Monday, April 8, 2013

యూనివర్శిటీ చదువులపై మీడియా హౌజుల ఏడుపు

శని, ఆదివారాల్లో హైదరాబాద్ లో  జర్నలిజానికి సంబంధించి ఆసక్తికరమైన  కార్యక్రమాలు జరిగాయి. అందులో ఒకటి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ కలిసి "న్యూస్ ఛానళ్ళు: నైతికత-వాస్తవికత" అనే అంశంపై జరిపిన రెండు రోజుల జాతీయ సెమినార్, 'ది హిందూ' పత్రిక "Reporting Terror:How Sensitive is the Media?"అనే అంశంపై సాలార్ జంగ్ మ్యూజియంలో  నిర్వహించిన సింపోజియం. రెంటినీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ ఆరంభించి ప్రసంగించారు. 

కట్జూ ప్రసంగం వినాలని శనివారం ఉదయం పది గంటలకల్లా నేను, మా అమ్మాయి మైత్రేయి తెలుగు విశ్వ విద్యాలయం చేరుకున్నాం. అప్పటికి అక్కడ ఒక్కస్వాగత తోరణం (ఫ్లెక్సి) కూడా లేదు. కట్జూ సాయంత్రం వస్తారని తెలిసి, ఇంటికొచ్చి తిని లేచి ఎర్రటి ఎండలో వెళ్లాను. ఎం ఎల్ సీ నాగేశ్వర్ గారిని కలిసి కాసేపు మాట్లాడి, కట్జూ ప్రసంగం విన్నాను. ఎప్పటి లాగానే కట్జూ దేశంలో ఉన్న ఫూల్స్ సంఖ్యను సాధికారికంగా శాతాల్లో (పర్సంటేజీ) చెప్పారు. ఎందుకోగానీ (బహుశా ఉజ్జాయింపు కావచ్చు) దేశంలో ఫూల్స్ శాతాన్ని ఎప్పుడూ ఈ పెద్దాయన 90 శాతం గా చెబుతారు. మూఢనమ్మకాలను, జ్యోతిష్యాలను నమ్మడం తెలివితక్కువతనమని (జ్యోతిష్యం పై చాలా ఏళ్ళుగా ఒక కోర్సు దిగ్విజయంగా నడుపుతున్న తెలుగు యూనివెర్సిటీలో వైస్ చాన్సలర్ సాక్షిగా) ఆయన చెప్పారు. అందరికీ అర్థమయ్యేలా ఆయన చక్కని ఇంగ్లిష్ లో మాట్లాడారు. 

ఇక రెండో రోజు (ఆదివారం) పది గంటల కల్లా సాలార్ జంగ్ మ్యూజియం వెళ్లి సింపోజియం లో పాల్గొన్నాము నేను, మా అమ్మాయి. పలువురు మాజీ సహచరులను కలిసే అవకాశం కలిగింది. 'ది హిందూ' ఎడిటర్ సిద్దార్థ్ వరదరాజన్ మోడరేటర్ పాత్ర పోషించారు. ఇక్కడ మాట్లాడిన కట్జూ 80 శాతం మంది హిందూ, ముస్లింలు మతోన్మాదులు అని లెక్క చెప్పారు. టెర్రరిజం చరిత్ర చక్కగా చెప్పిన కట్జూ టెర్రర్ కవరేజ్ విషయంలో మీడియా ప్రవర్తన గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఉద్యోగం లేకపోతే ఆత్మహత్య చేసుకోవడమో లేక ఎవడో ఇచ్చిన డబ్బులు తీసుకుని టెర్రరిజానికి పాల్పడడమో చేస్తారని, మనుషులకు ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉంటాయని కట్జూ సెలవిచ్చారు. నాకు ఇది నచ్చలేదు. ఇదేమి వితండ వాదన!

'ది హిందూ' ఎడిటర్ గారు కట్జూ వాదనను ఖండించడం గానీ, కాస్త టాపిక్ గురించి మాట్లాడమని అడగడం గానీ చేయలేదు. కట్జూ తో తలగోక్కోవడం ఎందుకని అంతా అనుకున్నట్లు ఉన్నారు. తెలుగు వర్సిటీ సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ వీ సత్తిరెడ్డి గారు, జర్నలిజం డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ కే సుధీర్ కుమార్ గార్ల ప్రోత్సాహంతో సాయంత్రం "Live Coverage in News Channels Vs Journalistic Values" అనే అంశం మీద నేను కూడా ఒక పేపర్ సమర్పించాను. TV-5 వాళ్ళు వై ఎస్ ఆర్ మృతిపై ఒక రష్యన్ వెబ్సైట్ కథనాన్ని తీసుకుని 2010 జనవరి ఏడున దాదాపు నాలుగు గంటల పాటు లైవ్ లో వేడి పుట్టించిన దుర్మార్గాన్ని ఒక కేస్ స్టడీ గా వివరించాను. 

జర్నలిస్టులకు విద్యార్హత విషయంలో ఒక కమిటీ వేసిన కట్జూ ఈ టూర్ సందర్భంగా ఆ అంశంపై ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు ఎందుకో? దాని మీద ఆయన మాట్లాడాలని నేను కోరుకున్నాను. సెమినార్ కు హాజరైన మీడియా పెద్దలు కొందరు యూనివెర్సిటీ జర్నలిజం కోర్సులు మారాలని సలహా ఇచ్చారు. ఇక్కడ చరిత్ర ఎక్కువ బోధిస్తారని, ప్రాక్టికల్ ట్రైనింగ్ పెద్దగా ఉండదని వారు అభిప్రాయపడ్డారు. రీసెర్చ్ మెథడ్స్ జర్నలిస్టులకు ఎందుకన్నట్లు మాట్లాడారు. ఇలాంటి వారు బావిలో కప్పలు, వారిది తెలివి తక్కువ, అనాగరిక వాదన. తమ జర్నలిజం స్కూల్స్  పెద్దలు వర్శిటీ విద్యను ఎప్పుడూ చులకన చేస్తారు. రామోజీ గారికైతే వర్శిటీ డిగ్రీ హోల్డర్ల పట్ల భయంకరమైన చిన్న చూపు ఉంది. ఈ అంశంపై నా వాదనను మరొక పోస్టులో రాస్తాను.   

2 comments:

krshnrao said...

Ramoji is the main reason in A.P. TO ashtray journalism values.He could better have been in other businesses.

K V Ramana said...

Annayya
Congratulations for presenting the paper and also selecting a perfect issue as a case study. I always had this point in mind on how the research team / editor/ presenter of the channel on that particular day conveniently or out of ignorance ignored the word "speculative" in that Russian website report and went onto do a full live for four hours.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి