Friday, February 17, 2012

రాజగోపాల్ గారి పుస్తకం "సరదాకి" ఆవిష్కరణ 19 న

జర్నలిజంలో హాస్యరచన లేదా వ్యంగ్య రచనలు కనిపించేంత తేలికైన ప్రక్రియలు కావు. సీరియస్ విషయాల నుంచి హాస్యరసం పిండాలంటే నేర్పరితనం చాలా అవసరం. ఈనాడులో ఉండగా మానుకొండ నాగేశ్వర రావు (ప్రస్తుత ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్), పర్వతం మూర్తి (సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డు నిర్వాహకుడు) గార్ల ప్రోత్సాహంతో నేను ఎన్నికల పేజీల్లో, ఎడిటోరియల్ పేజీలో వ్యంగ్య రచనల ప్రయత్నం చేశాను. చాలా వ్యాసాలు ప్రచురించాను కూడా. ఈ రకమైన రచనలకు సాహిత్యంలో కొంత ప్రవేశం ఉండాలనీ, డొక్కశుద్ధిలేని నా బోటి జర్నలిస్టు వల్ల అది కాదని ఆ ప్రయత్నం విరమించుకున్నాను.

ఈ కారణంగా ఎవరైనా వ్యంగ్య రచనలు చేస్తే...శ్రద్ధగా చదవడం అలవాటైంది. ఇలాంటి వ్యంగ్య రచనలు చేస్తున్న రాజగోపాల్ గారు హెచ్ ఎం టీవీలో పరిచయం అయ్యారు. కలిసి కూర్చొని మాట్టాడింది పెద్దగా లేకపోయినా ఆయన తింగరిబుచ్చి పేరిట సంధిస్తున్న రాజకీయ, సామాజిక వ్యంగ్యాస్త్రాలు కొన్ని నాకు బాగా నచ్చాయి. రాజగోపాల్ గారు గతంలో ఆంధ్రజ్యోతిలో ఉండగా రాసిన వ్యంగ్య రచనల కాలమ్ నుంచి కొన్ని ఏరికోరి సరదాకి పేరిట ఒక పుస్తకం ప్రచురించారు.


సరదాకి పుస్తకాన్ని వచ్చే ఆదివారం (19 వ తేదీ) ఉదయం పదిన్నరకు బషీర్ బాగ్ ఏపీ‍యూడబ్ల్యూజే ఆడిటోరియంలో ఆవిష్కరిస్తున్నారు. ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ గారు ఆవిష్కరిస్తుండగా, హెచ్ ఎం టీవీ, ద హన్స్ ఇండియా ఎడిటర్ ఇన్ చీఫ్ కొండుభట్ల రామచంద్రమూర్తిగారు తొలి ప్రతిని అందుకుంటారు. ముళ్లపూడి వెంకట రమణ గారు తన చివరి రోజుల్లో ఈ పుస్తకానికి ముందుమాట రాసారని రాజగోపాల్ గారు చెప్పారు. 

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని, దాని డిస్కౌంట్ ధరపై నిర్వాహకులు సరదాగా పంపిన ఒక సూచననూ మీ కోసం ఇస్తున్నాను. వీలుచేసుకుని ఈ కార్యక్రమానికి వెడితే సీనియర్ జర్నలిస్టులను కలుసుకోవచ్చు...సరదాగా.

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి