Monday, October 27, 2025

తీన్మార్ మల్లన్న Vs జర్నలిస్టులు

(Dr S Ramu) 

కేసీఆర్ గారి భజనలో తెలంగాణ నిండా మునిగి ఉన్నప్పుడు ఆయన్ను కుమ్మి కుమ్మి పెట్టిన మొదటి గళం తీన్మార్ మల్లన్న అని లోకవిదితమైన చింతపండు నవీన్ కుమార్ గారిది. BRS ఢమాల్ కావడంలో మాటల తూటాలతో ఆయన నడిపిన Q News ది ప్రధాన పాత్ర. అదొక గట్టి పోరాటం. మల్లన్న గారు దీనివల్ల ఎన్నో కేసులు ఎదుర్కున్నారు. ఆ సానుభూతి నాకు ఉండేది. 

అందుకే, ఆయన జైల్లో ఉన్నప్పుడు నేను పలు వేదికల మీద వ్యాసాలు రాసాను. దొంగ కేసు ఆధారంగా వచ్చిన ఒక సినిమా ఇతివృత్తాన్ని ఆయన జీవిత కోణం నుంచి నేను ఒక పెద్ద వ్యాసం ఇంగ్లీషు లో రాసి ప్రచురిస్తే Q News లో చూపించారు కూడా. మల్లన్న చేసింది బ్లాక్మెయిల్ జర్నలిజం కాదా? అసలాయన జర్నలిస్టునా? అంటే నా దగ్గర సమాధానం లేదు. 



అప్పుడు బీజేపీ లో ఉన్న ఆయనకు అనుకూలంగా రాసినందుకు మా ప్రొఫెసర్ ఒకరు నొచ్చున్నారు. మల్లన్న ట్రూ కలర్ నాకు తెలవదని, ముందు ముందు చూస్తావని  వారు అన్నారు. అయినా... మల్లన్న పోరాటం మామూలుది కాదని, అది చాలా స్పూర్తిదాయకమని, మనం తనను ఇష్యూ బేస్డ్ గా చూడాలని సున్నితంగా వాదించాను. ఏ issue కి ఆ issue చూడకుండా బ్లాంకెట్ స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల సమస్య వస్తున్నది. 

బీసీ ల ఐక్యత కోసం మల్లన్న చేసిన ప్రయత్నం బాగుంది. కానీ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎలక్షన్ సందర్భంగా ఫ్రెండ్స్ ప్యానెల్ తరఫున అధ్యక్ష పదవిలో ఉన్న Vijaykumar Reddy Srigiri మీద ఆయన విడుదల చేసిన వీడియో నాకు నచ్చలేదు. విజయ్ ఒక దుర్మార్గుడు, బీసీ ద్రోహి అని థంబ్ నెయిల్ పెట్టి పరుష పదజాలం వాడి వదిలారు. ఆయన గెలిస్తే ప్రెస్ క్లబ్ లో బీసీ ల ప్రెస్ కాన్ఫరెన్స్ కు అవకాశం ఇవ్వరని కూడా అన్నారు. నిజానికి ఎవరో అభ్యర్థి మల్లన్న పేరిట డీప్ ఫేక్ చేశారేమో అనిపించింది. అది అంత సిల్లీ టాక్. 

కానీ, 1280 మంది సభ్యులున్న ప్రెస్ క్లబ్ నిన్న జరిగిన ఎన్నికల్లో సాక్షి లో పనిచేస్తున్న విజయ్ కుమార్ రెడ్డి గారిని ప్రెసిడెంట్ గా మంచి మెజారిటీ తో ఎన్నుకుంది. ఆయన ఆధ్వర్యంలోని ఫ్రెండ్స్ ప్యానెల్ కు విజయం కట్టబెట్టారు. జనరల్ సెక్రటరీ గా ఈనాడు మిత్రుడు వరకుప్పల రమేష్ గెలిచారు. 

తీన్మార్ మల్లన్న ఇచ్చిన పిలుపు కు భిన్నంగా విజయ్ విజయ భేరి మోగించారు. విజయ్ ను సమర్ధించిన వారిలో బీసీ లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. తన వృత్తి అయిన జర్నలిజంలో ఉన్న జర్నలిస్టులు, బుద్ధిజీవులు మల్లన్న మాటలు పట్టించుకోలేందటే...సామాన్య జనం ఆయన్నేమి దేఖుతారన్న ప్రశ్న ఉదయిస్తుంది కానీ ఆ వాదనా అంత సమంజసం కాదు. 




అయ్యా... మల్లన్న గారూ! మీకు ధైర్యం, నోరు ఉన్నాయి.  పిడుక్కీ, బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లు నోటికొచ్చిన పదాలు వాడితే జనం హర్షించరు. విజయ్ మీకు నచ్చకపోతే... ఎందుకు నచ్చలేదో కారణాలు చెప్పే హక్కు మీకుంది. ఆయనకు కాకుండా కేవలం బీసీ లనే గెలిపించాలని కోరడంలో అస్సలు తప్పులేదు. కానీ దుర్మార్గుడు, ద్రోహి అనడం, పెద్ద ఆరోపణలు చేయడం

కరెక్ట్ కాదు. మీరు ఈ విషయంలో పొరబడ్డారు. మల్లన్న మీద మంటతో విజయ్ కు అనుకూలంగా ఎక్కువ ఓట్లు పడ్డాయన్న టాక్ రావడం బాధాకరం కదా! 

ప్రతి పదానికి ఒక వెయిట్ ఉంటుంది, బ్రదర్. సోషల్ మీడియాలో, లైవ్ షో లలో సాధారణ జనాలను ఆకట్టుకోవడానికి అది సరిపోవచ్చు, జర్నలిస్టిక్ ఎథిక్స్ పక్కనబెడితే. ఆ బరువైన మాటలు అటు మీతో ఉన్న పొలిటీషియన్స్ మీద, ఇటు జర్నలిస్టుల మీద వాడితే మీకు చాలా నష్టం. బీసీ ఉద్యమానికి మీ గళం ఉపకరించాలంటే మాట్లాడాల్సిన భాష ఇది కాదు. 

కమ్యూనికేషన్ సమస్తం. అదే భస్మాసుర హస్తం కూడా. భద్రం... బీ కేర్ ఫుల్ బ్రదర్.

PS: మల్లన్న మీద soft corner తో ఇది రాసినట్లు... నేను బాగా అభిమానించే మిత్రులు, మేధావులు అభిప్రాయపడ్డారు. Fact based కామెంట్ చేయాలని దీని ఉద్దేశ్యం. మొదట్లో ఆయన మీద ఉన్న  అభిప్రాయం ఇప్పుడు నాకేమీ లేదు. ఆయన వ్యాఖ్యల మీద వీలున్నప్పుడల్లా రాస్తూనే ఉన్నాను.

Thursday, July 17, 2025

రాజన్న గారు...నిజమైన యోధుడు...



చిన్న సమస్య వేస్తే...నానా ఏడుపులు ఏడుస్తాం మనం. Why me? అని తల్లడిల్లిపోతాం. అలాంటిది.. కక్ష కట్టినట్టు అడుగడుగునా సమస్యలు వెంటబడితే తట్టుకోవడం అంత తేలిక కాదు. 

చిన్నప్పుడు దారిద్ర్యంతో చాలా ఇబ్బంది పడ్డాడు. 

కష్టాల కడలి మధ్య పెరిగాడు. 

భార్యపై కన్నేసిన ఒక దగుల్బాజీ హత్య కేసులో చిక్కున్నాడు. 

వ్యవస్థపై నమ్మకంతో లొంగిపోయాడు.

జైలు పాలయ్యాడు. 

మొర ఆలకించని, నిజాన్ని పట్టించుకోని వ్యవస్థ ప్రతినిధి గా జడ్జి పై చెప్పు విసిరాడు. 

ఉరిశిక్ష ఖరారయ్యింది.

భార్య జీవితం ఖరాబు కాకూడదని ఆమె వేరే పెళ్ళికి ఒప్పుకున్నాడు. 

జైల్లో పేరుమోసిన అన్నలను కలిసి సమాజ పాఠాలు నేర్చుకున్నాడు. 

మంచి జైలర్ వల్ల ఉరి శిక్ష తప్పించుకున్నాడు. 

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పుణ్యాన డిగ్రీ సాధించాడు. 

జర్నలిజం వైపు మొగ్గుచూపాడు. 

విడుదలయ్యాక జీవిత సమరం చేశాడు. 

భార్య, ఇద్దరు పిల్లలతో జీవితం సాగిస్తున్నాడు. 

ఇదీ సంక్షిప్తంగా రాజన్న జీవిత చరిత్ర. ఆయన స్వీయ కథ హిందీలో వచ్చింది. ఇప్పుడు తెలుగులో వస్తున్నది. 

నాకు ఒక మూడేళ్లుగా ఆయనతో పైపైన పరిచయం. ఆయన గురించి "నిర్దేశం" అనే చిన్న పత్రికలో వచ్చిన సీరియల్ చదివి నా గుండె అల్లకల్లోలం అయ్యింది. ఆ పత్రికకి నా అభిప్రాయం రాసి పంపాను. 

నిన్న రాత్రి "World Public Relations Day" సందర్భంగా ఆయన్ని హైదరాబాద్ లో కలిశాను. ఇట్లా చిరు సత్కారం చేశాను. 

వ్యవస్థలో లోటుపాట్లకి, కొందరి దౌర్జన్యానికి బలైన రాజన్ గారిని అదే వ్యవస్థలోని కొన్ని అంగాలు, కొందరు వ్యక్తులు ఆదరించి అక్కున చేర్చుకోవడం ఊరట నిచ్చే అంశం. ఇప్పుడు 65 ఏళ్ల వయస్సు ఉన్న ఆయన జీవితం ఒక సినిమా రూపంలో వస్తేనే మంచిది.

Sunday, June 29, 2025

దాడి దారుణమే గానీ...వ్యాఖ్యల శైలి బాలేదే!

 ముందుగా, మహా టీవీ మీద జరిగిన దాడి దారుణం. పదేళ్ళు తెలంగాణను అనుకున్నంత బాగా పాలించలేకపోయిన బీ ఆర్ ఎస్ వాళ్ళు తెగబడి మీడియా హౌస్ మీద దాడి చేయడం ఖండనార్హం. కార్లను ధ్వంసం చేయడమే కాకుండా... జర్నలిస్టులు, యాంకర్లు, టెక్నీషియన్స్ ఉన్న గది తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేసి, భయోత్పాతం సృష్టించడం అస్సలు బాగోలేదు. ఇది కే సీ ఆర్ మార్క్ రాజకీయం కాదే! నాయకులు నిస్పృహలోకి పోతే ఎట్లా? ఇంకా మూడేళ్ళు నెట్టుకురావాలంటే కాస్త ఓపిక ఉండాలి కదా! పదేళ్ళు కిందబడి మీదబడి నెట్టుకురాబట్టే కదా...కాంగ్రెస్ ను, బీజేపీ ని ప్రజలు ఆదరించారు. 

అయితే, గులాబీ క్యాడర్ కు అంత చేటు కాలడం వెనుక మహా న్యూస్ వంశీ గారి మాటల మంటలు ఉన్నాయని అనడంలో సందేహం లేదు. ఆ థంబ్ నెయిల్స్, వ్యాఖ్యలు చూస్తుంటే...అది జర్నలిజం లాగాలేదు. మాటల దాడిలాగా ఉంది. 

అన్నింటికీ ఎస్ సార్...అనే రాజు గారిని


స్టూడియోలో కూర్చోబెట్టుకుని మీడియా కోటలు దాటే మాటలతో వారు రెచ్చిపోవడం నేను గమనించాను. ఆ వ్యాఖ్యలు ఒక పరిణతి చెందిన జర్నలిస్టు చేసిన వ్యాఖ్యల్లా లేవని నా మటుకు నాకు అనిపించింది. 

ఇన్నాళ్ళూ, పొలిటికల్ వ్యూహాలు లేక బండ రాజకీయం చేస్తున్న వై ఎస్ ఆర్ సీ పీ ని చెడుగుడు ఆడుకున్న వంశీ గారు ఇప్పుడు ఫోకస్ తెలంగాణ మీదకు మార్చారని ఫోన్ ట్యాపింగ్ కవరేజ్ ను చూస్తే అనుమానం కలుగుతుంది. 

అహంకారం, కండకావరం, బరితెగింపు ఎక్కువై రెండో టర్మ్ లో కంపు కంపు చేయబట్టే కదా... ఈడ్చి కొట్టారు జనం! అన్నింటి మీదా దర్యాప్తులు జరుగుతున్నాయి కదా! కొద్దిగా ఓపిక పట్టవచ్చు కదా, వంశీ గారూ! 

వేరే వాళ్ళ భార్యల ఫోన్ సంభాషణలు వినడమేమిటి? దీని మీద జాతిపిత నోరు మెదపరేం? అని వంశీ గారు బాగా బాధపడుతున్నారు. దర్యాప్తు జరుగుతున్న, ఉచ్చు బిగుసుకుంటున్న కేసు గురించి ఆయన ఎప్పుడేమి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వగలరు, సామీ? మనం ఏదో ఒకటి చెప్పొచ్చు కదా! అంటే ఎట్లా? సార్, ఇరుక్కుంటే అధికారులు ఇరుక్కుంటారు గానీ, నాయకులు తేలిగ్గా బైటపడే కేసులా ఉంది ఇది. అప్పుడు మీ మీద పరువు నష్టం దావా చేస్తే ఇరుక్కునేది మీరే! సంయమనం, నిష్పాక్షికత పాటిస్తే మంచి పేరు వస్తుంది. 

దర్యాప్తు బృందాలకు ట్యాపింగ్ బాధితులిచ్చిన స్టేట్మెంట్స్ పట్టుకుని అప్పుడే ఒక నిర్ధారణకు రావడం, జడ్జిమెంటల్ వ్యాఖ్యలు చేయడం సరికాదు. యువ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు కే టీ ఆర్ గారి మీద అర్జెంట్ గా ఒక నిర్ణయానికి రావడం పద్ధతి కాదు. ఆయన శుద్ధపూస అవునో కాదో దర్యాప్తులో తేలుతుంది. అందుకే చట్టాన్ని  తన పని తాను చేసుకొనివ్వండి, తీవ్రమైన వ్యాఖ్యలు మాని. ఒకవేళ అంత జర్నలిస్టిక్ దమ్ము ఉంటే ఫోన్ ట్యాపింగ్ ను అడ్డంపెట్టుకుని బెదిరిస్తే హోటల్స్ కు గానీ, గెస్ట్ హౌస్ లకు గానీ పోయి సమర్పించుకున్న వారిని me too ఉద్యమం తరహాలో బయటికి పట్టుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి. ఆయన్ని అడ్డంగా బుక్ చేయండి. మనం ఎక్కువ ఉత్సాహం కనబరిస్తే...నిజంగానే ఆయన దోషి గా తేలినా...పబ్లిక్ సింపతీ ఆయన వైపే ఉంటుంది. 

ఏతావాతా, జర్నలిస్టిక్ ఎథిక్స్ వంశీ గారు పాటించాలి. చట్టాన్ని బీ ఆర్ ఎస్ వాళ్ళు చేతుల్లోకి తీసుకోకూడదు. 

#MahaNews #తెలుగుజర్నలిజం #తెలుగుదేశం #కాంగ్రెస్ #వంశీ #కేటీఆర్ #BRS

Saturday, June 28, 2025

జర్నలిస్టు స్వేచ్ఛకు నివాళి!

తెలుగు మీడియాలో మహిళల సంఖ్య చాలా తక్కువ. రకరకాల ఇబ్బందులు పంటి బిగువున భరిస్తూ, ప్రతిభకు తగిన హోదాలు రాకపోయినా పోనీలే...అనుకుంటూ ఉద్యోగాలు చేసే వారే ఎక్కువ. పోరాడితే పోయేదేమీ లేదని నమ్మి, సవాళ్లను ఎదుర్కొంటూ గుండె ధైర్యం తో కెరీర్ లో సాగిపోయే మహిళా జర్నలిస్టులను వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలాంటి వారిలో స్వేచ్ఛ ఒకరు. జర్నలిస్టు, యాంకర్ గానే కాకుండా, తనను వేరే వారికి అప్పగించి సమసమాజం కోసం పోరుబాట పట్టిన తల్లిదండ్రుల వారసురాలిగా కవిత్వం తో కూడా ఆమె రాణించింది. ఇలాంటి ప్రతిభావంతురాలు తరలిరాని తీరాలకు వెళ్లిపోవడం అత్యంత విచారకరం. 


నేను ఒకటి రెండు సార్లు కలిశాను స్వేచ్ఛ గారిని మూడు నాలుగేళ్ల కిందట. అందం, ఆనందం, ఆత్మీయత కలబోత అయిన ఆ బిడ్డ ఎంతో ఉత్సాహంగా మాట్లాడింది. మా ఉస్మానియా విశ్వవిద్యాలయం లో 2006- 2008 బ్యాచ్ లో జర్నలిజం చదువుకుని, పీ హెచ్ డీ కోసం కూడా ప్రయత్నం చేసింది. 

ఇదెట్లా ఆత్మహత్య అవుతుందన్న అనుమానం కలిగించే ఫోటో ప్రచారంలోకి వచ్చింది. ఈ లోపు, తాను పనిచేస్తున్న మీడియా హౌజ్ లో వివాహితుడి వల్ల ఇబ్బందిపడిందని స్వేచ్ఛ తండ్రి గారు స్పష్టంగా చెబుతున్నారు. 

ఏది ఏమైనా, వ్యక్తిగత జీవితంలో సమస్య వల్ల ఒక మంచి జర్నలిస్టు లేకుండా పోయారు. ఇది బాధాకరం. మా బాలస్వామి సార్ బతికి ఉంటే... స్వేచ్ఛ వెళ్ళి ఆయనతో మాట్లాడి ఉండేది, అపుడు పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదేమో కదా! అని నాకు అనిపించింది..ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ లోని జర్నలిజం డిపార్ట్మెంట్ కు వెళ్లినపుడు. 

ఆడతనం, అందం శాపమై జీవితాలు కడతెరుతున్న కొందరు మహిళా జర్నలిస్టులను, యాంకర్లను చూస్తున్నాము. మేకవన్నె పులులకు బలవుతున్నారు. కొన్ని విషయాలు బయటికి రావు, కొన్ని తెలిసినా సున్నితత్వం రీత్యా బైటకి చెప్పలేము. వారి ఉద్యోగం వారిని చేసుకోనిచ్చి, వారి బతుకులు వారు బతకమస్తే బాగు. మీడియాలో ఎవర్నీ నమ్మవద్దని తన తల్లి చెప్పినట్లు స్వేచ్ఛ 13 ఏళ్ల కూతురు ఇవ్వాళ ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది. 

స్వేచ్ఛ జర్నలిజం చదువుకున్న ఉస్మానియా జర్నలిజం డిపార్ట్మెంట్ లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్ కు ఈ రోజు హాజరైన నేను, ఇంకా కొంతమంది ఆమెకు మౌన నివాళి అర్పించాము.

ఆమె ఆత్మకు శాంతి కలుగుగాక!

Sunday, June 22, 2025

తెలుగు జర్నలిస్టుల కోసం... త్వరలో....

 *మనిషికో రూ.16 చందా....కుటుంబానికి అండాదండా...

*Teachers Self-Care Team స్పూర్తితో....  

----------------------------------------------------

కుటుంబాన్ని పోషించే మనిషి మరణిస్తే?

-మిత్రులు, బంధువులు 'రిప్', 'ఓం శాంతి' మెసేజ్ లు పెడతారు.

-ప్రాణ మిత్రులు, సన్నిహిత బంధువులు కడసారి దర్శనం చేసుకుంటారు.

-కుటుంబం కొన్ని నెలలు విషాదంలో ఉంటుంది.

-అయన/ఆమె జీవిత భాగస్వామి కోలుకోవడానికి అందరికన్నా ఎక్కువ సమయం పడుతుంది.

-తన మనుగడ ఇప్పుడు ఒక్కసారిగా ప్రశ్నార్ధకం అయిపోతుంది.

-పోయిన మనిషి అప్పులు చేసి పోతే బతికున్న తనకు కష్టం.

-అండగా నిలిచే కొడుకులు/ కుమారులు లేకపోతే మహాకష్టం.

- పొమ్మనలేక పొగబెట్టే లేదా తన్ని తరిమేసే కోడలు/కొడుకు ఉంటే నరకమే.

-పేద, మధ్యతరగతి జీవితాల్లో ఇది ఒక సంక్షోభం.  

ముందు తరం వారికి పెన్షన్ అనేది ఒక వరప్రసాదం లాగా ఉండేది. 2004 లో దాన్ని కాస్తా పీకిపారేసి సంక్షేమ రాజ్య ప్రభువులు మృతుల కుటుంబాల, ముసలోళ్ల జీవితాలను నరకప్రాయం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలబడడం ఎలా? అన్నది మనసున్న వారికి పెద్ద ప్రశ్న. ఉన్నదాంట్లో ఆ కుటుంబానికి ఏదైనా చేద్దామని ఉన్నా... చేయలేని నిస్సహాయత. వాడు పోయాడు...కుటుంబం ఎటు పోతే మనకేమిటి? అనుకోకుండా ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు చెందిన వివేకానంద ఆర్యా అనే ఒక సాధారణ టీచర్ ఒక చిన్న ప్రయత్నం చేశాడు. కోవిడ్ మహమ్మారి తోటి టీచర్లను పిట్టల్లా రాల్చేస్తుంటే, వారి కుటుంబాలు నిస్సహాయ స్థితిలో, దారిద్య్రంలో పడిపోవడంతో కలత చెందిన అయన 2020 లో చేసిన ఈ చిరు ప్రయత్నం ఒక పెద్ద సంచలనంగా మారింది. 250 కి పైగా టీచర్స్ మృతి చెందాక వారి కుటుంబాలకు ఒక్కొక్కదానికి రూ. 50 లక్షలు సాయంగా అందాయి. ఎవరో ఒక్క మనిషి గానీ, సంస్థ గానీ ఈ పెద్ద సాయం చేయడంలేదు. ఒక్కో టీచర్ కేవలం రూ. 16 తమ వంతుగా అందించడం వల్ల మృతుని కుటుంబానికి ఈ పెద్ద సాయం అందడం ఇందులో గొప్పతనం. ఆ డబ్బు చేతులు మారకుండా... నేరుగా మృతుని భార్య అకౌంట్ లోకి పోవడం ఇంకో అద్భుతం. అయన నిర్మించిన వ్యవస్థ పేరు Teachers' Self-Care Team (TSCT). 

ఈ ఫొటోలో నాతో పాటు ఉన్న ఆయనే వివేకానంద ఆర్యా జీ. నిన్న హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అయన స్పీచ్ విని, కాసేపు ఆయనతో నేను మాట్లాడాను. ముందుగా వాట్సాప్, తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ లను మొదలు పెట్టి అయన టీచర్స్ ను పెద్ద సంఖ్యలో యాడ్ చేసి ఈ అద్భుత పరోపకార కార్యక్రమం చేస్తున్నారు. TSCT లో చేరిన నాలుగు లక్షల మంది టీచర్లు మరణ వార్త తెలియగానే మృతుని భార్య బ్యాంక్ అకౌంట్ కు టంచనుగా రూ.16 రూపాయలు పంపిస్తారు. కొద్ది సమయంలోనే అది యాభై లక్షలు దాటి కుటుంబానికి ఎంతో దన్నుగా నిలుస్తున్నది. నాకైతే ఇది బాగా నచ్చింది. 

జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులతో మరణిస్తుంటే... వారి కుటుంబాలు డబ్బు లేక అవస్థలు పడుతుంటే నేను కుమిలిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో కొందరికి నాకు చేతనైన వరకు చాలా పరిమిత సంఖ్యలో వారికి చాలా స్వల్ప సాయం చేస్తున్నా గానీ అది సరిపోదని అనుకుంటున్న సమయంలో నేను ఆర్యా గారిని కలిశాను. ఆ మోడల్ గురించి తెలుసుకున్నాను.

మనసుంటే... మార్గం ఉంటుందని ఆర్య గారు చెప్పిన మాటల స్పూర్తితో నేను జర్నలిస్టు సోదరుల కోసం ఇలాంటి ప్రయత్నం మొదలుపెట్టాలని గట్టిగా అనుకుంటున్నాను.  

నీతి నిజాయితీలతో, పారదర్శకంగా ఉంటే... ప్రపంచం నీతో ఉంటుందని ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యం. డబ్బు మన ద్వారా పోతే సమస్య. మన మీద తప్పుడు ఆ

రోపణలు చేస్తారు. ఈ మోడల్ తో మన చేతికి మట్టి అంటకుండానే సాయం ఛానలైజ్ చేయవచ్చు. ఇప్పటికే ఇలాంటి ఇనీషియేటివ్ ఉందేమో చెక్ చేసి త్వరలో నేను ఇది మొదలుపెడ్తా.

ఇంత గొప్ప పథకాన్ని మొదలు పెట్టి ఐదేళ్లుగా వందల కోట్లు మృతుల కుటుంబాలకు చేర్చిన/చేరుస్తున్న వివేకానంద ఆర్యా గారికి అభినందలు.

Sunday, June 15, 2025

టీవీ చర్చా? పిచ్చి పిచ్చి రచ్చా?

తిట్టుకోవడం...జుట్టు పట్టుకోవడం...చెప్పులు చూపించుకోవడం....మీదిమీదికి పోవడం...కొట్టుకోవడం...సవాల్ విసురుకోవడం... అంతుచూస్తానని బెదిరించుకోవడం... 

టెలివిజన్ ఛానల్స్ మారుస్తూ కూర్చుంటే...ఇవన్నీ గానీ, వీటిలో కొన్నిగానీ కచ్చితంగా ఉచితంగా లభిస్తాయి. దిగజారిన టీవీ డిబేట్లు బాధ కలిగిస్తున్నాయి. 

జర్నలిజం పరువు ప్రతిష్ఠలు మరీ దిగజారడానికి కారణమైన పలు అంశాల్లో టెలివిజన్ లైవ్ డిబేట్లు అన్నది కీలకమైనది. ఒక్కోసారి ఈ చర్చలు రోత, జుగుప్స, ఆగ్రహం, నిస్సహాయత కలిసిన ఒక విధమైన మనోవికారాన్ని కలిగిస్తున్నాయి. సభ్యత, సంస్కారం, గౌరవం వంటివి చాలావరకు ఇందులో ఉండవు. ఇది చూసే వారు ఒక పధ్ధతి ప్రకారం నాగరికంగా ఉండాలనుకునేవారైతే వారికి రోత పుడుతుంది... అందులో వాడే భాష, వాదప్రతివాదాలు చూస్తే లేదా వింటే. సాక్షి టీవీ లో యాంకర్, మాజీ ఈనాడు జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు, విడుదల నేపథ్యంలో 'టీవీ గెస్టులు' అనే అంశం మీద విస్తృత చర్చ జరగాలి.

'ఈనాడు' లో వచ్చే ప్రతిధ్వని అనే ప్రోగ్రాం చప్పగా ఉంటుందనడానికి కారణం...అందులో పెద్దగా ధ్వనులు లేకపోవడం. లైవ్ షోలో ఎంత సౌండ్ ఉంటే, ఎంత డ్రామా ఉంటే అంతగా జనాలకు అంత నచ్చుతున్నట్లు యాజమాన్యాలు పసిగట్టాయి. అందుకే కొన్ని ఛానెల్స్ వాళ్ళు నన్ను ఈ లైవ్ షో లకు పిలిచినా నేను రాను మహాప్రభో... అని చెబుతాను. నన్ను వ్యక్తిగతంగా గానీ, నేను చెప్పే మాటను ఆధారాలు లేకుండా అడ్డగోలుగా గానీ ఖండించినాగానీ, గంటకు రూ. 5,000 ఇవ్వకపోతేగానీ నేను రానని ఒకరిద్దరికి మొహమాటం లేకుండా చెప్పాను. అప్పటినుంచి టీవీ డిబేట్లకు పిలవడం మానేశారు. నేను హ్యాపీ. డబ్బులు ఇవ్వకుండా స్టూడియోలకు పిలిస్తే ఎగేసుకుపోయే ఒక వర్గం ఉండబట్టి చర్చలు నాసిరకంగా ఏడ్చాయని నేను గట్టిగా నమ్ముతాను.

 ఇప్పుడు టీవీ చర్చల్లో వస్తున్న వారు ఈ కింది కేటగిరీ లలో ఏదో ఒక దానికి చెందిన వారై ఉంటున్నారు.

1) ఆస్థాన విద్వాంసులు

2) పార్టీల అధికార ప్రతినిధులు

3) యాంకర్ భజన బృందం

4) నిపుణులు (అప్పుడప్పుడూ).

అన్ని పార్టీల వాళ్ళను స్టూడియోలకు పిలవడం, వాళ్లలో వాళ్ళు బండబూతులు దోక్కుంటూ ఉంటే యాంకర్ అర్ధగంటో, గంటో కాలక్షేపం చేసి రెండు మూడు కామెంట్లు చేసి ముగించడం. ఇదే తంతు. మళ్ళీ రేపు కూడా ఈ చర్చకు పిలవాలి కాబట్టి వచ్చిన గెస్టు హోస్టు ను ఆకాశానికి ఎత్తడం సర్వసాధారణమైంది. పొగడని వాడు పాపాత్ముడు అయిపోయాడు. లైవ్ షో కావడం వల్ల ఎడిటింగ్ కు ఆస్కారం లేదు. అందుకే బూతులు తిట్టుకున్నా, చెప్పులతో కొట్టుకున్నా, పళ్ళు కొరుకుతూ నీ అంతు చూస్తానని బెదిరించినా యథాతథంగా నేరుగా జనాలకు చేరిపోతోంది. వెర్రి జనాలకు అది నచ్చుతోంది.  

అధికార ప్రతినిధుల యావంతా.... ఈ షో చూసే పార్టీ నాయకత్వాన్ని ఖుషీ చేసేలా నోటికొచ్చింది వాగడం మీదనే. యాంకర్లయితే నిష్పాక్షికతను గాలికి వదిలేసి ఎడిటోరియల్ కామెంట్స్ తో పిచ్చెక్కిస్తున్నారు. టీవీ డిబేట్ల వల్ల ప్రొ.కే నాగేశ్వర్ గారు పాపులర్ అయ్యారు. రెండు సార్లు ఎం ఎల్ సీ అయ్యారు. సొంతగా ఛానెల్ పెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన స్థాయిలో వాదన వాదనలాగా వినిపించే వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఏమాటకామాటే, టీవీ డిబేట్లు వల్ల ఒక ఆరేడుగురు జర్నలిస్టులు సెలబ్రిటీ హోదా పొందారు. నిజానికి వారు ప్రతిభావంతులు, సమర్థత కలవారు. కొమ్మినేని గారికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. 

నేషనల్ టీవీ లో పుట్టుకొచ్చి నోటితో బతికేస్తున్న ఒక మహానుభావుడు ఆదర్శంగా మన తెలుగు టీవీ షో లు సాగుతున్నాయని నాకు అనిపిస్తున్నది. ఆయన మోడల్ ప్రాంతీయ యాంకర్లకు విజయవంతమైన, ఆదర్శప్రాయమైన నమూనాగా సాగుతోంది. పెద్ద గొంతుతో అరవడం, గెస్టుల మధ్య మంటబెట్టి షో నడపడం, పూర్తిగా ఒక సైడ్ తీసుకుని చర్చ చేయడం, జనం నోరెళ్ళబెట్టుకుని చూసేలా, వినేలా పదాలు వాడడం, సెంటిమెంట్ రెచ్చగొట్టడం... ఈ నమూనాలో భాగం. ఆయన ఎవరో గెస్ చేసి, టీవీ చర్చల మీద మీ అభిప్రాయలు రాయండి. 

Friday, June 13, 2025

కొమ్మినేని గారి విడుదల హర్షణీయం...

నేను అనుకున్నట్లుగానే అయ్యింది. కొమ్మినేని శ్రీనివాసరావు గారి విడుదలకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. 

సాక్షి టీవీ ఛానల్ లైవ్ షో లో గెస్టు చేసిన పిచ్చి వ్యాఖ్య ప్రభావాన్ని అంచనా వేయడంలో 70 ఏళ్ల కొమ్మినేని గారు విఫలమై ఇరుకున పడ్డారు. ఆయన చేసినది తప్పే కానీ అది ఆయన్ను అర్జెంటుగా అరెస్టు చేయాల్సినంత తీవ్ర ఘోరమైనది కాదని అనిపించి...నేను ఈ వేదిక మీద పోస్టు పెట్టాను...అరెస్టుకు వ్యతిరేకంగా. అది చాలా మందికి నచ్చలేదు. కానీ, నేను వారి వాదనలకు కన్వీన్స్ కాలేదు. చంద్రబాబు గారి మీద కొమ్మినేని గారు తీవ్రమైన ద్వేషం తో ఉండి...ఆ బుర్రలేని "ఎడిటర్" ను షో కి పిలిచి దెబ్బతిన్నారు. 

మీరు కాస్త నిదానంగా, నిష్పాక్షికంగా ఆలోచించండి. ఈ పరిస్థితికి కారణం పొలిటికల్ పార్టీలు మీడియాను గబ్బు పట్టించడమే కదా! యాజమాన్యాలు పొలిటికల్ బురద గుంటలో దొర్లుతుంటే...పొట్టకూటి కోసం జర్నలిజాన్ని నమ్ముకున్న జర్నలిస్టులు ఏమి చేస్తారు? ఆ బురద అంటకుండా ఎట్లా ఉంటారు? 

ఎలాగూ బురద అంటింది కదా...పోయేది ఏముందని...స్వామి కార్యం, స్వకార్యం తీరడం కోసం ఓనర్ ను తృప్తి పరిచేలా రెచ్చిపోయే వాళ్ళు ఒకరకం. ఇప్పుడు వీళ్లదే హవా. వీళ్లు బతకనేర్చిన జర్నలిస్టులు. ఇంకో బాపతు జర్నలిస్టులు...రోజూ బురద దుపులుకుంటూ, దీనికి కారణమైన ఓనర్ కు శాపనార్థాలు పెడుతూ పొట్ట కూటి కోసం బతికేస్తున్నారు. బురద అంటకుండా ఉండేవాళ్ళు చాలా అరుదు. వాళ్ళు అద్దె కొంపల్లో ఉంటూ, అప్పులు చేసి పిల్లలను చదివిస్తూ, ఒక్క రోగం వస్తే...అప్పుల పాలై నవుస్తూ బతుకు బండి ఈడుస్తున్నారు. ఇవి వాస్తవాలు. 

"మీరు ఎలాంటి జర్నలిజాన్ని కోరుకుంటున్నారు?" అని నేను నా పీ హెచ్ డీ లో భాగంగా...జర్నలిస్టులను ఒక ప్రశ్న వేశాను. దాదాపు అంతా...విలువలతో కూడిన నిష్పాక్షిక జర్నలిజాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. స్వేచ్ఛగా బతకనిస్తే...జర్నలిస్టు సంఘాల పేరిట బతికేస్తున్న కొందరు తప్ప నా సోదర సోదరీమణులంతా అన్యాయాన్ని ఎదిరిస్తూ, స్వచ్ఛమైన వార్తలు అందిస్తూ ప్రజల గొంతుకలై వృత్తి నిబద్ధతతో ఉంటారు. ఇక్కడ బెస్ట్ బ్రైన్స్ ఉన్నాయి. మంచి జర్నలిజం చేసే అవకాశం లేక...వేరే పనులు చేయలేక బురదతో అడ్జెస్ట్ కాక తప్పని పరిస్థితి. ప్రాక్టికల్ అయిన ఈ వ్యవస్థీకృత సమస్యని అర్థం చేసుకోకుండా...జర్నలిస్టులను తిట్టడం బాగోలేదు. ఫ్రీ మీడియా నిర్వహిస్తా...డబ్బు లిస్తారా? నేను కేసుల్లో ఇరుక్కుంటే వస్తారా? అంటే....ఒక్కటంటే ఒక్కడైనా ముందుకు రాడు. కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది. 

ఈ ఉదంతం నుంచి కొమ్మినేని గారితో పాటు అంతా గుణపాఠం నేర్చుకుంటారని ఆశిస్తున్నా. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఆయనకు ఒక్కరికే కాక... టీవీ షోలలో, సోషల్ మీడియాలలో ప్రభుభక్తితో బురద గుంటలో పీకల్లోతు మునిగి అది...నయాగరా జలపాతం అన్న ఫీలింగ్ తో బతికే వాళ్ళకు ఒక కనువిప్పు అయితే బాగుంటుంది. 

#savejournalism