Saturday, October 14, 2017

హైదరాబాద్ లో ఇంగ్లీష్ పేపర్లకు సరుకున్న జర్నలిస్టుల కొరత!

దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ప్రతి చోటా జర్నలిజం కోర్సులున్నాయి. జర్నలిజం బోధన కోసమే ప్రత్యేకించి ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం వంటి సంస్థలూ వెలిశాయి. ప్రతి ఏడాదీ వీటిలోంచి పెద్ద సంఖ్యలో శిక్షణ పొందిన జర్నలిస్టులు బైటికి వస్తుంటారు.

అయినా... హైదరాబాద్ లో ఇంగ్లిష్ మీడియాను సరుకున్న జర్నలిస్టుల కొరత పట్టి పీడిస్తున్నది చాలా ఏళ్లుగా. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇది మరీ ఎక్కువయ్యింది. ఏ ఎడిటర్ ను చూసినా... 'మంచోళ్ళు ఉంటే పంపండి... తీసుకుంటాం," అని చెబుతుంటారు. పత్రికల వారీగా ఆరు ఇంగ్లిష్ పత్రికల్లో  ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.

ది  హన్స్ ఇండియా  

ఇప్పుడు 'ది హన్స్ ఇండియా' ఎడిటర్ పదవికి  ప్రొ. నాగేశ్వర్ రాజీనామా చేశారు కదా... మరి ఆయన స్థానంలో ఇంకో ఎడిటర్ ఎవరైనా ఉన్నారా? అన్నది పెద్ద ప్రశ్న. అప్పటిదాకా అక్కడ బ్యూరో చీఫ్ గా ఉన్న రామూ శర్మ గారి స్థానంలో బ్యూరో చీఫ్ కోసం హన్స్ ఇండియా ఒక 8-9 నెలలుగా వెతుకుతున్నా ఎవ్వరూ దొరకలేదు.
నవంబర్ లో ఇంటికెళ్ళ బోతున్న రామూ శర్మ గారినే ప్రస్తుతానికి పత్రిక బాధ్యతలు చూడాల్సిందిగా యాజమాన్యం కోరినట్లు తెలిసింది. జాక్పాట్ అంటే ఇదే కదా! ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హనుమంత రావు నిన్న ఆఫీసు కు వచ్చి రామూ శర్మ గారే ఎడిటర్ అన్నట్లు ఒక ప్రకటన చేసి వెళ్లినట్లు సమాచారం. ఓనర్ వామనరావు గారి సలహాదారు కింగ్ షుక్ నాగ్ (టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ ఎడిటర్) గారి సూచన మేరకు ఈ నిర్ణయం జరిగిందన్న దాన్ని అనుమానించాల్సిన పనిలేదు. రామూ శర్మ గారు కూడా మాజీ టైమ్స్ జర్నలిస్టే.

తెలంగాణా టుడే

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణా టుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండానే.. ఎడిటర్ ను, జర్నలిస్టులను అమర్చుకుంది. ది హిందూ లో ఒక వెలుగు వెలిగి ఎడిటర్ మాలినితో వేగలేక బైటికొచ్చిన శ్రీనివాస రెడ్డి గారు దొరకడం, ఆయన నికార్సైన తెలంగాణా బిడ్డ కావడంతో నమస్తే తెలంగాణా తెలుగు పత్రిక వారి ఇంగ్లిష్ పేపర్ కు పెద్ద సమస్య లేకుండా పోయింది. మీడియా మార్కెట్ లో శ్రీనివాస రెడ్డి గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. కింది నుంచి కష్టపడి తనను తాను నిరూపించుకున్న మనిషి కూడా కావడంతో ఆయన్ను నమ్ముకుని ఏకంగా 'ది హిందూ' నుంచి జర్నలిస్టుల పటాలం దిగిపోయింది.  ఒకప్పుడు ది హిందూ లో ఉద్యోగం అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనుకునే వారు, గుర్తుందా!
ఈ పత్రికకు ఇంకొక కలిసొచ్చిన అంశం ఏమిటంటే... అదే క్యాంపస్ లో 'మెట్రో ఇండియా' అనే పత్రిక మూతపడి కొంతమంది మంచి జర్నలిస్టులు దొరకడం. శ్రీనివాస రెడ్డి గారు... అప్పుడే ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పదవీ విరమణ చేసిన మంచి స్పోర్ట్స్ రిపోర్టర్ దాసు గారిని స్పోర్ట్స్ ఎడిటర్ గా నియమించడం ఒకమంచి పని. ఇలా ప్రతిభ ఆధారంగా ఇక్కడ మంచి టీమ్ తయారయ్యింది. అధికార పార్టీ దీవెనలు ఉండబట్టి... మరొక ఏడెనిమిదేళ్లు జీతాలకు భరోసా ఉండదని ఇందులో పనిచేసే జర్నలిస్టులు భావిస్తారు.

డెక్కన్ క్రానికల్ 

హైదరాబాదీల మనసు చూరగొన్న డెక్కన్ క్రానికల్ లో కొంత గందరగోళం నెలకొంది. ఆ పత్రికలో 17 ఏళ్ళు పనిచేసి తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకున్న ఉడుముల సుధాకర్ రెడ్డి గారు ఆ పత్రికకు ఈ మధ్యనే రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. సీనియర్ జర్నలిస్టులను నియమించే, తొలగించే స్థాయిలో ఉండి... ఎడిటర్ జయంతి గారి మద్దతు ఉన్న సుధాకర్ రెడ్డి గారు ఒక అరుదైన బ్రిటిష్ స్కాలర్షిప్ పొంది వచ్చాక కొన్ని రోజులకే ఆ పత్రికను వదిలేశారు. ఇది కచ్చితంగా డెక్కన్ క్రానికల్ కు దెబ్బే. క్రైమ్, సైన్స్ రిపోర్టింగ్ లో సుధాకర్ రెడ్డి నంబర్ -1 అని చెప్పడంలో సందేహ పడాల్సిన పనిలేదు. ఈనాడు జర్నలిజం స్కూల్ టాపర్ ఆయన.
డీ సీ వదిలిన ఆయన వెంటనే టైమ్స్ ఆఫ్ ఇండియా లో చేరారు. ఇప్పుడు డెక్కన్ క్రానికల్ లో ఆయన ఖాళీని  భర్తీ చేసే వారికోసం వెతుకుతున్నారు. జయంతి గారి కింద, క్రిష్ణారావు గారి ఆధ్వర్యంలో  పనిచేసే వారు ఎవరు చేస్తారో చూడాలని... ఆ పత్రికలో పనిచేసిన ఒక మిత్రుడు సరదాగా అన్నారు.
పైగా... ఇప్పుడు డీ సీ లో జీతాలు ఆలస్యంగా ఇవ్వడం ఉద్యోగుల్లో అభద్రతను పెంచింది.

ద న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ 
తెలుగు బిడ్డ జీ ఎస్ వాసు గారు చెన్నై కేంద్రంగా ఉన్న ద న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఎడిటర్ గా రెండేళ్లుగా పనిచేస్తున్నారు. అంతకు ముందు ఆయన హైదరాబాద్ లో సుందరంగా గారి దగ్గర పనిచేసి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. పొట్ట నిండా పాలు తాగిన పిల్లి లాగా సాఫీగా ఇక్కడ జర్నలిజం జరిగిపోతున్నది. హన్స్ ఇండియా ఆరంభం లో మాగజీన్ సెక్షన్ చూసిన మంజులత కళానిధి (రైస్ బకెట్ పోటీ ఆరంభకురాలు) గారు ఈ పత్రికలో కూడా మేగజీన్ నిర్వహిస్తున్నారు.  

టైమ్స్ ఆఫ్ ఇండియా 

మలయాళీలు, బెంగాలీలు ఎక్కువ సంఖ్యలో ఉండే టైమ్స్ ఆఫ్ ఇండియా కు ఎప్పుడూ మనుషుల కొరత, డబ్బుల ఇబ్బంది ఉండవు. అక్కడ ఎడిటర్ తో కాస్త అడ్జెస్ట్ అయితే చాలు... ఏళ్లకు ఏళ్ళు గడపవచ్చు. అందుకే... పైన పేర్కొన్న మొదటి మూడు పత్రికలు పెద్ద పదవి, ప్యాకేజి ఇస్తామని ఆహ్వానించినా... టైమ్స్ నుంచి పోయే  తెలుగు జర్నలిస్టులు అరుదు.

ది హిందూ 

ప్రస్తుతం తెలంగాణా టుడే ఎడిటర్ గా ఉన్న  శ్రీనివాస రెడ్డి గారు తన హయాంలో ది హిందూలో ఒక గట్టి వ్యవస్థను ఏర్పాటు చేశారు. సిటీ ఎడిటర్ పదవి తీసేసి... సిటీ రిపోర్టింగ్ ను స్టేట్ బ్యూరో కిందికి తెచ్చి, కొత్త నియామకాలు లేకుండానే ఇప్పుడు పత్రిక నడుస్తోంది. మిగిలిన పత్రికలకు తీసిపోకుండానే బండి నడుపుతున్నారు. ఈ పత్రికలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు సురేష్ కృష్ణమూర్తి గారు గత నెల్లో మరణించడం ఇక్కడ పనిచేసే చాలా మంది జర్నలిస్టులకు జీర్ణించుకోలేని వాస్తవం అయ్యిందనేది వేరే విషయం. 

1 comments:

srinivasrjy said...

మీరు వ్రాసిన ప్రకారం "డెక్కన్ క్రానికల్" మాత్రమే సంక్షోభంలో ఉన్నట్లుంది.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి