప్రయోజనం దృష్ట్యా... ఒక సైడ్ తీసుకోవడం తప్పుకాదని ఓనర్లు డిసైడ్ కావడంతో జర్నలిస్టిక్ ఎథిక్స్ అనేవి లేకుండా పోయాయి. దీనిమీద ఏడుపులు, పెడబొబ్బలు అరణ్యరోదనే. 

సోషల్ మీడియా వ్యాప్తి పెరిగాక ఈ స్పేస్ లోకి ప్రవేశించిన జర్నలిస్టులు దాదాపు అందరూ బద్నాం కావడానికి, వారికి శత్రువులు తయారుకావడానికి కారణం ఈ మూడు సూత్రాలకు కట్టుబడి ఉండకపోవడం. మంచీ చెడూ తెలియకుండా చటుక్కున ఒక అభిప్రాయానికి వచ్చి బూతులు దోకే రీడర్స్, వ్యువర్స్ తప్పు కూడా ఉంది. 

జర్నలిజం బేసిక్స్ కు కట్టుబడి మడికట్టుకుని కూర్చుంటే జనం ఆ కంటెంట్ చూడరు. యూ ట్యూబ్ డబ్బులు రావు. అందుకే, మొహమాటం లేకుండా ఒక సైడ్ తీసుకుని కంటెంట్ సృష్టిస్తున్నారు... మా వాళ్ళు. దరిమిలా అసభ్య కామెంట్స్, బెదిరింపులు, ట్రోలింగ్ కు గురవుతారు. ఇక్కడ గమ్మత్తైన పరిస్థితి. నికార్సైన జర్నలిజం చేస్తే మీరు చూడరు. కొమ్ముకాసే జర్నలిజం చేస్తే వైరి వర్గం విమర్శలు, ట్రోల్స్. ఇట్లా జర్నలిజం పలచనై, జర్నలిస్టు అంటే చులకనై పోయారు. 

ఇది ఎలా ఉన్నా, ఈ స్పేస్ లో  నాకు కనిపిస్తున్న జర్నలిస్టులు ఐదు రకాలుగా ఉన్నారు. 

1) నిష్పాక్షిక జర్నలిస్టులు: ఏదైనా అంశం మీద కంటెంట్ చేస్తున్నప్పుడు దానికున్న అన్ని కోణాలు చూపించి, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ జనాలకు ఇచ్చే సత్తెకాలపు టైపు. స్టోరీలో యాంగిల్స్ ప్రజెంట్ చేస్తూనే ఫలానా కారణాల వల్ల తాను ఇది అనుకుంటున్నానని చెప్పే రకం. ఇది అరుదైన, దాదాపు అంతరించిపోయిన జాతి. అంత నిబద్ధత, ఓపిక, తీరికా ఎవ్వరికీ లేవు. 

2) జాతీయవాద జర్నలిస్టులు: హిందూ మతం దాడికి గురవుతున్నదని గట్టిగా నమ్మే జర్నలిస్టులు. ఇస్లాం, క్రైస్తవ మతాల నుంచి భారత దేశానికి పొంచి ఉన్న ముప్పు గురించి విస్తృత చర్చ జరిపి, పరుషైన పదజాలంతో  వాదన చేసే రకం. వీరు ఆర్ ఎస్ ఎస్, బీజేపీ అనుకూలురుగా, మోదీ భక్తులుగా ఉంటారు చాలా వరకు. విద్యార్థి దశలో ఏ బీ వీ పీ లో పనిచేసిన లేదా ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ లుగా ఉన్న జర్నలిస్టులు  ఎక్కువగా ఉన్నారు ఇందులో. 

3) యాంటీ సంఘ్ జర్నలిస్టులు: హిందూ మతానికి ఏకైక ప్రతినిధిగా అయిపోయిన సంఘ్ పరివార్, దాని పొలిటికల్ వింగ్ బీజేపీ మీద అనుక్షణం విషం చిమ్మే జర్నలిస్టులు. మోదీ మీద కోపంతో ఒకోసారి భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి వీరు మొహమాటపడరు. బ్రాహ్మలనూ, వేదాలు, మనుస్మృతినీ, సనాతన ధర్మాన్ని కుమ్మేస్తారు. 

ఇస్లాం ఫండమెంటలిజాన్ని, క్రైస్తవ వ్యాప్తి టెక్నిక్స్ ను తప్పుపట్టకుండా, కొండకచో కొమ్ముకాస్తూ కాషాయ వ్యతిరేకతే లక్ష్యంగా ఉంటారు. చిన్నప్పుడు ఏ స్టూడెంట్ యూనియన్ లో లేకపోయినా కారణాంతరాల వల్ల కాషాయ వ్యతిరేకతతో ఉంటే వీరికి ఎక్కువ ప్రయోజనం. దళిత కార్డు, మహిళా కార్డు వాడుకుని జబర్దస్తీ చేసే వారు కూడా ఈ కేటగిరీ లో ఉన్నారు. 

4) ఎర్ర కామ్రేడ్ జర్నలిస్టులు: స్టూడెంట్ డేస్ లో ఎస్ ఎఫ్ ఐ, పీ డీ ఎస్ యూ, ఆర్ ఎస్ యూ లో సభ్యులుగా ఉండి, సర్వ సమస్యలకు ఏకైక పరిష్కారం కమ్యునిజం అని త్రికరణ శుద్ధిగా నమ్మే జర్నలిస్టులు. తమది లౌకిక వాయిస్ అని వారి నమ్ముతారు.  ఇందులో... మావోయిస్టుల యిస్టులు ఉన్నారు. పై కేటగిరీ (యాంటీ సంఘ్) కి, వీరికి పెద్దగా తేడా ఉండదు. 

5) పెయిడ్ జర్నలిస్టులు: ఎవరు డబ్బు ఇస్తే వారిని మోసే జర్నలిస్టులు వీరు. జర్నలిజం విలువలు అనేది వీరికి బూతు మాట. పొలిటికల్ పార్టీలు తయారుచేసుకున్న సైన్యం నడిపే సిద్ధహస్తులు.  సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఎవడు డబ్బు ఇస్తే వాడికి జై కొట్టే బ్యాచ్. ఇవ్వాళ బీ ఆర్ ఎస్, రేపు కాంగ్రెస్... అయినా అంతే డెడికేషన్ తో సేవలు అందించే రకం. 

పరిస్థితి ఈ రకంగా ఉంటే... ఇదేమి జర్నలిజం రా... నాయనా...అని ఏడ్వడం, మొత్తుకోవడం అనవసరం కాదా! జర్నలిస్టిక్ ఎథిక్స్ మీద ఏడేళ్ళు కష్టపడి పీ హెచ్ డీ చేసి, సమాజాన్ని అధ్యయనం చేసిన నేను ఫస్ట్ కాటగిరి (నిష్పాక్షిక) జర్నలిస్ట్ గా బతకాలని అనుకుంటాను. కానీ, ఎన్నికల్లో మోదీ వేవ్ ఉందని గ్రౌండ్ సర్వే ద్వారా చెబితే నన్ను రెండో కేటగిరీ (జాతీయ వాద) లోకి నెట్టారు. నా బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా, నా కులం ఆధారంగా నన్ను అదే బాపతుగా చూసి ఆనందించే లేదా ద్వేషించే వారు ఉంటారు. ఫలానా విషయంలో మోదీ మాటలు తప్పు...అనగానే మూడు లేదా నాలుగో కేటగిరీ లోకి నెడతారు. ఎవ్వడితో తిట్లు, శాపనార్థాలు పడకుండా జర్నలిజం చేయడం దాదాపు దుర్లభం. 

ఏదేమైనా, నిష్పాక్షికంగా ఉండడం చాలా కష్టమైన విషయం. దాదాపు అసాధ్యం. జనం ఆదరించని కార్యక్రమం. వృధా ప్రయాస అనిపించే పని. 

మనం చెప్పేదానికి, చూపే దానికి నాలుగు డబ్బులు ఎట్లా వస్తాయా? అని తపించే ఈ రోజుల్లో ఇది అసంభవమైన విషయం. జర్నలిస్టుల మీద పిచ్చి కామెంట్స్ చేసే జనాలు (రీడర్స్, వ్యువర్స్) నిష్పాక్షిక జర్నలిజాన్ని ఆదరించి అక్కున చేర్చుకునే పరిస్థితిలో లేరు కాబట్టి గొంగట్లో తింటూ బొచ్చు వస్తున్నదని తిట్టుకోవడం ఫూలిష్ నెస్.

Tuesday, November 18, 2025

భలే స్ఫూర్తి- బొల్లినేని వెంకట్


(జర్నలిస్టు మిత్రులతో లంచ్ -1)

చేరిన ఉద్యోగంలో బుద్ధిగా పనిచేసి అక్కడే రిటైర్ కావడం ఒక పద్ధతి. ఒకే ఉద్యోగంలో డక్కామొక్కీలు తిని ఎదగడం ఒక మంచి విషయం. అట్లా కాకుండా...

"వాట్ నెక్స్ట్"... అని తపించి కొత్త అవకాశం సృష్టించుకుని, అందిపుచ్చుకుని ముందుకు సాగిపోవడం ఇంకో పద్ధతి. కొత్త అవకాశం అంటే... కొత్త స్కిల్ సెట్, కొత్త అడుగు, కొత్త వాతావరణం, కొత్త మనుషులు. అందుకు ఎంతో శ్రమ, ధైర్యం, త్యాగం కావాలి. 

ఈ రెండో కేటగిరీకి చెందిన ప్రియ మిత్రుడు బొల్లినేని వెంకట్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. 1992 బ్యాచ్ మాదైతే, ఆ తర్వాత ఆరు నెలలకు మొదలైన బ్యాచ్ లో వెంకట్ ఉన్నాడు. మా రూమ్మేట్. తను సిటీ డెస్క్ లో చేసేవాడు. సివిల్స్ కు ప్రయత్నం చేసినట్లు గుర్తు. 

నిత్య సంచలన శీలి. తన ఆప్యాయత, ఓపిక, డ్రస్ సెన్స్, చెరగని చిరునవ్వు నాకు బాగా నచ్చేవి. 

తను రాసిన వ్యాసం లేదా వార్త, దానికి  చీఫ్ ఆఫ్ బ్యూరో స్పందన, డెస్క్ ఇంచార్జ్ ధోరణి... లాంటివి మేము మాట్లాడుకునేవారం. అప్పుడు మావి పసి హృదయాలు. బాగా కష్టపడి నాణ్యత పెంచుకుని, సామర్థ్యం నిరూపించుకోవాలని తపించే కాలం. ఆ ప్రయత్నంలో భుజం తట్టే వారికన్నా...మనసు గాయపరిచేవారు ఎక్కువగా ఉండేవారు. అలాంటి అనుభవాల వల్ల రూంకు వచ్చి ఏడవడం తప్ప మనము చేయగలిగింది ఏమీ లేదు. అట్లా మేము ఆ రోజు బాగా హర్ట్ అయితే...జరిగింది చెప్పుకుని... మనది తప్పా? ఆ వెధవలది తప్పా? అని తర్కించుకుని మనసు భారం తీర్చుకుని నిద్రపోయే వాళ్ళం. సీనియర్లు ఐడియాలను ప్రోత్సహించకుండా, మాటలతో కించపరిచిన సందర్భంలో ఒకరికొకరం ఓదార్చుకుని ఊరట పొందేవారం. 

వెంకట్, సత్య కుమార్, నేను కాస్త డబ్బు లోటు ఉన్నప్పుడు అన్నంలో గొడ్డుకారం, నిమ్మకాయనో, మజ్జిగ, పచ్చి మిరపకాయ, ఉల్లిగడ్డనో నంజుకునో తిన్న రోజులు బాగా గుర్తు. ఇంటి దగ్గరి నుంచి డబ్బు తెప్పించుకోకూడదని, ఎవ్వరినీ అప్పు అడగకూడదని మా  పట్టుదల. 

ఎప్పుడో తెల్లవారుఝామున వచ్చి...మా రివ్యూ సెషన్ అయ్యాక పడుకునే వెంకట్ ఉదయం 6 గంటలకల్లా మాయమయ్యేవాడు. ఎవరో ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి పోతున్నానని చెప్పే వాడు. తర్వాత తెలిసింది... తన సీక్రెట్ ఆపరేషన్. 

తన వివాహం అయ్యాక కూడా మేము నవీన్ నగర్ లో ఉండేవాళ్ళం. నాకూ అప్పటికే పెళ్ళి అయ్యింది. మేము కలుసుకునే వాళ్ళం. వెంకట్ శ్రీమతి గారు బాగా మాట్లాడేవారు. 

పెళ్లి అయ్యాక...నవీన్ నగర్ టెలిఫోన్ బూత్ లో ఒక నోట్ బుక్ పెట్టుకుని ఎక్కువ సేపు ఎవరితోనే వెంకట్ మాట్లాడడం నేను చాలా సార్లు చూసాను. నిజానికి నాకు అది వింతగా అనిపించేది. అంత సేపు ఫారిన్ కాల్స్ లో ఉంటే డబ్బు ఆవిరి అవుతుందని నా భయం. తను అబ్రాడ్ లో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడేవాడు.

 వెంకట్ ఒక ఫైన్ మార్నింగ్ ఈనాడు వదిలి బహ్రెయిన్ లోనో, దుబాయ్ లోనో తేలాడు. ఒక కామర్స్ స్టూడెంట్... కంప్యూటర్ కోర్సులు చేసి ఐ టీ లోకి వెళ్ళడం, పైగా ఫారిన్ జాబ్ కొట్టడం 

నాకైతే వావ్ అనిపించింది. ఒంగోలు లో సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వెంకట్ స్వయంకృషితో మంచి స్థాయికి చేరుకోవడం గర్వకారణం. 

ఇప్పుడు ఒక 22 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డాడు.  తను సింగపూర్ లో ఉండగా నా తమ్ముడు కూడా అక్కడ పనిచేసేవాడు. వాళ్ళు అక్కడ కలిశారు. నేనా సమయంలో చెన్నై లో ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో చదువుతున్నా. అప్పుడు టచ్ లోకి వచ్చిన గుర్తు. 

మధ్యలో రెండు, మూడు సార్లు ఫోన్ లో మాట్లాడుకున్నాం. వెంకట్ కు ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి ఇండియాలోనే మెడిసిన్ చేస్తోంది. రెండో అమ్మాయి... యూ ఎస్ లో కాలేజీ లో ఉంది. 

తను ఇండియా వచ్చిన సందర్భంగా ముందుగా ఫోన్ లో మాట్లాడుకుని  గత శుక్రవారం (నవంబర్ 14, 2025) లంచ్ కు కలవాలని గట్టిగా అనుకున్నాం. కలిశాం. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ కు పోయాం.. తను వెజ్ ప్రిఫర్ చేసాడు కాబట్టి. తింటూ, తిన్నాక... ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కొన్ని ఐడియాలు పంచుకున్నాం. కుళ్ళు, కుతంత్రాలు లేని వెంకట్ చిరునవ్వు అప్పటి లాగానే స్వచ్ఛంగా ఉంది. అది అట్లానే ఉండాలని, ఆయన, ఆయన కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. 

ఆత్మీయ జర్నలిస్ట్ మిత్రులతో లంచ్ కార్యక్రమం వెంకట్ తో మొదలయ్యింది. త్వరలో ఇంకో మిత్రుడిని కలిసి, తిని, ఆ అనుభవాలు పంచుకుంటా. అప్పటిదాకా సెలవ్. 

-S Ramu

Sunday, November 16, 2025

విద్యావంతులారా... చూశారా??? దేశం మట్టి కొట్టుకు పోతోంది!!!

మనకెందుకొచ్చిన గొడవని ముడుచుకుని కూర్చుంటున్నాం గానీ, దేశం పెద్ద ప్రమాదంలో ఉంది. సంక్షోభం, ప్రమాదం...అనే పదాల్లో రెండో దాని తీవ్రతే ఎక్కువని భావించి ఆ పదం వాడుతున్నా గానీ, ప్రమాదం, పెను ప్రమాదం, ఘోర ప్రమాదంలో దేశముంది ఇప్పుడు. ఏ పార్టీకీ, ఏ ఇజానికీ చెందని నిష్పాక్షిక, నైతిక జర్నలిస్టుగా...ఇది చెప్పాలని ఉంది. 

బీహార్లో ఎవరు గెలిచారు? ఎవరు గెలవాల్సింది? అన్నది ముఖ్యం కాదు. కానీ, ఎన్నికలకు వారం ముందు ప్రతి మహిళకు పదేసి వేల రూపాయలు ఇవ్వడమేమిటి? గెలిచాక, ఇంకో 1.9 లక్షలు (అంటే మహిళకు రూ 2 లక్షలు) ఇస్తామని వాగ్దానం చేయడం ఏమిటి? భీకరమైన సమస్యలతో నవిసి ఉన్న బీహార్ ఇంత పెద్ద భారాన్ని ఎట్లా మోస్తుంది? 

ఎన్నికల్లో గెలవాలంటే... ఉచితంగా ఏవేవో ఇచ్చి ఓటర్లను బుట్టలో వేసుకుంటున్నారు.   ఫ్యాన్లు, టీవీలు ఇవ్వడంతో మొదలై, వేలకు వేలు మనీ ట్రాన్స్ఫర్ దాకా వచ్చింది.  

రెండు రూపాయలకు కిలో బియ్యం ఒక రకంగా నయం. ఆ తర్వాత రకరకాల రూపాల్లో ఫ్రీ గా పంచడం మొదలయ్యింది. రైతు బంధు అని రైతులకు సాలుకు రెండు విడతల్లో ఎకరాకు ఐదేసి వేలు, దళిత బంధు అని ఒకొక్కరికి 10 లక్షలు ఒకరు, నవ రత్నాలని ఇంకొకరు కుమ్మేశారు. అంత బాగా చదువుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఉచిత రబ్డీ లతో ఓటర్లను ఆకట్టుకుంటే దాని మీద చర్చ జరగాలన్న వాళ్ళు... అంతకు మించి లడ్డూలు, మిఠాయిలు ఇచ్చి జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. 

మహిళలకు ఫ్రీ గా ఇస్తే ఫలితాలు బాగున్నాయని అర్ధమై వారికి ఉచిత బస్సు ద్వారా కాంగ్రెస్, ఫ్రీ గా డబ్బు ఇచ్చి బీజేపీ దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే వినూత్న రీతిలో ఫ్రీ గా ఏదో ఒకటి ఇవ్వాలి, తప్పదు.   

కష్టపడి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి సంపాదిస్తున్న వారి మీద పన్నులు వేసి, తాగుడు మీద సంపాదించి అనుచితంగా ఉచిత పధకాల మీద పోస్తున్నారు. ఒరేయ్ నాయనా, రైతుకు కావాల్సింది... కల్తీ లేని విత్తనాలు, ఎరువులు, స్టోరేజ్, మార్కెట్ వసతులు. జనాలకి కావలసింది... మంచి విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఇంటి వసతి, కల్తీలేని వస్తువులు, శాంతి భద్రతలు. కుక్క బిస్కెట్స్ వేసి బంగారు బిస్కెట్స్ కాజేస్తున్నారు గదా! 

ప్రజాస్వామ్యాన్ని బీరు, బిర్యానీ స్థాయికి దిగజార్చిన పొలిటీషియన్స్ పార్టీలు మారుతూ అధికారం లో కులుకుతుంటే... వివిధ సమస్యలతో జనాలు ఎవరి చావు వారు  ఛస్తున్నారు. తమకు కావలసింది ఏమిటో, భవిష్యత్ ఏమిటో తెలియని నిరక్షర కుక్షులు ఒక పక్కా...మతం, కులం బురదగుంటలో పొర్లుతున్న విద్యావంతులు మరో పక్కా! మేధావులు, కళాకారులు, కవులు, రచయితలు నిమ్మకు  నీరెత్తినట్లు ఉంటే, జన్ జీ పిల్లలు వర్చువల్ ప్రపంచంలో సుఖం ఆస్వాదిస్తూ నిమ్మళంగా ఉన్నారు. లేని ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం ఇంకో సెక్షన్ ఏక సూత్ర అజెండాతో నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తూ.. జనాల అసలు సమస్యల గురించి మాట్లాడడం లేదు. కుల హక్కులతో పాటు... ఈ సామాజిక ప్రమాదాల గురించి కూడా చెప్పి జనాలని చైతన్యపరచండి, మహరాజ్! 

ఈ ఫ్రీ బీ ల వల్ల విపరిణామాలు.అనేకం. ఆర్థిక సమస్య పెరుగుతుంది. అవినీతి విస్తరిస్తుంది. అది నేరాలకు దారితీస్తుంది.

ఇప్పటికే కొంప కొల్లేరు అయ్యింది. టాక్స్ పేయర్స్, విద్యావంతులు, మేధావులు మేల్కొనాలి. వీలున్న ప్రతి వేదిక మీదా... ఈ ఉచిత మాయాజాలం గురించి నిర్మొహమాటంగా మాట్లాడాలి. ఇదొక సామాజిక  ఉద్యమం కాకపోతే మనం,.మన బిడ్డలు సేఫ్ గా బతికే పరిస్థితి లేదు. ఆలోచించండి. 

Monday, October 27, 2025

తీన్మార్ మల్లన్న Vs జర్నలిస్టులు

(Dr S Ramu) 

కేసీఆర్ గారి భజనలో తెలంగాణ నిండా మునిగి ఉన్నప్పుడు ఆయన్ను కుమ్మి కుమ్మి పెట్టిన మొదటి గళం తీన్మార్ మల్లన్న అని లోకవిదితమైన చింతపండు నవీన్ కుమార్ గారిది. BRS ఢమాల్ కావడంలో మాటల తూటాలతో ఆయన నడిపిన Q News ది ప్రధాన పాత్ర. అదొక గట్టి పోరాటం. మల్లన్న గారు దీనివల్ల ఎన్నో కేసులు ఎదుర్కున్నారు. ఆ సానుభూతి నాకు ఉండేది. 

అందుకే, ఆయన జైల్లో ఉన్నప్పుడు నేను పలు వేదికల మీద వ్యాసాలు రాసాను. దొంగ కేసు ఆధారంగా వచ్చిన ఒక సినిమా ఇతివృత్తాన్ని ఆయన జీవిత కోణం నుంచి నేను ఒక పెద్ద వ్యాసం ఇంగ్లీషు లో రాసి ప్రచురిస్తే Q News లో చూపించారు కూడా. మల్లన్న చేసింది బ్లాక్మెయిల్ జర్నలిజం కాదా? అసలాయన జర్నలిస్టునా? అంటే నా దగ్గర సమాధానం లేదు. 



అప్పుడు బీజేపీ లో ఉన్న ఆయనకు అనుకూలంగా రాసినందుకు మా ప్రొఫెసర్ ఒకరు నొచ్చున్నారు. మల్లన్న ట్రూ కలర్ నాకు తెలవదని, ముందు ముందు చూస్తావని  వారు అన్నారు. అయినా... మల్లన్న పోరాటం మామూలుది కాదని, అది చాలా స్పూర్తిదాయకమని, మనం తనను ఇష్యూ బేస్డ్ గా చూడాలని సున్నితంగా వాదించాను. ఏ issue కి ఆ issue చూడకుండా బ్లాంకెట్ స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల సమస్య వస్తున్నది. 

బీసీ ల ఐక్యత కోసం మల్లన్న చేసిన ప్రయత్నం బాగుంది. కానీ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎలక్షన్ సందర్భంగా ఫ్రెండ్స్ ప్యానెల్ తరఫున అధ్యక్ష పదవిలో ఉన్న Vijaykumar Reddy Srigiri మీద ఆయన విడుదల చేసిన వీడియో నాకు నచ్చలేదు. విజయ్ ఒక దుర్మార్గుడు, బీసీ ద్రోహి అని థంబ్ నెయిల్ పెట్టి పరుష పదజాలం వాడి వదిలారు. ఆయన గెలిస్తే ప్రెస్ క్లబ్ లో బీసీ ల ప్రెస్ కాన్ఫరెన్స్ కు అవకాశం ఇవ్వరని కూడా అన్నారు. నిజానికి ఎవరో అభ్యర్థి మల్లన్న పేరిట డీప్ ఫేక్ చేశారేమో అనిపించింది. అది అంత సిల్లీ టాక్. 

కానీ, 1280 మంది సభ్యులున్న ప్రెస్ క్లబ్ నిన్న జరిగిన ఎన్నికల్లో సాక్షి లో పనిచేస్తున్న విజయ్ కుమార్ రెడ్డి గారిని ప్రెసిడెంట్ గా మంచి మెజారిటీ తో ఎన్నుకుంది. ఆయన ఆధ్వర్యంలోని ఫ్రెండ్స్ ప్యానెల్ కు విజయం కట్టబెట్టారు. జనరల్ సెక్రటరీ గా ఈనాడు మిత్రుడు వరకుప్పల రమేష్ గెలిచారు. 

తీన్మార్ మల్లన్న ఇచ్చిన పిలుపు కు భిన్నంగా విజయ్ విజయ భేరి మోగించారు. విజయ్ ను సమర్ధించిన వారిలో బీసీ లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. తన వృత్తి అయిన జర్నలిజంలో ఉన్న జర్నలిస్టులు, బుద్ధిజీవులు మల్లన్న మాటలు పట్టించుకోలేందటే...సామాన్య జనం ఆయన్నేమి దేఖుతారన్న ప్రశ్న ఉదయిస్తుంది కానీ ఆ వాదనా అంత సమంజసం కాదు. 




అయ్యా... మల్లన్న గారూ! మీకు ధైర్యం, నోరు ఉన్నాయి.  పిడుక్కీ, బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లు నోటికొచ్చిన పదాలు వాడితే జనం హర్షించరు. విజయ్ మీకు నచ్చకపోతే... ఎందుకు నచ్చలేదో కారణాలు చెప్పే హక్కు మీకుంది. ఆయనకు కాకుండా కేవలం బీసీ లనే గెలిపించాలని కోరడంలో అస్సలు తప్పులేదు. కానీ దుర్మార్గుడు, ద్రోహి అనడం, పెద్ద ఆరోపణలు చేయడం

కరెక్ట్ కాదు. మీరు ఈ విషయంలో పొరబడ్డారు. మల్లన్న మీద మంటతో విజయ్ కు అనుకూలంగా ఎక్కువ ఓట్లు పడ్డాయన్న టాక్ రావడం బాధాకరం కదా! 

ప్రతి పదానికి ఒక వెయిట్ ఉంటుంది, బ్రదర్. సోషల్ మీడియాలో, లైవ్ షో లలో సాధారణ జనాలను ఆకట్టుకోవడానికి అది సరిపోవచ్చు, జర్నలిస్టిక్ ఎథిక్స్ పక్కనబెడితే. ఆ బరువైన మాటలు అటు మీతో ఉన్న పొలిటీషియన్స్ మీద, ఇటు జర్నలిస్టుల మీద వాడితే మీకు చాలా నష్టం. బీసీ ఉద్యమానికి మీ గళం ఉపకరించాలంటే మాట్లాడాల్సిన భాష ఇది కాదు. 

కమ్యూనికేషన్ సమస్తం. అదే భస్మాసుర హస్తం కూడా. భద్రం... బీ కేర్ ఫుల్ బ్రదర్.

PS: మల్లన్న మీద soft corner తో ఇది రాసినట్లు... నేను బాగా అభిమానించే మిత్రులు, మేధావులు అభిప్రాయపడ్డారు. Fact based కామెంట్ చేయాలని దీని ఉద్దేశ్యం. మొదట్లో ఆయన మీద ఉన్న  అభిప్రాయం ఇప్పుడు నాకేమీ లేదు. ఆయన వ్యాఖ్యల మీద వీలున్నప్పుడల్లా రాస్తూనే ఉన్నాను.

Thursday, July 17, 2025

రాజన్న గారు...నిజమైన యోధుడు...



చిన్న సమస్య వేస్తే...నానా ఏడుపులు ఏడుస్తాం మనం. Why me? అని తల్లడిల్లిపోతాం. అలాంటిది.. కక్ష కట్టినట్టు అడుగడుగునా సమస్యలు వెంటబడితే తట్టుకోవడం అంత తేలిక కాదు. 

చిన్నప్పుడు దారిద్ర్యంతో చాలా ఇబ్బంది పడ్డాడు. 

కష్టాల కడలి మధ్య పెరిగాడు. 

భార్యపై కన్నేసిన ఒక దగుల్బాజీ హత్య కేసులో చిక్కున్నాడు. 

వ్యవస్థపై నమ్మకంతో లొంగిపోయాడు.

జైలు పాలయ్యాడు. 

మొర ఆలకించని, నిజాన్ని పట్టించుకోని వ్యవస్థ ప్రతినిధి గా జడ్జి పై చెప్పు విసిరాడు. 

ఉరిశిక్ష ఖరారయ్యింది.

భార్య జీవితం ఖరాబు కాకూడదని ఆమె వేరే పెళ్ళికి ఒప్పుకున్నాడు. 

జైల్లో పేరుమోసిన అన్నలను కలిసి సమాజ పాఠాలు నేర్చుకున్నాడు. 

మంచి జైలర్ వల్ల ఉరి శిక్ష తప్పించుకున్నాడు. 

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పుణ్యాన డిగ్రీ సాధించాడు. 

జర్నలిజం వైపు మొగ్గుచూపాడు. 

విడుదలయ్యాక జీవిత సమరం చేశాడు. 

భార్య, ఇద్దరు పిల్లలతో జీవితం సాగిస్తున్నాడు. 

ఇదీ సంక్షిప్తంగా రాజన్న జీవిత చరిత్ర. ఆయన స్వీయ కథ హిందీలో వచ్చింది. ఇప్పుడు తెలుగులో వస్తున్నది. 

నాకు ఒక మూడేళ్లుగా ఆయనతో పైపైన పరిచయం. ఆయన గురించి "నిర్దేశం" అనే చిన్న పత్రికలో వచ్చిన సీరియల్ చదివి నా గుండె అల్లకల్లోలం అయ్యింది. ఆ పత్రికకి నా అభిప్రాయం రాసి పంపాను. 

నిన్న రాత్రి "World Public Relations Day" సందర్భంగా ఆయన్ని హైదరాబాద్ లో కలిశాను. ఇట్లా చిరు సత్కారం చేశాను. 

వ్యవస్థలో లోటుపాట్లకి, కొందరి దౌర్జన్యానికి బలైన రాజన్ గారిని అదే వ్యవస్థలోని కొన్ని అంగాలు, కొందరు వ్యక్తులు ఆదరించి అక్కున చేర్చుకోవడం ఊరట నిచ్చే అంశం. ఇప్పుడు 65 ఏళ్ల వయస్సు ఉన్న ఆయన జీవితం ఒక సినిమా రూపంలో వస్తేనే మంచిది.