Saturday, October 26, 2024

యూట్యూబ్ ఛానళ్ల రగడ, రచ్చ, గలాభా...

జర్నలిస్టు అంటే ఎవరో చెప్పి పుణ్యం కట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగితే....చాలా మందికి కోపం వచ్చింది. తమవల్ల మాత్రమే తెలంగాణ వచ్చిందని భ్రమ పడే కొందరు ఆ మాటలకు గయ్యిమన్నారు.  ముఖ్యంగా యూ ట్యూబ్ ఛానెల్స్ వాళ్లకు బాగా మండింది. కానీ, చూసే వాళ్ళ సంఖ్యను, అంటే ప్రజాదరణను, బట్టి రేటింగ్ ఉండీ, దాన్ని బట్టి డబ్బులు ఇచ్చే మెకానిజం కావడంతో యూ ట్యూబ్ వాళ్ళను మరీ తీసిపారేయడానికి వీల్లేని పరిస్థితి. ఛానెల్స్ ద్వారా లక్షలు సంపాదిస్తున్నా...తద్వారా ఎందరికో ఉపాధి ఇస్తున్నా...నేను జర్నలిస్టును కానా? అని ఇలాంటి వాళ్ళు వాదిస్తారు. నిజమే, అదీ కాదనలేని మాటనే. కొందరైతే జర్నలిజం మౌలిక సూత్రాలు గాలికొదిలి ఎవడ్నిబడితే వాడ్ని బండబూతులు తిట్టి, నోటికొచ్చిన అవినీతి ఆరోపణలు చేసి ప్రజాదరణ పొందుతున్నారు. అలాంటి వారిని ఏమనాలి? మన జనాలకు కావలసింది...మసాలా సరుకు, బూతు వినోదం. సంసారపక్షంగా పద్ధతి ప్రకారం ప్రోగ్రాం చేస్తే చూడరు కదా! అదొక వీక్ నెస్, దౌర్భాగ్యం. అందుకే జర్నలిస్టు నిర్వచనం ఇక్కడ చాలా కష్టం. 

1) మోదీ గారిని, హిందువులను తిట్టే బ్యాచ్, 2) కాషాయం మాత్రమే ఎజెండా గా ఉన్న  బ్యాచ్, 3) ముస్లిం అనుకూల, కుల రాజకీయాల మీద మాత్రమే మాట్లాడే బ్యాచ్, 4) బీ ఆర్ ఎస్ లేదా కాంగ్రెస్ అనుకూల బృందం, 5) ఎప్పుడూ నెగిటివ్ వార్తల మీదనే వండివార్చే వారు...ఇలా ఐదు రకాలుగా యూ ట్యూబ్ వాళ్ళు కనిపిస్తున్నారు. నిష్పాక్షికంగా ఉండి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఒక వీడియో చేస్తే... మోదీ భక్త్ అని కాంగ్రెస్, కమ్యూనిస్టు అనుకూల ఛానెల్స్ వాళ్ళు, వారి వ్యూవర్స్ ముద్ర వేస్తారు. రాహుల్ మంచి మాట చెప్పాడని ఒక క్లిప్ చేస్తే... దేశ ద్రోహి అంటారు కాషాయ బ్యాచ్. ఒక కులానికి వ్యతిరేకంగా దుమ్మెత్తిపోసే వాళ్ళను..తప్పురా నాయనా అంటే...మనువాది అంటారు. రాజ్య హింసకు బలైన ప్రొఫెసర్ సాయిబాబా గారికి నివాళిగా రాస్తే...ఏదేదో అన్నారు. ఎన్నికలప్పుడు దగ్గరి నుంచి చూసాను...కొందరు యూ ట్యూబర్స్ బీభత్సకాండ. 

ఈ దారుణ వాతావరణంలో సైడ్స్ తీసుకోకుండా టాపిక్ ను టాపిక్ గా, తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా జర్నలిస్ట్ గా చూద్దామంటే బతకనివ్వడం లేదు. భలే ఇబ్బందిగా ఉంది...చటుక్కున లేబులింగ్ చేసే బుర్ర తక్కువ మూర్ఖపు దండుతో. 

ఇదెందుకు రాస్తున్నానంటే, ప్రజాస్వామ్యానికి పనికి వచ్చే మాటలు కాకుండా పనికిరాని చెత్త విషయాల మీద ఎక్కువవుతున్న యూ ట్యూబ్ ప్రోగ్రాం లను చూసి. ఉదాహరణకు - ఈ మధ్య అఘోరాల మీద ప్రోగ్రామ్స్ ఎక్కువ అయ్యాయి. ఆడ లేడీస్ అఘోరాస్ మీద కుమ్మేస్తున్నారు. జర్నలిజం కోర్సు చేసి మీడియాలో పనిచేసిన వాళ్ళు కూడా ఇలాంటి చెత్త ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టులు గా పేరున్న వారు నోటికి ఏది వస్తే అది మాట్లాడే సినీ గలీజ్ గాళ్లను (ముఖ్యంగా డైరెక్టర్స్) ను కూర్చోబెట్టుకుని రోజూ ఇంటర్వ్యూస్ చేసి గబ్బు లేపుతున్నారు. 

భావప్రకటన హక్కూ...తొక్కా అనుకుంటూ గొట్టాలు పట్టుకుని వసూలు చేసే వాళ్ళు ఎక్కువై, తాము చేసేది జర్నలిజం అని వారు ప్రచారం చేస్తుంటే...జర్నలిస్టిక్ ఎథిక్స్ అనే సత్తెకాలపు ఎడిటర్లు, జర్నలిస్టులు ఏడుస్తున్నారు. 

పరిస్థితి మారాలి, బాస్! 


Wednesday, October 23, 2024

వైరా స్కూల్ గ్రౌండ్... పీడీ రామస్వామి సార్!

ఖమ్మం - తల్లాడ మధ్యలో ఉండే చిన్న పట్టణం వైరా. వందలాది గ్రామాల మంచినీటి అవసరాలు తీర్చే వైరా రిజర్వాయర్ ఒడ్డున చూడముచ్చటగా ఉంటుంది మా స్కూలు కమ్ కాలేజ్ ప్రాంగణం. అందులో మధ్యలో ఉన్న బాడ్మింటన్ కోర్టు, స్టేజ్...రెండూ నా జీవితంలో ప్రధానమైనవి. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ ఫస్టియర్ వరకూ అవే ప్రపంచం. అంతకుముందు చదివిన రెబ్బవరం స్కూల్ లో కూడా బాడ్మింటన్ ఆడుతూనే చదువులో ముందున్న నేను వైరా వచ్చాక ఆటలు, నాటికల మీద దృష్టి పెట్టాను.  వ్యాసరచన, వక్తృత్వంలో కూడా ప్రైజులు వచ్చేవి. పైగా...మా నాన్న గారు పనిచేసే వెటర్నరీ ఆఫీసు పక్కనే మాకు విశాలమైన క్వార్టర్ ఉండేది. క్రీడల మీద ఆసక్తి ఉన్న మా నాన్న గారు ఆఫీసు ఆవరణలో బాడ్మింటన్ కోర్టు తో పాటు షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు వేశారు. ఉదయం అక్కడ నాన్న, అన్నయ్య, తమ్ముడు, నేను, సైదులు (ఇప్పుడు టీచర్), ఇతర పిల్లలు కలసి బాగా ఆడేవాళ్ళం. 

వైరా స్కూల్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీ ఈ టీ) మల్లయ్య గారు, ఫిజికల్ డైరెక్టర్ (పీ డీ) రామస్వామి గారు ఉండేవారు. ఆ నాలుగేళ్లు అన్ని పోటీల్లో బాల్ బాడ్మింటన్ లో నేను ప్రైజులు పొందాను. వారిద్దరూ మంచి సమన్వయంతో కబడ్డీ, ఖో ఖో ఆడించేవారు. చిన్న మెరిసే కళ్ళతో రామస్వామి సార్ చలాకీగా నవ్వుతూ బాగుండేవారు. ఆయన మంచి బాడ్మింటన్ క్రీడాకారుడు. స్ప్రూ సర్వీస్ చేయడంలోనే కాకుండా బంతిని స్పిన్ చేస్తూ ఆయన కొడితే చూడముచ్చటగా ఉండేది. బాలు వర్తులాకారంలో కోర్టు బైటి నుంచి లోపలకి వెళ్లేలా ఆయన స్పిన్ షాట్ కొట్టే వారు. అందుకే ఆయన నాకు ఒక రోల్ మోడల్ అయ్యారు. ఆయన లాగా బీపెడ్ చేసి

పీడీ కావాలన్న టార్గెట్ ఉండేది. అయితే, 'రామూ, ఎప్పుడు చూసినా ఆటల మీద ఉంటున్నావ్. మన దేశంలో ఆటలని నమ్ముకుంటే ఫుడ్డు దొరకదు. ఇందులో ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి. అవకాశాలు తక్కువ. నువ్వు బ్రైట్ స్టూడెంట్ వి. చదువు మీద దృష్టి పెట్టు,' అని మల్లయ్య గారో, రామస్వామి గారో నాకు ఒక రోజు ఉద్బోధ చేసినా నేను గ్రౌండ్ విడవలేదు. 

ఆ తర్వాత కొత్తగూడెంలో డిగ్రీ చేస్తూ కూడా ఆటల మీద టైం పెట్టడానికి కారణం..పీ డీ కావాలన్న లక్ష్యం. యూనివర్సిటీ స్థాయికి వెళ్ళినా మోకాలులో లిగమెంట్ దెబ్బతిని ఆటలకు దూరం కావాల్సి వచ్చింది. ఆ విధంగా జర్నలిజం లోకి మారి దాన్నే వృత్తిగా ఎన్నుకోవాల్సి వచ్చింది. 

అయితే, నా కుమారుడు స్నేహిత్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు అయ్యాడనీ, దాదాపు 45 దేశాల్లో భారత్ కు ప్రాతనిధ్యం వహించాడని మల్లయ్య సార్ ను, రామస్వామి సార్ ను కలిసి చెప్పాలని చాలా సార్లు అనుకున్నా కానీ కుదరలేదు. మొన్న సోమవారం నాడు రామస్వామి సార్ 75 ఏళ్ల వయస్సులో మరణించారన్న వార్త తెలిసి బాధేసింది. వారి ఆత్మకు శాంతి కలుగుగాక! 

మల్లయ్య సార్ ఎక్కడ ఉన్నారో వాకబు చేసి కనీసం వారినైనా కలవాలి. 

Tuesday, October 15, 2024

ప్రొ. సాయిబాబా నిరూపించిన సత్యాలు!

నక్సల్ ఉద్యమంలో సుదీర్ఘకాలం పాటు పనిచేసి 2007 జూన్ లో లొంగిపోయిన కోనపురి రాములు ఇంట్లో మాజీ నక్సల్, పోలీసుల దన్నుతో బీభత్సం సృష్టించిన నయీముద్దీన్ రెండు పెద్ద నాగుపాములను వదిలాడు ఒక సారి. నల్గొండ జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం లో రాములు వాళ్ళ పూరింటి మధ్యలో ఆ పాములు పడగ విప్పి బుస కొట్టడం చూస్తే ఎవరికైనా గుండెలదురుతాయి. 

లొంగిపోయిన రాములును తన దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో నయీమ్ తన స్టైల్ లో ఈ పని చేశాడు. రాములు లొంగుబాటుకు ముందు 'ది హిందూ' జర్నలిస్టుగా, నల్గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న నాకు ఫోన్ చేసి ఏమి మాట్లాడిందీ, నేను ఒక బాధ్యత గల పౌరుడిగా రాగద్వేషాలకు అతీతంగా ఏమి సలహా ఇచ్చిందీ  ఇక్కడ అప్రస్తుతం. జర్నలిస్టులు ఇజాల చట్రంలో ఇరుక్కోకుండా వంద శాతం నిష్పాక్షికంగా మానవత్వంతో మాత్రమే వ్యవహరించాలన్న నా సిద్ధాంతం, ఆ క్రమంలో  ఎదురయ్యే నానా ఇబ్బందులు,  అన్ని పక్షాల అపార్ధాలకు గురికావడం గురించి తర్వాత చెప్పుకుందాం. ఈ పోస్టు విషయం--57 ఏళ్ల వయస్సులో వ్యవస్థ కసాయితనానికి బలై మరణించిన సాయిబాబా గారి ఉదంతం నేర్పే పాఠాలు. 


90 శాతం అంగవైకల్యంతో, వీల్ ఛైర్ లో మాత్రమే తిరగగలిగే ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీ ఎన్ సాయిబాబా ను పదేళ్ల పాటు అమానుష పరిస్థితుల మధ్య జైల్లో నిర్బంధించడం వెనుక ప్రభుత్వానికున్న ఆలోచన, ఆ నయీమ్ ఆలోచనా ఒక్కటే! భయపెట్టడం. నరాలు పగిలే అనిశ్చితి సృష్టించడం. ప్రాథమిక టార్గెట్ (నయీమ్ కు రాములు, సర్కారుకు సాయిబాబా) ను భయభ్రాంతులకు  గురిచేస్తూనే ఇతరులకు గట్టి సందేశం ఇవ్వడం. ఇంతకన్నా పిచ్చి ఆలోచన ఇంకోటి ఉండదని ఎప్పుడూ నిరూపితమవుతూనే ఉంది. ప్రొ. సాయిబాబా ఉదంతం నేర్పే ఐదు ముఖ్యమైన పాఠాలు ఇవీ. 

1) పీడిత తాడిత ప్రజల కోసం కష్ట నష్టాలోర్చే, జీవితాలు తృణప్రాయంగా త్యాగం చేసే మొండి మనుషులు ఈ సమాజంలో ఉన్నారు/ ఎప్పటికీ ఉంటారు.  

2) ఇలాంటి గట్టి సైద్ధాంతిక నిబద్ధత కలిగిన వారిపై అధికారంలో ఉన్న వారు కక్షగట్టి హింసించగలరు కానీ వారు ఎంచుకున్న మార్గం నుంచి కోబ్రాలు, అండా సెల్ ల ద్వారా తప్పించగలగడం దుర్లభం. 

3) ఇలాంటి నిరసన గళాల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ, బీ ఆర్ ఎస్, టీ డీ పీ, జనసేన) ఒకే రకంగా వ్యవహరిస్తాయి. మొహబ్బత్ కా దుకాణ్ కావాలనుకున్న రాహుల్ గాంధీ గానీ, అంతేవాసి రేవంత్ గానీ కాంగ్రెస్ పక్షాన తెలుగు మేధావి కి అనుకూలంగా మాట్లాడారా? పోనీ, వీరవిప్లవ యోధుడు చేగువరా బ్రాండ్ అంబాసిడర్ గా హడావుడి చేసిన వారు పీకింది ఏమైనా ఉందా? అది పవర్ మహిమ.  

4) సాయిబాబా గారిపై అంతలా కక్షగట్టి, హింసించి రాజ్యం వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడింది. ఆ తప్పు ప్రజాస్వామ్యం మీద చులకనభావాన్ని మరింత పెంచి కనిపించని నష్టం చేసింది. ఆయన పోతూపోతూ...  లక్షల సాధారణ ప్రజలలో ప్రభుత్వాల మీద, నాయకుల మీద, పోలీసు-న్యాయ వ్యవస్థ మీద అసహ్యాన్ని, ఏహ్య భావాన్ని ఎన్నో రెట్లు పెంచారు. అందులో కొందరి మీద కాండ్రించి ఉమ్మెయ్యాలన్న కసి పెంచారు.  

5) ఆఖర్లో దారి తప్పినట్లు కనిపించిన వారికన్నా సమున్నత స్థాయిలో సాయిబాబా మేధావులు, విద్యావంతులు, స్పందించే గుణమున్న ఉద్యోగులు, విద్యార్థుల గుండెల్లో కలకాలం నిలిచిపోతారు. 

అబద్ధాలు చెప్పి, డబ్బు పెట్టి, నేరాలకు పాల్పడి అధికారంలోకి వచ్చే నాయకులు మన గొప్ప దేశాన్ని ఎలా దోచుకుంటున్నదీ, వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేస్తున్నదీ పోలీసు శాఖలో అధికారులు, సాధారణ పోలీసులు, అన్ని స్థాయిల్లో న్యాయమూర్తులు గమనిస్తున్నారు. అలాంటి పాలకుల అడుగులకు మడుగులొత్తి దిద్దుకోలేని తప్పు చేయడం కన్నా దేశం కోసం, జనం కోసం పరితపించే నిరసన గళాలకు దన్నుగా ఉండడం మంచిది. తప్పును తప్పు అనకపోవడం వ్యక్తిగత వైఫల్యమని, సాయిబాబా గారి లాంటి  పోరాట యోధులే పాపాత్మపు పాలకులకు నిజమైన విరుగుడని  గుర్తెరగాలి.  

నిజమైన దేశభక్తులు ఎవరో, అసలైన దేశద్రోహులు ఎవరో ఆలోచించడం అందరి కర్తవ్యం కావాలి. 

Sunday, October 13, 2024

ప్రొ. సాయిబాబా అమర్ హై!

విస్తృత అధ్యయనం అవసరం లేకుండానే, లోతైన పరిశీలన చేయకుండానే మనకు ఈ సమాజంలో ఉన్న వైరుధ్యాలు, అసమానతలు, కుళ్ళూ కుతంత్రాలూ 18-20 ఏళ్ల వయస్సునాటికే బాగా అనుభవంలోకి వస్తాయి. వ్యవస్థలో లోపాలు, అధికారంలో ఉన్నవాళ్ళ అకృత్యాలు, డబ్బున్న వాళ్ల పెనుపోకడలు, కాసులు-నోరులేనివాళ్ళకు జరిగే దారుణ అన్యాయాలు అవగతమైనా... జీవితంలో 'సెటిల్' కావాలన్న బలమైన ఒత్తిడి, కోరికలతో ఇవన్నీ మనసుకు పట్టించుకోలేము. ఏదో ఒక ఉద్యోగం దొరగ్గానే అందులో నిలదొక్కుకుని 'ఎలివేషన్' కోసం సమయమంతా వెచ్చిస్తాం. ఈ లోపు పెళ్లీ, పిల్లలూ, చదువులూ, మందులూ, మాకులూ, ఖర్చులూ!

ఈ క్రమంలో- సమాజం గురించి పట్టించుకునే తీరికా, ధ్యాసా ఉండవు. అయినా సరే, విశాల హితం కోసం మనవంతుగా మనమేమైనా చేయాలని అనుకుంటే ముందుగా ఇంట్లో వాళ్ళు, మిత్రులు, ఉద్యోగాల్లో సహచరులు వెనక్కులాగుతారు. అయినా ముందుకువెళదామంటే రాజ్యం లాఠీలు, తుపాకులు పట్టుకుని గుడ్లురిమి భయపెడుతుంది. అప్పుడప్పుడూ చదివిన పుస్తకాలు, ఉద్యమ పాటలు రక్తాన్ని మరిగించి వేడెక్కించగా... అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు...అని ఇంకాస్త ముందుకు వెళ్లి బడుగు, బలహీన, పీడిత, తాడిత ప్రజల కోసం పోరాడదామంటే చెరసాలలు, ఉరికొయ్యలు ఆవురావురుమని ఎదురు చూస్తాయి. అధికారం చెలాయించే వాళ్ళు (కానిస్టేబుల్ నుంచి ప్రధాని వరకూ) ఇలాంటి సమాజ హితైషులను, బాధా సర్ప ద్రష్టులను పరమ భయంకరమైన దుష్టులుగా, చిదిమేయాల్సిన శత్రువులుగా, సమాజానికి పట్టిన చీడగా, పీడగా భావించి కర్కశంగా వ్యవహరిస్తారు. 

ఇంత సంక్లిష్టత మధ్య... ఓర్నాయనో.... ఇదంతా అవసరమా? మనకెందుకొచ్చిన గొడవ... ఊరుకున్నంత ఉత్తమం లేదని అనుకుని గమ్మున తమ పని తాము చేసుకుంటూ భార్యా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ... ఈ ఎం ఐ లు కట్టుకోవడమే జీవిత పరమావధిగా బతికేస్తూ.. సమయం చిక్కితే వ్యవస్థను తిట్టుకుంటూ, ఇది మారదని తీర్మానించుకుంటూ బతుకు బండి వెళ్లదీస్తారు మెజారిటీ ప్రజలు

ఇట్లాంటి సమాజంలో అమలాపురం నుంచి 80 శాతం అంగవైకల్యంతో వచ్చి మంచి విద్యనభ్యసించి పీడిత, తాడిత, ఆదివాసీ ప్రజల కోసం గళం వినిపించి రాజ్య హింస బలవంతంగా తాగించిన గరళానికి బలైన విద్యావేత్త, మేధావి, రచయిత, మానవ హక్కుల ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబా (1967-2024). ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఆంగ్లంలో పోస్టు గ్రాడ్యుయేషన్, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డాక్టోరల్ డిగ్రీ పొంది, అక్కడే విద్యార్థులకు బోధించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో ఆయనపై ప్రభుత్వం కత్తికట్టింది. అమానుషమైన పరిస్థితుల్లో పదేళ్లు దుర్భర జైలు శిక్ష అనుభవించి ఈ మార్చి లోనే విడుదలయిన ప్రొఫెసర్ సాయిబాబా వివిధ రకాల అనారోగ్యాలతో దసరా రోజు నిన్న హైదరాబాద్ లోని నిమ్స్ లో మరణించారన్న వార్త బాధించింది. 

ప్రొ. సాయిబాబా గారి అలుపెరుగని పోరాటాన్ని, జైలు జీవితాన్ని, తనకు వెన్నంటి ఉన్న వారి శ్రీమతి వసంత కుమారి గారి మనో నిబ్బరాన్ని నేను జర్నలిస్టుగా నిశితంగా గమనిస్తూ వస్తున్నాను. ఇలాంటి అమానుష పరిస్థితుల్లో 84 ఏళ్ల వయస్సున్న ఫాదర్ స్టాన్ స్వామి కస్టడీలో 2021 జులై లో మరణించినప్పుడు ఒక వ్యాసం రాశాను. ప్రభుత్వాలు ఇంతలా ఎలా కక్ష గట్టి రాచి రంపాన పెడతాయో, ప్రజాస్వామ్యంలో ఉండే వివిధ సిద్ధాంతాలను, నిరసన గళాల ప్రాధాన్యతను పాలకులు ఎందుకు ఇంత తప్పుగా అర్థం చేసుకుంటున్నారో అర్థంకాదు.    

ప్రొ. సాయిబాబా మరణంతో తెలుగు నేల ఒక పోరాట పటిమ కలిగిన మేధావిని కోల్పోయింది. భార్యా బిడ్డలతో కలిసి పండగ నాటి పులిహోర, పరమాన్నం మెక్కి అయన మరణం వార్తకు 'రిప్' అని 'ఓం శాంతి' అని పెట్టడం చాలా ఈజీ. కానీ, ప్రొ. సాయిబాబా గారు ప్రజా సేవ కోసం ఎంచుకున్న మార్గం అత్యంత కష్టమైనది. ముళ్లబాట మీదనే అయన, వసంత గారు, వారి కుటుంబం పది పన్నెండేళ్లుగా ప్రయాణం చేస్తోంది. వారంతా నరకం చూశారు. సమాజ విశాల హితం కోసం తాను నమ్మిన సిద్ధాంతం కోసం అయన తుది శ్వాస వరకూ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నది సత్యం. ఆయన ధైర్యం ఎందరికో ప్రేరణ ఇస్తుంది. మానవత్వం మరిచి... అవిటి వాడైన మేధావిని హింసించి పైకిపంపిన చచ్చుపుచ్చు వ్యవస్థ ప్రతినిధులు సిగ్గుతో తలవంచుకోవాల్సిన తరుణమిది.

Thursday, October 10, 2024

డబ్బు vs మంచితనం: రతన్ టాటా నేర్పే ఐదు పాఠాలు

 నిన్న (అక్టోబర్ 9, 2024) రాత్రి 86 ఏళ్ల వయస్సులో మరణించిన వ్యాపార దిగ్గజం రతన్ టాటా కు భారీగా నివాళులు, శ్రద్ధాంజలులు, జోహార్లు, అశ్రు తర్పణాలు, వందనాలు, సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అయన మరణంతో దేశ వ్యాప్తంగా విషాదం అలుముకుంది. వ్యాపార, రాజకీయ, సినీ, మీడియా, క్రీడా రంగాల ప్రముఖులవి మాత్రమే కాకుండా సాధారణ ప్రజల హృదయాలు కూడా బరువెక్కాయి. కుటుంబ వ్యాపారాన్ని ఎవ్వరూ ఊహించని విధంగా వివిధ రంగాలకు విస్తరించి వేల కోట్ల రూపాయల సంపద సృష్టించి, లక్షల మందికి భృతి కల్పించిన బ్రహ్మచారి రతన్ జీ మరణంతో దేశం ఒక రత్నాన్ని కోల్పోయింది. విచిత్రం ఏమిటంటే--అత్యంత సంపన్నుడు మరణించాడని కాకుండా, ఒక మనసున్న మంచి మనిషి పోయాడని ప్రజలు బాధపడుతున్నారు. ఇక్కడే మనందరం నేర్చుకోవాలిసినవి ఎన్నో ఉన్నా ఒక ఐదు అద్భుత లక్షణాలు చూద్దాం.


1) మనుషుల పట్ల మర్యాద: నాలుగు డబ్బులు సంపాదించిన వారి మాటల్లో, చేతల్లో ఒంటినిండా పొగరు కనిపిస్తుంది. అందులో కొందరు బలుపు మాటలతో ఇతరులను చిన్నచూపు చూసి కించపరచడం మనం చూస్తుంటాం. జ్ఞానాన్ని బట్టి కాకుండా కేవలం డబ్బును బట్టి గౌరవం ఇవ్వడం మన సమాజంలో బాగా ఎక్కువ. సంపన్న కుటుంబంలో పుట్టినా రతన్ మనుషుల పట్ల ఎంతో మర్యాదతో ఆత్మీయంగా మెలిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అయన నుంచి అందరూ నేర్చుకోవాలి. డాబూ దర్పం, హంగూ ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఆయన గడిపిన జీవితం కూడా మనకు ఆచరణీయం. 


2) నైతిక నాయకత్వం: చిన్న వ్యాపారంలో రాణించినా చాలా మంది కళ్ళు నెత్తికెక్కినట్లు మాట్లాడతారు, మోసం చేయడం వ్యాపార సూత్రంలో భాగంగా మాట్లాడతారు. పరిశ్రమలు, వ్యాపార యజమానులు ధనార్జన యావలో పడి ఎథిక్స్ కు తిలోదకాలు ఇస్తారు. రతన్ గారి చర్యల్లో, చర్చల్లో, నిర్ణయాల్లో నైతికత, పారదర్శకత ఉంటుందని ఆయన ను కలిసిన వారు అబ్బురపడుతూ చెప్పే మాట మనకు ఆదర్శనీయం.


3) ఉద్యోగుల పట్ల కరుణ: మన సమాజంలో 'బాసు' అన్న ప్రతి ఆడా, మగా ఘోరాతి ఘోరంగా ప్రవర్తించడం అనుభవంలో అందరికీ తెలిసిందే. కారుణ్యం, సమభావం వదిలి వదిలిపెట్టి వేధించడం, సాధించడం, పైశాచిక ఆనందం పొందడం ఎక్కువైంది. ఉద్యోగులకు ఫోన్ లో కూడా అందుబాటులో ఉండే సంస్కారం, వారి ఇబ్బందులను మానవత్వంతో పరిష్కరించడం అయన వ్యవస్థీకృతం చేశారు. మన ఇంట్లో పనిచేస్తున్నవారితో పాటు, తోటి ఉద్యోగులను మంచిగా చూసుకోవాలన్నది, ఉద్యోగాలు ఊడపీకడం మీద దృష్టి పెట్టకుండా, ఆదుకుని మంచి పని సంస్కృతిని పెంచి పోషించాలని రతన్ గారి నుంచి నేర్చుకోవాలి.


4) దానగుణం: దాతృత్వంలో రతన్ ఒక అద్భుత అధ్యాయం సృష్టించారు. కోవిడ్ సంక్షోభ సమయంలో రతన్ టాటా గారు వేల కోట్లు విరాళంగా ఇవ్వడమే కాకుండా, మరణాల సంఖ్య తగ్గడానికి ఎంతో సేవ చేశారు. అయన దాన గుణం, మంచితనం వల్ల టాటా సంస్థల ఉద్యోగులతో పాటు ఇతరులూ ఎంతో ఊరట పొందారు. సంపదలో 50 శాతానికి పైగా సమాజానికి ఇవ్వడం వల్ల రతన్ జీ ప్రపంచ కుబేరుల లిస్టులో టాపర్ కాలేకపోయారు. 


5) దేశ నిర్మాణంలో భాగస్వామ్యం: దేశంలో విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధికి రతన్ నేతృత్వంలోని టాటా గ్రూప్ ఎంతో చేసింది.

స్కిల్ డెవలప్ మెంట్ కోసం రతన్ కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీ ఎస్ ఆర్) నిబంధన రాకముందు నుంచే టాటా లు దేశ నిర్మాణం కోసం ముందున్నారు. స్టార్ట్ అప్ ల అభివృద్ధిలో అయన పాత్ర ప్రశంసనీయం. వ్యాపారాలు చేసి సంపాదించడమే కాకుండా తిరిగి ఇస్తూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలన్నది రతన్ జీవిత సందేశం.  


అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం స్థాపించిన వ్యాపారవేత్త కొన్ని తప్పులు చేయడం సహజం. 2010లో నీరా రాడియా,

2012 లో సైరస్ మిస్త్రీ, 2016 లో నస్లీ వాడియా ల ప్రమేయం ఉన్న సంఘటనలు టాటా ప్రతిష్ఠకు కొంత భంగం కలిగించినా రతన్ టాటా అదానీ, అంబానీ ల మాదిరిగా పెద్ద పెద్ద ఆరోపణలకు గురికాలేదన్నది గమనార్హం. వాటి నుంచి ఆయన పాఠాలు నేర్చుకుని మంచి మనిషిగా ప్రజల మదిలో చిరకాలం నిలిచిపోతున్నారు.

ఈ ఐదు కాక, రతన్ జీ నుంచి మీరు నేర్చుకున్న విషయాలు కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి.

Wednesday, October 9, 2024

రాలిపోయిన మా మంచి మేనత్త

తల్లి ప్రేమ గురించి చాలా మంది చాలా రకాలుగా అద్భుతంగా రాశారు కానీ మేనత్త చూపే ప్రేమ గురించి నేను చదవలేదు. తోబుట్టువు సంతానాన్ని తన హక్కుగా, బాధ్యతగా భావించి లాలించి, ప్రేమ పంచే బంధం అది. 

మా నాన్న గారి చెల్లి శకుంతల గారు మా మీద చూపిన ప్రేమ ఎన్నటికీ మరిచిపోలేనిది. ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల గరికపాడు అనే గ్రామంలో ఉన్న అత్తయ్య ఇంటికి వెళ్ళడం ఎండాకాలం సెలవల్లో మస్ట్. వంతెన కట్టకముందు నడుము లోతు నీళ్ళలో ఒక కాల్వను దాటుకుంటూ అక్కడికి వెళ్లి మంచి గ్రామీణ వాతావరణంలో గడపడం రివాజు. ఊళ్ళో వేపచెట్టు కింద నులక మంచం మీద పడుకుని చందమామ, బాలమిత్ర చదవడం... గొడ్డూ గోదలతో సందడిగా ఉండే సువిశాలమైన కొట్టంలో నిలిపి ఉన్న బండి జల్లలో పడుకుని పుస్తకాలు చదవడం... ఉమా వదిన చెప్పే కథలు, సామెతలు వినడం, పొడుపు కథలు విప్పే ప్రయత్నం చేయడం...వాళ్ళ ఇంట్లో పెద్ద గాబు దగ్గర సాయంత్రం అందరం చేరి నీళ్లతో ఆడుతూ స్నానాలు చేయడం...భలే మజాగా ఉండేది. 

 పెదనాన్న గారి పిల్లలం, మేము కలిపి... ఆరుగురం వెళ్లి ఐదారు రోజులు తిష్ఠ వేసినా అత్తయ్య నవ్వుతూ ప్రేమగా వండివార్చేది. ఇష్టమైన పదార్థాలు, ఇంటి నెయ్యి, గడ్డ పెరుగు, చింతకాయ పచ్చడి రుచి ఇప్పటికీ గుర్తే. పక్కనే ఉన్న నెమలిలో మా నాయనమ్మ, బాబాయ్, పిన్ని దగ్గరకు వెళ్లే ముందు మజిలీ గరికపాడు. నాయనమ్మ లాగా తెల్లగా ఉండే మా అత్తయ్య తనకిష్టమైన పాలపిట్ట రంగు చీరలో ఎక్కువగా కనిపించేవారు. ఇద్దరు అన్నయ్యలు (మా పెదనాన్న, నాన్న), ఇద్దరు తమ్ముళ్ళ (బాబాయిలు) మధ్య పెరిగారు ఆమె. తను నీరసంగా, నిస్సత్తువగా ఉన్న సందర్భం నేను చూడలేదు. 
గత నెల చెన్నూరులో భీకర వర్షంలో ఒక సంతాప కార్యక్రమంలో కలిసినప్పుడు...ఎప్పటిలాగానే నేను అత్తయ్య పక్కన కూర్చుని చెయ్యి పట్టుకుని ఆమె క్షేమ సమాచారం అడిగి కాసేపు కబుర్లు చెప్పాను. బాగా మాట్లాడింది. తను ఎక్కువగా పాల్వంచలో మూడో కూతురు దగ్గర ఉంటున్నానని చెప్పింది. 
ఫిబ్రవరి 2022 లో తన మనమరాలి పెళ్లికి వెళ్ళినప్పుడు నాకు సమయం చిక్కి తనను పాల్వంచ నుంచి భద్రాచలం రామాలయానికి తీసుకుపోతున్నప్పుడు కార్లో అత్తయ్య, నేను చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం.  మనుమరాలి పెళ్లి మర్నాడు (ఫిబ్రవరి 12, 2022) హడావుడిలో ఉంటుందనుకుని అనుకున్నా. ' అత్తయ్యా... బయలుదేరు...భద్రాచలం వెళ్దాం,' అన్నా. 
' సరే నాన్నా...కాసేపు ఉండు,' అని చటక్కున బయలుదేరి కారు ఎక్కింది. నాకు ఎంతో ఆనందం అనిపించింది. 
2012 లో బై పాస్ సర్జరీ జరిగిన తర్వాత తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నదీ చెప్పింది. 2018 లో భర్త మరణం, తనకు ఎలాంటి లోటు రాకుండా ఆయన తీసుకున్న జాగ్రత్తలు కూడా చెప్పింది. జీవితం, ఆరోగ్యం, పిల్లలు, ఈతి బాధలు పంచుకున్నాం.
అత్తయ్య కు అద్భుతమైన దర్శనం ఏర్పాటు చేయాలని ఒక ప్రాణ మిత్రుడికి చెబితే తను ప్రత్యేక శ్రద్ధతో ఆ పని చేశాడు. రాముడు మంచి దర్శనం చేయించాడని మా వాళ్లకు చెప్పింది. ఆ రోజు తీసిన ఫోటో Ramesh Babu Kesupaka పంపితే ఇక్కడ పోస్టు చేస్తున్నా.
హాయిగా ఉందనుకున్న అత్తయ్యను మూడు రోజుల కిందట ఖమ్మంలోని ఆసుపత్రిలో చేర్చారంటే నమ్మలేకపోయాను. రెండు రోజుల పాటు ఎంతో కలత చెంది ఏ పనీ చేయలేకపోయాను. అత్తయ్య గురించి ఎన్నో విషయాలు హేమకు చెప్పాను. మనసు దుఃఖ పడింది. మా ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉండాలని ఎన్నో సార్లు నేను కోరాను. కుదరలేదు. 
ఈ (అక్టోబర్ 8, 2024) తెల్లవారుజామున ఫోన్ వచ్చింది అత్తయ్య ఇకలేరని. నా
మనసు రోదించింది. 78 ఏళ్ల వయస్సులో ఎవ్వరితో సేవలు చేయించుకోకుండానే అత్తయ్య రాలిపోయిందన్నది ఒక్కటే ఊరట. తను లేని లోటు తీర్చలేనిది. కొడుకు (మా బావ కృష్ణ), కోడలు (మా సొంత బాబాయి కూతురు కన్య), కూతుళ్ళ సమక్షంలో వారి చేతుల్లోనే తరలిరాని తీరాలకు తరలిపోయింది...మా అత్తయ్య. 
హుటాహుటిన నాన్న, అమ్మ, అన్నయ్య, తమ్ముడు, వదినలతో కలిసి గరికపాడు వచ్చి అంతిమ సంస్కారంలో పాల్గొన్నాను. 
మేము చిన్నప్పుడు నడుముల లోతు నీళ్ళలో దాటిన కాల్వ ఒడ్డునే అత్తయ్య దహనం అయ్యింది. అత్తయ్య కు ఇష్టమైన పాలపిట్ట రంగు చీర కూడా ఆమెతో ఉంచారు. ఆ కాల్వ ఒడ్డున, తెల్లని మనసున్న మా అత్తయ్య, పాలపిట్ట రంగు చీర తో సహా పంచభూతాల్లో కలిసిపోయింది. 
పాడు కాలం...మా గరికపాడు అత్తయ్యను మాకు లేకుండా చేసింది.
 ఓమ్ శాంతి.

Thursday, September 12, 2024

'జర్నలిస్టు'కు ఈ రోజుల్లో నిర్వచనం అయ్యే పనేనా?

'జర్నలిస్టు' అంటే ఎవరో నిర్వచించి చెప్పి ప్రభుత్వానికి సహకరించాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 8, 2024 న హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో కోరడం పెద్ద చర్చకు దారితీసింది. జర్నలిస్టుల 'ఎథికల్ లైన్' ఏమిటో కూడా చెప్పాలని అయన కోరడం విశేషం. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీకి భూమి కేటాయించే ఒక కీలకమైన కార్యక్రమంలో ఆయన లేవనెత్తిన ఈ మిలియన్ డాలర్ ప్రశ్నల మీద వాదోపవాదాలు, సిద్ధాంత రాద్ధాంతాలు జోరుగా జరుగుతున్నాయి. ఇది నిజానికి మంచి పరిణామం. జర్నలిజం, జర్నలిస్టుల పై చర్చకు గొప్ప అవకాశం. 

ఒక్క రేవంత్ రెడ్డి కి మాత్రమే కాదు, అందరు రాజకీయ నాయకులకు, అధికారులకు, న్యాయాధీశులకు, వ్యాపారులకు, చివరకు సొంత స్థలాల్లో కష్టపడి కూడగట్టుకున్న డబ్బుతో ఇళ్ళు కట్టుకుంటున్న మధ్య తరగతి జీవులకు కూడా మున్నెన్నడూ లేనివిధంగా 'జర్నలిజం' సెగ తగులుతోంది. గొట్టం పట్టుకుని ఎవడొస్తాడో, ఏ లోటుపాటు ఎత్తిచూపుతాడో, ఎంత కావాలంటాడో, ప్రశ్నిస్తే 'భావప్రకటన హక్కు'ను హరిస్తున్నారంటూ ఏమి అరిచి గోల చేస్తాడో... అని జనం అల్లల్లాడుతున్న మాట నిజం. అధికారం లోకి వచ్చేదాకా తియ్యగా ఉన్న 'ఆ టూబు, ఈ టూబు' ఇప్పుడు ముఖ్యమంత్రి కి కాలకూట విషంగా అనిపించడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరు మహిళా జర్నలిస్టులు తన సొంత గ్రామానికి వెళ్లి ఒక అననుకూలమైన స్టోరీ చేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఇప్పుడు జర్నలిస్టు పదానికి ఉన్నపళంగా నిర్వచనం అడుగుతున్నట్లు మీడియా లో ఒక వర్గం అనుమానిస్తుండగా, మరో వర్గం అయన అన్నదాంట్లో తప్పేముందని వాదిస్తోంది.  

1902 లో 'కృష్ణా పత్రిక', 1908 లో 'ఆంధ్రపత్రిక' వచ్చినప్పుడు గానీ, 1974 లో 'ఈనాడు' మొదలైనప్పుడు గానీ 'జర్నలిస్టు' ఎవరు? తన అర్హతలు ఏమిటి? తన రూపురేఖా విలాసాలు ఏమిటి? అన్న ప్రశ్నలు ఎవ్వరి మదిలోనూ మెదలలేదు. అరిగిపోయిన చెప్పులేసుకుని, లాల్చీ పైజామా ధరించి, భుజానికి అడ్డంగా గుడ్డ సంచీ తగిలించుకుని సత్యాన్వేషణ కోసం ఎక్కడో తిరిగి దొరికింది తిని రిపోర్ట్ చేసే వాళ్ళను జర్నలిస్టులని అనేవారు. సమాచారం సేకరించి, వార్తలు రాసి ప్రింటింగ్ స్టేషన్స్ కు ఆర్టీసీ బస్సులో కవర్ల ద్వారా పంపడం, అర్జెంట్ వార్త అయితే ట్రంక్ కాల్ చేసి ఆఫీసుకు సమాచారం ఇవ్వడం మీదనే వాళ్ళ దృష్టి ఉండేది. జర్నలిస్టులు లేదా విలేకరులు అనబడే వారంటే సమాజంలో ఎనలేని గౌరవం ఉండేది- వారి వృత్తి నిబద్ధత, చిత్తశుద్ధి, సత్య నిష్ఠ కారణంగా. జిల్లాకు మహా అయితే పది పదిహేను మంది అలాంటి వారు ఉండేవారు. ప్రింటింగ్ కేంద్రాల్లో ఎడిటర్లు, సబ్ ఎడిటర్లు,  బ్యూరో చీఫ్ లు ఉండేవారు. నిజానికి విలేకరులకు ఉండే గౌరవం సబ్ ఎడిటర్లకు అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. రిపోర్టర్ల వార్తలు దిద్ది, మంచి శీర్షిక పెట్టి ఆకర్షణీయంగా ప్రచురించే సబ్బులు అన్ సంగ్ హీరోలు, హీరోయిన్లనేది వేరే విషయం. నిజానికి వాళ్ళూ జర్నలిస్టులే. 

1980 లలో ఐదారు తెలుగు పత్రికలు పోటాపోటీగా తెలుగు ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నప్పుడు  అంతా బాగానే ఉంది. అప్పుడూ రాజకీయ పక్షపాతం అనేది ఉన్నా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవడంలో పత్రికల పాత్ర గొప్పగా ఉండేది. రీచ్, ప్రాఫిట్ అనే వ్యాపార సిద్ధాంతం ఆధారంగా ఒక అద్భుతమైన మార్కెట్ ఫార్ములాతో 1989 లో 'ఈనాడు' జిల్లా అనుబంధాలను ఆరంభించిన తర్వాత కొత్త అధ్యాయం మొదలయ్యింది. అన్ని పత్రికలూ దాన్ని అనుసరించి ఈ ఫార్ములాను వేగంగా అందిపుచ్చుకున్నాయి.  ముందుగా మండలానికో జర్నలిస్టు, ఆనక క్రమంగా గల్లీకో జర్నలిస్టు పుట్టుకొచ్చారు. రాసిన వార్త నిడివిని బట్టి  కొలిచి సెంటీ మీటర్ కు ఇంతని చెల్లించి కంట్రిబ్యూటర్స్/ స్ట్రింగర్స్ పేరుతో అన్ని పత్రికలు ఏర్పరుచుకున్న ఒక మహా వ్యవస్థ ఇప్పుడు జర్నలిజానికి కేంద్రమయ్యింది. మంది ఎక్కువయ్యారు, సహజంగానే మజ్జిగ పల్చనయ్యింది.  ఈ వ్యవస్థ నిరుద్యోగ సమస్యను కొద్దిమేర తీర్చినా సో కాల్డ్ జర్నలిస్టు కు స్వాత్రంత్య్ర కాలం నుంచీ ఉన్న ఎనలేని గౌరవాన్ని బాగా దిగజార్చింది. ఇక్కడ మైలు రాళ్లను గురించి చెప్పుకోవడమే చేయాలి గానీ ఎవ్వరినీ విమర్శించి, తప్పుబట్టి లాభంలేదు. ఇది ఒక పరిణామ క్రమం. 

ప్రభుత్వ యూనివర్సిటీలలో పాశ్చాత్య దేశాల నుంచి స్వీకరించిన జర్నలిజం సిలబస్, శిక్షణ పద్ధతులు ఉన్నా... వాటితో సంబంధం లేకుండా సంస్థాగతంగా జర్నలిజం స్కూల్స్ పెట్టి పత్రికలు పెద్ద సంఖ్యలో ఇన్ హౌస్ జర్నలిస్టులను తయారు చేశాయి. స్టైపెండ్ ఇచ్చి

అవసరం ఉన్న మేర మాత్రమే విద్య నేర్పి వాడుకోవడం ఇప్పటికీ సాగుతోంది. వైద్యుడికి, ఇంజినీర్ కు, లాయర్ కు, లెక్చరర్ కు, ఇతర వృత్తుల వారికి నిర్దిష్ట డిగ్రీ ఉంటేనే ఉద్యోగాలు ఇస్తారు. కానీ జర్నలిజానికి ఆ అవసరం లేదని తెలుగు పత్రికలు నిరూపించాయి. ఆరో తరగతి నుంచి ఆర్డినరీ డిగ్రీ చదువుకున్న వారు కూడా జర్నలిస్టుల కేటగిరీలో చేరి ప్రభుత్వాల అక్రిడిటేషన్ కార్డులు పొందుతున్నారట. వేల సంఖ్యలో గుర్తింపు కార్డులు, సంబంధిత సౌకర్యాలు ఇవ్వడం ఏ ప్రభుత్వానికైనా కష్టమే. 

శాటిలైట్ టెలివిజన్ ఛానెల్స్ వచ్చాక 'జర్నలిస్టుల' సంఖ్య ఇంకా పెద్ద సంఖ్యలో పెరిగింది. 1990 ఆరంభం నుంచి పరిస్థితి మరింత ప్రమాదంగా మారింది. పత్రికల యాజమాన్యాలు, టెలివిజన్ వార్తల రంగంలోకి సహజసిద్ధంగా రావడం మాత్రమే కాకుండా ఇతరేతర వ్యాపారాల్లోకి కూడా దిగడంతో పొలిటీషియన్ కు పని తేలికయ్యింది. పవర్ లో ఉన్నవారికి జై కొట్టక తప్పని పరిస్థితి వచ్చింది. జర్నలిస్టుల వేతనాలు, బతుకుల సంగతి ఎలా ఉన్నా పత్రికాధిపతులు మీడియా సామ్రాజ్యాధిపతులుగా, వ్యాపార వేత్తలుగా మారి సమాజంలో మహా శక్తివంతులుగా పరివర్తన చెందారు. 2019-2020 కాలంలో వచ్చిన కోవిడ్ మహమ్మారి సోషల్ మీడియా సామర్ధ్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పి నెమ్మదిగా  మీడియా మహామహుల గుత్తాధిపత్యాన్ని దారుణంగా గండి కొట్టింది. మోదీ దగ్గరి నుంచి రేవంత్, చంద్రబాబు ల వరకూ ప్రధాన మీడియానో, సోషల్ మీడియానో వాడుకుని విస్తృత ప్రచారం పొందని వారు లేరు. ఇందులో యూ ట్యూబ్ ల పాత్ర, టీవీ చర్చల పాత్ర ఎంతో ఉంది. సోషల్ మీడియా అనేది ఒక పెద్ద ఆదాయ మార్గంగా కూడా కావడంతో ప్రజల నాడి పట్టిన జర్నలిస్టులు కొత్త ఫార్ములాలతో ముందుకొచ్చారు. బూతులు తిట్టడం, జర్నలిజం ఎథిక్స్ పట్టింపు లేకుండా, బాధితుల వెర్షన్ లేకుండా వార్తలు ప్రసారం చేయడం పెరిగింది. లైవ్ చర్చలు పెద్ద తలనొప్పిగా మారాయి. అప్పటిదాకా పత్రికలూ, ఛానెల్స్ లో పనిచేసిన వారితో పాటు పెద్ద సంఖ్యలో ఇంజినీరింగ్ తదితర డిగ్రీలు పొందిన యువకులు జర్నలిజం పాఠాలు చదవకపోయినా, శిక్షణ పొందకపోయినా మాటకారితనంతో  ఛానెల్స్ పెట్టి రాణిస్తున్నారు. వారికి వస్తున్న ప్రజాదరణ భారీగానే ఉంది. ప్రజలకు ఏ వార్తలు, మసాలా ఇస్తే ఎక్కువ వ్యూవర్ షిప్ వస్తుందో అది నైతికత, సమాజ శ్రేయస్సు సంబంధం లేకుండా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని కుదుపుతున్న కృత్రిమ మేథ అసలే సంక్లిష్టంగా ఉన్న పరిస్థితిని మరింత జటిలం చేసిందనే అనుకోవాలి. 

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వార్తా సంస్థ 'రాయిటర్స్' నిర్వచనం ప్రకారం- ఎవరైతే సమాచారాన్ని సేకరించి (Gathering), సత్యాన్ని బేరీజు (Assessing) వేసి, ఖచ్చితత్వం (Accuracy), న్యాయం (Fairness), స్వతంత్రత (Independent) లకు కట్టుబడి వార్తల రూపంలో  ప్రజలకు అందిస్తారో వారు జర్నలిస్టులు. నిష్పాక్షికంగా, సమాచారాన్ని బాగా వెరిఫై చేసి, పక్షపాతాలకు, బైటి ప్రలోభాలకు, విరుద్ధ ప్రయోజనాలకు తావులేకుండా సత్యనిష్ఠ తో వాస్తవాలను నివేదించేది జర్నలిస్టు పాత్ర అని కూడా ఆ సంస్థ చెప్పింది. ప్రధాన మీడియా స్రవంతి లో ఏళ్ల తరబడి పనిచేస్తూ తామే నికార్సైన జర్నలిస్టులమని చెప్పుకునే వారైనా ఈ నిర్వచనం దరిదాపులకు వస్తారా? అంటే సందేహమే. దాదాపు అన్ని  యాజమాన్యాలు పొలిటికల్ జెండాలు మోస్తూ విలువల వలువలు ఎప్పుడో విప్పి పారేస్తే... ఇంకెక్కడి సత్యనిష్ఠ?

పత్రికల్లో, టీవీ ఛానెల్స్ లో పనిచేసి అక్కడ సత్యనిష్ఠ, స్వంత్రత, న్యాయం మీడియా-పొలిటికల్-బిజినెస్-లంపెన్ చతుష్టయం గంగపాల్జేసిన వైనాన్ని మౌనంగా భరించి బైటికి వచ్చిన జర్నలిస్టులకు యూ ట్యూబ్ పెద్ద వరమయ్యిందనడంలో సందేహం లేదు. ఇప్పటికీ చాలా మంది మాజీ మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు నిష్పాక్షిక దృక్కోణంతో ప్రజలకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. పొలిటీషియన్స్ కలుషితం చేయకపోతే వీరిలో చాలా మంది  తమ పని తాముచేసుకునేవారు.  ఫేస్ బుక్, యూ ట్యూబ్, ట్విట్టర్ వగైరా సోషల్ మీడియా వేదికలు కలుషితం కావడానికి బాధ్యులు జర్నలిస్టులు మాత్రమే అంటే అది తప్పు. దానికి బాధ్యత వహించాల్సింది ఇప్పటికే ఓట్లతో నోట్లను కొని, జనాలను కరప్ట్ చేసి ప్రజాభిప్రాయాన్ని కూడా తాజా సాంకేతిక పరిజ్ఞానంతో తుత్తినియలు చేస్తున్న రాజకీయపార్టీలదీ, నాయకులది. ఈ పాపం నుంచి ఏ ఒక్క ప్రధాన పార్టీకీ మినహాయింపు లేదు. అన్ని పార్టీలు సోషల్ మీడియా సైన్యాలను ఏర్పరుచుకుని ప్రత్యర్థులపై బురదజల్లుతూ, సత్యాన్ని పాతర వేస్తున్నారు. ఈ క్రమంలో స్వీయ నియంత్రణ అనేది అసంభవమైన పని అయి కూర్చుంది. నికార్సయిన జర్నలిస్టులు ఉక్కిరి బిక్కిరయ్యే దుస్థితి ఏర్పడింది. ఇది పట్టించుకోకుండా అందరినీ ఒకే గాటన కట్టి విమర్శించడం పాలకులకు సులువయ్యింది. 

ఈ పరిస్థితుల్లో నిజంగా చిత్తశుద్ధి ఉంటే, జర్నలిజం బోధన, పరిశోధన రంగాల్లో పనిచేసిన మేధావులు, ప్రొఫెసర్లతో రాజకీయాలకు అతీతంగా ఒక నిష్పాక్షిక కమిటీ వేసి జర్నలిస్టు కు రేవంత్ రెడ్డి గారు నిర్వచనాన్ని రాబట్టవచ్చు. ప్రశ్నించే గొంతులను తొక్కెయ్యాలనుకునే దుష్ట తలంపును మెదడులో నిక్షిప్తం చేసే అధికార కిక్కు కు లోబడకుండా అయన వ్యవహరిస్తే ఒక పక్కన  జర్నలిస్టు కు నిర్వచనం రాబడుతూనే, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఊరట కలిగించిన వారవుతారు. జర్నలిస్టిక్ ఎథిక్స్ గురించి జర్నలిస్టులతోనే  మనసు విప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ దిశగా రాజకీయాలకు అతీతంగా ప్రయత్నాలు మొదలుపెట్టి ఫలితం సాధిస్తే చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.