Tuesday, October 15, 2024

ప్రొ. సాయిబాబా నిరూపించిన సత్యాలు!

నక్సల్ ఉద్యమంలో సుదీర్ఘకాలం పాటు పనిచేసి 2007 జూన్ లో లొంగిపోయిన కోనపురి రాములు ఇంట్లో మాజీ నక్సల్, పోలీసుల దన్నుతో బీభత్సం సృష్టించిన నయీముద్దీన్ రెండు పెద్ద నాగుపాములను వదిలాడు ఒక సారి. నల్గొండ జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం లో రాములు వాళ్ళ పూరింటి మధ్యలో ఆ పాములు పడగ విప్పి బుస కొట్టడం చూస్తే ఎవరికైనా గుండెలదురుతాయి. 

లొంగిపోయిన రాములును తన దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో నయీమ్ తన స్టైల్ లో ఈ పని చేశాడు. రాములు లొంగుబాటుకు ముందు 'ది హిందూ' జర్నలిస్టుగా, నల్గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న నాకు ఫోన్ చేసి ఏమి మాట్లాడిందీ, నేను ఒక బాధ్యత గల పౌరుడిగా రాగద్వేషాలకు అతీతంగా ఏమి సలహా ఇచ్చిందీ  ఇక్కడ అప్రస్తుతం. జర్నలిస్టులు ఇజాల చట్రంలో ఇరుక్కోకుండా వంద శాతం నిష్పాక్షికంగా మానవత్వంతో మాత్రమే వ్యవహరించాలన్న నా సిద్ధాంతం, ఆ క్రమంలో  ఎదురయ్యే నానా ఇబ్బందులు,  అన్ని పక్షాల అపార్ధాలకు గురికావడం గురించి తర్వాత చెప్పుకుందాం. ఈ పోస్టు విషయం--57 ఏళ్ల వయస్సులో వ్యవస్థ కసాయితనానికి బలై మరణించిన సాయిబాబా గారి ఉదంతం నేర్పే పాఠాలు. 


90 శాతం అంగవైకల్యంతో, వీల్ ఛైర్ లో మాత్రమే తిరగగలిగే ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీ ఎన్ సాయిబాబా ను పదేళ్ల పాటు అమానుష పరిస్థితుల మధ్య జైల్లో నిర్బంధించడం వెనుక ప్రభుత్వానికున్న ఆలోచన, ఆ నయీమ్ ఆలోచనా ఒక్కటే! భయపెట్టడం. నరాలు పగిలే అనిశ్చితి సృష్టించడం. ప్రాథమిక టార్గెట్ (నయీమ్ కు రాములు, సర్కారుకు సాయిబాబా) ను భయభ్రాంతులకు  గురిచేస్తూనే ఇతరులకు గట్టి సందేశం ఇవ్వడం. ఇంతకన్నా పిచ్చి ఆలోచన ఇంకోటి ఉండదని ఎప్పుడూ నిరూపితమవుతూనే ఉంది. ప్రొ. సాయిబాబా ఉదంతం నేర్పే ఐదు ముఖ్యమైన పాఠాలు ఇవీ. 

1) పీడిత తాడిత ప్రజల కోసం కష్ట నష్టాలోర్చే, జీవితాలు తృణప్రాయంగా త్యాగం చేసే మొండి మనుషులు ఈ సమాజంలో ఉన్నారు/ ఎప్పటికీ ఉంటారు.  

2) ఇలాంటి గట్టి సైద్ధాంతిక నిబద్ధత కలిగిన వారిపై అధికారంలో ఉన్న వారు కక్షగట్టి హింసించగలరు కానీ వారు ఎంచుకున్న మార్గం నుంచి కోబ్రాలు, అండా సెల్ ల ద్వారా తప్పించగలగడం దుర్లభం. 

3) ఇలాంటి నిరసన గళాల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ, బీ ఆర్ ఎస్, టీ డీ పీ, జనసేన) ఒకే రకంగా వ్యవహరిస్తాయి. మొహబ్బత్ కా దుకాణ్ కావాలనుకున్న రాహుల్ గాంధీ గానీ, అంతేవాసి రేవంత్ గానీ కాంగ్రెస్ పక్షాన తెలుగు మేధావి కి అనుకూలంగా మాట్లాడారా? పోనీ, వీరవిప్లవ యోధుడు చేగువరా బ్రాండ్ అంబాసిడర్ గా హడావుడి చేసిన వారు పీకింది ఏమైనా ఉందా? అది పవర్ మహిమ.  

4) సాయిబాబా గారిపై అంతలా కక్షగట్టి, హింసించి రాజ్యం వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడింది. ఆ తప్పు ప్రజాస్వామ్యం మీద చులకనభావాన్ని మరింత పెంచి కనిపించని నష్టం చేసింది. ఆయన పోతూపోతూ...  లక్షల సాధారణ ప్రజలలో ప్రభుత్వాల మీద, నాయకుల మీద, పోలీసు-న్యాయ వ్యవస్థ మీద అసహ్యాన్ని, ఏహ్య భావాన్ని ఎన్నో రెట్లు పెంచారు. అందులో కొందరి మీద కాండ్రించి ఉమ్మెయ్యాలన్న కసి పెంచారు.  

5) ఆఖర్లో దారి తప్పినట్లు కనిపించిన వారికన్నా సమున్నత స్థాయిలో సాయిబాబా మేధావులు, విద్యావంతులు, స్పందించే గుణమున్న ఉద్యోగులు, విద్యార్థుల గుండెల్లో కలకాలం నిలిచిపోతారు. 

అబద్ధాలు చెప్పి, డబ్బు పెట్టి, నేరాలకు పాల్పడి అధికారంలోకి వచ్చే నాయకులు మన గొప్ప దేశాన్ని ఎలా దోచుకుంటున్నదీ, వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేస్తున్నదీ పోలీసు శాఖలో అధికారులు, సాధారణ పోలీసులు, అన్ని స్థాయిల్లో న్యాయమూర్తులు గమనిస్తున్నారు. అలాంటి పాలకుల అడుగులకు మడుగులొత్తి దిద్దుకోలేని తప్పు చేయడం కన్నా దేశం కోసం, జనం కోసం పరితపించే నిరసన గళాలకు దన్నుగా ఉండడం మంచిది. తప్పును తప్పు అనకపోవడం వ్యక్తిగత వైఫల్యమని, సాయిబాబా గారి లాంటి  పోరాట యోధులే పాపాత్మపు పాలకులకు నిజమైన విరుగుడని  గుర్తెరగాలి.  

నిజమైన దేశభక్తులు ఎవరో, అసలైన దేశద్రోహులు ఎవరో ఆలోచించడం అందరి కర్తవ్యం కావాలి. 

Sunday, October 13, 2024

ప్రొ. సాయిబాబా అమర్ హై!

విస్తృత అధ్యయనం అవసరం లేకుండానే, లోతైన పరిశీలన చేయకుండానే మనకు ఈ సమాజంలో ఉన్న వైరుధ్యాలు, అసమానతలు, కుళ్ళూ కుతంత్రాలూ 18-20 ఏళ్ల వయస్సునాటికే బాగా అనుభవంలోకి వస్తాయి. వ్యవస్థలో లోపాలు, అధికారంలో ఉన్నవాళ్ళ అకృత్యాలు, డబ్బున్న వాళ్ల పెనుపోకడలు, కాసులు-నోరులేనివాళ్ళకు జరిగే దారుణ అన్యాయాలు అవగతమైనా... జీవితంలో 'సెటిల్' కావాలన్న బలమైన ఒత్తిడి, కోరికలతో ఇవన్నీ మనసుకు పట్టించుకోలేము. ఏదో ఒక ఉద్యోగం దొరగ్గానే అందులో నిలదొక్కుకుని 'ఎలివేషన్' కోసం సమయమంతా వెచ్చిస్తాం. ఈ లోపు పెళ్లీ, పిల్లలూ, చదువులూ, మందులూ, మాకులూ, ఖర్చులూ!

ఈ క్రమంలో- సమాజం గురించి పట్టించుకునే తీరికా, ధ్యాసా ఉండవు. అయినా సరే, విశాల హితం కోసం మనవంతుగా మనమేమైనా చేయాలని అనుకుంటే ముందుగా ఇంట్లో వాళ్ళు, మిత్రులు, ఉద్యోగాల్లో సహచరులు వెనక్కులాగుతారు. అయినా ముందుకువెళదామంటే రాజ్యం లాఠీలు, తుపాకులు పట్టుకుని గుడ్లురిమి భయపెడుతుంది. అప్పుడప్పుడూ చదివిన పుస్తకాలు, ఉద్యమ పాటలు రక్తాన్ని మరిగించి వేడెక్కించగా... అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు...అని ఇంకాస్త ముందుకు వెళ్లి బడుగు, బలహీన, పీడిత, తాడిత ప్రజల కోసం పోరాడదామంటే చెరసాలలు, ఉరికొయ్యలు ఆవురావురుమని ఎదురు చూస్తాయి. అధికారం చెలాయించే వాళ్ళు (కానిస్టేబుల్ నుంచి ప్రధాని వరకూ) ఇలాంటి సమాజ హితైషులను, బాధా సర్ప ద్రష్టులను పరమ భయంకరమైన దుష్టులుగా, చిదిమేయాల్సిన శత్రువులుగా, సమాజానికి పట్టిన చీడగా, పీడగా భావించి కర్కశంగా వ్యవహరిస్తారు. 

ఇంత సంక్లిష్టత మధ్య... ఓర్నాయనో.... ఇదంతా అవసరమా? మనకెందుకొచ్చిన గొడవ... ఊరుకున్నంత ఉత్తమం లేదని అనుకుని గమ్మున తమ పని తాము చేసుకుంటూ భార్యా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ... ఈ ఎం ఐ లు కట్టుకోవడమే జీవిత పరమావధిగా బతికేస్తూ.. సమయం చిక్కితే వ్యవస్థను తిట్టుకుంటూ, ఇది మారదని తీర్మానించుకుంటూ బతుకు బండి వెళ్లదీస్తారు మెజారిటీ ప్రజలు

ఇట్లాంటి సమాజంలో అమలాపురం నుంచి 80 శాతం అంగవైకల్యంతో వచ్చి మంచి విద్యనభ్యసించి పీడిత, తాడిత, ఆదివాసీ ప్రజల కోసం గళం వినిపించి రాజ్య హింస బలవంతంగా తాగించిన గరళానికి బలైన విద్యావేత్త, మేధావి, రచయిత, మానవ హక్కుల ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబా (1967-2024). ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఆంగ్లంలో పోస్టు గ్రాడ్యుయేషన్, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డాక్టోరల్ డిగ్రీ పొంది, అక్కడే విద్యార్థులకు బోధించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో ఆయనపై ప్రభుత్వం కత్తికట్టింది. అమానుషమైన పరిస్థితుల్లో పదేళ్లు దుర్భర జైలు శిక్ష అనుభవించి ఈ మార్చి లోనే విడుదలయిన ప్రొఫెసర్ సాయిబాబా వివిధ రకాల అనారోగ్యాలతో దసరా రోజు నిన్న హైదరాబాద్ లోని నిమ్స్ లో మరణించారన్న వార్త బాధించింది. 

ప్రొ. సాయిబాబా గారి అలుపెరుగని పోరాటాన్ని, జైలు జీవితాన్ని, తనకు వెన్నంటి ఉన్న వారి శ్రీమతి వసంత కుమారి గారి మనో నిబ్బరాన్ని నేను జర్నలిస్టుగా నిశితంగా గమనిస్తూ వస్తున్నాను. ఇలాంటి అమానుష పరిస్థితుల్లో 84 ఏళ్ల వయస్సున్న ఫాదర్ స్టాన్ స్వామి కస్టడీలో 2021 జులై లో మరణించినప్పుడు ఒక వ్యాసం రాశాను. ప్రభుత్వాలు ఇంతలా ఎలా కక్ష గట్టి రాచి రంపాన పెడతాయో, ప్రజాస్వామ్యంలో ఉండే వివిధ సిద్ధాంతాలను, నిరసన గళాల ప్రాధాన్యతను పాలకులు ఎందుకు ఇంత తప్పుగా అర్థం చేసుకుంటున్నారో అర్థంకాదు.    

ప్రొ. సాయిబాబా మరణంతో తెలుగు నేల ఒక పోరాట పటిమ కలిగిన మేధావిని కోల్పోయింది. భార్యా బిడ్డలతో కలిసి పండగ నాటి పులిహోర, పరమాన్నం మెక్కి అయన మరణం వార్తకు 'రిప్' అని 'ఓం శాంతి' అని పెట్టడం చాలా ఈజీ. కానీ, ప్రొ. సాయిబాబా గారు ప్రజా సేవ కోసం ఎంచుకున్న మార్గం అత్యంత కష్టమైనది. ముళ్లబాట మీదనే అయన, వసంత గారు, వారి కుటుంబం పది పన్నెండేళ్లుగా ప్రయాణం చేస్తోంది. వారంతా నరకం చూశారు. సమాజ విశాల హితం కోసం తాను నమ్మిన సిద్ధాంతం కోసం అయన తుది శ్వాస వరకూ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నది సత్యం. ఆయన ధైర్యం ఎందరికో ప్రేరణ ఇస్తుంది. మానవత్వం మరిచి... అవిటి వాడైన మేధావిని హింసించి పైకిపంపిన చచ్చుపుచ్చు వ్యవస్థ ప్రతినిధులు సిగ్గుతో తలవంచుకోవాల్సిన తరుణమిది.

Thursday, October 10, 2024

డబ్బు vs మంచితనం: రతన్ టాటా నేర్పే ఐదు పాఠాలు

 నిన్న (అక్టోబర్ 9, 2024) రాత్రి 86 ఏళ్ల వయస్సులో మరణించిన వ్యాపార దిగ్గజం రతన్ టాటా కు భారీగా నివాళులు, శ్రద్ధాంజలులు, జోహార్లు, అశ్రు తర్పణాలు, వందనాలు, సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అయన మరణంతో దేశ వ్యాప్తంగా విషాదం అలుముకుంది. వ్యాపార, రాజకీయ, సినీ, మీడియా, క్రీడా రంగాల ప్రముఖులవి మాత్రమే కాకుండా సాధారణ ప్రజల హృదయాలు కూడా బరువెక్కాయి. కుటుంబ వ్యాపారాన్ని ఎవ్వరూ ఊహించని విధంగా వివిధ రంగాలకు విస్తరించి వేల కోట్ల రూపాయల సంపద సృష్టించి, లక్షల మందికి భృతి కల్పించిన బ్రహ్మచారి రతన్ జీ మరణంతో దేశం ఒక రత్నాన్ని కోల్పోయింది. విచిత్రం ఏమిటంటే--అత్యంత సంపన్నుడు మరణించాడని కాకుండా, ఒక మనసున్న మంచి మనిషి పోయాడని ప్రజలు బాధపడుతున్నారు. ఇక్కడే మనందరం నేర్చుకోవాలిసినవి ఎన్నో ఉన్నా ఒక ఐదు అద్భుత లక్షణాలు చూద్దాం.


1) మనుషుల పట్ల మర్యాద: నాలుగు డబ్బులు సంపాదించిన వారి మాటల్లో, చేతల్లో ఒంటినిండా పొగరు కనిపిస్తుంది. అందులో కొందరు బలుపు మాటలతో ఇతరులను చిన్నచూపు చూసి కించపరచడం మనం చూస్తుంటాం. జ్ఞానాన్ని బట్టి కాకుండా కేవలం డబ్బును బట్టి గౌరవం ఇవ్వడం మన సమాజంలో బాగా ఎక్కువ. సంపన్న కుటుంబంలో పుట్టినా రతన్ మనుషుల పట్ల ఎంతో మర్యాదతో ఆత్మీయంగా మెలిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అయన నుంచి అందరూ నేర్చుకోవాలి. డాబూ దర్పం, హంగూ ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఆయన గడిపిన జీవితం కూడా మనకు ఆచరణీయం. 


2) నైతిక నాయకత్వం: చిన్న వ్యాపారంలో రాణించినా చాలా మంది కళ్ళు నెత్తికెక్కినట్లు మాట్లాడతారు, మోసం చేయడం వ్యాపార సూత్రంలో భాగంగా మాట్లాడతారు. పరిశ్రమలు, వ్యాపార యజమానులు ధనార్జన యావలో పడి ఎథిక్స్ కు తిలోదకాలు ఇస్తారు. రతన్ గారి చర్యల్లో, చర్చల్లో, నిర్ణయాల్లో నైతికత, పారదర్శకత ఉంటుందని ఆయన ను కలిసిన వారు అబ్బురపడుతూ చెప్పే మాట మనకు ఆదర్శనీయం.


3) ఉద్యోగుల పట్ల కరుణ: మన సమాజంలో 'బాసు' అన్న ప్రతి ఆడా, మగా ఘోరాతి ఘోరంగా ప్రవర్తించడం అనుభవంలో అందరికీ తెలిసిందే. కారుణ్యం, సమభావం వదిలి వదిలిపెట్టి వేధించడం, సాధించడం, పైశాచిక ఆనందం పొందడం ఎక్కువైంది. ఉద్యోగులకు ఫోన్ లో కూడా అందుబాటులో ఉండే సంస్కారం, వారి ఇబ్బందులను మానవత్వంతో పరిష్కరించడం అయన వ్యవస్థీకృతం చేశారు. మన ఇంట్లో పనిచేస్తున్నవారితో పాటు, తోటి ఉద్యోగులను మంచిగా చూసుకోవాలన్నది, ఉద్యోగాలు ఊడపీకడం మీద దృష్టి పెట్టకుండా, ఆదుకుని మంచి పని సంస్కృతిని పెంచి పోషించాలని రతన్ గారి నుంచి నేర్చుకోవాలి.


4) దానగుణం: దాతృత్వంలో రతన్ ఒక అద్భుత అధ్యాయం సృష్టించారు. కోవిడ్ సంక్షోభ సమయంలో రతన్ టాటా గారు వేల కోట్లు విరాళంగా ఇవ్వడమే కాకుండా, మరణాల సంఖ్య తగ్గడానికి ఎంతో సేవ చేశారు. అయన దాన గుణం, మంచితనం వల్ల టాటా సంస్థల ఉద్యోగులతో పాటు ఇతరులూ ఎంతో ఊరట పొందారు. సంపదలో 50 శాతానికి పైగా సమాజానికి ఇవ్వడం వల్ల రతన్ జీ ప్రపంచ కుబేరుల లిస్టులో టాపర్ కాలేకపోయారు. 


5) దేశ నిర్మాణంలో భాగస్వామ్యం: దేశంలో విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధికి రతన్ నేతృత్వంలోని టాటా గ్రూప్ ఎంతో చేసింది.

స్కిల్ డెవలప్ మెంట్ కోసం రతన్ కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీ ఎస్ ఆర్) నిబంధన రాకముందు నుంచే టాటా లు దేశ నిర్మాణం కోసం ముందున్నారు. స్టార్ట్ అప్ ల అభివృద్ధిలో అయన పాత్ర ప్రశంసనీయం. వ్యాపారాలు చేసి సంపాదించడమే కాకుండా తిరిగి ఇస్తూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలన్నది రతన్ జీవిత సందేశం.  


అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం స్థాపించిన వ్యాపారవేత్త కొన్ని తప్పులు చేయడం సహజం. 2010లో నీరా రాడియా,

2012 లో సైరస్ మిస్త్రీ, 2016 లో నస్లీ వాడియా ల ప్రమేయం ఉన్న సంఘటనలు టాటా ప్రతిష్ఠకు కొంత భంగం కలిగించినా రతన్ టాటా అదానీ, అంబానీ ల మాదిరిగా పెద్ద పెద్ద ఆరోపణలకు గురికాలేదన్నది గమనార్హం. వాటి నుంచి ఆయన పాఠాలు నేర్చుకుని మంచి మనిషిగా ప్రజల మదిలో చిరకాలం నిలిచిపోతున్నారు.

ఈ ఐదు కాక, రతన్ జీ నుంచి మీరు నేర్చుకున్న విషయాలు కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి.

Wednesday, October 9, 2024

రాలిపోయిన మా మంచి మేనత్త

తల్లి ప్రేమ గురించి చాలా మంది చాలా రకాలుగా అద్భుతంగా రాశారు కానీ మేనత్త చూపే ప్రేమ గురించి నేను చదవలేదు. తోబుట్టువు సంతానాన్ని తన హక్కుగా, బాధ్యతగా భావించి లాలించి, ప్రేమ పంచే బంధం అది. 

మా నాన్న గారి చెల్లి శకుంతల గారు మా మీద చూపిన ప్రేమ ఎన్నటికీ మరిచిపోలేనిది. ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల గరికపాడు అనే గ్రామంలో ఉన్న అత్తయ్య ఇంటికి వెళ్ళడం ఎండాకాలం సెలవల్లో మస్ట్. వంతెన కట్టకముందు నడుము లోతు నీళ్ళలో ఒక కాల్వను దాటుకుంటూ అక్కడికి వెళ్లి మంచి గ్రామీణ వాతావరణంలో గడపడం రివాజు. ఊళ్ళో వేపచెట్టు కింద నులక మంచం మీద పడుకుని చందమామ, బాలమిత్ర చదవడం... గొడ్డూ గోదలతో సందడిగా ఉండే సువిశాలమైన కొట్టంలో నిలిపి ఉన్న బండి జల్లలో పడుకుని పుస్తకాలు చదవడం... ఉమా వదిన చెప్పే కథలు, సామెతలు వినడం, పొడుపు కథలు విప్పే ప్రయత్నం చేయడం...వాళ్ళ ఇంట్లో పెద్ద గాబు దగ్గర సాయంత్రం అందరం చేరి నీళ్లతో ఆడుతూ స్నానాలు చేయడం...భలే మజాగా ఉండేది. 

 పెదనాన్న గారి పిల్లలం, మేము కలిపి... ఆరుగురం వెళ్లి ఐదారు రోజులు తిష్ఠ వేసినా అత్తయ్య నవ్వుతూ ప్రేమగా వండివార్చేది. ఇష్టమైన పదార్థాలు, ఇంటి నెయ్యి, గడ్డ పెరుగు, చింతకాయ పచ్చడి రుచి ఇప్పటికీ గుర్తే. పక్కనే ఉన్న నెమలిలో మా నాయనమ్మ, బాబాయ్, పిన్ని దగ్గరకు వెళ్లే ముందు మజిలీ గరికపాడు. నాయనమ్మ లాగా తెల్లగా ఉండే మా అత్తయ్య తనకిష్టమైన పాలపిట్ట రంగు చీరలో ఎక్కువగా కనిపించేవారు. ఇద్దరు అన్నయ్యలు (మా పెదనాన్న, నాన్న), ఇద్దరు తమ్ముళ్ళ (బాబాయిలు) మధ్య పెరిగారు ఆమె. తను నీరసంగా, నిస్సత్తువగా ఉన్న సందర్భం నేను చూడలేదు. 
గత నెల చెన్నూరులో భీకర వర్షంలో ఒక సంతాప కార్యక్రమంలో కలిసినప్పుడు...ఎప్పటిలాగానే నేను అత్తయ్య పక్కన కూర్చుని చెయ్యి పట్టుకుని ఆమె క్షేమ సమాచారం అడిగి కాసేపు కబుర్లు చెప్పాను. బాగా మాట్లాడింది. తను ఎక్కువగా పాల్వంచలో మూడో కూతురు దగ్గర ఉంటున్నానని చెప్పింది. 
ఫిబ్రవరి 2022 లో తన మనమరాలి పెళ్లికి వెళ్ళినప్పుడు నాకు సమయం చిక్కి తనను పాల్వంచ నుంచి భద్రాచలం రామాలయానికి తీసుకుపోతున్నప్పుడు కార్లో అత్తయ్య, నేను చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం.  మనుమరాలి పెళ్లి మర్నాడు (ఫిబ్రవరి 12, 2022) హడావుడిలో ఉంటుందనుకుని అనుకున్నా. ' అత్తయ్యా... బయలుదేరు...భద్రాచలం వెళ్దాం,' అన్నా. 
' సరే నాన్నా...కాసేపు ఉండు,' అని చటక్కున బయలుదేరి కారు ఎక్కింది. నాకు ఎంతో ఆనందం అనిపించింది. 
2012 లో బై పాస్ సర్జరీ జరిగిన తర్వాత తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నదీ చెప్పింది. 2018 లో భర్త మరణం, తనకు ఎలాంటి లోటు రాకుండా ఆయన తీసుకున్న జాగ్రత్తలు కూడా చెప్పింది. జీవితం, ఆరోగ్యం, పిల్లలు, ఈతి బాధలు పంచుకున్నాం.
అత్తయ్య కు అద్భుతమైన దర్శనం ఏర్పాటు చేయాలని ఒక ప్రాణ మిత్రుడికి చెబితే తను ప్రత్యేక శ్రద్ధతో ఆ పని చేశాడు. రాముడు మంచి దర్శనం చేయించాడని మా వాళ్లకు చెప్పింది. ఆ రోజు తీసిన ఫోటో Ramesh Babu Kesupaka పంపితే ఇక్కడ పోస్టు చేస్తున్నా.
హాయిగా ఉందనుకున్న అత్తయ్యను మూడు రోజుల కిందట ఖమ్మంలోని ఆసుపత్రిలో చేర్చారంటే నమ్మలేకపోయాను. రెండు రోజుల పాటు ఎంతో కలత చెంది ఏ పనీ చేయలేకపోయాను. అత్తయ్య గురించి ఎన్నో విషయాలు హేమకు చెప్పాను. మనసు దుఃఖ పడింది. మా ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉండాలని ఎన్నో సార్లు నేను కోరాను. కుదరలేదు. 
ఈ (అక్టోబర్ 8, 2024) తెల్లవారుజామున ఫోన్ వచ్చింది అత్తయ్య ఇకలేరని. నా
మనసు రోదించింది. 78 ఏళ్ల వయస్సులో ఎవ్వరితో సేవలు చేయించుకోకుండానే అత్తయ్య రాలిపోయిందన్నది ఒక్కటే ఊరట. తను లేని లోటు తీర్చలేనిది. కొడుకు (మా బావ కృష్ణ), కోడలు (మా సొంత బాబాయి కూతురు కన్య), కూతుళ్ళ సమక్షంలో వారి చేతుల్లోనే తరలిరాని తీరాలకు తరలిపోయింది...మా అత్తయ్య. 
హుటాహుటిన నాన్న, అమ్మ, అన్నయ్య, తమ్ముడు, వదినలతో కలిసి గరికపాడు వచ్చి అంతిమ సంస్కారంలో పాల్గొన్నాను. 
మేము చిన్నప్పుడు నడుముల లోతు నీళ్ళలో దాటిన కాల్వ ఒడ్డునే అత్తయ్య దహనం అయ్యింది. అత్తయ్య కు ఇష్టమైన పాలపిట్ట రంగు చీర కూడా ఆమెతో ఉంచారు. ఆ కాల్వ ఒడ్డున, తెల్లని మనసున్న మా అత్తయ్య, పాలపిట్ట రంగు చీర తో సహా పంచభూతాల్లో కలిసిపోయింది. 
పాడు కాలం...మా గరికపాడు అత్తయ్యను మాకు లేకుండా చేసింది.
 ఓమ్ శాంతి.