Friday, October 2, 2009

సత్యమే ఆయుధంగా...నిజమైన జర్నలిస్టు గాంధీజీ

(ఈ ప్రత్యేక వ్యాసం గాంధీ జయంతి సందర్భంగా)

అసాధారణమైన విధానాలతో స్వాతంత్ర్యోద్యమానికి వూపిరి పోసిన మహా నాయకుడు మహాత్మా గాంధీ జర్నలిజానికి చేసిన సేవ మహా గొప్పది. ప్రజల భాషలో సరళంగా సమాచారాన్ని అందించడం, నిర్భయంగా వున్నది వున్నట్టు రాయడం, కేవలం సత్య వ్యాప్తి కోసమె పత్రికలకు నడపడం ఎలానో ఆయన మనకు చూపించారు.

స్వాతంత్ర్య సమరం కన్నా దాదాపు రెండు దశాబ్దాలకు ముందే గాంధీజీ జర్నలిజాన్ని ఆచరించారు. "In less than a few months' stay in South Africa, Gandhi realized the need to become a journalist to fight for the rights of the Indian community. And he brought the highest qualities the profession could boast of-courage in the face of adversity, unswerving adherence to truth, pursuit of public causes, and objectivity in presentation," అని వి.ఎన్.నారాయణ్ ఒక వ్యాసంలో రాసారు.

గాంధీ గారి జర్నలిస్టు జీవితం నలభై సంవత్సరాల పాటు సాగింది. ఆయన ఆరు జర్నళ్ళను ఎడిట్ చేసారు. అంతకు ముందు దక్షిణాఫ్రికాలో వివక్షపై గుండె మండిన ఆయన అక్కడి దిన పత్రికలకు "లెటర్స్ టు ద ఎడిటర్" కాలమ్ కు లేఖలు రాసేవారు. తర్వాత 1903 లో "ఇండియన్ ఒపీనియన్"ను ప్రారంభించారు. డబ్బు ధ్యాస లేదు కాబట్టి అందులో ఆయన ప్రకటనలు ప్రచురించలేదు.

"ఇండియన్ ఒపీనియన్" కోసం ఒక వ్యాసం రాస్తున్నప్పుడే ఆయనకు సత్యాగ్రహం అనే ఆలోచన వచ్చిందట. "నీను రాసే వ్యాసాల్లో నా ప్రాణం పెట్టేవాడిని. మనసా వాచా నమ్మింది రాస్తేనే అది ప్రజల మనసులపై ప్రభావం చూపుతుంది," అని గాంధీజీ చాలా సందర్భాలలో చెప్పారు.

ఇండియన్ ఒపీనియన్ను ఆయన పదకొండు సంవత్సరాలు నడిపారు. గమ్మత్తైన శీర్షికలు పెట్టి సాధారణ ప్రజలను ఆకట్టుకొనే వారు. అలాంటి హెడ్డింగ్ లలో ఒకటి: "The white barber refused to cut my black hair."

తమకు జరుగుతున్న అన్యాయంపై చంపారన్ లోని రైతులు పంపిన ఒక సమాచారాన్ని లోతుగా అధ్యనం చేయడానికి ఆయన బీహార్ వెళ్లి ఒక అత్యద్భుతమైన పరిశోధనాత్మక యాసాన్ని రాసారు.

ఆ తర్వాత 'యంగ్ ఇండియా', 'నవ జీవన్'ల కోసం రాసారు ఆయన. 1910 నాటి 'ప్రెస్ యాక్ట్' రద్దు కోసం ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. 1932 లో సుదీర్ఘ కాలం జైలులో వుండాల్సి రావడం వల్ల ఆయన "యంగ్ ఇండియా", "నవ జీవన్" లను మూసివేసారు. 1933 నుంచి 1940 మధ్య కాలంలో "హరిజన్" (ఇంగ్లీష్), "హరిజన్ బంధు" (గుజరాతి), "హరిజన్ సేవక్" (హిందీ) పత్రికలూ ఆయనకు గొంతుకలయ్యాయి.

ఇప్పటి మన పత్రికలూ కుల సంఘాలకు వేదికలయి జర్నలిజాన్ని పరిహసిస్తున్నాయి కానీ గాంధీ గారి ప్రధాన సమరం కుల వివక్షపైననే. తర్వాతి కాలంలో పత్రికల ధోరణి ఆయన్ను కలతపరిచింది. ఢిల్లీలో జూన్ 19, 1946 న భారతీయ న్యూస్ పేపర్లపై ఆయన చేసిన వ్యాఖ్య అందుకు దర్పణం పడుతుంది.

"నన్నే గనక వైస్రాయ్ స్థానంలో నియంతగా ఒక్క రోజు నియమిస్తే, దేశంలోని అన్ని వార్త పత్రికలను మూసి పారేయిస్తాను," అని ఆయన విసుగ్గా అన్నారట.

గాంధీ గారి లాంటి సత్తె కాలపు మనుషులు నిజంగానే ఈ స్వార్థ పూరిత పత్రికలూ, చానల్స్ తో విసిగి పోతున్నారు. కాదంటారా?