నేను: బాబూ, మొన్నటి ఎన్కౌంటర్ మీద నీ అభిప్రాయం ఏమిటి?
యువకుడు (27 ఏళ్ళు): ఎక్కడ జరిగింది?
నేను: అదే...ఛత్తీస్గఢ్ అడవుల్లో మే 22 న జరిగిన ఎన్కౌంటర్. అగ్రనేత తో సహా 27 మంది మరణించారు.
యువకుడు: అవునా? నేను ఫాలో కాలేదు. ఆఫీసు పనిలో పడి ఫాలో కాలేదు. ఇవ్వాళ సండే. చూస్తా.
నేను: ఈ మావోయిస్టులు, ఎన్కౌంటర్లు వంటి వార్తలు శ్రద్ధగా చదువుతావా?
యువకుడు: ఊహూ...పైపైన చూసి వదిలేస్తా. బ్లడ్ షెడ్.
నేను: 45 ఏళ్ళు జనం కోసం అడవుల్లో ఉన్న ఆర్ ఈ సీ వరంగల్ పూర్వ విద్యార్థి, మావోయిస్టు టాప్ లీడర్ చనిపోయాడట.
యువకుడు: 45 ఏళ్ళు అడవుల్లో ఉండడం పెద్ద విషయం.
నేను: అలాంటి ఆయన్ను చంపడం భావ్యమా?
యువకుడు: అరెస్ట్ చేయాల్సింది. టాప్ లీడర్ ను ఎప్పుడూ చంపకూడదు. పట్టుకుంటే వాళ్ళ వ్యూ పాయింట్ తెలుస్తుంది.
నేను: ఒక్క దెబ్బకు 72 మంది సీ ఆర్ పీ ఎఫ్ జవాన్లను, ఇన్ఫర్మర్ల పేరుతో ఎంతమందినో చంపిన ఆయన్ని కాల్చిపారేయవచ్చా?
యువకుడు: ఆయన అంత దారుణాలు చేస్తే చంపవచ్చు, తప్పులేదు.
నేను: ఖనిజ సంపద ప్రభుత్వం, దాని సంబంధీకులు దోచుకోకుండా ఆయన నాయకత్వంలో మావోయిస్టులు ట్రై చేశారట.
యువకుడు: డెవలప్మెంట్ దృష్టిలో చూడాలి. యువకులకు ఉద్యోగాలు వచ్చే పనైతే, పరిశ్రమలో పెట్టేట్లయితే...తప్పదు.
నేను: అదంతా కాదు గానీ, నాకు ఒక్కటే చెప్పు. గిరిజనుల కోసం అష్టకష్టాలు పడుతూ
తన యావత్ జీవితాన్ని అంకితం చేసిన ఆ ఆర్ ఈ సీ పూర్వ విద్యార్థి దేశ ద్రోహా? దేశ భక్తుడా?
యువకుడు: దేశ ద్రోహి.
అయ్యో, అడవిదారి పట్టిన వాళ్ళు పిట్టల్లా రాలిపోతున్నారే...?
2026 మార్చి లోపు ఇంకెన్ని చావు వార్తలు వినాలి...?
సాయుధ పోరాటం పేరుతో ఒట్టి పుణ్యానికి ప్రాణాలు పోతున్నాయే...?
జనసేవ కోసం కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఇట్లా సర్కార్ బుల్లెట్లకి ఎదురుపోయి నేలకొరుగుతున్నారే...?
వీరు ప్రాక్టికల్ ఆలోచన ఎందుకు చేయడం లేదు...?
దయాదాక్షిణ్యాలు లేని రాజ్యంతో ఈ ఆధునిక కాలంలో వీళ్ళు ఎట్లా తట్టుకుని బతికి బట్టగలరు...?
ఈ పరిస్థితికి పరిష్కారం ఏమిటి..?
...వంటి అనేక ప్రశ్నలతో నేను నిద్రపట్టక చస్తుంటే...ఈ మహా నగరంలో ఒక ఎంఎన్ సీ లో ఉద్యోగం చేస్తున్న యువకుడు ఆ పై మాటలు చెప్పాడు. ఈ జన్ జీ పిల్లలు దాదాపు అంతా ఇట్లానే అనుకుంటున్నారేమో, నాకు తెలియదు? అవగాహన కోసం....మీకు అందుబాటులో ఉన్న పోరగాళ్లను ఈ మావోయిస్ట్ ఉద్యమం గురించి, ఈ ఎన్కౌంటర్లు, ఆపరేషన్ కగార్ వంటి వాటి గురించి అడిగి చూడండి.
1980 తర్వాత పుట్టిన పిల్లలు బతుకు పోరాటాల్లో బిజీ గా ఉన్నారు. మొబైల్ స్క్రీన్ ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. వాళ్ళకు ఈ ప్రపంచ పరిణామాలు పట్టించుకుని, స్పందించే తీరిక లేదు. మే 22 ఘటనకు వ్యతిరేకంగా ఏదైనా యూనివర్సిటీలో ప్రదర్శనలు, నిరసనలు జరిగాయా? కగార్ కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు రోడ్డు మీదకు వచ్చాయా? నా దృష్టికి రాలేదు.
వ్యవస్థలో కుళ్ళు పట్ల రగిలి పోతున్నవారు, ప్రభుత్వాల ధోరణితో వేదన పడుతున్న వారు,
జనం కోసం పనిచేయాలని గట్టిగా అనుకునేవారు...తుపాకులు పట్టి అడవుల్లోకి పోకండి. ఇప్పుడది వర్కవుట్ కాదు. మీ అవసరం ఇక్కడే ఎక్కువ ఉంది. సాయుధ విప్లవ పోరాటాల గతిని సునిశితంగా చూస్తున్న మనిషిగా,
పలు ఎన్కౌంటర్లు కవర్ చేసిన అనుభవంతో, అడవిబాట పట్టిన వారితో లోతైన చర్చ చేశాక ఇప్పటి కాలమాన పరిస్థితులను బట్టి ఒక ఆరు సూచనలు:
1) సామాజిక స్పృహ, స్పందించే గుణం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకండి
2) కులం, గోత్రం, మతం, గితం ఊబిలో పడకుండా సమానత్వం కోసం పరితపించండి
3) బాగా అధ్యయనం చేయండి. సొంతగా స్టడీ చేయకుండా సైడ్స్ తీసుకోకండి. అన్ని రకాల సభలు, సమావేశాలు, సదస్సులకి వెళ్ళి అవగాహన పెంచుకోండి
4) ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా గళం ఎత్తండి. అద్భుతమైన సామాజిక మాధ్యమాలు వాడుకొని మీ సత్తా చాటండి
5) కేవలం దేశం లో సమస్యలు ఎత్తిచూపడం,
దానికి బాధ్యులు వీళ్ళని తుక్కు రాజకీయ నాయకులను తిడుతూ కూర్చోవడం మాత్రమే విప్లవం అన్న పిచ్చి లెక్క మాని మీరు మీ వంతు పరిష్కారాలు వెతకండి
6) ఈ సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేస్తున్న మీడియా మీద, సృజనాత్మకత పేరుతో అశ్లీలం, హింస మీద బతికే సినిమా వాళ్ల మీద ఒక కన్నేసి ఉంచండి.