జర్నలిజాన్ని వృత్తిగా చేసుకున్నందువల్ల జర్నలిస్టులు నా జీవితంలో ఒక పెద్ద భాగమై ఉన్నారు. జర్నలిస్టుకు ఉండాల్సిన మౌలిక లక్షణాలు (సత్యనిష్ఠ, నిష్పాక్షికత, సేవా తత్పరత, తార్కిక వివేచన, విశ్లేషణా సామర్థ్యం, భాషాపాటవం) లేనివాళ్ళే 98 శాతం నాకు తగులుతారు. ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చామా? అని ఏడ్చే వాళ్లే దాదాపు అంతా.
మా ఇంట్లో అందరం మీడియా సంబంధీకులం (అమ్మ, భార్య, బిడ్డ, నేను జర్నలిజం ఆచరణ, కొడుకు అభ్యాసం) అని చెప్పినా... నా పీహెచ్డీ జర్నలిస్టిక్ ఎథిక్స్ మీద అన్నా... నన్ను అదోలా చూసేవాళ్ళే ఉన్నారు. జర్నలిజం పని అయిపోయిందని ప్రచారం చేసే వారికి బలం చేకూరేలా పరిణామాలు ఉన్నాయి. ఈనాడు పత్రిక తెచ్చిన కంట్రిబ్యూటర్ వ్యవస్థ, సోషల్ మీడియా వల్ల కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చిన శిక్షణ లేని జర్నలిస్టులు, పొలిటికల్ టూల్ గా మారిన సోషల్ మీడియా... పరిస్థితిని ఇంకా దిగజార్చాయి.
సరే, పైన పేర్కొన్న 2 శాతం మంది మంచి జర్నలిస్టులలో మహిళలదే అగ్రస్థానం. #investigativejournalism పదికాలాల పాటు వర్ధిల్లుతున్నదంటే దానికి కారణం #womenjournalists.
అలాంటి వారిలో ఒకరు అమెరికాకు చెందిన జూలీ కే బ్రౌన్ (Julie Knipe Brown). Miami Herald లో పనిచేస్తున్న జూలీ 2018 నవంబర్ లో ప్రచురించిన మూడు భాగాల పరిశోధనాత్మక కథనం ప్రపంచాన్ని పట్టికుదిపింది. అది ఒక భయంకరమైన, జుగుప్సాకరమైన ఇంటర్నేషనల్ సెక్స్ ట్రాఫికింగ్ స్కాం. అదీ అభం శుభం తెలియని మైనర్ బాలికలను కామవాంఛతో ఉన్న మానవ మృగాలకు బలి ఇచ్చిన అమానవీయ పెను విషాదం.
అది జెఫ్రీ ఎప్స్టీన్ అనే పలుకుబడిగల సంపన్నుడు సంపద, అధికారం తో కొవ్వెక్కిన రాజకీయ నాయకులు, వ్యాపారులు, మేధావులు, శక్తిమంతులకు 13, 14 ఏళ్ల బాలికలను సరఫరాచేసి నడిపిన ఒక చీకటి వ్యవహారం. దాని ప్రకంపనలు ఇప్పటికీ వివిధ దేశాలను కుదుపుతున్నాయి. మనీ, పవర్ ఉన్న వాళ్ళ వికృత కోణాలను ఆవిష్కరించిన ఆ కథనాలు మనందరికీ పెద్ద మేలుకొల్పు లాంటివి.
ఘోరమైన నేరాలు చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ 2008 లో కొద్దికాలం పాటు మాత్రమే జైలు జీవితం గడిపి బైటకి రావడం వెనక ఏమి జరిగింది? దీని వెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? అన్నదాని మీద జూలీ దృష్టి పెట్టి పరిశోధించారు. ఆ కిరాతకుడు ఎరగా వాడుకున్న 80 మంది బాధితుల వివరాలు సేకరించి, వారిని ఇంటర్వ్యూ చేసి ఆమె ఆ 3 భాగాల కథనాలు ప్రచురించారు.
మహిళల పేర్లు రాయకుండా ఉండాల్సినప్పుడు లీగల్ డాక్యుమెంట్లలో Jane Doe అని మెన్షన్ చేస్తారు. అట్లా క్లూ లెస్ డాక్యుమెంట్స్ ను అధ్యయనం చేసి బాధితులను సంప్రదించి జూలీ ఆ స్టోరీ చేసారు. దాని ఆధారంగా 2020 జులై లో ప్రివెన్షన్ ఆఫ్ జస్టిస్ అనే పుస్తకం రాశారు. ఆమె (ఇపుడు 65 ఏళ్ల వయస్సు) అనేక అవార్డులు పొందారు.
మీడియా యాజమాన్య ధోరణుల వల్ల అవినీతి మీద జర్నలిస్టులు పరిశోధనాత్మక కథనాలు రాసే పరిస్థితి లేదు. ఘోరాలు, నేరాలకు బలవుతూ బిక్కుబిక్కున బతుకుతున్న అభాగ్యులకు సంబంధించిన అంశాల మీద అయినా లోతైన పరిశోధనలు చేసి ప్రచురిస్తే బాగుంటుంది కదా!
