Saturday, February 28, 2026

యూ ట్యూబర్స్... వారి హెడ్డేక్!

రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి రెండున్నరేళ్లు అవుతున్నా... తేల్చలేక ఇబ్బందిపడుతున్న అంశాల్లో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ఒకటి. భారీ ప్రయోజనాలు లేకపోయినా ఈ కార్డు ఉండడం గౌరవంగా భావిస్తారు... వృత్తిని నమ్ముకున్న జర్నలిస్టులు. వృత్తిని అమ్ముకునే కొందరు బేహారులు కార్డులకు వెలకట్టి అచ్చోసిన జర్నలిస్టులను తయారుచేసి మీడియా గౌరవాన్ని మంటగలుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం లోని సమాచార, పౌర సంబంధాల (I and PR) శాఖ కు గతంలో ఇది పెద్ద సమస్యాత్మక అంశం కాదు. టెక్నాలజీ పెరిగి, యూ ట్యూబ్ ఛానెల్స్ పెరిగాక తామూ జర్నలిస్టులమని బల్లగుద్ది చెప్పే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అందుకే తాజాగా... మరో రెండు నెలలు పాత కార్డులనే పొడిగించారు.

ఇది జర్నలిస్టుల తప్పు కాదు. రాజకీయ మహానుభావుల పాపం ఈ గందరగోళంలో ఎంతో ఉంది. ఖర్చు పెరిగి, ఆదాయ మార్గాలు లేక దెబ్బతిన్న ఛానెల్స్ లో పనిచేస్తున్న మాటకారులను చేరదీసి ఫండింగ్ చేసి కుప్పలుతెప్పలుగా యూ ట్యూబ్ ఛానెల్స్ పెట్టించారు వీరు. వారిలో చాలా మంది పొలిటికల్ యాక్టివిస్ట్స్ గా రూపాంతరం చెందారు. వారిని జర్నలిస్టులు కాదని ఎవ్వరూ అనలేరు. ఒరేయ్ నాయనా/ అమ్మా...మీరు చేసేది జర్నలిజం అంటారా? అని అడిగితే కులం, లింగం వంటి మాటలతో వారు దూసుకువస్తారు. సత్తెకాలపు జర్నలిస్టు ఎవరైనా ఇదేమి ఘోరమని అడిగితే..

వాడి కులం, ప్రాంతం వంటివి ప్రస్తావించి నోరు మూయిస్తారు. కొందరు యూ ట్యూబ్ జర్నలిస్టులు (మీడియాలో పనిచేసిన అనుభవం ఉండి సొంత ఛానెల్స్ పెట్టుకున్న వారు) ప్రశ్నించే గొంతుకలై మంచి పాత్ర పోషిస్తున్నారు. మరి కొందరు అద్భుతమైన విశ్లేషణ ఇస్తున్నారు. ఇలాంటి వారితో ఇబ్బంది లేదు. 

తెలంగాణ లో  ఇంకో పెద్ద సౌలభ్యం ఉంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమను ఇప్పుడు జర్నలిస్టు కాదనే దమ్ము ఎవడికుంది? అని గదమాయిస్తారు. తెలంగాణ కోసం తెగించి పోరాడే తమను విస్మరిస్తే ఇంకో పోరాటం సిద్ధమని వారు అంటారు. ఇది తిరుగులేని వాదన, మంచి హెచ్చరిక. 

నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఫామ్ హౌస్ కు పోవడానికి కారణమైన వారిలో యూ ట్యూబర్లది ప్రధాన పాత్ర. ఇది లేట్ గా గమనించి కారు పార్టీ వారు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. "పెద్ద సంఖ్యలో యూ ట్యూబర్ల ముఠాను తయారుచేసి, తమకు వ్యతిరేకంగా రోజూ వార్తలు, వ్యాఖ్యలు వండి వార్చడాన్ని సీఎం సీరియస్ గా తీసుకున్నారు. 

ఇది చాలా మంది మంత్రులకు తలనొప్పిగా ఉంది. అందుకే, అక్రెడిటేషన్ ప్రక్రియలో వడపోత మీద దృష్టి పెట్టారు," అని... ఈ ప్రక్రియను చాలా కాలంగా దగ్గర్నించి నిశితంగా పరిశీలిస్తున్న ఒక సీనియర్ జర్నలిస్టు నాతో చెప్పారు. మొత్తం మీద ప్రభుత్వం ఈ విషయంలో తెచ్చిన రెండు జీవో ల మీద పంచాయితీ నడుస్తోంది. ఇది కోర్టులో ఎలా తేలుతుందో మనకు తెలియదు. 

ప్రభుత్వం ఈ కింది పనులు చేస్తే బాగుంటుంది.

1) ఈ అక్రెడిటేషన్ ప్రక్రియను ఇంకా ప్రహసనప్రాయం చేయకుండా, మళ్ళీ వాయిదా వేయకుండా...ప్రధాన మీడియా హౌస్ లు పంపిన లిస్ట్ ప్రకారం వెంటనే కార్డులు జారీ చేయాలి. 

2) లోకమెరిగిన వెటరన్ జర్నలిస్టులకు కూడా వెంటనే కార్డులు రిలీజ్ చేయాలి.

3) ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా గత ప్రభుత్వం కార్డులు ఇచ్చిన వారికి కూడా క్లియర్ చేయాలి.

ఈ మూడు పనులు అధికారులు వెంటనే చేయగలరు. దీనికి మీనమేషాలు లెక్క పెట్టాల్సిన పనే లేదు. 

4) ఇప్పటికే నియుక్తమైన కమిటీ...మిగిలిన దరఖాస్తులను మార్చి నెల మొదటివారంలో కమిటీ రెండు, మూడు సిట్టింగ్ లలో క్లియర్ చేయవచ్చు. 

5) సీరియస్ కంటెంట్ చేస్తున్న యూ ట్యూబ్స్ కోసం పనిచేసే రిపోర్టర్లు, కెమెరామెన్ మహా అయితే 500 మంది ఉంటారు. వాటి రీచ్ ను, కంటెంట్ ను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. 

అన్నింటికన్నా ముఖ్యంగా, యూ ట్యూబ్స్ వేదికగా చేసుకుని పనిగట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక కంటెంట్ ప్రసారం చేసే వారి కేసుల్ని యూనివర్సిటీ ప్రొఫెసర్స్, ఎథిక్స్ గురించి మాట్లాడే సీనియర్ జర్నలిస్టుల కమిటీ కి రిఫర్ చేయాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కమిటీ రివ్యూ చేసి అవసరమైతే కార్డులు రద్దు చేయాలి. అది చేయాలంటే దమ్ము, నిష్పాక్షికత, పారదర్శకత ఉండాలి.  

ఈ అక్రిడిటేషన్ పంచాయితీకి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలి. జర్నలిస్టులు కూడా రాజకీయ శక్తుల చేతిలో పావులుగా మారకూడదు. 

Friday, February 13, 2026

జూలీ బ్రౌన్: జర్నలిస్టులకు స్ఫూర్తి!

జర్నలిజాన్ని వృత్తిగా చేసుకున్నందువల్ల జర్నలిస్టులు నా జీవితంలో ఒక పెద్ద భాగమై ఉన్నారు. జర్నలిస్టుకు ఉండాల్సిన మౌలిక లక్షణాలు (సత్యనిష్ఠ, నిష్పాక్షికత, సేవా తత్పరత, తార్కిక వివేచన, విశ్లేషణా సామర్థ్యం, భాషాపాటవం) లేనివాళ్ళే 98 శాతం నాకు తగులుతారు. ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చామా? అని ఏడ్చే వాళ్లే దాదాపు అంతా. 

మా ఇంట్లో అందరం మీడియా సంబంధీకులం (అమ్మ, భార్య, బిడ్డ, నేను జర్నలిజం ఆచరణ, కొడుకు అభ్యాసం) అని చెప్పినా... నా పీహెచ్డీ జర్నలిస్టిక్ ఎథిక్స్ మీద అన్నా... నన్ను అదోలా చూసేవాళ్ళే ఉన్నారు. జర్నలిజం పని అయిపోయిందని ప్రచారం చేసే వారికి బలం చేకూరేలా పరిణామాలు ఉన్నాయి. ఈనాడు పత్రిక తెచ్చిన కంట్రిబ్యూటర్ వ్యవస్థ, సోషల్ మీడియా వల్ల కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చిన శిక్షణ లేని జర్నలిస్టులు, పొలిటికల్ టూల్ గా మారిన సోషల్ మీడియా... పరిస్థితిని ఇంకా దిగజార్చాయి. 

సరే, పైన పేర్కొన్న 2 శాతం మంది మంచి జర్నలిస్టులలో మహిళలదే అగ్రస్థానం. #investigativejournalism పదికాలాల పాటు వర్ధిల్లుతున్నదంటే దానికి కారణం #womenjournalists. 

అలాంటి వారిలో ఒకరు అమెరికాకు చెందిన జూలీ కే బ్రౌన్ (Julie Knipe Brown). Miami Herald లో పనిచేస్తున్న జూలీ 2018 నవంబర్ లో ప్రచురించిన మూడు భాగాల పరిశోధనాత్మక కథనం ప్రపంచాన్ని పట్టికుదిపింది. అది ఒక భయంకరమైన, జుగుప్సాకరమైన ఇంటర్నేషనల్ సెక్స్ ట్రాఫికింగ్ స్కాం. అదీ అభం శుభం తెలియని మైనర్ బాలికలను కామవాంఛతో ఉన్న మానవ మృగాలకు బలి ఇచ్చిన అమానవీయ పెను విషాదం. 

అది జెఫ్రీ ఎప్స్టీన్ అనే పలుకుబడిగల సంపన్నుడు సంపద, అధికారం తో కొవ్వెక్కిన రాజకీయ నాయకులు, వ్యాపారులు, మేధావులు, శక్తిమంతులకు 13, 14 ఏళ్ల బాలికలను సరఫరాచేసి నడిపిన ఒక చీకటి వ్యవహారం. దాని ప్రకంపనలు ఇప్పటికీ వివిధ దేశాలను కుదుపుతున్నాయి. మనీ, పవర్ ఉన్న వాళ్ళ వికృత కోణాలను ఆవిష్కరించిన ఆ కథనాలు మనందరికీ పెద్ద మేలుకొల్పు లాంటివి. 

ఘోరమైన నేరాలు చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ 2008 లో కొద్దికాలం పాటు మాత్రమే జైలు జీవితం గడిపి బైటకి రావడం వెనక ఏమి జరిగింది? దీని వెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? అన్నదాని మీద జూలీ దృష్టి పెట్టి పరిశోధించారు. ఆ కిరాతకుడు ఎరగా వాడుకున్న 80 మంది బాధితుల వివరాలు సేకరించి, వారిని ఇంటర్వ్యూ చేసి ఆమె ఆ 3 భాగాల కథనాలు ప్రచురించారు. 

మహిళల పేర్లు రాయకుండా ఉండాల్సినప్పుడు లీగల్ డాక్యుమెంట్లలో Jane Doe అని మెన్షన్ చేస్తారు. అట్లా క్లూ లెస్ డాక్యుమెంట్స్ ను అధ్యయనం చేసి బాధితులను సంప్రదించి జూలీ ఆ స్టోరీ చేసారు. దాని ఆధారంగా 2020 జులై లో ప్రివెన్షన్ ఆఫ్ జస్టిస్ అనే పుస్తకం రాశారు. ఆమె (ఇపుడు 65 ఏళ్ల వయస్సు) అనేక అవార్డులు పొందారు. 

మీడియా యాజమాన్య ధోరణుల వల్ల అవినీతి మీద జర్నలిస్టులు పరిశోధనాత్మక కథనాలు రాసే పరిస్థితి లేదు. ఘోరాలు, నేరాలకు బలవుతూ బిక్కుబిక్కున బతుకుతున్న అభాగ్యులకు సంబంధించిన అంశాల మీద అయినా లోతైన పరిశోధనలు చేసి ప్రచురిస్తే బాగుంటుంది కదా!